Friday, December 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౭(707)

( అవధూత సంభాషణ ) 

11-100-క.
మోహితుఁడై వసుకాంక్షా
వాహినిలోఁ జిక్కి క్రూరవశుఁడౌ మనుజుం
డూహాపోహ లెఱుంగక
దేహము నలఁగంగఁ జేయు దీనత నెపుడున్‌.

భావము:
మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయే వాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=100

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, December 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౬(706)

( అవధూత సంభాషణ ) 

11-99-వ.
ఇవ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబువలనఁ గాలసృష్ట గుణసాంగత్యంబు లేమియు, నుదకంబువలన నిత్యశుచిత్వంబును, నసితపథునివలన నిర్మలత్వంబును, నిశాకర ప్రభాకరుల వలన నధికాల్పసమత్వజీవ గ్రహణ మోక్షణంబులును, గపోతంబులవలనఁ గళత్ర పుత్ర స్నేహంబును, నజగరంబువలన స్వేచ్ఛా విహారసమాగతాహారంబును, వననిధివలన నుత్సాహ రోషంబులును, శలభంబువలన శక్త్యనుకూల కర్మాచరణంబును, భృంగంబువలన సారమాత్రగ్రహణ విశేషంబును, స్తంబేరమంబువలనం గాంతావైముఖ్యంబును, సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపరత్వంబును, జలచరంబువలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభసంతుష్టియుఁ, గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేకనిష్ఠయు, దందశూకంబువలనం బరగృహవాసంబును, నూర్ణనాభివలన సంసారపరిత్యాగంబును, గణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయుననంగల వీని గుణంబు లెఱింగి మఱియుఁ గామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబు లను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితంబుగా వాయువశంబు సేసి, గాత్రపవిత్రత్వంబుకొఱకు షట్కర్మ నిరతుండయి, పుర నగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజనుండై, ఖేద మోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుం డయి నన్నె కాని యొండెఱుంగక యాత్మ నిష్ఠచేఁ బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయుం గావున.

భావము:
ఈ విధంగా, 1. భూమివలన సహనము; 2. వాయువువలన పరోపకారము; 3. ఆకాశమువలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం; 4 నీటివలన ఎప్పుడు శుచిగా ఉండటం; 5. అగ్నివలన నిర్మలంగా ఉండటం; 6. 7. చంద్ర, సూర్యులవలన సర్వసమత్వము; 8. పావురంవలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము; 9. కొండచిలువవలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం; 10. సముద్రంవలన ఉత్సాహ రోషములు; 11. మిడుతవలన శక్తికి తగిన పనిచేయటము; 12. తుమ్మెదవలన సారమును మాత్రమే గ్రహించటం; 13. ఏనుగువలన స్త్రీ వైముఖ్యము; 14. తేనెటీగవలన సంగ్రహణము; 15. లేడివలన విచారపరత్వమ; 16. తాబేలువలన జిహ్వాచాపల్యము; 17. ముంగిసవలన దొరికిన దానితో తృప్తిపడటం; 18. లకుమికిపిట్టవలన మోహ పరిత్యాగము; 19. బాలునివలన విచార పరిత్యాగము; 20. బాలికవలన సంగ విసర్జనము; 21. బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత; 22. పామువలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం; 23. సాలెపురుగువలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము; 24. కందిరీగవలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట; నేర్చుకోవాలి.
ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, అనే అరిషడ్వర్గము (ఆరుగురు శత్రువులు) జయించాలి ముసలితనం రాకుండా చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలగి, పట్టణాలను గ్రామాలను నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్నీ మోహాన్నీ వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్ఠతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు నా యందే కలుస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=99

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౫(705)

( అవధూత సంభాషణ ) 

11-98-క.
ఇవి తెలియవలయు నాకును
బ్రవిమలమతి వీనిఁ దెలియఁ బలుకు మనంగాఁ
వివరము వినుమని కృష్ణుఁడు
సవినయుఁడగు నుద్ధవునికిఁ జయ్యనఁ జెప్పెన్‌.

భావము:
ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా, “ఇవి ఏమిటో తెలుసుకోవాలని ఉంది, నిర్మలమతితో వీటి గురించి తెలియచెప్పండి.” అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినమ్రుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=98

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౭౦౪(704)

( అవధూత సంభాషణ ) 

11-97-వ.
ఇందుల కొక్క యితిహాసంబు గలదు; మహారణ్యంబున నొక్క కపోతంబు దారసమేతంగా నొక్క నికేతనంబు నిర్మించి యన్యోన్య మోహాతిరేకంబునఁ గొంతకాలంబునకు సంతానసమృద్ధిగలదియై యపరిమితంబు లయిన పిల్లలు దిరుగాడుచుండఁ గొన్ని మాసంబులు భోగానుభవంబునం బొరలుచుండఁ గాలవశంబున నొక్క లుబ్ధకుం డురు లొడ్డిన నందు దారాపత్యంబులు దగులువడిన ధైర్యంబు వదలి మోహాతిరేకంబునం గపోతంబు కళత్ర పుత్త్ర స్నేహంబునం దాను నందుఁజొచ్చి యధికచింతాభరంబునం గృశీభూతంబయ్యెఁ; గావున నతితీవ్రంబయిన మోహంబు గొఱగా దట్లు గాన నిరంతర హరిధ్యానపరుండై భూమి పవన గగన జల కృపీట భవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి శలభ ద్విరేఫ గజ మధు మక్షికా హరిణ పాఠీన పింగళా కురర డింభక కుమారికా శరకృ త్సర్ప లూతా సుపేశకృత్సముదయంబులు మొదలుగాఁ గలవాని గుణగణంబు లెఱింగికొని యోగీంద్రులు మెలంగుదు; ”రనిన.

భావము:
దీనికి ఒక ఇతిహాసము ఉంది. చెప్తా విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆ కపోత దంపతులు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉండేవారు. కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలన్నీ అటుఇటూ తిరుగుతూ ఉంటే సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్నినెలలు గడిచాయి. ఇలా ఉండగా, ఒకనాడు కాలవశాన ఒక బోయ వచ్చి వల వేశాడు. ఆ వలలో ఆడపావురము పిల్లలు చిక్కుకున్నాయి. మగపావురం ధైర్యం వదలి మోహంతో భార్యా బిడ్డలమీద స్నేహంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించి పోయింది. కాబట్టి, దేని యందు మరీ తీవ్రమయిన మోహం మంచిది కాదు.
అందుకనే యోగీంద్రులు ఎప్పుడు హరిధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుమికిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ (ఇరవై నాలుగు) మొదలగు వాటి గుణగణాలు తెలుసుకుని మెలగుతూ ఉంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=97

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, December 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౩(703)

( అవధూత సంభాషణ ) 

11-96-ఉ.
దారలయందుఁ, బుత్త్ర ధన ధాన్యము లందు ననేక భంగులం
గూరిమి సేయు మర్త్యుఁ డతి ఘోర వియోగజ దుఃఖమగ్నుఁడై
నేరుపు దక్కి, చిక్కువడి నీతి వివేక విహీనుడై మనో
భారముతోఁ గపోతపతి భంగి నిజంబుగ బోవు నష్టమై.

భావము:
భార్యాబిడ్డలపై, ధనధాన్యములపై అతి మోహం పెంచుకునే మానవుడు, భయంకరమైన వియోగ దుఃఖాలలో కొట్టుమిట్టాడతాడు. ఏమి చేయాలో తెలియని స్థితికి చేరతాడు. ఆ బంధాలలో చిక్కుకుపోయి నీతి, వివేకాలు కోల్పోతాడు. ఆఖరికి కథలోని కపోతము వలె మనోవ్యథతో తప్పక నష్టపోతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=96

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౨(702)

( అవధూత సంభాషణ ) 

11-94-వ.
అంత యదుప్రవరుండు “దేహి లోభమోహాదులవర్జించి జనార్దనుని నే విధంబునం జేరవచ్చు? నెఱింగింపు” మనిన నతం డిట్లనియె.
11-95-సీ.
"పరధన పరదార పరదూషణాదులఁ-
  బరవస్తుచింతదాఁ బరిహరించి
ముదిమిచే రోగము లుదయింప కటమున్న-
  తనువు చంచలతను దగులకుండ
బుద్ధిసంచలతచేఁ బొదలక యట మున్న-
  శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
శక్తియుక్తుల మది సన్నగిల్లక మున్న-
  భక్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు
11-95.1-తే.
దైత్యభంజను దివ్యపాదారవింద
భజన నిజభక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
నవ్యయానందమును బొందు ననుదినంబు
నతఁడు కర్మవిముక్తుఁడౌ ననఘచరిత!

భావము:
దానికి యదురాజు “శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏవిధంగా విష్ణువును చేరగలడు. తెలియజెప్పండి.” అంటే, అవధూత ఇలా అన్నాడు. “ఓ సచ్చరిత్రా! విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైనపడి రోగాలు పుట్టక ముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాక ముందే, గొంతులో శ్లేష్మం చేరక ముందే, శక్తియుక్తులు సన్నగిల్లక ముందే, ధృఢమైన భక్తిభావనతో దానవాంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త ఙ్ఞానం కలిగి ఉండి, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=95

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, December 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౧(701)

( అవధూత సంభాషణ ) 

11-92-ఉ.
పంకజనాభుఁ డుద్ధవునిపైఁ గల కూర్మిని జెప్పె నొప్ప నెం
దంకిలి లేక యన్నిదిశలందుఁ జరించుచు నిత్యతృప్తుఁడై
శంకరవేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర నే
వంకనునుండి వచ్చి తన వానికి నిట్లనె నర్థి నేర్పడన్‌.
11-93-క.
అవధూత వల్కె నంతటఁ
"బ్రవిమల విజ్ఞాన నిపుణ భవ్యులు గురువుల్‌
తవిలిన నిరువదినలువురు
నవనిన్‌ విజ్ఞాని నైతి" నని పల్కుటయున్‌.

భావము:
పద్మనాభుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. “ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడినుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరిగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాదచేసి “ఎక్కడ నుండి వచ్చారు” అని ఆసక్తితో అడిగాడు. యోగి ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు ఇరవైనలుగురు నాకు గురువులు. వారివలన నేను విజ్ఞానిని అయినాను.” అని యోగి అనగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=93

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Saturday, December 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౦(700)

( ప్రభాసంకు బంపుట ) 

11-91-వ.
ఇట్లు నుతియించి “దేవా! నీవు యదుక్షయంబు గావించి చనిన నేమే విధంబున నిర్వహింతుము? నీ సహచరులమై జరిపిన మజ్జన భోజన శయ నాసనాది కృత్యంబులు మఱవవచ్చునే?” యని యుద్ధవుం డాడిన వాసుదేవుం డిట్లనియె; “బ్రహ్మాదిదేవతా ప్రార్థనంబునం జేసి ధాత్రీ భారంబు నివారించితి; నింక ద్వారకానగరంబు నేఁటికి సప్తమ దివసంబున సముద్రుండు ముంపంగలవాఁడు; యదుక్షయంబునుం గాఁగల యది; యంతటం గలియుగంబునుం బ్రాప్తంబయ్యెడి, నందు మానవులు ధర్మవిరహితులు, నాచారహీనులు, నన్యాయపరులును, నతిరోషులు, మందమతులు, నల్పతరాయువులు, బహురోగపీడితులు, నిష్ఫలారంభులు, నాస్తికులునై యొండొరుల మెచ్చక యుందురు; గావున నీవు సుహృద్బాంధవస్నేహంబు వర్జించి, యింద్రియసౌఖ్యంబులం బొరయక క్షోణితలంబునం గల పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేయుచు, మానస వాగక్షి శ్రోత్ర ఘ్రాణేంద్రియ గృహ్యమాణం బగు వస్తుజాతంబెల్ల నశ్వరంబుగా నెఱుంగుము; పురుషుండు నానార్థ కామంబుల నంగీకరించి నిజగుణదోషంబుల మోహితుండై యుండుం; గావున హస్తిపకుండు గంధనాగంబుల బంధించు చందంబున నింద్రియంబులను, మనోవికారంబులను నిగ్రహించి యీషణత్రయంబును వర్జించి, మోద ఖేదంబుల సముండవుగా వర్తించుచు, నీ జగంబంతయు నాత్మాధిష్ఠితంబుగా నెఱింగి, మాయాదు లాత్మతత్త్వాధీనంబులుగాఁ దెలియుచు, జ్ఞానవిజ్ఞానయుక్తుండవై యాత్మానుభవ సంతుష్టుండవై, విశ్వంబును నన్నుఁగా భావించి, వర్తింపవలయు” నని వాసుదేవుం డానతిచ్చిన నుద్ధవుండు భక్తి భయ వినయంబులం గరంబులు మొగిడ్చి “మహాత్మా! సన్న్యస్త లక్షణంబు దుష్కరంబు; పామరులగు వార లాచరింపలేరు; నీ మాయచేత భ్రాంతులైన సాంసారికులు భవాబ్ధిం గడచి యెట్లు ముక్తి వడయుదురు? భృత్యుండనైన నా మీఁది యనుగ్రహంబునం జేసి యానతిమ్ము; బ్రహ్మాది దేవతా సముదయంబును, బాహ్యవస్తువుల భ్రాంతులై పర్యటనంబు సేయుదురు; నీ భక్తు లైన పరమభాగవతు లమ్మాయా నిరసనంబును సేయుదురు; గృహిణీ గృహస్థుల కైన, యతుల కైన నిత్యంబును నీ నామస్మరణంబు మోక్షసామ్రాజ్యపదంబు; గావునఁ బరమేశ్వరా! నీదు చరణంబుల శరణంబు నొందెద; గృపారసంబు నాపై నిగిడింపు” మని ప్రియసేవకుం డైన యుద్ధవుండు పలికిన నతనికిఁ గంసమర్దనుం డిట్లనియెఁ; “బురుషున కాత్మకు నాత్మయె గురువని యెఱుంగుము; కుపథంబులం జనక, సన్మార్గవర్తి వై పరమంబైన మన్నివాసంబునకుం జనుము; సర్వమూలశక్తిసంపన్నుండనైన నన్ను సాంఖ్యయోగపరులు నిరంతరభావంబులందుఁ బురుషభావంబు గావించి తలంచుచుందురు; మఱియు నేక ద్వి త్రి చతుష్పాద బహుపాదాపాదంబులు నై యుండు జీవజాలంబుల లోన ద్వి పాదంబులు గల మనుష్యులు మేలు; వారలలోన నిరంతరధ్యాన గరిష్ఠులైన యోగీంద్రులుత్తములు; వారలలో సందేహపరులచే నగ్రాహ్యుండగు నన్ను సత్త్వగుణగ్రాహ్యునిఁగా నెఱింగి నిజచేతఃపంకజంబు నందు జీవాత్మ పరమాత్మల నేకంబుగాఁ జేసి శంఖ చక్ర గదా ఖడ్గ శార్‌ఙ్గ కౌమోదకీ కౌస్తుభాభరణయుక్తుంగా నెఱుంగుచు నుండువారలు పరమయోగీంద్రు లనియు, బరమజ్ఞాను” లనియునుం జెప్పి మఱియు“నవధూత యదు సంవాదం” బను పురాతనేతిహాసంబు గలదుఁ సెప్పెద నాకర్ణింపుము.

భావము:
ఈ విధంగా స్తుతించి “ఓ దేవా! నీవు యాదవజాతిని నాశనంచేసి వెళ్ళిపోతే, మేము ఎలా మా జీవితాలు నిర్వహించగలము. నీకు సహచరులమై నీతో కలసి చేసిన స్నాన పాన భోజన శయన ఆసనాదులను ఎలా మరచిపోగలము.” అని ఉద్ధవుడు అన్నాడు. దానికి వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “బ్రహ్మదేవుడు మొదలగు దేవతల ప్రార్థన ప్రకారం భూభారాన్ని తొలగించాను. ఇక ఈనాటి నుండి ఏడవ దినమున ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం ప్రవేశిస్తుంది.
అప్పుడు మానవులు ధర్మం ఆచారం లేనివారు అవుతారు. అంతేకాక మానవులు అన్యాయపరులు, అతిరోష స్వభావులు, బహురోగ పీడితులు, సంకల్పాలు ఫలించని వారు, నాస్తికులు అయి ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోకుండ ఉంటారు. కనుక, నీవు స్నేహితులు చుట్టాలు వంటి అనుబంధాలను వర్జించు. ఇంద్రియ సౌఖ్యాలలో మునిగిపోకు. భూతలం మీద పుణ్యతీర్ధాలలో స్నానాలు చెయ్యి. పంచేంద్రియాలచే గ్రహింపదగు వస్తువులు సర్వం నశించేవిగా తెలుసుకో.
పురుషుడు అనేకామైన సంపదలను సంపాదించి కామాలకు అవకాశమిచ్చి తన గుణదోషాలకు మోహితుడు అయి ఉంటాడు. కాబట్టి, మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా, ఇంద్రియాలను మనోవికారాలను నిగ్రహించి భార్యాపుత్రులపైన ధనముపైన ఆసక్తి వదలుము. సుఖమునందు కష్టమునందు సమంగా వర్తించు. ఈ విశ్వం సమస్తం పరమాత్మచే అధిష్టించబడినదిగా గ్రహించు. మాయ ఆత్మకు వశమైనదిగా గుర్తించు. జ్ఞాన విజ్ఞానములు కలవాడవు అయి, అత్మానుభవంతో సంతుష్టిపొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు.” అని వాసుదేవుడు అనతిచ్చాడు.
ఉద్ధవుడు భయ భక్తి వినయాలతో చేతులు జోడించి ఇలా అన్నాడు. “మహానుభావ! సన్యాస జీవితం చాల కష్టమైంది. పామరులు ఆచరించ లేరు. నీ మాయ వలన భ్రాంతులు అయినవారు ఈ సంసార సముద్రాన్ని ఎలా తరించగలరు. ఎలా మోక్షాన్ని పొందగలరు. నేను మీ సేవకుడను కదా. నాకు దయచేసి సెలవియ్యండి. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు సహితం బాహ్య వస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. నీ భక్తులైన పరమ భాగవతులు మాత్రమే ఆ మాయను తప్పించుకో గలరు. ఇల్లాండ్రకైనా, గృహస్థులకైనా, యతులకైనా ఎప్పుడూ నీ నామస్మరణమే మోక్షసామ్రాజ్యాన్ని అందిస్తుంది. కాబట్టి, పరమేశ్వరా! నీ పాదాలను శరణు వేడుతున్నాను. నా మీద నీ దయారసాన్ని ప్రసరించు.” అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు అర్థించాడు. అప్పుడు అతనితో కృష్ణుడు ఇలా అన్నాడు.
మానవుని ఆత్మకు ఆత్మే గురువు అని తెలుసుకో. చెడుమార్గాలలో వెళ్లకుండా సన్మార్గంలో మెలగుతూ పరమమైన నా నివాసానికి చేరుకో. సమస్తానికి మూలమైన నన్ను సాంఖ్య యోగులు ఎప్పుడు పరమపురుష భావంతో భావిస్తూ ఉంటారు. అదీకాక ఒకటి రెండు మూడు నాలుగు అనేక కాళ్ళు కలవి; అసలు కాళ్ళులేనివి అయిన జీవజాలంలో రెండు కాళ్ళు కల మనుష్యులు ఉత్తములు; వాళ్ళలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు; కాని వాళ్ళలో సంశయగ్రస్తులు నన్ను గ్రహించలేరు; నేను సత్త్వగుణగ్రాహ్యుడను. ఈ విషయం గ్రహించి తమ మనసులలో జీవాత్మ పరమాత్మలను ఒకటి చేసి. శంఖం చక్రం గద ఖడ్గం శార్గ్ఞ్యం కౌమోదకి కౌస్తుభం మున్నగు ఆభరణాలు కల నన్ను తెలుసుకున్న వారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు.” అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. “అవధూత యదుసంవాదం అనే ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది. చెప్తాను విను.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=91

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Friday, December 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౯(699)

( ప్రభాసంకు బంపుట ) 

11-88-క.
నారాయణు వచనముల క
పారంబగు సమ్మదమున బలములతోడన్‌
దార సుత మిత్ర యుతులై
వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగిన్‌.
11-89-వ.
అంత.
11-90-క.
జ్ఞానమున నుద్ధవుఁడు దన
మానసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో
దీనజనకల్పభూజ! సు
ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌.

భావము:
శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్యా బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులు గుఱ్ఱాలు సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాసతీర్థానికి వెళ్ళారు. అప్పుడు ఉద్ధవుడు తనకు ఉన్న జ్ఞానంతో ఈ విషయం అంతా గ్రహించి, “లక్ష్మీవల్లభా! శ్రీహరీ! దీనల పాలిటి కల్పవృక్షమా! బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు అయిన నీవే మాకు దిక్కు” అని స్తుతించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=16&Padyam=89

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Thursday, December 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౮(698)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-87-సీ.
కాక ఘూకంబులు గనకసౌధములలోఁ-
  బగలు వాపోయెడి బహువిధముల
నశ్వవాలములందు ననల ముద్భవ మయ్యె-
  నన్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల-
  జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె-
  బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.
11-87.1-తే.
గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె
నరయ నిందుండ వలవదు యదువులార!
తడయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ
డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.

భావము:
శ్రీకృష్ణుడు యాదవులను ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=15&Padyam=87

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, December 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౭(697)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-85-తే.
అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దపరిమితంబు
నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు.
11-86-వ.
అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ “యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం” డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాదిబృందారకులు నిజస్థానంబులకుం జని రంత.

భావము:
“సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి.” అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. అటుపిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&Padyam=86

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, December 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౬(696)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-83-క.
సుర గరుడ ఖచర విద్యా
ధర హర పరమేష్ఠి ముఖ సుధాశనులు మునుల్‌
సరసిజనయనునిఁ గనుఁగొన
నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్‌.
11-84-క.
కని పరమేశుని యాదవ
వనశోభిత పారిజాతు వనరుహనేత్రున్‌
జనకామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.

భావము:
“ఓ రాజా! శ్రద్ధగా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. అలా వచ్చి దర్శించుకుని, యాదవవంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటివాడు, జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&Padyam=84

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౫(695)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-82-వ.
అట్లుగావున లోకరక్షణార్థంబు గృష్ణుండవతారంబునొందె” నని హరి భక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులుగృష్ణుని పరమాత్మునిగా విచారించి” రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు “మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారు లగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు సేసిరి? యేమయ్యె? మఱియుఁ బరమేశ్వర కథామృతంబు వీనులలరం జవిగొనియు, నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరి చారిత్రం బేరీతిఁ జాగెఁ? దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు' మనిన శుకుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తుతో చెప్పగా అతడు “మునీంద్రా! భూభారాన్ని తగ్గించటం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు; ఋషీశ్వరులు తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా ప్రవేశించారు? అటు పిమ్మట ఏమయింది? వివరంగా చెప్పండి. విష్ణు కథామృతం చెవులారా ఎంత విన్నా, తృప్తికలగటం లేదు. భక్తరక్షకుడైన శ్రీహరిచరిత్ర ఏ రీతిగా కొనసాగింది? ఈ వృత్తాంతమంతా తెలియజెప్ప” మని అడుగగా శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=82

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, December 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౪(694)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-80-సీ.
కమలాక్షపదభక్తి కథనముల్‌ వసుదేవ!-
  విని యఘంబులఁ బాసి వెలసి తీవు
భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి-
  కైవల్యలక్ష్మియుఁ గలుగు మీఁద
నారాయణుండు నీ నందనుం డను మోహ-
  మెడలించి విష్ణుగాఁనెఱిఁగి కొలువు
మతఁడు నీ తనయుఁడై యవతరించుటఁజేసి-
  సిద్ధించె దేహసంశుద్ధి నీకు
11-80.1-తే.
సరససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ
బావనంబైతి; శిశుపాల, పౌండ్ర, నరక,
ముర, జరాసంధ, యవనులు, ముదముతోడ
వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యి.
11-81-క.
దుష్టజన నిగ్రహంబును
శిష్టప్రతిపాలనంబు సేయన్‌ హరి దా
సృష్టి నవతార మొందెను
స్రష్టృముఖానేక దివిజసంఘము వొగడన్‌.

భావము:
“వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=80

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౯౩(693)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-79-వ.
ఇవ్విధంబునఁ బ్రశంసింపఁదగిన కావేర్యాది మహానదీపావనజల స్నాన పాన దానంబులను, విష్ణుధ్యానకథాసుధార సానుభవంబుల నిరూఢులగు భాగవతోత్తములు గలిగిరేనిం జెడని పదంబునుం బొందుదు” రని ఋషభకుమారులు భగవత్ప్రతిబింబంబు లయిన పరమపురుషులుం బోలె విదేహజనపాలునకు నిశ్శ్రేయః పదప్రాప్తికరంబు లైన భగవద్భక్తి ధర్మంబు లుపదేశించి యంతర్ధానంబు నొందిరి; మిథిలేశ్వరుండును జ్ఞానయోగం బంగీకరించి నిర్వాణపదంబు నొందె; నీ యుపాఖ్యానంబు వ్రాసినఁ బఠించిన వినిన నాయురారోగ్యైశ్వర్యములు గలిగి పుత్త్ర పౌత్త్ర వంతులై సకల కలికల్మష రహితులై విష్ణులోక నివాసు లగుదు” రని నారదుండు వసుదేవునకుం జెప్పి మఱియును.

భావము:
ఈవిధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు” అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలయిన పరమపురుషుల వంటి వారైన ఋషభకుమారులు, విదేహమహారాజుకి మోక్షపదంపొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్నిపొందాడు. ఈ విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.” అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=79

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౬౯౨(692)

( నారాయణ‌ఋషి భాషణ ) 

11-78-తే.
ద్రవిడ దేశంబునందులఁ దామ్రపర్ణి
సహ్యజా కృతమాలాది సకలనదుల
కెవ్వఁ డేనిని భక్తితో నేఁగి యచటఁ
బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు.

భావము:
ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=78

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..