Tuesday, September 24, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 5


( కల్కి అవతారము )

12-9-క.
దినదినమును ధర్మంబులు,
ననయము ధర నడఁగిపోవు నాశ్చర్యముగా
విను వర్ణ చతుష్కములో;
నెనయఁగ ధనవంతుఁ డైన నేలు ధరిత్రిన్.
12-10-క.
బలవంతుఁ డైన వాడే
కులహీనుం డైన దొడ్డగుణవంతుఁ డగుం
గలిమియుఁ బలిమియుఁ గలిగిన
నిలలోపల రాజ తండె; యే మన వచ్చున్.

భావము:
దానితో లోకంలో రోజురోజుకూ ధర్మం తగ్గిపోతుంది. నాలుగు కులాలలోనూ ధనవంతుడు అయినవాడే పాలకుడు అవుతాడు. బలవంతుడిని కులం లేకపోయినా గొప్ప గుణవంతుడుగా పరిగణిస్తారు. కలిమి బలిమీ రెండూ కనుక ఉంటే ఇంక చెప్పటానికేముంది లోకంలో అతడే రాజు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=9

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 4


( రాజుల ఉత్పత్తి )

12-8-వ.
మఱియుఁ గణ్వవంశజుండగు సుశర్ముండను రా జుదయించిన వాని హింసించి తద్భృత్యుం డంధ్ర జాతీయుం డయిన వృషలుం, డధర్మమార్గవర్తి యై, వసుమతీచక్రం బవక్రుండై యేలు నంత వాని యనుజుండు కృష్ణుం డనువాఁడు రాజై నిలుచు; నా మహామూర్తికి శాంతకర్ణుండును, వానికి బౌర్ణమాసుండును, వానికి లంబోదరుండును, వానికి శిబిలకుండు, నతనికి మేఘస్వాతియు, వానికి దండమానుండును, వానికి హాలేయుం డగు నరిష్టకర్మయు, వానికి దిలకుండు, నతనికిఁ బురీషసేతుండును, వానికి సునందనుండును, నా రాజశేఖరునకు వృకుండును, వృకునకు జటాపుండును, జటాపునకు శివస్వాతియు, వానికిఁ నరిందముండు, నా భూమీశునకు గోమతియును, వానికిఁ బురీమంతుండును, నతనికి దేవశీర్షుండును, వానికి శివస్కందుండును, నతని కి యజ్ఞశీలుండు, నా భవ్యునకు శ్రుతస్కందుండు, వానికి యజ్ఞశ త్రుండు, వానికి విజయుం, డ వ్విజయునికిఁ జంద్రబీజుం డతనికి సులోమధియు నిట్లు పెక్కం డ్రుదయించి నన్నూటయేఁబదియాఱు హాయనంబులు ధాత్రిం బాలించెద; రంత నాభీరులేడ్వురు, గర్దభులు పదుండ్రు, గంక వంశజులు పదాఱుగురు, మేదినీభరంబు దాల్చి యుండెద; రటమీఁద యవను లెనమండ్రు, బర్బరులు పదునల్గురు, దేశాధీశులై యేలెదరు; మఱియుం బదుమువ్వురు గురుండులును, బదునొకండ్రు మౌనులును, వేయుందొమ్మన్నూటతొమ్మిది హాయనంబులు గర్వాంధులయి యేలెద; రటమీఁద నా మౌనవంశజు లగు పదునొకండ్రు త్రిశతయుతం బైన వత్సరంబులు మత్సరంబున నేలెద ; రా సమయంబునఁ, గైలికిలు లను యవనులు భూపతు లగుదు; రంత భూతనందుండు నవభంగిరుండు శిశునందుండుఁ దద్భ్రాతయగు యశోనందుండుఁ బ్రవీరకుండు వీరలు వీరులై షడుత్తరశత హాయనంబు లేలెద; రంత నా రాజులకుఁ బదుమువ్వురు కుమారు లుదయించి యందు నార్గురు బాహ్లికదేశాధిపతు లయ్యెదరు; కడమ యేడ్వురును గోసలాధిపతు లయ్యెద; రంత వైఢూర్య పతులు నిషధాధిపతులై యుండెదరు; పురంజయుండు మగధదేశాధిపతియై పుట్టి, పుళింద యదు మద్రదేశవాసు లగు హీనజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులై హరిభక్తి విరహితులై యుండ, వారికి ధర్మోపదేశంబు సేసి, నారాయణభక్తి నిత్యంబు నుండునట్లుగాఁ జేసి, బలపరాక్రమవంతు లైన క్షత్రియవంశంబు లడంచి, పద్మావతీనగర పరిపాలకుండై యాగంగా ప్రయాగ పర్యంతం బగు భూమినేలఁ గలండు; శూద్రప్రాయు లగు రాజులును, వ్రాత్యులును,బాషండులు నగు విప్రులును గలిగి సౌరాష్ట్రావంత్యాభీరార్భుద మాళవ దేశాధిపతు లయ్యెదరు, సింధుతీరంబులఁ జంద్రభాగా ప్రాంతంబులఁ గాశ్మీరమండలంబున మేధావిహీనులై మ్లేచ్ఛాకారు లగు రాజులు భూభాగం బేలుచు, ధర్మసత్యదయాహీనులై, క్రోధమాత్సర్యంబుల, స్త్రీ బాల గో ద్విజాతులఁ వధియింప రోయక, పరధన పరస్త్రీపరు లై, రజస్తమోగుణరతు లై, యల్పజీవు లై, యల్పబలు లై హరి చరణారవిందమకరంద రసాస్వాదులు గాక తమలో నన్నోన్య వైరానుబంధులై సంగ్రామరంగంబుల హతు లయ్యెద; రా సమయంబునఁ బ్రజలు తచ్చీల వేష భాషాదుల ననుసరించి యుండెదరు; కావున.

భావము:
అటుపిమ్మట, కణ్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతని భృత్యుడు, ఆంధ్ర జాతీయుడు అయిన వృషలుడు అధర్మమార్గంలో అతనిని వధిస్తాడు. రాజ్యాన్ని చేపట్టి అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని పిమ్మట, అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, నాగలి పట్టేవాడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని క్రమంగా అనుభవిస్తారు. వారందరు కలిసి పరిపాలించే కాలం నాలుగువందలయేభైఆరు సంవత్సరములు.
ఆ తరువాత నాభీరవంశం వారు ఏడుగురు, గర్దభవంశం వారు పదిమంది, కంకవంశం వారు పదహారుమంది రాజ్యభారాన్ని ధరించి పరిపాలిస్తారు. అటు పిమ్మట ఎనిమిదిమంది యవనులు, పదునాలుగురు బర్బరులు ప్రభువులు అవుతారు. అటు తరువాత గురుండులు పదముగ్గురు, మౌనులు పదకొండుమంది ప్రభులు అవుతారు. గురుండులు గర్వంతో కన్నూమిన్నూ కానకుండా పంతొమ్మిదివందలతొమ్మిది ఏళ్ళు పరిపాలన సాగిస్తారు. అటు పిమ్మట మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది మూడువందల సంవత్సరాలపాటు క్రోధబుద్ధితో పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు భూపాలన చేస్తారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడు యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీరులై నూటఆరు ఏళ్ళు పాలకులు అవుతారు. ఆ రాజుకు పదముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఆరుగురు బాహ్లిక దేశానికి అధిపతులు అవుతారు. మిగిలిన ఏడుగురు కోసల దేశానికి అధిపతులు అవుతారు.
అపుడు వైడూర్యపతులు నిషధదేశానికి ఏలికలు అవుతారు. పురంజయుడు మగధదేశ ప్రభువుగా ప్రభవిస్తాడు. పుళిందులూ, యదువంశస్థులూ మద్రదేశీయులూ అయిన హీనజాతి జనులు బ్రహ్మజ్ఞాన హీనులూ హరిభక్తి విహీనులు కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ల భక్తి తాత్పర్యాలు కలిగిస్తాడు. శక్తిశౌర్యసమన్వితులైన క్షత్రియుల వంశాలను తొక్కిపెట్టి పద్మావతీనగరం రాజధానిగా చేసుకుని గంగనుంచి ప్రయాగవరకూ ఉన్న భూమిని పరిపాలిస్తాడు.
శూద్రప్రాయులైన రాజులు, సంస్కారరహితులు, నాస్తికులు అయిన బ్రాహ్మణులు, సౌరాష్ట్రము, అవంతి, ఆభీరము, అర్భుదము, మాళవము అనే దేశాలకు ప్రభులు అవుతారు. సిందుతీరంలోను, చంద్రభాగ పరిసరాలలోను, కాశ్మీరదేశంలోను, మ్లేచ్ఛ రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలు ఉండవు. ధర్మము, సత్యము, దయ ఉండవు. పెచ్చరిల్లిన క్రోధ మాత్సర్యాలతో స్త్రీలనూ బాలకులనూ గోవులనూ బ్రాహ్మణులనూ వధించడానికి సైతం వెనుతీయరు. పరధనాశక్తి, పరవనితాశక్తి కలిగి రజోగుణంలోనూ తమోగుణంలోనూ మునిగి అల్పాయువులు, అల్పబలులు అవుతారు. శ్రీవిష్ణు పాదపద్మ మకరందంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ల ఒకరు వైరాలు పెంచుకుని యుద్ధాలకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ కాలంలోని ప్రజలు కూడ వారి వేషభాషలను శీలవృత్తులను అనుకరిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=2&padyam=8

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

Sunday, September 22, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 3


( రాజుల ఉత్పత్తి )

12-7-క.
గజ తురగాదిశ్రీలను
నిజ మని నమ్మంగరాదు; నిత్యమును హరిన్
గజిబిజి లేక తలంచిన
సుజనులకును నతనియందుఁ జొరఁగా వచ్చున్.

భావము:
గుఱ్ఱములు ఏనుగులు వంటి సంపదలను శాశ్వతమని నమ్మరాదు. ప్రశాంత హృదయంతో నిరంతరం హరిని స్మరించే సజ్జనులు అతని యందే చేరుతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=2&padyam=7

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 2


( రాజుల ఉత్పత్తి )

12-5-క.
చతురత నీ క్షితి నేలియు
మతిమోహము విడువలేక మానవనాథుల్
సతతముఁ దమ కీ కాలం
బతిచంచల మగుట నెఱుఁగరయ్య మహాత్మా!
12-6-క.
నరపతులమహిమ నంతయు
నురగాధిపుఁ డైన నొడువ నోపఁడు; ధాత్రిం
జిరకాల మేలి యిందే
పరువడి నడఁగుదురు వారు భ్రాంతులు నగుచున్.

భావము:
ఓ మహాత్మా! వీరు ఎంతో నేర్పుతో పరిపాలన కొనసాగిస్తారు. కానీ, తమ అంతరంగాలలో మోహాన్ని వీడలేరు. కాలం మిక్కిలి చంచలమైనది అని తెలుసుకోలేరు. ఆ రాజుల గొప్పతనాన్ని ఆ వెయ్యితలల ఆదిశేషుడైనా సమగ్రంగా చెప్పలేడు. వారు చాలాకాలం భూమిని ఏలుతారు. అయినా భ్రాంతి మగ్నులై ఇక్కడే అణగిపోతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=2&padyam=6

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

Thursday, September 19, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 1


( రాజుల ఉత్పత్తి )

12-4-వ.
అందు రాజులప్రకారం బెఱింగించెద; బృహద్రథునకుఁ బురంజయుండు పుట్టు; వానికి శునకుం డనెడివాఁడు మంత్రి యై పురంజయునిం జంపి తా రాజ్యం బేలుచుండు; నంతఁ గొంతకాలంబున కతనికిం గుమారుండు దయించిన వానికిఁ బ్రద్యోతననామం బిడి పట్టంబుగట్టు; నా భూభుజునకు విశాఖరూపుం డుదయింపంగలం; డాతనికి నందివర్ధనుండు జన్మించు; నీ యేవురు నూటముప్పది యెనిమిది సంవత్సరములు వసుంధరా పరిపాలనంబునం బెంపు వడయుదురు; తదనంతరంబ శిశునాగుం డను పార్థివుం డుదయించు; నా మూర్ధాభిషిక్తునకుఁ గాకవర్ణుండు, నా రాజన్యునకు క్షేమవర్ముఁ డుదయింపఁగలం; డా పృథ్వీపతికి క్షేత్రజ్ఞుం, డతనికి విధిసారుఁడును, విధిసారున కజాతశత్రుండు, నా భూపాలునకు దర్భకుండును, దర్భకునికి నజయుండు, నతనికి నందివర్ధనుండు, నతనికి మహానందియు ననంగల శైశునాగులు పదుండ్రు నరపాలకు లుద్భవించి షష్ట్యుత్తరత్రిశతి హాయనంబులు గలికాలంబున ధరాతలం బేలుదు; రంతట మహానందికి శూద్రస్త్రీ గర్బంబున నతి బలశాలి యయిన మహాపద్మవతి యను నందనుం డుదయించు; నతనితో క్షత్రియవంశం బడంగిపోఁ గల దా సమయంబున నరపతులు శూద్రప్రాయులై ధర్మవిరహితులై తిరుగుచుండ మహాపద్మునకు సుమాల్యుం డాదిగాఁ గల యెనమండ్రు కుమారు లుదయించెదరు; వారు నూఱు సంవత్సరంబులు క్షోణితలం బేలెద; రంతటఁ గార్ముకుండు మొదలుగా రాజనవకంబు నందాఖ్యలం జనియించు; నా నవనందులనొక భూసురోత్తముం డున్మూలనంబు సేయు; నప్పుడు వారు లేమిని మౌర్యులు గొంతకాలం బీ జగతీతలంబు నేలుదు; రత్తఱి నా భూదేవుండు చంద్రగుప్తుండనువానిం దన రాజ్యం బందు నభిషిక్తుంగాఁ జేయంగలం; డంత నా చంద్రగుప్తునకు వారిసారుండును, వానికి నశోకవర్ధనుండు, నతనికి సుయశస్సును, వానికి సంయుతుఁ డమ్మహనీయునకు శాలిశూకుం, డతనికి సోమశర్ముండు, వానికి శతధన్వుండు, నవ్వీరునకు బృహద్రథుండు నుదయించెదరు; మౌర్యులతోఁజేరిన యీ పదుగురును సప్తత్రింశదుత్తర శతాబ్దంబులు నిష్కంటకంబుగా భూపరిపాలనంబు సేసెద; రా సమయంబున బృహద్రథుని సేనాపతి యగు పుష్యమిత్రుఁడు, శుంగాన్వయుఁ డతని వధించి రాజ్యంబు గైకొను; నతనికి నగ్నిమిత్రుండను నరపతి బుట్టఁగలవాఁ; డాతనికి సుజ్యేష్ఠుండు, సుజ్యేష్ఠునకు వసుమిత్రుండు, నతనికి భద్రకుండును, భద్రకునకుఁ బుళిందుండు, నా శూరునకు ఘోషుండును, వాని కి వజ్రమిత్రుండును, నతనికి భాగవతుండును, వానికి దేవభూతియు నుద్భవించెద; రీ శుంగులు పదుండ్రును ద్వాదశోత్తరశత హాయనంబు లుర్వీపతు లయ్యెద; రంతమీదఁట శుంగకుల సంజాతుండైన దేవభూతిని గణ్వామాత్యుండగు వసుదేవుండనువాఁడు వధియించి, రాజ్యం బేలు; వానికి భూమిత్రుండు, నమ్మహానుభావునకు నారాయణుండునుఁ గలిగెదరు; కణ్వవంశజులైన వీరలు మున్నూటనలువదేను సంవత్సరంబులు మేదినీతలం బేలుదురు; మఱియును.

భావము:
వీటిలో ముందుగా రాజుల గురించి చెప్తాను, రాజు బృహద్రథుడికి పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడు మంత్రిగా ఉంటాడు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దె నెక్కి, రాజ్యం పరిపాలిస్తాడు. అతనికి ప్రద్యోతుడు అని కొడుకు పుడతాడు. అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పజెప్తాడు. ప్రద్యోతునికి విశాఖరూపుడు, అతనికి నందివర్ధనుడు పుడతారు. ఈ రాజులు అయిదుగురు వృద్ధిచెందుతూ నూటముప్పైయ్యెనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. అటుపిమ్మట శిశునాగుడు అనే రాజు పుడతాడు. అతనికి కాకవర్ణుడు, కాకవర్ణునికి క్షేమవర్ణుడు, క్షేమవర్ణమహారాజుకు క్షేత్రజ్ఞుడు, అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రువు, అతనికి దర్భకుడు, అతనికి అజయుడు, అతనికి నందివర్థనుడు, అతనికి మహానంది పుడతారు. ఈ పదిమంది రాజులు శైశునాగులు అన్న పేరుతో ప్రసిద్ధులై కలికాలంలో మూడువందలఅరవై ఏళ్ళు అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేస్తారు.
ఆ తరువాత, మహానందికి శూద్రస్త్రీ కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహా బలవంతుడు అవుతాడు. కానీ అతనితో క్షత్రియ వంశం అంతరించి పోతుంది. అప్పుడు రాజులు శూద్రప్రాయులు ధర్మహీనులు అయిపోతారు. పోతారు మహాపద్మునికి సుమాల్యుడు మున్నగు తనయులు ఎనమండుగురు పుడతారు. వారి పాలన వందసంవత్సరాలపాటు సాగుతుంది. అటుపిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారిని నవనందులు అని అంటారు. ఆ నవనందులను ఒక విప్రశ్రేష్ఠుడు అంతరింప జేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు.
నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషేక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు పుడతాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్థనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని పుత్రుడు శాలిశూకుడు, వాని నందనుడు సోమశర్ముడు, వాని తనూభవుడు శతధన్వుడు, వాని కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజులు అవుతారు. మౌర్యునితో కలసి ఆ పదిమందిరాజులు మొత్తంమీద నూటముప్ఫయేడు సంవత్సరములు నిరాటంకంగా రాజ్య పాలన చేస్తారు. అప్పుడు, బృహద్రథుని సైన్యాధినేత శుంగవంశపు పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుట్టి రాజు అవుతాడు. అతని తరువాత సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరుసగా వంశపారంపర్యంగా రాజ్యాన్ని గ్రహించి పరిపాలిస్తారు. పైన చెప్పిన పదిమంది శుంగులు నూటపన్నెండు ఏళ్ళు రాచరికం నిలుపుకుంటారు. శుంగవంశం వారిలో చివరివాడు అయిన దేవభూతిని, వసుదేవుడు కణ్వుడు అను తన మంత్రితో కలిసి వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిపుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభవుడికి నారాయణుడనే కొడుకు పుడతాడు. కణ్వవంశస్థులు మొత్తం మీద మూడువందలనలభైఅయిదు ఏళ్ళు ప్రభవులై పరిపాలన చేస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=2&padyam=4

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 118


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1041-క.
జీవన్ముక్తి లభించుం
గావున నేమఱక తలఁపు కైకొని దీనిన్
వావిరి నొల్లని వారికి
దావల మగు మృత్యుభయము దవ్వగు సుఖమున్."
3-1042-క.
అని యిట్లు దేవహూతికి
మనమలరఁగ గపిలుఁ డాత్మమార్గం బెల్లన్
వినిపించి చనియె" నని విదు
రునకున్ మైత్రేయముని వరుం డెఱిఁగించెన్.

భావము:
దీనిని ఏకాగ్రచిత్తంతో ఏమరుపాటు లేకుండా ఆచరించేవారికి జీవన్ముక్తి లభిస్తుంది. ఈ మార్గాన్ని ఇష్టపడని వారికి మృత్యుభీతి కలుగుతుంది. సుఖం దూరమవుతుంది.” అని ఈ విధంగా కపిలుడు దేవహూతికి మనస్సు సంతోషించేటట్లు ఆత్మతత్త్వాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడని మైత్రేయుడు విదురునికి తెలియజేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1041

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, September 18, 2019

కపిల దేవహూతి సంవాదం - 117


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

1039-వ.
అదిగావునఁ; బరబ్రహ్మంబవును, బరమపురుషుండవును, బ్రత్యఙ్మనో విభావ్యుండవును, సమస్తజన పాపనివారక స్వయంప్రకాశుండవును, వేదగర్భుండవును, శ్రీమహావిష్ణుడవును నగు నీకు వందనంబు లాచరించెదను" అని స్తుతించినం బరమపురుషుండును, మాతృ వత్సలుండును నగు కపిలుండు గరుణారసార్ద్రహృదయకమలుం డై జనని కిట్లనియె.
3-1040-తే.
"తవిలి సుఖరూపమును మోక్షదాయకంబు
నైన యీ యోగమార్గమే నంబ! నీకు
నెఱుఁగ వివరించి చెప్పితి నిది దృఢంబు
గాఁగ భక్తి ననుష్ఠింపు కమలనయన!

భావము:
అందువల్ల పరబ్రహ్మవూ, పరమపురుషుడవూ, వెలుపలా లోపలా సంభావింప తగినవాడవూ, సకల జీవుల పాపాలను పటాపంచలు చేసేవాడవూ, స్వయంప్రకాశుడవూ, వేదమూర్తివీ, మహావిష్ణు స్వరూపుడవూ అయిన నీకు నమస్కరిస్తున్నాను.” అని దేవహూతి స్తుతించగా పురుషోత్తముడూ, మాతృప్రేమతో నిండినవాడూ అయిన కపిలుడు కరుణరసార్ద్రహృదయుడై తల్లితో ఇలా అన్నాడు. “కమలదళాల వంటి కన్నులు గల తల్లీ! సుఖస్వరూపమూ, మోక్షప్రదమూ అయిన ఈ యోగమార్గాన్ని నీకు తేటతెల్లంగా వెల్లడించాను. దీనిని నీవు దృఢమైన భక్తితో అనుష్ఠించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1040

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 116


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1037-క.
నీ నామస్తుతి శ్వపచుం
డైనను జిహ్వాగ్ర మందు ననుసంధింపన్
వానికి సరి భూసురుఁడుం
గానేరఁడు చిత్రమిది జగంబుల నరయన్.
3-1038-ఉ.
ఈ విధ మాత్మలం దెలిసి యెప్పుడు సజ్జనసంఘముల్ జగ
త్పావనమైన నీ గుణకథామృత మాత్మలఁ గ్రోలి సర్వ తీ
ర్థావళిఁ గ్రుంకినట్టి ఫలమందుదు రంచు సమస్త వేదముల్
వావిరిఁ బల్కుఁ గావునను వారలు ధన్యులు మాన్యు లుత్తముల్.

భావము:
లోకాలన్నిటిలో విచిత్రమైన విషయ మేమిటంటే భక్తిపూర్వకంగా నీ నామాన్ని జిహ్వాగ్రాన నిలుపుకొని జపించినట్లయితే వాడు కుక్కమాంసం తినేవాడైనా వానితో బ్రాహ్మణుడు కూడా సాటి కాలేడు. ఈ పరమార్థాన్ని చక్కగా తెలిసికొన్న సజ్జనులు సర్వదా లోకపావనమైన నీ మధుర కథాసుధారసాన్ని తనివితీరా మనసారా త్రాగుతారు. అటువంటి వారికి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా వేదాలన్నీ గొంతెత్తి చాటుతున్నాయి. అందువల్ల అటువంటి మహనీయులే మాననీయులు, ఉత్తములు, సాధుసత్తములు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1038

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, September 13, 2019

కపిల దేవహూతి సంవాదం - 115


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1034-వ.
అదియునుం గాక.
3-1035-క.
ధీమహిత! భవన్మంగళ
నామస్మరణానుకీర్తనము గల హీనుల్
శ్రీమంతు లగుదు రగ్ని
ష్టోమాదికృదాళికంటె శుద్ధులు దలఁపన్.
3-1036-వ.
అదియునుం గాక.

భావము:
అంతే కాకుండా ఓ జ్ఞానస్వరూపా! మంగళకరమైన నీ నామాన్ని స్మరించినా, కీర్తించినా దరిద్రులు శ్రీమంతులౌతారు. అటువంటివారు అగ్నిష్ఠోమం మొదలైన యజ్ఞాలు చేసినవారికంటె పరిశుద్ధు లవుతారు. అంతే కాకుండా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1035

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 114


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1033-సీ.
వరుస విగ్రహపారవశ్యంబునను జేసి; 
రఘురామ కృష్ణ వరాహ నార
సింహాది మూర్తు లంచితలీల ధరియించి; 
దుష్టనిగ్రహమును శిష్టపాల
నమును గావించుచు నయమున సద్ధర్మ; 
నిరతచిత్తులకు వర్ణింపఁ దగిన
చతురాత్మతత్త్వ విజ్ఞానప్రదుండవై; 
వర్తింతు వనఘ! భవన్మహత్త్వ
3-1033.1-తే.
మజున కయినను వాక్రువ్వ నలవిగాదు
నిగమజాతంబు లయిన వర్ణింప లేవ
యెఱిఁగి సంస్తుతి చేయ నే నెంతదాన
వినుత గుణశీల! మాటలు వేయునేల?

భావము:
అవతారాలమీద ముచ్చటపడి వరుసగా రఘురాముడుగా, కృష్ణుడుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారాలు ధరించి దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మంపట్ల ప్రవృత్తమైన చిత్తం కల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించటం కోసం వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు, అనంత కళ్యాణగుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వాన్ని అభివర్ణించడం చతుర్ముఖునకు, చతుర్వేదాలకు కూడా సాధ్యం కాదంటే నేనెంతదాన్ని? వెయ్యి మాటలెందుకు? నిన్ను తెలుసుకొని సన్నుతించటం నాకు శక్యం కాని పని.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1033

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, September 12, 2019

కపిల దేవహూతి సంవాదం - 113


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1029-వ.
అంత.
3-1030-తే.
అతుల భూరి యుగాంతంబు నందుఁ గపట
శిశువవై యొంటి కుక్షినిక్షిప్త నిఖిల
భువననిలయుండవై మహాంభోధి నడుమ
జారు వటపత్రతల్పసంస్థాయి వగుచు.
3-1031-తే.
లీల నాత్మీయ పాదాంగుళీ వినిర్గ
తామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు
గడఁగి నా పూర్వభాగ్యంబు కతన నిపుడు
పూని నా గర్భమున నేడు పుట్టితయ్య!
3-1032-వ.
అట్టి పరమాత్ముండ వయిన నీవు.

భావము:
అప్పుడు మహాప్రళయ సమయంలో సమస్త భువన సముదాయాన్ని నీ ఉదరంలో పదిలంగా దాచుకొని మహాసాగర మధ్యంలో మఱ్ఱి ఆకు పాన్పుమీద మాయాశిశువుగా ఒంటరిగా శయనించి ఉంటావు. మహానుభావా! ఆ విధంగా వటపత్రశాయివైన నీవు లీలగా నీ కాలి బొటనవ్రేలిని నోటిలో నుంచుకొని అందలి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. అటువంటి నీవు నా పూర్వపుణ్య విశేషంవల్ల ఇప్పుడు నా కడుపున పుట్టావు అటువంటి పరమాత్మ స్వరూపుడవైన నీవు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1031

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, September 11, 2019

కపిల దేవహూతి సంవాదం - 112


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1028-సీ.
"అనయంబు విను, మింద్రియార్థ మనోమయం; 
బును భూతచయ మయంబును నశేష
భూరి జగద్బీజభూతంబును గుణప్ర; 
వాహ కారణమును వలనుమెఱయు
నారాయణాభిఖ్యనాఁ గల భవదీయ; 
దివ్యమంగళమూర్తిఁ దేజరిల్లు
చారు భవద్గర్భసంజాతుఁ డగునట్టి; 
కమలగర్భుండు సాక్షాత్కరింప
3-1028.1-తే.
లేక మనమునఁ గనియె ననేక శక్తి
వర్గములు గల్గి సుగుణప్రవాహరూప
మంది విశ్వంబు దాల్చి సహస్రశక్తి
కలితుఁడై సర్వకార్యముల్ కలుగఁజేయు.

భావము:
ఇంద్రియాలతో, ఇంద్రియార్థాలతో, మనస్సుతో, పంచభూతాలతో నిండి సమస్త జగత్తుకు బీజభూతమై సత్త్వరజస్తమోగుణ ప్రవాహానికి మూలకారణమై నారాయణుడనే నామంతో నీ దివ్యమంగళ విగ్రహం తేజరిల్లుతూ ఉంటుంది. అటువంటి నీ కళ్యాణమూర్తిని నీ నాభికమలం నుండి జన్మించిన చతుర్ముఖుడే సాక్షాత్తుగా దర్శించలేక ఎలాగో తన మనస్సులో కనుగొన గలిగాడు. అలా చూచి నీ అనుగ్రహంవల్ల అనేక శక్తులను తనలో వ్యక్తీకరించుకొని వేలకొలది శక్తులతో కూడినవాడై ప్రవాహరూపమైన ఈ విశ్వాన్ని సృజింప గల్గుతున్నాడు. సృష్టి సంబంధమైన సర్వకార్యాలను నిర్వహింప గలుగుతున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1028

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :