Wednesday, November 28, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 60

10.1-546-క.
అడుగులపైఁ బడు లేచున్
బడుఁ గ్రమ్మఱఁ లేచు, నిట్లు భక్తిన్ మును దాఁ
బొడగనిన పెంపుఁ దలఁచుచు
దుడుకని మహిమాబ్ధి నజుఁడు దుడు కడఁచె నృపా!
10.1-547-వ.
అంత నల్లనల్లన లేచి నిలుచుండి నయనారవిందంబులు దెఱచి, గోవిందుని సందర్శించి చతుర్ముఖుండు ముఖంబులు వంచి కృతాంజలియై దిగ్గన డగ్గుత్తిక యిడుచు నేకచిత్తంబున జతుర్ముఖంబుల నిట్లని స్తుతియించె.

భావము:
పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలపై అనేక సార్లు పడుతూ లేస్తూ ప్రణమిల్లాడు. భక్తిపరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలచుకుని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు. తరువాత, బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిలబడి కళ్ళు తెరచి గోవులను కాస్తున్న గోవిందుని దర్శనం చేసుకున్నాడు. తన ముఖాలు నాలుగూ వంచి చేతులు జోడించి డగ్గుత్తిక పడిన గొంతుతో ఏకాగ్రమైన మనస్సుతో నాలుగు నోరులారా ఇలా స్తుతించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=546

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 59

10.1-545-వ.
కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనుఱికి కనకదండ సుకుమారంబైన శరీరముతోడ నేలఁ జాగిలంబడి మణిగణ సుప్రకాశంబు లైన తన కిరీటశిఖరప్రదేశంబు లా కుమారుని పాదపద్మంబులు మోవ మ్రొక్కి తోరంబులగు నానందబాష్పజల పూరంబుల నతని యడుగులు గడిగి మఱియును.


భావము:
కృష్ణుడిని చూసి చూడగానే బ్రహ్మదేవుడు తత్తరపాటుతో హంసవాహనం నుండి దభాలున క్రిందికి దూకాడు. బంగారు శలాకు వలె రంగులీనుతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపై సాగిలపడ్డాడు. ఎన్నోమణులతో వెలుగుతున్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేలాగ మ్రొక్కేడు. ఆనందబాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా అతని పాదాలు కడిగాడు. ఆపైన....



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Monday, November 26, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 58

10.1-544-సీ.
తన కన్యములు లేక తనరారి ముమ్మూల; 
విభుడయ్యుఁ గ్రేపుల వెదకువాని
నఖిలజ్ఞుఁడై యొక్కఁడయ్యు నజ్ఞాకృతిఁ; 
జెలికాండ్రఁ బెక్కండ్రఁ జీరువాని
బహిరంతరాద్యంత భావశూన్యుండయ్యు; 
నంతంత నడుగు చొప్పరయువాని
గురుగభీరుండయ్యుఁ గురువులు వాఱుచు; 
నట్టిట్టు పాతరలాడువాని
10.1-544.1-ఆ.
జాతిరహితుఁ డయ్యుఁ జతుర గోపార్భక
భావ మెల్ల నచ్చుపడిన మేటి
చెలువువాని హస్త శీతాన్నకబళంబు
వానిఁ గాంచె నపుడు వాణిమగఁడు.

భావము:
పిమ్మట, సృష్టికి మూలము లైన త్రిగుణాలకూ ఆధారమూ, ప్రభువూ అయినవాడు; తనకు తాను ఒక్కడే అయినా, లేగల కోసం చూస్తూ వెతుకుతున్నాడు కృష్ణుడు. నర్వం తెలిసినవాడు తాను ఒక్కడే అయి సత్యం తానే అయినవా డైనా, ఎందరో స్నేహితులు ఉన్నట్లు పిలుస్తూ ఉన్నాడు. బయట లోపల మొదలు తుద అనే భావాలేవీ లేనివా డైనా, అక్కడక్కడా దూడల జాడలు వెదుకుతూ ఉన్నాడు, ఎంతో లోతైనవాడైనా, పరుగులు తీస్తూ ఇటూ అటూ చూస్తూ అడుగులు వేస్తున్నాడు, అతనికి జాతి అనేది లేదు అయినా, నేర్పరి అయిన గోపబాలుని లక్షణాలన్నీ చక్కగా అచ్చుపోసినట్లు ఉన్న శరిరంతో అందంగా వెలుగొందుతూ ఉన్నాడు. చేతిలో చల్ది అన్నపు ముద్ద పట్టుకుని ఉన్నాడు. ఇలా సర్వ లక్షణాలు మేళవించిన కృష్ణుని కేవలం వాక్కుకు మాత్రమే అధిపతియైన బ్రహ్మదేవుడు చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=542

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, November 25, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 57

10.1-542-శా.
బాలుండై చతురాననుండు తన యీ బ్రహ్మాభిమానంబునన్
లోలుండై మతిదప్పి నా మహిమ నాలోకింప నేతెంచెఁ దా
నాలోకింపఁగ నెంతవాఁ? డనుచు మాయాజాలమున్ విప్పి త
ల్లీలా రూపము లెల్ల డాఁచె నటఁ గేళీచాతురీధుర్యుఁడై.
10.1-543-వ.
అంతలోన నజీవుండు సజీవుండైన తెఱంగున నెనిమిది కన్నులు గల వేల్పుగమికాఁడు తేఱి తెప్పఱి కాలుఁ గేలుఁ గదలించి చెచ్చెరం గన్నులు విచ్చిచూడ సమర్థుండై ముందటఁ గని వెనుకఁ జూచి, దివి విలోకించి దిక్కులు వీక్షించి, యెల్లయెడలం గలయ దర్శించి తన పురోభాగంబున హరి సంచరించుటం జేసి జాతివైరంబు లేని నర పక్షి మృగాదులకు నాటపట్టయి సిరి గలిగి కామ క్రోధాది రహితులకు జీవనంబైన బృందావనంబుఁ బొడగాంచి; యందు.


భావము:
“ఈ బ్రహ్మదేవుడు తనకు నాలుగు తలలు ఉన్నాయి అనుకుంటున్నాడు. బాలభావంతో తన ఈ బ్రహ్మపదవిని చూచుకుని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నమైపోయి నా మహిమ ఎంతటిదో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమ చూడడానికి అతడు ఎంతో చిన్నవాడు కదా.” అని జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని విప్పివేసాడు. తాను సృష్టించిన లీలారూపాలు అన్నింటినీ అక్కడికక్కడే దాచేసాడు, మాయంచేసేసాడు. ఆటలాడడంలో గానీ ఆడించడంలో గాని ఆయన చాతుర్యం ఊహించరానిది. ఇంతలో అంతటి ఎనిమిది కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడూ, మృతిచెందినవాడు బ్రతికి వచ్చినట్లు, తేరుకుని తెప్పరిల్లాడు. కాళ్లు చేతులు కదలించి చూసుకున్నాడు. తరువాత కళ్ళు విప్పి చూడడానికి శక్తి వచ్చింది. ముందు వైపు వెనుక వైపు చూసుకున్నాడు. తలపైకెత్తి చూసుకున్నాడు. అన్ని దిక్కులకూ చూసాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూసాడు. ఎదుట బృందావనం కనిపించింది. కృష్ణుడు ఉండడం వలన నరులు, పక్షులు, జంతువులు, తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సిరి సంపదలు ఉన్నాయి. అందులో ఉన్న వారెవరికి కామక్రోధాలు లేవు. ఆ బృందావనం చూసాడు బ్రహ్మదేవుడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Saturday, November 24, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 56

10.1-540-ఉ.
ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోక ము
ద్ధీపిత మయ్యె నట్టి విభుతేజముఁ గన్నులఁ జక్కఁ జూడఁగా
నోపక పారవశ్యమును నొందుచు సంస్తిమితాఖిలేంద్రియుం
డై పరమేష్టి మైమఱచె నప్పుడు చిత్రపురూపుకైవడిన్.
10.1-541-వ.
ఇట్లు మాయాతీతుండును, వేదాంత విజ్ఞాన దుర్లభుండును, స్వప్రకాశానందుండునునైన తన బాహుళ్యంబుఁ జూచి నివ్వెఱ పడిన బ్రహ్మంగని యీశ్వరుండు.

భావము:
ఈసృష్టి అంతటికి పరముడైన ఈశ్వరుడు విష్ణుమూర్తి. తేజస్సు అనేది అతని నుండే పుట్టినది. దానివలన చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది కాంతిమంతమై కళ్ళకు కనపడుతోంది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే కనుక ఆ తేజస్సును బ్రహ్మదేవుడు కన్నులారా చూడలేకపోయాడు. అతడు పరవశించి పోయాడు. అన్ని ఇంద్రియాలూ వ్యాపార శూన్యములు అయిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు బొమ్మగీసినట్లు ఒడలు తెలియక నిశ్చేష్టుడయి నిలబడిపోయాడు. ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడిని చూసాడు. మాయకు అతీతుడు వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకని వాడు, తన ప్రకాశములో తాను ఆనందమై ఉన్నవాడు, అయిన పరబ్రహ్మ విశ్వరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు నివ్వెరపోవడం గమనించాడు. గమనించి. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=540

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, November 23, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 55

10.1-538-ఉ.
బాలురఁ గంటి నాచెయిది బాసినవారిని మున్ను వారి నేఁ
బోలఁగఁ జూచునంతటన భూరినిరర్గళదుర్గమప్రభా
జాలముతోడఁ జూపులకుఁ జాలమిఁ దెచ్చుచు నున్నవార; లే
మూలమొ మార్గమెయ్యదియొ? మోసము వచ్చెఁగదే విధాతకున్.
10.1-539-వ.
అని సకలేంద్రియంబులకు వెక్కసంబైన స్రుక్కి.


భావము:
“నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందు నుంచీ చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారు. ఆ తేజస్సు మహా ప్రవాహం లాగ చూపులతో నైనా సమీపించడానికి వీలుకాకుండా ఉంది. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలటం లేదు. దీనికి అంతటికి మూలకారణం ఏమిటి? ఇప్పుడు నేనేమిటి చేయడం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడను నాకే మోసం వచ్చింది కదా.” ఆ బాలుర రూపాలు బ్రహ్మదేవుని ఇంద్రియాల అన్నిటికీ భరించరానివి అయిపోయాయి. చూసి చూసి అతడు చేష్టలు దక్కి డస్సి పోయాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Thursday, November 22, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 54

10.1-537-వ.
అని యిట్లు తలవాకిట వాణి గల పోఁడిమిచే వాఁడిమి కెక్కిన నలుమొగంబుల తక్కరిగొంటు పెనుదంట పలువెంటలైన తన మనంబున వితర్కించి, విచారించు నెడ, నతండు కనుగొనుచుండ నబ్బాలకులు మేఘశ్యాములును, హార కుండల కిరీట వనమాలికాభిరాములును, శ్రీవత్స మంగళాంగద నూపుర కనక కటక కంకణ కటిఘటిత కాంచీగుణోద్దాములును, నాపాదమస్తక తులసీదళదాములును, విలస దంగుళీయకస్తోములును, శంఖ చక్ర గదా కమల హస్తులును, జతుర్భుజప్రశస్తులును పీతకౌశేయవాసులును, చంద్రికాధవళహాసులును, కరుణాకటాక్షవీక్షణ విలాసులును, రవికోటిభాసులును, ననంత సచ్చిదానందరూప మహితులును, యణిమాదిగుణోపేతులును, విజాతీయభేదరహితులును, శ్రీమన్నారాయణ ప్రతిమాన విగ్రహస్వరూపులునై తమకుఁ బరతంత్రులగుచు నృత్తగీతాది సేవావిశేషంబులకుం జొచ్చి మెలంగుచు మూర్తిమంతంబు లయిన బ్రహ్మాదిచరాచరంబులును, నణిమాదిసిద్ధులును, మాయాప్రముఖంబులయిన శక్తులును, మహదాది చతుర్వింశతి తత్వంబులును, గుణక్షోభకాలపరిణామ హేతుసంస్కారకామ కర్మగుణంబులును సేవింప వేదాంతవిదులకయిన నెఱుంగరాని తెఱంగున మెఱయుచుఁ గానబడిన వారలం గనుంగొని. 
చతుర్వింశతి తత్వాలు

భావము:
అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అతను తన తలవాకిట సరస్వతి ఉన్నదనే అభిమానం వలన కొంత గర్వపడుతూండే వాడు. నాలుగు మొగాలున్న ఆ మహా మాయగాడు జంకి వెనుకకు తగ్గుతూ, తన మనస్సులో ఎన్నోరకాలుగా ఆలోచించి చూసాడు. ఒకసారి బాలుర వంక చూసాడు. అందరూ మేఘశ్యామల మూర్తులూ, హారాలు కుండలాలు కిరీటాలు వైజయంతీమాలికలూ ధరించి చాలా అందంగా ఉన్నారు; వక్షస్థలం పైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, శుభకరాలైన బాహుపురుషులు, కాలిగజ్జెలు, బంగారు కడియాలు, నడుములకు కాంచీకలాపాలతో కనిపిస్తూ బ్రహ్మదేవుడిని బెదరగొట్టారు; పాదాలనుండి శిరస్సులవరకూ తులసీ దళాల మాలలు ధరించారు; వ్రేళ్ళకు రవ్వల ఉంగరాలు మెరుస్తున్నాయి; అందరికీ నాలుగేసి బాహువులు ఉన్నాయి; నాలుగు చేతులలో శంఖం, గద, చక్రం, పద్మం ధరించి ఉన్నారు; బంగారు పట్టువస్త్రాలు ధరించి ఉన్నారు; వెన్నెలవంటి చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు; కన్నుల నుండి కరుణాకటాక్షాలు వెలువడుతున్నాయి; కోటిసూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు; సచ్ చిత్ ఆనందాలు తామే అయిన అనంత రూపాలతో విలసిల్లుతున్నారు; అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అనబడే ఎనిమిది అష్టసిద్ధుల గుణాలూ తమలోనే ధరించి ఉన్నారు; అందరూ అంతర్యామి స్వరూపులే కనుక, ఇది పరాయిది అనే భేదం వారికి లేదు; లక్ష్మీదేవితో కూడిన నారాయణుని ప్రతిబింబా లైన రూపాలతో విలసిల్లుతున్నారు; సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుండి చరాచర జీవరాశులు; అణిమ మొదలైన సిద్ధులు, మాయ, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొదలైన ఇరవైనాలుగు తత్వాలు; మూడు గుణముల కలయిక, కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము, వాని గుణాలు ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపు లైన బాలకులకు లోబడి సేవిస్తూ ఉన్నాయి; వేదాంత మంతా తెలిసినవారికి ఐనా ఈ విశ్వరూపాలు తెలియవు. ఈవిధంగా దేదీప్య మానంగా ప్రకాశిస్తూన్న బాలురను బ్రహ్మదేవుడు చూసాడు. చూసి ఇలా అనుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=537

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 53

10.1-534-తే.
పగలు ఖద్యోతరుచి చెడుపగిది రాత్రి
మంచు చీఁకటి లీనమై మాయుమాడ్కి
విష్ణుపై నన్యమాయలు విశద మగునె? 
చెడి నిజేశుల గరిమంబుఁ జెఱుచుఁ గాక.
10.1-535-వ.
మఱియును.
10.1-536-క.
"పుట్టితి; బుద్ధి యెఱింగితిఁ; 
బుట్టించితి జగము; సగము పోయెను బ్రాయం; 
బిట్టివి నూతన సృష్టులు 
పుట్టుట లే; దౌర! యిట్టి బూమెలు భూమిన్."


భావము:
పగటివేళ సూర్యుడి ముందు మిణుగురు పురుగుల కాంతి తేలిపోతుంది. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమై పోతుంది. అలాగే మాయకే పుట్టినిల్లు అయిన విష్ణుమూర్తి మీద ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు సర్వం వస చెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి తప్ప. అంతట “ఏనాడో పుట్టాను. పుట్టిన తరువాత బుద్ధి తెలిసింది ఈ జగత్తు అంతటినీ పుట్టించాను. వయస్సు సగం గడచిపోయింది. ఇంతవరకూ ఇలా క్రొత్త సృష్టులు పుట్టడం ఎప్పుడూ ఎరుగను. ఔరా! నేను పుట్టించిన ఈ భూమి మీద నాకు అందని ఇన్ని మాయలా?”



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Wednesday, November 21, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 52

10.1-532-వ.
అని యిట్లు సకలంబును సుకరంబుగ నెఱింగెడి నెఱవాది ముదుక యెఱుకగలప్రోడ వెఱంగుపడి గ్రద్దనఁ బెద్దప్రొద్దు తద్దయుం దలపోసి కర్జంబు మందల యెఱుంగక కొందలపడుచు నాందోళనంబున.
10.1-533-క.
మోహము లేక జగంబుల
మోహింపఁగఁ జేయ నేర్చి మొనసిన విష్ణున్
మోహింపించెద ననియెడు
మోహమున విధాత తాన మోహితుఁ డయ్యెన్.

భావము:
ఇలా ఈ గొల్లపిల్లలు దూడలు గురించి అలోచించుకుంటూ, సర్వస్వాన్ని తేలికగా తెలుసుకోవడంలో నేర్పరి అయిన అ పితామహుడు, ఆ జ్ఞానవృద్ధుడు, ఆ బ్రహ్మదేవుడు నివ్వెరపోయాడు. కంగారుపడి తనలోతాను అలోచించుకున్నా ఏం చేయాలో తెలియ లేదు. బిక్కమొగం వేసి, ఆందోళన పడసాగాడు. శ్రీహరి మోహం అంటని వాడు. కానీ తాను సర్వ జగత్తులను మోహింపచేయ గల నేర్పరి. అటువంటి విష్ణువునే మోహింప చేద్దాం అనుకొని మోహపడిన బ్రహ్మదేవుడు తానే మోహంలో పడ్డవాడు అయిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=533

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 51

10.1-530-శా.
“మందం గల్గిన వత్సబాలకులు నా మాయా గుహాసుప్తులై
యెందుం బోవరు; లేవ రిప్పుడును; వేఱే చేయ నా కన్యు లొం
డెందున్ లేరు; విధాతలుం బరులు; వీ రెవ్వార లెట్లైరొకో? 
యెం దేతెంచిరొ కృష్ణుతో మెలఁగువా? రేఁడయ్యెడిన్ నేఁటికిన్.
10.1-531-మత్త.
బ్రహ్మపంపునఁ గాని పుట్టదు ప్రాణిసంతతి యెప్పుడున్
బ్రహ్మ నొక్కఁడ గాని వేఱొక బ్రహ్మ లేఁడు సృజింపఁగా 
బ్రహ్మ నేను సృజింప నొండొక బాలవత్సకదంబ మే
బ్రహ్మమందు జనించె? నొక్కట బ్రహ్మమౌ నది చూడఁగాన్.”

భావము:
ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలూ అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు. ఎక్కడకీ పోలేదు. మళ్లీ ఎవరైనా సృష్టి చేసారు అనుకుందాం అంటే; నేను తప్ప సృష్టికర్తలు అయిన బ్రహ్మలు ఇంక ఎవరూ లేరు కదా. మరి వీరెవరు? ఎలా వచ్చారో? నేటికి భూలోకంలో ఏడాది గడిచింది. మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళంతా ఎక్కడ నుంచి వచ్చారో? బ్రహ్మదేవుడు సృష్టిస్తే గాని ఈ జీవరాసు లేవీ పుట్టవు కదా. సృష్టి చేసే బ్రహ్మదేవుడు అంటే నేనొక్కడినే గాని మరింకొకడు లేడు కదా. బ్రహ్మదేవుడుగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరేవి ఎలా వచ్చాయి? వీటిని ఏ బ్రహ్మదేవుడు సృష్టించాడు? అందరిలోనూ ఒక్కటిగా ఉండే పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=531

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, November 18, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 50

10.1-529-వ.
ఇట్లు విజ్ఞానదష్టిం జూచి యెఱింగియు నమ్మక బలదేవుండు గొందలపడుచుఁ గృష్ణుం జూచి “మహాత్మా! తొల్లి యెల్ల క్రేపులును ఋషుల యంశం బనియును గోపాలకులు వేల్పుల యంశం బనియును దోఁచుచుండు; నిపుడు వత్సబాలకసందోహంబు సందేహంబు లేక నీవ యని తోఁచుచున్నది; యిది యేమి?” యని యడిగిన యన్నకు నున్నరూపంబు వెన్నుండు మన్ననఁ జేసి క్రన్నన నెఱింగించె నతండు నెఱింగె; యివ్వింధంబున హరి బాల వత్సంబులు దాన యై సంచరించిన యేఁడు విరించికిఁ దన మానంబున నొక్క త్రుటిమాత్రం బైన విరించి చనుదెంచి వత్సబాలకాకారుండైన కృష్ణబాలకుం జూచి వెఱంగుపడి యిట్లని వితర్కించె.


భావము:
ఇలా యోగదృష్టితో చూసినప్పటికీ బలరాముడు నమ్మలేక కంగారుపడ్డాడు. కృష్ణుని ఇలా అడిగాడు. “మహాత్మా! ఇంతకు ముందు వరకూ లేగదూడలన్నీ ఋషుల అంశలతో జన్మించినవి అనీ, గోపాలకులు అందరూ దేవతల అంశలు అనీ నాకు అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చూస్తే లేగలూ బాలకులూ అందరూ నిస్సందేహంగా నీవే అని నాకు అనిపిస్తున్నది, కనిపిస్తున్నది ఈ వింత ఏమిటి” ఇలా అడగ్గానే కృష్ణుడు అన్నగారి యెడల అనుగ్రహంతో ఉన్న రహస్యం విప్పి చెప్పాడు. బలరాముడు గ్రహించాడు. ఈవిధంగా శ్రీహరి బాలురు లేగలు తానే అయి చరించినది ఒక ఏడాది. ఆ కాలం బ్రహ్మదేవునికి తన కాలమానం ప్రకారం ఒక్క తృటి కాలంగా కనిపించింది. అతడు వచ్చి దూడల రూపంలోనూ, బాలకుల రూపంలోనూ కనిపిస్తున్న బాలకృష్ణుని చూసి నివ్వెరపోయి ఇలా ఆలోచించుకున్నాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Saturday, November 17, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 49

10.1-528-క.
అని మున్ను ముగ్దుఁ డయ్యును
దన యందుల దివ్యదృష్టిఁ దప్పక బుద్ధిన్
దన చెలికాండ్రను గ్రేపుల
వనజాక్షుం డనుచుఁ జూచె వసుధాధీశా!

భావము:
బలరాముడు ఇలా ఆలోచించి ఇంతవరకూ మోహంచెంది ఉన్నప్పటికీ, ఇప్పుడు దివ్యదృష్టితో శ్రద్ధగా చూసాడు. తన స్నేహితులు లేగదూడలు అన్నీ కృష్ణుడే అని గ్రహించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=72&padyam=528

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 48

10.1-527-సీ.
చన్ను మానిన యట్టి శాబకశ్రేణిపై; 
గోగణంబులకును గోపకులకు
నిబ్బంగి వాత్సల్య మెబ్బంగి నుదయించె? ;
హరిఁ దొల్లి మన్నించునట్లు వీరు
మన్నించు చున్నారు మమతఁ జేయుచుఁ బ్రీతి; 
నంబుజాక్షునిఁ గన్న యట్లు నాకుఁ 
బ్రేమయయ్యెడి, డింభబృందంబుఁ గనుఁగొన్న; 
నిది మహాద్భుత మెందు నెఱుఁగరాదు
10.1-527.1-తే.
మనుజ దైవత దానవ మాయ యొక్కొ? 
కాక నా భర్త యగుచున్న కమలనయను
మాయయో గాక యితరులమాయ నన్నుఁ
గలఁప నోపదు; విభుమాయ కాఁగ నోపు.


భావము:
“తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న బిడ్డల మీదా దూడల మీదా గోపకులకు ఆవులకు ఇంత అధికంగా వాత్సల్యం ఎలా పుట్టుకొచ్చింది; వీరు ఇదివరకు కృష్ణుని ఎడల మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో, ఇప్పుడు తమ బిడ్డలపైన ఆ విధమైన ప్రేమ చూపుతున్నారు. నాకు కూడ ఈ బిడ్డలను లేగలను చూస్తుంటే కృష్ణుని చూసినట్లే ప్రేమా, ఇష్టాలు కలుగుతున్నాయి. ఇది ఏమిటో మహా అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు ఇలా ఎన్నడూ ఎరుగను. మానవులు గానీ దానవులు దేవతలు కానీ చేసిన మాయ కాదు కదా. లేక నా స్వామి అయిన విష్ణుమూర్తి యొక్క మాయ యేమో. నా స్వామి మాయే అయి ఉంటుంది.”



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Wednesday, November 14, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 47

10.1-526-వ.
ఇట్లు బాలకాలింగనంబుల నానందబాష్పపూరిత నయనులై గోపకులు గోవుల మరలించుకొని తలంగిచన వారలం జూచి బలభ ద్రుండు తనలోఁ నిట్లని తలంచె.


భావము:
ఈ విధంగా కుమారులను కౌగలించుకోవడంతో కలిగిన ఆనందబాష్పాలతో నిండిన కన్నులతో గోపకులు కుమారులను వదలిపెట్టి గోవులను మళ్ళించుకుని దూరంగా వెళ్ళిపోయారు. వారిని చూసి బలరాముడు ఇలా అనుకున్నాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Sunday, November 11, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 46

10.1-524-వ.
అంత గోపకులు గోవుల వారింప నలవి గాక దిగ్గన నలుకతోడి సిగ్గు లగ్గలంబుగ దుర్గమ మార్గంబున వానివెంట నంటి వచ్చి లేఁగల మేపుచున్న కొడుకులం గని.
10.1-525-ఉ.
అయ్యలఁ గంటి మంచుఁ బులకాంకురముల్ వెలయంగఁ గుఱ్ఱలం
జయ్యన డాసి యెత్తికొని సంతస మందుచుఁ గౌగలింపఁ దా
రయ్యెడ నౌదలల్ మనము లారఁగ మూర్కొని ముద్దు చేయుచున్
దయ్య మెఱుంగు; గోపకులు దద్దయు నుబ్బిరి నిబ్బరంబుగన్.

భావము:
ఇంతవరకూ తమ మాటలను ఆవులు ధిక్కరించేవి కాదు. అలాంటిది అలా వచ్చిన ఆవులను ఆపుచేయడం, గోపకులకు సాధ్యం కాలేదు. వారికి కోపంతోపాటు సిగ్గు కూడా కలిగింది. వాటి వెనుకనే తుప్పల వెంట బండల పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. లేగలను మేపుతున్న తమ బిడ్డలను చూసారు. మమతలతో వారు కోపాలు సిగ్గులు అన్నీ మరచిపోయారు. “మా చిన్ని అయ్యలను చూడగలిగాము” అంటూ బిడ్డల వద్దకు చేరి వారిని ఎత్తుకున్నారు. ఒడలంతా పులకలెత్తుతుండగా సంతోషంతో కౌగలించుకుని తలలను మూర్కొని ముద్దులు చేసారు. బిడ్డలలో ఉన్న దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లు ఎంతో సంతోషంతో పొంగిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=71&padyam=525

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :