Thursday, June 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౯(579)

( శ్రుతి గీతలు ) 

10.2-1206-సీ.
పరమవిజ్ఞాన సంపన్ను లైనట్టి యో-
  గీంద్రులు మహితనిస్తంద్ర లీలఁ
బరిదృశ్యమానమై భాసిల్లు నిమ్మహీ-
  పర్వత ముఖర ప్రపంచ మెల్ల
బరఁగ బ్రహ్మస్వరూపము గాఁగఁ దెలియుదు-
  రెలమి నీవును జగద్విలయవేళ
నవశిష్టుఁడవు గాన ననఘ! నీ యందు నీ-
  విపుల విశ్వోదయవిలయము లగు
10.2-1206.1-తే.
ఘట శరావాదు లగు మృద్వికారములు మృ
దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష!
తవిలి కారణరూపంబుఁ దాల్చి లీలఁ
గడఁగు నీయందు బుద్ధి వాక్కర్మములను.
10.2-1207-క.
అలవడఁ జేయుచు నుందురు
బలకొని యిలఁ బెట్టఁబడిన పదవిన్యాసం
బులు పతనకారణముగా
నలవున సేవించుచును గృతార్థులు నగుచున్.

భావము:
“ఓ మహానుభావ! కమలాక్షా! బ్రహ్మ విజ్ఞాన సంపన్నులైన పరమ యోగీశ్వరులు ప్రమత్తమైన విధంగా కనబడేది అయినట్టి భూమి, పర్వతాలు మున్నగు వాటి అన్నింటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపం గానే భావిస్తారు. ప్రళయకాలంలో నీవు ఒక్కడవే మిగిలి ఉంటావు. కుండలూ, మూకుళ్ళూ మొదలైనవన్నీ మట్టితో ఏర్పడి మృత్తికా రూపాలైనట్లే, విస్తారమైన ఈ విశ్వం మొత్తము పుట్టుక నాశము రెండూ నీ వల్లనే జరుగుతున్నాయి. ఈ సమస్త విశ్వానికీ నీవే కారణభూతుడవు. అట్టి నీ యందు వాక్కాయ కర్మల పూర్వకంగా త్రికరణ శుద్ధిగా విజ్ఞానసంపన్నులు నీ యందే బుద్ధిని లగ్నంచేసి జన్మము ఎత్తడానికి పతనానికి కారణంగా గ్రహిస్తారు. త్రికరణశుద్ధిగా నిన్నే సేవిస్తూ కృతార్ధులవుతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1207

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, June 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౮(578)

( శ్రుతి గీతలు ) 

10.2-1204-సీ.
"జయజయ హరి! దేవ! సకలజంతువులకు-
  జ్ఞానప్రదుండవుగాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణ సం-
  తానంబుగాఁ గొని జ్ఞానశక్తి
ముఖ్యషడ్గుణ పరిపూర్ణతఁ జేసి మా-
  యాత్మవిశిష్టుండ వగుచుఁ గార్య
కారణాత్మకుఁడవై కడఁగి చరించుచు-
  నున్న నీయందుఁ బయోరుహాక్ష!
10.2-1204.1-తే.
తివిరి యామ్నాయములు ప్రవర్తించుఁ గాన
ప్రకట త్రిగుణాత్మకం బైన ప్రకృతితోడి
యోగ మింతయు మాన్పవే! యోగిమాన
సాంబుజాత మధువ్రత!" యని నుతించి.
10.2-1205-వ.
"అదియునుం గాక.

భావము:
“ఓ దేవ! శ్రీహరి! పద్మాక్షా! మహర్షి మానస విహారా! నీకు జయమగు గాక, నీవు సకల ప్రాణులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి. కనుక, ఆ జీవుల వలన దోషాలు ఏమి కలిగిన మంచి తనయులనుగానే స్వీకరిస్తావు. భాగవత సద్గుణైశ్వర్య సంపన్నుండవు కావున, మా అందరిలోను ఆత్మరూపంతో ఉంటావు. కార్యకారణాత్మకుడవై ప్రవర్తిస్తుంటావు. నీ లోనే సకలవేదాలు ప్రవర్తిస్తాయి. సత్త్వరజస్తమోగుణాలు అనే త్రిగుణాత్మక ప్రకృతితో మా కున్న బంధాన్ని ఛేదించు.” అని భగవంతుని కీర్తించి ఇంకా ఇలా పలుకసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1204

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Tuesday, June 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౭(577)

( శ్రుతి గీతలు ) 

10.2-1203-వ.
అని చెప్పిన బాదరాయణికి నభిమన్యునందనుం డిట్లనియె “మునీంద్రా! ఘటపటాదివస్తు జాతంబు భంగి నిర్దేశింప నర్హంబు గాక, సత్త్వాదిగుణశూన్యం బైన బ్రహ్మంబునందు సత్త్వాది గుణగోచరంబులైన వేదంబులే క్రమంబునం బ్రవర్తించు, నట్టి చందంబు నాకెఱిఁగింపు” మనిన భూవరునకు మునివరుం డిట్లనియె; “సకల చేతనాచేతనాంతర్యామియైన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు గావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియమనః ప్రాణశరీరంబు లను సృజియించి; చేతనవర్గంబునకు జ్ఞానప్రదుండగుం గావున సకల నిగమసమూహంబులును దత్స్వరూప గుణవైభవప్రతిపాదకంబులు గావున, ముఖ్యంబై ప్రవర్తించు; శ్రుతిస్తోత్రం బుపనిషత్తుల్యంబు; ననేక పూర్వఋషి పరంపరాయాతంబును నైన దీనిని శ్రద్ధాయుక్తుండై యెవ్వం డనుసంధించు, నతనికి మోక్షంబు సులభంబు; దీనికి నారాయణాఖ్యాతంబగునొక్క యుపాఖ్యానంబు గలదు; వినిపింతు వినుము; భగవత్ప్రియుండైన నారదుం డొక్కనాఁడు నారాయణాశ్రమంబునకుం జని ఋషిగణసమేతుం డైన నారాయణఋషిం గనుంగొని నీవు నన్నడిగినట్ల యమ్మహాత్ముని నడిగిన నతండు మున్నీయర్థంబు శ్వేతద్వీపవాసులైన సనక సనందనాది దివ్యయోగీంద్రులు ప్రశ్న సలిపిన, వారలకు సనందనుండు చెప్పిన ప్రకారంబు నీ కెఱింగించెద” నని చెప్పందొడంగె; “శయానుం డైన రాజశ్రేష్ఠునిఁ దత్పరాక్రమ దక్షతాది చిహ్నంబు లను నుతియించు వందిజనంబుల చందంబున జగదవసాన సమయంబున ననేక శక్తియుతుండై యోగనిద్రావశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబుసేయు విధంబు నారాయణుండు నారదునకుం జెప్పిన తెఱుంగు విను"మని యిట్లనియె.

భావము:
ఇలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆయనతో ఇలా అన్నాడు. “శుకమహర్షి! ఘటపటాదులలాగా నిర్దేశించటానికి వీలుగాకుండా సత్త్వాది గుణశూన్యమైన బ్రహ్మముతో సత్త్వాదిగుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించే విధానాన్ని చెప్పవలసింది” అని కోరాడు అందుకు శుకయోగీంద్రుడు పరీక్షన్నరేంద్రునకు ఇలా చెప్పసాగాడు. “సకల చరాచరములందు సర్వాంతర్యామియై ఉండు భగవంతుడు సమస్త చేతన వర్గానికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కనుక వేదాదులు సర్వం ఆ పరమేశ్వరుని స్వరూప గుణ వైభవాలను స్తుతిస్తూ ఉంటాయి. అలాంటి శ్రుతిస్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనది. ఎందరో మహర్షులు పూర్వం ప్రసాదించిన ఇది పరంపరాగతంగా అందుతోంది. దీనిని శ్రద్ధాపూర్వకంగా అనుసంధించే వారికి మోక్షం సులభ సాధ్యం అవుతుంది. దీనికి దృష్టాంతంగా నారాయణోపాఖ్యానము అనే ఒక పురాణకథ ఉంది. చెప్తాను, విను. పానుపుమీద పడుకుని ఉన్న రాజేంద్రుని పరాక్రమ సామర్ధ్యాలను వందిమాగధులు కొనియాడేవిధంగా కల్పాంతసమయంలో అనేక శక్తులతో కూడుకొని యోగనిద్రలో ఉన్న సర్వేశ్వరుడిని వేదాలు స్తోత్రం చేసే పద్ధతి (శ్రుతిగీతలు) ఎలాంటిదో పూర్వం సనందుడనే ముని, శ్వేతద్వీపవాసులైన సనకాది మునులు పరస్పరం చర్చించుకునే సందర్భంలో విశదీకరించాడు. దానిని నారాయణముని తన దగ్గరకు విచ్చేసిన నారదుడికి చెప్పాడు. ఆ వృత్తాతం వివరిస్తాను” అని శుకుడు పరీక్షత్తునకు ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1203

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, June 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౬(576)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1201-క.
అని సర్వలోక విభుఁ డగు
వనజోదరుఁ డానతిచ్చు వాక్యంబుల జా
డన భూమీసురుఁ డమ్ముని
జనులకు సద్భక్తిఁ బూజ సలిపెన్ వరుసన్.
10.2-1202-చ.
ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర భూసురులం గృపావలో
కన మొలయన్ననూనసుభగస్థితిఁ బొందఁగఁ జేసి వారి వీ
డ్కొని రథమెక్కి దివ్యమునికోటియుఁ దానును వచ్చెఁ గ్రమ్మఱన్
జనవర! మోక్షదం బగు కుశస్థలికిం బ్రమదాంతరంగుఁడై!"

భావము:
లోకాలు సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారం శ్రుతదేవుడు అత్యంతభక్తితో ఆ మునిపుంగవులను పూజించాడు. ఓ రాజా పరీక్షిత్తు! మిథిలాదేశ ప్రభువు బహుళాశ్వుని, విప్రుడు శ్రుతదేవుని ఆ విధంగా శ్రీకృష్ణుడు కరుణతో కటాక్షించి వారికి శుభాలు ప్రసాదించాడు. వారి దగ్గర సెలవు తీసుకుని సంతోషాతంరంగుడై రథం ఎక్కి మునులతోపాటు మోక్షదాయకమైన ద్వారకను తిరిగి చేరుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1202

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౫(575)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1199-క.
“నా మది విప్రులపైఁ గల
ప్రేమము నా తనువు నందుఁ బెట్టని కతనన్
భూమీసురు లర్హులు; నీ
వీ మునులం బూజ సేయు మిద్ధచరిత్రా!
10.2-1200-క.
ఇదియే నా కిష్టము ననుఁ
బదివేలవిధంబు లొలయ భజియించుటగా
మది కింపగు నటు గావున
వదలని భక్తిన్ భజింపు వసుధామరులన్!”

భావము:
“ఓ శుద్ధాత్మా! వారు మిక్కిలి అర్హులు అగుటచే, నా మనసులో నా శరీరం మీద కన్నా బ్రాహ్మణుల మీద నాకు ప్రేమ అధికముగా గలదు. కనుక నీవు ఈ మునులను పూజించుము. నాకు ఇష్టం కూడా అదే. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను పదివేల విధాల పూజించినట్లు భావించి సంతోషిస్తాను. కనుక, సుస్థిర భక్తితో విప్రులను పూజించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1200

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

శ్రీకృష్ణ విజయము - ౫౭౪(574)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1198-వ.
చనుదెంచిరి; పుణ్యస్థలంబులును, విప్రులును, దేవతలును సంస్పర్శన దర్శనార్చనంబులం బ్రాణులను సమస్త కిల్బిషంబులం బాయంజేయుదు; రదియునుంగాక, బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటి యందు ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుండై మత్కలాశ్రయుండయ్యెనేని నతం డుత్తముం డై వెలుంగు; నతనిం జెప్ప నేల?” యని వెండియు నిట్లనియె.

భావము:
అంతటి మహానుభావులు నీ ఇంటికి విచ్చేసారు. పుణ్యస్థలాలూ, విప్రులూ, దేవతలూ, స్పర్శ, దర్శన, అర్చన వలన జీవుల పాపాలు సమస్తమూ తొలగిస్తారు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే సకల జీవులలోను గొప్పవాడు అయి ఉంటాడు. అతడు జపము, తపస్సు, ధ్యానము అధ్యయనము మున్నగు సాధనలతో పరిపూర్ణుడై నా భక్తుడు అయితే గొప్పగా ప్రకాశిస్తాడు.” అని పలికి కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1198

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౫౭౩(573)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1197-సీ.
“నీకు మ్రొక్కెదఁ గృష్ణ! నిగమాంత సంవేద్య!-
  లోకరక్షక! భక్తలోకవరద!
నీపాదసేవననిరతుని నన్ను నే-
  పనిఁ బంపె దానతి” మ్మనినఁ గృష్ణుఁ
డెలనవ్వు మోమునఁ జెలువొంద నా విప్రు-
  కర మాత్మకరమునఁ గదియఁ జేర్చి
పాటించి యతనితోఁ బలికెఁ “దపశ్శక్తి-
  వఱలిన యమ్మునివర్యు లెపుడుఁ
10.2-1197.1-తే.
దమ పదాంబుజరేణు వితానములను
దవిలి లోకంబులను బవిత్రంబు సేయు
వారు ననుఁ గూడి యెప్పుడు వలయు నెడల
కరుగుదెంతురు నీ భాగ్య గరిమ నిటకు.

భావము:
కృష్ణా! వేదవేద్యా! లోకరక్షకా! భక్తవరదా! నీకు నమస్కరిస్తున్నాను. నీ పాదసేవలో నిరంతరం సంచరించే నన్ను ఏమి చేయమంటావో అజ్ఞాపించు.” ఇలా పలుకుతున్న శ్రుతదేవుడి పలుకులు విని గోవిందుడు మందహాసం చేస్తూ తన చేతిలోకి అతని చేతిని తీసుకుని, ఇలా అన్నాడు. “ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా! తమ పాదధూళితో లోకాన్ని పవిత్రం చేసే వారు, పరమ తపోధనులు అయిన ఈ మునివరులు నాతోపాటు తాము కోరిన చోటికి వస్తూంటారు. ఈనాడు నావెంట నీ ఇంటికి విచ్చేసారు. నీ అదృష్టం పండింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1197

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, June 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౨(572)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1195-క.
ముని యోగిమానసస్ఫుట
వనజంబుల నెల్ల ప్రొద్దు వర్తించు భవ
ద్ఘనదివ్యమూర్తి నా లో
చనగోచర మయ్యెఁ గాదె! సర్వాత్మ! హరీ!
10.2-1196-వ.
దేవా! నీ సచ్చరితంబులు గర్ణరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజలొనర్చుచు, నీచరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామ సంకీర్తనంబులు సేయుచుం, దమ శరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులం గానంబడుచుందువు; కర్మవిక్షిప్తచిత్తులైన వారి హృదయంబుల నుండియు, దూరగుండ వగుదు;” వని మఱియు నిట్లనియె.

భావము:
ఓ సర్వాంతర్యామీ! శ్రీహరీ! మునీశ్వరుల యోగీంద్రుల హృదయ పద్మాలలో నిరంతరం మెలిగెడి నీ యొక్క దివ్య మంగళరూపం నా కనులకు గోచరమైంది. ఓ దేవా! చెవులపండువుగా నీ దివ్యగాథలు వింటూ; నీకు పూజలు చేస్తూ; నీ పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ; నీ దివ్యనామం జపిస్తూ; తమ శరీరాలు నీ ఆధీనాలుగా సంచరిస్తూ; ఉండే సజ్జనుల హృదయాలనే అద్దాలలో నీవు కనిపిస్తూ ఉంటావు; కర్మపరతంత్రులైన వారి హృదయాలకు దూరంగా ఉంటావు.” అని స్తుతించి శ్రుతదేవుడు ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1196

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Sunday, June 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౧(571)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1193-తే.
మానితంబుగ విశ్వనిదానమూర్తి
యైన కృష్ణుండు దనయింట నారగించెఁ
దన మనోరథసిద్ధియుఁ దనకు నబ్బె
ననుచుఁ బైపుట్ట మల్లార్చి యాడుచుండె.
10.2-1194-చ.
తరుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ, త
చ్చరణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్ రమా
వరుఁ గని వల్కె "భక్తజనవత్సల! మామకభాగ్య మెట్టిదో
హర చతురాస్యులున్నెఱుఁగ నట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్.

భావము:
“సర్వ జగత్తుకు మూలకారణమైన శ్రీకృష్ణుడు నా ఇంట్లో భోజనం చేసాడు. నా కోరిక ఫలించింది.” అంటూ శ్రుతదేవుడు ఎంతో ఆనందంతో తన పైబట్ట ఆడిస్తూ చిందులు త్రొక్కాడు. తను తన భార్యాపుత్రులూ కృష్ణుడిని స్తుతిస్తూ ఉండగా, ఆయన పాదాలను ఒడిలో చేర్చుకుని మెత్తగా ఒత్తుతూ శ్రుతదేవుడు ఆ శ్రీపతితో ఇలా అన్నాడు. “భక్తవత్సలా! నా భాగ్యం ఎంత గొప్పదో కదా. పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కనలేని నిను దర్శించగలిగాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1194

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, June 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౦(570)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1191-చ.
శిరములఁ దాల్చి, నవ్యతులసీదళదామ కుశప్రసూన వి
స్ఫుర దరవింద మాలికలఁ బూజ లొనర్చి, "గృహాంధకూప సం
చరణుఁడ నైన నాకడకుఁ జక్రి దనంతనె వచ్చునట్టి సు
స్థిరమతి నే తపంబు మును సేసితినో?" యని సంతసించుచున్.
10.2-1192-తే.
మఱియుఁ దత్పాదతీర్థంబు మందిరమునఁ
గలయఁ జిలికించి, సంప్రీతి గడలుకొనఁగఁ
బత్త్ర ఫలపుష్పతోయముల్‌ భక్తి నొసగి,
హరి మురాంతకమూర్తి నిజాత్మ నిలిపి.

భావము:
కృష్ణుని పాదజలాన్ని వారు తమ తలల మీద జల్లుకున్నారు. తులసిమాలలనూ, తామరపూల హారాలనూ వారికి సమర్పించి పూజించాడు. “ఈ ఇల్లనే చీకటినూతిలో పడికొట్టుకుంటున్న నా దగ్గరకు చక్రి శ్రీకృష్ణుడు తనంత తానుగా రావటానికి నేను ఎంతటి తపస్సు చేసానో కదా.” అని ఎంతో సంతోషించాడు. ఇంకా, తన గృహం నలుమూలలా శ్రుతదేవుడు శ్రీకృష్ణ పాదతీర్థాన్ని చల్లాడు, అతడు కృష్ణుడిని తన మనసులో భక్తిగా నిలుపుకున్నాడు. మిక్కిలి భక్తితో పత్రం పుష్పం ఫలం జలాలను సమర్పించి, అర్చించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1192

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, June 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౯(569)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1189-వ.
అని యభ్యర్థించినం బ్రసన్నుండై యప్పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనకచక్రవర్తిం గరుణించి, యమ్మిథిలానగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు లుండె; నంత.
10.2-1190-మ.
శ్రుతదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా
పతిఁ దోకొంచు నిజాలయంబునకు నొప్పన్నేగి, యచ్చోట స
మ్మతి దర్భాస్తరణంబులన్నునిచి, సమ్యగ్జ్ఞానపారీణుఁడై
సతియుం దానుఁ బదాబ్జముల్‌ గడిగి చంచద్భక్తిఁ దత్తోయముల్‌.

భావము:
ఈ రీతిని నిమి వంశోద్ధారకుడు అయిన జనకుడు వేడగా శ్రీకృష్ణుడు అతని భక్తికి ప్రసన్నుడై మిథిలానగరంలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ కొన్నాళ్ళ పాటు అక్కడే ఉన్నాడు. అంతట శ్రుతదేవుడు కూడ పరమానందంతో శ్రీకృష్ణుడిని మునులనూ తన ఇంటిలోకి తీసుకు వెళ్ళాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి అతడు, అతని భార్యా వారి పాదపద్మాలను కడిగి, ఆ నీటిని...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1190

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౮(568)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1187-తే.
"కృష్ణ! పరమాత్మ! యదుకుల క్షీరవార్ధి
పూర్ణచంద్రమ! దేవకీపుత్త్ర! సుజన
వినుత! నారాయణాచ్యుత! వేదవేద్య!
భక్తజనపోషపరితోష! పరమపురుష!
10.2-1188-ఉ.
శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోకర
క్షాపరతంత్ర! నీవు మునిసంఘముఁ గొన్నిదినంబు లుండవే
నీ పదపద్మ రేణువులు నెమ్మి మదీయగృహంబు సోఁకినం
దాపసవంద్య! యే నిపుడ ధన్యుఁడ నయ్యెదఁగాదె మాధవా!”

భావము:
“పరమపురుషా! శ్రీకృష్ణా! యదుకుల క్షీరసాగరానికి పూర్ణచంద్రుడా! దేవకీనందనా! అచ్యుతా! నారాయణా! సజ్జన నుత! వేదవేద్యా! భక్తజనవత్సల! నీకు ప్రణామం. ఓ యదు సింహమా! నందకిశోరా! భక్తరక్షణ పరాయణా! పురుషోత్తముడు అనే సార్థక నామధేయం కలవాడ! నీవూ ఈ మునులు కొన్నాళ్ళపాటు ఇక్కడే ఉండండి. నీ పాదధూళి నా గృహములో సోకితే చాలు నేను ధన్యుడిని అవుతాను కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1188

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, June 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౭(567)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1186-వ.
అట్టి లోకవిదితం బయిన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయ పాదారవిందంబు లందు నొకానొకవేళ లేశమాత్రధ్యానంబుగల నా గృహంబున కకించనుండని చిత్తంబునం దలంపక భక్తవత్సలుండ వగుటంజేసి విజయం జేసితివి; భవత్పాదపంకేరుహ ధ్యానసేవారతిం దగిలిన మహాత్ములు త్వద్ధ్యానంబు వదలం జాలుదురే? నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనం గోరిక గలవారలకు నిన్నైన నిత్తువు గదా!” యని వెండియు నిట్లనియె.

భావము:
ఆ నీ మాట సార్థకం అయ్యేలా, నీ పాదపద్మాల మీద ఏదో రవంత భక్తి గల నన్నుదరిద్రుడని అనుకోకుండా నా యింటికి వచ్చావు. ఇది నీ భక్తవాత్సల్యానికి నిదర్శనం. నీ పాదసేవలో ఆనందించే మహాత్ములు దాన్ని వదలలేరు. ఎప్పుడూ శాంతస్వభావులై, నిష్కాములై, నీ యందు భక్తిగల యోగిశ్రేష్ఠులకు నిన్ను నీవు సమర్పించుకుంటావు కదా.” అని పలికి బహుళాశ్వుడు మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1186

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Tuesday, June 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౬(566)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1184-వ.
ఇట్లు సమర్పించి, యనంతరంబ యమ్మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును బొంది.
10.2-1185-చ.
హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబునఁ జేర్చి యొత్తుచుం
"బురుషవరేణ్య! యీ నిఖిలభూతగణావలి యాత్మలందు సు
స్థిరమతిఁ గర్మసాక్షివి సుధీవర! నీ పదభక్తకోటితో
నరయ నుమాధినాథ చతురాస్యులుఁ బోలరటందు వెప్పుడున్.

భావము:
ఈవిధంగా కృష్ణాదులను పరమానందంగా గౌరవించి మిథిలానాథుడైన ఆ జనకచక్రవర్తి కృష్ణుని పాదాలను తన ఒడిలో ఉంచుకుని మెత్తగా ఒత్తుతూ అతనితో ఇలా అన్నాడు. “పురుషోత్తమా! జ్ఞాన స్వరూప! సమస్త ప్రాణుల ఆత్మల్లో కర్మసాక్షివై నీవు ఉంటావు. పార్వతీదేవి భర్త శంకరుడు, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు వంటివారు అయినా నీ భక్తులకు సాటిరారని నీవంటూ ఉంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1185

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, June 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౫(565)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1182-చ.
తిరముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం
డొరుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం
దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్.
10.2-1183-సీ.
కూర్చుండ నియమించి, కొమరారు కాంచన-
  కలధౌత కలశోదకములచేతఁ
బాదముల్‌ గడిగి, తత్పావనజలములు-
  దానును సతియు బాంధవజనంబుఁ
గర మర్థి నిజమస్తకంబుల ధరియించి,-
  వివిధార్చనములు సద్విధి నొనర్చి,
మణిభూషణాంబర మాల్యానులేపన-
  రాజిత ధూప నీరాజనములు
10.2-1183.1-తే.
భక్తిఁ గావించి, పరిమృష్ట బహు విధాన్న
పాయసాపూప పరిపక్వఫలము లోలి
నారగింపఁగఁ జేసి, కర్పూరమిళిత
లలిత తాంబూలములు నెయ్య మలర నొసఁగె.

భావము:
శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో ఒకే సమయంలో వెళ్ళాడు. బహుళాశ్వుడు కృష్ణుడిని మునిసమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు. బంగారు ఆసనాలపై కూర్చుండ జేసి, బహుళాశ్వుడు బంగారు వెండి కలశాలలోని జలాలతో వారి పాదాలను కడిగాడు. తానూ తన భార్యా బంధువులూ ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరములపై జల్లుకున్నారు. బహుళాశ్వుడు వారిని శాస్త్రోక్తంగా పూజలు సత్కారాలు చేసాడు. మణిభూషణాలూ వస్త్రాలూ పూలదండలూ సుగంధలేపనాలూ వారికి సమర్పించాడు. భక్తితో హారతు లిచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనంపెట్టి మధురఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1183

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  శ్రీకృష్ణ విజయము - ౫౬౫(565)
( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1182-చ.
తిరముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం
డొరుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం
దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్.
10.2-1183-సీ.
కూర్చుండ నియమించి, కొమరారు కాంచన-
  కలధౌత కలశోదకములచేతఁ
బాదముల్‌ గడిగి, తత్పావనజలములు-
  దానును సతియు బాంధవజనంబుఁ
గర మర్థి నిజమస్తకంబుల ధరియించి,-
  వివిధార్చనములు సద్విధి నొనర్చి,
మణిభూషణాంబర మాల్యానులేపన-
  రాజిత ధూప నీరాజనములు
10.2-1183.1-తే.
భక్తిఁ గావించి, పరిమృష్ట బహు విధాన్న
పాయసాపూప పరిపక్వఫలము లోలి
నారగింపఁగఁ జేసి, కర్పూరమిళిత
లలిత తాంబూలములు నెయ్య మలర నొసఁగె.

భావము:
శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో ఒకే సమయంలో వెళ్ళాడు. బహుళాశ్వుడు కృష్ణుడిని మునిసమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు. బంగారు ఆసనాలపై కూర్చుండ జేసి, బహుళాశ్వుడు బంగారు వెండి కలశాలలోని జలాలతో వారి పాదాలను కడిగాడు. తానూ తన భార్యా బంధువులూ ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరములపై జల్లుకున్నారు. బహుళాశ్వుడు వారిని శాస్త్రోక్తంగా పూజలు సత్కారాలు చేసాడు. మణిభూషణాలూ వస్త్రాలూ పూలదండలూ సుగంధలేపనాలూ వారికి సమర్పించాడు. భక్తితో హారతు లిచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనంపెట్టి మధురఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1183

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, June 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౪(564)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1180-ఉ.
ఆ మునికోటికిన్ వినయ మారఁగ వందన మాచరించి, యా
తామరసాభలోచనుఁ, డుదారచరిత్రుఁడు, పాపగోత్ర సు
త్రాముఁడు, భక్తలోకశుభదాయకుఁ డైన రమేశు, సద్గుణ
స్తోముని పాదపద్మములు సోఁకఁగ మ్రొక్కి వినమ్రులై తగన్.
10.2-1181-చ.
కరములు మోడ్చి యో! పరమకారుణికోత్తమ! నీవు నీ మునీ
శ్వరులును మద్గృహంబునకువచ్చి మముం గృపసేసి యిచ్చటం
గర మనురక్తిఁ బూజనలు గైకొనుఁ డంచు నుతించి వేఁడ నా
హరి మనమందు వారివినయంబుల కెంతొ ప్రమోద మందుచున్.

భావము:
వారిద్దరూ వచ్చిన మునీంద్రు లందరికీ వినయంగా నమస్కారాలు చేసారు. పద్మాక్షుడూ, ఉదారచరిత్రుడూ, పాపాలనే పర్వతాల పాలిటి ఇంద్రునివంటివాడూ, భక్తులకు శుభాలను కలిగించేవాడూ, సద్గుణాలకు నిలయుడూ, సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని పాదపద్మాలకు వినమ్రులై ప్రణామాలు చేశారు. “ఓ దయాసాగరా! నీవూ ఈ మునీశ్వరులూ మా గృహానికి వచ్చి మమ్ము అనుగ్రహించాలి మా పూజలు మీరు స్వీకరించాలి.” అని బహుళాశ్వ శ్రుతదేవులు చేతులు జోడించి కృష్ణుడిని ప్రార్థించారు, వారి వినయ స్వభావానికి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1181

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౩(563)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1179-వ.
అట్లు కృష్ణుండు వారల జూచువేడ్క నిజ స్యందనారూఢుండై, నారద, వామదేవాత్రి, కృష్ణ, రామ, సితారుణ, దివిజగురు, కణ్వ, మైత్రేయ, చ్యవనులును, నేనును మొదలైన మును లనుగమింపం జనుచుఁ దత్తద్దేశ నివాసులగు నానర్తక, ధన్వ, కురుజాంగల, వంగ ,మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోస లాది భూవరులు, వివిధ వస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునిం బోలి, యప్పుండరీకాక్షుండు మందస్మిత సుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్ద్రదృష్టిం జూచి, యోగక్షేమంబులరసి, సాదరభాషణంబుల నాదరించుచుఁ, గతిపయ ప్రయాణంబులం జనిచని విదేహనగరంబు డాయంజనుటయు; నా బహుళాశ్వుండు నమ్మాధవు రాక విని మనంబున హర్షించుచు వివిధపదార్థంబులు గానికలుగాఁగొని, తానును శ్రుతదేవుండును నెదురుగాఁ జనుదెంచి; యప్పుడు.

భావము:
శ్రీకృష్ణుడు ఆ బహుళాశ్వుడు శ్రుతదేవుడులను చూడాలన్న ఉత్సాహంతో రథాన్ని ఎక్కి ద్వారక నుంచి మిథిలానగరానికి బయలుదేరాడు. అతని కూడా వామదేవుడు, అత్రి, కృష్ణద్వైపాయనుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చవనుడు మున్నగు మునిముఖ్యులూ వెళ్ళారు. వారిలో నేనూ ఉన్నాను. మార్గంలో అనర్తము, కేకయ, కురుజాంగలము, ధన్వము, వంగ, మత్స్య, పాంచాలము, కుంతి, మధు, కోసల మున్నగు దేశాల ప్రభువులు కృష్ణుడికి నానావిధాలైన కానుకలు బహూకరించి సేవించారు. గ్రహాలనడుమ ప్రకాశించే సూర్యుడిలా కృష్ణుడు మందహాసంచేస్తూ వారందరి మీద కరుణార్ద్ర దృష్టులను ప్రసరింపచేస్తూ వారి యోగక్షేమాలు విచారించాడు. వారితో ఆప్యాయంగా మట్లాడాడు. ఆ తరువాత కొన్నాళ్ళు ప్రయాణంచేసి మిథిలానగరాన్ని చేరాడు. శ్రీకృష్ణుని రాక తెలిసి బహుళాశ్వుడు చాలా ఆనందించాడు. వివిధ పదార్థాలను తీసుకుని అతడు శ్రుతదేవునితోపాటు శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి ఎదురువచ్చాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1179

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, June 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౨(562)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1178-ఉ.
ఆ పురి నేలువాఁడు బహుళాశ్వుఁడు నా నుతి కెక్కినట్టి ధా
త్రీపతి యా ధరామరునిరీతిని నిష్కలుషాంతరంగుఁడై
యే పనులందు ధర్మగతి నేమఱఁ కర్థిఁ జరించుచుండె ల
క్ష్మీపతి వారిపైఁ గరుణఁ జేసి ప్రసన్నముఖాంబుజాతుఁడై.

భావము:
ఆ నగరానికి రాజు బహుళాశ్వుడనే నామాంతరంగల జనకుడు. అతడు శ్రుతదేవుని వలెనే నిర్మలాంతరంగుడై ఏపనిచేసినా ధర్మాన్ని విస్మరించకుండా జీవిస్తున్నాడు శ్రీకృష్ణునికి వారిద్దరిమీద అనుగ్రహం కలిగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1178

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Tuesday, June 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౧(561)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1177.1-తే.
నరనాథ! విను భువనప్రసిద్ధంబుగ-
  దీపించు నట్టి విదేహదేశ
మందు భూకాంతకు నాననదర్పణం-
  బనఁ దనర్చిన మిథి లను పురమునఁ
గలఁడు శ్రీహరిపాదకంజాత భక్తుండు,-
  గళితరాగాది వికారుఁ, డమల
చరితుఁ, డక్రోధుండు, శాంతుండు, నిగమార్థ-
  కోవిదుం, డగు శ్రుతదేవుఁ డనెడి
10.2-1177.1-తే.
భూసురోత్తముఁ డొకఁ డనిచ్ఛాసమాగ
తంబు తుషమైన హేమ శైలంబు గాఁగఁ
దలఁచి పరితోష మందుచుఁ దగ గృహస్థ
ధర్మమున నుండె సముచితకర్ముఁ డగుచు.

భావము:
“ఓ మహారాజా! మిథిలానగరం లోకప్రసిద్ధమైన విదేహదేశంలో భూదేవి ముఖానికి తళుకుటద్దంవలె ఉంటుంది. ఆ నగరంలో శ్రుతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప హరిభక్తుడు; రాగాది వికారాలు లేనివాడు; వినిర్మలచరిత్రుడు; కోపము లేని పూర్తి శాంత స్వభావుడు; వేదార్థాలు తెలిసినవాడు; అతడు తనంత తానుగా ప్రాప్తించింది లేశమైనా దాన్ని మేరుపర్వత మంతగా భావించి సంతృప్తి చెందేవాడు. శ్రుతదేవుడు నిత్యమూ విద్యుక్తకర్మలను నిర్వహిస్తూ గృహస్థధర్మాన్ని పాలిస్తూ ఉండేవాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1177

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, June 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౦(560)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1175-క.
కరులం దేరుల నుత్తమ
హరులన్ మణి హేమభూషణాంబరభృత్యో
త్కర దాసికాజనంబుల
నరణంబుగ నిచ్చి పంపె ననుజకుఁ బ్రీతిన్.
10.2-1176-వ.
ఇట్లు కృష్ణున కభిమతంబుగా నర్జునసుభద్రల కరణంబిచ్చి పంపె" నని చెప్పి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియె.

భావము:
ప్రీతిగా బలరాముడు అరణంగా ఏనుగులు, రథాలు, మేలుజాతి అశ్వాలు, వస్త్రాలు, రత్నాభరణాలు, బంగారు భూషణాలు, దాసదాసీజనాలు సుభద్రకు పంపాడు. ఈ విధంగా బలరాముడు శ్రీకృష్ణుని అభిలాష ప్రకారం సుభద్రార్జునులకు అరణం ఇచ్చి పంపాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షుత్తుతో మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1175

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Sunday, June 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౯(559)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1174-వ.
అప్పుడు డాయం జని యరదంబుపై నిడుకొని పోవుచుండం గనుంగొని యదుబలంబులు మదంబున నంటం దాఁకిన, నప్పు డయ్యాఖండలనందనుండు ప్రచండగాండీవ కోదండ నిర్ముక్త కాండంబులం దూలించి, యఖండ బాహుదండ విజయప్రకాండుండై ఖాండవప్రస్థపురంబున కరిగె; నట బలభద్రుండవ్వార్త విని విలయ సమయ సమీరసఖునికైవడిం బటురోష భీషణాకారుండై క్రోధించినం గని కృష్ణుండాదిగాఁగల బంధుజనంబు లతని చరణంబులకుం బ్రణమిల్లి మృదుమధుర భాషణంబుల ననునయించి యొడంబడునట్లుగా నాడిన నతండును సంతుష్టుండయి మనంబునఁ గలంకదేఱి, యప్పుడు.

భావము:
అలా చూసిన అర్జునుడు సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను రథంమీద కూర్చుండ బెట్టుకుని తీసుకుని పోసాగాడు. అది చూసిన యదుశూరులు అతడిని ఎదుర్కున్నారు. ఇంద్రతనయుడు తన గాండీవాన్ని ఎక్కుపెట్టి భీకర శర పరంపరలతో వారిని నిరోధించి, ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ఈ వార్త వినిన బలరాముడు ప్రళయకాల అగ్నిహోత్రుడిలా ఆగ్రహోదగ్రుడై మండిపడ్డాడు. శ్రీకృష్ణుడు మొదలైన బంధువులు అతని పాదాలకు నమస్కరించి, మృదుమధుర వచనాలతో సుభద్రార్జునుల పరిణయానికి అంగీకరించేలా అనునయించారు. దాంతో బలరాముడు కోపం వదలి ప్రసన్ను డయ్యాడు. పిమ్మట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1174

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, June 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౮(558)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1173-సీ.
సాంద్రశరచ్చంద్ర చంద్రికా స్ఫూర్తిచే-
  రాజిల్లు పూర్ణిమారజనివోలెఁ,
బూర్ణేందు బింబావతీర్ణమై యిలమీఁద-
  భాసిల్లు హరిణ డింభంబుఁ బోలె,
సులలిత మేఘమండలమును నెడఁబాసి-
  వసుధఁ గ్రుమ్మరు తటిద్వల్లి వోలె,
మాణిక్య రచిత సన్మహిత చైతన్యంబు-
  వొందిన పుత్తడిబొమ్మ వోలె.
10.2-1173.1-తే.
లలిత విభ్రమ రుచి కళాలక్షణములఁ
బొసఁగ రూపైన శృంగారరసముఁ బోలె,
నర్థిఁ జరియించుచున్న పద్మాయతాక్షిఁ
బ్రకటసద్గుణభద్ర సుభద్రఁ జూచి.

భావము:
శరత్కాలంలో పండువెన్నెలతో నిండి ఉన్న పున్నమరాత్రి వలె; నిండు చంద్రబింబం నుంచి నేలకు దిగివచ్చిన లేడిపిల్ల తెఱంగున; మేఘమండలాన్ని వదలి మేదినిమీద విహరించే మెఱపుతీగ చందాన; నవరత్న దీప్తులతో నూతన చైతన్యం సంతరించుకున్న బంగారు బొమ్మ రూపున; హావభావవిలాసాలతో రూపుదాల్చిన శృంగారరసాన్ని పోలి; పద్మాల వంటి విశాలమైన నయనాలతో విహరిస్తున్న చూడచక్కని సుగుణాలరాశి సుభద్రను అర్జునుడు చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1173

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౭(557)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1172-వ.
అట్లా నృపసత్తమ మత్తకాశినులొండొరుల చిత్తంబులు చిత్తజాయత్తంబులై కోర్కులు దత్తరింపం దాల్ములువీడ సిగ్గునం జిట్టుముట్టాడుచున్నయంత నొక్కనాఁడు దేవతామహోత్సవ నిమిత్తం బత్తలోదరి పురంబు వెలుపలికి నరుగుదెంచిన నర్జునుండు గృష్ణ దేవకీ వసుదేవుల యనుమతంబు వడసి తోడనం దానును చని యప్పుడు.

భావము:
ఈ విధంగా సుభద్రార్జునులు పరస్పరం ప్రగాఢంగా ప్రేమించుకున్నారు. అనురాగాలు అతిశయించి ఆపుకోలేని హృదయాలతో క్రిందుమీదవుతున్నారు. ఇలా ఉండగా, ఒకనాడు దేవతామహోత్సవానికి సుభద్ర నగరం వెలుపలికి వచ్చింది. కృష్ణుడు, దేవకీవసుదేవుల అనుమతి పొంది అర్జునుడు సుభద్ర వెనుక వెళ్ళాడు. అప్పుడు.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1172

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, June 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౫౬(556)

( సుభద్రా పరిణయంబు ) 

10.2-1170-చ.
జలరుహపత్త్రనేత్రు ననుసంభవ చారువధూలలామ స
ల్లలితవిహారవిభ్రమవిలాసము లాత్మకు విందు సేయ న
బ్బలరిపునందనుండు గని భావజసాయకబాధ్యమాన వి
హ్వలహృదయాబ్జుఁడై నిలిపె నత్తరుణీమణియందుఁ జిత్తమున్.
10.2-1171-ఉ.
ఆ తరుణీశిరోమణియు నర్జును, నర్జునచారుకీర్తి వి
ఖ్యాతుని, నింద్రనందను, నకల్మషమానసుఁ, గామినీ మనో
జాతునిఁ జూచి పుష్పశర సాయకజర్జరితాంతరంగయై
భీతిలి యుండె సిగ్గు మురిపెంబును మోహముఁదేఱు చూపులన్.

భావము:
పద్మాక్షుడు శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్ర బహు అందమైనది. ఆమె సుందర సుకుమార వయో రూప విలాసాలు తన చిత్తానికి హత్తుకోగా, ఆ ఇంద్రతనయుడు అర్జునుడు మన్మథబాణాలకు గురై ఆమెపై మనసులో మిక్కిలి ఇష్టపడ్డాడు. దేవేంద్ర తనయుడు; స్వచ్ఛమైన యశోవిరాజితుడూ; నిర్మలహృదయుడూ; మానినీ మనోహరుడు; అయిన అర్జునుడిని చూసి సుభద్ర మరుని శరపరంపరకు లోనై కలవరపడింది. సిగ్గూ మురిపెమూ మోహమూ ఎక్కువ అయి ఆ తరుణీమణి చూపులలో ప్రతిఫలిస్తున్నాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=81&Padyam=1171

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :