Tuesday, June 30, 2020

ఉషా పరిణయం - 33


( బాణాసురునితో యుద్ధంబు )

10.2-396-సీ.
బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖ యదు;
వృష్ణి భోజాంధక వీరవరులు
దుర్వార పరిపంథి గర్వ భేదన కళా;
చతురబాహాబలోత్సాహలీల
వారణ స్యందన వాజి సందోహంబు;
సవరణ సేయించి సంభ్రమమున
సముచిత ప్రస్థాన చటుల భేరీ భూరి;
ఘోష మంభోనిధి ఘోష మఁడఁప
10.2-396.1-తే.
ద్వాదశాక్షౌహిణీ బలోత్కరము లోలి
నడచెఁ గృష్ణునిరథము వెన్నంటి చెలఁగి
పృథులగతి మున్ భగీరథు రథము వెనుక
ననుగమించు వియన్నది ననుకరించి.
10.2-397-వ.
ఇవ్విధంబునం గదలి కతిపయప్రయాణంబుల శోణపురంబు సేరంజని వేలాలంఘనంబు సేసి యదువీరు లంత.

భావము:
బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ వీరులు, మదోన్మత్తులయిన శత్రువీరులను అణచివేయాలనే అఖండ బలోత్సాహాలతో చతురంగ బలాలను సమకూర్చుకుని యుద్ధభేరి మ్రోగించారు. ఆ భేరీల ధ్వని సముద్రఘోషను మించిపోయింది శ్రీకృష్ణుని రథం వెంట బయలుదేరిన పన్నెండు అక్షౌహిణుల సైన్యం భగీరథుడి వెంట బయలుదేరిన ఆకాశగంగా ప్రవాహంలా తోచింది. ఈ విధంగా పయనమైన యదువీరులు కొన్నాళ్ళకు శోణపురం చేరి, పొలిమేర దాటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=396

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 32

( బాణాసురునితో యుద్ధంబు )

10.2-394-సీ.
హార కిరీట కేయూర కంకణ కట;
కాంగుళీయక నూపురాది వివిధ
భూషణప్రతతిచేఁ బొలుపారు కరముల;
ఘనగదా శంఖ చక్రములు దనర
సురభి చందన లిప్త సురుచి రోరస్థ్సలిఁ;
బ్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడఁ
జెలువారు పీత కౌశేయచేలము కాసె;
వలనుగా రింగులువాఱఁ గట్టి
10.2-394.1-తే.
శైబ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహ
కములఁ బూన్చిన తే రాయితముగఁ జేసి
దారుకుఁడు దేర నెక్కె మోదం బెలర్ప
భానుఁ డుదయాచలం బెక్కు పగిది మెఱసి.
10.2-395-వ.
ఇట్లు రథారోహణంబు సేసి, భూసురాశీర్వచన పూతుండును, మహితదుర్వాంకు రాలంకృతుండును, లలితపుణ్యాంగనా కరకిసలయకలిత శుభాక్షత విన్యాస భాసురమస్తకుండును, మాగధ మంజుల గానానుమోదితుండును, వందిజనసంకీర్తనా నందితుండును, బాఠక పఠనరవ వికాసిత హృదయుండును నయి వెడలు నవసరంబున.

భావము:
శ్రీకృష్ణుడు హారములు, కిరీటము, దండకడియములు, కంకణములు, అంగుళీయకములు, కాలి అందెలు మున్నగు సకల ఆభరణాలను ధరించాడు; శంఖచక్రగదాది ఆయుధాలను ధరించాడు; చందనం అలదిన వక్షస్థలంమీద కౌస్తుభరత్న కాంతులు ప్రసరిస్తూ ఉండగా, పీతాంబరాన్ని రింగులు వారగట్టాడు; శైబ్యము, సుగ్రీవము, మేఘ పుష్పకము, వలాహకము అనే నాలుగు గుఱ్ఱాలను కట్టిన రథాన్ని సిద్ధం చేసి దారుకుడు తీసుకుని వచ్చాడు; సూర్యుడు ఉదయ పర్వతాన్ని ఆరోహించినట్లు, శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించాడు. అలా రథాన్ని ఎక్కిన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణుల ఆశీర్వచనాలు పొందాడు; పుణ్యాంగనలు తలమీద శుభాక్షతలు చల్లారు; వందిమాగధులు కైవారాలు చేసారు; స్తోత్ర పాఠకులు స్తుతించారు ఈవిధంగా ముకుందుడు ఆనందంగా ముందుకు సాగాడు; అప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=395

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 


Sunday, June 28, 2020

ఉషా పరిణయం - 31


( బాణాసురునితో యుద్ధంబు )

10.2-391-వ.
అయ్యవసరంబున.
10.2-392-క.
శారద నిర్మల నీరద
పారద రుచి దేహుఁ డతుల భాగ్యోదయుఁ డా
నారదముని యేతెంచె న
పార దయామతి మురారిభజనప్రీతిన్.
10.2-393-వ.
ఇట్లు సనుదెంచిన యద్దివ్యమునికి నిర్మల మణివినిర్మిత సుధర్మాభ్యంతరంబున యదువృష్టిభోజాంధక వీరులు గొలువం గొలువున్న గమలలోచనుండు ప్రత్యుత్థానంబు చేసి, యర్ఘ్యపాద్యాది విధులం బూజించి, సముచిత కనకాసనాసీనుంజేసిన నత్తాపసోత్తముండు పురుషోత్తము నుదాత్తతేజోనిధిం బొగడి, యనిరుద్ధు వృత్తాంతం బంతయుఁ దేటపడ నెఱింగించి, యప్పుండరీకాక్షుని చేత నామంత్రణంబు వడసి, యంతర్ధానంబు నొందెఁ; దదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణభేరి వ్రేయించి, బలంబుల వెడలింప బ్రద్దలవారిం బనిచి; తానును గట్టాయితంబయ్యె; నంత.

భావము:
అలా అనిరుద్ధుని జాడకై యాదవులు ఎదురుచూస్తున్న ఆ సమయంలో శరత్కాల మేఘంవంటి దేహంతో కూడిన మహానుభావుడు నారదమునీంద్రుడు, అపార దయాసముద్రుడు శ్రీకృష్ణుడిని పూజించే కుతూహలంతో ద్వారకకు విచ్చేసాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన మణులతో విశేషంగా నిర్మింపబడిన ఆ దివ్య సుధర్మసభ యందు యదు వృష్టి భోజాంధక వీరులతో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు విచ్చేసిన నారదమునీంద్రునకు శ్రీకృష్ణుడు వెంటనే లేచి ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులతో పూజించి బంగారు ఆసనంపై ఆసీనుడిని చేసాడు. పిమ్మట నారదమునీంద్రుడు పురుషోత్తముడిని స్తుతించి అనిరుద్ధుడి వృత్తాంతం అంతా వివరించాడు. అనంతరం పుండరీకాక్షుని చెంత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఒక శుభముహుర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయడానికి ప్రయాణభేరి వేయించాడు. సైన్యాన్ని సిద్ధం చేయించి, తాను చతురంగబలాలతో యుద్ధరంగానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=393

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 30

( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు )

10.2-387-క.
నీలపటాంచితమై సువి
శాలంబై వాయునిహతిఁ జండధ్వని నా
భీలమగు నతని కేతన
మాలోన నకారణంబ యవనిం గూలెన్.
10.2-388-క.
అది చూచి దనుజపాలుఁడు
మదనాంతకుఁ డాడినట్టి మాట నిజముగాఁ
గదనంబు గలుగు ననుచును
నెదురెదురే చూచుచుండె నెంతయుఁ బ్రీతిన్.
10.2-389-వ.
అంత నక్కడ.
10.2-390-క.
ద్వారకలో ననిరుద్ధకు
మారుని పోకకును యదుసమాజము వగలం
గూరుచు నొకవార్తయు విన
నేరక చింతింప నాల్గునెల లరిగె నృపా!

భావము:
ఆ సమయంలో, ఏ కారణం లేకుండానే బలంగా వీచిన గాలిదెబ్బకే నీలవస్త్రంతో సువిశాల మైన బాణాసురుని జెండా భయంకర ధ్వని చేస్తూ నేలకూలింది. అలా పడిన తన జెండాకొయ్యను చూసిన ఆ దానవరాజు సంతోషపడి, “ఆ మన్మథహారి మహేశ్వరుడు పలికిన మాటలు నిజమయ్యే సమయం వచ్చింది; ఇక తనకు తగిన వాడితో పోరు దొరుకుతుం” దని భావించి ఎంతో ఆశక్తితో ఎదురుచూడసాగాడు. ఆ సమయంలో అక్కడ ద్వారకలో అనిరుద్ధుడు మాయమైనందుకు యాదవులు అంతా విచారించారు. వారికి నాలుగు నెలల గడచినా అనిరుద్ధుడిని గురించి ఏ వార్తే తెలియ లేదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=35&padyam=390

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, June 27, 2020

ఉషా పరిణయం - 29


( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు )

10.2-384-వ.
ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబునొంది వెఱచియుం, బఱచియు, విచ్చియుం, జచ్చియుఁ, గలంగియు, నలంగియు, విఱిగియు, సురిఁగియుఁ, జెదరియు బెదరియుఁ, జేవదఱిఁగి నుఱుములై తన మఱుఁగు సొచ్చిన, బాణుండు శౌర్యధురీణుండును, గోపోద్దీపిత మానసుండునై కదిసి యేసియు, వ్రేసియుఁ, బొడిచియు, నడిచియుఁ, బెనంగి
10.2-385-క.
క్రుద్ధుండై యహిపాశ ని
బద్ధుం గావించె నసురపాలుఁడు రణ స
న్నద్ధున్, శరవిద్ధు, న్నని
రుద్ధున్, మహితప్రబుద్ధు, రూపసమృద్ధున్.
10.2-386-వ.
ఇట్లు కట్టిత్రోచిన నుషాసతి శోకవ్యాకులితచిత్తయై యుండె నంత.

భావము:
ఈ విధంగా దానవసైన్యం చేవచచ్చి, నొచ్చి, విచ్చి, భయంతో, చెదరి బెదరి, పారిపోయి వచ్చి బాణాసురుని అండకై వెనుక చేరింది. పరమ పరాక్రమశాలి అయిన బాణాసురుడు శౌర్యక్రోధాలతో అనిరుద్ధుని ఎదిరించి భీకర యుద్ధం చేసాడు. ఈ విధంగా బాణాసురుడు కోపంతో విజృంభించి, వంటినిండా నాటిన బాణాలతో ఉన్న రూపసమృద్ధుడూ, రణసన్నద్ధుడూ, బుద్ధిమంతుడు అయిన అనిరుద్ధుడిని నాగపాశంతో బంధించాడు.
తన ప్రియుడైన అనిరుద్ధుడిని తన తండ్రి ఈవిధంగా బంధించటం చూసిన ఉషాకాంత శోకసంతప్త హృదయరాలైంది. ఇంతలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=35&padyam=384

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 28

( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు )

10.2-382-చ.
కలిగి మహోగ్రవృత్తిఁ బరిఘంబు గరంబున లీలఁ దాల్చి దో
ర్బల ఘనవిక్రమప్రళయభైరవు భంగి విజృంభణక్రియా
కలన నెదిర్చె దానవ నికాయముతోఁ దలపాటుఁబోటునుం
జలముబలంబు దైర్యమునుశౌర్యము వ్రేటునువాటుఁజూపుచున్
10.2-383-చ.
పదములుబాహులుందలలు ప్రక్కలుచెక్కులుజానుయుగ్మముల్‌
రదములుగర్ణముల్‌ మెడలురంబులుమూఁపులువీఁపులూరువుల్‌
చిదురుపలై ధరం దొఱఁగఁ జిందఱవందఱ సేయ సైనికుల్‌
కదన పరాఙ్ముఖక్రమముఁ గైకొని పాఱిరి కాందిశీకులై.

భావము:
అప్పుడు ఆ అనిరుద్ధుడు అనివార్య శౌర్యసాహసాలతో ఇనుపకట్ల గుదియను చేపట్టి, ప్రళయకాల భైరవుడిలా మహోగ్రంగా విజృంభించి, మిక్కిలి పోరాట పటిమతో దానవసేనను ఎదిరించాడు. తన శక్తియుక్తులను శౌర్యధైర్యాలనూ ప్రదర్శించాడు. అనిరుద్ధుడి యుద్ధకౌశలానికి ఆ రాక్షససైనికుల పాదాలు, చేతులు, మోకాళ్ళు, తొడలు, మెడలు, వీపులు, మూపులు, తలలు, పండ్లు, చెవులు చిన్నచిన్న ముక్కలుగా నేలంతా చిందరవందరగా పడ్డాయి. ఆ వీరుడితో యుద్ధం చేయలేక దైత్యసైనికులు రణరంగం నుండి వెనుదిరిగి పారిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=35&padyam=383

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, June 25, 2020

ఉషా పరిణయం - 27


( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు )

10.2-380-సీ.
కనియె శుభోపేతుఁ, గందర్పసంజాతు;
మానితదేహు, నాజానుబాహు,
మకరకుండలకర్ణు, మహితప్రభాపూర్ణుఁ;
జిరయశోల్లాసుఁ, గౌశేయవాసుఁ,
గస్తూరికాలిప్తు, ఘనకాంతికుముదాప్తు;
హారశోభితవక్షు, నంబుజాక్షు,
యదువంశతిలకు, మత్తాలినీలాలకు;
నవపుష్పచాపుఁ, బూర్ణప్రతాపు,
10.2-380.1-తే.
నభినవాకారు, నక్షవిద్యావిహారు,
మహితగుణవృద్ధు, మన్మథమంత్రసిద్ధుఁ,
గలితపరిశుద్ధు, నఖిలలోకప్రసిద్ధుఁ,
జతురు, ననిరుద్ధు, నంగనాజననిరుద్ధు.
10.2-381-చ.
కని కన లగ్గలింప సురకంటకుఁ డుద్ధతి సద్భటావళిం
గనుఁగొని "యీనరాధమునిఁ గట్టుఁడు; పట్టుఁడు; కొట్టుఁ" డన్న వా
రనుపమ హేతిదీధితు లహర్పతి తేజము మాయఁజేయ డా
సిన నృపశేఖరుండు మదిఁ జేవయు లావును నేర్పు దర్పమున్.

భావము:
అక్కడ అంతఃపురంలో శుభకరుడు, మన్మథావతారుడు, చక్కటి రూపువాడు, ఆజానుబాహుడు, మకరకుండలాలతో నిండు తేజస్సుతో విరాజిల్లుచున్నవాడు, గొప్పయశోమూర్తి, పట్టుబట్టలు కస్తూరికాగంధము ధరించి చంద్రుడి వలె ప్రకాశిస్తున్న వాడు, వక్షస్థలమున ముత్యాల హారాలు ధరించిన వాడు, మదించిన తుమ్మెదల వలె నుదుట వాలిన నల్లని ముంగురులు గలవాడు, నవమన్మథ రూపుడు, నిండు పరాక్రమంతో విలసిల్లుతున్నవాడు, నననవాన్వితాకారుడు, సుగుణోపేతుడు, రతితంత్ర సిద్ధుడు, అమలినుడు, మానినుల వద్ద మసలుకొను మర్యాద తెలిసిన వాడు, బహు చతురుడు అని పేరుపొందిన వాడు, యాదవ వంశోత్తముడు అయిన అనిరుద్ధుడు విలాసంగా జూదము ఆడుతుండాగా ఆ రాక్షసరాజు చూసాడు. విపరీతమైన కోపంతో మండిపడుతూ ఆ దేవద్వేషి బాణుడు భటులతో “ఈ మానవాధముడిని బంధించండి! కొట్టండి!” అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసభటులు సూర్యకాంతిని ధిక్కరించే కాంతులతో శోభించే ఆయుధాలతో అనిరుద్ధుని బంధించడానికి వెళ్ళారు. ఆ రాజశేఖర కుమారకుడు తన చేవ, బల, దర్పములు చూపుతూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=35&padyam=380

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 26

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-378-తే.
ఇట్టిచోఁ గావలున్న మే మెవ్వరమును
నేమి కనుమాయయో కాని యెఱుఁగ మధిప!
నీ కుమారిక గర్భంబు నివ్వటిల్ల
యున్న” దన్నను విని రోషయుక్తుఁ డగుచు.
10.2-379-వ.
అట్టియెడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై, కటము లదర, బొమలుముడివడం, గనుంగవల ననలకణంబు లుప్పతిల్ల, సటలు వెఱికినం జటులగతి నెగయు సింగంబు విధంబున లంఘించుచు, భీకర కరవాలంబు గేలందాల్చి సముద్దండగతిం గన్యాసౌధాంతరంబునకుం జని.

భావము:
ప్రభూ! ఈ పరిస్థితిలో, అదేమి కనికట్టో ఏమిటో జాగ్రత్తగా కాపాలా కాస్తున్న మాకు ఎవరికి తెలియదు కాని. నీ కుమార్తె గర్భం ధరించింది” అని చెప్పగానే విని అసురేంద్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. రోషభీషణాకారుడైన ఆ బాణ రాక్షసేంద్రుడి చెక్కిళ్ళు అదిరాయి; కనుబొమలు ముడిపడ్డాయి; కళ్ళవెంట నిప్పులు రాలాయి; జూలుపట్టి లాగగా విజృంభించిన సింహంలాగ ముందుకు లంఘించి, భయంకరమైన కరవాలాన్ని ధరించి ఆగ్రహావేశాలతో అత్యంత వేగంగా అంతఃపురానికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=378

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, June 22, 2020

ఉషా పరిణయం - 25

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-375-క.
ఆ చిన్నె లంగజాలలు
సూచి భయాకులత నొంది స్రుక్కుచుఁ దమలో
"నో చెల్ల! యెట్టులో? యీ
రా చూలికిఁ జూలు నిలిచెరా! యిబ్భంగిన్.'
10.2-376-క.
అని గుజగుజ వోవుచు ని
ప్పని దప్పక దనుజలోక పాలునితోడన్
వినిపింపవలయు నని వే
చని బాణునిఁ జేరి మ్రొక్కి సద్వినయమునన్.
10.2-377-క.
మంతనమున "దేవర! క
న్యాంతఃపుర మేము గాచి యరయుచు నుండన్
వింతజనములకుఁ జొరఁగ దు
రంతము విను పోతుటీఁగకైన సురారీ!

భావము:
ఆ బాల గర్భచిహ్నాలను చూసి అంతఃపుర కంచుకలు భయపడ్డారు. (కాపలా సరిగా లేదని మహారాజు ఆగ్రహించవచ్చు కనుక.) “అయ్యబాబోయ్! మన రాకుమారి గర్భం ధరించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి” అనుకుంటూ లోలోపల మధనపడ్డారు. ఇలా గుసగుసలాడుకుని ఈ విషయం బాణాసురుడికి చెప్పక తప్పదు అని నిశ్చయించుకున్నారు. వెంటనే వెళ్ళి దానవేశ్వరుడితో వినయంగా ఈ విధంగా విన్నవించుకున్నారు. “ఓ ప్రభూ! దానవేంద్రా! కుమారి అంతఃపురాన్ని మేము జాగరూకతతో కావలికాస్తూ ఉండగా, పోతుటీగ అయినా లోపలికి వెళ్ళడం కష్ట సాధ్యమే.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=377

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 24


( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-373-వ.
ఇవ్విధంబున నతిమనోహర విభవాభిరామంబులగు దివ్యాంబరాభరణ మల్యానులేపనంబులను, గర్పూర తాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిర మణిదీప నీరాజనంబులను, సుగంధబంధురాగరుధూపంబులను, నాటపాటల వీణావినోదంబులను, బరితుష్టిం బొంది కన్యాకుమారకు లానంద సాగరాంత ర్నిమగ్నమానసులై యుదయాస్తమయ నిరూపణంబుసేయనేరక, ప్రాణంబు లొక్కటియైన తలంపులం గదిసి యిష్టోపభోగంబుల సుఖియించుచుండి; రంత.
10.2-374-క.
ఆలోనన నతిచిర మగు
కాలము సుఖలీల జరుగఁగా వరుస నుషా
బాలాలలామ కొయ్యనఁ
జూ లేర్పడి గర్భ మొదవె సురుచిరభంగిన్.

భావము:
ఆ విధంగా అత్యంత మనోహరములు వైభవోపేతములు అయిన వస్త్రాభరణాలు, పూలదండలు, మైపూతలు, కర్పూరతాంబూలాలు, రకరకాల అన్నపానాలు, ఆటపాటలు, వీణావినోదములు, అగరధూపాలు, మణిదీపాలు మొదలైన సౌఖ్యాలతో ఉషా అనిరుద్ధులు ఆనందసాగరంలో మునిగితేలారు. వారికి సూర్యోదయాస్తమయాలు తెలియడం లేదు. శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఇష్టభోగాలతో సుఖించారు. ఇలా ఆ యువతీయువకులు సుఖాలలో ఓలలాడుతూ గడుపుతూ ఉన్నారు. ఇంతలో కొద్దికాలమునకు ఉషాబాల గర్భం ధరించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=374

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, June 16, 2020

ఉషా పరిణయం - 23

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-371-వ.
అని వినుతించి చిత్రరేఖను నిజమందిరమునకుఁబోవం బనిచినం జనియె; ననంతరంబ వింతజనులకెవ్వరికింబ్రవేశింపరాని యంతఃపుర సౌధాంతరంబున ననిరుద్ధుండు మేల్కని యయ్యింతిం గనుంగొని, యప్పుడు.
10.2-372-క.
సురుచిర మృదుతల్పంబునఁ
బరిరంభణ సరసవచన భావకళా చా
తురి మెఱయ రాకుమారుఁడు
తరుణీమణిఁ బొందె మదనతంత్రజ్ఞుండై.

భావము:
ఈలాగున కొనియాడిన ఉషాబాల చిత్రరేఖను తన ఇంటికి పోవ సాగనంపింది. పరపురుషులు ప్రవేశింపరాని ఆ అంతఃపురములో అనిరుద్ధుడు నిద్రమేల్కొని ఆ ఉషాసుందరిని కనుగొన్నాడు. అంతట అలా మేల్కొన్న అనిరుద్ధుడు ఆ అందమైన మృదుతల్పము మీద కౌగిలింతలతో సరస సల్లాపములతో ఉషాసుందరిని ఉత్సాహపరుస్తూ శృంగారలీలా విలాసములలో ఓలలాడాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=372

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 22


( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-370-సీ.
"అతివ! నీ సాంగత్య మను భానురుచి నాకుఁ;
గలుగుటఁ గామాంధకార మడఁగెఁ
దరలాక్షి! నీ సఖిత్వం బను నావచేఁ;
గడిఁది వియోగాబ్ధిఁ గడవఁ గంటి
నబల! నీ యనుబంధ మను సుధావృష్టిచే;
నంగజ సంతాప మార్పఁ గంటి
వనిత! నీ చెలితనం బను రసాంజనముచే;
నా మనోహర నిధానంబుఁ గంటిఁ
10.2-370.1-తే.
గలలఁ దోఁచిన రూపు గ్రక్కన లిఖించు
వారు, నౌ నన్నఁ దోడ్తెచ్చు వారు గలరె?
నీటిలో జాడఁ బుట్టించు నేర్పు నీక
కాక గల్గునె మూఁడు లోకములయందు? "

భావము:
“చెలీ! నీ సాంగత్యం అనే సూర్యకాంతి లభించటం వలన నా కామాంధకారం పటాపంచలైపోయింది. సుందరీ! నీ స్నేహం అనే నావ వలన వియోగ సాగరాన్ని దాటగలిగాను. సఖీ! నీ అనుబంధం అనే అమృతవర్షంతో మన్మథతాపం చల్లార్చుకొన గలుగుతున్నాను. మానినీ! నీ మైత్రి అనే అంజనంతో మనోహరుడనే నిధిని చూడ గలుగుతూ ఉన్నాను. కలలో కనిపించిన వానిని చిత్రపటంలో గీసి చూపేవారు ఉండవచ్చేమో కానీ, అవును అనగానే వానిని తీసుకువచ్చే వారు ఎవరైనా ఉంటారా? నీవు అంటే నీటిలో జాడలు తీయగల నేర్పుకలదానివి. ఈ ముల్లోకాలలో నిన్ను మించినవారు ఎవరూ లేరు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=370

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, June 13, 2020

ఉషా పరిణయం - 21

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-368-క.
అనిన నుషాసతి దన మన
మున ననురాగిల్లి మేనఁ బులకాంకురముల్‌
మొనయఁగ నానందాశ్రులు
గనుఁగవ జడి గురియ ముఖవికాస మెలర్పన్.
10.2-369-వ.
ఇట్లు మనంబున నుత్సహించి చిత్రరేఖం గనుంగొని యయ్యింతి యిట్లనియె.

భావము:
ఆమె అన్నది వినగానే, అనురాగంతో ఉషాకన్య తనువు పులకించింది. ఆనందాశ్రువులు కనుగవ నుంచిజాలువారాయి. ముఖకమలం వికసించింది. ఈలాగున అంతరంగంలో ఆనందం పొరలిపొరలగా ఉషాబాల చిత్రరేఖతో ఇలా అన్నది

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=368

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 20

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-366-వ.
కని డాయం జని, తదీయ సుషమావిశేషంబులకుం బరితోషంబు నొందుచుం, గామినీచరణ రణితమణినూపుర ఝణంఝణధ్వనిత మణిగోపురంబును, నతి విభవ విజితగోపురంబునునగు ద్వారకాపురంబు నిశాసమయంబునం బ్రచ్ఛన్నవేషంబునం జొచ్చి; కనకకుంభకలితసౌధాగ్రంబున మణిదీపనిచయంబు ప్రకాశింపఁ, జంద్ర కాంత శిలాభవనంబున సుధాధామ రుచిరరుచి నిచయంబు నపహసించు హంసతూలికాతల్పంబున నిజాంగనా రతిశ్రమంబున నిద్రాసక్తుండై యున్న యనిరుద్ధుం జేరి, తన యోగవిద్యా మహత్త్త్వంబున నతని నెత్తుకొని, మనోవేగంబున శోణపురంబునకుం జని, బాణాసురనందనయగు నుషాసుందరి తల్పంబునం దునిచి యిట్లనియె.
10.2-367-క.
"వనజాక్షి! చూడు నీ విభు,
ననిమిషనగధీరు, శూరు, నభినవమారున్
వనధి గభీరు, నుదారుని,
ననిరుద్ధకుమారు, విదళితాహితవీరున్. "

భావము:
చిత్రరేఖ ఆ పట్టణ సౌందర్యానికి సంతోషించింది. రాత్రి సమయంలో మారువేషంలో ద్వారకలో ప్రవేశించింది. స్త్రీల మణిమంజీరాలతో మారుమ్రోగే సౌధాలతో స్వర్గాన్ని తిరస్కరించే ఆ ద్వారకాపట్టణంలో, బంగారు కుంభాలతో గూడిన రాజప్రాసాదం మీద, మణిదీపాలతో ప్రకాశిస్తున్న చంద్రకాంత శిలాభవనంలో, చంద్రకాంతిని ధిక్కరించే హంసతూలికాతల్పం మీద సురతశ్రమవలన నిద్రిస్తున్న అనిరుద్ధుడి చెంతకు చేరింది. తన యోగవిద్యా నైపుణ్యంతో అతడిని ఎత్తుకుని మనోవేగంతో శోణపురం వచ్చింది. వచ్చి ఆ బాణాసురుని కుమార్తె ఉషాసుందరి పాన్పు మీద అనిరుద్ధుడిని పరుండ బెట్టింది. అలా చేసి ఉషాబాలతో చిత్రరేఖ ఇలా పలికింది. “ఓ కమలాక్షీ! ఇదిగో చూడు మేరునగధీరుడూ; రణశూరుడూ; నవమన్మథాకారుడూ; సముద్రగంభీరుడూ; ఉదారుడూ; శత్రుసంహారుడూ అయిన నీ హృదయచోరుడు అనిరుద్ధ కుమారుడు ఇడిగో.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=367

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, June 9, 2020

ఉషా పరిణయం - 19

( చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట )

10.2-364-వ.
అని చెప్పి “యే నతిత్వరితగతిం జని యక్కుమారరత్నంబుఁ దొడ్కొనివచ్చు నంతకు సంతాపింపకుండు” మని యా క్షణంబ వియద్గమనంబునం జని ముందట.
10.2-365-క.
సరసిజముఖి గనుఁగొనె శుభ
భరిత విలోకన విధూత భవ వేదనముం
బరసాధనమును సుకృత
స్ఫురణాపాదనముఁ గృష్ణు పుటభేదనమున్.

భావము:
చిత్రరేఖ ఇలా చెప్పి, “నేను వెంటనే వేగంగా వెళ్ళి ఈ కుమారరత్నాన్ని తీసుకుని వస్తాను. అంతవరకూ నీవు విచారించకుండా ఉండు.” అని ఆ క్షణంలోనే ఆకాశమార్గాన బయలుదేరి ముందుకు వెళ్ళి ఆ చిత్రరేఖ అలా ఆకాశగమనంలో వెళ్ళి, ఇహలోక దుఃఖాన్ని పోగొట్టగలదీ, పరలోకాన్ని సాధించడానికి తోడ్పడగలదీ, పుణ్యాలపుట్ట అయిన శ్రీకృష్ణుడి పట్టణం ద్వారకను దర్శించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=34&padyam=365

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, June 7, 2020

ఉషా పరిణయం - 18

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-360-వ.
ఇవ్విధంబునం జూపిన.
10.2-361-మ.
వనితారత్నము కృష్ణనందనుని భావప్రౌఢిఁ దాఁ జూచి గ్ర
ద్దనఁ దన్నర్థి వరించి చన్న సుగుణోత్తంసంబ కా నాత్మలో
ననుమానించి యనంతరంబ యనిరుద్ధాఖ్యున్ సరోజాక్షు నూ
తన చేతోభవమూర్తిఁ జూచి మది సంతాపించుచున్నిట్లనున్.
10.2-362-ఉ.
"ఇంతి! మదీయ మానధనమెల్ల హరించిన మ్రుచ్చు నిమ్మెయిం
బంత మెలర్ప వ్రాసి పటభాగనిరూపితుఁ జేసినట్టి నీ
యంతటి పుణ్యమూర్తిఁ గొనియాడఁగ నేర్తునె? నీ చరిత్రముల్‌
వింతలె నాకు? నీ మహిత వీరుకులంబు బలంబుఁ జెప్పుమా! "
10.2-363-చ.
అనవుడుఁ జిత్రరేఖ జలజాక్షికి నిట్లను "నీ కుమారకుం
డనఘుఁడు, యాదవాన్వయ సుధాంబుధి పూర్ణసుధాకరుండునాఁ
దనరిన కృష్ణపౌత్త్రకుఁ, డుదారచరిత్రుఁడు, భూరిసింహ సం
హననుఁ, డరాతి సైన్య తిమిరార్కుఁడు, పే రనిరుద్ధుఁ డంగనా! "

భావము:
ఈలాగున చిత్రరేఖ యాదవవీరులను చూపించే సమయంలో ఆ బాలామణి కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడిని చూసి తనకు కలలో కనిపించినవాడు ఇతడే అని అనుమానించింది. కాని పిమ్మట చిత్రరేఖ చూపించిన పద్మనేత్రుడూ, నవమన్మథాకారుడూ అయిన అనిరుద్ధుడిని చూసి సంతోషంతో ఇలా పలికింది. “ఓ చెలీ! నా మానధనాన్ని కొల్లగొట్టిన దొంగ వీడె. నీవు ఇలా ఇతడిని చిత్రపటంలో చూపించిన పుణ్యమూర్తివి; నిన్ను ఏమని పొగడగలను చెప్పు. ఈ వీరాధివీరుడి బలాది విశేషములు వివరించు.” అని ఉషాసుందరి చిత్రరేఖను అడిగింది. ఆమె ఉషాసుందరికి ఆ సుకుమారుడి వివరాలు ఇలా తెలిపింది “సఖీ! ఇతడు యాదవవంశ నిండుచంద్రుడు; శ్రీకృష్ణుడి మనుమడు; ఉదారచరిత్రుడు; సింహపరాక్రముడు; శత్రుసైన్యం అనే చీకటి పాలిటి సూర్యుడు; ఇతని పేరు అనిరుద్ధుడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=363

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 17

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-358-సీ.
కమనీయశుభగాత్రుఁ, గంజాతదళనేత్రు;
వసుధాకళత్రుఁ, బావనచరిత్రు,
సత్యసంకల్పు, నిశాచరోగ్రవికల్పు;
నతపన్నగాకల్పు నాగతల్పుఁ,
గౌస్తుభమణిభూషు, గంభీరమృదుభాషు;
శ్రితజనపోషు, నంచితవిశేషు,
నీలనీరదకాయు, నిర్జితదైతేయు;
ధృతపీతకౌశేయు, నతవిధేయు,
10.2-358.1-తే.
నఘమహాగదవైద్యు, వేదాంతవేద్యు,
దివ్యమునిసన్నుతామోదుఁ, దీర్థపాదు,
జిష్ణు, వర సద్గుణాలంకరిష్ణుఁ, గృష్ణుఁ
జూడు దైతేయకులబాల! సుభగ లీల!
10.2-359-చ.
స్ఫుర దళి శింజినీ రవ విభూషితపుష్పధనుర్విముక్త భా
స్వర నవచూత కోరక నిశాత శిలీముఖ పాతభీత పం
కరుహభవాది చేతన నికాయు, మనోజనిజాంశు, రుక్మిణీ
వరసుతు, రాజకీరపరివారుని మారునిఁ జూడు కోమలీ! "

భావము:
ఓ దైత్య వంశ సుందరీ! ఇటుచూడు ఇతడు శ్రీకృష్ణుడు; మనోహరగాత్రుడు; పద్మనేత్రుడు; పావనచరిత్రుడు; సత్యసంకల్పుడు; దుష్టరాక్షసవిరోధి; శివునికి సైతం ఆరాధ్యుడు; శేషశయనుడు; కౌస్తుభమణిధారి; గంభీరభాషణుడు; ఆశ్రితజనపోషణకుడు; నీలమేఘశ్యాముడు; పీతాంబరుడు; వేదవేద్యుడు; సుజనవిధేయుడు; తీర్థపాదుడు; జయశీలుడు; సుగుణాలవాలుడు. ఓ కోమలీ! ఇతడు రుక్మిణీ సుతుడు ప్రద్యుమ్నుడు తన తుమ్మెదల నారి సారించి వదలిన పుష్పబాణాల దెబ్బతో బ్రహ్మాది దేవతలనే భయపెట్టగలిగిన మన్మథుని అవతారమే ఈ ప్రద్యుమ్నుడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=359

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, June 4, 2020

ఉషా పరిణయం - 16

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-355-మ.
బలిమిన్ సర్వనృపాలురన్నదిమి కప్పంబుల్‌ దగం గొంచు ను
జ్జ్వల తేజో విభవాతిరేకమున భాస్వత్కీర్తి శోభిల్లఁగాఁ
బొలుపొందం దను రాజరా జన మహా భూరిప్రతాపంబులుం
గల దుర్యోధనుఁ జూడు సోదరయుతుం గంజాతపత్త్రేక్షణా! "
10.2-356-వ.
అని యిట్లు సకలదేశాధీశ్వరులగు రాజవరుల నెల్లఁ జూపుచు యదువంశసంభవులైన శూరసేన వసుదేవోద్ధవాదులం జూపి మఱియును.
10.2-357-ఉ.
"శారద నీరదాబ్జ ఘనసార సుధాకర కాశ చంద్రికా
సార పటీరవర్ణు, యదుసత్తము, నుత్తమనాయకుం, బ్రమ
త్తారి నృపాల కానన హుతాశనమూర్తిఁ, బ్రలంబదైత్య సం
హారునిఁ, గామపాలుని, హలాయుధుఁ జూడుము దైత్యనందనా!

భావము:
ఓ కమలాక్షీ! ఇతడు సోదరులతో ఉన్న సుయోధనుడు; గొప్పపరాక్రమవంతుడు; తేజోనిధి; రారాజు అని ప్రశస్తి గాంచినవాడు; తన మహాశౌర్యంతో రాజులను అందరినీ ఓడించి, వారిచే కప్పములను గైకొనుచున్నాడు; అఖండకీర్తిమంతుడు." ఈ విధంగా ఉషాబాలకు సమస్త రాజులను చూపిస్తూ చిత్రరేఖ, యాదవవంశస్థులైన శూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలైనవారిని కూడా చూపించింది. “ఓ దైత్య బాలికా! ఉషా! శరత్కాల మేఘం, శంఖం, ఘనసారం, చంద్రుడు, చందనం వంటి వర్ణంతో శోభిస్తున్న ఈ వీరుడు బలరాముడు; ఇతడు ఉత్తమ నాయకుడు; ప్రమత్తులైన శత్రురాజులు అనే అరణ్యాల పాలిట అగ్నిదేవుని వంటివాడు; ప్రలంబుడనే దైత్యుని సంహరించిన మహావీరుడు; కామపాలుడు; ఇతడే హలాయుధుడు అయిన యదువంశశేఖరుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=357

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ఉషా పరిణయం - 15

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-352-మ.
సుగుణాంభోనిధి, ఫాలలోచను నుమేశున్నాత్మ మెప్పించి శ
క్తి గరిష్ఠంబగు శూలముం బడసె నక్షీణప్రతాపోన్నతిన్,
జగతిన్ మిక్కిలి మేటివీరుఁడు, రణోత్సాహుండు, భూపౌత్త్రుఁ డీ
భగదత్తుం గనుఁగొంటె! పంకజముఖీ! ప్రాగ్జ్యోతిషాధీశ్వరున్.
10.2-353-మ.
వికచాంభోరుహపత్రనేత్రుఁ డగు గోవిందుండు దాఁ బూను నం
దక చక్రాబ్జ గదాది చిహ్నములచేతన్ వాసుదేవాఖ్య ను
త్సుకుఁడై యెప్పుడు మచ్చరించు మదిఁ గృష్ణుండన్ననేమేటి పౌం
డ్రకుఁ గాశీశసఖుం గనుంగొనుము వేడ్కం జంద్రబింబాననా!
10.2-354-మ.
ద్విజ శుశ్రూషయు, సూనృతవ్రతము, నుద్వృత్తిన్ భుజాగర్వమున్,
విజయాటోపముఁ, జాప నైపుణియు, ధీవిస్ఫూర్తియుం గల్గు నీ
రజనీనాథకులప్రదీపకులఁ బాఱంజూడు పద్మాక్షి! ధ
ర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైకపారీణులన్.

భావము:
ఓ పద్మముఖీ! ఈతడు ప్రాగ్జ్యోతిషాధీశ్వరుడు భగదత్తుడు ఫాలలోచనుడైన పరమేశ్వరుణ్ణి మెప్పించి శక్తిమంత మైన శూలాన్ని ఆయుధంగా పొందాడు యుద్ధోత్సాహం గల సాటిలేని మేటివీరుడు. ఓ ఇందుముఖీ! ఇతడు పౌండ్రకుడు పద్మాక్షుడైన గోవిందుడు ధరించే నందకమనే ఖడ్గమూ; సుదర్శనమనే చక్రమూ; పాంచజన్యమనే శంఖమూ; కౌమోదకి అనే గదా మొదలైన వానిని ధరించి వాసుదేవు డనే పేరుపెట్టుకుని, శ్రీకృష్ణుని మీద మాత్సర్యం పెంపొందించుకున్నాడు; కాశీరాజుకు ఆప్తమిత్రుడు. పద్మములవంటి కన్నులున్న సఖీ! చంద్రవంశ ప్రదీపకు లైన పంచపాండవులు వీరు; ఇతడు ధర్మరాజు; ఇతడు భీముడు; ఇతడు అర్జునుడు; వీరిద్దరూ నకుల సహదేవులు; ఈ పాండవులు బ్రాహ్మణభక్తిపరులు; సత్యవ్రతులు; భుజబలసంపన్నులు; విజయశీలులు; బుద్ధిమంతులు; యుద్ధరంగంలో ఆరితేరిన వీరశిరోమణులు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=354

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, June 1, 2020

ఉషా పరిణయం - 14

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-349-ఉ.
సింధురవైరివిక్రముఁడు, శీతమయూఖ మరాళికా పయ
స్సింధుపటీర నిర్మలవిశేష యశోవిభవుండు, శౌర్య ద
ర్పాంధ రిపుక్షితీశ నికరాంధతమః పటలార్కుఁ డీ జరా
సంధునిఁ జూడు మాగధుని సద్బృహదశ్వసుతుం గృశోదరీ!
10.2-350-మ.
సకలోర్వీతలనాథ సన్నుతుఁడు, శశ్వద్భూరి బాహాబలా
ధికుఁ, డుగ్రాహవకోవిదుండు, త్రిజగద్విఖ్యాతచారిత్రకుం,
డకలంకోజ్జ్వల దివ్యభూషుఁడు విదర్భాధీశ్వరుండైన భీ
ష్మక భూపాలకుమారుఁ జూడు మితనిన్ మత్తద్విరేఫాలకా!
10.2-351-ఉ.
సంగరరంగ నిర్దళిత చండవిరోధి వరూధినీశ మా
తంగ తురంగ సద్భట రథప్రకరైక భుజావిజృంభణా
భంగ పరాక్రమప్రకట భవ్యయశోమహనీయమూర్తి కా
ళింగుఁడు వీఁడె చూడు తరళీకృత చారుకురంగలోచనా!

భావము:
ఓ తలోదరీ! ఇడుగో ఇతడు బృహదశ్వుని పుత్రుడు మగధరాజైన జరాసంధుడు; ఈ జరాసంధుడు సింహపరాక్రముడు; నిర్మల కీర్తిమంతుడు; శత్రు భయంకరుడు. ఓ అలికులనీలవేణీ! ఇతడు భీష్మకమహారాజు కుమారుడు రుక్మి; ఈ విదర్భరాజు సమస్త రాజలోక సన్నుతుడు; భుజబలసంపన్నుడు; రణకోవిదుడు; ప్రఖ్యాతచరిత్రుడు; దివ్యాలంకారభూషితుడు; లేడికన్నుల ఉషా సుందరీ! ఇడుగో చూడుము. ఇతడు కళింగ భూపాలుడు యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడేవాడు; వైరిసేనాపతులను చతురంగబలాలను తన అవక్రపరాక్రమంతో పరాజితులను గావించి అఖండ మైన కీర్తిగాంచిన వీరాధివీరుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=351

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ఉషా పరిణయం - 13

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-347-సీ.
"కమనీయ సంగీత కలిత కోవిదులు కిం;
పురుష గంధర్వ కిన్నరులు వీరె
సతత యౌవన యదృచ్ఛావిహారులు సిద్ధ;
సాధ్య చారణ నభశ్చరులు వీరె
ప్రవిమల సౌఖ్య సంపద్వైభవులు సుధా;
శన మరు ద్యక్ష రాక్షసులు వీరె
నిరుపమ రుచి కళాన్విత కామరూపులై;
పొగడొందునట్టి పన్నగులు వీరె
10.2-347.1-తే.
చూడు" మని నేర్పుఁ దీపింపఁ జూపుటయునుఁ
జిత్తము నిజమనోరథసిద్ధి వడయఁ
జాలకుండిన మధ్యమ క్ష్మాతలాధి
పతులఁ జూపుచు వచ్చె న ప్పద్మనయన.
10.2-348-ఉ.
"మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పుళింద కళింగ భోజ నే
పాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధ రాంధ్ర బం
గాళ కరూశ టేంకణ త్రిగర్త సుధేష్ణ మరాట లాట పాం
చాల నిషాద ఘూర్జరక సాళ్వ మహీశులు వీరె కోమలీ!

భావము:
“వీరు కమనీయ సంగీత విద్య యందు విశారదులైన గంధర్వ, కిన్నర. కింపురుషులు; వీరు నిత్యయౌవనులూ, స్వేచ్ఛావిహారులూ అయిన సిద్ధ, సాధ్య, చారణులు; ఇదిగో వీరు అమితమైన సౌఖ్యాలలో తేలియాడే అమరులు, మరుత్తులు, యక్షులు, రాక్షసులు; వీరు కామరూపులై గణుతిగాంచిన కళానిధులు నాగకుమారులు; వీరిని చూడు” అని చిత్రరేఖ చూపగా, ఉషాకన్యకు వారిలో ఆమె ప్రియుడు కనిపించ లేదు. అప్పుడు చిత్రరేఖ భూలోకవాసు లైన రాకుమారులను చూపించడం మొదలు పెట్టింది. “ఓ కోమలీ! వీరిని చూడు మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాధీశ్వరులు వీరు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=347

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :