Tuesday, April 28, 2020

ధృవోపాఖ్యానము - 47

4-356-క.
కొందఱు స్వభావ మందురు,
కొందఱు కర్మం బటండ్రు, కొందఱు కాలం
బందురు, కొందఱు దైవం
బందురు, కొంద ఱొగిఁ గామ మండ్రు మహాత్మా!
4-357-వ.
ఇట్టు లవ్యక్తరూపుండును, నప్రమేయుండును, నానాశక్త్యుదయ హేతుభూతుండును నైన భగవంతుండు చేయు కార్యంబులు బ్రహ్మరుద్రాదు లెఱుంగ రఁన నతని తత్త్వంబు నెవ్వ రెఱుంగ నోపుదురది గావునఁ బుత్రా! యిట్లుత్పత్తి స్థితి లయంబులకు దైవంబు కారణం బై యుండ నీ ధనదానుచరులు భవదీయ భాతృహంత లగుదురే? భూతాత్మకుండు, భూతేశుండు, భూతభావనుండు, సర్వేశ్వరుండుఁ, బరాపరుండు నగు నీశుండ మాయాయుక్తుండై స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులం జేయు; నైన ననహంకారంబునం జేసి గుణకర్మంబులచే నస్పృశ్యుం డగుచు వర్తించు; నదియునుం గాక, యీ ప్రజాపతులు విశ్వసృణ్ణామంబుల నియంత్రితు లై ముకుద్రాళ్ళు పెట్టిన పశువులుం బోలె నెవ్వని యాజ్ఞాధీనకృత్యులై వర్తింతు రట్టి దుష్టజన మృత్యువును, సుజనామృత స్వరూపుండును, సర్వాత్మకుండును, జగత్పరాయణుండును నైన యీశ్వరుని సర్వప్రకారంబుల శరణంబుఁ బొందు; మదియునుం గాక.

భావము:
కొందరు ఆయనను స్వభావం అంటారు. మరికొందరు కర్మం అంటారు. ఇంకా కొందరు కాలం అంటారు. కొందరు దైవం అంటారు. మరికొందరు కామం అనికూడ అంటారు. ఈ విధంగా నిర్గుణుడు, అప్రమేయుడు, అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మ రుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక అతని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి నాయనా! పుట్టుకకు, మరణానికి దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముణ్ణి చంపారని భావించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవంతుడు తన మాయచేత సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాదు. ముక్కుత్రాళ్ళతో కట్టబడిన పశువుల వలె ఈ ప్రజాపతులు భగవంతుని ఆజ్ఞలను పాటించి ప్రవర్తిస్తారు. కాబట్టి దుష్టులకు మృత్యుస్వరూపుడు, శిష్టులకు అమృతస్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాల శరణు పొందు. అంతేకాక…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=357

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 46


4-355-వ.
అదియునుం గాక, దేహాభిమానంబునం బశుప్రాయులై భూతహింస గావించుట హృషీకేశానువర్తను లైన సాధువులకుం దగదు; నీవ సర్వభూతంబుల నాత్మభావంబునఁ దలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండును నైన విష్ణుని పదంబులఁ బూజించి తత్పరమపదంబును బొందితివి; అట్టి భగవంతుని హృదయంబున ననుధ్యాతుండవు, భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు మఱియు సాధువర్తనుండ వన నొప్పు నీ వీ పాపకర్మం బెట్లు చేయ సమకట్టితివి? ఏ పురుషుండైననేమి మహాత్ముల యందుఁ దితిక్షయు, సముల యందు మైత్రియు, హీనుల యందుఁ గృపయు, నితరంబులగు సమస్త జంతువుల యందు సమత్వంబును గలిగి వర్తించు వానియందు సర్వాత్మకుం డైన భగవంతుడు ప్రసన్నుం డగు; అతండు ప్రసన్నుం డయిన వాఁడు ప్రకృతి గుణంబులం బాసి లింగశరీరభంగంబు గావించి బ్రహ్మానందంబునుం బొందు; అదియునుం గాక, కార్య కారణ సంఘాత రూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్కాంత సన్నిధానంబు గలిగిన లోహంబు చందంబున వర్తించు; అందు సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగాఁ బరిభ్రమించు; అట్టి యీశ్వరుని మాయా గుణ వ్యతికరంబున నారబ్ధంబు లైన పంచభూతంబుల చేత యోషిత్పురుషవ్యవాయంబు వలన యోషిత్పురుషాదిరూప సంభూతి యగు; ఇవ్విధంబునఁ దత్సర్గంబుఁ దత్సంస్థానంబుఁ దల్లయంబు నగుచు నుండు; ఇట్లు దుర్విభావ్యం బైన కాలశక్తిం జేసి గుణక్షోభంబున విభజ్యమాన వీర్యుండు ననంతుండు ననాదియు నై జనంబులచేత జనంబులం బుట్టించుచుండుటం జేసి యాదికరుండును, మృత్యుహేతువున జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును,ననాది యగుటంజేసి యవ్యయుండును నైన భగవంతుండు జగత్కారణుం డగుం; గావున నీ సృష్టి పాలన విలయంబులకుం గర్తగానివాని వడుపున దానిఁ జేయుచుండు; ఇట్లు మృత్యరూపుండును బరుండును సమవర్తియు నైన యీశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు; కర్మాధీనంబులైన భూతసంఘంబులు రజంబు మహావాయువు ననుసరించు చాడ్పున నస్వతంత్రంబు లగుచు నతని ననువర్తించు; నీశ్వరుండును జంతుచయాయు రుపచయాపచయ కరణంబులం దస్పృష్టుండును నగు జీవుండు గర్మబద్ధుం డగుటంజేసి కర్మంబ వానికి నాయురుపచయాపచయంబులం జేయుచుండు; మఱియు సర్వజగత్కర్మసాక్షి యగు సర్వేశ్వరుని.

భావము:
అంతేకాక దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణి హింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణి స్వరూపుడైన శ్రీహరిని కొలిచి ఆయన స్థానాన్ని సాధించావు. ఆయన మనస్సుకు ఎక్కావు. హరిభక్తులను మెప్పించావు. నీవు మంచి నడవడి కలవాడవు. తనకంటే గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటే తక్కువ వారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించే వానిని సర్వాంతర్యామి అయిన భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు కరుణిస్తే మానవుడు ప్రాకృత గుణాలనుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అయస్కాంతం సన్నిధిలో లోహం భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంది. సర్వేశ్వరుడు నిమిత్తమాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయిక చేత స్త్రీపురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి ద్వారా జనములనుండి జనములను పుట్టించడం వల్ల ఆద్యుడు, నశింపజేయటం వల్ల అంతకుడు, అనాది కావటం వల్ల అవ్యయుడు అయి భగవంతుడు జగత్తుకు కారణం అవుతాడు. అందువల్ల సృష్టి స్థితి లయాలను చేయనట్లే ఉండి చేస్తుంటాడు. ఈ విధంగా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతునకు తనవారనీ, పరులనీ భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేనివారై ధూళికణాలు గాలిని అనుసరించిన విధంగా భగవంతుని అనుసరిస్తారు. ఉపచయం, అపచయం కలిగిస్తాడు. సర్వేశ్వరుడు కర్మసాక్షి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=355

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, April 27, 2020

ధృవోపాఖ్యానము - 45



4-352-ఉ.
వారలఁ జండతీవ్ర శరవర్గము చేత నికృత్తపాద జం
ఘోరు శిరోధరాంబక కరోదర కర్ణులఁ జేసి యోగి పం
కేరుహమిత్ర మండల సకృద్భిద నెట్టి పదంబుఁ జెందు నా
భూరిపదంబునం బెలుచఁ బొందఁగఁ బంపె భుజావిజృంభియై.
4-353-వ.
ఇవ్విధంబున నా చిత్రరథుండగు ధ్రువునిచేత నిహన్యమానులును నిరపరాధులును నయిన గుహ్యకులం జూచి యతని పితామహుండైన స్వాయంభువుండు ఋషిగణ పరివృతుం డై చనుదెంచి ధ్రువునిం జూచి యిట్లనియె “వత్సా నిరపరాధులైన యీ పుణ్యజనుల నెట్టి రోషంబున వధియించితి, వట్టి నిరయహేతువైన రోషంబు చాలు; భ్రాతృవత్సల! భ్రాతృవధాభితప్తుండవై కావించు నీ యత్నం బుడుగుము.
4-354-క.
అనఘా! మనుకులమున కిది
యనుచిత కర్మంబ; యొకనికై పెక్కండ్రి
ట్లని మొనఁ ద్రుంగిరి; యిది నీ
కనయంబును వలవ; దుడుగు మయ్య! కుమారా!

భావము:
అప్పుడు ధ్రువుడు పదునైన భయంకర బాణాలను ప్రయోగించి యక్షుల పాదాలను, పిక్కలను, తొడలను, మెడలను, చేతులను, చెవులను ఖండించాడు; కన్నులను పెకలించాడు; పొట్టలను చీల్చాడు; సూర్యమండలాన్ని భేదించుకొని యోగులు పొందే ఉత్తమ లోకానికి వారిని పంపించాడు. ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుడు సంహరిస్తున్న నిరపరాధులైన యక్షులను చూచి ధ్రువుని తాత అయిన స్వాయంభువ మనువు ఋషులతో కూడి వచ్చి ధువునితో ఇలా అన్నాడు “నాయనా! తప్పు చేయని యక్ష రాక్షసులను కోపంతో వధించావు. నరక కారణమైన క్రోధాన్ని చాలించు. తమ్ముని చావునకు పరితపించి నీవు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించు. పుణ్యాత్ముడవైన ఓ ధ్రువకుమారా! మనుకులానికి ఇది తగని పని. ఒక్కనికోసం పెక్కుమందిని వధించావు. ఇట్టి కార్యం నీవు చేయరాదు. దీనిని విరమించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=354

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 44


4-348-తే.
కడఁగి గుహ్యక మాయాంధకార మపుడు
వెరవుచెడి దవ్వుదవ్వుల విరిసిపోయె
విమలమైన వివేకోదయమునఁ జేసి
సమయు రాగాదికంబుల సరణి నంత.
4-349-మ.
వరనారాయణ దేవతాస్త్ర భవ దుర్వారప్రభాహేమపుం
ఖ రుచిస్ఫార మరాళ రాజసిత పక్షక్రూరధారాపత
చ్ఛర సాహస్రము లోలి భీషణ విపక్షశ్రేణిపై వ్రాలె భీ
కరరావంబునఁ గానఁ జొచ్చు శిఖిసంఘాతంబు చందంబునన్.
4-350-వ.
అట్లేసిన.
4-351-చ.
ఖరనిశితప్రదీప్త ఘన కాండపరంపర వృష్టిచేఁ బొరిం
బొరి వికలాంగులై యడరి పుణ్యజనుల్ పృథుహేతిపాణులై
గరుడునిఁ జూచి భూరిభుజగప్రకరంబు లెదిర్చి పేర్చి చె
చ్చెర నడతెంచు చందమునఁ జిత్రరథున్ బలుపూని తాఁకినన్.

భావము:
ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే అచ్చమైన జ్ఞానం ఉదయించగానే అజ్ఞానం సమసిపోయినట్లు యక్షుల మాయలు అనే కారుచీకట్లు క్షణంలో చెదరిపోయాయి. వారింప శక్యం కాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు అంచులు, రాయంచ రెక్కలవంటి రెక్కలు కల వాడి బాణాలు వేలకొలది పుట్టి, అడవిని చుట్టుముట్టిన అగ్నిజ్వాలల వలె భయంకరమైన ధ్వనితో శత్రుసైనికుల పైన ఎడతెగకుండా వచ్చి పడ్డాయి. ఆ విధంగా నారాయణాస్త్రం ప్రయోగించగా నారాయణాస్త్రం నుండి ఉద్భవించిన వాడి బాణాలు తళతళ మెరుస్తూ రాక్షసులను వికలాంగులను చేశాయి. వారు రెచ్చిపోయి పెద్ద పెద్ద కత్తులను చేతుల్లో ధరించి గరుత్మంతుణ్ణి సర్ప సమూహాలు ఎదిరించినట్లు ధ్రువుణ్ణి ఎదుర్కొన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=351

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, April 22, 2020

ధృవోపాఖ్యానము - 43


4-344-వ.
మఱియు, మత్తగజ సింహవ్యాఘ్ర సమూహంబులును, నూర్మి భయంకరంబై సర్వతః ప్లవనం బయిన సముద్రంబును గానంబడియె; వెండియుం గల్పాంతంబునందుంబోలె భీషణంబైన మహాహ్రదంబునుం దోఁచె; నవ్విధంబున నానా విధంబులు ననేకంబులు నవిరళ భయంకరంబులు నయిన యసురమాయలు గ్రూర ప్రవర్తునులగు యక్షుల చేత సృజ్యమానంబులై యడరె; నా సమయంబున.
4-345-క.
అనయంబును నయ్యక్షుల
ఘనమాయ నెఱింగి మునినికాయము వరుసన్
మనుమనుమని మను మను మని
మనమునఁ దలఁచుచును దత్సమక్షంబునకున్.
4-346-వ.
చనుదెంచి యా ధ్రువుం గని యిట్లనిరి.
4-347-సీ.
"అనఘాత్మ లోకు లెవ్వని దివ్య నామంబు;
సమత నాకర్ణించి సంస్మరించి
దుస్తరంబైన మృత్యువు నైన సుఖవృత్తిఁ;
దరియింతు; రట్టి యీశ్వరుఁడు పరుఁడు
భగవంతుఁడును శార్ఙ్గపాణియు భక్తజ;
నార్తిహరుండును నైన విభుఁడు
భవదీయ విమతులఁ బరిమార్చుఁగా" కని;
పలికిన మునుల సంభాషణములు
4-347.1-తే.
విని కృతాచమనుఁడయి యావిభుని పాద
కమలముఁ దలంచి రిపుభయంకరమహోగ్ర
కలిత నారాయణాస్త్రంబుఁ గార్ముకమునఁ
బూనఁ దడవఁ దదీయ సంధానమునను.

భావము:
ఇంకా మదపుటేనుగులు, సింహాలు, పెద్దపులులు చుట్టుముట్టినట్లు. కెరటాలతో సముద్రం భయంకరంగా పొంగిపొరలుతున్నట్లు కనిపించింది. ప్రళయకాలంలో వలె భయంకరమైన గొప్ప మడుగు కనిపించింది. ఈ విధంగా క్రూరులైన ఆ యక్షలు అనేక విధాలైన భీకరమైన మాయలను సృజించారు. అప్పుడు విరామం లేని యక్షుల మాయలను గ్రహించిన మునులందరూ మనువు మనుమడైన ధ్రువుణ్ణి “మనుము!... మనుము!” అని దీవిస్తూ అతని ముందుకు వచ్చి ఆ ధువుణ్ణి చూచి ఇలా అన్నారు. “ఓ పుణ్యాత్ముడా! లోకులు ఎవ్వని దివ్యనామాన్ని విన్నా, స్మరించినా దాటరాని మృత్యువును కూడా దాటగలరో అటువంటి ఈశ్వరుడు, పరాత్పరుడు, భగవంతుడు, శార్ఙ్గపాణి, భక్తజనుల బాధలను తొలగించేవాడు అయిన ఆ జగన్నాథుడు నీ శత్రువులను సంహరించుగాక!” అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు ఆచమించి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింట సంధించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=347

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 42

4-341-క.
“తలపోయఁగ, భువి మాయా
వుల కృత్యంబెఱుఁగనెవరువోలుదు” రనుచుం
బలుకుచుఁ, దత్పురిఁజొరఁగాఁ
దలఁపఁగ, నదిగానరాక తద్దయు మానెన్
4-342-వ.
అట్లు పురంబున కరుగుట మాని చిత్రరథుండైన యా ధ్రువుండు సప్రయత్నుం డయ్యును బరప్రతియోగశంకితుండై యుండె; నయ్యెడ మహాజలధి ఘోషంబు ననుకరించు శబ్దంబు వినంబడె; నంత సకల దిక్తటంబుల వాయుజనితం బయిన రజః పటలంబు దోఁచె; దత్క్షణంబ యాకాశంబున విస్ఫురత్తటిత్ప్రభా కలిత గర్జారవయుక్త మేఘంబు లమోఘంబులై భయంకరాకారంబులై తోఁచె; అంత.
4-343-మ.
అనయంబున్ ధ్రువుమీఁద దైత్యకృతమాయాజాలమట్లేచి, బో
రన మస్తిష్కపురీష మూత్ర పల దుర్గంధాస్థి మేదశ్శరా
సన నిస్త్రింశ శరాసి తోమర గదా చక్రత్రిశూలాది సా
ధన భూభృద్భుజగావళిం గురిసె నుద్దండక్రియాలోలతన్.

భావము:
“ఆలోచించి చూస్తే ఈ భూమిమీద మాయావుల మాయలను తెలిసికొనడం ఎవరికీ సాధ్యం కాదు.” అంటూ శత్రునగరంలోకి ప్రవేశించాలని ఉత్సాహపడ్డాడు. కాని శత్రువుల పట్టణం ధ్రువుని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు మహా ప్రయత్నశాలి అయినా శత్రువుల ప్రతిక్రియలు అంతుపట్టక, పట్టణంలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని మానుకున్నాడు. అప్పుడు మహాసముద్రఘోష వంటి ధ్వని వినిపించినట్లు. దిక్కులన్నీ పెనుగాలి రేపిన ధూళితో కప్పబడ్డట్లు. ఆకాశంలో మెరుపులు తళతళ మెరిసినట్లు. మేఘాలు భయంకరంగా గర్జించినట్లు తోచసాగింది. రాక్షసులు ఎడతెరపి లేకుండా ప్రయోగించిన మాయాజాలాలు ధ్రువుని మీద మెదడు, మలము, మూత్రము, మాంసము, క్రుళ్ళిన ఎముకలు, క్రొవ్వు కురిపించాయి; విండ్లు, కత్తులు, బాణాలు, కటారులు, చిల్లకోలలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలైన ఆయుధాలు, కొండలు, సర్పాలు వర్షింపించాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=343

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, April 20, 2020

ధృవోపాఖ్యానము - 41


4-337-చ.
అలఘు చరిత్రుఁ డమ్మనుకులాగ్రణిచే వికలాంగు లైనవా
రల సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సము
జ్జ్వల మణికంకణాంగద లసద్భుజవర్గముచేత సంగర
స్థల మతిరమ్యమై తనరె సంచిత వీరమనోహరాకృతిన్.
4-338-వ.
అంత హతశేషులు.
4-339-క.
వరబలుఁడగు మను మనుమని
శరసంఛిన్నాంగు లగుచు సమరవిముఖులై
హరిరాజముఁ గని పఱచెడు
కరిబృందముఁ బోలెఁ జనిరి కళవళపడుచున్.
4-340-క.
అప్పుడు రాక్షసమాయలు
గప్పిన ధ్రువుఁ డసురవరుల కార్యం బెఱుఁగం
జొప్పడక, వారిఁ బొడగన
దెప్పర మగుటయును సారథిం గని, యంతన్.

భావము:
మహనీయుడు మనువంశంలో శ్రేష్ఠుడు అయిన ధ్రువునిచేత వికలాంగులైనవారి కిరీటాలతో కుండలాలతో ప్రకాశించే శిరస్సులు, మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశించే బాహువులు నిండి ఉన్న ఆ యుద్ధభూమి వీర మనోహరంగా విరాజిల్లింది. అప్పుడు చావగా మిగిలినవారు వరబలం కలవాడు, స్వాయంభువ మనువు మనుమడు అయిన ధ్రువుని బాణాలచేత శరీరాలు తూట్లు పడగా యుద్ధం మానుకొని సింహాన్ని చూచిన ఏనుగులవలె భయపడి పారిపోయారు. అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. రాక్షసుల మాయాకృత్యాలను అతడు తెలిసికొనలేకపోయాడు. వాళ్ళు అతని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు తన సారథిని చూచి …

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=339

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 40

4-333-వ.
అట్లు దోఁచిన.
4-334-మ.
అరి దుఃఖావహమైన కార్ముకము శౌర్యస్ఫూర్తితోఁ దాల్చి భీ
కర బాణావళిఁ బింజపింజఁ గఱవంగా నేసి ఝంఝానిలుం
డురు మేఘావళిఁ బాఱఁదోలుగతి నత్యుగ్రాహితక్రూరబం
ధుర శస్త్రావళి రూపుమాపె విలసద్దో ర్లీల సంధిల్లఁగన్.
4-335-చ.
మఱి యపు డమ్మహాత్ముఁ డసమానబలుండు మహోగ్రబాణముల్
గఱిగఱిఁ దాఁక నేసి భుజగర్వ మెలర్ప విరోధి మర్మముల్
పఱియలు చేసి యంగములు భంగమునొందఁగఁజేసె వ్రేల్మిడిన్
గిఱికొని పర్వతంబుల నొగిం దెగఁ గొట్టెడు నింద్రు కైవడిన్.
4-336-వ.
అయ్యవసరంబున.

భావము: 
అలా కనిపించి శత్రువుల మనస్సులకు సంతాపాన్ని కలిగించే ధనుస్సును చేపట్టి, భయంకరంగా బాణపరంపరను కురిపించి, పెనుగాలి మేఘాలను పారద్రోలే విధంగా భుజబలంతో శత్రువీరుల శస్త్రాస్త్రాలను చెల్లాచెదరు చేసాడు. మహాత్ముడు, సాటిలేని మేటి వీరుడు అయిన ధ్రువుడు భయంకరాలైన బాణాలను వరుసపెట్టి ప్రయోగించి శత్రువుల జీవ స్థానములను బద్దలుకొట్టాడు;వారి అవయవాలను తునాతునకలు కావించాడు; పర్వతాలను బ్రద్దలు కొట్టే ఇంద్రునివలె ధ్రువుడు శత్రువులను చుట్టుముట్టి క్షణంలో మట్టుబెట్టాడు. ఆ సమయంలో…

విశేషాంశం:
కఠినసాధ్యమైన "ఱి" ప్రాసను అలవోకగా ప్రయోగించిన సహజకవికి కరములు మోడ్చుచున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=335

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, April 17, 2020

ధృవోపాఖ్యానము - 39

4-327-ఉ.
ఆ రథికోత్తముం దొడరి యందఱు నొక్కటఁ జుట్టుముట్టి పెం
పారఁగ బాణషట్కముల నంగములం బగులంగనేసి వి
స్ఫార గదా శరక్షురిక పట్టిసతోమర శూలఖడ్గముల్
సారథియుక్తుడైన రథిసత్తముపైఁ గురిపించి రేపునన్.
4-328-వ.
అట్లు గురియించిన నతండు.
4-329-క.
పెంపఱి యుండెను ధారా
సంపాతచ్ఛన్నమైన శైలము భంగిన్
గుంపులు కొని యాకసమునఁ
గంపించుచు నపుడు సిద్ధగణములు వరుసన్.
4-330-క.
హాహాకారము లెసఁగఁగ
నోహో యీ రీతి ధ్రువపయోరుహహితుఁడు
త్సాహము చెడి యిటు దైత్య స
మూహార్ణవమందు నేఁడు మునిఁగెనె యకటా!
4-331-వ.
అని చింతించు సమయంబున.
4-332-క.
తామాతని గెలిచితి మని
యా మనుజాశనులు పలుక నట నీహార
స్తోమము సమయించు మహో
ద్దా ముండగు సూర్యుఁ బోలి తద్దయుఁ దోఁచెన్.

భావము:
ఆ మహాయోధుడైన ధ్రువుణ్ణి యక్షులందరు ఒక్కసారిగా చుట్టుముట్టి ఆరేసి బాణాలతో అతని అవయవాలను భేదించారు. పెద్ద పద్ద గదలను, బాణాలను, చురకత్తులను, పట్టిసాలను, చిల్లకోలలను, శూలాలను, ఖడ్గాలను ధ్రువునిపైన, అతని సారథిపైన ఎడతెగకుండా కురిపించారు. ఆ విధంగా యక్షులు బాణాలను కురిపించగా ఆ ధ్రువుడు ఎడతెగని వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షుల ఆయుధ వర్షంలో మునిగిపోయాడు. అది చూచి ఆకాశంలోని సిద్ధులు వణికిపోతూ హాహాకారాలు చేస్తూ “అయ్యో! ధ్రువుడు అనే సూర్యుడు రాక్షస సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడు కదా!” అని చింతించే సమయంలో తాము ఆ ధ్రువుణ్ణి జయించామని అనుకుంటూ గంతులు వేస్తూ రాక్షసులు చెప్పుకొంటుండగా దట్టమైన మంచును పటాపంచలు చేస్తూ బయటపడిన సూర్యునివలె ధ్రువుడు కనిపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=332

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధృవోపాఖ్యానము - 38


4-323-మ.
ఘనశౌర్యోన్నతి తోడ సర్వ కకుభాకాశంబు లందుం బ్రతి
ధ్వనులోలిన్ నిగుడంగ శంఖము మహోద్యల్లీలఁ బూరింపఁ ద
న్నినదంబున్ విని యక్షకాంతలు భయాన్వీతాత్మలై రుగ్ర సా
ధనులై యక్షభటుల్ పురిన్ వెడలి రుత్సాహంబు సంధిల్లగన్.
4-324-వ.
ఇట్లు వెడలి యా ధ్రువునిం దాఁకిన.
4-325-చ.
కరము మహారథుండు భుజగర్వ పరాక్రమశాలియున్ ధను
ర్ధరుఁడును శూరుఁడౌ ధ్రువుఁడు దన్ను నెదిర్చిన యక్షకోటిఁ జె
చ్చరఁ బదుమూఁడువేల నొకచీరికిఁ గైకొన కొక్కపెట్ట భీ
కరముగ మూఁడు మూఁడు శితకాండములం దగ గ్రువ్వనేసినన్
4-326-ఉ.
వారు లలాటముల్ పగిలి వారక సోలియుఁ దేఱి యమ్మహో
దారు పరాక్రమప్రకట ధైర్యముఁ దత్కర లాఘవంబుఁ బ
ల్మాఱు నుతించుచుం గుపితమానసులై పదతాడితప్రదు
ష్టోరగకోటిఁ బోలెఁ జటులోగ్ర భయంకర రోషమూర్తులై.

భావము:
ధ్రువుడు ప్రతాపాతిశయంతో సర్వదిక్కులు, ఆకాశం మారుమ్రోగే విధంగా శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వనిని విని యక్షకాంతలు భయపడ్డారు. యక్షవీరులు భయంకరాలైన ఆయుధాలను ధరించి ఉత్సాహంతో పురంనుండి బయటికి వచ్చారు. యక్షులు అలా వచ్చి ధ్రువుణ్ణి ఎదుర్కొనగ మహారథుడు, వీరాధివీరుడు, ధనుర్ధారి, శూరుడు అయిన ధ్రువుడు తనను ఎదిరించిన పదమూడు వేల యక్షవీరులనూ లెక్కచేయకుండా భయకరంగా మూడు వాడి బాణాలతో గాయపరిచాడు. ఆ యక్షులు నొసళ్ళు పగిలి, మూర్ఛపోయి, తిరిగి తేరుకొని ఆ మహావీరుని పరాక్రమాన్ని ధైర్యాన్ని హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొంటూ కాళ్ళచేత త్రొక్కబడ్డ కాలసర్పాలవలె పట్టరాని రోషంతో భయంకరాకారాలు కలవారై…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=326

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, April 15, 2020

ధృవోపాఖ్యానము - 37

4-321-తే.
చారు బహువిధ వస్తు విస్తార మొప్ప
నంగనాయుక్త మగుచుఁ బెం పగ్గలించి
యర్థిఁ దనరారు జనకుగృహంబు చొచ్చె
నెలమిఁ ద్రిదివంబు చొచ్చు దేవేంద్రు పగిది.4-322-వ.
ఇట్లు ప్రవేశించిన రాజర్షి యైన యుత్తానపాదుండు సుతుని యాశ్చర్య కరంబైన ప్రభావంబు వినియుం జూచియుం మనంబున విస్మయంబు నొంది ప్రజానురక్తుండును, బ్రజాసమ్మతుండును, నవయౌవ్వన పరిపూర్ణుండును నైన ధ్రువుని రాజ్యాభిషిక్తుం జేసి వృద్ధవయస్కుండైన తన్నుఁదాన యెఱింగి యాత్మగతిఁ బొంద నిశ్చయించి విరక్తుండై వనంబునకుం జనియె; అంత నా ధ్రువుండు శింశుమార ప్రజాపతి కూఁతురైన భ్రమి యను దాని వివాహంబై దానివలనఁ గల్ప వత్సరు లను నిద్దఱు గొడుకులం బడసి; వెండియు వాయుపుత్రియైన యిల యను భార్య యందు నుత్కల నామకుఁడైన కొడుకు నతి మనోహర యైన కన్యకారత్నంబునుం గనియె; అంత దద్భ్రాత యైన యుత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షునిచేత హతుండయ్యె; అతని తల్లియుఁ దద్దుఃఖంబున వనంబున కేఁగి యందు గహనదహనంబున మృతిం బొందె; ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్షశోకవ్యాకులిత చిత్తుండై జైత్రంబగు రథంబెక్కి యుత్తరాభిముఖుండై చని హిమవద్ద్రోణి యందు భూతగణ సేవితంబును గుహ్యక సంకులంబును నైన యలకాపురంబు బొడగని యమ్మహానుభాహుండు.

భావము:
ఎన్నెన్నో సుందర వస్తువులతోను, సుందరీమణులతోను కలకలలాడుతూ కనువిందు చేస్తున్న రాజప్రాసాదంలో స్వర్గంలో దేవేంద్రుడు ప్రవేశించినట్లు ధ్రువుడు ప్రవేశించాడు. ఆ విధంగా ప్రవేశించగా రాజర్షి అయిన ఉత్తానపాదుడు అద్భుతమైన కొడుకు ప్రభావానికి ఆశ్చర్యపడ్డాడు. ధ్రువునకు ప్రజలపై గల అనురాగాన్ని, ప్రజలకు ధ్రువునిపై గల అభిమానాన్ని పరికించి నవయౌవనవంతుడైన ధ్రువుణ్ణి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసాడు. తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని సుగతిని పొందడానికి నిశ్చయించుకొని విరక్తుడై తపోవనానికి వెళ్ళాడు. ఆ తరువాత ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురయిన భ్రమిని వివాహమాడి ఆమెవల్ల కల్పుడు, వత్సరుడు అనె ఇద్దరు కొడుకులను పొందాడు. వాయు పుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఆమెవల్ల ఉత్కలుడు అనే కొడుకును, సౌందర్యవతి అయిన కూతురును పొందాడు. ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు పెండ్లి కాకముందే వేటాడటానికి హిమవత్పర్వత ప్రాంతంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఉత్తముని తల్లియైన సురుచి పుత్రదుఃఖంతో అడవికి వెళ్ళి అక్కడ కారుచిచ్చు మంటలలో చిక్కి మరణించింది. ధ్రువుడు తమ్ముని మరణవార్త విని కోపంతోను, దుఃఖంతోను కలత చెందిన మనస్సు కలవాడై జయశీలమైన రథాన్ని ఎక్కి ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. అక్కడ మంచుకొండ లోయలో భూతగణాలతోను, యక్షులతోను నిండిన అలకాపురాన్ని చూచి మహాపరాక్రమవంతుడైన ఆ ధ్రువుడు…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=322

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Tuesday, April 14, 2020

ధృవోపాఖ్యానము - 36

4-318-వ.
ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణి దీప నీరాజనంబుల నివాళింపం బౌర జానపద మిత్రా మాత్య బంధుజన పరివృతుండై చనుదెంచి.
4-319-సీ.
కాంచన మయ మరకత కుడ్య మణిజాల;
సంచయ రాజిత సౌధములను
వరసుధాఫేన పాండుర రుక్మ పరికరో;
దాత్త పరిచ్ఛదతల్పములను
సురతరు శోభిత శుక పిక మిధునాళి;
గాన విభాసి తోద్యానములను
సుమహిత వైడూర్య సోపాన విమల శో;
భిత జలపూర్ణ వాపీచయముల
4-319.1-తే.
వికచ కహ్లార దర దరవింద కైర
వప్రదీపిత బక చక్రవాక రాజ
హంస సారస కారండవాది జల వి
హంగ నినదాభిరామ పద్మాకరముల.
4-320-వ.
మఱియును.

భావము:
ఈ విధంగా ప్రేమతో చల్లుతూ యథార్థవాక్కులతో దీవిస్తూ, బంగారు పాత్రలలో మణిదీపాలుంచి హారతు లివ్వగా ధ్రువుడు పౌరులతో, జానపదులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ముందుకు సాగి ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. అక్కడి మేడలు పచ్చలు తాపిన బంగారు గోడలతోను, మణిఖచితాలైన గవాక్షాలతోను మెరిసిపోతున్నవి. పట్టెమంచాల పరుపులపై పాలనురుగువలె తెల్లనైన బంగారు జరీ అంచుల దుప్పట్లు పరచబడి ఉన్నాయి. ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండి చిలుకలు, కోయిలలు, తుమ్మెదల జంటలు పాడే పాటలతో మారుమ్రోగుతున్నాయి. దిగుడు బావులు వైడూర్యాలతో కట్టిన మెట్లతో నిర్మలమైన జలంతో నిండి ప్రకాశిస్తున్నాయి. వికసించిన కలువలతో, కమలాలతో విరాజుల్లుతూ కొక్కెరలు, జక్కవలు, రాయంచలు, బెగ్గురు పక్షులు, కన్నెలేళ్ళు మొదలైన నీటి పక్షుల కలకల ధ్వనులతో అక్కడి దొరువులు, చెరువులు అలరారుతున్నాయి. ఇంకా…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=319

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 35


4-315-సీ.
స్వర్ణ పరిచ్ఛదస్వచ్ఛకుడ్యద్వార;
లాలిత గోపురాట్టాలకంబు;
ఫల పుష్ప మంజరీ కలిత రంభా స్తంభ;
పూగ పోతాది విభూషితంబు;
ఘన సార కస్తూరికా గంధ జలబంధు;
రాసిక్త విపణి మార్గాంచితంబు;
మానిత నవరత్న మయ రంగవల్లీ వి;
రాజిత ప్రతి గృహ ప్రాంగణంబు;
4-315.1-తే.
శుభ నదీజల కుంభ సంశోభితంబు;
తండులస్వర్ణలాజాక్షతప్రసూన
ఫల బలివ్రాత కలిత విభ్రాజితంబు;
నగుచు సర్వతో లంకృత మైన పురము.
4-316-వ.
ప్రవేశించి రాజమార్గంబునఁ జనుదెంచు నప్పుడు.
4-317-మ.
హరిమధ్యల్ పురకామినీ తతులు సౌధాగ్రంబులందుండి భా
స్వర సిద్ధార్థ ఫలాక్షతప్రసవ దూర్వావ్రాత దధ్యంబువుల్
కరవల్లీ మణి హేమ కంకణ ఝణత్కారంబు శోభిల్లఁ జ
ల్లిరి యా భాగవతోత్తమోత్తమునిపై లీలాప్రమేయంబుగన్.

భావము:
గోడలు, తలుపులు, గోపురాలు బంగారు పూతతో తళతళ మెరుస్తున్నాయి. పండ్లతోను పూలగుత్తులతోను నిండిన అరటి స్తంభాలు, చిన్న చిన్న పోకచెట్లు వీధికి ఇరువైపుల కనువిందు చేస్తున్నాయి. అంగళ్ళముందు పచ్చకర్పూరం, కస్తూరి, చందనం కలిపిన నీళ్ళు చల్లారు. ప్రతి ఇంటి ముంగిట్లోను నవరత్నాలతో ముగ్గులు తీర్చి దిద్దారు. పవిత్ర నదీజలాలతో నిండిన మంగళ కలశాలు నిలిపారు. బంగారు లాజలు, అక్షతలు, పూలు, పండ్లు పూజాద్రవ్యాలు సిద్ధపరిచారు. ఈ విధంగా అలంకరింపబడిన పట్టణంలోకి అలా ఉత్తానపాదుడు తన కొడుకు ధ్రువునితో ప్రవేశించి రాజమార్గం గుండా వస్తున్న సమయంలో సన్నని సింగపు నడుములు గల పురస్త్రీలు ఒయ్యారంగా మేడలపై నిలబడి, చేతులకు ధరించిన మణులు తాపిన బంగారు గాజులు ఝణఝణ ధ్వనులు చేస్తుండగా ఆ ఉత్తమోత్తముడైన భగవద్భక్తునిపై తెల్లావాలు, పండ్లూ, పూలు, అక్షతలు, దూర్వాంకురాలు, పెరుగు కలిపిన నీళ్ళను చల్లారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=317

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, April 12, 2020

ధృవోపాఖ్యానము - 34


4-312-వ.
కావున నుత్తముండును ధ్రువుండును బ్రేమ విహ్వలు లగుచు నన్యో న్యాలింగితులై పులకాంకురాలంకృత శరీరులై యానంద బాష్పముల నొప్పిరి; అంత సునీతియుం దన ప్రాణంబులకంటెఁ బ్రియుండైన సుతు నుపగూహనంబు చేసి తదవయవ స్పర్శనంబు చేత నానందంబు నొంది విగతశోక యయ్యె; నప్పుడు సంతోష బాష్ప ధారాసిక్తంబులై చనుఁబాలునుం గురిసె నంత.
4-313-సీ.
ఉన్నత సంతోష ముప్పతిల్లఁగఁ బౌర;
జనము లా ధ్రువుతల్లి నెనయఁ జూచి
"తొడరిన భవదీయ దుఃఖనాశకుఁ డైన;
యిట్టి తనూజుఁ డెందేని పెద్ద
కాలంబు క్రిందటఁ గడఁగి నష్టుం డైన;
వాఁడిప్డు నీ భాగ్యవశము చేతఁ
బ్రతిలబ్ధుఁ డయ్యెను; నితఁడు భూమండల;
మెల్లను రక్షించు నిద్ధమహిమ;
4-313.1-తే.
కమల లోచనుఁ జింతించు ఘనులు లోక
దుర్జయం బైన యట్టి మృత్యువును గెల్తు;
రట్టి ప్రణతార్తి హరుఁడైన యబ్జనాభుఁ
డర్థి నీచేతఁ బూజితుం డగుట నిజము."
4-314-వ.
అని ప్రశంసించిరి; అట్లు పౌరజనంబులచేత నుపలాల్య మానుండగు ధ్రువుని నుత్తాన పాదుం డుత్తమ సమేతంబుగా గజారూఢునిం జేసి సంస్తూయమానుండును, ప్రహృష్టాంతరంగుండును నగుచుఁ బురాభి ముఖుండై చనుదెంచి.

భావము:
కనుక, ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో ఒడలు మరచి ఒకరినొకరు కౌగలించుకున్నారు. వారి శరీరాలు పులకరించాయి. వారి కనులలో ఆనంద బాష్పాలు నిండాయి. అప్పుడు సునీతి తన ప్రాణాలకంటే ఎక్కువ ప్రీతిపాత్రుడైన కొడుకును గట్టిగా కౌగిలించుకొని అతని తనూస్పర్శ వల్ల కలిగిన సంతోషంతో తన దుఃఖాన్ని మరిచిపోయింది. ఆనందబాష్పాలతో తడిసిన ఆ తల్లి పాలిండ్లు పొంగులెత్తాయి. పురజనులు ధ్రువుని తల్లియైన సునీతిని చూచి అంతులేని సంతోషంతో “చాలాకాలం క్రిందట కనిపించకుండా పోయిన నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్ళీ తిరిగి వచ్చాడు. నీ దుఃఖాన్ని తొలగించాడు. ఇతడు సాటిలేని పరాక్రమంతో భూమండలాన్ని పరిపాలిస్తాడు. విష్ణువును సేవించే మహాత్ములు అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ప్రపన్నులైన భక్తుల దుఃఖాన్ని తొలగించే నారాయణుని నీవు నిజంగా ఆరాధించావు.” అని పౌరజనులు ప్రశంసించారు. ఆ విధంగా పౌరులచేత ఉపలాలింప బడుతున్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా ఏనుగుపైన కూర్చుండ బెట్టి, ప్రజల ప్రస్తుతులను అందుకుంటూ మనస్సులో పొంగిపొరలే సంతోషంతో పురం వైపు బయలుదేరి వచ్చి…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=314

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 33

4-309-క.
జనకుని యాశీర్వచనము
లనయముఁ గైకొని ప్రమోదియై తత్పదముల్
దన ఫాలతలము సోఁకఁగ
వినతులు గావించి భక్తి విహ్వలుఁ డగుచున్.
4-310-తే.
అంత నా సజ్జనాగ్రణి యైన ధ్రువుఁడు
దల్లులకు భక్తి వినతులు దగ నొనర్చి
సురుచికిని మ్రొక్క నర్భకుఁ జూచి యెత్తి
నగు మొగంబున నాలింగనంబు చేసి.
4-311-సీ.
కరమొప్ప నానంద గద్గద స్వరమున;
జీవింపు మనుచు నాశీర్వదించె;
భగవంతుఁ డెవ్వనిపై మైత్రి పాటించు;
సత్కృపానిరతిఁ బ్రసన్నుఁ డగుచు
నతనికిఁ దమయంత ననుకూలమై యుండు;
సర్వభూతంబులు సమతఁ బేర్చి
మహిఁ దలపోయ నిమ్నప్రదేశములకు;
ననయంబుఁ జేరు తోయముల పగిది
4-311.1-తే.
గాన ఘను నమ్మహాత్ముని గారవించె
సురుచి పూర్వంబు దలఁపక సుజనచరిత!
విష్ణుభక్తులు ధరను బవిత్రు లగుట
వారి కలుగరు ధరణి నెవ్వారు మఱియు.

భావము:
తండ్రి దీవనలను అందుకొని ఆనందించి అతని పాదాలపై నుదురు మోపి భక్తి తన్మయుడై నమస్కరించాడు. సజ్జనులలో గొప్పవాడైన ఆ ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు. సురుచి తనకు మ్రొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ అక్కున జేర్చుకొని ఆనందంతో వణుకుతున్న కంఠస్వరంతో “చిరంజీవ!” అని దీవించింది. పల్లమునకు నీళ్ళు ప్రవహించిన విధంగా భగవంతుని దయకు పాత్రుడైన వాని వద్దకు అందరూ తమంత తామే అనుకూల భావంతో చేరుకుంటారు. అందువల్లనే సురుచి గతాన్ని మరచిపోయి మహనీయుడైన ధ్రువుణ్ణి గౌరవించింది. నాయనా, విదురా! విష్ణుభక్తులు పరమపవిత్రులు. వారికి శత్రువులంటూ ఎవరూ ఉండరు. వారిపై ఎవ్వరూ కోపించరు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=311

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, April 11, 2020

ధృవోపాఖ్యానము - 32


4-306-సీ.
వలను మీఱిన సైంధవంబులఁ బూన్చిన;
కనక రథంబు నుత్కంఠ నెక్కి
బ్రాహ్మణ కుల వృద్ధ బంధు జనామాత్య;
పరివృతుం డగుచు విస్ఫురణ మెఱసి
బ్రహ్మనిర్ఘోష తూర్యస్వన శంఖ కా;
హళ వేణు రవము లందంద చెలఁగ
శిబిక లెక్కియు విభూషితలై సునీతి సు;
రుచు లుత్తముండు నారూఢి నడువ
4-306.1-తే.
గరిమ దీపింప నతిశీఘ్రగమన మొప్ప
నాత్మనగరంబు వెలువడి యరుగుచుండి
బలసి నగరోపవన సమీపంబు నందు
వచ్చు ధ్రువుఁ గని మేదినీశ్వరుఁడు నంత.
4-307-చ.
అరదము డిగ్గి ప్రేమ దొలఁకాడ ససంభ్రముఁడై రమామనో
హరు చరణారవింద యుగళార్చన నిర్దళితాఖి లాఘు నీ
శ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతుం
గర మనురక్తి డాసి పులకల్ ననలొత్తఁ బ్రమోదితాత్ముఁడై.
4-308-తే.
బిగియఁ గౌఁగిటఁ జేర్చి నెమ్మొగము నివిరి
శిరము మూర్కొని చుబుకంబు చేతఁ బుణికి
యవ్యయానంద బాష్ప ధారాభిషిక్తుఁ
జేసి యాశీర్వదింప నా చిరయశుండు.

భావము:
వడిగల గుఱ్ఱాలను పూన్చిన బంగారు రథాన్ని ఆత్రంగా ఎక్కి, బ్రాహ్మణులతో కులవృద్ధులతో బంధు మిత్రులతో మంత్రులతో కలసి బయలుదేరాడు. వేదఘోషలు, వాద్యధ్వనులు, శంఖ కాహళ వేణు నాదాలు అతిశయించాయి. పెద్దభార్య సునీతి, చిన్నభార్య సురుచి బంగారు పల్లకీలెక్కి ఉత్తమునితో కూడి అనుసరించారు. అలా వేగంగా ముందుకు సాగి వెళ్తూ పురం వెలుపల ఉపవనం సమీపాన అల్లంత దూరంనుండి వస్తున్న ధ్రువకుమారుణ్ణి ఉత్తానపాదుడు చూచి రథం దిగి, అనురాగం పొంగిపొరలగా సంభ్రమంతో ధ్రువునికి ఎదురువెళ్ళాడు. శ్రీపతి పాదపద్మాలను సేవించి పాపాలను పోగొట్టుకొని, ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల కోరికలు తీర్చుకున్న తన కుమారుని సమీపించి ప్రేమతో పులకించిపోతూ సంతోషంగా గట్టిగా కౌగిలించుకొని, ముఖం నిమిరి, శిరస్సు మూర్కొని, గడ్డం పుణికి, జలజల ప్రవహించే ఆనందబాష్పాలతో పుత్రుని శిరస్సును అభిషేకించి ఉత్తానపాదుడు ఆశీర్వదించగా, చిరకీర్తివంతుడైన పుత్రుడు ఆ ధ్రువుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=308

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 31

4-303-క.
చచ్చిన వారలుఁ గ్రమ్మఱ
వచ్చుటయే కాక యిట్టి వార్తలు గలవే?
నిచ్చలు నమంగళుఁడ నగు
నిచ్చట మఱి నాకు శుభము లేల ఘటించున్.
4-304-క.
అని విశ్వసింపకుండియు
మనమున నా నారదుఁడు గుమారుఁడు వేగం
బునఁ రాఁగలఁ డనుచును బలి
కిన పలుకులు దలఁచి నమ్మి కృతకృత్యుండై.
4-305-క.
తన సుతుని రాక చెప్పిన
ఘనునకు ధనములును మౌక్తికపు హారములున్
మన మలర నిచ్చి తనయునిఁ
గనుఁగొను సంతోష మాత్మఁ గడలుకొనంగన్

భావము:
చచ్చినవారు తిరిగి రావడం అనే చోద్యం ఎక్కడైనా ఉందా? అన్నివిధాల నిర్భాగ్యుడనైన నాకు అంతటి అదృష్టం ఎలా లభిస్తుంది?ధ్రువుడు మరలి వస్తున్నాడు అని ముందు నమ్మనివాడై “నీ కొడుకు తొందరలోనే తిరిగివస్తాడు” అని పూర్వం నారదుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని అటువంటి అదృష్టం లభిస్తుందేమో అని కొంత విశ్వసించి తన కొడుకు వస్తున్నాడని చెప్పిన చారునకు ధనం, ముత్యాల దండలు సంతోషంగా ఇచ్చి, కొడుకును చూడాలనే ఉత్సాహం మనస్సులో ఉప్పొంగగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=305

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, April 10, 2020

ధృవోపాఖ్యానము - 30

4-300-మ.
"ధనహీనుండు నృపాలుఁ జేరి మిగులన్ ధాటిన్ ఫలీకార మి
మ్మని యర్థించినరీతి ముక్తిఫలదుం డై నట్టి పంకేజలో
చనుఁ డే చాలఁ బ్రసన్నుఁడైన నతనిన్ సాంసారికం బర్థిఁ గో
రిన నావంటి విమూఢమానసులు ధాత్రిం గల్గిరే యెవ్వరున్?"
4-301-సీ.
అని యిట్లు చింతించె" ననుచు నమ్మైత్రేయ;
ముని విదురునకు నిట్లనియెఁ "దండ్రి!
కమనీయ హరిపాద కమల రజోభి సం;
స్కృత శరీరులును యాదృచ్ఛికముగ
సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై;
వఱలుచు నుండు మీవంటి వారు
దగ భగవత్పాద దాస్యంబు దక్కంగ;
నితర పదార్థంబు లెడఁద లందు"
4-301.1-తే.
మఱచియును గోర నొల్లరు మనుచరిత్ర!
తవిలి యిట్లు హరిప్రసాదంబు నొంది
మరలి వచ్చుచునున్న కుమారు వార్తఁ
జారుచే విని యుత్తానచరణుఁ డపుడు.
4-302-వ.
మనమున నిట్లని తలంచె.

భావము:
పేదవాడు రాజును సమీపించి ఊకతో కూడిన నూకలను ఇమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయిన కమలాక్షుడు నాకు ప్రసన్నుడైనా అతన్ని నేను సంసారాన్ని అర్థించాను. నావంటి మందబుద్ధులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు’ అని ఈ విధంగా ధ్రువుడు విచారించాడు ” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు “నాయనా! పావనమైన శ్రీహరి పాదపద్మాల పరాగంతో అలంకరింపబడిన శరీరం కలిగిన మీవంటివాళ్ళు తనంత తాను దొరికే దానితోనే సంతృప్తిపడతారు. భగవంతుని పాదసేవను తప్ప మరొకటి కోరుకొనరు. విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది కన్నకొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తను ఉత్తానపాదుడు చారుల వల్ల విని మనస్సులో ఇలా తలంచాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=301

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 29



4-298-చ.
అనఘ! జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందనాదు లెం
దనయ మనేక జన్మ సముపార్జిత యోగ సమాధిఁ జేసి యె
వ్వని చరణారవిందములు వారని భక్తి నెఱుంగుచుందు; రా
ఘనుఁ బరమేశు నీశు నవికారు నమేయు నజేయు నాద్యునిన్.
4-299-వ.
ఏను షణ్మాసంబులు భజియించి తత్పాదపద్మ చ్ఛాయం బ్రాపించియు భేదదర్శనుండ నైతి; నక్కటా! ఇట్టి భాగ్యహీనుండనైన యేను భవనాశకుండైన యతనిం బొడఁగనియు నశ్వరంబులైన కామ్యంబు లడిగితి; నిట్టి దౌరాత్మ్యం బెందేనిం గలదే? తమ పదంబులకంటె నున్నత పదంబు నొందుదునో యని సహింపంజాలని యీ దేవతలచేత మదీయ మతి గలుషితం బయ్యెం గాక; నాఁడు నారదుం డాడిన మాట తథ్యం బయ్యె; అతని వాక్యంబు లంగీకరింపక యే నసత్తముండనై స్వప్నావస్థలం బొందినవాఁడు దైవికంబైన మాయంజెంది భిన్న దర్శనుండగు చందంబున నే నద్వితీయుండ నైనను, భ్రాత యను శత్రువుచేఁ బ్రాప్తం బైన దుఃఖంబు నొంది జగదాత్మకుండును, సుప్రసాదుండును, భవనాశకుండును నైన యీశ్వరు నారాధించి తత్ప్రసాదంబు బడసియు నాయుర్విహీనుం డైన రోగికిం బ్రయోగించు నౌషధంబుం బోలె నిరర్థకంబులైన, నశ్వరంబులైన, యీ కామితంబులు గోరితి” నని; వెండియు.

భావము:
జితేంద్రియులు, మహాత్ములు అయిన సనందుడు మొదలైన మునీంద్రులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల సమాధి యోగం ద్వారా ఏ మహానుభావుని చరణకమలాలను దర్శించ గలుగుతారో అటువంటి ఘనుడు, పరమేశ్వరుడు, అవికారుడు, అమేయుడు, అజేయుడు, ఆద్యుడు అయిన శ్రీహరిని...
నేను ఆరునెలలు సేవించి ఆయన పాదపద్మాల నీడలో నిలిచి కూడా భేదదృష్టి కలవాణ్ణి అయ్యాను. నేను దురదృష్టవంతుణ్ణి. సంసారబంధాలను హరించే హరిని దర్శించి కూడా అనిత్యాలైన కోరికలను కోరుకున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? తమ స్థానాలకంటె ఉన్నతమైన స్థానాన్ని నేను పొందుతానేమో అని ఓర్వలేక దేవతలు నా బుద్ధిని కలతపరచి ఉంటారు. ఆనాడు నారదుడు చెప్పిన మాట నిజమయింది. ఆయన మాటలను నేను లెక్క చేయలేదు. నేను అధముణ్ణి. నిద్రించేవాడు కలలో దైవమాయకు చిక్కి తా నొక్కడే అయినా తనకంటె వేరుగా అనేకులను తనయందు చూస్తాడు. అలాగే నేను ఒక్కడినే అయినప్పటికీ తమ్ముడనే శత్రువును కల్పించుకొని దుఃఖం పొందాను. జగత్స్వరూపుడు, దయామయుడు, సంసారవినాశకుడు అయిన హరిని ఆరాధించి, ఆయన అనుగ్రహం పొందికూడ ఆయుస్సు చాలని రోగికి ఔషధం వలె కొరగాని కోరికలను కోరుకున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=299

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, April 9, 2020

ధృవోపాఖ్యానము - 28

4-294-క.
"మునినాయక! విను కాముక
జనదుష్ప్రాపంబు విష్ణు చరణాంబురుహా
ర్చన మునిజన సంప్రాప్యము
ననఁగల పంకేరుహాక్షు నవ్యయ పదమున్.
4-295-వ.
పెక్కు జన్మంబులం గాని పొందరాని పదంబు దా నొక్క జన్మంబుననే పొందియుం దన మనంబునం దప్రాప్త మనోరథుండ నని పురుషార్థవేది యైన ధ్రువుం డెట్లు దలంచె” ననిన మైత్రేయుం డిట్లనియె
4-296-తే.
"అనఘ! పినతల్లి దన్నుఁ బల్కిన దురుక్తి
బాణవిద్ధాత్ముఁ డగుచుఁ దద్భాషణములు
చిత్తమందుఁ దలంచుటఁ జేసి ముక్తిఁ
గోరమికి నాత్మలో వగఁ గూరుచుండె.
4-297-వ.
అంత నా ధ్రువుండు.

భావము:
“మునీంద్రా! కాముకులకు పొందరానిది, విష్ణు భక్తులైన మునులు మాత్రమే పొందగలిగినది శాశ్వతమైన విష్ణుపదం కదా! ఎన్నో జన్మలకు కాని పొందరాని విష్ణుపదాన్ని తాను ఒక్క జన్మలోనే పొందికూడా పురుషార్థాలను చక్కగా ఎరిగిన ధ్రువుడు తన కోరిక తీరలేదని ఎందుకు భావించాడు?” అని ప్రశ్నించగా మైత్రేయుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! పినతల్లి ఆడిన దుర్భాషలు అనే బాణాలచేత ధ్రువుని మనస్సు బాగా గాయపడింది. అందుచేత ఆ దుర్భాషలనే మాటిమాటికి స్మరిస్తూ హరి ప్రత్యక్షమైనపుడు ముక్తిని కోరలేకపోయాడు. అందుకే అతడు మనస్సులో పరితపిస్తున్నాడు. అప్పుడు ఆ ధ్రువుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=296

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 27


4-291-సీ.
అనఘాత్మ! మఱి నీవు యజ్ఞరూపుం డనఁ;
దగు నన్ను సంపూర్ణ దక్షిణంబు
లగు మఖంబులచేత నర్చించి సత్యంబు;
లగు నిహసౌఖ్యంబు లనుభవించి
యంత్యకాలమున నన్నాత్మఁ దలంచుచు;
మఱి సర్వలోక నమస్కృతమును
మహిఁ బునరావృత్తి రహితంబు సప్తర్షి;
మండలోన్నత మగు మామకీన
4-291.1-తే.
పదము దగఁ బొందఁగల" వని పరమపురుషుఁ
డతని యభిలషితార్థంబు లర్థి నిచ్చి
యతఁడు గనుఁగొను చుండంగ నాత్మపురికి
గరుడగమనుఁడు వేంచేసెఁ గౌతుకమున.
4-292-తే.
అంత ధ్రువుఁడునుఁ బంకేరుహాక్ష పాద
కమల సేవోపపాదిత ఘన మనోర
థములఁ దనరియుఁ దనదు చిత్తంబులోనఁ
దుష్టిఁ బొందక చనియె విశిష్టచరిత!"
4-293-క.
అని మైత్రేయుఁడు ధ్రువుఁ డ
ట్లనయము హరిచేఁ గృతార్థుఁడైన విధం బె
ల్లను వినిపించిన విదురుఁడు
విని మునివరుఁ జూచి పలికె వినయం బెసఁగన్.

భావము:
పుణ్యాత్మా! నీవు యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాలచేత ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు. మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ, సకల లోకాలకు వందనీయమై, పునరావృత్తి రహితమై సప్తర్షిమండలం పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు.” అని భగవంతుడు ధ్రువుడు కోరిన కోరికలను ప్రసాదించి, అతడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆనందంగా తన పట్టణమైన వైకుంఠమునకు వేంచేశాడు. అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన విష్ణువు యొక్క పాదపద్మాలను సేవించడం వల్ల సమధిక మనోరథాలు సంప్రాప్తించినప్పటికీ, సంతృప్తి పొందక చింతిస్తూ వెళ్ళిపోయాడు అని ఈ విధంగా మైత్రేయుడు ధ్రువుడు శ్రీహరినుండి వరాలను పొందిన విధం అంతా విదురునికి వినిపించాడు. విన్న విదురుడు మహర్షితో సవినయంగా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=292

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, April 7, 2020

ధృవోపాఖ్యానము - 26


4-289-క.
"ధీరవ్రత! రాజన్య కు
మారక! నీ హృదయమందు మసలిన కార్యం
బారూఢిగా నెఱుంగుదు
నారయ నది వొందరాని దైనను నిత్తున్.
4-290-వ.
అది యెట్టి దనిన నెందేని మేధియందుఁ బరిభ్రామ్యమాణ గోచక్రంబునుం బోలె గ్రహనక్ష త్రతారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబు లయిన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును, దారకా సమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదురు; అట్టి దురాపంబును ననన్యాధిష్ఠితంబును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నిరువది యాఱువేలేండ్లు చనం బ్రాపింతువు; తత్పద ప్రాప్తిపర్యంతంబు భవదీయ జనకుండు వనవాస గతుండైనం దద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మమార్గంబున జితేంద్రియుండవై చేయుదువు; భవదనుజుం డగు నుత్తముండు మృగయార్థంబు వనంబునకుం జని మృతుం డగు; తదన్వేషణార్థంబు తదాహిత చిత్త యై తన్మాతయు వనంబునకుం జని యందు దావదహన నిమగ్న యగు; వెండియు.

భావము:
“అచంచల దీక్షావ్రతా! రాకుమారా! నీ మనస్సులోని అభిప్రాయాలను చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది. అయినప్పటికీ నీ కోరిక తీరుస్తాను. కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లుగా గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రం, నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తారో అటువంటి ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన ఇరవైఆరువేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు. అది ఎవ్వరికీ అందరానిది. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. ముల్లోకాలు నశించేటప్పుడు కూడా అది నశించకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నీవు సర్వజన రంజకంగా ధర్మమార్గాన పరిపాలిస్తావు. ఇంద్రియాలను జయిస్తావు. నీ తండ్రి అడవికి పోయి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకై అడవికి వెళ్ళి మరణిస్తాడు. అతనిని వెదుకుతూ అతనియందే మనస్సు చేర్చిన అతని తల్లి అరణ్యంలో ప్రవేశిస్తుంది. ఆమె అడవిలో కార్చిచ్చులో పడి కాలిపోతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=290

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 25


4-287-సీ.
సర్వేశ! కల్పాంత సమయంబు నందు నీ;
యఖిల ప్రపంచంబు నాహరించి
యనయంబు శేషసహాయుండవై శేష;
పర్యంక తలమునఁ బవ్వళించి
యోగనిద్రా రతి నుండి నాభీసింధు;
జస్వర్ణలోక కంజాత గర్భ
మందుఁ జతుర్ముఖు నమరఁ బుట్టించుచు;
రుచి నొప్పు బ్రహ్మస్వరూపి వైన
4-287.1-తే.
నీకు మ్రొక్కెద నత్యంత నియమ మొప్ప
భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
యవ్యయానంద! గోవింద! హరి! ముకుంద!
4-288-వ.
అట్లు యోగనిద్రా పరవశుండ వయ్యును జీవులకంటె నత్యంత విలక్షణుండ వై యుండుదువు; అది యెట్లనిన బుద్ధ్యవస్థాభేదంబున నఖండితం బయిన స్వశక్తిం జేసి చూచు లోకపాలన నిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవు గావున నీవు నిత్యముక్తుండవును, బరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, నాత్మవును, గూటస్థుండవును, నాదిపురుషుండవును, భగవంతుండవును, గుణత్రయాధీశ్వరుండవును నై వర్తింతువు; భాగ్యహీనుండైన జీవుని యందు నీ గుణంబులు గలుగవు; ఏ సర్వేశ్వరునం దేమి విరుద్ధగతులై వివిధ శక్తి యుక్తంబు లైన యవిద్యాదు లానుపూర్వ్యంబునం జేసి ప్రలీనంబు లగుచుండు; అట్టి విశ్వకారణంబు నేకంబు ననంతంబు నాద్యంబు నానందమాత్రంబు నవికారంబు నగు బ్రహ్మంబునకు నమస్కరించెద; మఱియు దేవా! నీవ సర్వవిధఫలం బని చింతించు నిష్కాము లయినవారికి రాజ్యాదికామితంబులలోనఁ బరమార్థం బయిన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబ; ఇట్లు నిశ్చితంబ యైనను సకాములయిన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు చేయించుచు, వృకాది భయంబు వలన రక్షించు చందంబునం గామప్రదుండవై సంసార భయంబు వలన బాపుదువు;” అని యిట్లు సత్యసంకల్పుండును, సుజ్ఞానియు నయిన ధ్రువునిచేత వినుతింపంబడి భృత్యానురక్తుం డైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె.

భావము:
సర్వేశ్వరా! భవ్యచరిత్రా! కమలదళనయనా! శాశ్వత శుభాకారా! లక్ష్మీవిహారా! అవ్యయానందా! గోవిందా! హరీ! ముకుందా! నీవు కల్పాంత కాలంలో సర్వప్రపంచాన్ని నీలో విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పంమీద శయనిస్తావు. యోగనిద్ర పొందుతావు. అప్పుడు నీ నాభి అనే సముద్రంలోనుండి పుట్టిన బంగారు తామరపువ్వులోనుండి చతుర్ముఖ బ్రహ్మను సృష్టిస్తావు. అటువంటి తేజోమయమైన నీ పరబ్రహ్మ స్వరూపానికి నిశ్చల నియమంతో నమస్కరిస్తున్నాను. ఆ విధంగా యోగనిద్రలో మైమరచి ఉన్నప్పటికీ నీవు జీవుల కంటె మిక్కిలి విలక్షణంగా ఉంటావు. అవస్థా భేదాన్ని పొందిన బుద్ధితో, చెక్కు చెదరని దృష్టితో జగత్తును రక్షించటానికి విష్ణురూపాన్ని గైకొంటావు. నీవు నిత్యముక్తుడవు; పరిశుద్ధుడవు; సర్వజ్ఞుడవు; ఆత్మవు; కూటస్థుడవు; ఆదిపురుషుడవు; భగవంతుడవు; మూడు గుణాలకు అధిపతివి. జీవుడు భాగ్యహీనుడు. అతనియందు నీ గుణాలు ఉండవు. ఏ సర్వేశ్వరుని యందైతే విరుద్ధగమనం కలిగి వివిధ శక్తులతో కూడిన అవిద్యాదులు ఒకదాని వెంట ఒకటి విలీనం అవుతాయో, అటువంటి జగత్కారణమూ, అద్వితీయమూ, అనంతమూ, ఆద్యమూ, ఆనందమాత్రమూ, అవికారమూ అయిన పరబ్రహ్మవు నీవు. నీకు నమస్కారం. దేవా! నిష్కాములైనవారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలైన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్ర పాదసేవనమే. ఇది నిశ్చయం. అయినప్పటికీ ఆవు తన దూడకు చన్నిస్తూ తోడేళ్ళు మొదలైన క్రూర మృగాల బారినుండి రక్షించే విధంగా సకాములైనవారి కోరికలను తీరుస్తూనే సంసార భయాలను తొలగిస్తావు.” అని ఈ విధంగా సత్సంకల్పుడు, సుజ్ఞాని అయిన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భృత్యులపై అత్యంత ప్రేమగల భగవంతుడు మనస్సులో తృప్తిపడి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=288

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, April 6, 2020

ధ్రువోపాఖ్యానము - 24


4-284-చ.
హరి! భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై
వఱలిన భక్తియుక్తు లగువారల సంగతిఁ గల్గఁజేయు స
త్పురుష సుసంగతిన్ వ్యసనదుస్తర సాగర మప్రయత్నతన్
సరస భవత్కథామృత రసంబున మత్తుఁడనై తరించెదన్.
4-285-చ.
నిరతముఁ దావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి నె
వ్వరి మది వొందఁగాఁ గలుగు, వారలు తత్ప్రియ మర్త్యదేహముం
గరము తదీయ దార సుత కామ సుహృద్గృహ బంధు వర్గమున్
మఱతురు విశ్వతోముఖ! రమాహృదయేశ! ముకుంద! మాధవా!
4-286-సీ.
పరమాత్మ! మర్త్య సుపర్వ తిర్యఙ్మృగ;
దితిజ సరీసృప ద్విజగణాది
సంవ్యాప్తమును సదసద్విశేషంబును;
గైకొని మహదాది కారణంబు
నైన విరాడ్విగ్రహంబు నే నెఱుఁగుఁదుఁ;
గాని తక్కిన సుమంగళమునైన
సంతత సుమహితైశ్వర్య రూపంబును;
భూరిశబ్దాది వ్యాపార శూన్య
4-286.1-తే.
మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెఱుఁగఁ
బ్రవిమలాకార! సంసారభయవిదూర!
పరమమునిగేయ! సంతతభాగధేయ!
నళిననేత్ర! రమాలలనాకళత్ర!

భావము:
శ్రీహరీ! నిర్మలాత్ములై నీ సేవయందు ఆసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కథాసుధారసాన్ని మనసారా గ్రోలి, దుఃఖాలతో నిండిన దాటరాని సంసార సాగరాన్ని సులభంగా తరిస్తాను. విశ్వతోముఖా! రమామనోహరా! ముకుందా! మాధవా! నీ పాదపద్మాల సుగంధాన్ని అనుభవించిన వారు మరణ శీలమైన శరీరాన్ని లెక్కచేయరు. భార్యా పుత్రులను, మిత్రులను, భవనాలను, బంధువులను మరచిపోతారు. పరమాత్మా! మానవులు, దేవతలు, మృగాలు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలైన పలువిధాల ప్రాణులతో నిండి ప్రకృతి పురుషులతో కూడి మహదాదులకు కారణమైన నీ స్థూల రూపాన్ని నేను ఎరుగుదును. కాని నిత్యకల్యాణమూ, నిరంతర మహైశ్వర్య సంపన్నమూ అయి, శబ్ద వ్యాపారానికి గోచరం కాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రం నేను ఎరుగను. రాజీవనేత్రా! రమాకళత్రా! నీవు నిర్మలాకారుడవు. భవభయదూరుడవు. మునిజన సంస్తవనీయుడవు. పరమ భాగ్యధౌరేయుడవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=285

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 23