Sunday, May 31, 2020

ఉషా పరిణయం - 12

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-346-వ.
అని యొడంబఱిచి మిలమిలని మంచుతోడం బురుడించు ధళధళ మను మెఱుంగులు దుఱంగలిగొను పటంబు నావటంబు సేసి, వజ్రంబున మేదించి, పంచవన్నియలు వేఱువేఱ కనక రజత పాత్రంబుల నించి కేలం దూలిక ధరించి యొక్క విజనస్థలంబునకుం జని ముల్లోకంబులం బేరు గలిగి వయో రూప సంపన్నులైన పురుషముఖ్యుల నన్వయ గోత్ర నామధేయంబులతోడ వ్రాసి, యాయితంబయిన యప్పటంబు దన ముందటఁ దెచ్చి పెట్టి, “యిప్పటంబునం దగులని వారు లేరు; వారిం జెప్పెద, సావధానంబుగ నాకర్ణింపు” మని యిట్లనియె.

భావము:
ఈ మాదిరిగా ఉషాకన్యకు చెప్పి ఒప్పించిన చిత్రరేఖ, మంచువలె కాంతివంతమైన తెల్లని పటాన్ని పొందుపరచింది. ఐదు రంగులను బంగారు వెండి పాత్రలలో నింపుకున్నది. కుంచెను చేత పట్టి, ఏకాంతప్రదేశానికి వెళ్ళి ముల్లోకాలలో ప్రసిద్ధిగాంచిన సౌందర్యవంతుల చిత్రాలను, వారి వారి గోత్రనామాలతోపాటు సిద్ధం చేసింది. ఆ పటాన్ని ఉషకు తెచ్చి చూపించి "ఈ చిత్రపటంలో లేనివాడు ఈ లోకంలో లేడు వీరిని గూర్చి వివరిస్తాను విను". అని చిత్రరేఖ ఇలా చెప్పనారంభించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=346

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 11

( ఉషాకన్య స్వప్నంబు  )

10.2-344-వ.
అనుచు నమ్మత్తకాశిని చిత్తంబు చిత్తజాయత్తంబయి తత్తరంబున విరహానలం బుత్తలపెట్టఁ గన్నీరుమున్నీరుగా వగచుచు విన్ననైన వదనారవిందంబు వాంచి యూరకున్నఁ జిత్రరేఖ దన మనంబున న య్యింతి సంతాపంబు చింతించి యిట్లనియె.
10.2-345-చ.
సరసిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వ మేర్పడన్
నర సుర యక్ష కింపురుష నాగ నభశ్చర సిద్ధ సాధ్య కి
న్నరవర ముఖ్యులం బటమునన్ లిఖియించినఁ జూచి నీ మనో
హరుఁ గని వీడె పొమ్మనిన నప్పుడె వానిని నీకుఁ దెచ్చెదన్.

భావము:
ఇలా చెలికి చెప్పిన ఉషాసుందరి తన మనస్సు మన్మథ వేదనతో, విరహనలం అధికం కాగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తలవంచుకుని ఊరకున్నది. చిత్రరేఖ ఉషాకుమారి సంతాపాన్ని గ్రహించి ఇలా పలికింది. “ఓ పద్మాక్షీ! ఉషా! ఎందుకు విచారిస్తావు. నా నేర్పరితనం అంతా చూపిస్తాను. దేవ, మానవ, యక్ష, కిన్నర, సిద్ధ, సాధ్య శ్రేష్ఠుల చిత్రపటాలను వ్రాసి నీకు చూపిస్తాను. వారిలో నీ మనసు దోచుకున్నవాడు ఎవరో నీవు గుర్తిస్తే, ఆ వెంటనే వాడిని నీ చెంతకు తీసుకుని వస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=325

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, May 29, 2020

ఉషా పరిణయం - 10

( ఉషాకన్య స్వప్నంబు )

10.2-341-వ.
ఇవ్విధంబునఁ జిత్రరేఖం గనుంగొని యిట్లనియె.
10.2-342-చ.
“చెలి కలలోన నొక్క సరసీరుహనేత్రుఁడు రత్నహార కుం
డల కటకాంగుళీయక రణన్మణినూపురభూషణుండు ని
ర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీలదేహుఁ డు
జ్జ్వలరుచి నూతనప్రసవసాయకుఁ డున్నతవక్షుఁ డెంతయున్.
10.2-343-చ.
నను బిగియారఁ గౌఁగిట మనం బలరారఁగఁ జేర్చి మోదముం
దనుకఁగ నంచితాధరసుధారస మిచ్చి మనోజకేళికిం
బనుపడఁ జేసి మంజుమృదుభాషలఁ దేలిచి యంతలోననే
చనియెను దుఃఖవార్ధిఁ బెలుచన్ ననుఁ ద్రోచి సరోరుహాననా!”

భావము:
అలా చిరుసిగ్గుతో చూస్తూ, ఉష చిత్రరేఖతో ఇలా పలికింది. “సఖీ! నాకొక కలవచ్చింది. ఆ కలలో రత్నాల హరాలు, కర్ణకుండలాలూ, కంకణాలు, ఉంగరాలు, మణులు పొదగిన గలగలలాడే కాలి అందెలు మున్నగు వివిధాలంకార శోభితుడూ, స్వచ్ఛమైన బంగారు వస్త్రాలు ధరించిన వాడూ, సుకుమార శరీరుడూ, నీలవర్ణుడూ, ఉన్నత వక్షుడూ, అభినవ మన్మథుడూ అయిన ఒక నవయువకుడు కనిపించాడు. ఓ కలువల వంటి కన్నులున్న చెలీ! ఆ వన్నెకాడు నన్ను గాఢంగా కౌగలించుకుని, ఆనందంగా అధరామృతం అందించాడు. మృదువుగా సంభాషించాడు. మన్మథ విలాసంలో ముంచితేల్చి ఆనందం కలిగించి, అంతలోనే నన్ను దుఃఖసాగరంలో ముంచి మాయమయిపోయాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=343

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 9


( ఉషాకన్య స్వప్నంబు  )

10.2-336-వ.
అంత.
10.2-337-తే.
బలితనూభవుమంత్రి కుంభాండుతనయ
తన బహిఃప్రాణ మిది యనఁ దనరునట్టి
కామినీ మణి ముఖపద్మకాంతి విజిత
శిశిరకర చారు రుచిరేఖ చిత్రరేఖ.
10.2-338-వ.
కదియవచ్చి య బ్బాల నుపలక్షించి.
10.2-339-తే.
భామినీమణి! సొబగుని బయల వెదకు
విధమునను నాత్మ విభుఁ బాసి విహ్వలించు
వగను జేతికి లోనైనవానిఁ బాసి
భ్రాంతిఁ బొందిన భావంబు ప్రకటమయ్యె.
10.2-340-తే.
వనిత! నా కన్న నెనరైన వారు నీకుఁ
గలుగ నేర్తురె? నీ కోర్కిఁ దెలియఁ జెప్ప
కున్న మీయన్నతో డన్నఁ గన్నుఁగవను
నలరు నునుసిగ్గుతో నగ వామతింప.
10.2-341-వ.
ఇవ్విధంబునఁ జిత్రరేఖం గనుంగొని యిట్లనియె.

భావము:
ఆ సమయంలో బలికొడుకు బాణాసురుడి యొక్క మంత్రి అయిన కుంభాండకుని కుమార్తె చంద్రరేఖ ఉషాకన్యకు ప్రాణసఖి, బహిఃప్రాణం. ఆ మింటనున్న చంద్రరేఖను మించిన సౌందర్యవతి ఈ చిత్రరేఖ. ఆమె ఇదంతా గమనించి ఆ ఇష్టసఖి ఉషాబాల దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా అన్నది. “ఓ యువతీ రత్నమా! నీ ప్రవర్తన చూస్తుంటే ప్రియుడి కోసం దిక్కులు చూస్తూ వెతుకుతున్నట్లూ, ప్రాణేశ్వరుడికి దూరమై బాధ చెందుతున్నట్లూ, చేతికి చిక్కిన వానిని కోల్పోయి భ్రాంతిలో మునిగినట్లూ కనబడుతోంది. సఖీ! నా కంటె దగ్గర వారు నీకు ఎవరు ఉన్నారు చెప్పు. నాకు నీ మనసులోని విషయం చెప్పకపోతే ఒట్టు” అని చిత్రరేఖ పలుకగా ఉషాసుందరి కళ్ళలో సిగ్గుతో కూడిన చిరునవ్వు దోబూచులాడగా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=340

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, May 27, 2020

అన్నమయ్య శతగళార్చన 2020 । Annamayya Satagalaarchana 2020





OM Namo Venkatesaaya 🙏



Catch Annamayya Satagarlarchana 2020 streaming live with 100 voices as one collaborating digitally. Plus Kids live keertana performances. Kindly share the YouTube link (mentioned below) with your family and friends.



YouTube Link: https://bit.ly/3gnfnyV



Date and Time: As per your timezone-

India: 30th May, 6:30AM IST

Singapore : 30th May, 9:00AM SHT

New Zealand : 30th May, 1:00PM

NZT

Australia : 30th May, 11:00AM ACT

USA: 29th May, 6:00PM PST



Let’s immerse ourselves in the divine rendition of Annamacharya Sankirtanas 🙏



Telugu Bhagavata Prachara Samiti

Saturday, May 23, 2020

ఉషా పరిణయం - 8

( ఉషాకన్య స్వప్నంబు )

10.2-332-వ.
ఇట్లు విరహవేదనా దూయమాన మానసయై యుండె; నంత నెచ్చెలులు డాయం జనుదెంచినం దన మనంబునం బొడము మనోజవికారంబు మఱువెట్టుచు నప్పుడు.
10.2-333-చ.
పొరిఁబొరిఁ బుచ్చు నూర్పుగమిఁ బుక్కిటనుంచి కుచాగ్రసీమపై
బెరసిన సన్న లేఁజెమటబిందువు లొయ్యన నార్చుఁ గన్నులం
దొరఁగెడు బాష్పపూరములు దొంగలిఱెప్పల నాని చుక్కలం
దరుణులు రండు చూతమని తా మొగ మెత్తును గూఢరాగ యై.
10.2-334-వ.
ఇవ్విధంబునం జరియించుచుండె నట్టియెడ.
10.2-335-తే.
అంతకంతకు సంతాప మతిశయించి
వలుఁద చన్నులు గన్నీటి వఱదఁ దడియఁ
జెలులదెసఁ జూడఁ జాల లజ్జించి మొగము
వాంచి పలుకక యుండె న వ్వనరుహాక్షి.

భావము:
ఇలా ఆ ఉషాబాల విరహవేదనతో బాధపడుతున్నది. ఇంతలో చెలికత్తెలు ఆమె చెంతకు రాగా, తన మనోవికారాన్ని వాళ్ళకు తెలియకుండా దాచుతున్నది వస్తున్న నిట్టూర్పులను అణచుకున్నది. వక్షోజాలపై పొడసూపిన చిరుచెమటను తుడిచి వేసింది. నేత్రాల నుండి జారనున్న కన్నీటిని రెప్పల క్రింద ఆపి, నక్షత్రాలను చూద్దాం రండని స్నేహితురాండ్రను పిలిచి ఆ వంకతో ముఖం పైకెత్తింది. ఇలా తన అనురాగం బయటపడకుండా దాచుతున్నది. ఈ మాదిరిగా ఆ ఉషాబాల కాలం గడుపుతున్న సమయంలో ఆ పద్మాల వంటి కన్నులు గల కన్య అంతకంతకూ సంతాపం అధికమై వక్షోజాలపై కన్నీరు కాల్వలు కట్టగా చెలికత్తెల వైపు కన్నెత్తి చూడడానికి చాల సిగ్గుపడి ముఖం వంచుకుని మాట్లాడకుండా ఉండిపోసాగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=335

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 7

( ఉషాకన్య స్వప్నంబు  )

10.2-329-వ.
మఱియును.
10.2-330-చ.
సరసమృదూక్తులుం గుసుమసాయకకేళియు శాటికా కచా
కరషణముల్‌ నఖక్రియలుఁ గమ్రకపోల లలాట మేఖలా
కర కుచ బాహుమూలములుఁ గైకొని యుండుట లాదిగాఁ దలో
దరి మది గాఢమై తగిలె దర్పకుఁ డచ్చుననొత్తినట్లయై.
10.2-331-సీ.
కలికిచేష్టలు భావగర్భంబు లైనను;
బ్రియుమీఁది కూరిమి బయలుపఱుపఁ
బిదపిదనై లజ్జ మదిఁ బద నిచ్చినఁ;
జెలిమేనఁ బులకలు చెక్కు లొత్త
మదనాగ్ని సంతప్త మానస యగుటకు;
గురుకుచహారవల్లరులు గందఁ
జిత్తంబు నాయకాయత్తమై యుంటకు;
మఱుమాట లాడంగ మఱపు గదుర
10.2-331.1-తే.
నతివ మనమున సిగ్గు మోహంబు భయముఁ
బొడమ నునుమంచు నెత్తమ్మిఁ బొదువు మాడ్కిఁ
బ్రథమచింతాభరంబునఁ బద్మనయన
కోరి తలచీర వాటింప నేరదయ్యె.

భావము:
ఇంకా మృదుసరస సంభాషణలూ; మన్మథ లీలలూ; కొంగు, శిరోజాలు లాగటం; కపోల, లలాట, బాహుమూల, కుచాదుల మీద గోటిగుర్తులూ వంటివి అన్నీ ఆమె మనస్సులో గాఢ ముద్రవేశాయి. ఆ యువకుడు అచ్చంగా మన్మథుడిలాగా వచ్చి ఆమెను గ్రుచ్చి కౌగలించినట్లే ఆమెకు అనిపించింది. ఉషాబాల చేష్టలు ఎంతో భావగర్భితం కావడంతో, ప్రియునిపై ప్రేమ వ్యక్తమౌతూ ఉంది. మనస్సు లోపల లజ్జ పొడముతుంటే, శరీరం మీద పులకాంకురాలు మొలకలెత్తాయి. మదనాగ్నికి ఆమె హృదయం తపించినందుకు గుర్తుగా, వక్షస్థలం మీద ఉన్న హారాలు కందిపోయాయి. హృదయం నాయకాధీనము కావడంతో, నెచ్చెలులకు బదులు పలకడం మరచిపోయింది. ఆ ఉషాకన్య హృదయంలో మోహం, సిగ్గు, భయం, ఉద్భవించాయి. అందువల్ల ఆమె మంచు క్రమ్మిన పద్మంలాగ శోభించింది. ప్రియుని గూర్చిన శృంగార చేష్టలలో మొదటిదైన చింతతో ఆ బాల తలమీద మేలి ముసుగు కూడా ధరించటంలేదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=331

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, May 20, 2020

ఉషా పరిణయం - 6

( ఉషాకన్య స్వప్నంబు )

10.2-327-సీ.
ఆ దానవేశ్వరు ననుఁగుఁ గుమారి యు;
షాకన్య విమలసౌజన్యధన్య
రూపవిభ్రమ కళారుచిర కోమలదేహ;
యతను నాఱవబాణ మనఁగఁ బరఁగు
సుందరీరత్నంబు నిందునిభానన;
యలినీలవేణి పద్మాయతాక్షి
యొకనాఁడు రుచిరసౌధోపరివేదికా;
స్థలమున మృదుశయ్య నెలమిఁ గూర్కి
10.2-327.1-తే.
మున్ను దన చౌల నెన్నఁడు విన్న యతఁడుఁ
గన్నులారంగఁ దాఁ బొడగన్న యతఁడుఁ
గాని యసమానరూపరేఖావిలాస
కలితు ననిరుద్ధు నర్మిలిఁ గవిసినటులు.
10.2-328-చ.
కలగని యంత మేలుకని కన్నుల బాష్పకణంబు లొల్కఁగాఁ
గలవలెఁ గాక నిశ్చయముగాఁ గమనీయ విలాస విభ్రమా
కలిత తదీయరూపము ముఖంబున వ్రేలిన యట్ల దోఁచినం
గళవళ మందుచున్ బిగియఁ గౌఁగిటిచే బయ లప్పళించుచున్

భావము:
దానవేశ్వరుడైన బాణాసురునికి ఉషాకన్య అనే ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె గొప్ప సౌందర్యరాశి, సద్గుణవతి, చంద్రముఖి, నీలవేణి, పద్మనేత్ర, మన్మథుని ఆరవబాణం. ఇటువంటి ఉషాబాల ఒకనాడు తన సౌథంలో మెత్తనిపాన్పుపై నిద్రిస్తున్నది. అసమాన సౌందర్యవంతు డైన అనిరుద్ధుడితో సుఖించుచునట్లు అమెకు ఒక కల వచ్చింది. ఆ సుందరాంగుని ఉష ఇంతకు ముందు వినలేదు, చూడలేదు. కలలోంచి మేలుకొన్న ఉషకన్య కన్నుల వెంట బాష్పకణాలు జాలువారుతున్నాయి. ఆమెకు అది కల కాక వాస్తవ మేమో అనే భ్రాంతి కలిగింది. ఆ సౌందర్యవంతుని అందమైన ఆకారం కన్నుల యెదుట కన్పిస్తున్నట్లే ఉంది. ఉషాబాల కళవళపడుతూ, వట్టినే గాలినే కౌగలించుకుంటూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=328

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 5

( బాణునకీశ్వర ప్రసాద లబ్ధి )

10.2-325-క.
"విను మూఢహృదయ! నీ కే
తన మెప్పు డకారణంబ ధారుణిపైఁ గూ
లును నపుడ నీ భుజావలి
దునియఁగ నా యంత వానితో నని గల్గున్. "
10.2-326-వ.
అని పలికిన నట్లు సంప్రాప్తమనోరథుండై నిజభుజవినాశకార్య ధురీణుం డగు బాణుండు సంతుష్టాంతరంగుం డగుచు నిజనివాసంబు నకుం జని, తన ప్రాణవల్లభల యుల్లంబులు పల్లవింపఁ జేయుచు నిజధ్వజనిపాతంబు నిరీక్షించుచుండె, తదనంతరంబ.

భావము:
“ఓ మూఢహృదయా! తొందరపడకు నీకేతనం అకారణంగా ఎప్పుడు భూమిపై కూలిపోతుందో, అప్పుడు నీకు నా అంత వాడితో నీ భుజాలు తెగే యుద్ధం జరుగుతుందిలే.” ఆ పరమేశ్వరుని పలుకులు విని బాణాసురుడు తన కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషించాడు. తన సౌధానికి వెళ్ళిపోయాడు. తన ప్రియురాండ్రతో కూడి ఆనంద డోలికలలో తూగుతూ, ఎప్పుడు తన రథం మీది జండాకొయ్య నేలకొరుగుతుందా అని ఎదురుచూడసాగాడు. అటుపిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=325

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, May 18, 2020

ఉషా పరిణయం - 4

(బాణునకీశ్వర ప్రసాద లబ్ధి )

10.2-322-మ.
"అనిలో నన్ను నెదిర్చి బాహుబలశౌర్యస్ఫూర్తిఁ బోరాడఁ జా
లిన వీరుం డొకఁ డైనఁ బందెమునకున్ లేఁడయ్యె భూమండలి
న్ననయంబున్ భవదగ్రదత్తకరసాహస్రంబు కండూతి వా
యునుపాయంబునులేద యీభరము నెట్లోర్తున్నుమానాయకా!
10.2-323-సీ.
హుంకార కంకణ క్రేంకార శింజినీ;
టంకార నిర్ఘోషసంకులంబు
చండ దోర్దండ భాస్వన్మండలాగ్ర ప్ర;
కాండ ఖండిత రాజమండలంబు
శూలాహతక్షతోద్వేల కీలాల క;
ల్లోల కేళీ సమాలోకనంబు
శుంభ దున్మద కుంభి కుంభస్థలధ్వంస;
సంభూత శౌర్య విజృంభణంబు
10.2-323.1-తే.
గలుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి
ఘన పరాక్రమ విక్రమక్రమము గాఁగ
జరపలేనట్టి కరములు కరము దుఃఖ
కరము లగుఁ గాక సంతోషకరము లగునె?
10.2-324-ఉ.
కాన మదీయ చండభుజగర్వ పరాక్రమ కేళికిన్ సముం
డీ నిఖిలావనిం గలఁడె యిందుకళాధర! నీవు దక్కఁగా;"
నా నిటలాంబకుండు దనుజాధిపు మాటకుఁ జాల రోసి లో
నూనిన రోషవార్ధి గడ లొత్తఁ గ నిట్లని పల్కె భూవరా!

భావము:
బాణుడు ఇలా అన్నాడు “ఓ పార్వతీపతీ! యుద్ధంలో నన్ను ఎదిరించి నిలిచి తన బాహుబలాన్ని ప్రదర్శింప జాలిన వీరాధివీరుడు ఒక్కడు కూడా ఈ భూమండలంలో ఎంత వెతికినా కనిపించడం లేదు. నీవు ప్రసాదించిన ఈ నా వెయ్యి చేతులు రణకండూతి తీర్చుకొనే ఉపాయం ఏదీ లేదయ్యా. ఈ కండూతి తీరని భారం ఎలా ఓర్చుకోగల నయ్యా? ఈశ్వరా!
దిక్కులుదద్దరిల్లే హూంకారాలు, చేతి కడియాల కణకణ ధ్వనులు, ధనుష్టంకారాలు చేసే కోలాహలంతో నిండినదీ; చండప్రచండ బాహుదండాలలో ప్రకాశించే ఖడ్గాలతో ఖండింపబడిన శత్రు రాజుల శిరస్సులు కలదీ; శూలపు పోట్లకు శరీరాల నుండి జలజల ప్రవహించే రక్తధారలతో భయంకరమైనదీ; మదించిన ఏనుగుల కుంభస్థలాలను బద్దలుకొట్టే వీరవిజృంభణం కలదీ అయిన భీకర యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేనట్టి వట్టి చేతుల వలన ఉపయోగము ఏముంటుంది చెప్పు. అలాంటి చేతులు నా వంటి వీరులకు దుఃఖము కలిగించేవి అవుతాయి కాని సంతోషము కలిగించేవి కావు కదా. ఓ ఇందుధరా! నా ఈ ప్రచండ బాహుదండాల పరాక్రమకేళిని ఎదిరించగల వీరుడు ఈ ప్రపంచం మొత్తంలో నీవు తప్ప మరెవ్వరూ లేరు.” అంటున్న బాణుడి ప్రగల్భపు మాటలకు ఫాలనేత్రుడు అసహ్యించుకుని, లోపలి రోషం పొంగిపొరలగా ఆ దోషాచరుడితో ఇలా అన్నాడు. పరీక్షిన్నరవరా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=324

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 3

(బాణునకీశ్వర ప్రసాద లబ్ధి )

10.2-319-తే.
దర్పమునఁ బొంగి రుచిర మార్తాండ దీప్త
మండలముతోడ మార్పడు మహితశోణ
మణికిరీటము త్రిపురసంహరుని పాద
వనజములు సోఁక మ్రొక్కి యిట్లని నుతించె.
10.2-320-సీ.
"దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత! ;
వితతచారిత్ర! సంతత పవిత్ర!
హాలాహలాహార! యహిరాజకేయూర! ;
బాలేందుభూష! సద్భక్తపోష!
సర్వలోకాతీత! సద్గుణసంఘాత! ;
పార్వతీహృదయేశ! భవవినాశ!
రజతాచలస్థాన! గజచర్మపరిధాన! ;
సురవైరివిధ్వస్త! శూలహన్త!
10.2-320.1-తే.
లోకనాయక! సద్భక్తలోకవరద!
సురుచిరాకార! మునిజనస్తుతవిహార!
భక్తజనమందిరాంగణపారిజాత!
నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!"
10.2-321-వ.
అని స్తుతియించి.

భావము:
ఆ బాణాసురుడు గర్వంతో ఉప్పొంగిపోతూ, సూర్యకాంతిని ధిక్కరించే తన మణికిరీటం త్రిపుర సంహారుడు అయిన శివుడి పాదపద్మాలకు సోకేలా నమస్కరించి ఇలా స్తుతించాడు. “ఓ దేవా! జగన్నాథా! దేవేంద్ర వందితా! పరిశుద్ధ చారిత్రా! పరమ పవిత్ర! హాలాహల భక్షకా! నాగభూషణ! చంద్రశేఖర! భక్తజనసంరక్షకా! సర్వలోకేశ్వరా! పార్వతీపతి! కైలాసవాసా! గజచర్మధారీ! రాక్షసాంతకా! త్రిశూలధారీ! భక్తజనుల ముంగిటి పారిజాతమా! జన్మరహితుడా! నిన్ను ఎవరు మాత్రం స్తుతించ గలరు?” ఈ విధంగా అనేక రకాల బాణుడు శివుడిని స్తుతించి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=320

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, May 16, 2020

ఉషా పరిణయం - 2


10.2-315-ఉ.
"శంకర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా
శంకర! పాండునీలరుచిశంకరవర్ణ నిజాంగ! భోగి రా
ట్కంకణ! పార్వతీహృదయకైరవ కైరవమిత్ర! యోగిహృ
త్పంకజ పంకజాప్త! నిజతాండవఖేలన! భక్తపాలనా! "
10.2-316-వ.
అని వినుతించి.
10.2-317-ఉ.
"దేవ! మదీయ వాంఛితము తేటపడన్నిటు విన్నవించెదన్
నీవును నద్రినందనయు నెమ్మిని నా పురి కోటవాకిటం
గావలియుండి నన్నుఁ గృపఁ గావుము భక్తఫలప్రదాత! యో
భావభవారి! నీ చరణపద్మము లెప్పుడు నాశ్రయించెదన్. "
10.2-318-వ.
అని యభ్యర్థించినం బ్రసన్నుండై భక్తవత్సలుం డగు పురాంతకుండు గౌరీసమేతుండై తారకాంతక గజాననాది భూతగణంబుల తోడ బాణనివాసం బగు శోణపురంబు వాకిటం గాఁపుండెఁ; బదంపడి యొక్కనాఁడ బ్బలినందనుండు.

భావము:
“శంకరా! భక్తవశంకరా! దుష్ట మదోన్మత్త రాక్షసులను నశింపచేయువాడా! ధవళాంగా! నీలకంఠా! సర్పభూషణా! పార్వతీ ప్రాణవల్లభా! యోగిజనుల హృదయ పంకజాలకు సూర్యునివంటివాడా! తాండవ కేళీ ప్రియా! భక్తపరిపాలకా!” అంటూ స్తుతించి.... ఇంకా ఇలా అన్నాడు. “ఓ దేవా! భక్తుల కోరికలు తీర్చువాడ! నాకోరిక విన్నవిస్తాను, విను. నీవు పార్వతీ సమేతంగా, నా కోట ముందర రక్షకుడివై ఉండి నన్ను రక్షించుతూ ఉండు. నా మనోవాంఛ ఇదే. కాముని భస్మం చేసినవాడా! నీ పాదపద్మాలను ఎప్పుడూ ఆశ్రయించుకొని ఉంటాను. దయజూడు.” బాణాసురుడు ఇలా ప్రార్థంచగా భక్తవత్సలుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై బాణుడి పట్టణం శోణపురం చేరాడు. భూతగణాలతో వేంచేసిన శంకరుడు కోట ద్వారం చెంత కాపలా ఉన్నాడు. అటుపిమ్మట, ఒకసారి ఆ బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=315

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 1

10.2-311-తే.
అనఘ! బలినందనులు నూర్వు రందులోన
నగ్రజాతుండు బాణుఁ డత్యుగ్రమూర్తి
చిర యశోహారి విహితపూజిత పురారి
యహిత తిమిరోష్ణకరుఁడు సహస్రకరుఁడు.
10.2-312-క.
బాణుఁడు విక్రమజిత గీ
ర్వాణుఁడు సని కాంచె భక్తి వశుఁ డై సగణ
స్థాణున్ నిర్దళి తాసమ
బాణుం దాండవధురీణు భక్తత్రాణున్.
10.2-313-క.
కని యనురాగ వికాసము
దన మనమునఁ గడలుకొనఁగ ధరఁ జాఁగిలి వం
దన మాచరించి మోదము
దనరఁగఁ దాండవము సలుపు తఱి నయ్యభవున్.
10.2-314-ఉ.
సంచిత భూరిబాహుబలసంపద పెంపున నారజంబు వా
యించి యనేకభంగుల నుమేశుఁ ద్రిలోకశరణ్యు నాత్మ మె
చ్చించి ప్రమోదియై నిజవశీకృత నిశ్చలితాంతరంగుఁ గా
వించి తదాననాంబురుహ వీక్షణుఁడై తగ మ్రొక్కి యిట్లనున్.

భావము:
“అనఘా! పరీక్షిత్తూ! బలిచక్రవర్తికి వంద మంది కొడుకులు వారిలో పెద్దవాడు బాణుడు. అతడు మిక్కిలి ఉగ్రుడు, శత్రుభయంకరుడు, గొప్ప కీర్తిమంతుడు. అతనికి వేయి చేతులు. త్రిపురసంహారి అయిన మహాశివుని పూజించుటలో ధురంధరుడు. పరాక్రమంతో దేవతలను ఓడించిన బాణాసురుడు, భక్తిభావంతో భక్తవశంకరుడు, శాశ్వతుడు, తాండవకేళీ శేఖరుడు, మన్మథుడిని మసిచేసిన వాడు అయిన పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆ దేవదేవుని దర్శించాడు, పరమేశ్వరుని దర్శించి భక్తిభావం పొంగిపొర్లుతుండగా తాండవ క్రీడ సలుపుతున్న సమయంలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసాడు. సంపాదించిన తన బహు బాహుబలం అంతా వాడి ఝంజ వాయించి, మఱియూ ఇంకా అనేక రకాలుగా ఆ త్రిలోకశరణ్యుడైన పరమేశ్వరుడిని మెప్పించాడు. ఆనంద పరవశుడైన ఆ దేవుడి ముఖపద్మం వైపు దృష్టి నిలిపి నమస్కరించి ఇలా స్తుతించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=313

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, May 14, 2020

ధృవోపాఖ్యానము - 59

4-383-తే.
ద్వాదశినిఁ బద్మ బాంధవ వాసరమున
శ్రవణ నక్షత్రమున దినక్షయమునందుఁ
బరఁగ సంక్రమణవ్యతీపాత లందు
సభల భక్తిని వినునట్టి సజ్జనులకు.
4-384-వ.
క్లేశనాశనంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాది గుణంబులును గలుగు; మఱియుఁ దేజఃకామునకుఁ దేజంబును, మనః కామునకు మనంబును, నిష్కామునకుఁ దత్త్వవిజ్ఞానంబును గలుగు; దీని వినిపించువారికి దేవతానుగ్రహంబు గలుగు: నిట్టి యుపాఖ్యానంబు నీ కెఱింగించింతి” నని మైత్రేయుండు విదురునకుఁ జెప్పిన క్రమంబున శుకయోగి పరీక్షితున కెఱింగించిన తెఱంగున సూతుండు శౌనకాదులకు వినిపించి వెండియు నిట్లనియె "నట్లు చెప్పిన మైత్రేయునిం గని విదురుం డిట్లనియె.

భావము:

ఎవరైనా దీనిని కోరికతో, శ్రద్ధతో పుణ్యతీర్థాలకు స్థానమైన విష్ణుపాదాలను ఆశ్రయించి, ఉదయ సాయంకాలాలందు, సినీవాలి పూర్ణిమలందు, ఇంకా ద్వాదశినాడు, శ్రవణనక్షత్రంనాడు, దినక్షయము (ఒక అహోరాత్రమున మూడు తిథులు వచ్చిన దినము), మకర సంక్రమణాది సంక్రమణకాలంలో, వ్యతీపాతములలో (పూర్ణిమ తిథితో కూడిన సోమవారం లేదా అమావాస్యతో కూడిన ఆదివారం), సభలలో భక్తిశ్రద్ధలతో వినే సజ్జనులకు క్లేశాలు నాశనం అవుతాయి. ప్రకాశవంతం అయిన భగవద్భక్తి, మంచి శీలం అలవడుతాయి. తేజస్సు కోరేవానికి తేజస్సు, మానసిక శక్తిని కోరేవానికి మానసిక శక్తిని, కోరికలు లేనివానికి తత్త్వజ్ఞానం కలుగుతాయి. ఈ కథను వినిపించేవారికి దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇటువంటి ధ్రువోపాఖ్యానాన్ని నీకు వినిపించాను” అని మైత్రేయుడు విదురునికి వినిపించాడని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపిన విధానాన్ని సూతుడు శౌనకాది మునులకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “ఆ విధంగా చెప్పిన మైత్రేయుని చూచి విదురుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=384

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Tuesday, May 12, 2020

ధృవోపాఖ్యానము - 58


4-380-సీ.
"పతియె దైవంబుగా భావంబులోపలఁ;
దలఁచు సునీతినందను తపః ప్ర
భావము క్రియ ధర్మభవ్య నిష్ఠలఁ బొందఁ;
జాలరు బ్రహ్మర్షి జనము లనిన
క్షత్రియకులు నెన్నఁగా నేల? యెవ్వఁడు;
పంచసంవత్సర ప్రాయమునను
సురుచి దురుక్త్యుగ్ర శరభిన్న హృదయుఁడై;
మద్వాక్యహిత బోధమతిఁ దనర్చి
4-380.1-తే.
వనమునకు నేగి హరిభక్తి వశత నొంది
యజితుఁ డగు హరిఁ తన వశుఁడై చరింపఁ
జేసి వెసఁ దత్పదంబును జెందె, నట్టి
హరిపదంబును బొంద నెవ్వరికిఁ దరము?"
4-381-క.
అని పాడె"ననుచు విదురున
కనఘుఁడు మైత్రేయుఁ డనియె నంచిత భక్తిన్
వినుతోద్దామయశస్కుం
డనఁగల యా ధ్రువుని చరిత మార్యస్తుత్యా!
4-382-సీ.
మహితసత్పురుష సమ్మతమును ధన్యంబు;
స్వర్గప్రదంబు యశస్కరంబు
నాయుష్కరంబుఁ బుణ్యప్రదాయకమును;
మంగళకర మఘమర్షణంబు
సౌమనస్యముఁ బ్రశంసాయోగ్యమును బాప;
హరమును ధ్రువపదప్రాపకంబు
నై యొప్పు నీ యుపాఖ్యానంబుఁ దగ నీకు;
నెఱిఁగించితిని; దీని నెవ్వఁడేని
4-382.1-తే.
తివుట శ్రద్ధాగరిష్ఠుఁడై తీర్థపాద
చరణ సరసీరుహద్వయాశ్రయుఁడు నైన
భవ్యచరితు దినాంత ప్రభాతవేళ
లను సినీవాలి పూర్ణిమ లందు మఱియు.

భావము:
“పతివ్రత అయిన సునీతి కొడుకు ధ్రువుడు తపస్సు చేసి సాధించిన మహాఫలాన్ని బ్రహ్మర్షులు కూడా పొందలేరంటే ఇక క్షత్రియుల మాట చెప్పేదేముంది? అతడు ఐదేండ్ల వయస్సులో సవతితల్లి సురుచి పలికిన దుర్వాక్కులు అనే బాణాలు మనస్సుకు నొప్పింపగా నా ఉపదేశాన్ని పాటించి అడవికి పోయి భక్తిపారవశ్యంతో మెప్పించరాని శ్రీహరిని మెప్పించి విష్ణుపదాన్ని పొందాడు. ఆ విధంగా విష్ణుపదాన్ని సాధించడం ఎవరి తరమౌతుంది?” ఇలా అంటూ విదురుడికి పుణ్యాత్ముడు అయిన మైత్రేయుడు గొప్ప కీర్తి కలవాడు అనదగిన ధ్రువుని వృత్తాంతం కీర్తించాడు మహానుభావ!
ధ్రువుని చరిత్ర సజ్జన సమ్మతం, ధన్యం, స్వర్గప్రదం, కీర్తికరం, ఆయుష్కరం, పుణ్యప్రద, శుభకరం, పాపహరం, సుజనత్వప్రదం, ప్రశంసాయోగ్యం, ధ్రువపదాన్ని కలిగించేది అయిన ధ్రువోపాఖ్యానాన్ని నీకు చెప్పాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=382

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, May 9, 2020

ధృవోపాఖ్యానము - 57

4-378-క.
చనిచని వెస గ్రహమండల
మును ద్రైలోక్యంబు సప్తమునిమండలమున్
ఘనుఁ డుత్తరించి యవ్వలఁ
దనరెడు హరిపదము నొందెఁ దద్దయుఁ బ్రీతిన్.
4-379-వ.
అది మఱియు నిజకాంతిచేతం ద్రిలోకంబులం బ్రకాశింపంజేయుచు నిర్దయాగమ్యంబును శాంతులు సమదర్శనులు శుద్దులు సర్వ భూతానురంజనులు నచ్యుతభక్తబాంధవులు నయిన భద్రాచారులకు సుగమ్యంబును నయి గంభీరవేగంబు ననిమిషంబు నగు జ్యోతిశ్చక్రంబు సమాహితంబై గోగణంబు మేధి యందుం బోలె నెందుఁ బరిభ్రమించుచుండు నట్టి యచ్యుతపదంబునుం బొంది, విష్ణుపరాయణుండైన ధ్రువుండు త్రిలోకచూడామణియై యొప్పుచుండె; నప్పుడు భగవంతుండైన నారదుండు ధ్రువుని మహిమం గనుంగొని ప్రచేతస్సత్త్రంబునందు వీణ వాయించుచు.

భావము:
వెళ్ళి వెళ్ళి ధ్రువుడు గ్రహమండలాన్ని, ముల్లోకాలను, సప్తర్షి మండలాన్ని దాటి ఆపైన ఉన్న విష్ణుపదాన్ని చేరుకున్నాడు. ఆ విష్ణుపదం తన కాంతిచేత ముల్లోకాలను ప్రకాశింపజేస్తున్నది. నిర్దయులకు పొందరానిది. శాంతస్వభావులు, సర్వజీవుల పట్ల సమదృష్టి కలవారు, పవిత్రులు, భూతదయ కలవారు, విష్ణుభక్తుల బంధువులైన సదాచారాలు కలవారు ఆ విష్ణుపదాన్ని సులభంగా పొందగలుగుతారు. కట్టుగుంజ చుట్టు పశువులు తిరిగే విధంగా జ్యోతిశ్చక్రం మహావేగంతో రెప్పపాటు కాలం కూడా ఆగకుండా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి విష్ణుపదాన్ని పొంది విష్ణుభక్తుడైన ధ్రువుడు ముల్లోకాలకు చూడామణియై విలిసిల్లుతూ ఉన్నాడు. అప్పుడు పూజ్యుడైన నారదుడు ధ్రువుని మాహాత్మ్యాన్ని చూచి ప్రచేతసుల యాగంలో వీణ వాయిస్తూ…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=378

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధృవోపాఖ్యానము - 56


4-375-క.
సురదుందుభి పణ వానక
మురజాదులు మొరసె; విరుల ముసురు గురిసె; గి
న్నెర గంధర్వుల పాటలు
భరితములై చెలఁగె నపుడు భవ్యచరిత్రా!
4-376-వ.
అట్టి సమయంబున ధ్రువుండు దుర్గమంబగు త్రివిష్టపంబునకు నేగువాఁ డగుచు "దీన యగు జననిం దిగనాడి యెట్లు వోవుదు?" నని చింతించు వానిం బార్షదు లవలోకించి యగ్రభాగంబున విమానారూఢ యై యేగుచున్న జననిం జూపిన సంతుష్టాంతరంగుం డగుచు.
4-377-క.
జనని సునీతిని మును కనుఁ
గొని యవల విమాన మెక్కి గొనకొని విబుధుల్
దనమీఁదఁ బుష్పవర్షము
లనయముఁ గురియింప ధ్రువుఁడు హర్షముతోడన్.

భావము:
దేవతల నగారాలు, బేరీలు, డోళ్ళు, మద్దెలలు మొదలైనవి మ్రోగాయి. పూలవాన కురిసింది. దివ్యచరిత్ర కల విదురా! కిన్నరుల, గంధర్వుల పాటలు చెలరేగాయి. అటువంటి సమయంలో ధ్రువుడు ప్రవేశించడానికి సాధ్యం కాని దేవలోకానికి పోతూ "దీనురాలైన కన్నతల్లిని విడిచి ఎలా వెళ్ళను?" అని విచారిస్తుండగా విష్ణుభటులు చూచి, తమ ముందు విమానమెక్కి పోతున్న అతని తల్లిని చూపించగా తృప్తి పడుతూ తనకు ముందుగా వెళుతున్న తల్లియైన సునీతిని చూసి ధ్రువుడు విమానం ఎక్కి దేవతలు పూలవాన కురిపించగా సంతోషంతో…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=377

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, May 6, 2020

ధృవోపాఖ్యానము - 55

ధృవోపాఖ్యానము - 54

4-371-వ.
మఱియు; విగత క్లేశుండును, ముక్తలింగుండునునై, ధ్రువుండు తన్నుఁదా మఱచి యుండు సమయంబున దశదిక్కుల నుద్యద్రాకానిశానాయకుండునుం బోలె వెలింగించుచు నాకాశంబున నుండి యొక్క విమానంబు చనుదేర నందు దేవశ్రేష్ఠులును, జతుర్భుజులును, రక్తాంబుజేక్షణులును, శ్యామవర్ణులును, గదాధరులును, సువాసులును, గిరీటహారాంగదకుండలధరులును, కౌమారవయస్కులును, నుత్తమశ్లోక కింకరులు నయిన వారల నిద్దఱం గని; సంభ్రమంబున లేచి మధుసూదను నామంబులు సంస్మరించుచు వారల భగవత్కింకరులంగాఁ దలంచి దండప్రణామంబు లాచరించినం గృష్ణపాదారవింద విన్యస్తచిత్తుండుఁ, గృతాంజలియు, వినమితకంధరుండు నైన ధ్రువునిం గనుంగొని పుష్కరనాభభక్తు లైన సునందనందులు ప్రీతియుక్తులై మందస్మితు లగుచు నిట్లనిరి.
4-372-ఉ.
"ఓ నృప! నీకు భద్ర మగు; నొప్పగుచున్న మదీయవాక్యముల్
వీనులయందుఁ జొన్పుము; వివేకముతో నయిదేండ్లనాఁడు మే
ధానిధివై యొనర్చిన యుదాత్త తపోవ్రతనిష్ఠచేతఁ దే
జోనయశాలి యైన మధుసూదనుఁ దృప్తి వహింపఁ జేయవే!

భావము:
ఇంకా దుఃఖాన్ని విస్మరించి, శరీరాభిమానాన్ని విడిచి, తనను తాను మరచి ఉన్న సమయంలో పది దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉదయించిన పున్నమ చంద్రుని వలె ఒక విమానం ఆకాశంనుండి వచ్చింది. అందులో దేవతాశ్రేష్ఠులు, చతుర్భుజులు, ఎఱ్ఱ తామరల వంటి కన్నులు కలవారు, నల్లని రంగు కలవారు, గదాధరులు, మంచి వలువలు ధరించినవారు, కౌమార వయస్సులో ఉన్నవారు, కిరీటాలు హారాలు భుజకీర్తులు చెవికుండలాలు ధరించినవారు అయిన విష్ణుసేవకులు ఇద్దరున్నారు. వారిని చూచి ధ్రువుడు తటాలున లేచి మనస్సులో విష్ణునామాన్ని స్మరిస్తూ వారిని విష్ణుకింకరులుగా భావించి దండప్రణామాలు చేసాడు. విష్ణు పాదపద్మాల యందు లగ్నం చేసిన మనస్సు కలవాడు, భక్తుడు అయిన ధ్రువుణ్ణి చూచి సునందుడు, నందుడు అనే ఆ ఇద్దరు విష్ణుసేవకులు ఆనందంతో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. “రాజా! నీకు శుభం కలుగుగాక! మా హిత వాక్యాలను శ్రద్ధగా ఆలకించు. అయిదేండ్ల చిరుత ప్రాయంలోనే నీవు ఎంతో గొప్ప తపస్సు చేసి భగవంతుడైన శ్రీహరికి సంతృప్తి కలిగించావు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=371

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, May 5, 2020

ధృవోపాఖ్యానము - 53


4-369-చ.
మను నిభుఁ డంత భృత్యజన మంత్రి పురోహిత బంధు మిత్ర నం
దన పశు విత్త రత్న వనితా గృహ రమ్యవిహార శైల వా
రినిధి పరీత భూతల హరిద్విప ముఖ్య పదార్థ జాలముల్
ఘనమతిచే ననిత్యములుగాఁ దలపోసి విరక్తచిత్తుఁడై.
4-370-సీ.
పురము వెల్వడి చని పుణ్యభూ బదరికా;
ఘన విశాలానదీకలిత మంగ
ళాంబుపూరంబుల ననురక్తిమైఁ గ్రుంకి;
కమనీయ పరిశుద్ధ కరణుఁ డగుచుఁ
బద్మాసనస్థుఁడై పవనుని బంధించి;
నెలకొని ముకుళితనేత్రుఁ డగుచు
హరిరూపవైభవ ధ్యానంబు చేయుచు;
భగవంతు నచ్యుతుఁ బద్మనేత్రు
4-370.1-తే.
నందు సతతంబు నిశ్చలమైన యట్టి
భక్తిఁ బ్రవహింపఁ జేయుచుఁ బరమమోద
బాష్పధారాభిషిక్తుండు భవ్యయశుఁడుఁ
బులకితాంగుండు నగుచు నిమ్ములఁ దనర్చి.

భావము:
మనువులతో సమానుడైన ధ్రువుడు సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధువులు, మిత్రులు, పుత్రులు, పశువులు, ధనం, రత్నాలు, స్త్రీలు, భవనాలు, క్రీడా పర్వతాలు, సముద్ర పరివేష్ఠితమైన రాజ్యం, గుఱ్ఱాలు, ఏనుగులు మొదలైన పదార్థాలన్నీ తన బుద్ధికౌశలంతో అశాశ్వతాలని భావించి, విరక్తి చెంది తన నగరంనుండి బయలుదేరి పుణ్యభూమి అయిన బదరికాశ్రమం వెళ్ళి, అక్కడి విశాల అనే పేరు కలిగిన పవిత్ర నదిలోని నీటిలో ప్రీతితో స్నానం చేసి, శుచియై పద్మాసనం కల్పించుకొని, వాయువును బంధించి, కనులు మూసికొని, భగవంతుని రూపాన్ని ధ్యానించాడు. ఆ విశాలయశోధనుడు ఆనందబాష్పాలతో తడిసిపోతూ మేను పులకించగా అచంచలమైన భక్తితో అచ్యుతుడు, కమలనేత్రుడు అయిన భగవంతుని ఆరాధించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=370

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 52



4-367-సీ.
గణుతింప భూరిదక్షిణల చేఁ గడునొప్పు;
యజ్ఞముల్ చేయ నయ్యజ్ఞ విభుఁడు
ద్రవ్యక్రియా దేవతాఫల రూప స;
త్కర్మఫలప్రదాత యయి యొప్పు
పురుషోత్తముని నర్థిఁ బూజించి మఱియు స;
ర్వోపాధివర్జితుఁ డుత్తముండు
సర్వాత్మకుఁడు నగు జలజాక్షునందుఁ దీ;
వ్రంబై ప్రవాహరూపంబు నైన
4-367.1-తే.
భక్తి సలుపుచు నఖిల ప్రపంచమందు
నలరఁ దనయందు నున్న మహాత్ము హరినిఁ
జిదచిదానందమయుని లక్ష్మివరుఁ బరము
నీశ్వరేశ్వరుఁ బొడఁ గనె నిద్ధచరిత!
4-368-వ.
ఇట్లు సుశీలసంపన్నుండును, బ్రహ్మణ్యుండును, ధర్మసేతురక్షకుండును, దీనవత్సలుండు నయి యవని పాలించు ధ్రువుండు దన్నుఁ బ్రజలు దండ్రి యని తలంప నిరువదియాఱువే లేండ్లు భోగంబుల చేతం బుణ్యక్షయంబును, నభోగంబులైన యాగాదులచేత నశుభ క్షయంబునుం జేయుచు బహుకాలంబు దనుకఁ ద్రివర్గ సాధనంబుగా రాజ్యంబుచేసి కొడుకునకుఁ బట్టంబుగట్టి యచలితేంద్రియుండై యవిద్యారచిత స్వప్నగంధర్వ నగరోపమం బయిన దేహాదికం బగు విశ్వంబు భగవన్మాయారచితం బని, యాత్మం దలంచుచు వెండియు.

భావము:
ధ్రువుడు ఎంతో అధికమైన దక్షిణ లిస్తూ లెక్కలేనన్ని యజ్ఞాలు చేసాడు. యజ్ఞవిభుడు, కర్మఫలప్రదాత అయిన పురుషోత్తముణ్ణి పూజించాడు. జాతి గుణ క్రియా సంజ్ఞా రూపాలైన సమస్త ఉపాధులను వదలినవాడు, ఉత్తముడు, సర్వాత్మకుడు, కమలనయనుడు అయిన భగవంతునిపై తీవ్రమైన భక్తిని ప్రవాహరూపంగా ప్రసరింప జేశాడు. తనలోని మహాత్ముడు, చరాచరములన్నింట ఉండేవాడు, లక్ష్మీపతి, పరాత్పరుడు, దేవదేవుడు అయిన హరిని సర్వజీవులయందు సందర్శించాడు. ఈ విధంగా శీలసంపన్నుడు, వేదబ్రహ్మనిష్ఠుడు, ధర్మసేతు రక్షకుడు, దీనవత్సలుడు అయి రాజ్యాన్ని పాలించే ధ్రువుడు ప్రజలు తనను తండ్రిగా భావించగా, భోగాలచేత పుణ్యం వ్యయం కాగా అభోగాలైన యజ్ఞయాగాలచేత పాపాలను నాశనం చేసుకొంటూ ధర్మార్థకామాలనే త్రివర్గాలను సాధింపజేసే రాజ్యాన్ని 26 వేల సంవత్సరాలు పాలించి, కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేసి ఇంద్రియ నిగ్రహం కలవాడై అవిద్య వల్ల సృష్టించబడిన స్వప్నంలోని గంధర్వనగరంతో సమానమైన దేహము మొదలైన ప్రపంచం భగవంతుని మాయచేత కల్పింపబడిందని తన మనస్సులో భావిస్తూ…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=368

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, May 3, 2020

ధృవోపాఖ్యానము - 51


4-366-వ.
అదియునుం గాక, యే బుద్ధింజేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహాత్మానుసంధానంబునం జేసి సంభవించు, నట్టి యహంత్వమ్మను నపార్థజ్ఞానంబు స్వప్నమందుంబోలెఁ బురుషునకుం దోఁచు; నదిగావున సర్వభూతాత్మవిగ్రహుండును, నధోక్షజుండును, భవచ్ఛేదకుండును, భజనీయ పాదారవిందుండును, ననంతామేయశక్తి యుక్తుండును, గుణమయి యగు నాత్మమాయచే విరహితుండును నైన యీశ్వరుని సేవింపుము; నీకు భద్రం బయ్యెడు; భవదీయ మనోగతం బైన వరంబుఁ గోరుము; నీ వంబుజనాభ పాదారవింద సేవనంబుఁ దిరంబుగఁ జేయుదు వని యెఱుంగుదు” నని రాజరాజుచేత నట్లు మహామతియు, భాగవతోత్తముండునైన ధ్రువుండు ప్రేరేపింపంబడి “యే హరిస్మరణంబు చేత నప్రయత్నంబున దురత్యయంబైన యజ్ఞానంబుఁ దరియింతు రట్టి హరిస్మరణం బచలితం బగునట్లొసంగు” మని యడగిన “నట్లగాక” యని యంగీకరించి యంతం గుబేరుండు సంప్రీత చిత్తుండయి, ధ్రువునికి శ్రీహరిస్మరణం బట్ల యనుగ్రహించి యంతర్థానంబు నొందె; నంత ధ్రువుండు యక్ష కిన్నర కింపురషగణ సంస్తూయమాన వైభవుం డగుచు నాత్మీయ పురంబునకు మరలి చనుదెంచి.

భావము:
అంతేకాక కర్మ సంబంధాలైన దుఃఖం మొదలైనవి దేహాభిమానం కారణంగా మానవునికి కలుగుతూ ఉంటాయి. స్వప్నంలో వలె ‘నేను, నీవు’ అనే భేదబుద్ధి అజ్ఞానం వల్ల కలుగుతుంది. సర్వభూత స్వరూపుడు, అధోక్షజుడు, సంసార బంధ విమోచకుడు, పూజింపదగిన పాదపద్మాలు కలవాడు, అంతము లేని అపరిమితమైన శక్తి కలవాడు, త్రిగుణాలతో నిండిన మాయ లేనివాడు అయిన భగవంతుని సేవించు. నీకు మేలు కలుగుతుంది. నీ మనస్సులో ఉన్న కోరికను కోరుకో. నీవు విష్ణుదేవుని పాదపద్మాలను స్థిరంగా పూజించేవాడవని నాకు తెలుసు” అని కుబేరుడు బుద్ధిమంతుడు, భాగవతోత్తముడు అయిన ధ్రువుణ్ణి ప్రోత్సహించాడు. ధ్రువుడు “ఏ హరి స్మరణం వల్ల దురంతమూ దుస్తరమూ అయిన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలమో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో సుస్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు” అని కోరుకొన్నాడు. కుబేరుడు సంతోషించి ధ్రువునికి ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా నిజ రాజధానికి మరలి వచ్చి…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=366

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 50

4-364-తే.
యక్షచారణసిద్ధ విద్యాధరాది
జనగణస్తూయమానుఁడై ధనదుఁ డంతఁ
బుణ్యజన వైశస నివృత్తు భూరిరోష
రహితుఁ డైనట్టి ధ్రువునిఁ జేరంగ వచ్చె
4-365-సీ.
చనుదెంచి వెసఁ గృతాంజలి యైన ధ్రువుఁ జూచి;
తివుట నిట్లనియె క్షత్రియకుమార!
తగ భవదీయ పితామహాదేశంబు;
నను దుస్త్యజంబైన ఘనవిరోధ
ముడిగితి! వటు గాన నొనరంగ నిపుడు నీ;
యందుఁ బ్రసన్నుండనైతి, భూత
జనన లయంబుల కనయంబుఁ గాలంబె;
కర్త యై వర్తించుఁగాన యుష్మ
4-365.1-తే.
దనుజుఁ జంపినవార లీ యక్షవరులు
గారు! తలపోయ నీ యక్షగణము నిట్లు
నెఱి వధించిన వాఁడవు నీవు గావు
వినుతగుణశీల! మాటలు వేయునేల!

భావము:
కోపాన్ని తగ్గించుకొని, యక్షులను సంహరించడం మానుకొన్న ధ్రువుని దగ్గరకు యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనవారు స్తుతిస్తుండగా కుబేరుడు వచ్చాడు. వచ్చి తనకు నమస్కరించిన ధ్రువునితో ఇలా అన్నాడు “రాకుమారా! నీ తాత ఆదేశించగా విడువరాని పగను విడిచావు. అందువల్ల నీపట్ల నేను ప్రసన్నుడనైనాను. జీవుల జనన మరణాలకు కాలమే కారణం. కావున ఓ సుగుణాత్మా! వేయి మాట లెందుకు? నీ తమ్ముణ్ణి చంపినవాడు యక్షుడు కాడు. యక్షులను చంపినది నీవు కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=365

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, May 2, 2020

ధృవోపాఖ్యానము - 49


4-360-క.
విను రోషహృదయు చేతను
ననయము లోకము నశించు; నౌషధములచే
ఘనరోగములు నశించిన
యనువున; నది గాన రోష మడఁపు; మహాత్మా!
4-361-తే.
అనఘ! నీదు సహోదరహంత లనుచుఁ
బెనఁచి యీ పుణ్యజనులఁ జంపితి కడంగి
పరఁగ నిదియె సదాశివ భ్రాత యైన
యర్థవిభునకు నపరాధ మయ్యెఁ గాన.
4-362-క.
నతి నుతులచేత నీ విపు
డతనిఁ బ్రసన్నునిఁగఁ జేయు మని మనువు దయా
మతిఁ జెప్పి ధ్రువునిచే స
త్కృతుఁడై నయ మొప్పఁ జనియె ఋషియుక్తుండై.
4-363-వ.
అంత.

భావము:
మహాత్మా! మందులవల్ల రోగాలు నశించినట్లు కోపం కలవాని వలన లోకం నశిస్తుంది. కాబట్టి కోపాన్ని అణచివేసుకో. పుణ్యాత్మా! నీ తమ్ముని చంపినవాళ్ళు అని ఈ యక్షులను చంపావు. ఇది శివుని సోదరుడైన కుబేరుని పట్ల నీవు చేసిన అపరాధం. కావున నమస్కారాల చేత, స్తోత్రాల చేత కుబేరుని ప్రసనుని చేసుకో” అని చెప్పి ధ్రువునిచేత పూజ లందుకొని స్వాయంభువ మనువు ఋషులతో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడు…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=362

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 48


4-358-సీ.
అనఘాత్మ! నీవు పంచాబ్ద వయస్కుండ;
వై పినతల్లి నిన్నాడినట్టి
మాటల నిర్భిన్నమర్ముండ వగుచును;
జనయిత్రి దిగనాడి వనము కేగి
తప మాచరించి యచ్చపు భక్తి నీశ్వరుఁ;
బూజించి మహితవిభూతి మెఱసి
రమణఁ ద్రిలోకోత్తరంబైన పదమును;
బొందితి, వది గాన భూరిభేద
4-358.1-తే.
రూప మైన ప్రపంచంబు రూఢి నే మ
హాత్మునందుఁ బ్రతీతమై యలరు నట్టి
యగుణుఁ డద్వితీయుండును నక్షరుండు
నైన యీశ్వరుఁ బరమాత్ము ననుదినంబు.
4-359-సీ.
కైకొని శుద్ధంబు గతమత్సరంబును;
నమలంబు నగు హృదయంబునందు
సొలయ కన్వేషించుచును బ్రత్యగాత్ముండు;
భగవంతుఁడును బరబ్రహ్మమయుఁడు
నానందమాత్రుండు నవ్యయుఁ డుపపన్న;
సకలశక్తియుతుండు సగుణుఁడజుఁడు
నయిన సర్వేశ్వరునం దుత్తమంబైన;
సద్భక్తిఁ జేయుచు సమత నొప్పి
4-359.1-తే.
రూఢి సోహమ్మమేతి ప్రరూఢ మగుచు
ఘనత కెక్కు నవిద్యయన్ గ్రంథి నీవు
ద్రెంచివైచితి; కావున ధీవరేణ్య!
సర్వశుభహాని యైన రోషంబు వలదు.

భావము:
నాయనా! నీవు అయిదేండ్ల వయస్సులో పినతల్లి నిన్నాడిన మర్మాంతకాలైన మాటలచేత లోలోపల ఎంతో నొచ్చుకొని, కన్నతల్లిని విడిచి, అడవికి పోయి తపస్సు చేశావు. అచ్చమైన భక్తితో భగవంతుణ్ణి పూజించి మూడు లోకాలకూ మీదిదైన ధ్రువపదాన్ని పొందావు. భేదరూపమైన ఈ ప్రపంచం ఏ మహాత్మునియందు ప్రతీతమై ఉంటుందో అటువంటి త్రిగుణాతీతుడు, అద్వితీయుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుని కోసం ప్రతిదినం పవిత్రమైన, పగను వీడిన నిష్కల్మషమైన మనస్సుతో అలుపు లేకుండా అన్వేషించు. ఈ విధంగా ప్రత్యగాత్ముడు, భగవంతుడు, పరబ్రహ్మ, ఆనందస్వరూపుడు, అనంతుడు, సమస్త శక్తిమంతుడు, సగుణుడు, అజుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తే వాడు, నేను, నాది అనే అవిద్యారూపమైన పీటముడిని త్రెంచుకొన్నావు. కావున ధీశాలీ! సర్వశుభాలను హరించే కోపాన్ని విడిచిపెట్టు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=359

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :