Friday, December 31, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౭(437)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-933-క.
ధాత్రీవర సమధిక చా
రిత్రుఁడు హలపాణి పలికె ధృతి "నాత్మా వై
పుత్రక నామాసి యను ప
విత్రశ్రుతి వాక్యసరణి విశదం బగుటన్.
10.2-934-క.
ఈ సూతసూనుఁ డిపుడు మ
హాసత్త్వము నాయువును ననామయమును వి
ద్యా సామర్థ్యము గలిగి సు
ధీసత్తములార! యీక్షితిన్ విలసిల్లున్."
10.2-935-వ.
అని సూతుం బునర్జీవితుంగాఁ జేసి మునులం జూచి యిట్లనియె. 

భావము:
ఓ రాజా! “ఆత్మా వైపుత్ర నామాసి”, (తానే పుత్రరూపంలో తిరిగి జన్మిస్తాడు) అనే వేదవచనానికి తగినట్లు మహానుభావుడైన బలరాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షులారా! ఇప్పుడు ఈ సూతుని కుమారుడు ఆయువు, ఆత్మశక్తి, రోగం లేని తనువు, విద్యాదక్షత పొంది ఈ లోకంలో విరాజిల్లుతాడు.” ఇలా అనుగ్రహించి బలరాముడు, సూతుడిని బ్రతికించి మునులతో మరల ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=934 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౬(436)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-932-వ.
అదియునుం గాక పరమపావనుండవైన నీవు ధర్మంబుదప్పిన నెవ్వరు మాన్పంగలరు? కావునఁ బ్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువ; దట్లుగావున దీనికిఁ బ్రతీకారంబు పుట్టింపు” మనిన నతండు వారలం గనుంగొని “తామసంబున నిట్టి పాపంబు సేయంబడియె; దీనికి ముఖ్యపక్షంబునఁ బ్రతికృతి యెఱింగింపుండు, వీనికి నాయువును బహుసత్త్వంబును నొసంగిన మీకిష్టంబగునే నట్లు నాయోగమాయచేఁ గావింతు” నన నమ్మునులు "నీయస్త్రమాహాత్మ్యంబునకు మృత్యువునకు మాకు నెవ్విధంబున వైకల్యంబు నొందకుండునట్లు గావింపు"మనిన నతం డందఱం జూచి యప్పుడు. 

భావము:
అంతే కాకుండా, పరమ పవిత్రుడవైన నీవే ధర్మం తప్పితే, అధర్మాన్ని ఎవరు అడ్డుకుంటారు? దీనికి ప్రాయశ్చిత్తం చేయకపోతే ధర్మం మనుగడకే ప్రమాదం. కనుక, నీవు ఆ ప్రాయశ్చిత కార్యం తలపెట్టాలి.” ఇలా పలుకుతున్న మహర్షుల మాటలు వినిన బలరాముడు వారితో “తొందరపాటు వలన ఇంతటి పాపం చేశాను. దీనికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి. మీకు ఇష్టం అయితే, నా యోగమాయా ప్రభావంతో సూతుణ్ణి బ్రతికించి, అతడిని మహాశక్తిమంతునిగా చేస్తాను.” అన్నాడు. అంతట “నీ అస్త్రమహాత్మ్యానికి, మృత్యు నియమానికి, మాకు ఎలాటి ధర్మవిఘాతం కలుగకుండా, బలరామ! నీ ఇష్ట ప్రకారం చేయుము” అని ఋషులు బలరాముడితో అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=932 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 28, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౫(435)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-930-క.
“అనఘా! యితనికి బ్రహ్మా
సన మే మిచ్చుటను నీవు సనుదే నితఁ డా
సనము దిగఁడయ్యె నింతయు
మును నీమది నెఱుఁగ నర్థముం గలదె? హలీ!
10.2-931-క.
ఎఱిఁగెఱిఁగి బ్రహ్మహత్యా
దురితంబున నీమనంబు దూకొనెఁ బాపో
త్తరణప్రాయశ్చిత్తము
దొరఁకొని కావింపు మయ్య దుర్జనహరణా! 

భావము:
“మహాత్మా! బలరామ! ఈ సూతునికి మేము అధ్యక్ష స్థానము ఇచ్చి ఈ ఉన్నతాసనంపై కూర్చుండబెట్టాము. అందుకనే నీవు వచ్చినప్పుడు ఇతడు లేవ లేదు. ఇదంతా నీకు తెలియని విషయం కాదు. నీకు తెలియని ధర్మం అంటూ ఉందా? ఓ బలరామా! దుష్టశిక్షణ చేసే నీవే, తెలిసి తెలిసి బ్రహ్మహత్యా పాపానికి ఒడిగట్టావు. ఈ పాపం నిష్కృతి కావడానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవలెను. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=931 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౪(434)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-928-క.
ఆ నెఱిఁ దనుఁ గని ప్రత్యు
త్థాన నమస్కారవిధులు దగ నడపక పెం
పూనిన పీఠముపై నా
సీనుండగు సూతు శేముషీవిఖ్యాతున్.
10.2-929-వ.
కనుంగొని యతని సమీపంబున నున్న విప్రవరులం జూచి రాముండు రోషించి “వీఁడు నన్నుఁ గని లేవకుండుటకు హేతు వెయ్యదియొకో? ఈ ప్రతిలోమజాతుండు మునిగణ సభాస్థలంబునఁ దానొక్క ముఖ్యుండ పోలె దురభిమానంబున శక్తిమనుమని వలనంగొన్ని కథలు గాథలు గఱచి విద్వద్గణ్యుని విధంబున విఱ్ఱవ్రీఁగెడును; నీచాత్ముం డభ్యసించు విద్య లెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని సత్త్వగుణగరిష్ఠంబులు గావు; ధర్మసంరక్షణంబు సేయ నవతరించిన మాకు నిట్టి దుష్టమర్దనం బవశ్యకర్తవ్యం, బని తలఁచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున నా సూతుని వధించిన నక్కడి మునీంద్రు లెల్ల హాహాకారంబులతోడం దాలాంకునిఁ జూచి యిట్లనిరి. 

భావము:
కాని ప్రజ్ఞాసమేతుడైన సూతుడు తక్కిన మునులలాగ బలరామునికి ఎదురువచ్చి స్వాగతమిచ్చి అతిధి పూజలు చేయకుండా ఉన్నతాసనంమీద కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న సూతుని బలరాముడు కనుగొని. తనను పూజించక ఉన్న సూతునిపై బలరాముడు ఆగ్రహించాడు. అతడు అక్కడ ఉన్న ఋషులతో “వీడు నన్ను చూసి కూడా ఎందుకు లేవలేదో? ఈ సూతుడు మహర్షులున్న సభలో తానే పెద్దను అని అనుకుంటూ దురభిమానంతో ప్రవర్తించాడు. వ్యాసమహర్షి దగ్గర కొన్ని కథలు గాథలు నేర్చుకున్నాడు. దానికే విద్వాంసుడను అని విఱ్ఱవీగుతున్నాడు. నీచులు అభ్యసించే విద్య వారిలో మదాన్నే పెంచుతుంది కానీ సాత్వికగుణాన్ని పెంచదు. మేము ధర్మ సంరక్షణ కోసం పుట్టాము. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం మా కర్తవ్యం.” అని పలుకుతూ, తన చేతిలోని దర్భపుల్లతో ఆ సూతుడిని వధించాడు. అది చూసి అక్కడి మునీశ్వరులు అందరు హాహాకారాలు చేశారు. వారు బలరాముడితో ఇలా అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=929 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౩(433)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-927-వ.
అట్లు సని మొదలం ప్రభాసతీర్థంబున నవగాహంబు సేసి, యందు దేవర్షిపితృతర్పణంబులు సంప్రీతిం గావించి విమలతేజోధను లగు భూసురప్రవరులు దనతో నరుగుదేరం గదలి చని క్రమంబున సరస్వతియు బిందుసరోవరంబును వజ్రతీర్థంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవీతీర్థంబును గనుంగొనుచు నచటనచట నవగాహన దేవర్షిపితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబు లను భూసుర యుక్తుండై నడపుచుం జని సకలలోకస్తుత్యంబును నిఖిలముని శరణ్యంబు నగు నైమిశారణ్యంబు సొచ్చి; యందు దీర్ఘసత్త్రంబు నడపుచున్న ముని జనంబులం గనుం గొనిన; వారును ప్రత్యుత్థానంబు సేసి రామునకు వినతులై యాసన పూజా విధానంబులు గావించిన నతండును బ్రముదిత మానసుం డగుచు సపరివారంబుగాఁ గూర్చున్న యెడ. 

భావము:
అలా తీర్ధయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు, ప్రభాసతీర్ధానికి వెళ్ళి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయువు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తము నందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=926 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, December 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౨(432)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-924-క.
పురసతులు విరులు లాజలు
గురుసౌధాగ్రములనుండి కురియఁగ వికచాం
బురుహాక్షుం డంతఃపుర
వర మర్థిం జొచ్చె వైభవం బలరారన్.
10.2-925-వ.
అట్లు యోగీశ్వరేశ్వరుండును, షడ్గుణైశ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన పురుషోత్తముండు సుఖంబుండె; నంత.
10.2-926-క.
కౌరవ పాండవ పృథు సమ
రారంభ మెఱింగి తీర్థయాత్ర నెపముగా
సీరాంకుఁ డుభయకులులకు
నారయ సముఁ డగుటఁ జేసి యరిగె నరేంద్రా! 

భావము:
ఆ సమయంలో నగరంలోని స్త్రీలు మేడలమీద నుండి శ్రీకృష్ణుడిమీద పూలు అక్షతలు కురిపిస్తుండగా, శ్రీకృష్ణుడు మహావైభవంతో అంతఃపురం ప్రవేశించాడు. మహాయోగులకు ఈశ్వరుడు, షడ్గుణైశ్వర్యములు సమృద్ధిగా కలవాడు, సకల జగత్తులకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడు అలా నగరం ప్రవేశించి, ద్వారకలో సుఖంగా ఉన్నాడు. ఓ పరీక్షిన్మహారాజా! కౌరవ పాండవులకు యుద్ధం ప్రారంభం కానున్నదని తెలుసుకుని ఇరుపక్షాలకూ కావలసిన వాడు కనుక, బలరాముడు బయలుదేరి తీర్ధయాత్ర నెపంతో వెళ్ళిపోయాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=926 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, December 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౧(431)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-920-చ.
జలరుహలోచనుండు నిజసాధనమై తనరారు చక్రమున్
వలనుగఁ బూన్చి వైవ నది వారక వాని శిరంబు ద్రుంచె న
బ్బలియుఁడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోదరా
వలుల వధించి తత్కులము వారి ననేకులఁ ద్రుంచె నీ గతిన్.
10.2-921-వ.
అయ్యవసరంబున.
10.2-922-క.
నర ముని యోగి సురాసుర
గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ
శ్చర కిన్నర కింపురుషులు
హరిమహిమ నుతించి రద్భుతానందములన్. 

భావము:
కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. అలా బలవంతుడైన శ్రీకృష్ణుడు సౌభకంతో పాటు, సాల్వుణ్ణీ, శిశుపాలుణ్ణీ, వాని తమ్ముడు విదూరథుణ్ణీ, వారి సోదరులతో సహా సంహరించాడు. ఇంతేకాక, వారి వంశం వారిని చాలా మందిని చంపాడు. అలా సాల్వాదులను అంతమొందించిన సమయంలో మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=922 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, December 23, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౦(430)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-918-చ.
పెనుగదఁ బూన్చి కృష్ణుతల బెట్టుగ మొత్తిన నంకుశాహతిం
గనలెడి గంధసింధురముకైవడి సింధురభంజనుండు పెం
పున పవిభాసమానగదఁ బూని మహోగ్రతఁ ద్రిప్పి దంతవ
క్త్రుని యురముంబగిల్చినఁగుదుల్కొనుచున్రుధిరంబు గ్రక్కుచున్
10.2-919-వ.
తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొఱలుచు నేలంగూలి కేశపాశంబులు సిక్కువడఁ దన్నుకొనుచుఁ బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖిల భూతంబులు నాశ్చర్యంబు వొందఁ దద్గాత్రంబున నుండి యొక్క సూక్ష్మతేజంబు వెలువడి గోవిందునిదేహంబుఁ బ్రవేశించె; నయ్యవసరంబున నగ్రజు మరణంబు గనుంగొని కుపితుండై కనుఁగవల నిప్పులుప్పతిల్ల విదూరథుండు గాలానల జ్వాలాభీలకరాళంబైన కరవాలంబును బలకయుం గేలందాల్చి దామోదరు దెసకుఁ గవయుటయుం గనుంగొని. 

భావము:
దంతవక్త్రుడు తన గదాదండంతో కృష్ణుడి తలమీద మోదాడు. అంకుశం పోటుకి కోపించెడి మదగజంలా, శ్రీకృష్ణుడు ఆగ్రహించి వజ్రాయుధంలాంటి గదతో వాడి వక్షస్థలాన్ని పగులకొట్టడంతో, వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు. తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. చక్రి అది చూసి..... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=919 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౯(429)

( దంతవక్త్రుని వధించుట) 
10.2-916-చ.
వడిఁ జనుదేరఁ జూచి యదువల్లభుఁ డుల్లము పల్లవింప న
ప్పుడు గదఁ గేలఁబూని రథమున్ రయమొప్పఁగ డిగ్గి యుగ్రతం
గడఁగి విరోధికిన్నెదురుగాఁ జన వాఁ డతినీచవర్తియై
యడరుచు నట్టహాసముఖుడై వలచే గదఁ ద్రిప్పుచున్ హరిన్.
10.2-917-వ.
కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె, “నీవు మదీయభాగ్యంబునం జేసి నేఁడు నా దృష్టిపథంబునకు గోచరుండవైతివి; మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండ వని మన్నింపక దేహంబు నందు వర్తించు నుగ్రవ్యాధి నౌషధాదిక్రియల నివర్తింపఁజేయు చికిత్సకుని చందంబున బంధురూపశాత్రవుండవు గావున నిన్ను దంభోళి సంరంభ గంభీరంబైన మదీయ గదాదండహతిం బరేత నివాసంబున కనిచి మున్ను నీచేత నిహతులైన నాదు సఖుల ఋణంబుఁ దీర్తు” నని దుర్భాషలాడుచు డగ్గఱి. 

భావము:
ఆ విధంగా తన మీదకి వస్తున్న దంతవక్త్రుడిని చూసిన శ్రీకృష్ణుడు వికసించిన హృదయంతో గద చేత పట్టి రథం దిగాడు. పూని ఉగ్రంగా విరోధికి ఎదురు నడిచాడు. దంతవక్త్రుడు అట్టహాసంగా గద త్రిప్పుతూ నీచంగా మురారిని ఎగతాళి చేస్తూ ఇలా అన్నాడు. “ఓ కృష్ణా! ఈనాడు నీవు నా భాగ్యవశం వలన నాకు ఎదురుగా కనపడ్డావు. నువ్వు బంధువు రూపంలో ఉన్న విరోధివి. శరీరంలో ప్రవేశించిన భయంకరవ్యాధిని మందులతో పోగొట్టే వైద్యుడిలా, మేనమామ కొడుకువు అనే అభిమానం లేకుండా వజ్రాయుధం లాంటి నా గదాయుధంతో మిత్రద్రోహివైన నిన్ను యమలోకానికి పంపిచేస్తాను. నిన్ను చంపి నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకుంటాను.” అంటూ దంతవక్త్రుడు శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలాడుతూ దగ్గరకు వచ్చి.. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=917 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౮(428)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-914-వ.
ఇట్లు మాయావి యైన సాల్వుండును సౌభకంబును గృష్ణుచేతం బొలియుటఁ గనుంగొని నిజసఖులగు సాల్వ పౌండ్రక శిశుపాలురకుఁ బారలౌకికక్రియలు మైత్రిం గావించి దంతవక్త్రుం డతి భీషణాకారంబుతో నప్పుడు.
10.2-915-చ.
పెట పెటఁ బండ్లు గీఁటుచును బెట్టుగ మ్రోయుచుఁ గన్నుగ్రేవలం
జిటచిట విస్ఫులింగములు సింద మహోద్ధతపాదఘట్టన
న్నటనిటనై ధరిత్రి వడఁకాడ వడిన్ గద కేలఁ ద్రిప్పుచున్
మిటమిట మండు వేసవిని మించు దివాకరుఁ బోలి యుగ్రతన్. 

భావము:
ఆ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుడిని సౌభకవిమానాన్నీ ధ్వంసం చేయటం చూసిన దంతవక్త్రుడు తన మిత్రులైన సాళ్వ, పౌండ్రక, వాసుదేవ, శిశుపాలురకు ఉత్తరక్రియలు పూర్తి చేసి; మిక్కిలి భయంకరాకారంతో కృష్ణుడి మీదకు వచ్చాడు. పండ్లు పట పట కొరుకుతూ, కళ్ళనుండి నిప్పుకణాలు రాలుస్తూ, పాదఘట్టనలతో భూమివణికేలా అడుగులు వేస్తూ, గద గిరగిర త్రిప్పుతూ, ఎండాకాలపు సూర్యుడిలాగా మండిపడుతూ దంతవక్త్రుడు కృష్ణుడిని వచ్చి తాకాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=915 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 19, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౭(427)

( సాల్వుని వధించుట) 

10.2-912-క.
అంతం బోవక కినుక న
నంతుఁడు విలయార్కమండలాయతరుచి దు
ర్దాంతంబగు చక్రంబు ని
తాంతంబుగఁ బూన్చి సాల్వధరిణిపుమీఁదన్.
10.2-913-క.
గురుశక్తి వైచి వెస భా
సురకుండలమకుటరత్నశోభితమగు త
చ్ఛిరము వడిఁ ద్రుంచె నింద్రుఁడు
వరకులిశముచేత వృత్రు వధియించు క్రియన్. 

భావము:
అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడు ప్రళయకాల సూర్యమండల ప్రభలను వెదజల్లే సుదర్శన చక్రాన్ని సాల్వుడి మీద ప్రయోగించాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని చంపినట్లుగా, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వేసి మకరకుండల రత్నాలతో విరాజిల్లుతున్న సాల్వుడి తలను ఖండించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=66&Padyam=913 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, December 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౬(426)

( సాల్వుని వధించుట) 

10.2-910-వ.
అట్లు కృష్ణుం డమ్మయనిర్మిత మాయావిమానంబు నిజగదాహతి నింతింతలు తునియలై సముద్రమధ్యంబునం దొరంగం జేసిన సాల్వుండు గోఱలు వెఱికిన భుజంగంబు భంగి గండడంగి విన్ననై విగతమాయాబలుం డయ్యునుఁ బొలివోవని బీరంబున వసుధా తలంబునకు డిగ్గి యాగ్రహంబున.
10.2-911-క.
కరమునఁ బవినిభ మగు భీ
కర గద ధరియించి కదియఁగాఁ జనుదేరన్
మురహరుఁ డుద్ధతి సాల్వుని
కరము గదాయుక్తముగను ఖండించె నృపా! 

భావము:
ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు. ఓ రాజా నరేంద్రా! సాల్వుడు వజ్రాయుధంతో సమానమైన భయంకర గదను చేతబట్టి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ గదతో సహితంగా వాడి చేతిని ఖండించివేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=66&Padyam=911 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 15, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౫(425)

( సాల్వుని వధించుట) 

10.2-908-క.
హరి దనమీఁద ఘోరనిశితాశుగజాలము లేయు సాల్వభూ
వరు వధియింపఁ గోరి బహువారిద నిర్గతభూరివృష్టి వి
స్ఫురణ ననూన తీవ్రశరపుంజములన్ గగనంబుఁ గప్పి క్ర
చ్చఱ రిపు మౌళిరత్నమునుఁ జాపము వర్మముఁ ద్రుంచి వెండియున్.
10.2-909-మ.
వితతక్రోధముతోడఁ గృష్ణుఁడు జగద్విఖ్యాతశౌర్యక్రియో
ద్ధతశక్తిన్ వడిఁ ద్రిప్పి మింట మెఱుఁగుల్‌ దట్టంబుగాఁ బర్వ ను
గ్రతఁ జంచద్గద వైచి త్రుంచె వెసఁ జూర్ణంబై ధరన్ రాల నా
యతభూరిత్రిపురాభమున్ మహితమాయాశోభమున్ సౌభమున్. 

భావము:
అప్పుడు తన మీద పదునైన బాణాలను గుప్పిస్తున్న సాల్వుడిని చంపటానికి శ్రీకృష్ణుడు నిశ్చయించుకొని, తన తిరుగులేని తీవ్రమైన బాణాలను వర్షధారలవలె ప్రయోగిస్తూ ఆకాశాన్ని కప్పివేసి శత్రువు కిరీటాన్నీ ధనుస్సునూ కవచాన్నీ ఛేదించి వేశాడు. మహాక్రోధంతో శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాతమైన వీరవిజృంభణంతో ఆకాశంనిండా మెరుపులు వ్యాపించేలా గదాదండాన్ని విసిరి త్రిపురాల వంటిదీ గొప్ప మాయతో విరాజిల్లుతున్నది అయిన సాల్వుడి సౌభకవిమానాన్ని తుత్తునియలు చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=66&Padyam=909 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 14, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౪(424)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-906-క.
మును లపుడు గొంద ఱచటికిఁ
జనుదెంచి విమోహియైన జలజదళాక్షుం
గనుఁగొని సమధికభక్తిన్
వినయంబునఁ బలికి రంత విష్ణున్ జిష్ణున్.
10.2-907-సీ.
“కమలాక్ష! సర్వలోకములందు సర్వ మా-
  నవులు సంసార నానావిధైక
దుఃఖాబ్ధిమగ్నులై తుదిఁ జేరనేరక-
  వికలత్వమునఁ బొందు వేళ నిన్నుఁ
దలఁచి దుఃఖంబులఁ దరియింతు రట్టి స-
  ద్గుణనిధి వై దేవకోటికెల్లఁ
బట్టుగొమ్మై పరబ్రహ్మాఖ్యఁ బొగడొంది-
  పరమయోగీశ్వర ప్రకరగూఢ
10.2-907.1-తే.
పరచిదానంద దివ్యరూపమున వెలుఁగు
దనఘ! నీ వేడ? నీచజన్మాత్మ జనిత
ఘన భయస్నేహ మోహశోకంబు లేడ?"
ననుచు సంస్తుతి సేసి వారరిగి రంత. 

భావము:
ఆ సమయంలో, మునులు కొంతమంది వచ్చి, మాయా మోహితుడైన కృష్ణుడిని చూసి, చిక్కని భక్తితో వినయంగా సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన వాడు, జయశీలుడు అయిన ఆయనతో ఇలా పలికారు. “ఓ పుండరీకాక్షా! పురుషోత్తమా! సమస్తమైన లోకాలలో ఉన్న మానవులు అందరు రకరకాలుగా సంసారం అనే దుఃఖసముద్రంలో మునిగి దరి చేరలేక కొట్టుమిట్టాడుతున్న దశలో నిన్ను స్మరించి ఆ దుఃఖాలను పోగొట్టుకొంటారు. అలాంటి సద్గుణాలకు నిధివై; దేవతాసమూహానికి ఆధారభూతుడవై; పరబ్రహ్మ స్వరూపుడవై; పరమయోగీశ్వరులకు కూడా అందనివాడవై; చిదానందరూపంతో ప్రకాశించే నీ వెక్కడ? అజ్ఞాన సంజాతాలు అయిన శోక, మోహ, భయాదు లెక్కడ? అవి నిన్ను అంట లేవు.” అని ఈ విధంగా ప్రస్తుతించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=907 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౩(423)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-905-వ.
తన మాయాబలంబునఁ గ్రమ్మఱం దోఁచి కృతక వసుదేవునిం గల్పించి యతనిం బంధించి కొనితెచ్చి “పుండరీకాక్ష! నిరీక్షింపు భవజ్జనకుండు వీఁడె; యిప్పుడు నీవు గనుంగొన వీని తలఁద్రుంతు నింక నెవ్వనికింగా మనియెదు? కావంగల శక్తిగలదేనిం గావు” మని దురాలాపంబు లాడుచు మృత్యుజిహ్వాకరాళంబైన కరవాలంబు గేలంబూని జళిపించుచు నమ్మాయావసుదేవుని శిరంబు దునిమి తన్మస్తకంబు గొని వియద్వర్తి యై చరియించు సౌభక విమానంబు సొచ్చె; నంత గోవిందుండు గొంతతడవు మనంబున ఘనంబగు శోకంబునం గుందుచుండి యాత్మసైనికులు దెలుపం దెలివొంది యది మయోదితంబైన సాల్వుని మాయోపాయం బని యెఱింగె; నంతం దనకు వసుదేవుండు పట్టువడె నని చెప్పిన దూతయు నమ్మాయాకళేబరంబును నా క్షణంబ విచిత్రంబుగా మాయంబై పోయె; ననంతరంబ. 

భావము:
ఆ దూత మళ్ళీ కనిపించి మాయావసుదేవుడిని కల్పించి, అతనిని బంధించి తీసుకు వచ్చి “ఓ కృష్ణా! పుండరీకముల వంటి కన్నులు ఉన్నాయి కదా చూడు. వీడే నీ తండ్రి నీ కన్నుల ముందే వీడి తల నరికేస్తాను. ఇక ఎవరి కోసం బ్రతుకుతావు? ఇక చాతనైతే రక్షించుకో.” అని దుర్భాషలు పలుకుతూ, భీకరమైన పెద్ద కత్తి జళిపిస్తూ, ఆ మాయావసుదేవుడి తల తరిగి, ఆ శిరస్సు పట్టుకుని సౌభకవిమానం లోనికి వెళ్ళిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కొంతసేపు బాగా దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తన సైనికులచే గుర్తు చేయబడి, అది సాల్వుడు ప్రయోగించిన మయ నిర్మిత మాయ అని కృష్ణుడు గ్రహించాడు. ఆ క్షణం లోనే వసుదేవుడు పట్టుబడ్డాడు అని చెప్పిన దూత, ఆ మాయాకళేబరం అదృశ్యం అయిపోయాయి. పిమ్మట.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=905 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౨(422)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-902-క.
నర గంధర్వ సురాసుర
వరులకు నిర్జింపరాని వాఁడు బలుం డే
మఱ కరయ హీనబలుచేఁ
బరికింపఁగ నెట్లు పట్టువడు నొకొ యనుచున్
10.2-903-వ.
మఱియును.
10.2-904-క.
భావంబు గలఁగ "నాహా!
దైవకృతం బెవ్వరికినిఁ దప్పింపఁగ రా
దే విధి నైనను" నని శో
కావిలమతిఁ బలుకుచున్న నత్తఱి వాఁడున్. 

భావము:
“మానవ గంధర్వ దేవరాక్షసాదులకు అయినా జయింప సాధ్యం కాని బలరాముడు జాగరూకతతో రక్షిస్తూ ఉండగా, బలహీనుడైన సాల్వుడి చేత వసుదేవుడు ఎలా పట్టుబడతాడు.” అని శ్రీకృష్ణుడు ఇలా అనుకుంటూ మనస్సు వికలం అయి, “దైవనిర్ణయాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యంకాదు కదా.” అని శ్రీకృష్ణుడు దుఃఖంతో బాధపడ్డాడు. ఇంతలో.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=904 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, December 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౧(421)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-900-తే.
గగన మందుండి యొకఁ డార్తుఁ డగుచు వచ్చి
నందనందను పాదారవిందములకు
వందనము సేసి యానకదుందుభిని మ
హోగ్రుఁడై పట్టితెచ్చె సాల్వుండు గడఁగి.
10.2-901-తే.
దేవ! మీ కెఱిఁగింపఁగాఁ దివిరి యిటకు
దేవకీదేవి నన్నుఁ బుత్తెంచె ననఁగ
విని సరోరుహనాభుఁడు ఘన విషాద
మగ్నుఁ డయ్యెను గురుమీఁది మమతఁ జేసి. 

భావము:
ఒకడు ఆకాశంలో నుండి దుఃఖిస్తూ దిగి వచ్చి, ఆ నందుని నందనుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించి సాల్వుడు మహా ఉగ్రతతో పూని వచ్చి ఆనకదుందుభి అని పిలువబడే నందమహారాజుని బంధించి తెచ్చాడు. ప్రభూ! శాల్వుడు మీతండ్రి వసుదేవుడిని బంధించి తెచ్చిన వార్త మీకు చెప్పవలసిందిగా దేవకీదేవి నన్ను మీ దగ్గరకు పంపించారు.” అది వినిన శ్రీకృష్ణుడు తండ్రిమీద ఉన్న మమకారం వలన విషాదంలో మునిగిపోయాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=901 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, December 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౦(420)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-896-చ.
అనిన మురాంతకుండు దరహాసము మోమునఁ దొంగలింప సా
ల్వునిఁ గని "యోరి! లావు బలుపుంగల పోటరి వోలెఁ బ్రేలె దే
మనినను బాటు సన్నిహితమౌట యెఱుంగవు మూఢచిత్త! వొ
"మ్మని గదఁ గేలఁ ద్రిప్పి యభియాతిని శత్రుని వ్రేసె నుద్ధతిన్.
10.2-897-వ.
అట్లు వ్రేసిన.
10.2-898-క.
పెనుమూర్ఛ నొంది వెస ము
క్కున వాతను నెత్తురొల్కఁ గొంతవడికి నొ
య్యన తెలిసి నిలువరింపక
చనె వాఁడు నదృశ్యుఁ డగుచు సౌభముఁ దానున్.
10.2-899-వ.
అయ్యవసరంబున. 

భావము:
ఇలా అంటున్న సాల్వుడితో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. “ఓరోరి! మూర్ఖుడా! గొప్ప బలము, పరాక్రమం కల వీరుడిలా వాగుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు.” అని పలికి తన గధాయుధాన్ని గిరగిర త్రిప్పి ఎదురుగా వస్తున్న సాల్వుడి మీదకు విసిరాడు. అలా శ్రీకృష్ణుడు గదను వేయగా శ్రీకృష్ణుని గదాఘాతంచేత సాల్వుడి నోటినుండి ముక్కునుండి రక్తం కారుతుండగా స్పృహ తప్పాడు. కొంతసేపటికి తేఱుకుని తెలివి తెచ్చుకున్నాడు. వెనువెంటనే సౌభకంతోపాటు అదృశ్యమయి. అలా సౌభకంతో సాల్వుడు అదృశ్యమై మాయలు పన్నిన ఆ సమయంలో... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=898 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, December 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౯(419)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-893-క.
హాహా యని భూతావళి
హాహాకారములు సేయ నంతట దేఱ
న్నాహరిఁ గనుఁగొని యతఁ డు
త్సాహంబునఁ బలికె బాహుశౌర్యస్ఫూర్తిన్.
10.2-894-చ.
"నళినదళాక్ష! మత్సఖుఁడు నాఁ దగు చైద్యుఁడు గోరినట్టి కో
మలి నవినీతిమైఁ దగవుమాలి వరించితి; వంతఁ బోక దో
ర్బలమున ధర్మనందును సభాస్థలి నేమఱి యున్న వాని న
చ్చలమునఁ జంపి తట్టి కలుషంబున నేఁడు రణాంగణంబునన్. 

భావము:
సకల భూతాలు హాహాకారాలు చేసాయి. అ సమయంలో రథంలోని కృష్ణుడు తెప్పరిల్లడం చూసి, బాహుబలశాలి సాల్వుడు ఉత్సాహంతో ఇలా అన్నాడు. “ఓ పద్మాక్షా! కృష్ణా! నా మిత్రుడు నా వాడు అయిన చైద్యరాజు శిశుపాలుడు కోరుకున్న కన్యకను నీవు నీతిహీనుడవు అయి పరిగ్రహించావు. అది చాలక ధర్మరాజు యాగ సభలో ఏమరుపాటుగా ఉన్న అతడిని పగబట్టి చంపావు. అంతటి తప్పుచేసిన నీవు ఇప్పుడు రణరంగంలో.. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=894 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౮(418)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-891-చ.
గురుభుజుఁ డంతఁ బోవక యకుంఠిత శూరత శత్రుసైన్యముల్‌
దెరలఁగ నుగ్రతం గొఱవిఁ ద్రిప్పిన కైవడి మింట దిర్దిరం
దిరుగుచు దుర్నిరీక్ష్యమగు దీపితసౌభము సాల్వుఁ జండభా
స్కర కిరణాభ షోడశ నిశాతశరంబులఁ గాఁడ నేసినన్.
10.2-892-చ.
కడు వడి నల్గి వాఁడు నిజకార్ముకమున్ జలదస్వనంబుకై
వడి మొరయించుచున్ వెడఁద వాతి శరంబులఁ బద్మలోచను
న్నెడమభుజంబు గాఁడ వడి నేసినఁ దెంపఱి చేతి శార్‌ఙ్గమున్
విడిచె రథంబుపై గగనవీథి సురల్‌ భయమంది చూడఁగన్. 

భావము:
మహాభుజబల సంపన్నుడు, వీరాధివీరుడు అయిన కృష్ణుడు అంతటితో శాంతించకుండా మొక్కవోని పరాక్రమంతో కొఱవి త్రిప్పుతున్నట్లు ఆకాశంలో గిరగిర తిరుగుతూ దుర్నరీక్ష్యంగా ఉన్న ఆ సౌభకాన్నీ అందులోని సాల్వుడిని తీక్షణమైన సూర్యకిరణాలతో సమానమైన పదహారు బాణాలను గుప్పించి నొప్పించాడు. సాల్వుడు కోపంతో తన ధనుస్సును మేఘగర్జనలా మ్రోగిస్తూ కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేలా వాడి బాణాలు వేసాడు. అ దెబ్బకు కృష్ణుడు శార్ఙ్గము అనే పేరు కల తన ధనుస్సును రథంమీద జారవిడిచాడు. ఆకాశంలో దేవతలు భయపడుతూ చూడసాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=892 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, December 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౭(417)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-889-చ.
మిణుఁగుఱు లెల్లెడం జెదర; మింటను మంటలు పర్వ; ఘంటికా
ఘణఘణ భూరినిస్వన నికాయమునన్ హరిదంతరాళముల్‌
వణఁక; మహోగ్రశక్తిఁ గొని వారక దారుకుమీఁద వైవ దా
రుణగతి నింగినుండి నిజరోచులతోఁ బడు చుక్కకైవడిన్.
10.2-890-క.
వడిఁ జనుదేరఁగఁ గని య
ప్పుడు నగధరుఁ డలతి లీలఁ బోలెన్ దానిం
బొడిపొడియై ధరఁ దొరఁగఁగఁ
నడుమన వెసఁ ద్రుంచె నొక్క నారాచమునన్. 

భావము:
నిప్పురవ్వలు అంతటా చెదరిపడేలా; అకాశం అంతా మంటలు వ్యాపించేలా; గంటలశబ్దంతో దిగ్గజాలు వణికేలా; సాల్వుడు భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని కృష్ణుడి రథసారథి అయిన దారుకుడి మీద ప్రయోగించాడు. అది ఆకాశం నుండి రాలిపడే కాంతిమంతమైన నక్షత్రంలా దూసుకు వస్తోంది అలా నింగినుండి దూసుకు వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడు ఒక్క బాణంతో మార్గం మధ్యలోనే పొడిపొడి చేసి నేలరాల్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=890 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, December 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౬(416)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-887-శా.
కంటే దారుక! దుర్నిమిత్తము లనేకంబుల్‌ మహాభీలముల్‌
మింటన్ మేదినిఁ దోఁచుచున్నయవి; నెమ్మిన్ ఖాండవప్రస్థ మే
నుంటం జైద్యహితక్షితీశ్వరులు మాయోపాయులై మత్పురిం
గెంటింపం జనుదేరఁ బోలుదురు; పోనీ తేరు వేగంబునన్."
10.2-888-వ.
అని యతిత్వరితగతిం జనుదెంచి తత్పురంబు డగ్గఱి మహాబల పరాక్రమంబులం బ్రతిపక్షబలంబులతోడం దలపడి పోరు యదు బలంబులును నభోవీథి నభేద్య మాయా విడంబనంబునం బ్రతివీరు లెంతకాలంబునకు నే యుపాయంబునను సాధింప నలవి గాని సౌభకవిమానంబు నందున్న సాల్వునిం గని తద్విమానంబు డాయం దన తేరు దోల సారథిని నియమించి కదియంజను మురాంతకుని వీక్షించి యదు సైనిక ప్రకరంబులు పరమానందంబునం బొందిరి; మృతప్రాయంబులై యున్న సైన్యంబులం గనుంగొని సౌభకపతి విక్రమక్రియాకలాపుం డగుచు నురవడించి. 

భావము:
చూడు దారుకా! అపశకునాలు ఆకాశంలోను, భూమి మీద అతిభీకరంగా కనబడుతున్నాయి. నేను ఇంద్రప్రస్థంలో ఉన్న విషయం తెలుసుకొని శిశుపాలుడి మిత్రులైన రాజులు మన పట్టణం మీద యుద్ధానికి తలపడినట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనియ్యి. ఈ విధంగా శ్రీకృష్ణుడు పలుకగా, దారుకుడు మిక్కిలి వేగంతో రథం పోనిచ్చాడు. అలా శీఘ్రమే ద్వారకను సమీపించి, వాసుదేవుడు బలపరాక్రమాలతో శత్రుసైన్యంతో తలపడి యుద్ధం చేసే యాదవసైన్యాన్ని, ఆకాశమార్గంలో మాయాప్రభావంతో మోసం చేస్తూ యాదవవీరులను; ఎంత కాలానికి భేదింప సాధ్యం కాకుండా తిరుగుతున్న సౌభక విమానాన్నీ, అందులో ఉన్న సాల్వుడిని చూసాడు. వాని సమీపానికి రథాన్ని తోలించాడు. శ్రీకృష్ణుడిని వీక్షించిన యదుసైన్యాలు పరమానందం పొందాయి. చైతన్యం కోల్పోయి దైన్యంగా ఉన్న తన సైన్యాన్ని చూసి సాల్వుడు పరాక్రమించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=887 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, December 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౫(415)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-884-వ.
మఱియు నొక్కయెడ.
10.2-885-సీ.
ఖండిత శుండాల గండముల్‌ నక్రముల్‌-
  భూరితుండంబులు భుజగ సమితి;
పదతలంబులు గచ్ఛపంబులు; దంతముల్‌-
  శుక్తులు; గుంభనిర్ముక్త మౌక్తి
కములు రత్నములు; వాలములు జలూకముల్‌-
  మెడలు భేకంబులు; మెదడు రొంపి;
ప్రేవులు పవడంపుఁ దీవెలు; నరములు-
  నాఁచు; మజ్జంబు ఫేనంబు; లస్థి
10.2-885.1-ఆ.
సైకతములు; రక్తచయము తోయంబులు;
నొరగు నెడల నొరలు మొఱలు ఘన త
రంగరవముగా మతంగజాయోధన
స్థలము జలధిఁ బోల్పఁ దగె నరేంద్ర!
10.2-886-వ.
ఇవ్విధంబున యదుసాల్వబలంబులు చలంబునఁ బరస్పర జయకాంక్షలం దలపడి పోరు పూర్వపశ్చిమ సముద్రంబుల వడువున నిరువదియేడు దినంబు లతిఘోరంబుగాఁ బోరునెడ నింద్రప్రస్థపురంబు నుండి ద్వారకానగరంబునకు నగధరుండు సనుదేర ముందటం గానవచ్చు దుర్నిమిత్తంబులం గనుంకొని కృష్ణుండు దారుకునిం జూచి యిట్లనియె. 

భావము:
ఆ సంగ్రామరంగంలో ఆ సమయంలో.... ఓ రాజా! ఆ రణరంగం సముద్రంలా మారింది ఖండించబడిన ఏనుగుల గండస్థలాలే మొసళ్ళుగా; తొండాలే పాములుగా; ఆ యేనుగుల కాళ్ళు తాబేళ్ళుగా; దంతాలు ముత్యపుచిప్పలుగా; వాటి కుంభస్థలాల నుండి రాలిపడిన ముత్యాలు రత్నాలుగా; తోకలు జలగలుగా; మెడలు కప్పలుగా; మెదడు బురదగా; ప్రేగులు పగడపుతీగలుగా; నరాలు నాచుతీవలుగా; క్రొవ్వు నురుగులా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; రక్తము నీరుగా; మరణిస్తూ చేసే ఘీంకారాలు తరంగ శబ్దాలుగా; ఇలా ఆ రణభూమి సముద్రంతో పోల్చతగి పోలుపారింది. ఈ విధంగా యాదవ బలాలూ, సాల్వ సైన్యాలూ ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో ఇరవైఏడు దినాలు పాటు తూర్పు పడమర సముద్రాలు తలపడి పోరుతున్నాయా అన్నట్లు భీకరంగా యుద్ధం చేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థం నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు వస్తూ మార్గమధ్యంలో కనపడ్డ చెడ్డ శకునాలను కనుగొని సారథి యైన దారుకుడితో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=885 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౪౧౪(414)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-881-మ.
కని సాంబప్రముఖాది యోధవరు లుత్కంఠాత్ములై మీన కే
తను నగ్గించి సువర్ణపుంఖ నిశితాస్త్రశ్రేణి సంధించి సా
ల్వుని సైన్యావలి మస్తముల్‌ వెరవు లావున్ మీఱఁగా నొక్క యె
త్తున వేత్రుంచిరి తాటిపండ్లు ధరఁ దోడ్తో రాల్చు చందంబునన్.
10.2-882-వ.
అట్టి యెడ.
10.2-883-స్రగ్ద.
కూలున్ గుఱ్ఱంబులేనుంగులు ధరఁగె; డయుంగుప్పలై; నుగ్గునూచై
వ్రాలున్దేరుల్‌; హతంబై వడిఁబడుసు; భటవ్రాతముల్‌; శోణితంబుల్‌
గ్రోలున్, మాంసంబునంజుంగొఱకు, నెము; కలన్గుంపులైసోలుచున్బే
తాలక్రవ్యాదభూతోత్కరములు, జ; తలై తాళముల్‌ దట్టి యాడున్. 

భావము:
అది చూసిన సాంబుడు మున్నగు యదు యోధులు ప్రద్యుమ్నుడిని ప్రస్తుతించారు. పదునైన బంగారు పింజలు గల బాణాలతో తాటిపండ్లను నేల రాల్చినట్లు సాల్వుని సైనికుల తలలు ఉత్తరించారు. ఆ యాదవులు సాల్వ యుద్ధ సమయంలో కుప్పలు తెప్పలుగా గుఱ్ఱాలు కూలాయి; ఏనుగులు నేల మీద వ్రాలాయి; రథాలు నుగ్గనుగ్గు అయి కూలాయి; భటులు చచ్చి పడిపోయారు; బేతాళాలూ పిశాచాలూ భూతాలూ ఆనందంతో రక్తాన్ని త్రాగుతూ, మాంసం నంజుకుంటూ, ఎముకలు కొరుకుతూ. చప్పట్లతో తాళాలు చరుస్తూ, పారవశ్యంగా నృత్యాలు చేసాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=883 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, December 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౩(413)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-878-ఉ.
సంచితభూరిబాహుబల శౌర్యుఁడు సారథిమాట కాత్మ మో
దించి యుదాత్తకాండ రుచిదీపితచాపముఁ దాల్చి మౌర్వి సా
రించి గుణధ్వనిన్ బృహదరిప్రకరంబుల భీతి ముంచి తో
లించె రథంబు మేదిని చలింపఁగ నా ద్యుముమీఁద నేర్పునన్.
10.2-879-వ.
అట్లు డగ్గఱి.
10.2-880-చ.
అరితను వష్ట బాణముల నాగ్రహవృత్తిఁ బగిల్చి నాల్గిటం
దురగములన్ వధించి యొక తూపున సారథిఁ ద్రుంచి రెంటని
ష్ఠురతర కేతుచాపములు చూర్ణముచేసి యొకమ్మునన్ భయం
కరముగఁ ద్రుంచె నా ద్యుమునికంఠ మకుంఠిత విక్రమోద్ధతిన్. 

భావము:
మహాశూరుడు, అపార బలసంపన్నుడు అయిన ప్రద్యుమ్నుడు సారథి మాటలకు సంతోషించాడు. ధనుష్టంకారంతో శత్రువులను భయభ్రాంతులను చేస్తూ గొప్ప నేర్పుతో ద్యుముడి మీదకి తిరిగి రథాన్ని తోలించాడు. అలా శత్రువు ద్యుముడిని సమీపించి మిక్కిలి ఆగ్రహంతో ప్రద్యుమ్నుడు అవక్రపరాక్రమం ప్రదర్శిస్తూ ఎనిమిది బాణాలను వేసి శత్రువు శరీరాన్ని పగులకొట్టాడు. నాలుగు బాణాలు వేసి అతని గుఱ్ఱాలను కూల్చాడు. రెండు బాణాలతో వాడి పతాకాన్నీ ధనుస్సునూ నుగ్గునుగ్గుచేసాడు. ఒక బాణంతో భయంకరంగా అతని సారథిని సంహరించాడు. పిమ్మట విక్రమించి ప్రద్యుమ్నుడు ఒక అమ్ముతో ద్యుముని కంఠాన్ని భీకరంగా నరికాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=880 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౪౧౨(412)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-874-ఉ.
సారిథిఁ జూచి యిట్లనియె "శాత్రవవీరులు సూచి నవ్వఁగాఁ
దేరు రణక్షితిన్ వెడలఁ దెచ్చితి తెచ్చితి దుర్యశంబు పం
కేరుహనాభుఁడున్ హలియు గేలికొనన్ యదువంశసంభవుల్‌
బీరము దప్పి యిప్పగిదిఁ బెల్కుఱి పోవుదురే రణంబునన్. "
10.2-875-వ.
అనిన నతం డతని కిట్లనియె.
10.2-876-క.
"రథి రిపుచే నొచ్చిన సా
రథియును, సారథియు నొవ్వ రథియును గావం
బృథుసమర ధర్మ; మిఁక న
వ్యధచిత్తుఁ డవగుచుఁ గడఁగు వైరుల గెలువన్."
10.2-877-వ.
అనిన విని. 

భావము:
సారథిని, తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇలా మందలించాడు. “కృష్ణుడూ బలరాముడూ ఎగతాళి చేసేలా, శత్రువులు నవ్వేలా రణక్షేత్రం నుండి రథాన్ని తప్పించి, అపకీర్తి తెచ్చావు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ మాదిరి యుద్ధరంగం నుంచి తొలగిపోరు కదా.” ఇలా అంటున్న ప్రద్యుమ్నుడితో సారథి ఇలా అన్నాడు. “యుద్ధధర్మం ప్రకారం శత్రువుల వలన రథికుడు నొచ్చినపుడు సారథి, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ పరస్పరం రక్షించుకోవాలి, కాబట్టి. నేను ఇలా చేసాను. నీవు బాధపడక విరోధులను గెలవడానికి ప్రయత్నించు.” ఇలా సారథి చెప్పగా విని... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=876 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, December 1, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౧(411)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-872-చ.
వెరవును లావుఁ జేవయును వీరముఁ బీరము గల్గి డాసి యా
సరసిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్
విరవిరవోయి మేను నిడువెండ్రుక వెట్టఁగఁ జేతిఁ సాధనో
త్కరములు దేరిపై వదలి కన్నులుమూయుచు మూర్ఛనొందినన్
10.2-873-ఆ.
సమరధర్మ వేది సమధిక నయవాది
దారుకుని సుతుండు ధైర్యయుతుఁడు
రథముఁ దోలికొనుచు రణభూమి వెడలి వే
చనియె మూర్ఛదేఱి శంబరారి. 

భావము:
నేర్పూ బలపరాక్రమాలూ ప్రదర్శిస్తూ ద్యుముడు గదతో కృష్ణకుమారుడు ప్రద్యుమ్నుడి వక్షం పగిలేలా మోదాడు. ఆ దెబ్బకి అతడు మేను గగుర్పడంతో చేతిలోని అస్త్రశస్త్రాలను రథంమీదనే వదిలి కనులు మూతలు పడి మూర్ఛపోయాడు. సారథి దారకుని కుమారుడు; యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు; నీతిశాస్త్ర పారంగతుడు; కనుక, రథాన్ని మళ్ళించి యుద్ధభూమినుండి ప్రక్కకు తోలుకుని పోయాడు. కొంతసేపటికి ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=873 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 30, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౦(410)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-869-క.
స్ఫురదనలాభశరంబులు
పొరిఁబొరి బుంఖానుపుంఖములుగా నేయం
దెరలియు మరలియు మురిసియు
విరిసియుఁ బిఱుతివక పోరె వెస యదుబలముల్‌.
10.2-870-క.
అయ్యెడ మానము వదలక
డయ్యక మగపాడితో దృఢంబుగఁ బోరన్
దయ్య మెఱుంగును? నెక్కటి
కయ్యం బపుడయ్యెఁ బేరుగల యోధులకున్.
10.2-871-క.
మును ప్రద్యుమ్నకుమారుని
ఘననిశితాస్త్రములచేతఁ గడు నొచ్చిన సా
ల్వుని మంతిరి ద్యుమనాముఁడు
సునిశిత గదచే నమర్చి సుమహితశక్తిన్. 

భావము:
అప్పుడు, సాల్వుడు యాదవసైన్యంమీద అగ్నిజ్వాల ల్లాంటి బాణాలను పింజ పింజతాకేలా వేసాడు. అయినా ఆ సైన్యం చెదరక బెదరక వెనుకంజ వేయక ధైర్యంతో నిలచి యుద్ధం చేసింది. ఆ సమయంలో రెండు పక్షాల యోధులూ నదురూ బెదురూ లేకుండా, అలసిపోకుండా గట్టిగా పౌరుషంతో పోరాడారు. అప్పుడు ప్రసిద్ధులైన యోధుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగసాగింది. మునుపు ప్రద్యుమ్నుడి బాణాల వలన మిక్కిలి నొచ్చిన సాల్వుడి మంత్రి ద్యుముడు అనేవాడు గదను ధరించి ప్రద్యుమ్నుడిని ఎదుర్కున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=870 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, November 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౯(409)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-867-సీ.
ఒకమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు-
  నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు
నొకమాటు శైలమస్తకమున వర్తించు-
  నొకపరిఁ జరియించు నుదధినడుమ
నొక్క తోయంబున నొక్కటియై యుండు-
  నొక్కెడఁ గనుఁగొనఁ బెక్కు లగును
నొకమాటు సాల్వసంయుక్తమై పొడసూపు-
  నొక తోయ మన్నియు నుడిగి తోఁచు
10.2-867.1-ఆ.
నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన
గతి మహోగ్రవృత్తిఁ గానవచ్చు
మఱియుఁ బెక్కుగతుల నరివరుల్‌ గలఁగంగఁ
దిరిగె సౌభకంబు ధీవరేణ్య!
10.2-868-వ.
ఇవ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి యదుసైన్యంబులచే దైన్యంబు నొందిన నిజసైన్యంబుల మరలం బురికొల్పి సాల్వుం డప్పుడు. 

భావము:
పరీక్షన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయా ప్రభావంతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒకతూరి సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొఱవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది.ఇలా సౌభకవిమానం విజృంభించేసరికి అంతకు ముందు యాదవసైన్యంవల్ల భీతిచెందిన తన సైన్యాల్ని సాల్వుడు మళ్ళీ పురిగొల్పి యుద్ధోన్ముఖులను చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=867 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, November 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౮(408)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-864-క.
అక్రూరుఁడుఁ దదనుజులు న
వక్రపరాక్రమము మెఱసి వైరుల బాహా
విక్రమమున వధియించిరి
చక్రప్రాసాది వివిధ సాధనములచేన్.
10.2-865-మ.
కృతవర్మక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి
శ్రితవర్మంబులఁ జించి మేనుల శతచ్ఛిద్రంబులం జేయ న
ద్భుతకర్మం బని సైనికుల్‌ వొగడ శత్రుల్‌ దూలుచో సంగర
క్షితిధర్మంబుఁ దలంచి కాచె రథికశ్రేష్ఠుండు భూమీశ్వరా!
10.2-866-వ.
అయ్యవసరంబున సాల్వుండు గోపోద్దీపితమానసుండై యుండ మాయావిడంబకంబైన సౌభకం బప్పుడు. 

భావము:
అక్రూరుడూ అతని తమ్ముళ్ళూ తిరుగులేని పరాక్రమంతో మెరసి ఈటె, చక్రము మున్నగు రక రకాల సాధనాల ప్రయోగంతో శత్రువులను వధించారు. ఓ పరీక్షిన్మహారాజా! రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు. అప్పుడు, సాల్వుడికి బాగా కోపం వచ్చింది. అతడి సౌభకవిమానం తన మాయాప్రభావంతో విజృంభించింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=865 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౭(407)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-861-ఉత్సా.
చారుదేష్ణుఁ డాగ్రహించి శత్రుభీషణోగ్ర దో
స్సారదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే
దారుణప్రతాప సాల్వదండనాథమండలిన్
మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్.
10.2-862-క.
శుకుఁ డా యోధన విజయో
త్సుకమతి బాహాబలంబు సొప్పడ విశిఖ
ప్రకరంబులఁ దను శౌర్యా
ధికుఁ డన విద్వేషిబలతతిం బరిమార్చెన్.
10.2-863-ఉ.
సారణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు సంచలింప దో
స్సార మెలర్పఁ గుంత శర శక్తి గదా క్షురికాది హేతులన్
వారక వాజి దంతి రథవర్గములం దునుమాడి కాల్వురన్
వీరముతోడఁ బంపె జమువీటికిఁ గాఁపుర ముగ్రమూర్తియై. 

భావము:
చారుదేష్ణుడు ఆగ్రహంతో విజృంభించి వాడి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని దండనాథులను సంహరించి సింహనాదం చేసాడు. యోధుడైన శుకుడు యుద్ధవిజయకాంక్షతో చెలరేగి తన భుజబలం విశదం అయ్యేలా శరసమూహంతో శత్రు సేనావ్యూహాన్ని నాశనం చేసాడు. సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=863 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, November 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౬(406)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-859-ఉ.
సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరిసౌభ సాం
గత్య చతుర్విధోగ్రబలగాఢతమఃపటలంబు భాసురా
దిత్యమయూఖపుంజరుచితీవ్రశరంబులఁ జూపి సైనిక
స్తుత్యపరాక్రమప్రకటదోర్బలుఁడై విలసిల్లె భూవరా!
10.2-860-ఉత్సా.
భానువిందుఁ డుద్ధతిన్ విపక్షపక్షసైన్య దు
ర్మాన కాననానలోపమాన చండ కాండ సం
తాన మూన నేసి చూర్ణితంబు చేసెఁ జాప వి
ద్యా నిరూఢి దేవతావితాన మిచ్చ మెచ్చఁగాన్. 

భావము:
ఓ రాజశ్రేష్ఠుడా! సాత్యకి మహారోషంతో సాల్వుడి చతురంగబలాలను, సౌభక విమానము అనే చీకటిని సూర్యకిరణాల వంటి వాడి యైన బాణాలను ప్రయోగించి పటాపంచలు కావించాడు. సైనికులందరు అతని పరాక్రమాన్ని బహువిధాల ప్రశంసించారు. భానువిందుడు విజృంభించి, శత్రుసైన్యం అనే అడవిని తీవ్రమైన దావానలం వంటి తన బాణాలు అసంఖ్యాకంగా వేసి భస్మీపటలం చేసాడు. అతని ధనుర్విద్యా కౌశల్యాన్ని దేవతా సమూహం ప్రస్తుతించింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=860 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౫(405)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-857-ఉ.
సాంబుని సాల్వభూవిభుఁడు సాయకజాలము లేసి నొంచినన్
జాంబవతీతనూభవుఁడు చాపము సజ్యము సేసి డాసి సా
ల్వుం బదియేను తూపుల నవోన్నతవక్షము గాఁడనేసి శా
తాంబకవింశతిన్నతని సౌభక మల్లలనాడ నేసినన్.
10.2-858-చ.
గదుఁడు మహోగ్రవృత్తి నిజకార్ముక నిర్గతవిస్ఫురద్విధుం
తుదవదనాభబాణవితతుల్‌ పరఁగించి విరోధిమస్తముల్‌
గుదులుగ గ్రుచ్చియెత్తుచు నకుంఠిత విక్రమకేళిలోలుఁడై
చదల సురల్‌ నుతింప రథిసత్తముఁ డొప్పె నరేంద్రచంద్రమా! 

భావము:
సాల్వుడు సాంబుడి మీద అనేక బాణాలు ప్రయోగించి నొప్పించాడు. అంతట ఆ జాంబవతీ తనయుడు సాంబుడు తన ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుడి వక్షాన్ని పదిహేను బాణాలతో కొట్టాడు. వాడి బాణాలు ఇరవై వేసి వాడి సౌభక విమానాన్ని అల్లల్లాడేలా చేసాడు. ఓ పరీక్షిత్తు రాజేంద్రా! గొప్ప రథికుడైన గదుడు రాహుముఖం లాంటి బాణాలను ప్రయోగించి శత్రువుల శిరస్సులు ఖండించి గుదులు గుదులుగా నేలకూలుస్తు మొక్కవోని పరాక్రమంతో విజృంభించాడు. ఆకాశంలో అతని పరాక్రమం చూసి దేవతలు ప్రస్తుతించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=858 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, November 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౪(404)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-854-చ.
పదిపది యమ్ములన్ మనుజపాలవరేణ్యుల నొంచి రోషముం
గదురఁగ మూఁడుమూఁడు శితకాండములన్ రథదంతివాజులం
జదియఁగ నేసి యొక్కొక నిశాతశరంబున సైనికావలిన్
మదము లడించి యిట్లతఁ డమానుషలీలఁ బరాక్రమించినన్.
10.2-855-క.
దుర్మానవహరు నద్భుత
కర్మమునకు నుభయ సైనికప్రకరంబుల్‌
నిర్మలమతి నుతియించిరి
భర్మాచలధైర్యు విగతభయుఁ బ్రద్యుమ్నున్. 

భావము:
ప్రద్యుమ్నుడు పదేసి బాణాలు చొప్పున వేసి, సాల్వుడి మిత్రులైన రాజశ్రేష్ఠులను నొప్పించాడు. మూడేసి బాణాలు వేసి రథ, గజ, అశ్వాలను పడగొట్టాడు ఒక్కొక్క బాణం ప్రయోగించి సైనికులను చిందరవందర చేసాడు. ఇలా ప్రద్యుమ్నుడు ఎదురులేని విధంగా పరాక్రమించాడు. అలా మేరుపర్వతం అంత ధైర్యంతో ప్రద్యుమ్నుడు నిర్భయంగా అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించగా, తిలకించిన ఉభయ సైన్యాలు ప్రస్తుతించాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=855 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, November 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౩(403)


( యదుసాల్వ యుద్ధంబు)

10.2-851-మ.
యంబుం గలుషించి సౌభపతి మాయాకోట్లు చంచచ్ఛరా
 నిర్ముక్త నిశాత దివ్యమహితాస్త్రశ్రేణిచేఁ దత్‌క్షణం
బు లీలాగతి నభ్రగుల్‌ మనములన్ భూషింప మాయించె న
వ్వజాతాప్తుఁడు భూరి సంతమసమున్ వారించు చందంబునన్
10.2-852-వ.
మఱియును.
10.2-853-చ.
తిరథికోత్తముం డన నుదంచితకాంచనపుంఖ పంచ విం
తివిశిఖంబులన్నతని సైనికపాలుని నొంచి యుగ్రుఁడై
 శతకోటికోటినిభసాయకముల్‌ పరఁగించి సాల్వభూ
తి కకుదంబు నొంచి లయభైరవుకైవడిఁ బేర్చి వెండియున్.

భావము:
సాల్వుడు కలుషాత్ముడై పన్నిన అనంత మాయాజాలాలను వీక్షించాడు. వీరావేశంతో విజృంభించి, సూర్యుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు చేయునట్లు, ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతో ఆ మాయాజాలాన్ని ఛేదించాడు. గగనచరులు అతని పరాక్రమం చూసి పొగిడారు. అనంతరం గొప్ప అతిరథుడి వలె ప్రద్యుమ్నుడు ఇరవైఐదు వాడి బాణాలతో సాల్వుడి సైన్యాధిపతిని నొప్పించాడు. పిడుగుల్లాంటి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని మూపు పగలగొట్టాడు. లయకాలపు భైరవుడి లాగ విజృంభించాడు. అటుపిమ్మట....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=853

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౪౦౨(402)


( యదుసాల్వ యుద్ధంబు)

10.2-848-మ.
రిరింఖారథనేమి సద్భటపదవ్యాఘట్టనోద్ధూత దు
స్తధూళీపటలప్రభూత నిబిడధ్వాంతప్రవిధ్వంస కృ
త్క శాతాసి గదాది హేతిరుచు లాకాశంబు నిండన్ వియ
చ్చ దృక్కుల్‌ మిఱుమిట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లఁగన్.
10.2-849-చ.
కొని సైనికుల్‌ గవిసి తార్కొని పేర్కొని పాసి డాసి యం
కిలి గొనకెమ్ములమ్ములఁ బగిల్చి నొగిల్చితరేతరుల్‌ తలల్‌
లియఁగ మొత్తి యొత్తి నయనంబులు నిప్పులు రాల లీల నౌఁ
లు లలాటముల్‌ ఘనగదాహతి నొంచి కలంచి పోరఁగన్.
10.2-850-వ.
అయ్యవసరంబునం బ్రద్ముమ్నుండు గనుంగొని.

భావము:
గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశ విహారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించాయి. ఇరు పక్షాల సైన్యాలు పూని ఒకరి నొకరు ఎదిరించి బాణ వర్షాలు కురిపించి మర్మస్థానాలను చీల్చేస్తు, క్రోధంతో కన్నులనుండి నిప్పురవ్వలు రాలగా పెద్ద పెద్ద గదలతో తలలపై బాదుకుంటూ, భయంకరంగా పోరాడారు. అలా భీకరంగా పోరుసాగుతున్న సమయంలో అదంతా వీక్షిస్తున్న ప్రద్యుమ్నుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=849

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, November 18, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౧(401)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-846-వ.
చని యా గోవిందనందన స్యందనంబుం బలసందోహంబునుం దలకడచి, యదు సైన్యంబులు సాల్వబలంబులతోడం దార్కొని బెరయునప్పుడు దేవదానవ సంకులసమర విధంబునం దుములం బయ్యె; నయ్యెడ.
10.2-847-మ.
వితతజ్యాచయ టంకృతుల్‌, మదజలావిర్భూతశుండాల ఘీం
కృతు, లుద్యద్భటహుంకృతుల్,‌ మహితభేరీభాంకృతుల్,‌ భీషణో
ద్ధతనిస్సాణధణంకృతుల్,‌ ప్రకటయోధవ్రాతసాహంకృతుల్‌,
కుతలంబున్, దివి నిండ మ్రోసె రిపుసంక్షోభంబుగా భూవరా! 

భావము:
ఈ విధంగా యాదవసైన్యం ప్రద్యుమ్నుని రథాన్నిదాటి ముందుకు పోయి సాల్వుడి సైన్యాలను ఎదిరించింది. అప్పుడు రెండు పక్షాల బలాలకు జరిగిన బాహాబాహీ సంకుల సమరం దేవదానవ యుద్ధంలాగ కనబడసాగింది. ఓ పరీక్షిన్మహారాజా! ఆ సంకుల సమరంలో విస్తారమైన అల్లెత్రాళ్ళ టంకారాలు, మదగజాల ఘీంకారాలు, భటుల హూంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు, శత్రుసంక్షోభంగా భూమ్యాకాశాలు నిండాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=847 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 17, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౦(400)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-844-చ.
సమధిక బాహుశౌర్యజితచండవిరోధులు వెళ్లి రున్నత
క్షమ గద భానువింద శుక సాత్యకి సారణ చారుదేష్ణ సాం
బ మకరకేతనాత్మజ శ్వఫల్కతనూభవ తత్సహోదర
ప్రముఖ యదూత్తముల్‌ విమతభంజనులై కృతవర్మమున్నుగన్
10.2-845-క.
వారణ వాజిస్యందన
వీరభటావలులు సనిరి విశ్వము వడఁకన్
ఘోరాకృతి వివిధాయుధ
భూరిద్యుతు లర్కబింబముం గబళింపన్. 

భావము:
మహా భుజబల పరాక్రమవంతులైన గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుని నందననుడు అనిరుద్ధుడు, శఫల్కుని పుత్రుడు అక్రూరుడు మున్నగు యాదవవీరులందరూ కృతవర్మ నాయకత్వంతో యుద్ధభూమికి బయలుదేరారు. యాదవవీరులు చతురంగబలసమేతులై జగత్తు కంపిస్తుండగా, తాము ధరించిన రకరకాల ఆయుధాల కాంతులు సూర్యబింబాన్ని కప్పివేస్తుండగా అరివీర భీకరంగా రణరంగానికి బయలుదేరారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=845 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౯(399)


( సాల్వుండు ద్వారకన్నిరోధించుట)

10.2-841-క.
టులపురత్రయదనుజో
త్కదుస్తర బాధ్యమానధారుణిగతి న
ప్పుభేదన మెంతయు వి
స్ఫుపీడం జెంది వగల సుడివడుచుండన్.
10.2-842-చ.g7

ని భగవంతుఁడున్ రథిశిఖామణియున్నగు ,qq1 రౌక్మిణేయుఁ డv
జ్జముల నోడకుండుఁ డని సంగరకౌతుక మొప్ప దివ్య సా
ములఁ బూని సైనిక కదంబము గొల్వ ననూన మీన కే

 రుచి గ్రాల నున్నతరస్థితుఁడై వెడలెన్ రణోర్వికిన్.

భావము:
త్రిపురాసురులవల్ల బాధపడిన భూలోకం లాగ ద్వారకానగరం సాల్వుడిచేత మిక్కిలి ఇక్కట్లపాలై దుఃఖంతో కలత చెందింది. అది చూసి మహాప్రభావశాలి రథికశ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి, మీనకేతనం ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథం ఎక్కి, మహోత్సాహంతో అస్త్రశస్త్రాలను ధరించి, సైన్య సమేతంగా యుద్ధభూమికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=842

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, November 15, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౮(398)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-838-సీ.
సరిదుపవన సరోవరములు మాయించి-
  బావులు గలఁచి కూపములు సెఱిచి
కోటలు వెస వీటతాటముల్‌ గావించి-
  పరిఖలు పూడ్చి వప్రములు ద్రొబ్బి
యట్టళ్లు ధరఁ గూల్చి యంత్రముల్‌ దునుమాడి-
  కాంచనధ్వజపతాకములు నఱకి
భాసుర గోపుర ప్రాసాదహర్మ్యేందు-
  శాలాంగణములు భస్మములు చేసి
10.2-838.1-తే.
విమల కాంచనరత్నాది వివిధవస్తు
కోటి నెల్లను నందంద కొల్లపుచ్చి
ప్రజలఁ జెఱపట్టి దొరలను భంగపెట్టి
తఱిమి యిబ్భంగిఁ బెక్కుబాధల నలంచి.
10.2-839-చ.
మదమున నంతఁ బోవక విమానయుతంబుగ నభ్రవీథికిన్
గొదకొని యేపుమై నెగసి కొంకక శక్తి శిలా మహీరుహ
ప్రదరము లోలిమైఁ గురిసి బంధురభూమిపరాగ శర్కరల్‌
వదలక చల్లుచున్ వలయవాయువుచే దిశ లావరించుచున్. 

భావము:
ద్వారకానగరంలోని సెలయేర్లను ఉపవనాలను ధ్వంసం చేయించాడు; చెఱువులు బావులు పూడిపించాడు; కోటలను ఛిన్నాభిన్నము చేయించాడు; అగడ్తలను పాడుచేసాడు; కోటగోడలను పడగొట్టించాడు; ప్రాకారాలు బురుజులు కూలదోయించాడు; యంత్రాలను ధ్వజపతాకాలనూ నరకించాడు; గోపురాలను మిద్దెలను మేడలను చంద్రశాలలను కాల్చి బూడిద చేసాడు; పట్టణంలోని బంగారాన్ని రత్నాలు మొదలైన వస్తువులను కొల్లగొట్టాడు; ప్రజలను చెఱపట్టాడు; అధికారులను అవమానించాడు; ఇలాగ సాల్వుడు ద్వారకలోని ప్రజలను పెక్కు బాధలకు గురిచేసాడు. అంతటితో వదలిపెట్టకుండ విమానం ఎక్కి సాల్వుడు ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుండి చర్నా(చిల్ల)కోలల్లా ఉన్న తీగలు, గడ్డిపోచలు, చెట్లు, కొమ్మలు, రాళ్ళు, బాణాలు వరసపెట్టి కురిపిస్తూ ద్వారకావాసులను బాధించాడు. దట్టమైన దుమ్ము ధూళితో ఇసుకరేణువులతో కూడిన సుడిగాలులు విసురుతూ కల్లోలపరచాడు 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=839 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, November 14, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౭(397)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-837-వ.
అని అభ్యర్థించినం బ్రసన్నండై హరుండు వాని కోర్కి కనురూపం బైన పురంబు నిర్మింప మయుని నియోగించిన నతండును “నట్ల చేసెద” నని కామగమనంబును నతివిస్తృతంబునుగా లోహంబున నిర్మించి సౌభకంబను నామంబిడి సాల్వున కిచ్చిన వాఁడును బరమానందంబునం బొంది తద్విమానారూఢుండై యాదవుల వలని పూర్వవైరంబుఁ దలంచి దర్పాంధచేతస్కుండై ద్వారకానగరంబుపైఁజని నిజసేనాసమేతంబుగాఁ దత్పురంబు నిరోధించి. 

భావము:
అలా సాల్వుడు కోరిన విధమైన విమానాన్ని ఈశ్వరుడు “అతడి కోరికకు తగిన పురము నిర్మించి యి” మ్మని మయుడిని ఆదేశించాడు. అతడు చిత్తమని కామగమనమూ మిక్కిలి వెడల్పూ పొడవూ కలిగి లోహమయమైన ఒక విమానాన్ని నిర్మించి దానికి “సౌభకము” అని పేరుపెట్టి సాల్వుడికి ఇచ్చాడు. వాడు పరమానందంతో దానిని ఎక్కి యాదవుల మీద తనకు ఉన్న పూర్వ శత్రుత్వం గుర్తుచేసుకుని గర్వంతో కన్నుమిన్ను గానక తన సేనలతో వెళ్ళి ద్వారకాపట్టణాన్ని ముట్టడించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=837 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, November 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౬(396)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-834-క.
బోరనఁ బ్రత్యక్షంబై
కోరినవర మేమి యైనఁ గొసరక యిత్తున్
వారక వేఁడు మటన్నను
నా రాజతపోధనుండు హరునకుఁ బ్రీతిన్.
10.2-835-తే.
వందనం బాచరించి యానంద వికచ
వదనుఁడై నొస లంజలిఁ గదియఁ జేర్చి
"శ్రితదయాకార! నన్ను రక్షించెదేని
నెఱుఁగ వినిపింతు వినుము మదీప్సితంబు.
10.2-836-తే.
గరుడ గంధర్వ యక్ష రాక్షస సురేంద్ర
వరులచే సాధ్యపడక నా వలయు నెడల
నభ్రపథమునఁ దిరిగెడు నట్టి మహిత
వాహనము నాకు దయసేయు వరద! యీశ! " 

భావము:
అంతట, ఈశ్వరుడు ప్రత్యక్షమై “నీవు ఏ వరం కోరినా ఇస్తాను. కోరుకొమ్ము” అని సాల్వుడిని అనుగ్రహించాడు. సాల్వుడు పరమ ప్రీతితో శంకరుడికి నమస్కారంచేసి, ఆనందంతో అంజలి నొసట ఘటించి ఇలా అన్నాడు “ఓ శివా! ఆశ్రితుల ఎడ కృప చూపు వాడా! నన్నురక్షించేటట్లయితే నా కోరిక ఏమిటో మనవి చేస్తాను. చిత్తగించు. ఓ ఈశ్వరా! వరదా! ప్రభూ! గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస, దేవతాదులకు సాధ్యం కానట్టిది, నా కోరిక ప్రకారం అవసరమైనప్పుడు ఆకాశమార్గంలో సంచరించగలది అయిన అద్భుతమైన విమానాన్ని నాకు ప్రసాదించు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=836 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౫(395)

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 

10.2-831-తే.
వసుధేశ! విను; మును వైదర్భి పరిణయ-
  వేళ దుర్మద శిశుపాలభూమి
వరునకుఁ దోడ్పడ నరుదెంచి సైనికా-
  వలితోడఁ దొడరి దోర్బలము దూలి
హరిచేత నిర్జితులైన రాజులలోనఁ-
  జైద్యుని చెలికాఁడు సాల్వభూమి
పతి జరాసంధాది పార్థివప్రకరంబు-
  విన మత్సరానల విపులశిఖల
10.2-831.1-తే.
"ధాత్రి నిటమీఁద వీతయాదవము గాఁగఁ
గడఁగి సేయుదు"నని దురాగ్రహముతోడఁ
బంతములు పల్కి యటఁ జని భరితనిష్ఠఁ
దపము కావింపఁ బూని సుస్థలమునందు.
10.2-832-క.
ధృతి వదలక యుగ్రస్థితిఁ
బ్రతిదినమునుఁ బిడికెఁ డవనిరజ మశనముగా
నతినియమముతో నా పశు
పతి, శంకరు, ఫాలనయను, భర్గు, నుమేశున్. 

భావము:
ఓ రాజా! రుక్మిణీ స్వయంవర సమయంలో శిశుపాలుడికి సహాయంగా సైన్యంతో సహా వచ్చి, కృష్ణుడిని ఎదిరించి, అతని చేత చావుదెబ్బలు తిని పరాజితులైన రాజులలో సాల్వుడు అనే రాజు ఒకడు. అతడు విపరీతమైన కోపంతో, మొండిపట్టుదలతో “యాదవులను అందరిని నాశనం చేస్తాను” అని జరాసంధాది రాజుల ఎదురుగా ప్రతిజ్ఞ చేసాడు. అటుపిమ్మట అతడు అత్యంత నిష్ఠతో ఒక ప్రశాంత ప్రదేశంలో ఈశ్వరుడిని గురించి తపస్సు చేయటానికి ఉపక్రమించాడు. అలా ఉపక్రమించిన సాల్వుడు ప్రతిదినం పిడికెడు దుమ్ము మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ పట్టుదలగా పరమేశ్వరుని గురించి భీకర తపస్సు చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=832 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, November 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౪(394)

( సుయోధనుడు ద్రెళ్ళుట) 

10.2-829-చ.
జనవరబంధమోక్షణముఁ జైద్యవధంబును బాండురాజ నం
దన మఖరక్షణంబును నుదారతఁ జేసిన యట్టి దేవకీ
తనయుచరిత్ర భాసుర కథా పఠనాత్ములు గాంతు రిష్ట శో
భన బహుపుత్త్ర కీర్తులును భవ్యవివేకము విష్ణులోకమున్."
10.2-830-క.
అని శుకయోగీంద్రుండ
మ్మనుజేంద్రునిఁజూచి పలికె మఱియును “శ్రీకృ
ష్ణుని యద్భుత కర్మంబులు
వినిపింతుం జిత్తగింపు విమలచరిత్రా! 

భావము:
రాజులను బంధవిముక్తులను చేయడం శిశుపాలుడిని వధించడం ధర్మజ్ఞుని యజ్ఞాన్ని రక్షించడం మొదలైన శ్రీకృష్ణుని విజయ గాథలను చదివినవారు కోరిన సౌభాగ్యాలనూ, కీర్తిని, దివ్యమైన జ్ఞానాన్ని వైకుంఠ వాసాన్ని పొందుతారు." ఇలా పలికిన శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా చెప్పసాగాడు. “నిర్మలమైన చరిత్రగల ఓ రాజా పరీక్షిత్తూ! శ్రీకృష్ణుడి అద్భుత కార్యాలను ఇంకా వివరిస్తాను శ్రద్దగా ఆలకించు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=62&Padyam=830 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౩(393)

( సుయోధనుడు ద్రెళ్ళుట) 

10.2-827-వ.
దామోదరానుమోదితులయి మహారవంబుగాఁ బరిహాసంబులు చేసిన సుయోధనుండు లజ్ఞావనతవదనుండై కుపితమానసుం డగుచు నయ్యెడ నిలువక వెలువడి నిజపురంబునకరిగె; నయ్యవసరంబున ధీవిశాలు రైన సభాసదులగు నచ్చటి జనంబుల కోలాహలంబు సంకులంబైన నజాతశత్రుండు చిత్తంబున విన్ననై యుండె; నప్పుండరీకాక్షుండు భూభార నివారణకారణుం డగుటంజేసి దుర్యోధను నపహాసంబునకుం గాదనండయ్యె; నంత.
10.2-828-క.
హరి ధర్మసుతుని వీడ్కొని
తరుణీ హిత బంధుజన కదంబము గొలువం
బరితోషమునఁ గుశస్థల
పురమునకుం జనియె మోదమున నరనాథా! 

భావము:
కృష్ణుడి ఆమోదంతో అక్కడున్న రాజులు స్త్రీ జనము భీముడితోపాటు పెద్దగా పకపకా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఘోరమైన అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సభాసదుల వేళాకోళంతో కూడిన కోలాహలాన్ని చూసిన ధర్మరాజు చిన్నపోయాడు. భూభారాన్ని నివారించడానికి అవతారం ధరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఖండించ లేదు. ఓ మహారాజా! ఆ తరువాత కృష్ణుడు ధర్మరాజును వీడ్కొని భార్యాబిడ్డలు, బంధుజనులు సేవిస్తుండగా సంతోషంగా కుశస్థలికి ద్వారకానగరానికి వెళ్ళాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=62&Padyam=828 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౨(392)

( సుయోధనుడు ద్రెళ్ళుట) 

10.2-824-వ.
అట్లు సనుదెంచి మయమాయామోహితంబైన సభాస్థలంబు నందు.
10.2-825-క.
సలిలములు లేని ఠావున
వలువలు వెస నెగయఁ దిగిచి వారక తోయం
బులు గల చోటనుం జేలం
బులు దడియఁగఁ బడియె నిజవిభుత్వము దఱుఁగన్
10.2-826-క.
ఆ విధమంతయుఁ గనుఁగొని
పావని నవ్వుటయు నచటి పార్థివులునుఁ గాం
తావలియును యమతనయుఁడు
వావిరిఁ జేసన్నఁ దమ్ము వారింపంగన్. 

భావము:
ఇలా వచ్చిన దుర్యోధనుడు మాయమయమైన మయాసభా మధ్యంలో ప్రవేశించి. ఆ మయాసభలో నీరులేని స్థలంలో కట్టుకున్న దుస్తులు పైకి ఎగగట్టుకుని; నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని; దుర్యోధనుడు భ్రమకు లోను అయ్యాడు. ఈవిధంగా భ్రమకులోనైన దుర్యోధనుడిని చూసిన భీమసేనుడు నవ్వాడు. అక్కడున్న రాజులూ స్త్రీ జనమూ ధర్మరాజు సైగ చేసి వారిస్తూ ఉన్నా... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=62&Padyam=826 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, November 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౧(391)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-822-సీ.
సుత సహోదర పురోహిత బాంధవామాత్య-
  పరిచార భటకోటి బలసి కొలువఁ
గలిత మాగధ మంజు గానంబుఁ బాఠక-
  పఠన రవంబునుఁ బ్రమద మొసఁగఁ
గంకణ ఝణఝణత్కారంబు శోభిల్ల-
  సరసిజాననలు చామరములిడఁగ
మయ వినిర్మిత సభామధ్యంబునను భాస-
  మాన సింహాసనాసీనుఁ డగుచు
10.2-822.1-తే.
నమర గణములు గొలువఁ బెంపారు ననిమి
షేంద్రుకైవడి మెఱసి యుపేంద్రుఁ డలర
సరసఁ గొలువున్న యత్తఱి దురభిమాని
క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు.
10.2-823-ఉ.
కాంచనరత్నభూషణ నికాయముఁ దాల్చి సముజ్జ్వలప్రభో
దంచితమూర్తి నొప్పి ఫణిహారులు ముందటఁ గ్రందువాయ వా
రించ సహోదరుల్‌ నృపవరేణ్యులు పార్శ్వములన్ భజింప నే
తెంచెను రాజసంబున యుధిష్ఠిరుపాలికి వైభవోన్నతిన్. 

భావము:
ధర్మరాజు మయసభ మధ్యలో ప్రకాశవంతమైన సింహాసనం మీద ఆసీనుడై కొలువుతీరి ఉండగా ఆయన పుత్రులు, తమ్ముళ్ళు, పురోహితులు, బంధుమిత్రులు, మంత్రులు, సేవకులు అయనను సేవిస్తున్నారు; వందిమాగధుల మధుర స్తోత్రాలు సంతోషాన్ని కలిగిస్తున్నారు; చేతి కంకణాలు మ్రోగుతుండ యువతులు వింజామరలు వీస్తున్నారు; అప్పుడు దేవతలు సేవిస్తుండగా ప్రకాశించే దేవేంద్రుడిలాగా కొలువుతీరి ఉన్నాడు; ఇలా కొలువుతీరి ఉన్న ధర్మరాజుని వీక్షించి శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ సమయంలో దురభిమాని అయిన దుర్యోధనుడు అక్కడకి వచ్చి సువర్ణమయములైన మణిభూషణాలు ధరించి రాజసం ఉట్టిపడే తేజస్సుతో సేవకులు ముందు నడుస్తూ జనాన్ని ఒత్తిగిస్తుండగా తమ్ముళ్ళు రాజులు ఇరువైపులా చేరి అనుసరించి సేవిస్తుండగా దుర్యోధనుడు వైభవోపేతంగా ధర్మరాజు సమక్షానికి విచ్చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=823 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Sunday, November 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౦(390)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-821-వ.
ఉండం గనుంగొని; యదియునుంగాక, యొక్కనాఁడు లలితాష్టమీ శశాంకబింబంబులం విడంబించుచు నింద్రనీలరుచినిచయంబు నపహసించు కుటిలకుంతలంబులు నటనంబు సలుపం దనరు నిటలఫలకంబులును, బుష్పచాపుచాపంబు రూపునేపుమాపు భ్రూయుగోపాంతంబులై సౌదామనీదామ రుచిస్తోమంబులై, కర్ణాంతసీమంబులై యంజనంబులతోడ రంజిల్లు నేత్రకంజంబులును, నవమల్లికాముకుళ విభాసిత దంతమరీచికా నిచయోద్దీపిత మందహాసచంద్రికాధవళితంబులును, ముకురోపమితంబులై కర్ణకుండలమణిమరీచి జాలంబులు బెరసి బహుప్రకారంబులఁ బర్వంబొలుచు కపోలపాలికలును, విలసిత గ్రైవేయక ముక్తాఫలహార నిచయంబుల కిమ్ముచూపక మిసమిసని పసగల మెఱుంగులు గిఱికొన మీటినంబగులు ననం బొగడందగి మొగంబులకుం బుటంబులెగయు నుత్తుంగపీనకుచభారంబుల వ్రేఁగు లాఁగలేక తూఁగాడుచుం గరతల పరిమేయంబులగు మధ్యభాగంబులును, ఘనజఘనమండ లావతీర్ణకాంచన కాంచీకలాప కింకిణీకలకల నినాదోల్లసితంబులగు కటిప్రదేశంబులును, సల్లలిత హల్లక పల్లవకాంతుల మొల్లంబులఁ గొల్లలుగొని యభిరామంబులై శోభిల్లు పదపాణితలంబులును, నలసగతులం బదంబులం దనరు మణినూపురంబులు గోపురంబులం బ్రతిస్వనంబు లొలయ మొరయ నలరు చరణారవిందంబులును, రత్నవలయ కంక ణాంగుళీయకాది వివిధ భూషణద్యుతినిచయంబు లుష్ణమరీచి కరనిచయంబుల ధిక్కరింప వెలుంగు కరకంజంబులును, మృగ మద ఘనసార హరిచందనాగరు కుంకుమపంకంబుల భాసురంబులగు వాసనలు నాసారంధ్రంబులకు వెక్కసంబులై పొలయు సౌభాగ్యంబులు గలిగి చైతన్యంబు నొందిన మాణిక్యపుబొమ్మల విధంబున గగన మండలంబు నిర్గమించి, వసుధాతలంబున సంచరించు చంద్రరేఖల చెలువున శృంగారరసంబు మూర్తీభవించిన జగంబుల మోహపఱచు మోహినీదేవతలచందంబున, విల సించు మాధవ వధూసహస్రంబుల సంగతిని సౌదామనీలతయునుం బోలె నొప్పుచుండెడు ద్రుపదరాజనందన విభవంబును రాజసూయ మహాధ్వరోత్సవంబునం జూచి చిత్తంబుత్తలపడ సుయోధనుండు సంతాపానలంబునం గ్రాఁగుచుండె; నంత నొక్కనాఁడు ధర్మనందనుఁడు నిర్మలంబగు సభాభవనంబునకుం జని. 

భావము:
ఒకనాడు మనోహరమైన అష్టమినాటి చంద్రబింబాల వంటి ఫాలభాగములతో; ఇంద్రనీలమణులను మించిన ముంగురులతో; మన్మథుడి ధనుస్సులవంటి కనుబొమ్మలతో; ఆకర్ణాంతములై తళతళ మెరుస్తున్న కాటుకకన్నులతో; విరజాజిమొగ్గల వంటి పలువరుసతో; చిగురు పెదవుల చిరునవ్వు వెన్నెలలతో; కర్ణకుండలాల కాంతులు జాలువారు చక్కని చిక్కని చెక్కిళ్ళతో; ముత్యాలహారములకు సైతం సందీయక మిసమిసలాడు ఉత్తుంగ పయోధరములతో; నకనకలాడు సన్నని నెన్నడుములతో; చిరుగజ్జెల సవ్వడులతో; కూడిన బంగారు ఒడ్డాణములు ప్రకాశించు కటి ప్రదేశాలతో; చిగురుటాకులవంటి అరచేతులతో; ఘల్లుఘల్లున మ్రోగుచున్న కాలి అందియలతో; రతనాల గాజులు, కంకణాలు ఉంగరాలు కాంతులీను కరకమలములతో; సుగంధాలు విరజిమ్ము కస్తూరి పచ్చకర్పూరము మంచిగంధము మైపూతలతో అలరారుతూ; ప్రాణాలతో ఉన్న మాణిక్యపు బొమ్మల చక్కదనాలతో; దివి నుండి భువికి దిగివచ్చిన చంద్రరేఖ తీరున శృంగారరసం మూర్తీభవించిన మోహినీదేవతల వలె విరాజిల్లుతున్న మిక్కిలి సౌందర్యవతు లైన శ్రీకృష్ణుడి సతుల నడుమ; మెరుపు తీగలా ప్రకాశిస్తూ ఉన్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ రాజసూయయాగ మహావైభవాన్నీ చూస్తున్న దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిండుకొలువు తీర్చి కూర్చున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=821 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Saturday, November 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౯(389)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-819-చ.
అనిన మునీంద్రుఁ డిట్లను ధరాధిపుతోఁ "గురురాజు పాండు నం
దనులదెసన్ననేక దురితంబులు నిచ్చలుఁ జేయుచుండు నై
నను, నొకనాఁడు పంకరుహనాభ దయాపరిలబ్ధభూరి శో
భనజిత దేవదైత్యనరపాలకరాజ్యరమామహత్త్వమై.
10.2-820-చ.
వెలయు ననూనసంపదల విశ్రుతకీర్తులు మిన్ను ముట్టఁ బెం
పలరిన పాండుభూవరసుతాగ్రజుఁ డంతిపురంబులోన ను
జ్జ్వలమణిభూషణాంశురుచిజాలము బర్వఁ బయోజనాభు ను
త్కలిక భజించుచున్ ఘనసుఖస్థితి భూరిమనోహరాకృతిన్. 

భావము:
ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. “దుర్యోధనుడు పాండవులకు ఎప్పుడూ అపకారమే చేస్తుంటాడు. అయినా శ్రీకృష్ణుని దయచేత కలిగిన దేవ, దానవ, నరులను పాలించే రాజ్య సంపదలను వైభవం కలవాడైన ధర్మరాజు మహదైశ్వర్యంతోనూ విశ్రుత యశస్సుతోనూ శ్రీకృష్ణుని దయవలన ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతఃపురంలో ఉజ్వలమైన రత్నవిభూషణాల వెలుగుల మధ్య బహు మనోజ్ఞంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని సేవిస్తూ... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=820 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Friday, November 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౮(388)

( ధర్మరాజాదుల అవబృథంబు ) 

10.2-816-ఆ.
రాజసూయమఖ వరప్రభావమునకు
నఖిలజనులు మోదమంది రపుడు
కలుషమానసుండు కులపాంసనుఁడు సుయో
ధనుఁ డొకండు దక్క ధరణినాథ! "
10.2-817-వ.
అనిన విని శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.
10.2-818-ఆ.
"అఖిల జనుల కెల్ల నానందజనకమై
యెనయు మఖము కురుకులేశ్వరునకుఁ
గర మసహ్యమైన కారణ మెయ్యది
యెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత! " 

భావము:
ఓ రాజా పరీక్షిత్తూ! కల్మషచిత్తుడు, వంశనాశకుడు అయిన దుర్యోధనుడు తప్పించి, తక్కిన సమస్త ప్రజలూ రాజసూయయాగ వైభవానికి సంతోషించారు.” అని చెప్పగా విని పరీక్షిత్తు శుకమునీంద్రునితో ఇలా అన్నాడు. “ఓ మహానుభావ! అందరికీ సంతోషాన్ని కలిగించే రాజసూయ యాగం దుర్యోధనుడికి ఎందుకని సహింపరానిది అయిందో నాకు వివరంగా చెప్పు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=818 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :