Sunday, December 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౪(414)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-881-మ.
కని సాంబప్రముఖాది యోధవరు లుత్కంఠాత్ములై మీన కే
తను నగ్గించి సువర్ణపుంఖ నిశితాస్త్రశ్రేణి సంధించి సా
ల్వుని సైన్యావలి మస్తముల్‌ వెరవు లావున్ మీఱఁగా నొక్క యె
త్తున వేత్రుంచిరి తాటిపండ్లు ధరఁ దోడ్తో రాల్చు చందంబునన్.
10.2-882-వ.
అట్టి యెడ.
10.2-883-స్రగ్ద.
కూలున్ గుఱ్ఱంబులేనుంగులు ధరఁగె; డయుంగుప్పలై; నుగ్గునూచై
వ్రాలున్దేరుల్‌; హతంబై వడిఁబడుసు; భటవ్రాతముల్‌; శోణితంబుల్‌
గ్రోలున్, మాంసంబునంజుంగొఱకు, నెము; కలన్గుంపులైసోలుచున్బే
తాలక్రవ్యాదభూతోత్కరములు, జ; తలై తాళముల్‌ దట్టి యాడున్. 

భావము:
అది చూసిన సాంబుడు మున్నగు యదు యోధులు ప్రద్యుమ్నుడిని ప్రస్తుతించారు. పదునైన బంగారు పింజలు గల బాణాలతో తాటిపండ్లను నేల రాల్చినట్లు సాల్వుని సైనికుల తలలు ఉత్తరించారు. ఆ యాదవులు సాల్వ యుద్ధ సమయంలో కుప్పలు తెప్పలుగా గుఱ్ఱాలు కూలాయి; ఏనుగులు నేల మీద వ్రాలాయి; రథాలు నుగ్గనుగ్గు అయి కూలాయి; భటులు చచ్చి పడిపోయారు; బేతాళాలూ పిశాచాలూ భూతాలూ ఆనందంతో రక్తాన్ని త్రాగుతూ, మాంసం నంజుకుంటూ, ఎముకలు కొరుకుతూ. చప్పట్లతో తాళాలు చరుస్తూ, పారవశ్యంగా నృత్యాలు చేసాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=883 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: