Saturday, February 29, 2020

దక్ష యాగము - 48

(శివుడనుగ్రహించుట )
4-160-సీ.
అనఘాత్మ! తగ నీవు నబ్జనాభుండును;
బరికింపఁ బ్రాహ్మణాభాసు లయిన
వారల యెడల నెవ్వలన నుపేక్షింప;
రఁట! దృఢవ్రతచర్యు లైనవారి
యెడ నీకుపేక్ష యెక్కడిది? సర్గాదిని;
నామ్నాయ సంప్రదాయప్రవర్త
నము నెఱింగించుట కమర విద్యాతపో;
వ్రత పరాయణులైన బ్రాహ్మణులను
4-160.1-తే.
వరుసఁ బుట్టించితివి; కాన వారి నెపుడుఁ
గేల దండంబుఁ బూని గోపాలకుండు
బలసి గోవుల రక్షించు పగిది నీవు
నరసి రక్షించుచుందు గదయ్య రుద్ర!
4-161-సీ.
తలపోయ నవిదిత తత్త్వవిజ్ఞానుండ;
నైన నాచేత సభాంతరమున
నతి దురుక్త్యంబక క్షతుఁడ వయ్యును మత్కృ;
తాపరాధము హృదయంబు నందుఁ
దలఁపక సుజన నిందాదోషమున నధో;
గతిఁ బొందుచున్న దుష్కర్ము నన్నుఁ
గరుణఁ గాచిన నీకుఁ గడఁగి ప్రత్యుపకార;
మెఱిఁగి కావింప నే నెంతవాఁడ?
4-161.1-తే.
నుతచరిత్ర! భవత్పరానుగ్రహాను
రూప కార్యంబుచేత నిరూఢమైన
తుష్టి నీ చిత్తమందు నొందుదువు గాక;
క్షుద్రసంహార! కరుణాసముద్ర! రుద్ర!"

భావము:
పుణ్యాత్మా! నీవు, విష్ణువు కపట బ్రాహ్మణులను క్షమింపరు. దృఢమైన వ్రతం కల బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేయరు. సృష్టి ఆరంభంలో వేదసంప్రదాయాలను ప్రవర్తింపజేయడానికి నీవు బ్రాహ్మణులను సృజించావు. విద్య, తపస్సు, వ్రతం బ్రాహ్మణుల ధర్మాలు. కాబట్టి కర్ర చేత పట్టుకొని గోపాలుడు గోవులను కాపాడే విధంగా నీవు బ్రాహ్మణులను నిత్యం శ్రద్ధగా కాపాడుతూ ఉంటావు. క్షుద్రులను సంహరించే రుద్రా! దయా సముద్రా! నేను తత్త్వజ్ఞానం తెలియని మూర్ఖుడను. మహాసభలో నేను పలికిన చెడ్డ పలుకులు అనే ములుకులచేత నీవు గాయపడ్డావు. అయినా నేను చేసిన నేరాన్ని నీవు మనస్సులో పెట్టుకోలేదు. మహానుభావుణ్ణి నిందించిన పాపంచేత అధోగతికి పోవలసిన పాపాత్ముణ్ణి నన్ను దయతో కాపాడావు. నీకు తిరిగి ఉపకారం చేయటానికి నే నెంతవాణ్ణి? ఓ సచ్చరిత్రా! త్రినేత్రా! ఇతరులను అనుగ్రహించే కార్యాల మూలంగా కలిగే ఆనందాన్ని నీవు పొందుదువు గాక!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=161

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Friday, February 28, 2020

దక్ష యాగము - 47

(శివుడనుగ్రహించుట )

4-157-క.
విను దక్షు నంత మేషము
ఖునిఁ జేసిన నిద్ర మేలుకొని లేచిన పో
ల్కిని నిలిచె దక్షుఁ, డభవుఁడు
కనుఁగొనుచుండంగ నాత్మఁ గౌతుక మొప్పన్.
4-158-వ.
ఇట్లు లేచి నిలిచి ముందఱ నున్న శివునిం గనుంగొనిన మాత్రన శరత్కాలంబున నకల్మషంబైన సరస్సునుంబోలెఁ బూర్వ రుద్రవిద్వేష జనితంబు లైన కల్మషంబులం బాసి నిర్మలుండై యభవుని నుతియింపం దొడంగి మృతిఁ బొందిన సతీ తనయం దలంచి యనురా గోత్కంఠ బాష్పపూరిత లోచనుండును, గద్గదకంఠుండునునై పలుకం జాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించుకొని ప్రేమాతిరేక విహ్వలుం డగుచు సర్వేశ్వరుం డగు హరున కిట్లనియె.
4-159-క.
"విను; నీ కపరాధుఁడ నగు
నను దండించు టది దండనము గాదు మది
న్నను రక్షించుటగా మన
మునఁ దలఁతును దేవ! యభవ! పురహర! రుద్రా!

భావము:
విదురా! విను. శివుడు దక్షుని గొఱ్ఱెతల కలవానిగా చేసి చూస్తుండగా అతడు నిద్రనుండి మేలుకొన్న విధంగా సంతోషంగా లేచాడు.
అలా లేచి నిలిచిన దక్షుడు శివుని చూచినంత మాత్రాన శరత్కాలంలో బురద లేని సరస్సు వలె పూర్వం రుద్రుని ద్వేషించడం వలన కలిగిన దోషాలను పోగొట్టుకొని నిర్మలుడై ఆ శివుణ్ణి స్తుతించాలకున్నాడు. కాని మరణించిన తన కూతురును తలచుకొని ప్రేమతో, తహతహపాటుతో కన్నులలో నీరు నిండగా, డగ్గుత్తిక పడిన కంఠంతో మాట్లాడలేక, ఎట్టకేలకు దుఃఖాన్ని దిగమ్రింగుకొని ప్రేమాతిరేకంతో ఒడలు మరచి ఆ శివునితో ఇలా అన్నాడు. “దేవా! అభవా! పురాంతకా! రుద్రా! విను. నీకు అపరాధం చేసిన నన్ను నీవు శిక్షించడం నాకు అది శిక్ష కాదు. అది నన్ను రక్షించడంగానే భావిస్తాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=159

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Thursday, February 27, 2020

దక్ష యాగము - 46


(శివుడనుగ్రహించుట )

4-155-వ.
అని "దగ్దశీర్షుం డయిన దక్షుం డజముఖుం డగు; భగుండు బర్హి స్సంబంధ భాగంబులు గలిగి మిత్రనామధేయ చక్షుస్సునం బొడగాంచు; పూషుండు పిష్టభుక్కగుచు యజమాన దంతంబులచే భక్షించు; దేవతలు యజ్ఞావశిష్టంబు నాకొసగుటంజేసి సర్వావయవ పూర్ణులై వర్తింతురు; ఖండితాంగులైన ఋత్విగాది జనంబు లశ్వనీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్ధబాహు హస్తులై జీవింతురు; భృగువు బస్తశ్మశ్రువులు గలిగి వర్తించు;" అని శివుండా నతిచ్చిన సమస్తభూతంబులును సంతుష్టాంతరంగంబులై “తండ్రీ లెస్సయ్యె” నని సాధువాదంబుల నభినందించిరి: అంతనా శంభుని యామంత్రణంబు వడసి సునాసీర ప్రముఖులగు దేవతలు ఋషులతోడం గూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని దక్షాధ్వర వాటంబుకుం జనియె; అంత.
4-156-క.
శర్వుని యోగక్రమమున
సర్వావయవములుఁ గలిగి సన్ముని ఋత్వి
గ్గీర్వాణముఖ్య లొప్పిరి
పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్.

భావము:
అని చెప్పి “శిరస్సు దహింపబడిన దక్షుడు గొఱ్ఱెముఖం కలవాడు అవుతాడు. భగుడు దర్భలతో సంబంధించిన యజ్ఞభాగాన్ని పొంది మిత్రనామకమైన నేత్రాలతో చూస్తాడు. పూషుడు పిండములను యజమాని దంతాల ద్వారా భుజిస్తాడు. దేవతలు యజ్ఞశేషాన్ని నాకు సమర్పించడం వల్ల మునుపటి వలె అన్ని అవయవాలు కలిగి సంచరిస్తారు. అవయవాలు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలైనవారు అశ్వినీ దేవతల బాహువుల చేతను, పూషుని హస్తాల చేతను తమ తమ బాహువులను, హస్తాలను పొంది బ్రతుకుతారు. భృగువు చింబోతు మీసాలు, గడ్డాము పొందుతాడు” అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సమస్త ప్రాణులు సంతోషించి “తండ్రీ! బాగు బాగు” అని మెచ్చుకున్నారు. అప్పుడు ఆ శివుని దగ్గర సెలవు తీసుకొని ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులతో కూడి బయలుదేరారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ముందుంచుకొని దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు ఓ విదురా! గొప్పవారిచే మన్నింపబడేవాడ! శివుని ఆజ్ఞానుసారంగా మునులు, ఋత్విక్కులు, దేవతలు మొదలైన వారంతా తమ తమ పూర్వశరీరాలను పొంది చక్కగా ప్రకాశించారు. అప్పుడు…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=155

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

దక్ష యాగము - 45


(శివుడనుగ్రహించుట )

4-151-వ.
అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వంస్తంబయి పరిసమాప్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిఁ బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, భృగుముని శ్మశ్రువులును, బూషుని దంతంబులును, గృపఁజేయుము; భగ్నాంగు లయిన దేవ ఋత్విఙ్నికాయంబులకు నారోగ్యంబు గావింపుము; ఈ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన భవదీయభాగం బగుం గాక."
4-152-చ.
అని చతురాననుండు వినయంబున వేఁడిన నిందుమౌళి స
య్యనఁ బరితుష్టిఁ బొంది దరహాసము మోమునఁ దొంగలింప ని
ట్లను "హరిమాయచేత ననయంబును బామరు లైనవారు చే
సిన యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నఁడున్.
4-153-వ.
అట్లయ్యును.
4-154-క.
బలియుర దండించుట దు
ర్భలజన రక్షణము ధర్మపద్ధతి యగుటం
గలుషాత్ముల నపరాధము
కొలఁదిని దండించుచుందుఁ గొనకొని యేనున్."

భావము:
అందువల్ల యజ్ఞభాగానికి అర్హుడవైన నీకు యజ్ఞభాగాన్ని ఇవ్వకపోవడం వల్ల నీవు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. అది అసంపూర్ణంగా మధ్యలో ఆగిపోయింది. అటువంటి దక్షయజ్ఞాన్ని నీవు పునరుద్ధరించు. దక్షుని బ్రతికించు. భగునికి కన్నులను, భృగుమహర్షికి మీసాలను, పూషునికి దంతాలను అనుగ్రహించు. అవయవాలు తుత్తునియలైన దేవతలకు, ఋత్విక్కులకు ఆరోగ్యం ప్రసాదించు. మిగిలిన యజ్ఞకార్యం సమస్తం పూర్తి కావించి ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించు.” అని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకొనగా శివుడు వెంటనే తృప్తిపడి చిరునవ్వుతో దయతో ఇలా అన్నాడు. ‘విష్ణుమాయకు వశులై పామరులు చేసిన దోషాలను నేను మనస్సులో ఎప్పుడూ లెక్కచేయను. అయినా బలవంతులను శిక్షించడం, దుర్బలులను రక్షించడం ధర్మమార్గం కనుక నేను దుష్టులను వారు చేసిన దోషాలకు తగినట్లుగా శిక్షిస్తూ ఉంటాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=154

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, February 25, 2020

దక్ష యాగము - 44


(శివుడనుగ్రహించుట )

4-149-సీ.
"మఱి భేదబుద్ధిఁ గర్మప్రవర్తనముల;
మదయుతు లయి దుష్టహృదయు లగుచుఁ
బరవిభవాసహ్య భవ మనో వ్యాధులఁ;
దగిలి మర్మాత్మ భేదకము లయిన
బహు దురుక్తుల చేతఁ బరులఁ బీడించుచు;
నుండు మూఢులను దైవోపహతులఁ
గాఁ దలపోసి య క్కపటచిత్తులకు నీ;
వంటి సత్పురుషుఁ డేవలన నైన
4-149.1-తే.
హింసఁ గావింపకుండు సమిద్ధచరిత!
నీలలోహిత! మహితగుణాలవాల!
లోకపాలనకలిత! గంగాకలాప!
హర! జగన్నుతచారిత్ర! యదియుఁ గాక.
4-150-సీ.
అమర సమస్త దేశము లందు నఖిల కా;
లములందుఁ దలఁప దుర్లంఘ్య మహిముఁ
డగు పద్మనాభు మాయా మోహితాత్మకు;
లై భేదదర్శను లైనవారి
వలనను ద్రోహంబు గలిగిన నైనను;
నది దైవకృత మని యన్యదుఃఖ
ముల కోర్వలేక సత్పురుషుండు దయచేయు;
గాని హింసింపఁడు గాన నీవు
4-150.1-తే.
నచ్యుతుని మాయమోహము నందకుంటఁ
జేసి సర్వజ్ఞుఁడవు; మాయచేత మోహి
తాత్ములై కర్మవర్తను లయినవారి
వలన ద్రోహంబుగలిగిన వలయుఁ బ్రోవ.

భావము:
ఓ భవ్యచరితా! నీలలోహితా! పావన గుణ భరితా! లోక పరిపాలా! గంగాధరా! హరా! సకల లోక స్తుత చరిత్రా! మూర్ఖులు మదించి, దుష్టచిత్తులై భేదబుద్ధితో ప్రవర్తిస్తారు. పరుల సంపదను చూచి ఓర్వలేరు. మనోవ్యాధితో క్రుంగిపోతారు. మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నీవు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఆ కపటాత్ములకు నీవంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస కావించడు. సమస్త దేశాలలోను, సర్వ కాలాలలోను ఉల్లంగించరాని మహిమ కల విష్ణువు యొక్క మాయకు చిక్కినవారు భేదదృష్టితో ప్రవర్తిస్తారు. వారు ద్రోహం చేసినట్లైతే సత్పురుషుడు అది దైవకృతంగా భావిస్తాడు. ఆ మహితాత్ముడు ఇతరుల దుఃఖం చూచి ఓర్చుకోలేడు. వారిమీద జాలి పడతాడు. అంతేకాని వారిని హింసింపడు. నీవు విష్ణుమాయకు అతీతుడవు. అందుచేత నీవు సర్వజ్ఞుడవు. విష్ణుమాయకు వశులై కర్మలు ఆచరించేవారు అపరాధం చేసినట్లైతే నీవు క్షమించి వారిని కాపాడాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=149

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 43


(శివుడనుగ్రహించుట )

4-147-సీ.
అనఘ! లోకంబుల యందు వర్ణాశ్రమ;
సేతువు లనఁగఁ బ్రఖ్యాతి నొంది
బలసి మహాజన పరిగృహీతంబులై;
యఖిల ధర్మార్థదాయకము లైన
వేదంబులను మఱి వృద్ధి నొందించుట;
కొఱకునై నీవ దక్షుని నిమిత్త
మాత్రునిఁ జేసి యమ్మఖముఁ గావించితి;
వటుగాన శుభమూర్తివైన నీవు
4-147.1-తే.
గడఁగి జనముల మంగళకర్ము లయిన
వారి ముక్తి, నమంగళాచారు లయిన
వారి నరకంబు, నొందింతు భూరిమహిమ
భక్తజనపోష! రాజితఫణివిభూష!
4-148-వ.
అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?" యని.

భావము:
ఓ భక్తజన పోషణా! పన్నగ భూషణా! లోకాలలో వర్ణాశ్రమాచారాలను వేదాలు నిర్ణయిస్తాయి. గొప్పవారు వేదాలను గౌరవిస్తారు. వేదాలు సర్వ ధర్మార్థాలను ప్రసాదిస్తాయి. ఆ వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్తమాత్రునిగా చేసి ఆ యజ్ఞం చేయించావు. నీవు మంగళ స్వరూపుడవు. నీవు న్ మహిమచేత శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు. అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తల్లక్రిందులుగా కావటానికి నీ కోపం కారణం అని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిల్పి సమస్త ప్రాణులలోను నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకంటే వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా! మహానుభావుడవైన నీకు కోపం ఎక్కడిది?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=147

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, February 24, 2020

దక్ష యాగము - 42


(శివుడనుగ్రహించుట )

4-143-క.
"అనఘ! మహాత్ముం డగు వా
మనుఁ డా కశ్యపునకొగి నమస్కారము చే
సినగతి నజునకు నభివం
దన మొగిఁ గావించె హరుఁడు దద్దయుఁ బ్రీతిన్.
4-144-తే.
అంత రుద్రానువర్తు లైనట్టి సిద్ధ
గణ మహర్షి జనంబులు గని పయోజ
గర్భునకు మ్రొక్కి; రంత నా కమలభవుఁడు
శర్వుఁ గని పల్కె మందహాసంబుతోడ.
4-145-తే.
జగములకు నెల్ల యోనిబీజంబు లైన
శక్తి శివకారణుండవై జగతి నిర్వి
కార బ్రహ్మంబ వగు నిన్నుఁ గడఁగి విశ్వ
నాథుఁ గా నెఱిఁగెద నా మనమున నభవ!
4-146-తే.
సమత నది గాక తావకాంశంబు లైన
శక్తి శివరూపములఁ గ్రీడ సలుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!

భావము:
పుణ్యాత్ముడవైన ఓ విదురా! మహాత్ముడైన వామనుడు కశ్యపునకు నమస్కరించినట్లుగా శివుడు బ్రహ్మకు ఎంతో ఇష్టంతో నమస్కారం చేసాడు. అప్పుడు శివుని అనుచరులైన సిద్ధగణాలు, మునులు బ్రహ్మను చూచి నమస్కరించారు. ఆ తరువాత బ్రహ్మ శివుణ్ణి చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. “ఓ పరమేశ్వరా! లోకాల కన్నింటికి ఉత్పత్తిస్థానం అయిన శక్తివి నీవే. జగత్తుల కన్నింటికీ బీజమైన శివుడు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తెలుసుకున్నాను. ఓ ఈశ్వరా! రుద్రా! నీవు నీ సమాంశాలైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికీ, వృద్ధికీ వినాశానికీ నీవే హేతువు అవుతుంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=146

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 41

(శివుడనుగ్రహించుట )
4-139-వ.
మఱియును.
4-140-సీ.
అంచిత వామపాదాంభోరుహము దక్షి;
ణోరుతలంబున నొయ్య నునిచి
సవ్యజానువుమీఁద భవ్యబాహువు సాఁచి;
వలపలి ముంజేత సలలితాక్ష
మాలిక ధరియించి మహనీయ తర్కము;
ద్రాయుక్తుఁ డగుచుఁ జిత్తంబులోన
నవ్యయం బయిన బ్రహ్మానందకలిత స;
మాధి నిష్ఠుఁడు వీతమత్సరుండు
4-140.1-తే.
యోగపట్టాభిరాముఁడై యుచిత వృత్తి
రోషసంగతిఁ బాసి కూర్చున్న జముని
యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున
నున్న మునిముఖ్యు నంచిత యోగనిరతు.
4-141-క.
అలఘుని నభవుని యోగీం
ద్రులు వినుచుండంగ నారదునితోఁ బ్రియ భా
షలు జరుపుచున్న రుద్రుని
సలలిత పన్నగ విభూషు సజ్జనపోషున్.
4-142-క.
కని లోకపాలురును ముని
జనులును సద్భక్తి నతని చరణంబులకున్
వినతు లయి, రప్పు డబ్జా
సనుఁ గని యయ్యభవుఁ డధిక సంభ్రమ మొప్పన్.

భావము:
ఇంకా ఆ మహేశ్వరుడు కుడితొడపై ఎడమకాలును మోపి, ఎడమ మోకాలిపై ఎడమచేతిని చాచి కూర్చున్నాడు. కుడి ముంజేతిలో జపమాలను ధరించాడు. మహనీయమైన ధ్యానముద్రను ధరించి బ్రహ్మానందంతో నిండిన మనస్సు కలవాడై సమాధి నిష్ఠలో ఉన్నాడు. అతడు మాత్సర్యం లేనివాడు. యోగపట్టంతో ఒప్పుతూ కోపం విడిచిపెట్టి కూర్చున్న యమునివలె దర్భాసనం మీద యోగనిమగ్నుడై ఉన్నాడు. ఆఢ్యుడు, అభవుడు, నాగభూషణుడు, సజ్జన పోషకుడు, యోగీంద్రులు వింటూ ఉండగా నారదునితో ఇష్టసంభాషణం చేస్తున్న ఆ శివుణ్ణి లోకపాలకులూ, మునులూ సద్భక్తితో అతని పాదాలకు నమస్కరించారు. అప్పుడు బ్రహ్మను చూచి ఆ శివుడు సంభ్రమంతో…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=140

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, February 22, 2020

దక్ష యాగము - 40


(శివుడనుగ్రహించుట )

4-136-సీ.
ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ;
వునుఁ బంచసప్తతి యోజనముల
పఱపును గల్గి యే పట్టునఁ దఱుగని;
నీడ శోభిల్ల నిర్ణీత మగుచుఁ
బర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్య;
ములఁ బోలఁగల ఫలములఁ దనర్చి
కమనీయ సిద్ధయోగక్రియామయ మయి;
యనఘ ముముక్షు జనాశ్రయంబు
4-136.1-తే.
భూరిసంసార తాప నివారకంబు
నగుచుఁ దరురాజ మనఁగఁ బెంపగ్గలించి
భక్తజనులకు నిచ్చలుఁ బ్రమద మెసఁగ
వలయు సంపద లందు నావటము వటము.
4-137-వ.
ఆ వృక్షమూలతలంబున.
4-138-సీ.
ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు;
శాంతవిగ్రహుని వాత్సల్యగుణునిఁ
గమనీయ లోకమంగళదాయకుని శివు;
విశ్వబంధుని జగద్వినుత యశుని
గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కు;
బేర సేవితుని దుర్వారబలుని
నుదిత విద్యాతపోయోగ యుక్తుని బాల;
చంద్రభూషణుని మునీంద్రనుతునిఁ
4-138.1-తే.
దాపసాభీష్టకరు భస్మదండలింగ
ఘనజటాజిన ధరుని భక్తప్రసన్ను
వితత సంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న
రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని.

భావము:
వందయోజనాల పొడవు, డెబ్బైయైదు యోజనాల వెడల్పు కలిగిన ఒక మర్రిచెట్టును దేవతలు చూచారు. ఆ చెట్టు నీడ సందులేకుండా అంతటా నిండి ఉంది. ఆ చెట్టు ఆకులతో, కొమ్మలతో అలరారుతూ మాణిక్యాలకు సాటివచ్చే పండ్లతో నిండి ఉన్నది. అది సిద్ధయోగ క్రియలకు ఆలవాలమై దోషరహితమై మోక్షం కోరేవారికి ఆశ్రయమై అలరారుతున్నది. అది సంసారతాపాన్ని తొలగిస్తుంది. ఆ మేటిమ్రాను భక్తులకు ఆనందం కలిగించే ఐశ్వర్యాలకు పుట్టినిల్లు. ఆ మఱ్ఱిచెట్టు క్రింద ప్రసిద్ధులైన సనందుడు మొదలైన సిద్ధులచేత సేవింపబడేవాడు, శాంతమూర్తి, దయాగుణం కలవాడు, లోకాలకు శుభాలను కలిగించేవాడు, శివుడు, విశ్వానికి బంధువైనవాడు, లోకాలు పొగడే కీర్తి కలవాడు, గుహ్యకులూ సాధ్యులూ రాక్షసులూ యక్షులకు రాజైన కుబేరుడూ మున్నగువారిచే సేవింపబడేవాడు, ఎదురులేని బలం కలవాడు, విద్యతో తపస్సుతో యోగంతో కూడినవాడు, నెలవంకను అలంకరించుకున్నవాడు, మునీంద్రులచేత స్తుతింపబడేవాడు, తాపసుల కోరికలను తీర్చేవాడు, విభూతినీ దండాన్నీ జడలనూ గజచర్మాన్నీ ధరించినవాడు, భక్తులను అనుగ్రహించేవాడు, సంధ్యాకాలంలోని మేఘాల కాంతిని పోలిన క్రొత్త ఎర్రని కాంతులతో వెలిగేవాడు, శాశ్వతుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శివుణ్ణి చూశారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=138

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

దక్ష యాగము - 39

(శివుడనుగ్రహించుట )
4-135-వ.
అది మఱియును, మందార పారిజాత సరళ తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీ షార్జున చూత కదంబ నీప నాగ పున్నాగ చంపక పాట లాశోక వకుళ కుంద కురవక కన కామ్ర శతపత్ర కింశు కైలా లవంగ మాలతీ మధూక మల్లికా పనస మాధవీ కుట జోదుంబు రాశ్వత్థ ప్లక్ష వట హింగుళ భూర్జ పూగ జంబూ ఖర్జూ రామ్రాతక ప్రియాళు నారికే ళేంగుద వేణు కీచక ముఖర తరు శోభితంబును, కలకంఠ కాలకంఠ కలవింక రాజకీర మత్తమధుకర నానా విహంగ కోలాహల నినద బధిరీభూత రోదోంతరాళంబును, సింహ తరక్షు శల్య గవయ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్ర కుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్యసత్త్వ సమాశ్రయ విరాజితంబును, కదళీషండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతల లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జలవిహంగకుల కూజిత సంకులంబును, సలిలకేళీవిహరమాణ సతీరమణీ రమణీయ కుచమండల విలిప్త మృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగాతరంగణీ సమావృతంబును నైన కైలాసపర్వతంబు వొడగని, యరవిందసంభవ పురందరాది దేవగణంబు లత్యద్భుతానందంబులం బొంది ముందటఁ దార హీర హేమమయ విమాన సంకులంబును, పుణ్యజన మానినీ శోభితంబును నైన యలకాపురంబు గడచి; తత్పుర బాహ్యప్రదేశంబునం దీర్థపాదుండైన పుండరీకాక్షు పాదారవిందరజః పావనంబును, రతికేళీ వ్యాసంగ పరిశ్రమ నివారక సలిల కేళీవిలోల దేవకామినీ పీనవక్షోజ విలిప్త కుంకుమపంక సంగత పిశంగవర్ణ వారిపూర విలసితంబు నునై; నందాలకనందాభిధానంబులు గల నదీ ద్వితయంబు దాఁటి తత్పురోభాగంబున వనగజ సంఘృష్ట మలయజ పరిమిళిత మలయపవ నాస్వాదన ముహుర్ముహురు న్ముదిత మానస పుణ్యజనకామినీ కదంబంబును, వైదూర్య సోపాన సమంచిత కనకోత్పల వాపీ విభాసితంబును, గింపురుష సంచార యోగ్యంబును నగు సౌగంధిక వన సమీపంబు నందు.

భావము:
ఇంకా ఆ వెండికొండ మందారం, పారిజాతం, తెల్లతెగడ, కానుగు, మద్ది, తాడి, తక్కోలం, ఎఱ్ఱకాంచనం, దిరిసెనం, తెల్లమద్ది, తియ్యమామిడి, కడిమి, మంకెన, నాగవల్లి, సురపొన్న, సంపెంగ, కలిగొట్టు, అశోకం, పొగడ, మొల్ల, ఎఱ్ఱగోరింట, కనకాంబరం, తామర, మోదుగ, ఏలకి, లవంగం, జాజి, ఇప్ప, మల్లె, పనస, పూల గురివెంద, కొండమల్లె, మేడి, రావి, జువ్వి, మఱ్ఱి, ఇంగువ, బుజపత్తిరి, పోక, రాజపూగం, నేరేడు, ఖర్జూరం, ఆమ్రాతకం, మోరటి, కొబ్బరి, అందుగ, గారవెదురు, బొంగువెదురు మొదలైన చెట్లతో శోభిల్లుతున్నది. కోయిలలు, నెమళ్ళు, పావురములు, రామచిలుకలు, గండుతుమ్మెదలు, మొదలైన రకరకాల పక్షుల కలకలంతో భూమ్యాకాశాల మధ్యప్రదేశం ప్రతిధ్వనిస్తున్నది. సింహాలు, సివంగులు, ముళ్ళపందులు, అడవిదున్నలు, శరభమృగాలు, కోతులు, అడవిపందులు, పెద్దపులులు, కుక్కలు, నల్లచారల దుప్పులు, ఎనుబోతులు, తోడేళ్ళు, లేళ్ళు మొదలైన గొప్ప అడవి జంతువులకు ఆశ్రయంగా ఉన్నది. అరటితోపులతోను, తామరపూలతోను, తెల్లకలువలతోను, ఎఱ్ఱకలువలతోను కూడిన ఇసుక ప్రదేశాలతో అందంగా ఉన్న సరోవరాలలో విహరిస్తున్న రాజహంసలు, కొక్కిరాళ్ళు, బెగ్గురుపక్షులు, జక్కవలు, కొంగలు, నీటికోళ్ళు మొదలైన నీటిపక్షుల కూతలతో కలకలంగా ఉంది. జలక్రీడలతో విహరిస్తున్న అందమైన స్త్రీల చనుదోయికి అలదుకొన్న కస్తూరి కలిపిన మంచిగంధపు సువాసనలు కలిగిన గంగానది చేత ఆవరింపబడి ఉన్నది. అటువంటి కైలాసపర్వతాన్ని చూచి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొంది, ఎదురుగా అలకాపురాన్ని చూచారు. అది చుక్కలతో, మంచుతో, బంగారంతో కూడిన విమానాలతో, పుణ్యస్త్రీ సమూహంతో శోభిల్లుతున్నది. ఆ నగరం వెలుపల పూజ్యపాదుడైన విష్ణువు యొక్క పాదపద్మాల ధూళిచేత పవిత్రమై, రతికేళిచేత కలిగిన శ్రమను తొలగించే జలక్రీడలో మునిగిన దేవతాస్త్రీల ఎత్తైన స్తనాలకు అలదుకున్న కుంకుమతో కూడిన గోరోజనం రంగును పొందిన నంద, అలకనంద అనే రెండు నదులున్నాయి. వాటిని దాటి ఎదుట సౌగంధికవనాన్ని చూశారు. ఆ వనంలో ఏనుగులు రాచుకొనడం వల్ల మంచి గంధపుచెట్లనుండి వెలువడే సువాసనలతో కలిసిన గాలిని ఆస్వాదిస్తూ యక్షకన్యలు మాటిమాటికి సంతోషిస్తున్నారు. పచ్చలు పొదిగిన మెట్లు కల దిగుడు బావుల్లో బంగారు కలువలు ప్రకాశిస్తున్నాయి. కింపురుషులు సంచరించడానికి అనువైన ఆ సౌగంధికవనంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=135

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, February 19, 2020

దక్ష యాగము - 38


(శివుడనుగ్రహించుట )

4-133-ఉ.
భాసురలీలఁ గాంచిరి సుపర్వులు భక్తజనైక మానసో
ల్లాసముఁ గిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా
వాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కై
లాసముఁ గాంతి నిర్జిత కులక్షితిభృత్సుమహద్విభాసమున్.
4-134-సీ.
ధాతు విచిత్రితోదాత్త రత్నప్రభా;
సంగ తోజ్జ్వల తుంగ శృంగములును;
గిన్నర గంధర్వ కింపురుషాప్సరో;
జన నికరాకీర్ణ సానువులును;
మానిత నిఖిల వైమానిక మిథున స;
ద్విహరణైక శుభ ప్రదేశములును;
గమనీయ నవమల్లికా సుమనోవల్లి;
కామతల్లీ లసత్కందరములు;
4-134.1-తే.
నమర సిద్ధాంగనా శోభితాశ్రమములు;
విబుధజన యోగ్య సంపన్నివేశములును
గలిగి బహువిధ పుణ్యభోగముల నొప్పు
వినుత సుకృతములకు దండ వెండికొండ.

భావము:
ఆ విధంగా వెళ్ళిన దేవతలు భక్తుల మనస్సులకు అమితమైన ఆనందాన్ని కలిగించేదీ, కిన్నరస్త్రీలు విలాసంగా విహరించేదీ, శాశ్వతాలైన ఐశ్వర్యాలకూ శుభాలకూ స్థానమైనదీ, సిద్ధులూ యక్షులూ నివసించేదీ, వెండి వెలుగులతో నిండినదీ, తన అనంతకాంతులతో కులపర్వతాల శోభావైభవాన్ని పరాభూతం చేసేదీ అయిన కైలాస పర్వతాన్ని కనులపండువుగా దర్శించారు. ధాతుద్రవాలతో పలురంగులు కలిగిన రతనాల కాంతులతో ఆ వెండికొండ ఎత్తైన శిఖరాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కొండచరియలు కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసలు మున్నగువారితో నిండి ఉన్నాయి. దేవతలు తమ భార్యలతో కూడి విమానాలపై ఆయా ప్రదేశాలలో విహరిస్తున్నారు. గుహలచుట్టూ చిక్కని విరజాజి పూలతీగలు అల్లుకొని ఉన్నాయి. అక్కడి ఆశ్రమాలలో దేవతాస్త్రీలు, సిద్ధస్త్రీలు ఉంటున్నారు. దేవతలు సంచరించటానికి అక్కడి చోట్లన్నీ తగి ఉన్నాయి. చేసిన పుణ్యాలకు పెక్కురకాల భోగాలను అక్కడ అనుభవిస్తున్నారు. ఆ వెండికొండ పుణ్యాల పూలదండగా ఉన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=134

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 37


(శివుడనుగ్రహించుట )

4-131-సీ.
పూని యే దేవుని బొమముడి మాత్రన;
లోకపాలకులును లోకములును
నాశ మొందుదు; రట్టి యీశుండు ఘన దురు;
క్త్యస్త్ర నికాయ విద్ధాంతరంగుఁ
డును బ్రియా విరహితుండును నైనవాఁ డమ్మ;
హాత్మునిఁ ద్రిపుర సంహారకరుని
మఖపునస్సంధానమతి నపేక్షించు మీ;
రలు చేరి శుద్ధాంతరంగు లగుచు
4-131.1-తే.
భక్తినిష్ఠలఁ దత్పాద పద్మ యుగళ
ఘన పరిగ్రహ పూర్వంబుగాఁగ నతని
శరణ మొందుఁ డతండు ప్రసన్నుఁ డయినఁ
దివిరి మీ కోర్కి సిద్ధించు దివిజులార!"
4-132-వ.
అని మఱియు నిట్లనియె;అద్దేవుని డాయం జన వెఱతు మని తలంపకుండు; అతనిఁ జేరు నుపాయం బెఱింగిపుమంటి రేని, నేను నింద్రుండును మునులును మీరలును మఱియు దేహధారు లెవ్వ రేని నమ్మహాత్ముని రూపంబు నతని బలపరాక్రమంబుల కొలఁదియు నెఱుంగజాలము; అతండు స్వతంత్రుండు గావునఁ దదుపాయం బెఱింగింప నెవ్వఁడు సమర్థుం డగు; అయిన నిపుడు భక్తపరాధీనుండును శరణాగత రక్షకుండు నగు నీశునిఁ జేరం బోవుదము;" అని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం గూడి కైలాసాభిముఖుఁ డై చనిచని.
భావము:
ఏ మహాదేవుడు కోపంతో కనుబొమలు ముడిస్తే లోకాలూ, లోకపాలకులూ నశిస్తారో ఆ మహనీయుని మనస్సు దక్షుని దురుక్తులు అనే బాణాలు గ్రుచ్చుకొని ఇదివరకే నొచ్చింది. ఇప్పుడు ఆ మహాత్మునికి భార్యావియోగం కూడా ప్రాప్తించింది. తిరిగి యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనే కోరిక మీకు ఉన్నట్లయితే త్రిపుర సంహారుడైన ఆ హరుని, ఆ మహాదేవుని, ఆ మహానుభావుని నిండుహృదయంతో, నిర్మల భక్తితో ఆశ్రయించండి. ఆయన పాదపద్మాలపై బడి శరణు వేడండి. ఆ దయామయుడు దయ దలిస్తే మీ కోరిక నెరవేరుతుంది. ” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు “మేము ఆయనను సమీపించటానికి భయపడుతున్నాము అని భావించకండి. ఆయన దగ్గరకు పోయే ఉపాయం నన్ను చెప్పమంటారా? నేను, దేవేంద్రుడు, మునులు, మీరు, దేహధారులు ఎవరుకూడా ఆ మహాత్ముని స్వరూపాన్నీ, ఆయన బలపరాక్రమాల పరిమాణాన్నీ తెలుసుకోలేము. ఆయన సర్వస్వతంత్రుడు. కాబట్టి ఆయనను సమీపించే ఉపాయం చెప్పటానికి ఎవ్వరూ సమర్థులు కారు. అయినా ఆయన భక్తులకు అధీనుడు. శరణు జొచ్చిన వారిని రక్షించేవాడు. అందుచేత ఆయన వద్దకు మనం అందరం కలిసి వెళ్ళటం మంచిది” అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలను, పితృదేవతలను, ప్రజాపతులను వెంటబెట్టుకొని కైలాసానికి బయలుదేరి పోయి పోయి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=131

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, February 15, 2020

దక్ష యాగము - 36

(శివుడనుగ్రహించుట )

4-126-తే.
ఇంతయును మున్ను మనమున నెఱిఁగి యున్న
కతన విశ్వాత్మకుండును గమలలోచ
నుండు నన నొప్పు నారాయణుండు నజుఁడుఁ
జూడ రారైరి మున్ను దక్షుని మఖంబు.
4-127-వ.
అని చెప్పి “సుర లిట్లు విన్నవించినఁ జతుర్ముఖుండు వారల కిట్లనియె.
4-128-క.
"ఘన తేజోనిధి పురుషుం
డనయంబుఁ గృతాపరాధుఁ డయినను దా మ
ల్లన ప్రతికారముఁ గావిం
చిన జనులకు లోకమందు సేమము గలదే?"
4-129-వ.
అని మఱియు నిట్లనియె.
4-130-క.
"క్రతుభాగార్హుం డగు పశు
పతి నీశ్వరు నభవు శర్వు భర్గుని దూరీ
కృత యజ్ఞభాగుఁ జేసిన
యతి దోషులు దుష్టమతులు నగు మీ రింకన్.


భావము:
“ఇదంతా ముందే మనస్సులో తెలుసుకొని ఉండడం చేత విశ్వస్వరూపుడు, కమలాక్షుడు అయిన నారాయణుడు, బ్రహ్మదేవుడు దక్షుని యజ్ఞాన్ని చూడటానికి రాలేదు.” అని చెప్పి మైత్రేయుడు ఇంకా ఇలా అన్నాడు “దేవతలు ఈ విధంగా విన్నవించగా బ్రహ్మ వారితో ఇలా అన్నాడు. “మహాతేజస్సంపన్నుడైనవాడు అపరాధం చేసినా తిరిగి అతనికి అపకారం చేసేవారికి ఈ లోకంలో క్షేమం ఉంటుందా?” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. యజ్ఞంలో హవిర్భాగం అందుకొనడానికి యోగ్యుడైన పశుపతి, ఈశ్వరుడు, అభవుడు, శర్వుడు, భర్గుడు అయిన పరమేశ్వరుణ్ణి యజ్ఞభాగానికి దూరం చేయడం అనే గొప్ప దోషాన్ని చేసిన దుష్టులు మీరు

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=128

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 35


(దక్షాధ్వర ధ్వంసము )

4-122-సీ.
అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు;
గైకొని దక్షు వక్షంబుఁ ద్రొక్కి
ఘనశితధారాసిఁ గొని మేను వొడిచియు;
మంత్రసమన్విత మహిత శస్త్ర
జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుఁ;
జంపఁగా లేక విస్మయము నొంది
తద్వధోపాయంబు దన చిత్తమునఁ జూచి;
కంఠనిష్పీడనగతిఁ దలంచి
4-122.1-తే.
మస్తకముఁ దున్మి యంచితామర్షణమున
దక్షిణాలనమున వేల్చెఁ దదనుచరులు
హర్షమును బొంద; నచటి బ్రాహ్మణజనంబు
లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ.
4-123-వ.
ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజ నివాసంబైన కైలసంబునకుఁ జనియె నయ్యవసరంబున.
4-124-చ.
హరభటకోటిచేత నిశి తాసి గదా కరవాల శూల ము
ద్గర ముసలాది సాధనవిదారిత జర్జరితాఖిలాంగులై
సురలు భయాకులాత్ము లగుచున్ సరసీరుహజాతుఁ జేరి త
చ్చరణ సరోరుహంబులకు సమ్మతిఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై.
4-125-క.
తము ధూర్జటి సైనికు లగు
ప్రమథులు దయమాలి పెలుచ బాధించుట స
ర్వముఁ జెప్పి" రనుచు మైత్రే
య మునీంద్రుఁడు విదురుతోడ ననియెన్; మఱియున్.


భావము:
వీరభద్రుడు సాటిలేని దర్పంతో విజృంభించి దక్షుణ్ణి పడవేసి రొమ్ము త్రొక్కిపట్టి వాడి అంచు కలిగిన కత్తితో ఒడలంతా తూట్లు పొడిచాడు. కాని మంత్రపూతాలయిన అనేక శస్త్రాస్త్రాలతో గట్టిపడిన చర్మం కలిగిన దక్షుణ్ణి చంపలేక ఆశ్చర్యపడి, అతణ్ణి చంపే ఉపాయాన్ని ఆలోచించి మెడ నులిమి, శిరస్సు తునిమి దక్షిణాగ్ని కుండంలో వేసి భస్మం చేశాడు. అది చూచి వీరభద్రుని అనుచరులు సంతోషించగా, అక్కడి బ్రాహ్మణులు మనస్సులో ఎంతో బాధపడ్డారు. ఈ విధంగా వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివభటుల చేతుల్లోని వాడి కత్తులు, గదలు, శూలాలు, ఇనుపగుదియలు, రోకళ్ళు మొదలైన ఆయుధాల దెబ్బలకు అవయవాలన్నీ గాయపడగా దేవతలు భయంతో గుండె చెదరి బ్రహ్మదేవుణ్ణి సమీపించి, అతని పాదపద్మాలకు మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారాలు చేసి, వినయంతో శివుని సైనికులైన ప్రమథులు విజృంభించి నిర్దాక్షిణ్యంగా తమను బాధించిన విషయాన్నంతా చెప్పారు” అని మైత్రేయ మునీంద్రుడు విదురునితో చెప్పాడు. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=124

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, February 13, 2020

దక్ష యాగము - 34


(దక్షాధ్వర ధ్వంసము )

4-120-తే.
కుపితుఁడై నాఁడు భవుని దక్షుఁడు శపింపఁ
"బరిహసించిన" పూషుని పండ్లు డుల్లఁ
గొట్టె బలభద్రుఁ డా కళింగుని రదంబు
లెలమి డులిచిన పగిదిఁ జండీశ్వరుండు.
4-121-క.
తగవేది దక్షుఁ డా సభ
నగచాపుఁ దిరస్కరించునాఁ డట "శ్మశ్రుల్
నగుచుం జూపుట" నా భృగు
పగకై శ్మశ్రువులు వీరభద్రుఁడు వెఱికెన్.
4-122-సీ.
అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు;
గైకొని దక్షు వక్షంబుఁ ద్రొక్కి
ఘనశితధారాసిఁ గొని మేను వొడిచియు;
మంత్రసమన్విత మహిత శస్త్ర
జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుఁ;
జంపఁగా లేక విస్మయము నొంది
తద్వధోపాయంబు దన చిత్తమునఁ జూచి;
కంఠనిష్పీడనగతిఁ దలంచి
4-121-క.
తగవేది దక్షుఁ డా సభ
నగచాపుఁ దిరస్కరించునాఁ డట "శ్మశ్రుల్
నగుచుం జూపుట" నా భృగు
పగకై శ్మశ్రువులు వీరభద్రుఁడు వెఱికెన్.

భావము:
ఆనాడు దక్షుడు కోపంతో శివుని శపించినప్పుడు పరిహాసం చేసిన పూషుని దంతాలను బలభద్రుడు కళింగుని దంతాలను రాలగొట్టినట్లు చండీశ్వరుడు రాలగొట్టాడు. ఆనాడు దక్షుడు అన్యాయంగా శివుని దూషించినప్పుడు నవ్వుతూ మీసాలను చూపించిన భృగువు మీసాలను వీరభద్రుడు పెరికివేశాడు. వీరభద్రుడు సాటిలేని దర్పంతో విజృంభించి దక్షుణ్ణి పడవేసి రొమ్ము త్రొక్కిపట్టి వాడి అంచు కలిగిన కత్తితో ఒడలంతా తూట్లు పొడిచాడు. కాని మంత్రపూతాలయిన అనేక శస్త్రాస్త్రాలతో గట్టిపడిన చర్మం కలిగిన దక్షుణ్ణి చంపలేక ఆశ్చర్యపడి, అతణ్ణి చంపే ఉపాయాన్ని ఆలోచించి మెడ నులిమి, శిరస్సు తునిమి దక్షిణాగ్ని కుండంలో వేసి భస్మం చేశాడు. అది చూచి వీరభద్రుని అనుచరులు సంతోషించగా, అక్కడి బ్రాహ్మణులు మనస్సులో ఎంతో బాధపడ్డారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=122

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :


దక్ష యాగము - 33


(దక్షాధ్వర ధ్వంసము )

4-118-వ.
అని యి వ్విధంబున భయవిహ్వలలోచనలై పలుకుచున్న సమయంబున మహాత్ముండైన దక్షునకు భయావహంబులై సహస్ర సంఖ్యాతంబు లైన మహోత్పాతంబులు భూనభోంతరంబులఁ గానంబడుచుండె; ఆ సమయంబున రుద్రానుచరులు నానావిధాయుధంబులు ధరియించి కపిల పీత వర్ణంబులు గలిగి వామనాకారులు, మకరోదరాననులు నై యజ్ఞశాలాప్రదేశంబునం బరువులుపెట్టుచుఁ గదియం జనుదెంచి దక్షాధ్వర వాటంబులు విటతాటంబులు చేయుచుం, గొందఱు ప్రాగ్వంశంబును, గొందఱు పత్నీశాలయు, కొందఱు సదస్య శాలయుఁ, గొంద ఱాగ్నీధ్ర శాలయు, కొందఱు యజమాన శాలయుఁ, గొందఱు మహానస గృహంబును విధ్వంసంబులు గావించిరి; మఱియుఁ గొందఱు యజ్ఞపాత్రంబుల నగ్నులం జెఱచిరి; వెండియుఁ గొందఱు హోమాగ్ను లార్చిరి; పదంపడి కొందఱు హోమకుండంబుల యందు మూత్రంబులు విడిచిరి; కొంద ఱుత్తరవేదికా మేఖలలు ద్రెంచిరి; కొందఱు మునుల బాధించిరి; కొందఱు తత్పత్నుల వెఱపించిరి; మఱికొందఱు దేవతా నిరోధంబుఁ గావించిరి; అంత మణిమంతుండు భృగువును, వీరభద్రుండు దక్షునిఁ, జండీశుండు పూషుని, భగుని నందీశ్వరుండును బట్టిరి; ఇవ్విధంబున సదస్య దేవ ఋత్విఙ్నికాయంబుల శిలల ఱువ్వియు, జానువులఁ బొడిచియు, నఱచేతుల నడచియు, గుల్ఫంబులఁ బొడిచియు వివిధ బాధలు పఱచిన వారు కాందిశీకు లై యెక్కడెక్క డేనిం జనిరి; మఱియును.
4-119-క.
మును దక్షుఁ డభవుఁ బలుకఁ "గఁ
గను గీఁటిన" భగునిఁ బట్టి కన్నులు పెకలిం
చెను నందీశ్వరుఁ; డచ్చటి
జనములు హాహారవముల సందడి గొలుపన్.


భావము:
అని ఈ విధంగా భయంతో వెఱ్ఱిచూపులు చూస్తూ పలుకుతుండగా గొప్పవాడైన దక్షునకు భయాన్ని కలిగిస్తూ వేలకొలది అపశకునాలు భూమిపైనా ఆకాశంలోనూ కనిపించసాగాయి. ఆ సమయంలో గోరోజనం వంటి రంగు కలవారు, పసుపుపచ్చని రంగు కలవారు, పొట్టివారు, మొసలిపొట్ట వంటి ముఖాలు కలవారు అయిన ప్రమథగణాలు రకరకాలైన ఆయుధాలను ధరించి పరుగున వచ్చి దక్షుని యజ్ఞశాలను సమీపించి, యజ్ఞవాటికలను చెల్లాచెదరు చేశారు. కొందరు ప్రాగ్వంశాన్ని (యజ్ఞశాల ప్రాంత గృహాన్ని), కొందరు పత్నీశాలను (యజ్ఞ యజమాని భార్య ఉండే శాలను), కొందరు సదస్యశాలను (సభాస్థలి శాలను), కొందరు అగ్నీధ్రశాలను (అగ్నిని ధరంచే ఋత్విక్కుల శాలను), కొందరు యజమానశాలను (యజ్ఞ యజమాని అయిన దక్షుని శాలను), కొందరు వంటశాలను నాశనం చేశారు. మరికొందరు యజ్ఞపాత్రలను, అగ్నిగుండాలను ధ్వంసం చేశారు. ఇంకా కొందరు హోమాగ్నులను ఆర్పివేశారు. ఆ తరువాత కొందరు హోమకుండాలలో మూత్రవిసర్జన చేశారు. కొందరు ఉత్తర దిక్కున ఉన్న వేదిక యొక్క తోరణాలను త్రెంచివేశారు. కొందరు మునులను బాధించారు. కొందరు వారి భార్యలను భయపెట్టారు. మరికొందరు దేవతలను అడ్డుకున్నారు. అప్పుడు మణిమంతుడు భృగువును, వీరభద్రుడు దక్షుని, చండీశుడు పూషుని, నందీశ్వరుడు భగుని పట్టుకొన్నారు. ఈ విధంగా సదస్యులైన దేవతల, ఋత్విక్కుల సమూహాన్ని రాళ్ళతో కొట్టి, మోకాళ్ళతో పొడిచి రకరకాల బాధలు పెట్టగా వాళ్ళంతా కాందిశీకులై ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. పూర్వం దక్షుడు శివుని నిందించినప్పుడు కన్ను గీటిన భృగుని పట్టుకొని నందీశ్వరుడు అక్కడి జనం హాహాకారాలు చేస్తుండగా అతని కన్నులను పెకలించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=118

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, February 12, 2020

దక్ష యాగము - 32


(దక్షాధ్వర ధ్వంసము )

4-115-వ.
వెండియు నిట్లనిరి "కుపితాత్ముండైన దక్షుండు దన కూఁతుతో విరోధంబు చాలక జగత్సంహార కారణుం డయిన రుద్రునిం గ్రోధింప జేసె; అమ్మహాత్ముం డెంతటివాఁ డన్నం బ్రళయకాలంబున
4-116-సీ.
సుమహిత నిశిత త్రిశూలాగ్ర సంప్రోత;
నిఖిల దిక్కరి రాజనివహుఁ డగుచుఁ
జటులోగ్రనిష్ఠుర స్తనిత గంభీరాట్ట;
హాస నిర్భిన్నాఖిలాశుఁ డగుచు
భూరి కరాళవిస్ఫార దంష్ట్రా హతి;
పతిత తారాగణ ప్రచయుఁ డగుచు
వివిధ హేతివ్రాత విపుల ప్రభాపుంజ;
మండిత చండ దోర్దండుఁ డగుచు
4-116.1-తే.
వికట రోష భయంకర భ్రుకుటి దుర్ని
రీక్ష్య దుస్సహ తేజోమహిమఁ దనర్చి
ఘన వికీర్ణ జటాబంధ కలితుఁ డగుచు
నఖిల సంహార కారణుఁ డయి నటించు.
4-117-తే.
అట్టి దేవునిఁ ద్రిపుర సంహార కరునిఁ
జంద్రశేఖరు సద్గుణసాంద్రు నభవు
మనము రోషింపఁ జేసిన మంగళములఁ
బొంద వచ్చునె పద్మగర్భునకునైన?"


భావము:
ఇంకా ఇలా అన్నారు “దక్షుడు కోపంతో తన కుమార్తెతో వైరం తెచ్చుకొనడమే కాక ప్రళయకారకుడైన రుద్రునకు కోపం తెప్పించాడు. మహాత్ముడైన ఆ శివుడు ఎంతటివాడంటే ప్రళయకాలంలో...
మహోగ్రమైన తన త్రిశూలాగ్రాన దిగ్గజాల నన్నిటిని గుది గ్రుచ్చేవాడై, దిక్కులన్నీ దద్దరిల్లి బీటలువారే విధంగా ఉరుమినట్లుగా గంభీరంగా అట్టహాసం చేస్తూ, తన వాడియైన గొప్ప కోరల ఘాతాలతో నక్షత్రమండలాన్ని నేల రాలుస్తూ, తన భయంకరమైన చేతులతో ధగధగ మెరిసే రకరకాల ఆయుధాలను ధరిస్తూ, ప్రచండ కోపంతో కనుబొమలను ముడివేసి, తేరి చూడరాని తేజస్సుతో, జడలను విరబోసుకొని ప్రళయనాట్యం చేస్తూ సర్వాన్ని సంహరిస్తాడు. అటువంటి దేవదేవునికి, త్రిపురసంహారికి, చంద్రచూడునకు, సకల సద్గుణ విభవునకు, అభవుని మనస్సుకు ఆగ్రహం తెప్పించి బ్రహ్మదేవుడైనా శుభాలను పొందగలడా?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=116

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 31


(దక్షాధ్వర ధ్వంసము )

4-112-చ.
సరభసవృత్తి నట్లరుగు సైన్యపదాహత ధూత ధూళి ధూ
సరిత కుబేరదిక్తటము సభ్యులు దక్షుఁడుఁ జూచి "యెట్టి భీ
కర తమ" మం చనం "దమముగాదు, రజఃపటలం" బటంచు ని
వ్వెఱపడి పల్కి రాత్మల వివేకవిహీనతఁ బొంది వెండియున్.
4-113-సీ.
ఈ ధూళి పుట్టుట కెయ్యది హేతువో? ;
విలయ సమీరమా? పొలయ దిపుడు;
ప్రాచీనబర్హి ధరాపతి మహితోగ్ర;
శాసనుఁ డిపుడు రాజ్యంబు సేయఁ
జోర సంఘములకో రారాదు; మఱి గోగ;
ణాళి రాకకు సమయంబు గాదు;
కావున నిప్పుడు కల్పావసానంబు;
గాఁబోలుఁ; గా దటు గాక యున్న
4-113.1-తే.
నిట్టి యౌత్పాతిక రజ మెందేనిఁ గలదె?'
యనుచు మనముల భయమంది రచటి జనులు
సురలు దక్షుఁడు; నంతఁ బ్రసూతి ముఖ్యు
లయిన భూసురకాంత లిట్లనిరి మఱియు.
4-114-క.
"తన కూఁతులు సూడఁగ నిజ
తనయను సతి ననపరాధఁ దగవఱి యిట్లె
గ్గొనరించిన యీ దక్షుని
ఘనపాప విపాక మిదియుఁ గాఁదగు ననుచున్."


భావము:
మహావేగంగా వస్తున్న వీరభద్రుని సైన్యం కాళ్ళ తొక్కిళ్ళచేత రేగిన ధూళికి కమ్మిన ఉత్తరపు దిక్కును, యజ్ఞశాలలోని సభ్యులూ, దక్షుడూ చూసారు; “అబ్బా! ఎంత భయంకరమైన కారుచీకటో” అని అనుకున్నారు; మళ్ళీ “కారుచీకటి కాదు, రేగిన దుమ్ము” అనుకుంటూ భయపడ్డారు; వివేకం కోల్పోయారు; ఇంకా ఇలా అనుకోసాగారు. “ఈ దుమ్ము పుట్టడానికి కారణమేమిటి? ప్రళయ వాయువులా? కాని ఇది ప్రళయకాలం కాదు. చండశాసనుడైన ప్రాచీనబర్హి రాజ్యం చేస్తున్నందున దొంగలగుంపు వచ్చే అవకాశం లేదు. ఆవుల మంద వచ్చే సాయంకాల సమయం కాదు. ఇది కల్పాంతమే కావచ్చు. కాకుంటే ఉత్పాతాన్ని సూచించే ఇంతటి ధూళి ఎలా వస్తుంది?” అని అక్కడి జనులు, దేవతలు, దక్షుడు తమ మనస్సులలో భయపడ్డారు. అప్పుడు ప్రసూతి మొదలైన బ్రాహ్మణస్త్రీలు ఇలా అన్నారు. “ఈ విధంగా తన కుమార్తెలు చూస్తుండగా ఏ అపరాధమూ ఎరుగని తన కూతురు సతీదేవిని అన్యాయంగా అవమానించిన ఈ దక్షుని మహాపాపానికి ఫలితం ఈ ధూళి అయి ఉంటుంది” అంటూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=113

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, February 10, 2020

దక్ష యాగము - 30


(దక్షాధ్వర ధ్వంసము )

4-108-తే.
వీరభద్రుండు విహత విద్వేషి భద్రుఁ
డగుచుఁ దన వేయి చేతులు మొగిచి వినయ
మెసఁగ "నే నేమి సేయుదు? నెఱుఁగ నాకు
నానతి" మ్మన్న నతని కయ్యభవుఁ డనియె.
4-109-చ.
"గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల నీ
వరయ వరూధినీవరుఁడవై చని యజ్ఞము గూడ దక్షునిన్
బరువడిఁ ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయమంటివే
నరిది మదంశసంభవుఁడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్?"
4-110-వ.
అని కుపిత చిత్తుండై యాజ్ఞాపించిన "నట్లకాక" యని.
4-111-చ.
అనఘుఁడు రుద్రుఁ జేరి ముదమారఁ బ్రదక్షిణ మాచరించి వీ
డ్కొని యనివార్య వేగమునఁ గుంభిని గ్రక్కదలన్ ఝళంఝళ
ధ్వని మణినూపురంబులు పదంబుల మ్రోయఁగ భీషణప్రభల్
దనరఁ గృతాంత కాంతకశితస్ఫుట శూలముఁ బూని చెచ్చెరన్.


భావము:
వీరభద్రుడు శత్రు సంహారాన్ని తలపెట్టినవాడై తన వేయి చేతులు మోడ్చి వినయంతో “నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి” అని అడిగాడు. అప్పు డతనితో శివుడు ఇలా అన్నాడు. “యుద్ధవిద్యా విశారదుడవైన భుజపరాక్రమశాలీ! నా ప్రమథగణాల కంతటికీ నీవు సేనానివై వెంటనే వెళ్ళి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని సంహరించు. బ్రాహ్మణతేజం అజేయమని సందేహించకు. నా అంశతో జన్మించిన నీకు అసాధ్య మెక్కడిది?” అని కోపంతో ఆజ్ఞాపించగా అలాగే అని పుణ్యాత్ముడైన వీరభద్రుడు శివుని సమీపించి ప్రదక్షిణం చేసి అతని సెలవు తీసుకొని అడ్డులేని మహావేగంతో భూమి అదిరిపోతుండగా, పాదాలకు తొడిగిన మణులు తాపిన అందెలు ఝళంఝళమంటూ మ్రోగుతుండగా, యముణ్ణి సైతం అంతం చేయగల్గిన వాడిశూలాన్ని ధరించి వెంటనే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=111

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

దక్ష యాగము - 29


(దక్షాధ్వర ధ్వంసము )

4-105-శా.
ఆద్యుం డుగ్రుఁడు నీలకంఠుఁ డిభదైత్యారాతి దష్టోష్ఠుఁడై
మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమప్రక్రియన్ నవ్వుచున్
విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చంచజ్జటన్
సద్యః క్రోధముతోడఁ బుచ్చివయిచెన్ క్ష్మాచక్ర మధ్యంబునన్.
4-106-వ.
ఇట్లు పెఱికి వైచిన రుద్రుని జట యందు.
4-107-సీ.
అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ;
కృన్నీలదీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల;
జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ;
సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక;
వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను
4-107.1-తే.
గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.


భావము:
ఆదిదేవుడు, ఉగ్ర రూపుడు, నీలగ్రీవుడు, గజాసుర సంహారి అయిన శివుడు పెదవి కరచుకొని, మదించిన సింహంవలె గర్జించి, భయంకరంగా నవ్వుతూ మెరుపువలె అగ్నిజ్వాల వలె ప్రకాశించే జటను మహాకోపంతో పెరికి భూమిపైన విసరికొట్టాడు. ఈ విధంగా పెరికివేసిన శివుని జట నుండి సకల లోకాలకూ భయం కలిగించే రెండవ రుద్రుని వలె వీరభద్రుడు ఉదయించాడు. ఆయన సుదీర్ఘమైన నల్లని శరీరం ఆకాశాన్ని అంటుతూ కాలమేఘ మేమో అనే భ్రాంతి కలిగిస్తున్నది. తల వెంట్రుకలు భగభగమండే మంటల ప్రజ్వలనంలా ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల వంటి వెయ్యి బాహుదండాలలో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి. ఆయన మూడు కన్నులు చండప్రచండ మార్తాండుల వంటి ప్రకాశంతో కళ్ళెత్తి తేరి చూడరాకుండా ఉన్నాడు. మెడనిండా కపాలమాలలు వ్రేలాడుతుండగా. వంకర్లు తిరిగి రంపాల్లా కరకు దేలిన కోరలుతో మిక్కలి భయంకరంగా ఉన్నాడు. దక్షయజ్ఞంలో ఉమాదేవి యోగాగ్ని యందు దగ్ధమయింది. పరమశివుడు మహాకోపంతో తన జటాజూటం నుంచి ఒక జట పెరికి భూమి మీద విసిరి కొట్టాడు. ఆ మహారుద్రుని జట నుంచి వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసార్థమై ఉదయించాడు. ఈ సందర్భంలో పదౌచిత్యం వృత్తౌచిత్యం భావౌచిత్యం శబ్దాడంబరం అర్థగాంభీర్యాలతో అలవోకగా అలరించే మన సహజకవి ఈ పోతనామాత్యల సీసపద్యం వీరభద్రుని బహుదీర్ఘదేహాన్ని సూచిస్తున్న మణిరత్మం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&padyam=107

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, February 9, 2020

దక్ష యాగము - 28


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-103-క.
ఆ రవ మపు డీక్షించి మ
హారోషముతోడ భృగుమహాముని క్రతు సం
హారక మారక మగు ' నభి
చారకహోమం ' బొనర్చె సరభసవృత్తిన్.
4-104-వ.
ఇట్లు దక్షిణాగ్ని యందు వేల్చిన నందుఁ దపం బొనర్చి సోమలోకంబున నుండు సహస్ర సంఖ్యలు గల 'ఋభు' నామధేయు లైన దేవత లుదయించి బ్రహ్మతేజంబునం జేసి దివ్య విమానులై యుల్ముకంబులు సాధనంబులుగా ధరియించి రుద్రపార్షదులయిన 'ప్రమథ' 'గుహ్యక' గణంబులఁ బాఱందోలిన వారును బరాజితులైరి; తదనంతరంబ నారదు వలన నభవుండు దండ్రిచే నసత్కృతురా లగుటం జేసి భవాని పంచత్వంబునొందుటయుం 'బ్రమథగణంబులు' 'ఋభునామక దేవతల'చేఁ బరాజితు లగుటయు విని.


భావము:
ఆ సందడిని చూసి అధ్వర్యుడైన భృగుమహర్షి మిక్కిలి కోపంతో యజ్ఞనాశకులను సంహరించే అభిచారక హోమాన్ని వెంటనే చేశాడు. ఈ విధంగా భృగువు దక్షిణాగ్నిలో వ్రేల్వగా తపస్సు చేసి సోమలోకాన్ని పొందిన ఋభువులు అనే దేవతలు వేలకొలదిగా పుట్టి, బ్రహ్మతేజస్సుతో దివ్యవిమానా లెక్కి, మండుతున్న కొరవులు ఆయుధాలుగా ధరించి, రుద్రుని అనుచరులైన ప్రమథులను, గుహ్యకులను తరిమివేశారు. ఆ తరువాత తండ్రిచేత అవమానింపబడి భవాని మరణించిందని, ప్రమథాదులు ఋభువులచేత ఓడిపోయారని నారదుని వలన శివుడు విన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=104

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

దక్ష యాగము - 27


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-101-సీ.
"సకల చరాచర జనకుఁ డై నట్టి యీ;
దక్షుండు దన కూర్మి తనయ మాన
వతి పూజనీయ యీ సతి దనచే నవ;
మానంబు నొంది సమక్ష మందుఁ
గాయంబు దొఱఁగంగఁ గనుఁగొను చున్నవాఁ;
డిట్టి దురాత్ముఁ డెందేనిఁ గలఁడె?
యనుచుఁ జిత్తంబుల నాశ్చర్యములఁ బొంది, ;
రదియునుఁ గాక యి ట్లనిరి యిట్టి
4-101.1-తే.
దుష్టచిత్తుండు బ్రహ్మబంధుండు నయిన
యీతఁ డనయంబుఁ దా నపఖ్యాతిఁ బొందు
నిందఁబడి మీఁద దుర్గతిఁ జెందుగాక!"
యనుచు జనములు పలుకు నయ్యవసరమున.
4-102-క.
దేహము విడిచిన సతిఁ గని
బాహాబల మొప్ప రుద్రపార్షదులును ద
ద్ద్రోహిం ద్రుంచుటకై యు
త్సాహంబున లేచి రసిగదాపాణులునై.


భావము:
సకల చరాచరాలను సృష్టించే ఈ దక్షుడు అభిమానవతి, పూజ్యురాలు అయిన తన ప్రియపుత్రిక సతీదేవి తన చేత అవమానింపబడి, తన ఎదుటనే శరీరాన్ని విడవడం చూస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుడు ఎక్కడైనా ఉన్నాడా?” అని ఆశ్చర్యపడ్డారు. ఇంకా ఇలా అన్నారు “ఇటువంటి దుష్టుడు పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు. ఇతడు తప్పక అపకీర్తిని పొంది, నిందల పాలయి, నరకంలో పడతాడు” అని దూషించే సమయంలో మరణించిన సతీదేవిని చూసి శివుని అనుచరులైన ప్రమథగణాలు అతిశయించిన బాహుబలంతో కత్తులు గదలు చేతుల్లో ధరించి దక్షుని సంహరించడానికి ఉత్సాహంతో లేచారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=101

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, February 5, 2020

దక్ష యాగము - 26


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-97-సీ.
వరుసఁ బ్రాణాపాన వాయునిరోధంబు;
గావించి వాని నేకముగ నాభి
తలమునఁ గూర్చి యంతట నుదానము దాఁక;
నెగయించి బుద్ధితో హృదయపద్మ
మున నిల్పి వాని మెల్లన కంఠమార్గము;
నను మఱి భ్రూమధ్యమున వసింపఁ
జేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే;
నాథునిఁ దక్క నన్యంబుఁ జూడ
4-97.1-తే.
కమ్మహాత్ముని యంక పీఠమ్మునందు
నాదరంబున నుండు దేహంబు దక్షు
వలని దోషంబునను విడువంగఁ దలఁచి
తాల్చెఁ దనువున ననిలాగ్ని ధారణములు.
4-98-వ.
ఇట్లు ధరియించి గతకల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజయోగ సమాధి జనితం బయిన వహ్నిచేఁ దత్క్షణంబ దగ్ధ యయ్యె; అంత.
4-99-క.
అది గనుఁగొని "హాహా"ధ్వని
వొదలఁగ నిట్లనిరి మానవులుఁ ద్రిదశులు "నీ
మదిరాక్షి యకట దేహము
వదలెఁ గదా! దక్షుతోడి వైరము కతనన్."
4-100-వ.
మఱియు నిట్లనిరి.


భావము:
ప్రాణాపానాలనబడే వాయువులను నిరోధించి, వాటి నొక్కటిగా చేసి బొడ్డుతో కలిపి, ఉదానస్థానం వరకు ఎక్కించి, బుద్ధిపూర్వకంగా హృదయపద్మంలో నిలిపి, మెల్లగా కంఠమార్గంలో భ్రూమధ్య భాగానికి చేర్చి, మనస్సులో శివుని పాదపద్యాలను ధ్యానిస్తూ అతన్ని తప్ప ఇతరములైనవేవీ చూడక అతని ఒడిలో ఆదరంతో ఉండే దేహాన్ని దక్షుని కారణంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకొని, యోగాగ్నిని రగుల్కొల్పింది. ఈ విధంగా దోషాలను పోగొట్టుకొన్న దేహం కలిగిన ఆ సతీదేవి తన యోగసమాధి నుండి పుట్టిన అగ్నిచేత వెంటనే కాలిపోయింది. అప్పుడు అది చూచి అక్కడి మానవులు, దేవతలు హాహాకారాలు చేస్తూ “అయ్యో! ఈ సతీదేవి దక్షునిమీది కోపంతో తన శరీరాన్ని విడిచిపట్టినది కదా!” అన్నారు. ఇంకా ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=97

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
 

Monday, February 3, 2020

దక్ష యాగము - 25


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-94-ఉ.
"నీలగళాపరాధి యగు నీకుఁ దనూభవ నౌట చాలదా?
చాలుఁ గుమర్త్య! నీదు తనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడి
న్నేల ధరన్ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్
గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడఁగన్.
4-95-చ.
వర వృషకేతనుండు భగవంతుఁడు నైన హరుండు నన్ను నా
దరపరిహాస వాక్యముల దక్షతనూభవ యంచుఁ బిల్వ నేఁ
బురపురఁ బొక్కుచున్ ముదముఁ బొందక నర్మవచఃస్మితంబులం
దొఱఁగుదు; నీ తనూజ నను దుఃఖముకంటెను జచ్చు టొప్పగున్."
4-96-వ.
అని యిట్లు యజ్ఞసభా మధ్యంబునం బ్రతికూలుండగు దక్షు నుద్దేశించి పలికి కామక్రోధాది శత్రువిఘాతిని యగు సతీదేవి యుదఙ్ముఖి యయి జలంబుల నాచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించి జితాసనయై భూమియం దాసీన యగుచు యోగమార్గంబునం జేసి శరీరత్యాగంబు చేయం దలంచి.


భావము:
"తండ్రీ! లోకకల్యాణంకోసం కాలకూటవిషం తాగి కంఠం నల్లగా చేసుకున్న సర్వలోక శుభంకరుడు కదయ్యా పరమ శివుడు. ఆయన యెడ క్షమింపరాని అపరాధం చేసావు. నా దురదృష్టం కొద్దీ అలాంటి నీకు పుత్రికగా పుట్టాను నీచమానవ! ఇక చాల్లే! నీ కుమార్తె నని తల్చుకుంటేనే సిగ్గు వేస్తోంది. లోకంలో గౌరవనీయులకు కీడు తలపెట్టే నీలాంటి వాళ్ళ పుట్టుకలు ఎందుకయ్యా? కాల్చడానికా? పూడ్చడానికా? వృషభధ్వజుడు, భగవంతుడు అయిన శివుడు నన్ను ఆదరంగానో పరిహాసంగానో ‘దక్షతనయా’ అని పిలిచినప్పుడు నేను మిక్కిలి దుఃఖిస్తూ ఆనందాన్ని పొందలేక చమత్కారపు మాటలతోనో, చిరునవ్వుతోనో తొలగిపోతాను. నీ కుమార్తెను అని బాధపడడం కంటె చావడం మేలు. అని ఈ విధంగా యజ్ఞమండప మధ్యభాగంలో తమకు వ్యతిరేకి అయిన దక్షునితో పలికి, కామక్రోధాదులైన అంతశ్శత్రువులను నాశనం చేసే సతీదేవి తూర్పుదిక్కుకు తిరిగి, జలాలతో ఆచమనం చేసి, శుచియై, మౌనం పూని, నేలపై కూర్చొని యోగమార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకొన్నదై...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=96

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, February 2, 2020

దక్ష యాగము - 24


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-90-చ.
నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గుఁ దిరస్కరించు న
క్కలుషుని జిహ్వఁ గోయఁ దగుఁ; గా కటు చేయఁగ నోపఁడేని దాఁ
బొలియుట యొప్పు; రెంటికిఁ బ్రభుత్వము చాలమిఁ గర్ణరంధ్రముల్
బలువుగ మూసికొంచుఁ జనఁ బాడి యటందురు ధర్మవర్తనుల్.
4-91-వ.
అది గావున.
4-92-మ.
జనుఁ డజ్ఞానమునన్ భుజించిన జుగుప్సం బైన యన్నంబు స
య్యన వెళ్ళించి పవిత్రుఁడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్
ఘను నిందించిన నీ తనూభవ యనం గా నోర్వ, నీ హేయ భా
జన మైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధిఁ బాటిల్లెదన్.
4-93-వ.
అదియునుం గాక, దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతల గమనంబును, స్వాభావికంబు లయినట్లు ప్రవృత్తినివృత్తి లక్షణ కర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటం జేసి రాగయుక్తులై కర్మతంత్రు లయిన సంసారులకు వైరాగ్యయుక్తు లయి యాత్మారాము లయిన యోగిజనులకు విధినిషేధరూపంబు లయిన వైదిక కర్మంబులు గలుగుటయు లేకుండుటయు నైజంబు లగుటం జేసి స్వధర్మ నిష్ఠుండగువాని నిందింపం జనదు; ఆ యుభయకర్మ శూన్యుండు బ్రహ్మభూతుండు నయిన సదాశివునిఁ గ్రిఁయా శూన్యుం డని నిందించుట పాపం బగు; దండ్రీ! సంకల్పమాత్ర ప్రభవంబు లగుటం జేసి మహాయోగిజన సేవ్యంబు లయిన యస్మదీయంబు లగు నణిమాద్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు; భవదీయంబు లగు నైశ్వర్యంబులు ధూమమార్గ ప్రవృత్తులై యాగాన్నభోక్తలైన వారి చేత యజ్ఞశాలయందె చాల నుతింపంబడి యుండుఁ గాన నీ మనంబున నే నధిక సంపన్నుండ ననియుఁ, జితాభస్మాస్థి ధారణుండైన రుద్రుండు దరిద్రుం డనియును గర్వింపం జన” దని; వెండియు నిట్లనియె.


భావము:
ధర్మపాలన చేత పవిత్రుడైన శివుణ్ణి తిరస్కరించే పాపాత్ముని నాలుక కోసివేయాలి. అలా చేయలేనప్పుడు చావడం మంచిది. రెండూ చేతకాని పక్షంలో చెవులను మూసికొని అక్కడినుండి వెళ్ళిపోవడం న్యాయమని ధర్మజ్ఞులు చెప్తారు.అందువల్ల తెలియక తిన్న దుష్టాన్నాన్ని మానవుడు కక్కి పవిత్రుడైనట్లు దుష్టుడవై ఈవిధంగా గొప్పవాడైన ఈశ్వరుని నిందించిన నీకు కుమార్తెను అనిపించుకొనడం నాకు ఇష్టం లేదు. నీవల్ల ప్రాప్తమైన ఈ పాడు శరీరాన్ని విడిచి పవిత్రురాలను అవుతాను. అంతేకాక దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు, విధి నిషేధ లక్షణాలు కలిగిన కర్మలు రాగ వైరాగ్యాలకు కారణాలుగా వేదాలు విధించడం వలన రాగయుక్తులై కర్మతంత్రులైన సంసారులకూ, వైరాగ్యంతో కూడి ఆత్మారాములైన యోగులకు విధి నిషేధ రూపాలలో ఉన్న వైదికకర్మలు కలిగిఉండడమూ లేకపోవడమూ సహజం. అందువల్ల స్వధర్మపరుడైనవానిని నిందించరాదు. (సంసారులకు అగ్నిహోత్రాలు మొదలైన ప్రవృత్తి కర్మలను, విరక్తులకు శమదమాది నివృత్తి కర్మలను వేదాలు విధించాయి. దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు సంసారులకు, విరక్తులకు వేరువేరు ధర్మాలు సహజాలు. విధి నిషేధ రూపాలైన వైదిక కర్మలు ధర్మాసక్తులైన సంసారులకే కాని ఆత్మారాములైన యోగులకు కాదు.) ప్రవృత్తి నివృత్తి కర్మలు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన సదాశివుని నిందించడం పాపం. తండ్రీ! సంకల్పమాత్రం చేతనే మేము పొందగలవీ, యోగిజనులచేత సేవింపబడేవీ అయిన అణిమ మొదలైన అష్టసిద్ధులను నీవు పొందలేవు. నీ ఐశ్వర్యాలను యజ్ఞశాలలో హోమధూపాల మధ్య తిరుగుతూ, యజ్ఞాన్నాన్ని భుజించేవారు ఇక్కడ మాత్రమే స్తుతిస్తారు. కనుకనీవు మిక్కిలి సంపన్నుడవనీ, చితాభస్మాన్నీ ఎముకలను ధరించే రుద్రుడు దరిద్రుడనీ భావించి గర్వించకు” అని చెప్పి ఇంకా ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=93

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, February 1, 2020

దక్ష యాగము - 23


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-87-సీ.
"అనయంబు శివ యను నక్షరద్వయ మర్థి;
వాక్కునఁ బలుక భావమునఁ దలఁప
సర్వజీవుల పాపసంఘముల్ చెడు; నట్టి;
మహితాత్మునందు నమంగళుండ
వగు నీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు;
నందెద; వినుము; నీ వదియుఁ గాక
చర్చింప నెవ్వని చరణపద్మంబుల;
నరసి బ్రహ్మానంద మను మరంద
4-87.1-తే.
మతుల భక్తిని దమ హృదయంబు లనెడి
తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు
లగుదు రత్యంత విజ్ఞాను; లట్టి దేవు
నందు ద్రోహంబు చేసి; తే మందు నిన్ను?
4-88-క.
మఱియును నమ్మహితాత్ముని
చరణ సరోజాత యుగము సకలజగంబుల్
నెఱిఁ గొలువఁ గోరు కోర్కులు
దరమిడి వర్షించు నతనిఁ దగునే తెగడన్?
4-89-చ.
పరగఁ జితాస్థిభస్మ నృకపాలజటాధరుఁడుం బరేత భూ
చరుఁడు పిశాచయుక్తుఁ డని శర్వు నమంగళుగాఁ దలంప రె
వ్వరు; నొకఁ డీవు దక్క, మఱి వాక్పతి ముఖ్యులు నమ్మహాత్ము స
చ్చరణ సరోజ రేణువులు సమ్మతిఁ దాల్తురు మస్తకంబులన్.


భావము:
ఎల్లప్పుడూ శివ అనే రెండక్షరాలను ఆసక్తితో నోటితో పలికినా, మనస్సులో తలచినా సమస్త ప్రాణుల పాపలన్నీ నశిస్తాయి. అటువంటి మహాత్ముని అమంగళుడవైన నీవు ద్వేషించడం చూచి ఆశ్చర్యాన్ని పొందుతున్నాను. తండ్రీ! విను. గొప్ప విజ్ఞానులు అయినవారు ఏ దేవుని పాదారవిందాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందాన్ని తమ మనస్సులనే తుమ్మెదల ద్వారా భక్తిపారవశ్యంతో గ్రోలి తృప్తిపొందుతారో అటువంటి దేవునికి ద్రోహం చేశావు. నిన్నేమనాలి? అంతేకాక ఆ మహాత్ముని పాదపద్మాలు లోకాలన్నీ కొలివగా కోరిన కోర్మెలన్నింటినీ కురిపిస్తుండగా అతన్ని నిదించడం న్యాయమా? చితిలోని ఎముకలను, బూడిదను, మానవకపాలాన్ని ధరించి, పిశాచాలతో కూడి శ్మశానంలో తిరిగినా శివుణ్ణి నీవు తప్ప మరెవ్వరూ అమంగళుడని భావించరు. బ్రహ్మ మొదలైనవారు ఆ మహాత్ముని పాదధూళిని తమ శిరస్సులపై సంతోషంతో ధరిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=89

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :