Tuesday, August 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౫(615)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1281-సీ.
నరనాథ! యొకనాఁడు నలినాయతాక్షుండు-
  వొలుచు కుశస్థలీపురము నందు
సుఖముండ నొక్క భూసురవర్యు భార్యకుఁ-
  బుత్త్రుండు జన్మించి పుట్టినపుడ
మృతుఁడైన ఘనశోకవితతిచేఁ గ్రాఁగుచు-
  నా డింభకునిఁ గొంచు నవనిసురుఁడు
సనుదెంచి పెలుచ రాజద్వారమునఁ బెట్టి-
  కన్నుల బాష్పాంబుకణము లొలుక
10.2-1281.1-తే.
"బాపురే! విధి నను దుఃఖపఱుపఁ దగునె?"
యనుచు దూఱుచుఁ దనుఁ దిట్టుకొనుచు వగల
డెంద మందంద యెరియ నాక్రందనంబు
సేయుచును వచ్చి యా విప్రశేఖరుండు.

భావము:
“మహారాజా! తామరల వంటి విశాల నయనాల వాడు శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా ఉంటున్న రోజులలో, ఒక విప్రుని భార్యకు పుత్రుడు పుట్టి పుట్టగానే చనిపోయాడు. శోకంతో కన్నీళ్ళు పెట్టుకుని మృతబాలుడిని ఎత్తుకుని వచ్చి, ఆ బాలుడి శవాన్ని రాజద్వారం ముందు పెట్టి, విధిని నిందిస్తూ, తనను తాను తిట్టుకుంటూ, బ్రహ్మణుడు గుండెబ్రద్దలయ్యేలా “అయ్యో” అంటూ దుఃఖించసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1281

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, August 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౪(614)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1279-సీ.
మునినాయకులతోడఁ దన పోయి వచ్చిన-
  తెఱఁగును దనమది దృష్టమైన
మూఁడుమూర్తుల విధంబును నెఱింగించిన-
  విని వారు మనముల విస్మయంబు
నంది చిత్తంబున సందేహమునుఁ బాసి-
  చిన్మయాకారుండు, శ్రీసతీశుఁ,
డనుపముఁ, డనవద్యుఁ, డఖిల కల్యాణగు-
  ణాకరుఁ, డాదిమధ్యాంతరహితుఁ,
10.2-1279.1-తే.
డై తనర్చిన పుండరీకాక్షుఁ డొకఁడ
కాక గణుతింప దైవ మొక్కరుఁడు వేఱ
కలఁడె యనుబుద్ధి విజ్ఞాన కలితు లగుచు
హరిపదాబ్జాతయుగళంబు నర్థిఁ గొలిచి.
10.2-1280-వ.
అట్లు సేవించి యవ్యయానందంబయిన వైకుంఠధామంబు నొంది; రని చెప్పి వెండియు నిట్లనియె.

భావము:
ఆ ఋషీశ్వరులకు తను వెళ్ళివచ్చిన వివరాలు, తనకు అవగతము అయిన త్రిమూర్తుల స్వభావాలు భృగుమహర్షి సవిస్తరంగా తెలిపాడు. ఆ మునీంద్రులు అచ్చెరు వొందారు. వారు సందేహాలు విడిచిపెట్టారు. సకల కల్యాణనిధి, చిన్మయస్వరూపుడు, లక్ష్మీపతి, అనుపమ అనవద్యుడు, ఆదిమధ్యాంత రహితుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీమహావిష్ణువు ఒక్కడే పరమదైవం అని నిర్ణయించారు. అలా ఆ మునులు మహాఙ్ఞానులు అయి, హరిపాదారవింద ధ్యానరతులు అయి, ప్రీతితో సేవించారు. అలా విష్ణుమూర్తిని భక్తితో సేవించిన ఆ మునులు వైకుంఠప్రాప్తిని పొందారు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షుత్తుతో ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1279

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, August 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౩(613)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1278-వ.
మునీంద్రా! భవదీయ పాదాబ్జహతి మద్భుజాంతరంబునకు భూషణం బయ్యె; భవదాగమనంబు మాఁబోటివారికి శుభావహం బగుంగాదె; యేను ధన్యుండ నైతి" నని మృదుమధురాలాపంబుల ననునయించిన నమ్మునివరుండు లక్ష్మీనాథు సంభాషణంబులకుఁ జిత్తంబునం బరమానందంబు నొంది, యమ్ముకుందు ననంతకల్యాణగుణనిధి నభినందించి, యానందబాష్పధారాసిక్త కపోలుం డగుచుఁ దద్భక్తి పారవశ్యంబున నొండు పలుకనేరక యతనిచేత నామంత్రణంబువడసి మరలి సరస్వతీతీరంబున నున్న మునుల సన్నిధికిం జనుదెంచి వారలం గనుంగొని.

భావము:
ఓ మునీశ్వరా! నీ పాదతాడనము నా వక్షానికి అలంకారము అయిది. నీ రాక మా వంటి వారికి శుభదాయకం కదా. నేను ధన్యుడను అయ్యాను.” అని మృదుమధురంగా మాట్లాడాడు. శ్రీపతి మధురోక్తులకు భృగుమహర్షి మనసు సంతుష్టి చెందింది. ఆ శ్రీహరిని, ముకుందుడిని, అనంతగుణ నిధిని పలువిధాల స్తుతించాడు. ఆనంద భక్తి పారవశ్యాలతో కనులు చెమర్చుతుండగా విష్ణువు దగ్గర అనుమతి తీసుకొని, వెనుదిరిగి సరస్వతీనదీ తీరంలో ఉన్న మునుల వద్దకు వచ్చి, వారికి విషయం అంతా చెప్పాడు.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1278

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, August 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౨(612)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1277-క.
అలఘుపవిత్ర! భవత్పద
జలములు నను నస్మదీయ జఠరస్థ జగం
బుల లోకపాలురను బొలు
పలరఁగఁ బుణ్యులను జేయు ననఘచరిత్రా!

భావము:
పవిత్రమూర్తి! మహానుభావా! నీ పాదజలం నన్నే కాదు నా కడుపులో ఉన్న సమస్త లోకాలను, లోకపాలకులను పవిత్రం చేయగలదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1277

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, August 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౧(611)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1275-క.
తన విభుపాదములకు వం
దనముం గావించి సముచితప్రియముల న
య్యనలాక్షుని కోపము మా
న్చిన నమ్మునినాథుఁ డచట నిలువక చనియెన్.
10.2-1276-సీ.
పొలుపొందు వైకుంఠపురమున కర్థితోఁ-
  జని యందు సమధికైశ్వర్య మొప్పఁ
గమలాంక పర్యంకగతుఁడై సుఖించు న-
  క్కౌస్తుభభూషు వక్షస్థ్సలంబుఁ
దన పాదమున బిట్టు దన్నెఁ దన్నినఁ బాన్పు-
  డిగి వచ్చి మునిఁ జూచి నగధరుండు
పదముల కెఱఁగి "యో! పరమతపోధన!-
  యీగతి నీ వచ్చు టెఱుఁగ లేక
10.2-1276.1-తే.
యున్న నా తప్పు మన్నించి నన్నుఁ గరుణఁ
జూచి యీ దివ్యమణిమయస్ఫూర్తిఁ దనరు
రుచిర సింహాసనమునఁ గూర్చుండు దివ్య
తాపసోత్తమ! యభయప్రదాననిపుణ!

భావము:
పార్వతీదేవి పతి పాదాలమీదపడి సముచిత మధుర వచనాలతో అతని కోపం పోగొట్టింది. భృగువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పిమ్మట భృగుమహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒడిలో తలపెట్టుకుని పవళించి ఉన్నాడు. కౌస్తుభమణితో విరాజిల్లుతున్న విష్ణువు యొక్క వక్షాన్ని మునీశ్వరుడు తన కాలితో గట్టిగా తన్నాడు. నారాయణుడు నిర్వికారంగా పానుపు దిగి, ముని దగ్గరకు వచ్చి, కాళ్ళకు నమస్కారించి ఇలా అన్నాడు. “ఓ మునివర! దివ్య తపశ్శాలి! నీ రాకను గురించి తెలిసికొనలేక నేను చేసిన అపరాధాన్ని మన్నించు నన్ను కరుణించు. నీవు అభయము ఇచ్చుటలో ముందుండు వాడవు. ఈ మణిమయ సింహాసనంపై ఆసీనులు కండు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1276

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, August 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౦(610)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1272-క.
కనుఁగొని భ్రాతృస్నేహం
బునఁ గౌఁగిటఁ జేర్చు ననుచు ముక్కంటి రయం
బున నెదురేగిన ముని రు
ద్రుని యందలి సత్త్వగుణ మెఱుంగుటకొఱకై.
10.2-1273-వ.
అతనిం గైకొనక యూరకుండిన.
10.2-1274-ఉ.
ఆ నిటలాంబకుండు గమలాసన నందనుఁ జూచి భూరి కా
లానల రోషవేగ భయదాకృతిఁ దాల్చి పటుస్ఫులింగ సం
తానము లొల్క శూలమునఁ దాపసముఖ్యు నురంబు వ్రేయఁగాఁ
బూనినఁ బార్వతీరమణి బోరన నడ్డము వచ్చి చెచ్చెరన్;

భావము:
భృగువు సోదరవాత్సల్యంతో తనను కౌగలించుకుంటాడు అనుకుని పరమశివుడు వేగంగా అతనికి ఎదురు వెళ్ళాడు. కాని, శివుడి సత్త్వగుణం పరీక్షించాలనే ఉద్దేశంతో భృగువు శివుని రాకకు స్పందించకుండా ఊరక నిలబడ్డాడు. ముక్కంటి పరమశివుడు, బ్రహ్మపుత్రుడైన భృగువు ఎడల ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన విస్ఫులింగాలు వెదజల్లే త్రిశూలంతో ఆ మహర్షిని వక్షంపై పొడవడానికి ప్రయత్నించాడు. కాని, పార్వతీదేవి చటుక్కున అడ్డువచ్చి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1274

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౦౯(609)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1270-క.
మనమునఁ గలఁగుచు భృగుఁ దన
తనుజాతుం డనుచు బుద్ధిఁ దలఁచినవాఁడై
ఘనరోషస్ఫురితాగ్నిని
ననయము శాంతోదకముల నల్లన నార్చెన్.
10.2-1271-చ.
మహితతపోధనుండు మునిమండనుఁ డయ్యెడఁ బాసి వెండియు
న్నహిపతిభూషుఁ గాన రజతాద్రికి నేగిన నగ్గిరీంద్రుపైఁ
దుహినమయూఖశేఖరుఁడు దుర్గయుఁ దానును విశ్రమించుచున్
దృహిణతనూభవుండు సనుదెంచుట కాత్మఁ బ్రమోదమందుచున్.

భావము:
చతుర్ముఖుడు తన మనసులో కలతపడ్డాడు. భృగువు తన కొడుకే కదా అనుకుని, బ్రహ్మదేవుడు తన రోషాన్ని ఎలాగో చల్లార్చుకున్నాడు. ఆ మహాతపశ్శాలి, మునివరుడు, భృగుమహర్షి బ్రహ్మదేవుడి సభనుండి నిష్క్రమించి, నాగాభరణుడు అయిన ఈశ్వరుని కోసం కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ వెండికొండ మీద విశ్రమించి ఉన్న పార్వతీపరమేశ్వరులు బ్రహ్మదేవుని పుత్రుడు అయిన భృగువు రాకకు సంతోషించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1271

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, August 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౮(608)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1267-క.
వితతక్రియ లొప్పఁగ స
త్క్రతువుల నొనరించు చచటఁ గైకొని లక్ష్మీ
పతి భవ పితామహులలో
నతులితముగ నెవ్వ రధికు లని తమలోనన్.
10.2-1268-వ.
ఇట్లు దలపోసి తన్మమహత్త్వం బంతయుం తెలిసి రమ్మని భృగు మహాముని నమ్మువ్వురు వేల్పులకడకుం బంపిన నత్తాపసోత్తముండు సనిచని ముందట.
10.2-1269-క.
జలరుహసంజాత సభా
స్థలమున కొగి నేఁగి యతని సత్త్వగుణంబుం
దెలియుటకై నుతివందన
ములు సేయక యున్న నజుఁడు ముసముస యనుచున్.

భావము:
వారు పలు యాగాలను వైభవోపేతంగా చేయసాగారు. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు ఎక్కువ గొప్పవారు అన్న చర్చ వారి మధ్య వచ్చింది. ఇలా చర్చించుకుని, భృగుమహర్షిని త్రిమూర్తుల మహత్యములను పరీక్షించి రమ్మని పంపారు. అంతట ఆ మహర్షి బయలుదేరి వెళ్ళి ఆయన సత్త్వ గుణసంపదను పరీక్షించాలి అనుకుని, బృగుమహర్షి బ్రహ్మదేవుడి కొలువులోనికి ప్రవేశించాడు. బ్రహ్మను స్తుతించకుండా ఆ మహర్షి మౌనంగా నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు రుసరుస లాడి చిరాకుగా చూస్తూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1269

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, August 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౭(607)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1264-క.
“మానవనాయక! యీ యా
ఖ్యానముఁ జదివినను వినిన ఘనపుణ్యులు ని
త్యానంద సౌఖ్యములఁ బెం
పూనుదు రటమీఁద ముక్తి నొందుదు రెలమిన్!”
10.2-1265-వ.
అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.
10.2-1266-క.
"జననాయక! యింకఁ బురా
తనవృత్తం బొకటి నీకుఁ దగ నెఱిఁగింతున్.
వినుము తపోమహిమలఁ జెం
దిన మునిజనములు సరస్వతీనది పొంతన్.

భావము:
ఈ వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు. ఇలా ఈ ఉపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఇంకా ఇలా అన్నాడు. “మహారాజా! నీకు ఇంకొక పురాతనగాథ చెబుతాను విను. పూర్వం తపోధనులైన మునులు ఎందరో సరస్వతీనదీ తీరంలో ఉండేవారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1266

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౦౬(606)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1262-క.
మురహరుఁ డెల నవ్వొలయఁగఁ
బురుహరుఁ దగఁ జూచి పలికె "భూతేశ్వర! యీ
నరభోజనుండు నీ కి
త్తఱి నెగ్గొనరింపఁ దలఁచి తానే పొలిసెన్.
10.2-1263-వ.
అది యట్టిద కాదె! యిజ్జగంబున నధికుండయిన వానికి నపకారంబు గావించిన మానవునకు శుభంబు గలుగునే? యదియునుంగాక జగద్గురుండవగు నీ కవజ్ఞ దలంచు కష్టాత్ముండు వొలియుటం జెప్పనేల? యిట్టి దుష్టచిత్తుల కిట్టి వరంబులిచ్చుట కర్జంబు గా"దని యప్పురాంతకు వీడ్కొలిపిన, నతండు మురాంతకు ననేక విధంబుల నభినందించి నిజ మందిరంబునకుం జనియె" నని చెప్పి యిట్లనియె.

భావము:
మురాసురసంహారి శ్రీహరి చిరునవ్వుతో పరమ శివుడితో ఇలా అన్నాడు “భూతేశ్వరా! ఈ దానవుడు నీకు అపకారం తలపెట్టి తనకు తానే మరణించాడు. అలాగే అవుతుంది కదా. లోకంలో మహాత్ములకు కీడు చేసిన వాడికి శుభాలు దక్కవు కదా. అలాంటిది లోకేశ్వరుడవు అయిన నీకు అపకారం తలపెట్టిన దుష్టుడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వడం తగదు.” అని ఈ రీతిగా పలికిన విష్ణువు శంకరుడికి వీడ్కోలు చెప్పాడు. హరుడు హరిని అనేక విధాలుగా స్తుతిస్తూ తన నివాసానికి వెళ్ళిపోయాడు.” అని చెప్పి మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1263

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, August 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౫(605)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1260-క.
సుర లసురాంతకు మీఁదన్
వరమందారప్రసూన వర్షము లోలిం
గురిసిరి తుములంబై దివి
మొరసెన్ సురదుందుభిప్రముఖతూర్యంబుల్‌.
10.2-1261-క.
పాడిరి గంధర్వోత్తము
లాడిరి దివి నప్సరసలు నన్యోన్యములై
కూడిరి గ్రహములు భయముల
వీడిరి మునికోటు లంత విమలచరిత్రా!

భావము:
దానవవైరి హరి మీద దేవతలు మందార పూల వాన కురిపించారు. ఆకాశంలో దేవ దుందుభులు మున్నగు దివ్య వాయిద్యాలు మ్రోగాయి. గంధర్వులు పాటలు పాడారు. అప్సరసలు సంతోషంతో నాట్యాలు చేశారు, ఆకాశంలో గ్రహాలన్నీ కూటములు కట్టాయి. మునుల భీతిని విడిచారు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1261

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, August 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౪(604)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1257-ఆ.
అశుచి యగుచు నతని నంటఁగఁ బని గాదు
కాలుఁ జేయిఁ గడిగి కడఁక వార్చి
యతనివెంట వేడ్క నరుగుదువే నీవు
నవల నంటఁ దగును నసురనాథ!
10.2-1258-మ.
అతి దుశ్శంకలు మాని పొ"మ్మనిన దైత్యారాతి మాయా విమో
హితుఁడై విస్మృతి నొంది తామసముచే నేపారి వాఁ డాత్మ పా
ణితలంబుం దన నెత్తి మోపికొని తా నేలన్ వెసం గూలె వి
శ్రుతదంభోళిహతిన్ వడింబడు మహా క్షోణీధరంబో యనన్.

భావము:
అదీగాక దైత్యేంద్రా! నీవు అశుచిగా ఉండి మహేశుడిని తాకడం తగదు. అందుచేత, వెళ్ళి కాళ్ళుచేతులూ కడుగుకుని, ఆచమనం చెయ్యి. అప్పుడు శివుడిని వెంబడించి అతడిని తాకావచ్చు, నీ సందేహం తీర్చుకోనూవచ్చు. అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు. వెంటనే బయలుదేరు.” అంటూ దానవాంతకుడు అయిన విష్ణువు హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమాయ వలన తనను తాను మరచి, తామసంతో తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని మరణించాడు. వృకాసురుడు ప్రసిద్ధమైన వజ్రాయుధం దెబ్బకు కూలిన మహా పర్వతంలా నేలకూలాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1258

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౩(603)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1255-చ.
హరి దరహాస మొప్పఁ బిశితాశనుఁ గన్గొని పల్కె "దానవే
శ్వర! మును దక్షుశాపమునఁ జాలఁ బిశాచిపతౌట సూనృత
స్ఫురణము మాని సంతతము బొంకుచునుండు పురారిమాట నీ
వరయక వెంట నేఁగఁ దగ దాతని చేఁతలు మాకు వింతలే?
10.2-1256-ఆ.
నిజము పలికె నేని నెఱిఁ దన తలమీఁద
నీ కరంబు మోపనీక తలఁగి
వచ్చునోటు! నితనివలనఁ బ్రత్యయమునఁ
దగుల నేమి గలదు దనుజవర్య!

భావము:
విష్ణుమూర్తి మందహాసంచేస్తూ ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసరాజ! మునుపు దక్షుడి శాపం వలన పిశాచాలకు అధిపతి అయ్యాడు. కనుక, శంకరుడు నిజాలు మానేసి అబద్దాలే చెప్తున్నాడు. ఆయన గారి చేష్టలు మాకేమీ కొత్తకాదులే. శివుని విషయం తెలియక అతని వెంట అనవసరంగా పడుతున్నావు. దానవోత్తమా! పరమేశ్వరుడు సత్యం పలికేవాడే అయితే నీ చేయ్యి తన శిరస్సుకు తగలనీయకుండా భయంతో ఎందుకు పారిపోతాడు? ఇంతకీ శివుడి విషయంలో నమ్మదగినది ఏమైనా ఉన్నదా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1255

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, August 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౨(602)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1254-వ.
కైతవంబున నతనికి నమస్కరించి, మృదుమధుర భాషణంబుల ననునయించుచు, నయ్యసురవరున కిట్లను; “నివ్విధంబున మార్గపరిశ్రాంతుండవై యింత దూరంబేల చనుదెంచితి? సకల సౌఖ్య కారణంబైన యీ శరీరంబు నిరర్థకంబు సేసి వృథాయాసంబున దుఃఖపఱుపం దగునే? యియ్యెడం గొంతతడవు విశ్రమింపు; మీ ప్రయాసంబునకుఁ గతంబెయ్యది? కపటహృదయుండవు గాక నీ యధ్యవసాయం బెఱింగింపందగునేని నెఱింగింపు” మని మృదు మధురంబుగాఁ బలికిన నమ్మహాత్ముని సుధారసతుల్యంబు లయిన వాక్యంబులు విని సంతసిల్లి, యప్పిశితాశనుండు దన పూనినకార్యం బతని కెఱింగించిన.

భావము:
బ్రహ్మచారి వేషంలో వెళ్ళిన విష్ణువు, దానవుడు వృకాసురుడికి కపట నమస్కారం చేసాడు. తియ్యని మృదు భాషణాలతో రాక్షసునితో ఇలా స్వాంతన వచనాలు పలికాడు. “అన్నా! ఇంత అలసిపోతు ఎందుకింత దూరం వచ్చావు? ఏ సుఖాలకైనా మూలమైనది ఈ శరీరమే కదా. ఊరక దానిని ఇలా ఎందుకు దుఃఖపెడుతున్నావు? ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంతటి నీ ప్రయాసకు కారణము ఏమిటి?” అని వాడిని ప్రశ్నించాడు. ఆ వటురూపి తీయనిమాటలకు సంతోషించి, ఆ రాక్షసుడు తాను తలపెట్టిన కార్యాన్ని వివరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1254

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, August 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౧(601)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1250-వ.
అట్లు చనిచని.
10.2-1251-సీ.
నిరుపమానందమై నిఖిల లోకములకు-
  నవలయై యమృతపదాఖ్యఁ దనరి
దినకర చంద్ర దీధితులకుఁ జొరరాక-
  సలలిత సహజ తేజమున వెలుఁగు
సమధికంబగు శుద్ధసత్త్వ గరిష్ఠమై-
  కరమొప్ప యోగీంద్రగమ్య మగుచు
హరిపదధ్యాన పరాయణులైన త-
  ద్దాసుల కలరు నివాస మగుచుఁ
10.2-1251.1-తే.
బ్రవిమలానంత తేజోవిరాజమాన
దివ్యమణి హేమకలిత సందీప్త భవ్య
సౌధమండపతోరణ స్తంభ విపుల
గోపురాది భాసురము వైకుంఠపురము.

భావము: 
శివుడు అలా పరగెత్తుకు వెళ్ళి వైకుంఠపురం చూసాడు. ఆ వైకుంఠాన్ని నిరుపమాన ఆనందనిలయము అమృతపదం, పరమపదం అని ప్రసిద్ధమై నిఖిలలోకాలకూ అవతల సూర్యచంద్ర కిరణాలుసైతం ప్రవేశించటానికి వీలులేని విధంగా ఉండి, మనోఙ్ఞమైన సహజసిద్ధ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది. యోగులకూ భాగవతశ్రేష్టులకూ నివాసస్థలంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. మిక్కలి నిర్మలమైన అనంత తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. దివ్యమైన రత్నాలు, బంగారుమయమై ప్రకాశించే భవనాలు, మండపాలు, తోరణాలు, స్తంభాలు, విస్తారమైన గోపురాలుతో భాసిస్తూ ఉంటుంది ఆ వైకుంఠపురము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1251

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, August 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౦(600)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1246-క.
అని వేఁడిన నమ్మాటలు
విని మదనారాతి నవ్వి విబుధాహితు కో
రిన వరముఁ దడయ కిచ్చిన
దనుజుఁడు తద్వర పరీక్షఁ దాఁ జేయుటకున్.
10.2-1247-వ.
ఆ క్షణంబు వరదాన గర్వంబున నుద్వృత్తుండై కడంగి.
10.2-1248-క.
ఆ హరుమస్తకమునఁ గడు
సాహసమునఁ జేయి వెట్ట జడియక కదియ
"న్నోహో! తన మెచ్చులు దన
కాహా! పై వచ్చె" ననుచు నభవుఁడు భీతిన్.

భావము:
అలా అని ఆ రాక్షసుడు ప్రార్ధించాడు. అది విని శివుడు చిరునవ్వు నవ్వుతూ అతడు కోరిన వరము వెంటనే ఇచ్చాడు. ఆ రాక్షసుడు పార్వతీపతి తనకు అనుగ్రహించిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు. తక్షణమే వరగర్వంతోవాడు అహంకరించాడు. ఆ వరం పరీక్షించడానికి సిద్ధపడి ముందుకు వచ్చి. తన చేతిని పరమశివుడి తలమీద పెట్టడానికి ఆ రాక్షుసుడు తెగించాడు. “అయ్యయ్యో నేనిచ్చిన వరం నామీదకే అపాయం తెచ్చిపెట్టిందే” అని శివుడు భయపడి పరుగెత్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1248

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౫౯౯(599)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1243-క.
అరుదుగ వెలువడి రుద్రుఁడు
గరుణ దలిర్పంగ వానికర మాత్మకరాం
బురుహమునఁ బట్టి "తెగువకుఁ
జొర వలవదు; మెచ్చు వచ్చె సుమహిత చరితా!
10.2-1244-క.
నీమదిఁ బొడమిన కోరిక
లేమైనను వేఁడు మిపుడ యిచ్చెద" ననినం
దా మనమున సంతసపడి
యా మనుజాశనుఁడు హరుపదాంబుజములకున్.

భావము:
పరమశివుడు ఆ అగ్ని గుండంలో నుండి వెలువడి దయతో ప్రత్యక్షము అయ్యాడు. వృకాసురుని చేతిని పట్టుకుని, “సాహసించకు. నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నీ మనసులో ఎట్టి కోరికలున్నా కోరుకో. వెంటనే నెరవేరుస్తాను.” అని శివుడు అనగా, వృకాసురుడు ఎంతో సంతోషపడి, శంకరుని పాదాలపై పడ్డాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1244

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౮(598)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1242-సీ.
దీపించు కేదార తీర్థంబునకు నేగి-
  యతిసాహసాత్మకుం డగుచు నియతి
లోకముల్‌ వెఱఁగంద నా కాలకంధరు-
  వరదుని నంబికావరునిఁ గూర్చి
తన మేనికండ లుద్దండుఁడై ఖండించి-
  యగ్ని కాహుతులుగా నలర వేల్చి
దర్పకారాతి ప్రత్యక్షంబుగాకున్న;-
  జడియక సప్తవాసరము నందుఁ
10.2-1242.1-తే.
బూని తత్తీర్థమునఁ గృతస్నానుఁ డగుచు
వెడలి మృత్యువు కోఱనా వెలయునట్టి
గండ్రగొడ్డంటఁ దన మస్తకంబు దునుము
కొనఁగఁ బూనిన నయ్యగ్నికుండమునను.

భావము:
వృకాసురుడు బయలుదేరి కేదారతీర్థానికి వెళ్ళాడు. అక్కడ సాహసోపేతమైన నియమాలతో నీలకంఠుని, వరదుడిని, మహేశ్వరుడిని గురించి ఘోరతపస్సు చేసాడు. ఆ తీవ్రతపస్సు చూసి లోకాలన్నీ అచ్చెరువొందాయి. తన శరీరం లోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి అగ్నికి ఆహుతి కావించాడు. అప్పటికి కూడ మదనాంతకుడు పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడు పట్టువదలక కేదారతీర్ధంలో స్నానం చేసి మృత్యుకోరవంటి భయంకరమైన గండ్రగొడ్డలితో తన తలని నఱికుకొనుటకు సిద్ధమయ్యాడు. అంతట ఆ అగ్నికుండంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1242

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :