Saturday, December 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౧(421)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-900-తే.
గగన మందుండి యొకఁ డార్తుఁ డగుచు వచ్చి
నందనందను పాదారవిందములకు
వందనము సేసి యానకదుందుభిని మ
హోగ్రుఁడై పట్టితెచ్చె సాల్వుండు గడఁగి.
10.2-901-తే.
దేవ! మీ కెఱిఁగింపఁగాఁ దివిరి యిటకు
దేవకీదేవి నన్నుఁ బుత్తెంచె ననఁగ
విని సరోరుహనాభుఁడు ఘన విషాద
మగ్నుఁ డయ్యెను గురుమీఁది మమతఁ జేసి. 

భావము:
ఒకడు ఆకాశంలో నుండి దుఃఖిస్తూ దిగి వచ్చి, ఆ నందుని నందనుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించి సాల్వుడు మహా ఉగ్రతతో పూని వచ్చి ఆనకదుందుభి అని పిలువబడే నందమహారాజుని బంధించి తెచ్చాడు. ప్రభూ! శాల్వుడు మీతండ్రి వసుదేవుడిని బంధించి తెచ్చిన వార్త మీకు చెప్పవలసిందిగా దేవకీదేవి నన్ను మీ దగ్గరకు పంపించారు.” అది వినిన శ్రీకృష్ణుడు తండ్రిమీద ఉన్న మమకారం వలన విషాదంలో మునిగిపోయాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=901 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: