Tuesday, March 30, 2021

శ్రీకృష్ణ విజయము - 187

( శతధన్వుని ద్రుంచుట )

10.2-89-వ.
అని యిట్లక్రూరుం డుత్తరంబు పలికిన నమ్మహామణి యక్రూరుని యొద్ద నునిచి, వెఱచి శతధన్వుండు తురగారూఢుండై శతయోజన దూరంబు సనియె; గరుడ కేతనాలంకృతంబైన తేరెక్కి రామ కృష్ణులు వెనుచని; రంత నతండును మిథిలానగరంబుఁజేరి తత్సమీపంబు నందు.
10.2-90-చ.
తురగము డిగ్గి తల్లడముతో శతధన్వుఁడు పాదచారియై
పరువిడఁ బోకు పోకు మని పద్మదళాక్షుఁడు గూడఁ బాఱి భీ
కరగతి వాని మస్తకము ఖండితమై పడ వ్రేసెఁ జక్రముం
బరిహతదైత్యచక్రముఁ బ్రభాచయ మోదితదేవశక్రమున్.
10.2-91-వ.
ఇట్లు హరి శతధన్వుని వధియించి వాని వస్త్రంబులందు మణి వెదకి లేకుండటఁ దెలిసి బలభద్రునికడకు వచ్చి “శతధన్వుం డూరక హతుం డయ్యె, మణి లే” దనిన బలభద్రుం డిట్లనియె.

భావము:
ఆ విధంగా అక్రూరుడు అనగానే, శతధన్వుడు శమంతకమణిని అక్రూరుడికి ఇచ్చి, భయంతో గుఱ్ఱమెక్కి నూరుయోజనల దూరం పారిపోయాడు. గరుడధ్వజం వెలుగొందే రథం ఎక్కి రామకృష్ణులు అతనిని వెంటాడారు. శతధన్వుడు మిథిలానగరం చేరాడు. అక్కడ శతధన్వుడు గుఱ్ఱం దిగి వేగంగా పరిగెత్తుతుండగా, శ్రీకృష్ణుడు “పోకు పోకు” అంటూ అతడిని వెంటాడి, రాక్షసులను సంహరించేదీ, దేవతలను తన ప్రభలతో సంతోషింపజేసేది అయిన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రఘాతానికి శతధన్వుడి శిరస్సు భయంకరంగా తెగి క్రింద పడింది. శ్రీకృష్ణుడు శతధన్వుడిని సంహరించి అతని దగ్గర వెతికాడు కాని, శమంతకమణి కన్పించలేదు. అంతట బలరాముడి దగ్గరకు వచ్చి “శతధన్వుడు అనవసరంగా చచ్చిపోయాడు. అతడి దగ్గర మణి లేదు” అని చెప్పాడు. అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=12&Padyam=91

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 186

( శతధన్వుఁడు మణి గొనిపోవుట )

10.2-87-వ.
అని యుత్తరంబు సెప్పిన విని శతధన్వుం డక్రూరుని యింటికిం జని హరితోడ పగకుందోడు రమ్మని చీరిన నక్రూరుండు హరి బలపరాక్రమ ధైర్యస్థైర్యంబు లుగ్గడించి మఱియు నిట్లనియె.
10.2-88-సీ.
"ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై-
  పుట్టించు రక్షించుఁ బొలియఁ జేయు,
నెవ్వనిచేష్టల నెఱుఁగరు బ్రహ్మాదు-
  లెవ్వని మాయ మోహించు భువన,
మేడేండ్లపాపఁడై యే విభుఁ డొకచేత-
  గో రక్షణమునకై కొండ నెత్తె,
నెవ్వఁడు కూటస్థుఁ డీశ్వరుఁ డద్భుత-
  కర్ముఁ డనంతుండు కర్మసాక్షి,
10.2-88.1-తే.
యట్టి ఘనునకు శౌరికి ననవరతము
మ్రొక్కెదము గాక; విద్వేషమునకు నేము
వెఱతు మొల్లము నీ వొండు వెంటఁ బొమ్ము
చాలు పదివేలువచ్చె నీ సఖ్యమునను."

భావము:
కృతవర్మ ఇలా పలుకగా విని శతధన్వుడు అక్రూరుని ఇంటికి వెళ్ళి సహాయం చేయమని అర్థించాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని బలపరాక్రమాలనూ ధైర్యస్థైర్యాలనూ నొక్కి చెప్పి. ఇంకా ఇలా చెప్పాడు. “ఎవరు ఈ ప్రపంచాన్ని లీలామాత్రంగా పుట్టించి, రక్షించి నశింపజేస్తాడో? ఎవని కృత్యాలు బ్రహ్మాది దేవతలు కూడా తెలియలేరో? ఎవరి మాయ ఈ లోకాన్ని మోహింపజేస్తుందో? ఎవడు ఏడేండ్ల వయస్సులోనే గోవులను రక్షించడానికై పర్వతాన్ని ఒకచేత్తో పైకెత్తిపట్టాడో? ఎవడు కూటస్థుడో? పరమేశ్వరుడో? అద్భుతాలు సాధించగలవాడో? అనంతుడో? కర్మసాక్షియో? అట్టి మహానుభావుడైన వాసుదేవునికి ఎల్లప్పుడూ నమస్కరించేవారమే కానీ, వైరానికి రాము నీవు మరో మార్గం ఆలోచించుకో. నీ స్నేహం వలన మా కింత జరిగింది చాలు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=11&Padyam=88

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, March 29, 2021

శ్రీకృష్ణ విజయము - 185

( శతధన్వుఁడు మణి గొనిపోవుట )

10.2-85-వ.
ఇట్లు హతుం డైన తండ్రిం గని శోకించి సత్యభామ యతనిం దైలద్రోణియందుఁ బెట్టించి హస్తిపురంబునకుం జని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు నీశ్వరులయ్యును మనుష్య భావంబుల విలపించి; రంత బలభద్ర సత్యభామా సమేతుండై హరి ద్వారకా నగరంబునకు మరలివచ్చి శతధన్వుం జంపెద నని తలంచిన; నెఱింగి శతధన్వుండు ప్రాణభయంబునఁ గృతవర్ము నింటికిం జని తనకు సహాయుండవు గమ్మని పలికినం గృతవర్మ యిట్లనియె.
10.2-86-ఉ.
"అక్కట! రామకృష్ణులు మహాత్ములు వారల కెగ్గు సేయఁగా
నిక్కడ నెవ్వఁ డోపు? విను మేర్పడఁ గంసుఁడు బంధుయుక్తుఁడై
చిక్కఁడె? మున్ను మాగధుఁడు సేనలతోఁ బదియేడు తోయముల్‌
దిక్కులఁ బాఱఁడే! మనకు దృష్టము, వారల లావు వింతయే? "

భావము:
సత్యభామ తండ్రి మరణానికి దుఃఖించి తండ్రి శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టించి, హస్తినాపురానికి వెళ్ళి శ్రీకృష్ణునితో సత్రాజిత్తు మరణం విషయం చెప్పింది. బలరామకృష్ణులు భగవంతులై ఉండి కూడా మనుష్య భావంతో దుఃఖించారు. బలరామ, సత్యభామలతో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. శతధన్వుడు ప్రాణభయంతో కృతవర్మ ఇంటికి వెళ్ళి తనకు సహాయపడ మని కోరాడు. అప్పుడు, శతధన్వునితో కృతవర్మ ఇలా అన్నాడు. “అయ్యో! ఎంత పనిచేశావు. బలరామకృష్ణులు మహానుభావులు. వారిని ఎదుర్కొని కీడు చేయగల సమర్ధులు ఇక్కడ ఎవరు లేరు. కంసుడు బంధు మిత్ర సమేతంగా నేలకూలలేదా? జరాసంధుడు పదిహేడు పర్యాయాలు పరాజితుడు కాలేదా? వారి పరాక్రమాలు మనకు క్రొత్త ఏమీ కాదు కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=11&Padyam=86

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 184

( శతధన్వుఁడు మణి గొనిపోవుట )

10.2-83-వ.
అంత నక్కడఁ గుంతీసహితులయిన పాండవులు లాక్షాగారంబున దగ్ధులైరని విని నిఖిలార్థ దర్శనుండయ్యును, గృష్ణుండు బలభద్ర సహితుండై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మ ద్రోణులం గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుండె; నయ్యెడ.
10.2-84-సీ.
జగతీశ! విన వయ్య శతధన్వుఁ బొడగని-
  యక్రూర కృతవర్మ లాప్తవృత్తి
"మన కిత్తు ననుచు సమ్మతిఁ జేసి తన కూఁతుఁ-
  బద్మాక్షునకు నిచ్చి పాడి దప్పె
ఖలుఁడు సత్రాజిత్తుఁ, డలయ కే క్రియ నైన-
  మణిపుచ్చుకొనుము నీమతము మెఱసి"
యని తన్నుఁ బ్రేరేఁప నా శతధన్వుఁడు-
  పశువుఁ గటికివాఁడు పట్టి చంపు
10.2-84.1-ఆ.
కరణి నిదురవోవఁ గడఁగి సత్రాజిత్తుఁ
బట్టి చంపి, వాని భామ లెల్ల
మొఱలువెట్ట లోభమునఁ జేసి మణి గొంచుఁ
జనియె నొక్క నాఁడు జనవరేణ్య!

భావము:
ఇంతలో అక్కడ లక్కఇంటిలో పాండవులు కుంతీ సహితంగా దగ్ధమయ్యారు అని శ్రీకృష్ణుడు విన్నాడు. సర్వము తెలిసిన వాడై కూడా, ఆయన బలరాముడి తోపాటు హస్తినాపురానికి వెళ్ళి కృప, విదుర, గాంధారీ, భీష్మ, ద్రోణులను ఓదార్చాడు. ఓ పరీక్షన్నరేంద్రా! అక్రూరుడూ, కృతవర్మా, శతధన్వుడిని కలిసి “దురామార్గుడైన సత్రాజిత్తు సత్యభామను మనకు ఇస్తానని చెప్పి, శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసి మాట తప్పాడు. నీవు ఏదో విధంగా శమంతకమణిని గ్రహించు” అని ప్రేమ ఒలకబోస్తూ ప్రేరేపించారు. శతధన్వుడు కసాయివాడు పశువును పట్టుకుని చంపినట్లుగా, నిద్రపోతున్న సత్రాజిత్తును బలవంతంగా చంపివేశాడు. సత్రాజిత్తు భార్యలు రోదిస్తుండగా లోభంతో మణిని తీసుకుపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=11&Padyam=84

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, March 26, 2021

శ్రీకృష్ణ విజయము - 183

( సత్యభామా పరిణయంబు )

10.2-80-మ.
అని యిబ్భంగి బహుప్రకారముల నేకాంతస్థుఁడై యింటిలోఁ
దన బుద్ధిం బరికించి నీతి గని, సత్రాజిత్తు సంప్రాప్త శో
భనుఁడై యిచ్చె విపత్పయోధితరికిన్ భామామనోహారికిన్
దనుజాధీశవిదారికిన్ హరికిఁ గాంతారత్నమున్ రత్నమున్.
10.2-81-ఉ.
తామరసాక్షుఁ డచ్యుతుఁ డుదారయశోనిధి పెండ్లియాడె నా
నా మనుజేంద్ర నందిత గుణస్థితి లక్షణ సత్యభామ ను
ద్దామ పతివ్రతాత్వ నయ ధర్మ విచక్షణతా దయా యశః
కామను సత్యభామను ముఖద్యుతినిర్జితసోమ నయ్యెడన్.
10.2-82-క.
"మణి యిచ్చినాఁడు వాసర
మణి నీకును; మాకుఁ గలవు మణులు; కుమారీ
మణి చాలు నంచుఁ గృష్ణుఁడు
మణి సత్రాజిత్తునకును మరలఁగ నిచ్చెన్. "

భావము:
ఇలా సత్రాజిత్తు రకరకాలుగా తన ఇంట్లో ఏకాంతంగా ఆలోచించుకొని, చేయవలసినది నిశ్చయించుకుని స్థిమిత పడి. ఆపదలనే సముద్రాలను తరింపచేసేవాడూ, కాంతల హృదయాలను దోచేవాడూ, రాక్షసేంద్రులను సంహరించేవాడూ అయిన శ్రీకృష్ణుడికి తన పుత్రికారత్నం సత్యభామనూ, శమంతకమణిని సమర్పించాడు. పద్మనేత్రుడు అచ్యుతుడు మిక్కిలి కీర్తిశాలి అయిన శ్రీకృష్ణుడు; సకలరాజులచే సద్గుణవతిగా కీర్తింపబడి, గొప్ప పాతివ్రత్యమూ నీతి ధర్మవిచక్షణత్వమూ దయ కీర్తికాంక్ష కలిగిన ఆ చంద్రముఖిని సత్యభామను పెండ్లాడాడు. “ఈ శమంతకమణిని సూర్యభగవానుడు నీకు ప్రసాదించాడు. మాకు మణులకు కొదువ లేదు. ఈ కన్యామణి చాలు” అని శ్రీకృష్ణుడు శమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=10&Padyam=82

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 182

( సత్రాజితునకు మణి దిరిగి యిచ్చుట)

10.2-78-మ.
మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభియోగంబు సే
సితిఁ? బాపాత్ముఁడ, నర్థలోభుఁడను, దుశ్చిత్తుండ, మత్తుండ, దు
ర్మతి నీ దేహముఁ గాల్పనే? దురితమే మార్గంబునం బాయు? నే
గతిఁ గంసారి ప్రసన్నుఁ డై మనుచు నన్ గారుణ్య భావంబునన్?
10.2-79-ఆ.
మణిని గూఁతు నిచ్చి మాధవు పదములు
పట్టుకొంటినేని బ్రదుకు గలదు
సంతసించు నతఁడు సదుపాయమగు నిది
సత్య మితర వృత్తిఁ జక్కఁబడదు. "

భావము:
మౌనంగా ఊరుకోకుండా, ఎందుకు కృష్ణుడిపై నిందవేశాను? నేను పాపాత్ముడను, ధనాశాపరుడును, దుష్టుడను, దుర్మతిని, మత్తుడను, ఈ నా శరీరం కాల్చనా? నా పాపం ఏవిధంగా తొలగిపోతుంది? ఏరీతిగా శ్రీకృష్ణుడు ప్రసన్నుడై నన్నుకనికరంతో రక్షిస్తాడు? ఈ శమంతకమణినీ, మణితోపాటు నా కూతురినీ ఇచ్చి మాధవుడి పాదాలు పట్టుకుంటాను. అప్పుడే నా జీవితం చక్కన అవుతుంది. కృష్ణుడు సంతోషిస్తాడు. మరేం చేసినా ఈ పరిస్థితి చక్కబడదు. ఇది సత్యం.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=9&Padyam=79

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, March 25, 2021

శ్రీకృష్ణ విజయము - 181

( సత్రాజితునకు మణి దిరిగి యిచ్చుట)

10.2-76-వ.
ఇట్లు హరి దన పరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, తద్వృత్తాంతం బంతయు నెఱిగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె; నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు, బలవద్విరోధంబునకు వెఱచుచు నింటికిఁ జని.
10.2-77-క.
"పాపాత్ముల పాపములం
బాపంగా నోపునట్టి పద్మాక్షునిపైఁ
బాపము గల దని నొడివిన
పాపాత్ముని పాపమునకుఁ బారము గలదే?

భావము:
ఈలాగున శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతీదేవిని చేపట్టి, రాజసభకు సత్రాజిత్తును రప్పించి, జరిగిన విషయమంతా చెప్పి, మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని తీసుకుని పశ్చాత్తాపం చెందాడు. బలవంతుడితో విరోధం వచ్చిందే అని భయపడుతూ ఇంటికి చేరాడు. “పాపాత్ములైన వారి పాపాలన్నిటినీ పోగొట్టగలిగిన వాడు అయిన ఆ పద్మాలవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి మీదనే అపనిందవేశాను. ఈ నా పాపానికి అంతం ఉందా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=9&Padyam=77

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 180

( జాంబవతి పరిణయంబు )

10.2-73-క.
డోలాయిత మానసులై
జాలింబడి జనులు గొలువఁ జండిక పలికెన్
"బాలామణితో మణితో
హేలాగతి వచ్చు నంబుజేక్షణుఁ" డనుచున్.
10.2-74-క.
యత్నము సఫలం బయిన స
పత్న సమూహములు బెగడఁ బద్మాక్షుం డా
రత్నముతోఁ గన్యాజన
రత్నముతోఁ బురికి వచ్చె రయమున నంతన్.
10.2-75-క.
మృతుఁ డైనవాఁడు పునరా
గతుఁడైన క్రియం దలంచి కన్యామణి సం
యుతుఁడై వచ్చిన హరిఁ గని
వితతోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్‌.

భావము:
ప్రజలు ఇలా సంశయాత్మకులై దీనంగా ప్రార్థించగా “మణితో, బాలామణితో పద్మాక్షుడు అనాయాసంగా తిరిగి వస్తా”డని దుర్గాదేవి పలికింది. ఇంతలో విరోధులందరూ బెదరిపోయేలా తన ప్రయత్నాన్ని సఫలం చేసుకుని మణితో, బాలామణితో శ్రీకృష్ణుడు వేగంగా ద్వారకాపురం చేరాడు. కన్యాకమణితో వచ్చిన శ్రీహరిని గాంచి మరణించినవాడు తిరిగి వచ్చినంతగా ద్వారకాపుర పౌరులు ఎంతో వేడుకతో సంతోషించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=75

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, March 24, 2021

శ్రీకృష్ణ విజయము - 179

( జాంబవతి పరిణయంబు )

10.2-70-క.
"ఈ మణి మాచేఁ బడె నని
తామసు లొనరించు నింద దప్పెడు కొఱకై
నీ మందిర మగు బిలమున
కే మరుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే! "
10.2-71-వ.
అనిన విని సంతసించి జాంబవంతుఁడు మణియునుం, దన కూఁతు జాంబవతి యను కన్యకామణియునుం దెచ్చి హరికిం గానికఁగా సమర్పించె; నటమున్న హరివెంట వచ్చిన వారలు బిలంబువాకిటం బండ్రెండు దినంబులు హరిరాక కెదురుచూచి వేసరి వగచి పురంబునకుం జని; రంత దేవకీవసుదేవులును రుక్మిణియును మిత్ర బంధు జ్ఞాతి జనులును గుహ సొచ్చి కృష్ణుండు రాక చిక్కె నని శోకించి.
10.2-72-క.
"దుర్గమ మగు బిలమున హరి
నిర్గతుఁడై చేరవలయు నేఁ" డని పౌరుల్‌
వర్గములై సేవించిరి
దుర్గం గృతకుశలమార్గఁ దోషితభర్గన్.

భావము:
“ఓ భల్లూకరాజా! ఈ శమంతకమణిని నేను అపహరించాను అని అజ్ఞానులు నాపై అపనింద వేసారు. దానిని తొలగించుకోవడానికి నీ మందిరమైన ఈ గుహకు నేను వచ్చాను.” అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో. జాంబవంతుడు సంతోషించి, శమంతకమణిని ఆ మణితోపాటే తన కుమార్తె అయిన జాంబవతి అనే పేరు కల కన్యకామణిని తెచ్చి హరికి కానుకగా ఇచ్చాడు. అక్కడ శ్రీకృష్ణుడితో పాటు వచ్చి గుహద్వారం దగ్గర నిలచిన వారందరూ పన్నెండు రోజులు శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూసి, వేసారి, దుఃఖించి, ద్వారకకు తిరిగివెళ్ళారు. దేవకీ వసుదేవులు రుక్మిణి తక్కిన బంధుమిత్రులు దాయాదులు గుహలో ప్రవేశించిన కృష్ణుడు తిరిగిరా నందుకు శోకించి దుర్గమమైన ఆ బిలంలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పౌరులంతా, క్షేమకర మైన దారిని అనుగ్రహించే తల్లి, దుర్గాదేవిని ప్రార్థించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=72

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 178

( జాంబవతి పరిణయంబు )

10.2-68-సీ.
"బాణాగ్ని నెవ్వఁడు పఱపి పయోరాశి-
  నింకించి బంధించి యేపు మాపెఁ
బరఁగ నెవ్వఁడు ప్రతాపప్రభారాశిచే-
  దానవగర్వాంధతమస మడఁచెఁ
గంజాతములు ద్రెంచు కరిభంగి నెవ్వఁడు-
  దశకంఠుకంఠబృందములు ద్రుంచె
నా చంద్రసూర్యమై యమరు లంకారాజ్య-
  మునకు నెవ్వఁడు విభీషణుని నిలిపె
10.2-68.1-తే.
నన్ను నేలిన లోకాధినాథుఁ డెవ్వఁ
డంచితోదారకరుణారసాబ్ధి యెవ్వఁ
డాతఁడవు నీవ కావె; మహాత్మ! నేఁడు
మాఱుపడి యెగ్గు సేసితి మఱవవలయు. "
10.2-69-వ.
అని యిట్లు పరమభక్తుండయిన జాంబవంతుండు వినుతించిన నతని శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి దన కరంబున నతని మేను నిమిరి గంభీరభాషణంబుల నిట్లనియె.

భావము:
“ఎవరు బాణాగ్నిచే సముద్రాన్ని ఇంకించి, సేతువు కట్టి సాగరుని గర్వం మాపెనో; రాక్షసుల గర్వమనే చీకటిని ప్రతాపమనే కాంతిరాశిచే అణచివేసెనో; పద్మాలను త్రెంచే ఏనుగులాగ రావణాసురుని శిరస్సులు త్రెంచెనో; ఆచంద్రార్క మైన లంకారాజ్యానికి విభీషణుని రాజుచేసెనో; ఆ నన్నేలిన కరుణాసముద్రుడు, లోకనాథుడు నీవే కదా మహాత్మా! పొరబడి నీకు అపచారం చేసాను. నన్ను మన్నించు.” అని ఈ విధంగా పరమభక్తుడైన ఆ జాంబవంతుడు శ్రీకృష్ణుడిని స్తుతించాడు. అంత, భక్తవత్సలుడైన శ్రీహరి తన చేతితో జాంబవంతుడి శరీరం నిమిరి యుద్ధంవలన కలిగిన శ్రమను తొలగించి గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=68

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, March 20, 2021

శ్రీకృష్ణ విజయము - 177

( జాంబవతి పరిణయంబు )

10.2-66-శా.
స్పష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్ భల్లూకలోకేశుఁడున్
ముష్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచోఁ
బుష్టిం బాసి ముకుంద ముష్టిహతులం బూర్ణశ్రమోపేతుఁడై
పిష్టాంగోరు శరీరుఁడై యతఁడు దా భీతాత్ముఁడై యిట్లనున్.
10.2-67-వ.
“దేవా! నిన్నుఁ బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్ణు నెఱుంగుదు; సర్వభూతంబులకుం బ్రాణ ప్రతాప ధైర్యబలంబులు నీవ; విశ్వంబునకు సర్గస్థితిలయంబు లెవ్వరాచరింతురు, వారికి సర్గ స్థితిలయంబులఁ జేయు నీశ్వరుండవు నీవ; యాత్మవు నీవ” యని మఱియును.

భావము:
కృష్ణ జాంబవంతులు ఇలా విజయం పొందాలనే కోరికతో అహోరాత్రాలు ముష్టాముష్టిగా పోరాడగా పోరాడగా. (ఇరవై ఎనిమిది రోజులకు) శ్రీకృష్ణుడి పిడికిలిపోట్లకు జాంబవంతుడి బలం తరిగిపోయింది. అలసట అధికమైంది. అవయవాలన్నీ పిండి పిండి అయిపోయాయి. అప్పుడు జాంబవంతుడు భయకంపితుడై కృష్ణపరమాత్మునితో ఇలా అన్నాడు. “దేవా! పురాణపూరుషుడవు; జగన్నాయకుడవు; విష్ణుడవు; ప్రభవిష్ణుడవు; నీవని నేను తెలుసుకున్నాను; సర్వప్రాణులకూ ప్రాణము, ప్రతాపము, ధైర్యము, బలము నీవే; ఈ ప్రపంచము సృష్టికి, స్థితికీ, వినాశనానికి ఎవరు కారకులో వారి సృష్టి స్థితి లయాలు చేసే పరమేశ్వరుడవు; ఆత్మస్వరూపుడవు నీవే.” అని ఇంకా ఇలా స్తుతించాడు


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=67

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 176

( జాంబవతి పరిణయంబు )

10.2-63-వ.
అంత నా ధ్వని విని బలవంతుండైన జాంబవంతుఁడు వచ్చి తన స్వామి యని కృష్ణు నెఱుంగక ప్రాకృత పురుషుండని తలంచి కృష్ణునితో రణంబు చేసె; నందు.
10.2-64-క.
పలలమునకుఁ బోరెడు డే
గల క్రియ శస్త్రములఁ దరులఁ గరముల విజయే
చ్ఛల నిరువదియెనిమిది దిన
ములు వోరిరి నగచరేంద్రముఖ్యుఁడు హరియున్.
10.2-65-క.
అడిదములుఁ దరులు విఱిగిన
బెడిదము లగు మగతనములు బిఱుతివక వడిం
బిడుగులవడువునఁ బడియెడి
పిడికిటిపోటులను గలన బెరసి రిరువురున్.

భావము:
దాది వేసిన కేక విని మహాబలశాలి అయిన జాంబవంతుడు అక్కడకు వచ్చాడు. శ్రీకృష్ణుడు తన ప్రభువే (శ్రీరాముడే) అని గ్రహించక, సామాన్య మానవు డని భావించి కృష్ణుడితో యుద్ధం చేయడానికి తలపడ్డాడు. అప్పుడు మాంసం కోసం పోరాడే డేగల లాగ; కృష్ణుడు, జాంబవంతుడు ఆ శమంతకమణి కోసం ఆయుధాలతో, చెట్లతో, చేతులతో ఒకరి నొకరు జయించాలనే కోరికతో ఇరవైఎనిమిది రోజులు పోరాడారు. కత్తులు, చెట్లు విరిగిపోయినా, వెనుకంజ వేయకుండా మిక్కిలి పౌరుషంతో పిడుగుల వంటి పిడికిలిపోట్లతో వారిరువురూ క్రూరంగా పోరాడారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=64

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, March 18, 2021

శ్రీకృష్ణ విజయము - 175

( సత్రాజితుని నిందారోపణ )

10.2-61-వ.
కని తన వెంట వచ్చిన ప్రజల నెల్ల గుహాముఖంబున విడిచి, సాహసంబున మహానుభావుం డైన హరి నిరంతర నిబిడాంధకార బంధురంబయి, భయంకరంబై, విశాలంబయిన గుహాంతరాళంబు సొచ్చి; చని యక్కడ నొక్క బాలున కెదురు దర్శనీయ కేళీకందుకంబుగా వ్రేలంగట్టఁబడిన యమ్మణి శ్రేష్ఠంబుఁ గని హరింప నిశ్చయించి.
10.2-62-క.
మెల్లన పదము లిడుచు యదు
వల్లభుఁ డా శిశువుకడకు వచ్చిన, గుండెల్‌
జల్లనఁగఁ జూచి, కంపము
మొల్లంబుగ దానిదాది మొఱపెట్టె నృపా!

భావము:
తన వెంట వచ్చిన ప్రజలందరినీ గుహ ద్వారం దగ్గర వదలి, శ్రీకృష్ణుడు సాహసంతో దట్టమైన చీకటితో నిండి భయంకరంగా ఉన్న విశాలమైన గుహ లోపలకు వెళ్ళాడు. అక్కడ ఒక బాలుడికి ఎదురుగా ఆటబంతిగా వేలాడదీసిన శమంతకమణిని చూసాడు. దానిని తీసుకుందామని తలచి ఓ రాజా పరీక్షిత్తూ! యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు మెల్ల మెల్లని అడుగులు వేస్తూ ఆ శిశువు దగ్గరకు రాసాగాడు. (అకస్మాత్తుగా) చూసిన దాది గుండెలు గుభిల్లు మనగా పెద్ద కేక పెట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=7&Padyam=62

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 174

( సత్రాజితుని నిందారోపణ )

10.2-57-వ.
అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునిం గానక దుఃఖించుచు.
10.2-58-మ.
"మణి కంఠంబునఁ దాల్చి నేఁ డడవిలో మావాఁడు వర్తింపఁగా
మణికై పట్టి వధించినాఁడు హరికిన్ మర్యాద లే" దంచు దూ
షణముం జేయఁగ వాని దూషణముఁ గంసధ్వంసి యాలించి యే
వ్రణమున్ నా యెడ లేదు, నింద గలిగెన్ వారించు టే రీతియో?
భావము:
ఇక్కడ మథురలో సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడు వేటకుపోయి తిరిగి రానందుకు ఎంతగానో దుఃఖిస్తూ.....
10.2-59-వ.
అని వితర్కించి.
10.2-60-మ.
తనవారెల్లఁ బ్రసేనుజాడఁ దెలుపం దర్కించుచున్ వచ్చి, త
ద్వనవీథిం గనె నేలఁ గూలిన మహాశ్వంబుం బ్రసేనుం, బ్రసే
నుని హింసించినసింహమున్, మృగపతిన్ నొప్పించిఖండించి యేఁ
గిన భల్లూకము సొచ్చియున్న గుహయుం గృష్ణుండు రోచిష్ణుఁడై.

భావము:
“నా తమ్ముడు శమంతకమణిని ధరించి అడవికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు శమంతకమణి కోసం మా తమ్ముణ్ణి చంపేసాడు. హరికి ఏమాత్రం మర్యాద లే”దని దూషించసాగాడు. ఆ దూషణ వాక్యాలు వినిన శ్రీకృష్ణుడు నాలో ఏ దోషమూ లేదు. ఇలా నాపై బడ్డ ఈ అపనిందని నేనెలా తొలగించుకోవాలి అని ఆలోచించాడు. ఇలా ఆలోచించి తనవారు అడవిలో ప్రసేనుడు వెళ్ళిన జాడ చూపగా, వెదుకుతూ వచ్చి అరణ్యంలో నేలకూలిన గుఱ్ఱాన్ని, ప్రసేనుణ్ణి చంపిన సింహాన్ని, సింహాన్ని చంపి ఎలుగుబంటి వెళ్ళిన గుహనూ కృష్ణుడు ఆసక్తితో వీక్షించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=7&Padyam=60

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, March 17, 2021

శ్రీ కృష్ణ విజయము - 173

( ప్రసేనుడు వధింపబడుట )

10.2-54-వ.
అంత.
10.2-55-చ.
అడరెడు వేడ్కఁ గంఠమున నమ్మణిఁ దాల్చి, ప్రసేనుఁ డొక్క నాఁ
డడవికి ఘోరవన్యమృగయారతి నేగిన, వానిఁ జంపి పైఁ
బడి మణిఁ గొంచు నొక్క హరి పాఱఁగ, దాని వధించి డాసి యే
ర్పడఁ గనె జాంబవంతుఁడు ప్రభాత్తదిగంతము నా శమంతమున్.
10.2-56-క.
కని జాంబవంతుఁ డా మణిఁ
గొనిపోయి సమీప శైలగుహఁ జొచ్చి ముదం
బునఁ దన కూరిమిసుతునకు
ఘనకేళీకందుకంబుగాఁ జేసె, నృపా!

భావము:
అలా మహారాజుకి ఇవ్వకుండా సత్రాజిత్తు శమంతక మణిని తన ఇంటికి తీసుకుపోయిన అనంతరం ప్రసేనుడు సత్రాజిత్తు తమ్ముడు. అతను ఎంతో కుతూహలంతో శమంతకమణిని కంఠమున ధరించి క్రూరమృగాలను వేటాడే నిమిత్తం అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక సింహం ప్రసేనుడిని చంపి, ఆ మణిని నోట కరచుకుని వెళ్తుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి సకల దిక్కులను వెలుగులు నింపుతున్న ఆ మణిని చూసాడు. జాంబవంతుడు ఆ మణి మెఱుగులు చూసి తీసుకుని దగ్గరలో నున్న కొండగుహ లోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన ప్రియకుమారునికి ఆటబంతిగా ఆనందంగా ఆ మణిని అమర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=6&Padyam=56

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 172

( శమంతకమణి పొందుట )

10.2-51-వ.
అని యిట్లు పలికిన మూఢజనులఁ జూచి గోవిందుండు నగి మణి సమేతుండైన సత్రాజితుండుగాని సూర్యుండు గాఁడని పలికె; నంత సత్రాజితుండు శ్రీయుతంబయి మంగళాచారంబైన తన గృహంబునకుం జని, మహీసురులచేత నిజదేవతా మందిరంబున నమ్మణి శ్రేష్ఠంబు ప్రవేశంబు సేయించె; నదియును బ్రతిదినంబు నెనిమిది బారువుల సువర్ణంబు గలిగించు చుండు.
10.2-52-క.
ఏ రా జేలెడు వసుమతి
నా రత్నము పూజ్యమానమగు నక్కడ రో
గారిష్ట సర్వ మాయిక
మారీ దుర్భిక్ష భయము మాను; నరేంద్రా!
10.2-53-క.
అమ్మణి యాదవ విభునకు
నిమ్మని హరి యడుగ నాతఁ డీక ధనేచ్ఛం
బొమ్మని పలికెను, జక్రికి
నిమ్మణి యీకున్న మీఁద నేమౌ ననుచున్.

భావము:
అని తనకు చెప్తున్న అమాయకుల మాటలకు నవ్వి శ్రీకృష్ణుడు “అతడు సత్రాజిత్తు మణిని ధరించి వస్తున్నాడు. అంతే తప్ప, సూర్యుడు కాదు” అని చెప్పాడు. అనంతరం సత్రాజిత్తు మంగళ ఆచారాలతో శ్రీమంతమైన తన ఇంటికి వెళ్ళి, దేవతామందిరంలో శమంతకమణిని బ్రాహ్మణుల చేత ప్రవేశపెట్టించాడు. ఆ మణి రోజుకి ఎనిమిది బారువుల చొప్పున ప్రతి రోజు బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఓ పరీక్షన్మహారాజా! ఏ ప్రభువు పరిపాలించే దేశంలో ఆ శమంతక రత్నం పూజింపబడుతూ ఉంటుందో ఆ రాజ్యంలో, రోగాలు, అరిష్టాలూ, కరువుకాటకాలూ ఉండవు. శమంతకమణిని యాదవుల ప్రభువైన ఉగ్రసేన మహారాజునకు ఇమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తును అడిగాడు. ధనం మీది లాలసతో సత్రాజిత్తు శ్రీకృష్ణునకు ఈ మణిని ఇవ్వకపోయినా ఏం కాదులే అని నిరాకరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=5&Padyam=53

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, March 16, 2021

శ్రీకృష్ణ విజయము - 171

( శమంతకమణి పొందుట )

10.2-48-వ.
అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె. "సత్రాజిత్తనువాఁడు సూర్యునకు భక్తుండై చెలిమి, సేయ నతనివలన సంతసించి సూర్యుండు శమంతకమణి నిచ్చె; నా మణి కంఠంబున ధరియించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుం డై ద్వారకానగరంబునకు వచ్చిన; దూరంబున నతనిం జూచి జనులు మణిప్రభాపటల తేజోహృతదృష్టులయి సూర్యుం డని శంకించి వచ్చి; హరి కిట్లనిరి.
10.2-49-క.
"నారాయణ! దామోదర!
నీరజదళనేత్ర? చక్రి! నిఖిలేశ! గదా
ధారణ! గోవింద! నమ
స్కారము యదుపుత్త్ర! నిత్యకల్యాణనిధీ!
10.2-50-మ.
దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ! నిన్ జూడ యా
దవ వంశంబున గూఢమూర్తివి జగత్త్రాణుండవై యుండఁగా
భవదీయాకృతిఁ జూడ నేఁడిదె రుచిప్రచ్ఛన్న దిగ్భాగుఁడై
రవియో, నీరజగర్భుఁడో యొకఁడు సేరన్ వచ్చె మార్గంబునన్. "

భావము:
రాజు పరీక్షిత్తు ఇలా అడుగగా శుకయోగి ఈలా చెప్పసాగాడు. ”సత్రాజిత్తు సూర్యుడిని భక్తితో ఆరాధించాడు. సూర్యుడు అతడి భక్తికి మెచ్చి సంతోషించి అతడికి శమంతకమణిని ఇచ్చాడు. ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సూర్యునిలా వెలిగిపోతూ ద్వారకకి వచ్చాడు. ద్వారకానివాసులు ఆ మణి కాంతులకు కన్నులుమిరుమిట్లు గొలుపగా సూర్యుడని భ్రాంతిపడి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా విన్నవించారు. “నారాయణా! దామోదరా! పుండరీకాక్షా! చక్రాయుధా! సర్వేశ్వరా! గదాధారీ! గోవిందా! యదునందనా! నిత్యకల్యాణనిధి! నీకు నమస్కారం. ఓ దేవాధిదేవా! నీ దర్శనాన్ని దేవతలు సైతం కోరుకుంటారు. యాదవవంశంలో అవతరించి జగద్రక్షుకుడవై ఉన్న నిన్ను సకల దిక్కులలోనూ కాంతులు వెదజల్లుతూ సూర్యుడో, బ్రహ్మదేవుడో, ఎవడో నిన్ను దర్శించడానికి వస్తున్నాడు."

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=5&Padyam=50

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 170

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-45-క.
"సత్రాజిత్తు నిశాచర
శత్రునకుం గీడు సేసి సద్వినయముతోఁ
బుత్రి, శమంతకమణియును
మైత్రిం గొని తెచ్చి యిచ్చె మనుజాధీశా! "
10.2-46-వ.
అనిన విని రా జిట్లనియె.
10.2-47-ఆ.
"శౌరి కేమి తప్పు సత్రాజితుఁడు సేసెఁ?
గూఁతు మణిని నేల కోరి యిచ్చె?
నతని కెట్లు కలిగె నా శమంతకమణి
విప్రముఖ్య! నాకు విస్తరింపు. "

భావము:
“ఓ పరీక్షిత్తు మహారాజా! సత్రాజిత్తు శ్రీకృష్ణుడి పట్ల అపచారం చేసాడు. పిమ్మట పశ్చాత్తాప పడి, మంచి వినయంతో శమంతకమణినీ తన పుత్రికామణినీ మైత్రీభావంతో తీసుకువచ్చి సమర్పించాడు.” అని శుకమహర్షి చెప్పగా వినిన పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! శ్రీకృష్ణుడిపట్ల సత్రాజిత్తు ఏమి అపరాధం చేసాడు. శమంతకమణినీ తన కూతురుని ఎందుకు కోరి కోరి ఇచ్చాడు. అతనికి శమంతకమణి ఎలా దొరికింది. ఈ విశేషాలన్నీ నాకు వివరంగా చెప్పండి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=47

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, March 15, 2021

శ్రీకృష్ణ విజయము - 169

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-42-వ.
అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె; నంత ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి; రందు.
10.2-43-క.
సిరిపెనిమిటి పుత్త్రకుఁ డగు
మరుఁ గని హరిఁ జూచినట్ల మాతలు దమలోఁ
గరఁగుదు రఁట, పరకాంతలు
మరుఁ గని మోహాంధకార మగ్నలు గారే? "
10.2-44-వ.
అని చెప్పి శుకుం డిట్లనియె

భావము:
అంటూ రుక్మిణీదేవి తన కుమారుడిని చూసి ఎంతో ఆనందించింది. కోడలి సద్గుణాలను పొగుడుతూ, వేడుకలు చేయసాగింది. అంతట ఆ వార్త విని ద్వారకానగర వాసులు అందరూ ఎంతో సంతోషించారు. ప్రద్యుమ్నుడు శ్రీపతి కృష్ణుడి పుత్రుడు, పైగా స్వయంగా మన్మథుడు. అతడిని చూసిన తల్లులు శ్రీకృష్ణుడిని చూసినట్లే భావించి కరగిపోతారుట. ఇంక పరకాంతలు ఈ మన్మథుడిని చూసి మోహాంధకారంలో మునిగిపోరా?” అని చెప్పి శుకమహర్షి ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=43

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 168

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-39-క.
"చచ్చినబాలుఁడు గ్రమ్మఱ
వచ్చిన క్రియ వచ్చెఁ బెక్కువర్షములకు నీ
సచ్చరితు నేఁడు గంటిమి;
చెచ్చెర మున్నెట్టి తపము సేయంబడెనో?"
10.2-40-వ.
అని యంతఃపుర కాంతలును, దేవకీవసుదేవ రామకృష్ణులును యథోచితక్రమంబున నా దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి; రుక్మిణీదేవియు నందనుం గౌఁగిలించు కొని.
10.2-41-శా.
"అన్నా! నా చనుఁ బాపి నిన్ను దనుజుం డంభోనిధిన్ వైచెనే
యెన్నే వర్షము లయ్యెఁ బాసి సుత! నీ వేరీతి జీవించి యే
సన్నాహంబున శత్రు గెల్చితివొ? యాశ్చర్యంబు సంధిల్లెడిన్
నిన్నుం గాంచితి నింతకాలమునకున్ నే ధన్యతం జెందితిన్. "

భావము:
“ఎన్ని ఏళ్ళకు ఈ బాలుడిని చూడగలిగాము. మరణించిన బాలుడు తిరిగి బ్రతికిరావడం లాంటిదే కదా ఇది. ఈ బాలుడిని తిరిగి చూడడానికి మనం పూర్వజన్మలో ఏం తపస్సులు చేశామో?” అని అనుకుంటూ అంతఃపుర కాంతలూ, దేవకీ వసుదేవులూ, బలరామ కృష్ణులూ మంచి మంచి వస్త్రాభరణాలతో రతీప్రద్యుమ్నులను సత్కరించి సంతోషించారు. రుక్మిణీదేవి తన కొడుకుని కౌగలించుకుని “నాయనా! రాక్షసుడు నిన్ను నానుండి వేరుచేసి నిన్ను సముద్రంలో పడేసి ఎన్నో సంవత్సరాలైంది. ఇన్నాళ్ళూ ఓ కుమారా! నీవు ఎలా బ్రతికావో, ఎలా ఆ రాక్షసుణ్ణి సంహరించావో? చాలా ఆశ్చర్యంగా వుంది. ఇంత కాలానికి మళ్ళీ నిన్ను చూసి నేను ధన్యురాలిని అయ్యాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=41

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, March 5, 2021

శ్రీకృష్ణ విజయము - 167

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-36-వ.
అని డోలాయమాన మానసయై వితర్కించుచు.
10.2-37-క.
తనయుఁ డని నొడువఁ దలఁచును;
దనయుఁడు గా కున్న మిగులఁ దతిగొని సవతుల్‌
తను నగియెద రని తలఁచు; న
తను సంశయ మలమికొనఁగఁ దనుమధ్య మదిన్.
10.2-38-వ.
ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలినగరి కావలివారివలన విని కృష్ణుండు దేవకీవసుదేవులం దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుండె; నంత నారదుండు సనుదెంచి శంబరుఁడు గుమారునిం గొనిపోవుట మొదలైన వార్త లెఱింగించిన.

భావము:
అని చెలికత్తెకు చెప్పి, ఎటూ తేల్చుకోలేని ఊగిసలాడుతున్న మనస్సుతో రుక్మిణీదేవి వితర్కించుకుంటూ. రుక్మిణీదేవి ఇతడు తన కొడుకే అని చెప్పబోతుంది. కాని అతడు తన కుమారుడు కాకపోతే సమయం చిక్కిందని తన సవతులు తనను గేలిచేస్తారేమో అనే సంశయంతో ఆలోచించుకోసాగింది. అలా ఒక ప్రక్క రుక్మిణీదేవి ఆలోచించుకుంటూ ఉండగా, అంతఃపురం కాపలాకాసే వారి వలన విషయం వినిన శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను వెంట తీసుకుని వచ్చాడు. తాను సర్వజ్ఞుడు అయినా వివరం చెప్పకుండా ఊరుకున్నాడు. ఇంతలో నారదుడు వచ్చి శంబరాసురుడు శిశువును తీసుకొని వెళ్ళడం మొదలైన విషయాలు అన్నీ వివరంగా తెలియజేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=38

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 166

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-33-క.
ఇందాఁక వాఁడు బ్రదికిన
సందేహము లేదు దేహచాతుర్యవయ
స్సౌందర్యంబుల లోకులు
వందింపఁగ నితనియంతవాఁ డగుఁ జుమ్మీ!
10.2-34-మ.
అతివా! సిద్ధము నాఁటి బాలకున కీ యాకార మీ వర్ణ మీ
గతి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీఁ
డతఁడే కాఁదగు నున్నవారలకు నా యాత్మేశు సారూప్య సం
గతి సిద్ధింపదు; వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్.
10.2-35-క.
పొదలెడి ముదమునఁ జిత్తము
గదలెడి నా యెడమమూఁపు, గన్నుల వెంటం
బొదలెడి నానందాశ్రులు
మెదలెడిఁ బాలిండ్లఁ బాలు; మేలయ్యెడినో!"

భావము:
ఇప్పటిదాకా నా కొడుకు బ్రతికే ఉండి ఉంటే ఇలా చక్కటి రూపు, వయస్సు, అందచందాలతో లోకులు పొగిడేలా, ఈతడి అంతటి వాడై ఉండే వాడు సుమా! మగువా! ఆనాటి నా కొడుక్కి ఈ రూపం; ఈ రంగూ; ఈ నవ్వూ; ఈ చూపులు; ఈ కంఠస్వరం; ఈ గంభీర్యం; ఈ కాంతి ఉండి ఉండేవి. ఇతడు నా పుత్రుడే అయ్యుండాలి, లేకపోతే వేరేవాడిలో నా భర్త శ్రీకృష్ణుడి పోలికలు ఎందుకుంటాయి. ఇతడి మీద నాకు ఎంతో అభిమానం కలుగుతోంది కూడా! ఆనందంతో నా హృదయం ఉప్పొంగుతోంది. నా ఎడమ బుజం అదురుతోంది. కళ్ళనుండి ఆనందాశ్రువులు రాలుతున్నాయి. పాలిండ్లలో పాలు జాలువారుతున్నాయి. ఏం మేలు జరుగబోతుందో?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=35

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, March 3, 2021

శ్రీకృష్ణ విజయము - 165

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-30-శా.
"ఈ కంజేక్షణుఁ డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం
డీ కంఠీరవమధ్యుఁ డిచ్చటికి నేఁ డెందుండి యేతెంచెనో
యీ కల్యాణునిఁ గన్న భాగ్యవతి మున్నే నోములన్ నోఁచెనో
యే కాంతామణియందు వీని కనెనో యేకాంతుఁ డీ కాంతునిన్.
10.2-31-శా.
ఆళీ! నా తొలుచూలి పాపనికి బోర్కాడించి నే సూతికా
శాలామధ్య విశాలతల్పగత నై చన్నిచ్చి నిద్రింప నా
బాలున్ నా చనుఁబాలకుం జెఱిచి యే పాపాత్ములే త్రోవ ము
న్నే లీలం గొనిపోయిరో? శిశువుఁ దా నే తల్లి రక్షించెనో!
10.2-32-క.
కొడుకఁడు నా పొదిగిఁటిలోఁ
జెడిపోయిన నాఁటనుండి చెలియా! తెలియం
బడ దే వార్తయు నతఁడే
వడువున నెచ్చోట నిలిచి వర్తించెడినో!

భావము:
ఈ చక్కటి పిల్లాడు, పద్మనేత్రుడు, చంద్రముఖుడు, సింహమధ్యముడు ఇక్కడకు ఎక్కడ నుండి వచ్చాడో. ఈ బాలుడిని కన్న భాగ్యవతి పూర్వజన్మలో ఏ నోములు నోచిందో? ఏ అందగాడు ఏ అందగత్తె యందు ఈ అందగాడిని కన్నాడో? ఓ చెలీ! నా తొలిచూలు బాలుడికి స్నానం చేయించి పురిటిగదిలో మంచంపై పడుకుని చన్నిచ్చి నిద్రపోతున్న సమయంలో, ఏ పాపాత్ములు నా పుత్రుడిని నా చనుబాలకు దూరంచేసి ఏవిధంగా దొంగిలించుకుని పోయారో? ఆ పిల్లవాడిని ఏ చల్లనితల్లి రక్షించిందో? చెలీ! నా కుమారుడు నా పొత్తిళ్ళ నుండి దూరమైన రోజు నుండి ఏ కబురూ తెలియరాలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=32

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 164

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-27-క.
కొందఱు హరి యగు నందురు,
కొందఱు చిహ్నములు కొన్నికొన్ని హరికి లే
వందురు, మెల్లనె తెలియుద
మందురు మరుఁ జూచి కొంద ఱబలలు గుములై.
10.2-28-క.
హరి యని వెనుచని పిదపన్
హరిఁ బోలెడువాఁడు గాని హరి గాఁ డనుచున్
హరిమధ్య లల్లనల్లన
హరినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్.
10.2-29-ఉ.
అన్నులు సేర వచ్చి మరు నందఱుఁ జూడఁగఁ దాను వచ్చి సం
పన్న గుణాభిరామ హరిపట్టపుదేవి విదర్భపుత్రి క్రే
గన్నుల నా కుమారకుని కైవడి నేర్పడఁ జూచి బోటితోఁ
జన్నులు సేఁప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్లఁగన్.

భావము:
ప్రద్యుమ్నుడిని చూసిన కొందరు స్త్రీలు “శ్రీ కృష్ణుడే” అని అనగా, మరికొందరు “శ్రీకృష్ణునిలో ఇతని లక్షణాలు కొన్ని లే”వని అన్నారు. ఇంకా కొందరు “నెమ్మదిగా ఈ విషయం తెలుసుకుందా”మని గుంపులు గుంపులుగా చేరి “శ్రీకృష్ణుడే” అని కొంతదూరం వెళ్ళి, “శ్రీకృష్ణుడిలా ఉన్నాడే కాని శ్రీకృష్ణుడు కా” డని అంటూ అంతఃపుర స్త్రీలు ఆశ్చర్యపోతూ శ్రీకృష్ణుడి కుమారు డైన ప్రద్యుమ్నుడిని సమీపించారు. స్త్రీ లందరూ ప్రద్యుమ్నుడిని చూడటానికి రాగా శ్రీకృష్ణుని పట్టపుదేవి, విదర్భ రాకుమారి, సుగుణాలదీవి అయిన రుక్మిణీదేవి క్రీగంటితో ఆ పిల్లవాని రూపురేఖలను చూసి పాలిండ్లు చేపగా దైన్య సంభ్రమాలు ముప్పిరిగొనగా చెలికత్తెతో ఇలా అంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=29

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, March 1, 2021

శ్రీకృష్ణ విజయము - 163 ( రతీప్రద్యుమ్నులాగమనంబు )



10.2-24-వ.
ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న యించువిలుకానిం గొంచు నాకాశచారిణియైన యా రతీదేవి, గగనపథంబుఁ బట్టి ద్వారకా నగరోపరిభాగమునకుం జనుదెంచిన.
10.2-25-ఆ.
మెఱుఁగుఁదీగెతోడి మేఘంబు కైవడి
యువిదతోడ మింటి నుండి కదలి
యరుగుదెంచె మదనుఁ డంగనాజనములు
మెలఁగుచున్న లోనిమేడకడకు.
10.2-26-మ.
జలదశ్యాముఁ బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్ నీల సం
కులవక్రాలకుఁ బీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహో
త్పలపత్త్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్ నీరజా
క్షులు దారేమఱుపాటఁ జూచి హరి యంచుం డాఁగి రయ్యైయెడన్.

భావము:
ఈ విధంగా శంబరుడిని సంహరించి శోభిస్తున్న ప్రద్యుమ్నుడిని తీసుకుని, ఖేచరి అయిన రతీదేవి ఆకాశమార్గం గుండా ద్వారకానగరం దగ్గరికి వచ్చింది. మాయాదేవితో కూడిన ప్రద్యుమ్నుడు మెఱుపుతీగతో కూడిన మేఘంలా శోభిస్తూ ఆకాశంలో నుండి దిగి స్త్రీలు నివసించే అంతఃపురం మేడ మీదకు చేరాడు. మేఘము వంటి నీలవర్ణ దేహము; ఆజాను బాహువులు; చంద్రుని బోలిన నెమ్మొగము; వ్యాపించిన నల్లని ఉంగరాల ముంగురులు; పచ్చని వస్త్రం; విశాల వక్షఃస్థలము; సన్నని నడుము; కలువరేకుల వంటి కన్నులు; మృదువైన చిరునవ్వు గల ప్రద్యుమ్నుడిని అక్కడి స్త్రీలు ఏమరుపాటుగా చూసి, శ్రీకృష్ణుడని భ్రమించి అక్కడి కక్కడ చాటులకు చేరారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=26

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 162

( శంబరోద్యగంబు )

10.2-22-క.
చిగురాకడిదపు ధారను
జగములఁ బరవశము సేయు చలపాదికి దొ
డ్డగు నుక్కడిదంబునఁ దన
పగతుం దెగ వ్రేయు టెంత పని చింతింపన్?
10.2-23-క.
బెగడుచు నుండఁగ శంబరుఁ
దెగడుచుఁ బూవింటిజోదు ధీరగుణంబుల్‌
వొగడుచుఁ గురిసిరి ముదమున
నెగడుచుఁ గుసుమముల ముసురు నిర్జరు లధిపా!

భావము:
చిగురాకు కత్తిపదునుతోనే ప్రపంచాన్ని లొంగదీయగల వాడు, అసమాన వీరుడు అయిన, ప్రద్యుమ్నుడికి పెద్ద ఉక్కుకత్తితో శత్రువు శిరస్సు ఖండించడం ఏమంత పెద్ద పని కాదు కదా. దేవతలు తాము బెదురుతూ బ్రతుకుతుండే, ఆ శంబరుణ్ణి సంహరించిన ప్రద్యుమ్నుడి ధైర్యాన్ని కీర్తిస్తూ, శంబరుడిని నిందిస్తూ ఆనందంగా పూలవాన కురిపించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=3&Padyam=23

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :