Friday, December 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౭(707)

( అవధూత సంభాషణ ) 

11-100-క.
మోహితుఁడై వసుకాంక్షా
వాహినిలోఁ జిక్కి క్రూరవశుఁడౌ మనుజుం
డూహాపోహ లెఱుంగక
దేహము నలఁగంగఁ జేయు దీనత నెపుడున్‌.

భావము:
మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయే వాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=100

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, December 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౬(706)

( అవధూత సంభాషణ ) 

11-99-వ.
ఇవ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబువలనఁ గాలసృష్ట గుణసాంగత్యంబు లేమియు, నుదకంబువలన నిత్యశుచిత్వంబును, నసితపథునివలన నిర్మలత్వంబును, నిశాకర ప్రభాకరుల వలన నధికాల్పసమత్వజీవ గ్రహణ మోక్షణంబులును, గపోతంబులవలనఁ గళత్ర పుత్ర స్నేహంబును, నజగరంబువలన స్వేచ్ఛా విహారసమాగతాహారంబును, వననిధివలన నుత్సాహ రోషంబులును, శలభంబువలన శక్త్యనుకూల కర్మాచరణంబును, భృంగంబువలన సారమాత్రగ్రహణ విశేషంబును, స్తంబేరమంబువలనం గాంతావైముఖ్యంబును, సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపరత్వంబును, జలచరంబువలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభసంతుష్టియుఁ, గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేకనిష్ఠయు, దందశూకంబువలనం బరగృహవాసంబును, నూర్ణనాభివలన సంసారపరిత్యాగంబును, గణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయుననంగల వీని గుణంబు లెఱింగి మఱియుఁ గామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబు లను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితంబుగా వాయువశంబు సేసి, గాత్రపవిత్రత్వంబుకొఱకు షట్కర్మ నిరతుండయి, పుర నగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజనుండై, ఖేద మోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుం డయి నన్నె కాని యొండెఱుంగక యాత్మ నిష్ఠచేఁ బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయుం గావున.

భావము:
ఈ విధంగా, 1. భూమివలన సహనము; 2. వాయువువలన పరోపకారము; 3. ఆకాశమువలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం; 4 నీటివలన ఎప్పుడు శుచిగా ఉండటం; 5. అగ్నివలన నిర్మలంగా ఉండటం; 6. 7. చంద్ర, సూర్యులవలన సర్వసమత్వము; 8. పావురంవలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము; 9. కొండచిలువవలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం; 10. సముద్రంవలన ఉత్సాహ రోషములు; 11. మిడుతవలన శక్తికి తగిన పనిచేయటము; 12. తుమ్మెదవలన సారమును మాత్రమే గ్రహించటం; 13. ఏనుగువలన స్త్రీ వైముఖ్యము; 14. తేనెటీగవలన సంగ్రహణము; 15. లేడివలన విచారపరత్వమ; 16. తాబేలువలన జిహ్వాచాపల్యము; 17. ముంగిసవలన దొరికిన దానితో తృప్తిపడటం; 18. లకుమికిపిట్టవలన మోహ పరిత్యాగము; 19. బాలునివలన విచార పరిత్యాగము; 20. బాలికవలన సంగ విసర్జనము; 21. బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత; 22. పామువలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం; 23. సాలెపురుగువలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము; 24. కందిరీగవలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట; నేర్చుకోవాలి.
ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, అనే అరిషడ్వర్గము (ఆరుగురు శత్రువులు) జయించాలి ముసలితనం రాకుండా చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలగి, పట్టణాలను గ్రామాలను నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్నీ మోహాన్నీ వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్ఠతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు నా యందే కలుస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=99

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౫(705)

( అవధూత సంభాషణ ) 

11-98-క.
ఇవి తెలియవలయు నాకును
బ్రవిమలమతి వీనిఁ దెలియఁ బలుకు మనంగాఁ
వివరము వినుమని కృష్ణుఁడు
సవినయుఁడగు నుద్ధవునికిఁ జయ్యనఁ జెప్పెన్‌.

భావము:
ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా, “ఇవి ఏమిటో తెలుసుకోవాలని ఉంది, నిర్మలమతితో వీటి గురించి తెలియచెప్పండి.” అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినమ్రుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=98

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౭౦౪(704)

( అవధూత సంభాషణ ) 

11-97-వ.
ఇందుల కొక్క యితిహాసంబు గలదు; మహారణ్యంబున నొక్క కపోతంబు దారసమేతంగా నొక్క నికేతనంబు నిర్మించి యన్యోన్య మోహాతిరేకంబునఁ గొంతకాలంబునకు సంతానసమృద్ధిగలదియై యపరిమితంబు లయిన పిల్లలు దిరుగాడుచుండఁ గొన్ని మాసంబులు భోగానుభవంబునం బొరలుచుండఁ గాలవశంబున నొక్క లుబ్ధకుం డురు లొడ్డిన నందు దారాపత్యంబులు దగులువడిన ధైర్యంబు వదలి మోహాతిరేకంబునం గపోతంబు కళత్ర పుత్త్ర స్నేహంబునం దాను నందుఁజొచ్చి యధికచింతాభరంబునం గృశీభూతంబయ్యెఁ; గావున నతితీవ్రంబయిన మోహంబు గొఱగా దట్లు గాన నిరంతర హరిధ్యానపరుండై భూమి పవన గగన జల కృపీట భవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి శలభ ద్విరేఫ గజ మధు మక్షికా హరిణ పాఠీన పింగళా కురర డింభక కుమారికా శరకృ త్సర్ప లూతా సుపేశకృత్సముదయంబులు మొదలుగాఁ గలవాని గుణగణంబు లెఱింగికొని యోగీంద్రులు మెలంగుదు; ”రనిన.

భావము:
దీనికి ఒక ఇతిహాసము ఉంది. చెప్తా విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆ కపోత దంపతులు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉండేవారు. కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలన్నీ అటుఇటూ తిరుగుతూ ఉంటే సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్నినెలలు గడిచాయి. ఇలా ఉండగా, ఒకనాడు కాలవశాన ఒక బోయ వచ్చి వల వేశాడు. ఆ వలలో ఆడపావురము పిల్లలు చిక్కుకున్నాయి. మగపావురం ధైర్యం వదలి మోహంతో భార్యా బిడ్డలమీద స్నేహంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించి పోయింది. కాబట్టి, దేని యందు మరీ తీవ్రమయిన మోహం మంచిది కాదు.
అందుకనే యోగీంద్రులు ఎప్పుడు హరిధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుమికిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ (ఇరవై నాలుగు) మొదలగు వాటి గుణగణాలు తెలుసుకుని మెలగుతూ ఉంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=97

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, December 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౩(703)

( అవధూత సంభాషణ ) 

11-96-ఉ.
దారలయందుఁ, బుత్త్ర ధన ధాన్యము లందు ననేక భంగులం
గూరిమి సేయు మర్త్యుఁ డతి ఘోర వియోగజ దుఃఖమగ్నుఁడై
నేరుపు దక్కి, చిక్కువడి నీతి వివేక విహీనుడై మనో
భారముతోఁ గపోతపతి భంగి నిజంబుగ బోవు నష్టమై.

భావము:
భార్యాబిడ్డలపై, ధనధాన్యములపై అతి మోహం పెంచుకునే మానవుడు, భయంకరమైన వియోగ దుఃఖాలలో కొట్టుమిట్టాడతాడు. ఏమి చేయాలో తెలియని స్థితికి చేరతాడు. ఆ బంధాలలో చిక్కుకుపోయి నీతి, వివేకాలు కోల్పోతాడు. ఆఖరికి కథలోని కపోతము వలె మనోవ్యథతో తప్పక నష్టపోతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=96

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౨(702)

( అవధూత సంభాషణ ) 

11-94-వ.
అంత యదుప్రవరుండు “దేహి లోభమోహాదులవర్జించి జనార్దనుని నే విధంబునం జేరవచ్చు? నెఱింగింపు” మనిన నతం డిట్లనియె.
11-95-సీ.
"పరధన పరదార పరదూషణాదులఁ-
  బరవస్తుచింతదాఁ బరిహరించి
ముదిమిచే రోగము లుదయింప కటమున్న-
  తనువు చంచలతను దగులకుండ
బుద్ధిసంచలతచేఁ బొదలక యట మున్న-
  శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
శక్తియుక్తుల మది సన్నగిల్లక మున్న-
  భక్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు
11-95.1-తే.
దైత్యభంజను దివ్యపాదారవింద
భజన నిజభక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
నవ్యయానందమును బొందు ననుదినంబు
నతఁడు కర్మవిముక్తుఁడౌ ననఘచరిత!

భావము:
దానికి యదురాజు “శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏవిధంగా విష్ణువును చేరగలడు. తెలియజెప్పండి.” అంటే, అవధూత ఇలా అన్నాడు. “ఓ సచ్చరిత్రా! విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైనపడి రోగాలు పుట్టక ముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాక ముందే, గొంతులో శ్లేష్మం చేరక ముందే, శక్తియుక్తులు సన్నగిల్లక ముందే, ధృఢమైన భక్తిభావనతో దానవాంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త ఙ్ఞానం కలిగి ఉండి, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=95

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, December 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౧(701)

( అవధూత సంభాషణ ) 

11-92-ఉ.
పంకజనాభుఁ డుద్ధవునిపైఁ గల కూర్మిని జెప్పె నొప్ప నెం
దంకిలి లేక యన్నిదిశలందుఁ జరించుచు నిత్యతృప్తుఁడై
శంకరవేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర నే
వంకనునుండి వచ్చి తన వానికి నిట్లనె నర్థి నేర్పడన్‌.
11-93-క.
అవధూత వల్కె నంతటఁ
"బ్రవిమల విజ్ఞాన నిపుణ భవ్యులు గురువుల్‌
తవిలిన నిరువదినలువురు
నవనిన్‌ విజ్ఞాని నైతి" నని పల్కుటయున్‌.

భావము:
పద్మనాభుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. “ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడినుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరిగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాదచేసి “ఎక్కడ నుండి వచ్చారు” అని ఆసక్తితో అడిగాడు. యోగి ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు ఇరవైనలుగురు నాకు గురువులు. వారివలన నేను విజ్ఞానిని అయినాను.” అని యోగి అనగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=93

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Saturday, December 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౦(700)

( ప్రభాసంకు బంపుట ) 

11-91-వ.
ఇట్లు నుతియించి “దేవా! నీవు యదుక్షయంబు గావించి చనిన నేమే విధంబున నిర్వహింతుము? నీ సహచరులమై జరిపిన మజ్జన భోజన శయ నాసనాది కృత్యంబులు మఱవవచ్చునే?” యని యుద్ధవుం డాడిన వాసుదేవుం డిట్లనియె; “బ్రహ్మాదిదేవతా ప్రార్థనంబునం జేసి ధాత్రీ భారంబు నివారించితి; నింక ద్వారకానగరంబు నేఁటికి సప్తమ దివసంబున సముద్రుండు ముంపంగలవాఁడు; యదుక్షయంబునుం గాఁగల యది; యంతటం గలియుగంబునుం బ్రాప్తంబయ్యెడి, నందు మానవులు ధర్మవిరహితులు, నాచారహీనులు, నన్యాయపరులును, నతిరోషులు, మందమతులు, నల్పతరాయువులు, బహురోగపీడితులు, నిష్ఫలారంభులు, నాస్తికులునై యొండొరుల మెచ్చక యుందురు; గావున నీవు సుహృద్బాంధవస్నేహంబు వర్జించి, యింద్రియసౌఖ్యంబులం బొరయక క్షోణితలంబునం గల పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేయుచు, మానస వాగక్షి శ్రోత్ర ఘ్రాణేంద్రియ గృహ్యమాణం బగు వస్తుజాతంబెల్ల నశ్వరంబుగా నెఱుంగుము; పురుషుండు నానార్థ కామంబుల నంగీకరించి నిజగుణదోషంబుల మోహితుండై యుండుం; గావున హస్తిపకుండు గంధనాగంబుల బంధించు చందంబున నింద్రియంబులను, మనోవికారంబులను నిగ్రహించి యీషణత్రయంబును వర్జించి, మోద ఖేదంబుల సముండవుగా వర్తించుచు, నీ జగంబంతయు నాత్మాధిష్ఠితంబుగా నెఱింగి, మాయాదు లాత్మతత్త్వాధీనంబులుగాఁ దెలియుచు, జ్ఞానవిజ్ఞానయుక్తుండవై యాత్మానుభవ సంతుష్టుండవై, విశ్వంబును నన్నుఁగా భావించి, వర్తింపవలయు” నని వాసుదేవుం డానతిచ్చిన నుద్ధవుండు భక్తి భయ వినయంబులం గరంబులు మొగిడ్చి “మహాత్మా! సన్న్యస్త లక్షణంబు దుష్కరంబు; పామరులగు వార లాచరింపలేరు; నీ మాయచేత భ్రాంతులైన సాంసారికులు భవాబ్ధిం గడచి యెట్లు ముక్తి వడయుదురు? భృత్యుండనైన నా మీఁది యనుగ్రహంబునం జేసి యానతిమ్ము; బ్రహ్మాది దేవతా సముదయంబును, బాహ్యవస్తువుల భ్రాంతులై పర్యటనంబు సేయుదురు; నీ భక్తు లైన పరమభాగవతు లమ్మాయా నిరసనంబును సేయుదురు; గృహిణీ గృహస్థుల కైన, యతుల కైన నిత్యంబును నీ నామస్మరణంబు మోక్షసామ్రాజ్యపదంబు; గావునఁ బరమేశ్వరా! నీదు చరణంబుల శరణంబు నొందెద; గృపారసంబు నాపై నిగిడింపు” మని ప్రియసేవకుం డైన యుద్ధవుండు పలికిన నతనికిఁ గంసమర్దనుం డిట్లనియెఁ; “బురుషున కాత్మకు నాత్మయె గురువని యెఱుంగుము; కుపథంబులం జనక, సన్మార్గవర్తి వై పరమంబైన మన్నివాసంబునకుం జనుము; సర్వమూలశక్తిసంపన్నుండనైన నన్ను సాంఖ్యయోగపరులు నిరంతరభావంబులందుఁ బురుషభావంబు గావించి తలంచుచుందురు; మఱియు నేక ద్వి త్రి చతుష్పాద బహుపాదాపాదంబులు నై యుండు జీవజాలంబుల లోన ద్వి పాదంబులు గల మనుష్యులు మేలు; వారలలోన నిరంతరధ్యాన గరిష్ఠులైన యోగీంద్రులుత్తములు; వారలలో సందేహపరులచే నగ్రాహ్యుండగు నన్ను సత్త్వగుణగ్రాహ్యునిఁగా నెఱింగి నిజచేతఃపంకజంబు నందు జీవాత్మ పరమాత్మల నేకంబుగాఁ జేసి శంఖ చక్ర గదా ఖడ్గ శార్‌ఙ్గ కౌమోదకీ కౌస్తుభాభరణయుక్తుంగా నెఱుంగుచు నుండువారలు పరమయోగీంద్రు లనియు, బరమజ్ఞాను” లనియునుం జెప్పి మఱియు“నవధూత యదు సంవాదం” బను పురాతనేతిహాసంబు గలదుఁ సెప్పెద నాకర్ణింపుము.

భావము:
ఈ విధంగా స్తుతించి “ఓ దేవా! నీవు యాదవజాతిని నాశనంచేసి వెళ్ళిపోతే, మేము ఎలా మా జీవితాలు నిర్వహించగలము. నీకు సహచరులమై నీతో కలసి చేసిన స్నాన పాన భోజన శయన ఆసనాదులను ఎలా మరచిపోగలము.” అని ఉద్ధవుడు అన్నాడు. దానికి వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “బ్రహ్మదేవుడు మొదలగు దేవతల ప్రార్థన ప్రకారం భూభారాన్ని తొలగించాను. ఇక ఈనాటి నుండి ఏడవ దినమున ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం ప్రవేశిస్తుంది.
అప్పుడు మానవులు ధర్మం ఆచారం లేనివారు అవుతారు. అంతేకాక మానవులు అన్యాయపరులు, అతిరోష స్వభావులు, బహురోగ పీడితులు, సంకల్పాలు ఫలించని వారు, నాస్తికులు అయి ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోకుండ ఉంటారు. కనుక, నీవు స్నేహితులు చుట్టాలు వంటి అనుబంధాలను వర్జించు. ఇంద్రియ సౌఖ్యాలలో మునిగిపోకు. భూతలం మీద పుణ్యతీర్ధాలలో స్నానాలు చెయ్యి. పంచేంద్రియాలచే గ్రహింపదగు వస్తువులు సర్వం నశించేవిగా తెలుసుకో.
పురుషుడు అనేకామైన సంపదలను సంపాదించి కామాలకు అవకాశమిచ్చి తన గుణదోషాలకు మోహితుడు అయి ఉంటాడు. కాబట్టి, మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా, ఇంద్రియాలను మనోవికారాలను నిగ్రహించి భార్యాపుత్రులపైన ధనముపైన ఆసక్తి వదలుము. సుఖమునందు కష్టమునందు సమంగా వర్తించు. ఈ విశ్వం సమస్తం పరమాత్మచే అధిష్టించబడినదిగా గ్రహించు. మాయ ఆత్మకు వశమైనదిగా గుర్తించు. జ్ఞాన విజ్ఞానములు కలవాడవు అయి, అత్మానుభవంతో సంతుష్టిపొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు.” అని వాసుదేవుడు అనతిచ్చాడు.
ఉద్ధవుడు భయ భక్తి వినయాలతో చేతులు జోడించి ఇలా అన్నాడు. “మహానుభావ! సన్యాస జీవితం చాల కష్టమైంది. పామరులు ఆచరించ లేరు. నీ మాయ వలన భ్రాంతులు అయినవారు ఈ సంసార సముద్రాన్ని ఎలా తరించగలరు. ఎలా మోక్షాన్ని పొందగలరు. నేను మీ సేవకుడను కదా. నాకు దయచేసి సెలవియ్యండి. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు సహితం బాహ్య వస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. నీ భక్తులైన పరమ భాగవతులు మాత్రమే ఆ మాయను తప్పించుకో గలరు. ఇల్లాండ్రకైనా, గృహస్థులకైనా, యతులకైనా ఎప్పుడూ నీ నామస్మరణమే మోక్షసామ్రాజ్యాన్ని అందిస్తుంది. కాబట్టి, పరమేశ్వరా! నీ పాదాలను శరణు వేడుతున్నాను. నా మీద నీ దయారసాన్ని ప్రసరించు.” అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు అర్థించాడు. అప్పుడు అతనితో కృష్ణుడు ఇలా అన్నాడు.
మానవుని ఆత్మకు ఆత్మే గురువు అని తెలుసుకో. చెడుమార్గాలలో వెళ్లకుండా సన్మార్గంలో మెలగుతూ పరమమైన నా నివాసానికి చేరుకో. సమస్తానికి మూలమైన నన్ను సాంఖ్య యోగులు ఎప్పుడు పరమపురుష భావంతో భావిస్తూ ఉంటారు. అదీకాక ఒకటి రెండు మూడు నాలుగు అనేక కాళ్ళు కలవి; అసలు కాళ్ళులేనివి అయిన జీవజాలంలో రెండు కాళ్ళు కల మనుష్యులు ఉత్తములు; వాళ్ళలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు; కాని వాళ్ళలో సంశయగ్రస్తులు నన్ను గ్రహించలేరు; నేను సత్త్వగుణగ్రాహ్యుడను. ఈ విషయం గ్రహించి తమ మనసులలో జీవాత్మ పరమాత్మలను ఒకటి చేసి. శంఖం చక్రం గద ఖడ్గం శార్గ్ఞ్యం కౌమోదకి కౌస్తుభం మున్నగు ఆభరణాలు కల నన్ను తెలుసుకున్న వారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు.” అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. “అవధూత యదుసంవాదం అనే ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది. చెప్తాను విను.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=91

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Friday, December 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౯(699)

( ప్రభాసంకు బంపుట ) 

11-88-క.
నారాయణు వచనముల క
పారంబగు సమ్మదమున బలములతోడన్‌
దార సుత మిత్ర యుతులై
వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగిన్‌.
11-89-వ.
అంత.
11-90-క.
జ్ఞానమున నుద్ధవుఁడు దన
మానసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో
దీనజనకల్పభూజ! సు
ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌.

భావము:
శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్యా బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులు గుఱ్ఱాలు సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాసతీర్థానికి వెళ్ళారు. అప్పుడు ఉద్ధవుడు తనకు ఉన్న జ్ఞానంతో ఈ విషయం అంతా గ్రహించి, “లక్ష్మీవల్లభా! శ్రీహరీ! దీనల పాలిటి కల్పవృక్షమా! బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు అయిన నీవే మాకు దిక్కు” అని స్తుతించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=16&Padyam=89

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Thursday, December 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౮(698)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-87-సీ.
కాక ఘూకంబులు గనకసౌధములలోఁ-
  బగలు వాపోయెడి బహువిధముల
నశ్వవాలములందు ననల ముద్భవ మయ్యె-
  నన్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల-
  జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె-
  బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.
11-87.1-తే.
గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె
నరయ నిందుండ వలవదు యదువులార!
తడయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ
డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.

భావము:
శ్రీకృష్ణుడు యాదవులను ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=15&Padyam=87

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, December 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౭(697)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-85-తే.
అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దపరిమితంబు
నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు.
11-86-వ.
అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ “యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం” డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాదిబృందారకులు నిజస్థానంబులకుం జని రంత.

భావము:
“సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి.” అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. అటుపిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&Padyam=86

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, December 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౬(696)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-83-క.
సుర గరుడ ఖచర విద్యా
ధర హర పరమేష్ఠి ముఖ సుధాశనులు మునుల్‌
సరసిజనయనునిఁ గనుఁగొన
నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్‌.
11-84-క.
కని పరమేశుని యాదవ
వనశోభిత పారిజాతు వనరుహనేత్రున్‌
జనకామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.

భావము:
“ఓ రాజా! శ్రద్ధగా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. అలా వచ్చి దర్శించుకుని, యాదవవంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటివాడు, జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&Padyam=84

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౫(695)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-82-వ.
అట్లుగావున లోకరక్షణార్థంబు గృష్ణుండవతారంబునొందె” నని హరి భక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులుగృష్ణుని పరమాత్మునిగా విచారించి” రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు “మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారు లగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు సేసిరి? యేమయ్యె? మఱియుఁ బరమేశ్వర కథామృతంబు వీనులలరం జవిగొనియు, నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరి చారిత్రం బేరీతిఁ జాగెఁ? దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు' మనిన శుకుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తుతో చెప్పగా అతడు “మునీంద్రా! భూభారాన్ని తగ్గించటం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు; ఋషీశ్వరులు తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా ప్రవేశించారు? అటు పిమ్మట ఏమయింది? వివరంగా చెప్పండి. విష్ణు కథామృతం చెవులారా ఎంత విన్నా, తృప్తికలగటం లేదు. భక్తరక్షకుడైన శ్రీహరిచరిత్ర ఏ రీతిగా కొనసాగింది? ఈ వృత్తాంతమంతా తెలియజెప్ప” మని అడుగగా శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=82

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, December 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౪(694)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-80-సీ.
కమలాక్షపదభక్తి కథనముల్‌ వసుదేవ!-
  విని యఘంబులఁ బాసి వెలసి తీవు
భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి-
  కైవల్యలక్ష్మియుఁ గలుగు మీఁద
నారాయణుండు నీ నందనుం డను మోహ-
  మెడలించి విష్ణుగాఁనెఱిఁగి కొలువు
మతఁడు నీ తనయుఁడై యవతరించుటఁజేసి-
  సిద్ధించె దేహసంశుద్ధి నీకు
11-80.1-తే.
సరససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ
బావనంబైతి; శిశుపాల, పౌండ్ర, నరక,
ముర, జరాసంధ, యవనులు, ముదముతోడ
వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యి.
11-81-క.
దుష్టజన నిగ్రహంబును
శిష్టప్రతిపాలనంబు సేయన్‌ హరి దా
సృష్టి నవతార మొందెను
స్రష్టృముఖానేక దివిజసంఘము వొగడన్‌.

భావము:
“వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=80

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౩(693)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-79-వ.
ఇవ్విధంబునఁ బ్రశంసింపఁదగిన కావేర్యాది మహానదీపావనజల స్నాన పాన దానంబులను, విష్ణుధ్యానకథాసుధార సానుభవంబుల నిరూఢులగు భాగవతోత్తములు గలిగిరేనిం జెడని పదంబునుం బొందుదు” రని ఋషభకుమారులు భగవత్ప్రతిబింబంబు లయిన పరమపురుషులుం బోలె విదేహజనపాలునకు నిశ్శ్రేయః పదప్రాప్తికరంబు లైన భగవద్భక్తి ధర్మంబు లుపదేశించి యంతర్ధానంబు నొందిరి; మిథిలేశ్వరుండును జ్ఞానయోగం బంగీకరించి నిర్వాణపదంబు నొందె; నీ యుపాఖ్యానంబు వ్రాసినఁ బఠించిన వినిన నాయురారోగ్యైశ్వర్యములు గలిగి పుత్త్ర పౌత్త్ర వంతులై సకల కలికల్మష రహితులై విష్ణులోక నివాసు లగుదు” రని నారదుండు వసుదేవునకుం జెప్పి మఱియును.

భావము:
ఈవిధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు” అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలయిన పరమపురుషుల వంటి వారైన ఋషభకుమారులు, విదేహమహారాజుకి మోక్షపదంపొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్నిపొందాడు. ఈ విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.” అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=79

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౬౯౨(692)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-78-తే.
ద్రవిడ దేశంబునందులఁ దామ్రపర్ణి
సహ్యజా కృతమాలాది సకలనదుల
కెవ్వఁ డేనిని భక్తితో నేఁగి యచటఁ
బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు.

భావము:
ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=78

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, November 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౧(691)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-77-వ.
అనిన విని యందుఁ గరభాజనుం డిట్లనియె; “ననేకావతారంబులు నానా రూపంబులును బహువిధ వర్ణంబులునుం గలిగి, రాక్షసులను సంహరించి, దుష్టజన నిగ్రహంబును శిష్టజన పరిపాలనంబునుం జేయుచుఁ గృతయుగంబున శుక్లవర్ణుండై చతుర్బాహుండై జటావల్కల కృష్ణాజినోత్తరీయ జపమాలికా దండ కమండలు ధరుండయి హరి నిర్మలతపోధ్యానానుష్ఠానగరిష్ఠు లైన పురుష శ్రేష్ఠులచేత హంసుండు, సువర్ణుండు, వైకుంఠుండు, ధర్ముం, డమలుండు, యోగేశ్వరుం, డీశ్వరుండు, పురుషుం, డవ్యక్తుండు, పరమాత్ముం డను దివ్యనామంబులం బ్రసిద్ధి వహించి గణుతింపంబడుఁ; ద్రేతాయుగంబున రక్తవర్ణుం డయి బాహుచతుష్క మేఖలాత్రయ విశిష్టుం డయి హిరణ్యకేశుండును, వేదత్రయస్వరూపుండును, స్రుక్‌ స్రువాద్యుపలక్షణ శోభితుండునయి విష్ణు, యజ్ఞ, పృశ్నిగర్భ, సర్వదేవోరుక్రమ, వృషాకపి, జయంతోరుగాయాఖ్యల బ్రహ్మవాదుల చేత నుతియింపంబడు; ద్వాపరంబున శ్యామలదేహుండును, పీతాంబరధరుండును, బాహుద్వయోపశోభితుండును, దివ్యాయుధధరుండును, శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజమానుండును, మహారాజోపలక్షణుండు నై జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ, నారాయణ, విశ్వరూప, సర్వభూతాత్మ కాది నామంబుల వెలసి, మూర్ధాభిషిక్తులచేత సన్నుతింపంబడు; కలియుగంబునఁ గృష్ణవర్ణుండును గృష్ణనామకుండునునై భక్తసంరక్షణార్థంబు పుండరీకాక్షుండు యజ్ఞ సంకీర్తనంబుల చేతం బ్రస్తుతింపబడు; హరి, రామ, నారాయణ, నృసింహ, కంసారి, నలినోదరాది బహువిధ నామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతియింపుదురు; మఱియును.

భావము:
అని అడుగగా విని వారిలో కరభాజనుడనే ఋషి విదేహరాజుతో ఇలా అన్నాడు. ఎన్నో అవతారాలు; ఎన్నెన్నో రూపాలు; అనేక రకాల వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి; దుష్టశిక్షణం శిష్టరక్షణం కావించే శ్రీ మహవిష్ణువు…

కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు.

త్రేతాయుగంలో ఎఱ్ఱనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు.

ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు.

కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=77

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Saturday, November 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౦(690)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-75-వ.
అట్లు గావున గృహ క్షేత్ర పుత్త్ర కళత్ర ధనధాన్యాదులందు మోహితుండయి ‘ముక్తిమార్గంబు లప్రత్యక్షంబు’ లని నిందించువాఁడును, హరి భక్తివిరహితుండును, దుర్గతిం గూలుదు” రని మునివరుం డానతిచ్చిన విదేహుం డిట్లనియె.
11-76-ఆ.
"ఏ యుగంబునందు నే రీతి వర్తించు?
నెట్టి రూపువాఁడు? నెవ్విధమున
మును నుతింపఁబడెను మునిదేవగణముచే
విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు?

భావము:
అందుచేత, ఇండ్లు పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేదికాదు. కనుక లేదని నిందించే వారు; హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు.” అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు. “అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచేత, దేవతలచేత కీర్తించబడ్డాడు?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=76

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౬౮౯(689)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-73-వ.
ఇవ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసంబు లనంతంబులు గలవు; మనోవాక్కాయకర్మంబుల హరిపూజనంబు సేయక, విపరీత గతులం దిరుగుచుండు జడుల కెవ్విధం బగు గతిగలుగు?” ననిన నప్పు డప్పుడమిఱేఁ డప్పరమపురుషుం జూచి “యట్టి జడులు ముక్తి నొందు నుపాయం బెట్టు లంతయు నెఱింగింపుఁ” డనినఁ జమసుం డిట్లనియె.
11-74-సీ.
"హరిముఖ బాహూరు వరపదాబ్జములందు-
  వరుసఁ జతుర్వర్ణ వర్గసమితి
జనియించె; నందులో సతులును శూద్రులు-
  హరిఁ దలంతురు; కలిహాయనముల
వేదశాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మ-
  కర్తలై విప్రులు గర్వ మెసఁగి
హరిభక్తపరులను హాస్యంబు సేయుచు -
  నిరయంబు నొందుట నిజము గాదె?
11-74.1-తే.
మృదుల పక్వాన్న భోజనములను మాని
జీవహింసకుఁ జనువానిఁ జెందు నఘము;
హరి నుతింపక స్త్రీలోలుఁ డైనఁవాడు
నరకవాసుండు నగుచుండు ననవరతము.

భావము:
ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. “ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాక్కాయకర్మలా హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏవిధంగానూ సద్గతి కలుగదు.” అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో “అటువంటి మూర్ఖులు ముక్తిపొందే ఉపాయం తెలియ జెప్పండి.” అని అడిగాడు. వారిలో చమసుడనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు. విష్ణుమూర్తి ముఖం బాహువులు తొడలు పాదములు వీటి యందు వరుసగా వర్ణములు నాలుగు పుట్టాయి. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేద శాస్త్ర పురాణాలందు ప్రసిద్ధులై, కర్మలుచేస్తూ గర్వంతో హరిభక్తులను అపహాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటం ఖాయం. స్వచ్ఛమైన పక్వాన్నం భుజించుట మాని మాంసాహారులై జీవహింసకు పాల్పడేవాడికి పాపం తగులుతుంది. శ్రీహరిని నుతింపక స్త్రీలోలు డైనవాడికి ఎప్పుడూ నరకమే నివాసం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=74

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, November 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౮(688)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-72-ససీ.
నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ-
  గగనచరనది జనిత! నిగమవినుత!
జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర-
  పరిమళిత నిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!-
  కటిఘటిత రుచిరతర కనకవసన!
భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత!-
  సతతజపరత! నియమసరణి చరిత!
11-72.1-తే.
తిమి, కమఠ, కిటి, నృహరి, ముదిత బలి నిహి
త పద, పరశుధర, దశవదన విదళన,
మురదమన, కలికలుష సుముదపహరణ!
కరివరద! ముని నర సుర గరుడ వినుత!

భావము:
“నవవికసిత పద్మములవంటి కన్నుల జంట కలవాడ! హరి! పాదము మూలము లందు ఆకాశగంగ పుట్టినవాడ! వేదములచేత పొగడబడు వాడ! లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడ! భూమిని మోసిన వాడ! బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించు వాడ! నడుము నందు బంగారచేలము ధరించినవాడ! గరుత్మంతుడు వాహనముగా కలవాడ! కైలాసపతి శంకరునిచే నుతింపబడు వాడ! నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడ! నియమబద్ధమైన చరిత్ర కలవాడ! మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అను దశావతారములను దాల్చినవాడ! గజేంద్రవరదా! మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడు వాడ!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=72

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, November 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౭(687)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-70-తే.
ఋషభునకు నాత్మయోగ మీ రీతిఁ జెప్పె;
నచ్యుతుఁడు భూమిభారము నడఁప నంత
సొరిది నవతారములు దాల్చి సొంపు మీఱ
రాత్రిచరులను జంపె నీరసముతోడ.
11-71-వ.
అట్టి పరమేశ్వరుని లీలాగృహీతంబులగు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ రఘురామ రామ బుద్ధ కల్క్యాద్యవతారంబు లనేకంబులు గలవు; వాని నెఱిఁగి నుతియింప శేషభాషాపతులకైన నలవి గాదు; మఱియును.

భావము:
ఋషభునకు ఆత్మయోగాన్ని ఈ విధంగా ఉపదేశించిన అచ్యుతుడు విష్ణువు భూభారాన్ని అణచుటకు ఎన్నోఅవతారాలెత్తి పట్టుదలతో దుర్మార్గులు అయిన రాక్షసులను సంహరించాడు. అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా గ్రహించిన అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి స్తుతించటం బ్రహ్మదేవుడికైనా, ఆదిశేషునికైనా అలవి కాదు.” అని పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=71

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, November 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౬(686)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-69-వ.
అమ్మునీశ్వరుండు పరమాశ్చర్యవిధానంబుగా నిజతనూరుహంబుల వలనం ద్రికోటి కన్యకానివహంబుల నుద్భవింపం జేసిన, గంధర్వవిబుధకామినీ సముదయంబులు పరమాద్భుత భయంబులు మనంబులం బొడమ సన్నుతించి, యవ్విలాసినీసమూహంబులో నూర్వశియను దానిం గొనిచని, పాకశాసను సభాసదనంబునం బెట్టి తద్వృత్తాంతం బంతయు విన్నవించిన నాశ్చర్య యుక్త హృదయుండయి సునాసీరుం డూరకుండె; నట్టి నారాయణ మునీశ్వరుచరిత్రంబు వినువారలు పరమ కల్యాణగుణవంతు లగుదు" రని చెప్పిన.

భావము:
ఆ మునిశ్రేష్ఠుడు అందరూ ఆశ్చర్యపోయేలా తన రోమకూపాల నుండి మూడుకోట్ల కన్యకలను పుట్టించాడు. అది చూసిన ఆ అప్సరసలు అత్యంత ఆశ్చర్యంతో భయంతో ఆ మహర్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక సుందరాంగిని తీసుకుని వెళ్ళి జరిగినదంతా ఇంద్రునికి చెప్పారు. మునిశక్తికి వెరగుపడిన ఇంద్రుడు మిన్నకున్నాడు. అటువంటి నారాయణముని చరిత్ర వినే వాళ్ళు మిక్కిలి శుభకరమైన గుణాలను పొందుతారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=69

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : .

Saturday, November 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౫(685)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-68-సీ.
"దేవమునీంద్ర! నీ దివ్యచారిత్రంబు-
  నెఱిఁగి సన్నుతిసేయ నెవ్వఁడోపుఁ?
బుత్త్ర మిత్ర కళత్ర భోగాదులను మాని-
  తపము గావించు సద్ధర్ములకును
విఘ్నముల్‌ సెందునే? విశ్వేశుఁ గొల్చిన-
  యతనికి నంతరాయంబు గలదె?
కామంబుఁ గ్రోధంబుఁ గల తపస్వితపంబు-
  పల్వలోదకములభంగిఁ గాదె?
11-68.1-తే.
నిన్ను వర్ణింప నలవియే? నిర్మలాత్మ!
రమణ లోఁగొను మా యపరాధ" మనుచు
సన్నుతించిన నతఁడు ప్రసన్నుఁ డగుచుఁ
దనదు సామర్థ్య మెఱిఁగింపఁ దలఁచి యపుడు.

భావము:
“దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది. పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మా! నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు.” అని నుంతించారు. అంత నారాయణమహర్షి ప్రసన్నుడై తన సామర్ధ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=68

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : .

Friday, November 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౪(684)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-66-చ.
మదనుని బాణజాలముల మగ్నతఁ బొందక ధైర్యవంతుఁ డై,
ముదితల వాఁడిచూపులకు మోహము నొందక నిశ్చలాత్ముఁడై,
హృదయమునందు నచ్యుతు రమేశు ననంతు జగన్నివాసునిన్‌
వదలక భక్తి నిల్పుకొని వారికి నిట్లనె మౌని పెంపునన్,
11-67-క.
"జంభారిపంపునను మీ
రంభోరుహవదనలార! యరుదెంచితి; రా
శుంభద్విహారవాంఛా
రంభంబునఁ దిరుగుఁ" డనిన లజ్జించి వెసన్‌.

భావము:
ఆ సమయంలో నారాయణఋషి మన్మథుని బాణాలకు లొంగ లేదు. ధైర్యము విడువలేదు. ఆ కాంతల వాడి చూపులకు మోహము పొంద లేదు. ఏమాత్రం చలించక తన హృదయంలో అచ్యుతుడు, అనంతుడు, జగన్నివాసుడు, రమేశుడు అయిన శ్రీహరిని నిశ్చలభక్తితో మనసున నిలుపుకుని ఉన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు. “పద్మముఖులార! ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు. ఇక్కడ విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టంవచ్చినట్లు తిరగండి.” అనేటప్పటికి వాళ్ళంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=67

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : .

శ్రీకృష్ణ విజయము - ౬౮౩(683)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-65-వ.
వారు నారాయణాశ్రమంబునకు నతని తపోవిఘ్నంబు సేయ వచ్చునప్పు డవ్వనంబు సాల రసాల బిల్వ కదళీ ఖర్జూర జంబు జంబీర చందన వున్నాగ మందారాది వివిధ వృక్ష నిబిడంబును, పుష్ప ఫల భరిత శాఖావనమ్ర తరులతా బృందంబును, మాధవీ కుంజమంజరీ పుంజ మకరందపాన మత్తమధుకర నికర ఝంకారరవ ముఖరిత హరి దంతరంబును, గనక కమల కహ్లార విలసత్సరోవిహరమాణ చక్రవాక బక క్రౌంచ మరాళదంపతీ మండల మండితంబును, మృణాళ భోజనాసక్త సారసచయ చంచూపుట విపాటిత కమలముకుళకేసర విసర వితత ప్రశస్త సరోవరంబును నై వెలయు నవ్వనంబున నిందువదన లందంద మందగమనంబులం జెందు ఘర్మజలబిందుబృందంబులు నఖాంతంబుల నోసరింపుచు డాయంజను నప్పుడు.

భావము:
ఆ ప్రకారం వారు నారాయణాశ్రమానికి అతని తపస్సును భగ్నంచేయడానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. పూలతో, పండ్లతో కొమ్మలు క్రిందికి వంగి ఉన్నాయి. గురువింద పొదల పూలగుత్తుల మకరందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో దిక్కులు నిండిపోతున్నాయి. బంగారు పద్మాలు, కలువలు, ప్రకాశించే సరస్సులలో జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంటజంటలుగా విహరిస్తున్నాయి. తామరతూళ్ళను తినుటం కోసం సారసపక్షులు ముక్కులతో చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరాలతో సరోవరాలు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులైన అప్సరసలు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్ళతో చిమ్ముకుంటూ నారాయణమహర్షిని సమీపించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=65

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౨(682)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-63-క.
ధర్ముండు దక్షపుత్త్రిక
నిర్మలమతిఁ బెండ్లియాడి నెఱిఁ బుత్త్రుని స
త్కర్ముని నారాయణ ఋషి
నర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమ మందున్‌.
11-64-తే.
అట్టి నారాయణాహ్వయుం డైన మౌని
బదరికాశ్రమమందు నపార నిష్ఠఁ
దపముఁ గావింప బలభేది దలఁకి మదిని
మీనకేతను దివిజకామినులఁ బనిచె.

భావము:
బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు. ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=64

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౧(681)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-61-క.
"తారల నెన్నఁగ వచ్చును;
భూరేణుల లెక్కవెట్టఁ బోలును ధాత్రిన్‌;
నారాయణగుణకథనము
లారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్‌.
11-62-వ.
అట్లు గావున నాత్మసృష్టంబైన పంచభూతనికరంబును పురం బొనరించి, యందు నిజాంశంబునం బ్రవేశించి, సగుణనిష్ఠుండై నారాయణాభిధానంబు గల ఋషీశ్వరుం డగు పరమేశ్వరుండు వెలుఁగొందె; నతని దశేంద్రియంబులచేఁ బాలితంబులైన దేహంబులు ధరించి, జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు గలుగుటం జేసి గుణనిష్ఠుండయి రజస్సత్త్వతమో గుణంబుల బ్రహ్మ విష్ణు రుద్ర మూర్తులనం బరఁగి, త్రిగుణాత్మకుం డనంబడు నారాయణాఖ్యుని చరిత్రం బెఱింగించెద; నాకర్ణింపుము.

భావము:
"రాజా! ఆకాశంలోని చుక్కలను లెక్కపెట్టవచ్చు. భూమిపై గల ఇసుక రేణువులను కూడ లెక్కపెట్టవచ్చును. కానీ నారాయణుని గుణములు చరిత్రలను మాత్రం శివుడు బ్రహ్మ మొదలైనవారు కూడ వర్ణించ లేరు. భగవంతుడు తాను సృష్టించిన పంచభూతాలతో సంభూతమైన పురమును చేసి, దానిలో తన అంశతో ప్రవేశించి పిమ్మట సగుణనిష్ఠుడై నారాయణుడు అను పేరు కల ఋషీశ్వరుడుగా విరాజిల్లాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం రక్షించటం సంహరించటం మొదలైన కార్యాలు చేయటం వలన రజస్సత్త్వతమోగుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడు అనబడే ఆ నారాయణుని చరిత్ర చెబుతాను విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=12&Padyam=62

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

శ్రీకృష్ణ విజయము - ౬౮౦(680)

( ఆవిర్హోత్రుని భాషణ ) 

11-59-క.,
"పురుషుం డే యే కర్మము
పరువడిఁ గావించి పుణ్యపరుఁడై మనుఁ? దా
దురితములుఁ దొరఁగి మురరిపు
చరణయుగం బెట్లు సేరు? సన్మునివర్యా! "
11-60-వ.
అనిన విని యందావిర్హోత్రుం డిట్లనియెఁ; “గర్మాకర్మ వికర్మ ప్రతిపాదకంబు లగు శ్రుతివాదంబులలౌకికవర్ణితంబు; లట్టి యామ్నాయంబులు సర్వేశ్వరస్వరూపంబులు గాన విద్వాంసులు నెఱుంగ లే; రవి కర్మాచారంబు లనంబడు; మోక్షంబుకొఱకు నారాయణ భజనంబు పరమపావనంబు; వేదోక్తంబుల నాచరింపక ఫలంబులకు వాంఛ సేయువార లనేక జన్మాంతరంబులం బడయుదురు; మోక్షంబు నపేక్షించు వాఁడు విధిచోదిత మార్గంబున హరిం బూజింపవలయు; నట్టి పూజాప్రకారం బెట్లనినఁ, బవిత్రగాత్రుం డయి జనార్దను సన్నిధిం బూతచిత్తుండై, షోడశోపచారంబులఁ జక్రధరు నారాధించి, గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబులు సమర్పించి, సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి, భక్తిభావనా విశేషుండగు నతండు హరింజేరు” నని చెప్పిన విని విదేహుం డిట్లనియె; “నీశ్వరుం డేయే కర్మంబుల నాచరించె, నంతయు నెఱిగింపు” మనినఁ ద్రమిళుం డిట్లనియె.

భావము:
“మహర్షిపుంగవ! పురుషుడు ఏయే కర్మలను ఆచరిస్తే పుణ్యుడై పాపాలను పోగొట్టుకుని మురవైరి పాదాలను చేరుకోగలుగుతాడో చెప్పండి.” అలా అడుగగా ఆవిర్హోత్రుడనే మహాముని విదేహప్రభువుతో ఈ విధంగా చెప్పసాగాడు. “కర్మ అకర్మ వికర్మ వీటిని ప్రతిపాదించే శ్రుతివాదులు లౌకికులు చెప్పినవి కాదు. అటువంటి వేదాలు సర్వేశుని స్వరూపాలు వాటిని పండితులు కూడ తెలుసుకోలేరు. వాటిని కర్మాచారాలు అంటారు. మోక్షంకోసం నారాయణ భజనం అన్నిటి కంటే పవిత్రమైనది. వేదం చెప్పినట్లు చేయక ఫలాలు కోరేవారు ఎన్నో జన్మలు ఎత్తుతారు. మోక్షాన్ని కోరేవారు శాస్త్రం చెప్పినవిధంగా హరిని పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటిదంటే పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని ఆరాధించాలి. గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అర్పించి సాష్టాంగదండప్రణామాలు చేయాలి. విశేషమైన భక్తిభావం మనసున నింపుకోవాలి. అట్టివాడు పరమాత్మను జేరుతాడు.” అని వివరించగా విని విదేహమహారాజు ఇలా అన్నాడు. “ఈశ్వరుడు ఏ లీలలు ఆచరించాడు. ఆ వివరం అంతా తెలుపవలసింది.” అనగా ద్రమిళుడనే మునివర్యుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=12&Padyam=60

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, November 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౯(679)

( పిప్పలాయన భాషణ ) 

11-58-వ.
దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి కమలసంభవాదులు నుతియింతు; రిట్టి పరమాత్మ స్థావరజంగమంబుల నధిష్ఠించి వృద్ధి క్షయంబులం బొందక నిమిత్తమాత్రంబునం దరులతాదు లందు జీవంబు లేక తదంతరస్థుండై వర్తించు; నంత సర్వేంద్రియావృతం బైన యాకారంబు నష్టంబైన మనంబునుం బాసి శ్రుతివిరహితుం డై తిరుగుచుండు; నిర్మల జ్ఞానదృష్టి గలవానికి భానుప్రభాజాలంబు దోఁచిన క్రియను, సుజ్ఞానవంతుడు హరిభక్తిచేత గుణకర్మార్థంబులైన చిత్తదోషంబులు భంజించి భగవత్సదనంబు సేరు” ననిన విని రాజిట్లనియె.

భావము:
ఇందుకు అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకుని బ్రహ్మ మొదలైనవారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావరజంగమాలను అధిష్టించి వృద్ధిక్షయాలు పొందక నిమిత్రమాత్రంగా చెట్లు తీగలు మొదలైనవాని లోపల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన ఆకారము పోగా మనస్సును వదలి శ్రుతి విరహితుడై తిరుగుతుంటాడు. నిర్మలమైన జ్ఞానదృష్టి కలవాడు సూర్యుని కాంతి పుంజం దర్శించినట్లు. సుజ్ఞాని అయినవాడు హరిభక్తిచేత గుణకర్మార్థములైన చిత్త దోషాలను నశింపజేసి ఈశ్వరుని చేరుకోగలుగుతాడు.” అంటే విని విదేహుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=11&Padyam=58

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౭౮(678)

( పిప్పలాయన భాషణ ) 

11-57-సీ.
"నరవర! విను జగన్నాథుని చారిత్ర-
  మెఱిఁగింతు నీమది కింపు మిగుల
లసదుద్భవస్థితిలయ కారణంబయి-
  దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ
జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు-
  జ్వాలల ననలుండుఁ జనని పగిది
నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు-
  పొరయక సుషిరంబుఁ బొందు, సత్య
11-57.1-తే.
మనఁగ సత్త్వరజస్తమోమయగుణంబు,
మహదహంకారరూపమై మహిమ వెలయు
చేతనత్వంబు గలదేని జీవ మందు,
రిదియ సదసత్స్వరూపమై యెన్నఁబడును.

భావము:
“రాజా! విను నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయాలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు, ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొన లేదు కదా. సత్త్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=11&Padyam=57

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౭(677)

( ప్రబుద్ధుని సంభాషణ ) 

11-55-క.
"హరిదాసుల మిత్రత్వము
మురరిపుకథ లెన్నికొనుచు మోదముతోడన్‌
భరితాశ్రుపులకితుండై
పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!"
11-56-వ.
అనిన రాజేంద్రుండు వారల కిట్లనియె; “భాగవతులారా! సకలలోకనాయకుం డగు నారాయణుం డనంబరఁగిన పరమాత్ముని ప్రభావంబు వినవలతు; నానతిం” డనినఁ బిప్పలాయనుం డిట్లనియె.

భావము:
మహారాజ! హరిభక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను తలచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు.” అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతోఇలాఅన్నాడు. “భాగవతులారా! సమస్త లోకాలకూ ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను ఆనతీయండి.” అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=10&Padyam=56

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Thursday, November 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౭(677)

( అంతరిక్షు సంభాషణ ) 

11-54-వ.
“సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షీణంబు నొంద, దేహ కళత్ర మిత్ర భ్రాతృమమత్వ పాశబద్ధులై విడివడు నుపాయంబు గానక, సంసారాంధకారమగ్నులయి గతాగతకాలంబుల నెఱుంగక, దివాంధంబులగు జంతుజాలంబుల భంగి జన్మ జరా రోగ విపత్తి మరణంబు లందియు, శరీరంబ మేలనుచుఁ బ్రమోద మోహమదిరాపానమత్తులై, విషయాసక్తతం జిక్కి, తమ్ముఁ దారెఱుంగక యుండి, విరక్తిమార్గంబు దెలియక వర్తించు మూఢు లగు జనంబుల పొంతలఁ బోవక; కేవల నారాయణ భక్తి భావంబు గల సద్గురుం బ్రతిదినంబును భజియించి; సాత్త్వికంబును, భూతదయయును, హరికథామృతపానంబును, బ్రహ్మచర్యవ్రతంబును, విషయంబుల మనంబు సేరకుండుటయు, సాధు సంగంబును, సజ్జన మైత్రియు, వినయసంపత్తియు, శుచిత్వంబును, తపంబును, క్షమము, మౌనవ్రతంబును, వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానంబులును, నహింసయు, సుఖదుఃఖాది ద్వంద్వసహిష్ణుతయు, నీశ్వరుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షుత్వంబును, జనసంగ వర్జనంబును, వల్కలాది ధారణంబును, యదృచ్ఛాలాభ సంతుష్టియు, వేదాంతశాస్త్రార్థ జిజ్ఞాసయును, దేవతాంతరనిందా వర్జనంబును, గరణత్రయ శిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాదిగుణ విశిష్టత్వంబును, గృహారామ క్షేత్ర కళత్ర పుత్త్ర విత్తాదుల హరికర్పణంబు సేయుటయు, నితర దర్శన వర్జనంబు సేయుటయును భాగవతోత్తమధర్మంబు” లని చెప్పి యిట్లనియె.

భావము:
“ప్రతిదినము మానవుల ఆయువు, సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో, క్షీణిస్తుంటుంది. దేహంపైనా, భార్యపైనా, స్నేహితులపైనా, సోదరులపైనా నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసార మనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక ముసలితనం రోగాలు ఆపదలు చావు పొందుతు కూడ శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియవిషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవలదు. కేవలం నారాయణుని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవతధర్మాలను అనుష్టించాలి. ఆ ధర్మాలు ఏవంటే:
1. మూఢుల పొంతల పోకపోవుట; 2, సద్గురు ప్రతిదిన భజనము; 3. సత్త్వగుణము కలిగి ఉండటం; 4. భూతదయ; 5. హరికథామృత పానం; 6. బ్రహ్మచర్య వ్రతం; 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయ కుండటం; 8. సాధుసంగమం; 9. సజ్జనులతో స్నేహం; 10 వినయ సంపద; 11. శుచిగా ఉండటం; 12. తపస్సు; 13 క్షమ; 14. మౌనవ్రతం; 15. వేదశాస్త్రాలను చదవటం వాటి అర్ధాన్ని అనుష్ఠించటం; 16. అహింస; 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగానీ సహించటం; 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం; 19. మోక్షం పొందాలనే కోరిక; 20. కుజనుల సంగతి వదలటం; 21. వల్కలాలు మొదలైనవి కట్టడం; 22. దానంతట అది లభించిన దానితో సంతుష్టి చెందటం; 23. వేదాంతశాస్త్రాల అర్ధాలను తెలుసుకోవా లనే కుతూహలం; 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం; 25. త్రికరణసుద్ధి; 26. సత్యమే పలకటం; 27. శమం దమం మొదలైన గుణవిశేషాలు; 28. ఇల్లు తోటలు పొలాలు భార్య సంతానం ధనం మొదలైనవాటిని పరమేశ్వరార్పణం గాభావించటం; 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం.” అని చెప్పి పిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=10&Padyam=54

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, November 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౫(675)

( అంతరిక్షు సంభాషణ ) 

11-53-ఉ.
"జ్ఞానవిహీనులైన నరసంఘముఁ గానఁగరాని మాయఁ దా
లోన నడంచి యెట్లు హరిలోకముఁ జెందుదు? రంతయుం దగన్‌
భూనుత! సత్యవాక్యగుణభూషణ! యిక్కథ వేడ్కతోడుతం
బూనికఁ జెప్పు" మన్నను బ్రబుద్ధుఁడు నిట్లను గారవంబునన్‌.

భావము:
“మీరు లోకోత్తములు. సత్యవాక్య పరిపాలకులు. కనరాని మాయను లోపల అణచివేసి అజ్ఞానులు ఏ విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? ఈ విషయాన్ని దయతో చెప్పండి.” ఇలా అన్న విదేహునితో ప్రబుద్ధుడు అనే మహముని ఆదర పూర్వకంగా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=9&Padyam=53

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, November 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౪(674)

( అంతరిక్షు సంభాషణ ) 

11-49-క.
"గజరాజవరదు గుణములు
త్రిజగత్పావనము లగుటఁ దేటపడంగా
సుజనమనోరంజకముగ
విజితేంద్రియ! వినఁగ నాకు వేడుక పుట్టెన్‌. "
11-50-వ.
అనిన విని యంతరిక్షుం డను ఋషిశ్రేష్ఠుం డిట్లనియె.
11-51-క.
పరమబ్రహ్మ మనంగాఁ,
బరతత్త్వ మనంగఁ, బరమపద మనఁగను, నీ
శ్వరుఁ డనఁ, గృష్ణుఁ డన, జగ
ద్భరితుఁడు, నారాయణుండు దా వెలుఁగొందున్‌.


భావము:
“మహాత్ములారా! మీరు ఇంద్రియాలను జయంచిన మహానుభావులు. మూడులోకాలను పరమ పవిత్రం చేసే, గజరాజవరదుడు శ్రీహరి గుణవిశేషాలను మనోరంజకంగా మీనుండి వినాలని నాకు వేడుక పుట్టింది.” ఇలా పలికిన విదేహునితో అంతరిక్షుడు అనే మహర్షి ఇలా అన్నాడు. “పరబ్రహ్మ అన్నా; పరతత్వము అన్నా; పరమపదము అన్నా; ఈశ్వరుడు అన్నా; శ్రీకృష్ణుడు అన్నా; శ్రీమన్నారాయణుడే. ఆయనే జగద్భరితుడై ప్రకాశిస్తూ ఉంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=9&Padyam=51

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, November 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౩(673)

( హరిముని సంభాషణ ) 

11-48-వ.
ఇట్లు సర్వసంగపరిత్యక్తుండై, నిఖిలాంతరాత్ముండై, పరమేశ్వరు డరుణగభస్తి కిరణ సహస్రంబుల లోకత్రయంబుం బావనంబు సేయు చందంబునం దన చరణారవింద రజఃపుంజంబు చేతం బవిత్రంబు సేయుచు, సురాసురజేగీయమానసేవ్యం బైన జనార్దన పాదారవిందంబులకు వందనాభిలాషుఁడై, భక్తియు లవమాత్రంబునుం జలింపనీక సుధాకరోదయంబున దివాకరజనితతాపనివారణం బయిన భంగి నారాయణాంఘ్రినఖమణిచంద్రికా నిరస్త హృదయతాపుండై, యాత్మీయభక్తిరశనానుబంధబంధురంబైన వాసుదేవ చరణసరోరుహ ధ్యానానందపరవశుం డగు నతండు భాగవతప్రధానుం” డని యెఱింగించిన విని విదేహుం డిట్లనియె.

భావము:
భాగవతోత్తముడు ఈ విధంగా సకల బంధాలను త్రెంపుకుని అన్నింటిలో పరమాత్మను గుర్తించినవాడై మెలగుతాడు. మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర కిరణాలచేత మల్లోకాలనూ పావనం చేయునట్లు, తన పాదధూళి చేత జగత్రయాన్నీ పవిత్రం చేస్తూ ఉంటాడు. దేవదానవులకు కూడా సేవింపదగిన జనార్ధునుని చరణారవిందాలకు నమస్కరించా లనే అభిలాష కలిగి ఉంటాడు. తన భక్తిని రవ్వంత కూడ చలించనీయక చంద్రుడు ఉదయించడంతో ఎండ బాధ పోయినట్లు నారాయణుని చరణకాంతుల వెన్నెలలచే భాగవతుడు హృదయతాపం పోగొట్టుకుంటాడు. ఉత్తమ భాగవతుడు తన భక్తి అనే బంధాలతో వాసుదేవుని చరణపద్మాలకు బంధించుకుని ధ్యానానందంలో పరవశిస్తూ ఉంటాడు.” ఈ విధంగా మహాముని తెలుపగా రాజు విదేహుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=8&Padyam=48

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, November 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౨(672)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-45-వ.
అనిన విదేహభూపాలుడు “భాగవతధర్మం బెద్ది? యే ప్రకారంబునం బ్రవర్తించు? వారల చిహ్నంబు లెవ్వి? యంతయు నెఱింగింప నీవ యర్హుండ” వనిన నందు హరి యను మహాత్ముం డిట్లనియ.
11-46-తే.
"సర్వభూతమయుండైన సరసిజాక్షుఁ
డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు,
శంఖచక్రధరుం డంచుఁ జనెడువాఁడు,
భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు.
11-47-క.
వర్ణాశ్రమధర్మంబుల
నిర్ణయకర్మములఁ జెడక నిఖిలజగత్సం
పూర్ణుఁడు హరి యను నాతఁడె
వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా!

భావము:
అని మహాముని కవి చెప్పాడు. అంత, విదేహ రాజు ఇలా అడిగాడు. “భాగవతధర్మ మేది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తు లేమిటి? ఇవి చెప్పటానికి మీరే తగినవారు.” దానికి వారిలో హరి అనే మహాముని ఇలా చెప్పసాగాడు:
“భాగవతుడు అంటే ఆ హరి యందు భక్తీ ఆసక్తీ కలవాడు; సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలవాడు. ఓ మహా రాజా విదేహ! భాగవంతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా, భక్తిమార్గాన్ని ఆశ్రయించి, శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=8&Padyam=47

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, November 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౧(671)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-44-సీ.
సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు-
  వీనుల కింపుగ వినఁగవలయు,
హర్షంబుతోడుత హరినామకథనంబు-
  పాటలఁ నాటలఁ బరఁగవలయు,
నారాయణుని దివ్యనామాక్షరంబులు-
  హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ,
గంజాక్షులీలలు కాంతారముల నైన-
  భక్తి యుక్తంబుగాఁ బాడవలయు,
11-44.1-తే.
వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని
నొడువుచును లోకబాహ్యత నొందవలయు,
నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు,
భేద మొనరింప వలవదు మేదినీశ!"

భావము:
ఓ రాజా! సదా శ్రీకృష్ణ సంకీర్తనలు వీనులవిందుగా వినాలి; హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి; నారాయణుని దివ్యమైన నామాలను హృదయంలో సదా స్మరిస్తూ ఉండాలి; కమలనయనుని లీలలను అడవులలో చరిస్తున్నా భక్తియుక్తంగా పాడాలి; విశ్వమయుడిని వెఱ్ఱిగా కీర్తిస్తూ లోకానికి అంటీ అంటకుండా ఉండాలి; ఈ సృష్టి మొత్తం విష్ణుమయ మని తెలుసుకోవాలి; భేదబుద్ధి ఏ మాత్రమూ చూపరాదు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=7&Padyam=44

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, November 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౦(670)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-42-క.
కరణత్రయంబు చేతను
నరుఁడే కర్మంబు సేయు నయ్యైవేళన్‌
హరి కర్పణ మని పలుకుట
పరువడి సుజ్ఞాన మండ్రు పరమమునీంద్రుల్‌.
11-43-వ.
జ్ఞానాజ్ఞానంబు లందు సంకలితుండైన స్మృతి విపర్యయంబు నొందు; నట్లుగావున గురుదేవతాత్మకుం డయి, బుద్ధిమంతుండైన మర్త్యుండు శ్రీ వల్లభు నుత్తమోత్తమునిఁగాఁ జిత్తంబునఁ జేర్చి సేవింపవలయు; స్వప్న మనోరథేచ్ఛాద్యవస్థలయందు సర్వసంకల్పనాశం బగుటంజేసి, వానిఁ గుదియం బట్టి నిరంతర హరిధ్యానపరుం డైనవానికిఁ గైవల్యంబు సులభముగఁ గరతలామలకంబై యుండు.

భావము:
త్రికరణశుద్ధిగా అనగా మనసుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతీ కర్మా “కృష్ణార్పణం” అని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానము అని మహామునీశ్వరులు అంటారు. జ్ఞాన, అజ్ఞానాలలో కలత చెందుతుంటే స్మృతి వ్యత్యస్తమవుతుంది. కాబట్టి, గురువునకు దేవుడికి అనుగుణంగా నడచే బుద్ధిమంతుడైన నరుడు లక్ష్మీపతి ఐన విష్ణుమూర్తిని ఉత్తమోత్తముడైన పురుషోత్తముడిగా చిత్తంలో చేర్చి సేవించాలి. కలల యందు, కోరికల యందు, వాంఛల యందు సర్వసంకల్పాలు నాశనం అవుతాయి. కనుక, ఎట్టి పూనిక గట్టిగా నిలుబడదు. అందుచేత, వాటిని అణచుకుని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండే వాడికి కైవల్యం చేతిలో ఉసిరికాయలాగ సులభంగా ప్రాప్తిస్తుంది

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=7&Padyam=43

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, November 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౯(669)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-41-వ.
మఱియు సకలజంతుసంతానంబుకంటె మానుషాకారంబు నొందుట దుర్లభం; బంతకంటె నారాయణచరణయుగళస్మరణ పరాయణులగుట దుష్కరంబు; గావున నాత్యంతికంబగు క్షేమంబడుగ వలసెఁ; బరమేశ్వరుండు ప్రపత్తినిష్ఠులకు సారూప్యం బెట్లొసంగు నత్తెఱం గానతిం” డనిన విని విదేహభూపాలునకు హరికథామృత పానాతిపరవశులైన మునిసమాజంబునందుఁ గవి యను మహానుభావుం డిట్లని చెప్పం దొడంగె; “నరిషడ్వర్గంబునందు నీషణత్రయంబుచేతం దగులువడి మాత్సర్యయుక్త చిత్తుం డగు నట్టి వానికెవ్విధంబున నచ్యుత పాదారవింద భజనంబు సంభవించు? విశ్వంబును నాత్మయు వేఱుగా భావించు వానికి భీరుత్వం బెట్లు లే? దవిద్యాంధకారమగ్నులకు హరిచింతనంబెట్లు సిద్ధించు? నట్టి నరుండు తొంటికళేబరంబు విడిచి పరతత్త్వం బెబ్భంగిం జేరు? ముకుళీకృతనేత్రుండయిన నరుండు మార్గభ్రమణంబునఁ దొట్రుపాటువడి చను చందంబున విజ్ఞానవిమలహృదయభక్తిభావనా వశంబు లేకున్నఁ బరమపదంబు వీరికెవ్విధంబునం గలుగు? నని యడిగితివి; గావునఁ జెప్పెద; సావధానుండవై యాకర్ణింపుము.

భావము:
అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటె మానవ జన్మ శ్రేష్ఠమైనది, అది ప్రాప్తించటం కష్ట సాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన, శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగ వలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి.” అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు ఐన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.
“(1) అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోను; ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ; చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?
(2) విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?
(3) అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది?
(4) అటువంటి నరుడు మొదటి శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు?
(5) కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా, విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది” అని అడిగావు. సమాధానాలు చెప్తాను శ్రద్ధగా విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=7&Padyam=41

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, October 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౮(668)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-38-తే.
అర్ఘ్యపాద్యాదివిధులను నర్థితోడఁ
బూజ గావించి, వారలఁ బొలుపు మిగుల
నుచితపీఠంబులందును నునిచి, యెలమి
నవమునిశ్రేష్ఠులను భూమినాయకుండు.
11-39-క.
వారల కిట్లను "మీరలు
గారవమున విష్ణుమూర్తిఁ గైకొనిన మహా
భూరితపోధనవర్యులు
సారవిహీనంబు లైన సంసారములన్‌.
11-40-క.
ఏ రీతి గడప నేర్తురు?
క్రూరులు బహుదుఃఖరోగకుత్సిత బుద్ధుల్‌
నీరసులు నరులు గావున
నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే?

భావము:
అర్ఘ్యం పాద్యం మొదలైన శాస్త్రవిధులతో ప్ఱ్ఱార్థనా పూర్వకంగా పూజించి ఆ విదేహ మహారాజు ఆ తొమ్మిది మంది మునివరులను సముచిత పీఠాలపై కూర్చుండ బెట్టాడు. అలా ఆసీనులైనవారితో విదేహరాజు ఇలా అన్నాడు. “మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు. ఈ సంసారాలు పరమ సారం లేనివి. క్రూరులు; అనేక రకాల దుఃఖాలు, రోగాలు, అల్ప బుద్ధులు కలవారు; నీరసులు అయిన మానవులకు ఈ సారహీనమైన సంసారాలను దాటటానికి ఏదైనా మార్గం ఏదో సుఙ్ఞాన పూరకమైన మీ బుద్ధి కుశలతతో చెప్పండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=40

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, October 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౭(667)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-36-క.
జగదేకనాథు గుణములు
మిగులఁగ సంస్మరణతోడ మీఱిన భక్తిం
బగలును రాత్రియు సంధ్యలుఁ
దగిలి జితేంద్రియులు నైన తపసులు ధాత్రిన్‌.
11-37-క.
ఊహింపఁ బుణ్యుఁ డైన వి
దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో
గేహము వెడలి యెదుర్కొని
మోహవివర్జితులఁ బుణ్యమునిసంఘములన్‌.

భావము:
ఆ కవి మున్నగు ఆ తొమ్మండుగురు తపస్వులు సకల లోకాలకు ప్రభువైన శ్రీహరి గుణగణాలను మిక్కిలి తలచుకుంటూ, అతిశయించిన భక్తితో పగలు రాత్రీ ఉభయ సంధ్యలు అని లేకుండా సకల వేళలా సర్వదా ఆ భగవంతుని యందే ఆసక్తి కలవారై జితేంద్రియులైన వారు. భూలోకంలో పుణ్యాత్ముడైన విదేహుడు చేస్తున్న యజ్ఞం ముగింపుకు వచ్చిన సమయానకి అక్కడకి ఆ మహా తాపసులు విచ్చేశారు. విదేహరాజు గృహం లోపలి నుంచి వచ్చి మోహవిసర్జించిన ఆ పుణ్య మునీశ్వరులకు ఎదురువెళ్ళి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=37

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, October 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౬(666)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-35-వ.
ఆ యాగ్నీధ్రునకు నాభి యను ప్రాజ్ఞుం డగు తనూభవుం డుదయించి బలిచక్రవర్తితో మైత్రింజేసి ధారుణీభారంబు పూని యాజ్ఞా పరిపాలనంబున నహితరాజన్య రాజ్యంబులు స్వవశంబులు గావించుకొని యుండె; నంతట నాభికి సత్పుత్రుం డయిన ఋషభుండు పుట్టె; నతండు హరిదాసుండై సుతశతకంబుఁ బడసె; నందగ్రజుండయిన భరతుం డను మహానుభావుఁడు నారాయణపరాయణుండై యిహలోకసుఖంబులం బరిహరించి, ఘోరతపం బాచరించి జన్మ త్రితయంబున నిర్వాణసుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుం డై వాసుదేవపదంబు నొందె; నాతని పేర నతం డేలిన భూఖండంబు భారతవర్షం బను వ్యవహారంబున నెగడి జగంబులఁ బ్రసిద్ధం బయ్యె; మఱియు నందుఁ దొమ్మండ్రు కుమారులు బల పరాక్రమ ప్రభావ రూప సంపన్నులయి నవఖండంబులకు నధిష్ఠాతలైరి; వెండియు వారలలో నెనుబది యొక్కండ్రు కుమారులు నిత్య కర్మానుష్ఠాన పరతంత్రులై విప్రత్వం బంగీకరించి; రందుఁ గొందఱు శేషించిన వారులు కవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమిళ చమస కరభాజను లనం బరఁగు తొమ్మం డ్రూర్ధ్వరేతస్కు లయి బ్రహ్మవిద్యావిశారదు లగుచు, జగత్త్రయంబును బరమాత్మ స్వరూపంబుగాఁ దెలియుచు ముక్తులై యవ్యాహతగమను లగుచు, సుర సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కిన్నర కింపురుష నాగలోకంబు లందు స్వేచ్ఛావిహారంబు సేయుచు నొక్కనాఁడు.

భావము:
ఆ అగ్నీధ్రుడికి నాభి అనే కుమారుడు జన్మించాడు ప్రాజ్ఞుడైన అతడు బలిచక్రవర్తితో స్నేహంచేసి భూభారాన్ని వహించి ప్రజలను పాలించాడు. తన ఆజ్ఞాపాలన చేయ అంగీకరించని సకల శత్రురాజుల రాజ్యాలను తన వశం చేసుకున్నాడు. ఆ నాభికి సత్పుత్రుడైన ఋషభుడు పుట్టాడు హరిభక్తుడైన ఋషభుడు వందమంది కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడు భరతుడు అనే మహానుభావుడు. అతడు నారాయణభక్తుడై ఈ లోకపు సుఖాలను వదలి భయంకరమైన తపస్సుచేసి మూడు జన్మలలో సకలబంధాల నుండి విముక్తిచెంది నిర్వాణ సుఖపారవశ్యంతో పరమపదాన్ని అందుకోగలిగాడు. భరతుడు పాలించిన భూఖండానికి “భరతవర్షము” అనే పేరు జగత్ప్రసిద్ధంగా వచ్చింది. ఋషభుని వందమందిలో తొమ్మిదిమంది కుమారులు బలం పరాక్రమం ప్రభావం రూపసంపద కలిగినవారై తొమ్మిది భూఖండాలకు ఏలికలయ్యారు. ఇంకా వారిలో ఎనభైఒక్కమంది కుమారులు నిత్యకర్మలలోను అనుష్ఠానములలోను ఆసక్తికలవారై బ్రాహ్మణత్వాన్ని గ్రహించారు. మిగిలినవారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రమీళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లు కలగిన తొమ్మిదిమంది ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మవిద్యా విశారదులై మూడులోకాలు పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ముక్తులై అడ్డులేని గమనాలతో సురల, సిద్ధుల, యక్షుల, గంధర్వుల, కిన్నరుల, కింపురుషుల, నాగుల యొక్క లోకములందు తమ ఇచ్చానుసారంగా విహరింప సాగారు. అలా విహరిస్తూ ఒకనాడు...

1. హరి, 2. కవి, 3. అంతరిక్షుడు, 4. ప్రబుద్ధుడు, 5. పిప్పలాహ్వయుడు, 6. అవిర్హోత్రుడు, 7. ద్రమిళుడు, 8. చమనుడు, 9. కరభాజనుడు యను వీరు వృషభరాజు నూఱుగురి కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=35

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౬౫(665)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-33-వ.
అట్లు గావున పరమేశ్వరభక్తిజనకంబై కైవల్యపదప్రాప్తికరంబయి యొప్పుచున్న విదేహర్షభసంవాదంబు నాఁ బరగు నొక్క పురాతన పుణ్యకథావిశేషం బెఱింగించెద సావధాన మనస్కుండవై యాకర్ణింపు” మని యిట్లనియె
11-34-తే.
"వినుము; స్వాయంభువుండను మనువునకును
రమణ నుదయించె నఁట ప్రియవ్రతుఁ డనంగఁ
దనయు; డాతని కాగ్నీధ్రుఁ డనఁగ సుతుఁడు
జాతుఁ డయ్యెను భువనవిఖ్యాతుఁ డగుచు.

భావము:
అందుకని పరమేశ్వరుని మీద భక్తిని కలిగించేది మోక్షాన్ని అందించేది అయిన విదేహఋషభ సంవాదము అనే ప్రసిద్ధమైన ఒక పురాతన పుణ్యకథను చెప్తాను ఏకాగ్ర చిత్తంతో విను." అని ఇలా చెప్పసాగాడు. “శ్రద్ధగా విను. స్వాయంభువుడనే మనువుకు ప్రియవ్రతుడనే కుమారుడు ఉదయించాడు. అతనికి అగ్నీధ్రుడనే కొడుకు పుట్టి, లోకప్రసిద్ధుడు అయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=34

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, October 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౪(664)

( వాసుదేవ ప్రశ్నంబు ) 

11-31-క.
"నను నీవు సేయు ప్రశ్నము
జనసన్నుత! వేదశాస్త్రసారాంశంబై
ఘనమగు హరిగుణకథనము
విను" మని, వినిపింపఁ దొడఁగె వేడ్క దలిర్పన్‌.
11-32-క.
"అతిపాపకర్ములైనను
సతతము నారాయణాఖ్యశబ్దము మదిలో
వితతంబుగఁ బఠియించిన
చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?

భావము:
“సచ్చరిత్ర! నీవు వేసిన ప్రశ్న వేదశాస్త్రముల సారాంశమైనది. ఘనమైన ఆ శ్రీహరి గుణకథనాలను వినవలసింది.” అని వేడుక చిగురించగా వినిపించడం మొదలు పెట్టాడు. ఎంతటి పాపంచేసిన వారైనా సరే నారాయణుని నామాన్ని విడువక నిత్యం మనస్సులో స్మరించేవాళ్ళు పరమ ధన్యులు. అట్టి వారిని పొగడుట బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=32

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౬౩(663)

( కృష్ణ సందర్శనంబు ) 

11-30-వ.
అట్లు దేవముని కృష్ణసందర్శనార్థం బరుగుదెంచి తద్గృహాభ్యంతరమున కరిగిన, వసుదేవుం డమ్మునీంద్రుని నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, కనకాసనాసీనుం గావించి, యుచిత కథావినోదంబులం బ్రొద్దుపుచ్చుచు నిట్లనియె; “యే నరుండు నారాయణచరణసరసీరుహ భజనపరాయణత్వంబు నిరంతరంబు నొందం; డట్టివానికి మృత్యువు సన్నిహితంబై యుండు; నీ దర్శనంబునం గృతార్థుండ నైతి; నచ్యుతానంత గోవింద నామస్మరణైకాగ్రచిత్తులైన మీవంటి పుణ్యపురుషుల సమాగమంబున లోకులు సుఖాశ్రయులయి యుండుదురు; దేవతాభజనంబు సేయువారిని గీర్వాణులు ననుగ్రహింతు; రట్లు సజ్జనులును దీనవత్సలులు నగు వారలు పూజనాది క్రియలచే నా దేవతలను భక్తి సేయుదురు; కావున శ్రీ మహా భాగవత కథాసమూహంబులఁ గల ధర్మంబు లడిగెద; నేయే ధర్మంబులు శ్రవణ సుఖంబులుగా వినిన దండధరకింకర తాడనంబులం బడక, ముకుందచరణారవింద వందనాభిలాషులయి పరమపదప్రాప్తు లగుదు; రా ధర్మంబు లానతిమ్ము; తొల్లి గోవిందునిం బుత్రుఁగాఁ గోరి ముక్తిమార్గం బెఱుంగలేక దేవతామాయం జేసి చిక్కి చిత్తవ్యసనాంధకారం బగు సంసారంబునం దగులువడి యున్నవాఁడ; హరికథామృతంబు వెల్లిగొల్పు; మట్లయిన సుఖంబు గలుగు" ననిన వసుదేవ కృతప్రశ్నుండైన నారదుండు వాసుదేవ కథా ప్రసంగ సల్లాపహర్ష సమేతుండై సంతసంబంద నిట్లనియె.

భావము:
అలా శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చిన దేవమునీంద్రుని వసుదేవుడు ఆర్ఘ్యం పాద్యం ఆదులతో యథావిథిగా పూజించి, బంగారపు ఆసనం మీద కూర్చుండపెట్టి సముచిత కథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఇలా అన్నాడు. “మునీంద్రా! నిరంతరం నారాయణ పాదపద్మాలను భజించని వానికి చావు సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనంవలన కృతార్ధుడనైనాను. అచ్యుత, అనంత ఆది గోవిందనామాలను నిత్యం స్మరించే ఏకాగ్ర చిత్తం గల మీవంటి సుకృతాత్ములను కలియుట వలన లోకులు సుఖాశ్రయులై ఉంటారు. దేవతలను భజించే వారిని వేల్పులు అనుగ్రహిస్తారు. అటువంటి సజ్జనులు దీనవత్సలలు పూజలు మున్నగు సత్కార్యాలతో దేవతల యందు భక్తి చూపిస్తూ ఉంటారు. కనుక, శ్రీ మహా భాగవతం అందలి కథలలో ఉన్న ధర్మాలను అడుగుతాను.
వీనులవిందుగా వింటే, యమభటులచేత దెబ్బలు తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలిగి, పరమపదాన్ని పొందగల ధర్మాలను ఆనతీయండి. పూర్వము గోవిందుడిని కుమారునిగా కోరినప్పటికి మోక్షమార్గం తెలియలేక దైవమాయలో చిక్కి వ్యసనాల చీకటితో నిండిన సంసారంలో చిక్కుకుని ఉన్నాను. హరికథాసుధారసాన్ని ప్రవహింప చేయండి. అలా అయితే నాకు సుఖం కలుగుతుంది.” అని వసుదేవుడు ప్రార్థించగా నారదుడు వాసుదేవుని కథల ప్రస్తావన వచ్చినందుకు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=30

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, October 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౨(662)

( కృష్ణ సందర్శనంబు ) 

11-28-వ.
అని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె.
11-29-క.
"వినుము నృపాలక! సెప్పెద
ఘనమై విలసిల్లు పూర్వకథ గల దదియున్‌
మును ద్వారక కేతెంచియు
నొనరఁగ నారదుఁడు గృష్ణు నొయ్యనఁ గాంచెన్‌.

భావము:
ఇలా అడిగిన మహారాజుతో శుకమహర్షి ఈ విధంగా అన్నాడు. “ఓ మహారాజా! శ్రద్ధగా వినవయ్యా! దీనికి ఒక గొప్ప పూర్వగాథ ఉన్నది. ఒకప్పుడు నారదుడు ద్వారకకు వచ్చి ముకుందుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=29

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, October 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౧(661)

( కృష్ణ సందర్శనంబు ) 

11-27-క.
"చిత్తం బే క్రియ నిలుచుం?
జిత్తజగురు పాదపద్మ సేవ సదా య
త్యుత్తమ మని వసుదేవుఁడు
చిత్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా! "

భావము:
“మునీంద్రా! మనసు ఏ విధంగా నిశ్చలంగా నిలబడుతుంది? మన్మథుడి జనకుడైన శ్రీమహావిష్ణువు చరణకమలములను సేవించటం మిక్కిలి ఉత్తమమైనదని నమ్మి వసుదేవుడు ఏవిధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=27

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, October 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౦(660)

( కృష్ణ సందర్శనంబు ) 

11-26-వ.
అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన, నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె.

భావము:
అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు.” ఇలా పలికి వాసుదేవుడు వాళ్ళను ఇలా ఆఙ్ఞాపించాడు. “సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవూ వెడల్పూ గల పెద్దబండ మీద మీ భుజబలాలు వాడి, ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి.” అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడిచేసి సముద్రంలో కలిపి. మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక, అరగదీయుట ఆపి, సముద్రంలో పడవేశారు. దానిని ఒకచేప మ్రింగింది దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం చివర ములికిగా మలచుకున్నాడు.” అని ఆ కథా విషయం అంతా చెప్పిన శుకమహర్షిని పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=26

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, October 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౯(659)

( కృష్ణ సందర్శనంబు ) 

11-24-క.
"మది సెడి కన్నులుగానక
మదయుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
గదిసి కులక్షయకారణ
విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?
11-25-క.
ధరణీసురశాపమునకు
హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే?
నరు లనఁగ నెంత వారలు
గర మరుదుగఁ బూర్వజన్మకర్మముఁ ద్రోవన్‌?

భావము:
“మీ బుద్ధిచెడి పోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెఱ్ఱివాళ్ళు ఎవరైనాఉంటారా. అనుభవించండి. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటి వారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించుటం ఎవరికి సాధ్యం కాదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=25

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, October 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౮(658)

( కృష్ణ సందర్శనంబు ) 

11-23-వ.
మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె.

భావము:
గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవబాలురు మునుల శాపం విని భయపడి వడ వడ వణుకుతూ సాంబుడి పొట్టచుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేల మీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడ, ఏమి తెలియనివాడిలా వాళ్ళతో వాసుదేవుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=23

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, October 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౭(657)

( కృష్ణ సందర్శనంబు ) 

11-21-క.
యదుడింభకులను గనుఁగొని
మదయుతులై వచ్చి రనుచు మదిలో రోషం
బొదవఁ గనుఁగొనల నిప్పులు
సెదరఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్‌.
11-22-క.
"వాలాయము యదుకుల ని
ర్మూలకరం బైన యట్టి ముసలం బొక టీ
బాలిక కుదయించును బొం
డాలస్యము లే ద"టంచు నటఁబల్కుటయున్‌.

భావము:
యాదవబాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా “ఇలా హాస్యాలు చేయొచ్చా?” అని అంటూ “యదువంశాన్ని నాశనం చేసే రోకలి (ముసలం) ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది ఆలస్యం కాదు. ఇక పొండి.” అని పలికారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=22

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :