Tuesday, March 31, 2020

ధ్రువోపాఖ్యానము - 22

4-280-వ.
ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలి యై స్తోత్రంబు చేయ నిశ్చయించియు స్తుతిక్రియాకరణ సమర్థుండుఁ గాక యున్న ధ్రువునకును సమస్త భూతంబులకు నంతర్యామి యైన యీశ్వరుం డాతని తలంపెఱింగి వేదమయం బయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును, భక్తిభావ నిష్ఠుండును నగు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తిగల యీశ్వరుని భగవత్ప్రతిపాదితంబు లగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె “దేవా! నిఖిలశక్తి ధరుండవు నంతఃప్రవిష్టుండవు నైన నీవు లీనంబు లైన మదీయ వాక్యంబులం బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వ గాదులను జిచ్ఛక్తిచేఁ గృపంజేసి జీవింపం జేసిన భగవంతుం డవును, బరమపురుషుండవును నైన నీకు నమస్కరింతు; నీ వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేష విశ్వంబు మాయాఖ్యం బయిన యా త్మీయశక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుఁ దత్తద్దేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారువు లందున్న వహ్ని చందంబునం బ్రకాశింతువు; అదియునుం గాక.
4-281-చ.
వరమతి నార్తబాంధవ! భవద్ఝన బోధసమేతుఁడై భవ
చ్చరణముఁ బొంది నట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమం
దరయఁగఁ జూచురీతిఁ గనునట్టి ముముక్షు శరణ్యమైన నీ
చరణములం గృతజ్ఞుఁడగు సజ్జనుఁ డెట్లు దలంపకుండెడున్?

భావము:
ఈ విధంగా సాష్టాండ దండ ప్రణామం చేసి, చేతులు జోడించి శ్రీహరిని స్తుతించాలనుకొని, స్తుతి విధానం తెలియక మిన్నకున్నాడు ధ్రువుడు. సర్వాంతర్యామియైన భగవంతుడు ధ్రువుని తలంపు గ్రహించి తన చేతిలో ఉన్న వేదమయమైన పాంచజన్య శంఖంతో ఆ బాలుని చెక్కిలిని స్పృశించాడు. ఆ ప్రభావం వల్ల జీవేశ్వర నిర్ణయాన్ని గుర్తించిన ధ్రువుడు భక్తిభావంతో భగవంతుడు ప్రసాదించిన వేదవాక్కులతో విశ్వవిఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించాడు. “దేవా! నీవు అఖిల శక్తిసంపన్నుడవు. అంతర్యామివి. స్తంభించిపోయిన నా వాక్కులను, ప్రాణాలను, నా కరచరణాది సకలేంద్రియాలను దయతో జ్ఞానాత్మకమైన నీ శక్తివల్ల తిరిగి బ్రతికించిన భగవంతుడవు. పరమపురుషుడవైన నీకు నమస్కారం. నీవు ఒక్కడవే అయినప్పటికీ నీ మాయాశక్తిచేత ఈ సమస్త విశ్వాన్ని సృజిస్తావు. ఆ విశ్వంలో ప్రవేశిస్తావు. ఇంద్రియాలతో నివసిస్తావు. అగ్ని ఒక్కటే అయినా ఎన్నో దారువులలో ప్రకాశించే విధంగా నీవు ఆయా దేవతారూపాలలో ప్రవేశించి ప్రకాశిస్తావు. దీనబాంధవా! నిద్రనుండి మేలుకొన్నవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లుగా బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానంచేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శిస్తాడు. మోక్షం కోరే వారికి శరణాలైన నీ చరణాలను కృతజ్ఞుడైన సజ్జనుడు ఎలా మరచిపోగలడు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=281

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Monday, March 30, 2020

ధ్రువోపాఖ్యానము - 21

4-278-సీ.
హరి యీశ్వరుండు విహంగ కులేశ్వర;
యానుఁడై నిజభృత్యుఁడైన ధ్రువునిఁ
గనుఁగొను వేఁడుక జనియింప నా మధు;
వనమున కప్పుడు చని ధ్రువుండు
పరువడి యోగవిపాక తీవ్రంబైన;
బుద్దిచే నిజమనోంబురుహ ముకుళ
మందుఁ దటిత్ప్రభాయత మూర్తి యటఁ దిరో;
ధానంబునను బొంది తత్క్షణంబ
4-278.1-తే.
తన పురోభాగమందు నిల్చినను బూర్వ
సమధికజ్ఞాన నయన గోచర సమగ్ర
మూర్తిఁ గనుఁగొని సంభ్రమమునను సమ్మ
దాశ్రువులు రాలఁ బులకీకృతాంగుఁ డగుచు
4-279-తే.
నయనముల విభుమూర్తిఁ బానంబు చేయు
పగిదిఁ దన ముఖమునను జుంబనము చేయు
లీలఁ దగ భుజములను నాలింగనంబు
చేయుగతి దండవన్నమస్కృతు లొనర్చె.

భావము:
భగవంతుడైన హరి గరుడవాహన మెక్కి తన భక్తుడైన ధ్రువుణ్ణి చూడాలనే ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు ధ్రువమైన భక్తియోగంతో, నిశ్చలమైన బుద్ధితో తన మనస్సులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండటం చేత బయట ఉన్న శ్రీహరిని చూడలేకపోయాడు. ఇంతలో అతని మనస్సులోని మూర్తి మాయమై పోయింది. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు. తొట్రుపాటు చెందాడు. చెక్కిళ్ళపై స్రవించే ఆనంద బాష్పాలతో స్వామిని తిలకించి పులకించాడు. తన కళ్ళతో స్వామి సౌందర్యాన్ని పానం చేస్తున్నట్లు, తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు, తన చేతులతో స్వామిని కౌగిలించుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=278

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 20


4-276-చ.
"హరి! పరమాత్మ! కేశవ! చరాచర భూతశరీర ధారివై
పరఁగుదు వీవు; నిట్టులుగఁ బ్రాణనిరోధ మెఱుంగ మెందు ముం
దిరవుగ దేవదేవ! జగదీశ్వర! సర్వశరణ్య! నీ పదాం
బురుహము లర్థిమై శరణు బొందెద మార్తి హరించి కావవే!"
4-277-వ.
అని దేవతలు విన్నవించిన నీశ్వరుండు వారల కిట్లనియె “ఉత్తానపాదుం డనువాని తనయుండు విశ్వరూపుండ నయిన నా యందుఁ దన చిత్తం బైక్యంబు చేసి తపంబు గావించుచుండ, దానంజేసి భవదీయ ప్రాణనిరోధం బయ్యె; అట్టి దురత్యయం బైన తపంబు నివర్తింపఁ జేసెద: వెఱవక మీమీ నివాసంబులకుం జనుం” డని యానతిచ్చిన నా దేవతలు నిర్భయాత్ములై యీశ్వరునకుఁ బ్రణామంబు లాచరించి త్రివిష్టపంబునకుం జనిరి; తదనంతరంబు.

భావము:
“శ్రీహరీ! పరమాత్మా! కేశవా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు కోరుతున్నాము. ఆపదను తొలగించి కాపాడు.” అని దేవతలు విన్నవించగా శ్రీహరి వారితో ఇలా అన్నాడు. “ఉత్తానపాదుని కొడుకు విశ్వస్వరూపుణ్ణి అయిన నాయందు తన మనస్సును సంధానం చేసి తపస్సు చేస్తున్నాడు. అందువల్ల మీకు ప్రాణనిరోధం కలిగింది. ఆ బాలుణ్ణి తపస్సు నుండి విరమింప జేస్తాను. భయపడకండి. మీ మీ ఇండ్లకు వెళ్ళండి” అని ఆనతి నివ్వగా భయం తొలగిన దేవతలు వాసుదేవునకు నమస్కరించి తమ లోకాలకు బయలుదేరి వెళ్ళారు. ఆ తరువాత...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=277

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, March 28, 2020

ధ్రువోపాఖ్యానము - 19

4-272-తే.
వసుమతీతల మర్ధము వంగఁ జొచ్చె
భూరిమద దుర్నివారణ వారణేంద్ర
మెడమఁ గుడి నొరగఁగ నడు గడుగునకును
జలన మొందు నుదస్థిత కలము వోలె.
4-273-చ.
అతఁడు ననన్యదృష్టిని జరాచర దేహిశరీర ధారణా
స్థితి గల యీశునందుఁ దన జీవితమున్ ఘటియింపఁ జేసి యే
కతఁ గనఁ దన్నిరోధమునఁ గైకొని కంపము నొందె నీశ్వరుం;
డతఁడు చలింప నిజ్జగము లన్నియుఁ జంచల మయ్యె భూవరా!
4-274-క.
ఆలోకభయంకర మగు
నా లోకమహావిపద్దశాలోకనులై
యా లోకపాలు రందఱు
నా లోకశరణ్యుఁ గాన నరిగిరి భీతిన్.
4-275-వ.
అట్లరిగి నారాయణు నుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి యిట్లనిరి.

భావము:
మదపుటేనుగు కుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగడుగునా కంపించే పడవలాగా సగం భూమి వంగి క్రుంగింది. ధ్రువుడు ఏకాగ్రదృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు. తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిలలోకాలూ ప్రకంపించాయి. లోకాలకు సంభవించిన ఆ చూడటానికి భయంకరమైన మహా విపత్తును చూచి అష్ట దిక్పాలకులు మొదలైన లోకపాలు రందరూ భయంతో లోకరక్షకుడైన హరిని దర్శించడానికి వెళ్ళారు. అలా వెళ్ళి దేవతలంతా నారాయణునికి నమస్కరించి చేతులు మోడ్చి ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=274

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధ్రువోపాఖ్యానము - 18

4-270-వ.
అట్లు గని డాయంజని యమునానదిం గృతస్నానుండై నియతుండును, సమాహిత చిత్తుండును నై సర్వేశ్వరుని ధ్యానంబు చేయుచుం బ్రతిత్రిరాత్రాంతంబునఁ గృత కపిత్థ బదరీఫల పారణుం డగుచు దేహ స్థితి ననుసరించి యిటుల నొక్కమాసంబు హరిం బూజించి, యంత నుండి యాఱేసి దినంబుల కొక్కపరి కృతజీర్ణ తృణ పర్ణాహారుం డగుచు, రెండవ మాసంబున విష్ణుసమారాధనంబు చేసి, యంత నుండి నవరాత్రంబుల కొకమా ఱుదకభక్షణంబు చేయుచు, మూఁడవ మాసంబున మాధవు నర్చించి, యంతనుండి ద్వాదశ దినంబుల కొకమాఱు వాయుభక్షణుం డగుచు, జితశ్వాసుండై నాలవ మాసంబునం, బుండరీకాక్షుని భజియించి, యంతనుండి మనంబున నలయక నిరుచ్ఛ్వాసుండై యేకపదంబున నిలిచి, పరమాత్మఁ జింతించుచు, నచేతనంబైన స్థాణువుంబోలె నైదవ మాసంబును జరిపె; అంత.
4-271-సీ.
సకల భూతేంద్రి యాశయ మగు హృదయంబు;
నందు విషయములఁ జెందనీక
మహదాది తత్త్వ సమాజమ్ములకును నా;
ధార భూతమును బ్రధాన పూరు
షేశ్వరుఁ డైనట్టి శాశ్వత బ్రహ్మంబుఁ;
దనదైన హృదయ పద్మమున నిలిపి
హరి రూపమున కంటె నన్యంబు నెఱుఁగక;
చిత్త మవ్విభునందుఁ జేర్చియున్న
4-271.1-తే.
కతన ముల్లోకములు చాలఁ గంపమొందె;
వెండియును బేర్చి యయ్యర్భకుండు ధరణి
నొక్కపాదంబు చేర్చి నిల్చున్నవేళఁ
బేర్చి యబ్బాలు నంగుష్టపీడఁ జేసి.

భావము:
ధ్రువుడు మధువనంలో ప్రవేశించి, యమునా నదిలో స్నానం చేసాడు. నియమంతో ఏకాగ్రచిత్తంతో భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. శరీరస్థితినిబట్టి మూడు దినాల కొకసారి వెలగపండ్లను, రేగుపండ్లను ఆరగిస్తూ ఒక్క నెల శ్రీహరిని అర్చిస్తూ గడిపాడు. తరువాత ఆరు దినాలకు ఒకసారి జీర్ణతృణపర్ణాలను తింటూ విష్ణుపూజలో రెండవ నెల గడిపాడు. తొమ్మిది దినాలకు ఒకమారు నీటిని త్రాగి మాధవసమారాధనలో మూడవ నెల గడిపాడు. అనంతరం పన్నెండు దినాల కొకసారి గాలిని ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి నారాయణ సేవలో నాలుగవ నెల గడిపాడు. తరువాత ఒంటికాలిపై నిలిచి పరమాత్ముణ్ణి భజిస్తూ ప్రాణం లేని మ్రోడులాగా నిశ్చలంగా ఐదవ నెల గడిపాడు. ధ్రువుడు చాంచల్యం లేని తన హృదయంలో ఇతర విషయాలను చొరనీయలేదు. మహత్తు మొదలైన తత్త్వాలకు ఆధారభూతుడూ, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడూ, శాశ్వతుడూ అయిన భగవంతుణ్ణి తన హృదయపద్మంలో నిలుపుకున్నాడు. శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనినీ మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని తదాయత్తం చేశాడు. ఈ విధంగా ధ్రువుడు తీవ్రమైన తపస్సును సాగించాడు. అతని తపఃప్రభావాన్ని సహింపలేక ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు భూమిపై ఒంటికాలు మోపి నిలుచున్నాడు. అతని కాలి బొటనవ్రేలి ఒత్తిడికి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=271

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, March 25, 2020

ధ్రువోపాఖ్యానము - 17


4-264-ఉ.
కావున నమ్మహాత్ముఁడు సుకర్మము చేత సమస్త లోకపా
లావళి కందరాని సముదంచిత నిత్యపదంబునం బ్రభు
శ్రీ విలసిల్లఁ జెందుఁ దులసీదళదాము భజించి; యా జగ
త్పావనుఁడైన నీ సుతు ప్రభావ మెఱుంగవు నీవు భూవరా!
4-265-వ.
అదియునుం గాక.
4-266-క.
నీ కీర్తియు జగముల యం
దాకల్పము నొందఁజేయు నంచిత గుణర
త్నాకరుఁ డిట కేతెంచును
శోకింపకు మతనిఁ గూర్చి సుభగచరిత్రా!"
4-267-క.
అని నారదుండు పలికిన
విని మనమున విశ్వసించి విభుఁడును బ్రియ నం
దనుఁ జింతించుచు నాదర
మునఁ జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్.
4-268-వ.
అంత నక్కడ నా ధ్రువుండు.
4-269-క.
చని ముందటఁ గనుఁగొనె మధు
వనమును ముని దేవ యోగి వర్ణిత గుణ పా
వనమును దుర్భవ జలద ప
వనమును నిఖిలైక పుణ్యవరభవనంబున్.

భావము:
రాజా! ఉత్తానపాదా! లోకపావనుడైన నీ పుత్రుని ప్రభావం నీకు తెలియదు కాని. మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యంతో తులసీదళదాముడైన నారాయణుని సేవించి లోకపాలకులు సైతం పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. అంతేకాక పుణ్యాత్మా! నీ కుమారుడు నీ కీర్తిని కల్పాంతం వరకు సుస్థిరంగా ఉండేటట్లు చేస్తాడు. అతడు సుగుణ రత్నాకరుడు. అచిరకాలంలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ పుత్రుని కోసం నీవు దుఃఖించవద్దు.” అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి, ప్రియపుత్రుని తలచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు. ఆ సమయంలో అక్కడ ధ్రువుడు పోయి పోయి ఎదురుగా మధువనాన్ని చూశాడు. దాని పవిత్రతను మునులు, దేవతలు, యోగులు మొదలైన వారు వర్ణించారు. అది సంసారమనే మబ్బును చెదరగొట్టే ప్రభంజనం వంటిది. సకల పుణ్యాలకు తావైనది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=269

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 16

4-261-మ.
చని యుగ్రాటవిఁ జొచ్చి యచ్చటఁ బరిశ్రాంతుండు క్షుత్పీడితుం
డును నామ్లాన ముఖాంబుజుండు ననఘుండున్ బాలకుం డైన మ
త్తనయున్ ఘోర వృ కాహి భల్ల ముఖ సత్త్వశ్రేణి నిర్జించెనో
యని దుఃఖించెద నాదు చిత్తమున నార్యస్తుత్య! యిట్లౌటకున్.
4-262-తే.
అట్టి యుత్తమబాలు నా యంకపీఠ
మందుఁ గూర్చుండనీక నిరాకరించి
యంగనాసక్త చిత్తుండ నైనయట్టి
నాదు దౌరాత్మ్య మిది మునినాథచంద్ర!"
4-263-ఉ.
నా విని నారదుండు నరనాథున కిట్లను "నీ కుమారుఁ డా
దేవకిరీట రత్నరుచిదీపిత పాదసరోజుఁడైన రా
జీవదళాక్ష రక్షితుఁ డశేష జగత్పరికీర్తనీయ కీ
ర్తీవిభవప్రశస్త సుచరిత్రుఁడు; వానికి దుఃఖ మేటికిన్?

భావము:
అలా వెళ్ళి భయంకరమైన అడవిలో ప్రవేశించి మార్గాయాసంతోను, ఆకలి బాధతోను ముఖపద్మం వాడిపోయిన నా కుమారుణ్ణి, ఏపాపం ఎరుగని పసివాణ్ణి తోడేళ్ళు, సర్పాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూరజంతువులు పొట్టన బెట్టుకున్నాయేమో అనే భయంతో, బాధతో లోలోపల కుమిలిపోతున్నాను. మహానుభావా! ఇలా జరిగినందుకు నేను దుఃఖిస్తున్నాను.అటువంటి ఉత్తముడైన బాలుణ్ణి నా ఒడిలో కూర్చోనివ్వక అవమానించాను. మునీంద్రా! నా చిన్న భార్య సురుచి మీది వలపుతో ఈ దుర్మార్గపు పని చేశాను.” ఉత్తానపాదుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు “రాజా! దేవతల కిరీటాల రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కల శ్రీహరి చేత రక్షింపబడే నీ కుమారుడు సమస్త లోకాలు ప్రస్తుతించే కీర్తి సంపదతో ప్రసిద్ధికెక్కిన చరిత్ర కలవాడు. అతనికోసం దుఃఖించడ మెందుకు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=263

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధ్రువోపాఖ్యానము - 15

4-257-తే.
పద్మభవ సూనుఁ డుత్తానపాదు కడకు
నరిగి యా రాజుచే వివిధార్చనముల
నంది సంప్రీతుఁడై యున్నతాసనమున
నెలమిఁ గూర్చుండి యాతని వలను చూచి.
4-258-వ.
ఇట్లనియె.
4-259-క.
"భూనాయక! నీ విపుడా
మ్లానాస్యుఁడ వగుచుఁజాల మదిలోఁ జింతం
బూనుట కేమి కతం?" బన
నా నారదుతోడ నాతఁ డనియెన్ మరలన్.
4-260-క.
"మునివర! వివేకశాలియు
ననఘుఁడు నైదేండ్ల బాలుఁ డస్మత్ప్రియ నం
దనుఁ డదయుఁడ నగు నాచే
తను బరిభవ మొంది చనియెఁ దల్లియుఁ దానున్.

భావము:
నారదుడు ఉత్తానపాదుని దగ్గరకు వెళ్ళి, ఆ రాజు చేసిన నానావిధాలైన పూజలను అందుకొని, ఆనందంతో ఉన్నతాసనంపై కూర్చున్నవాడై ఆ రాజు వంక చూచి ఇలా అన్నాడు. “రాజా! నీ వదనసరోజం వాడి ఉన్నది. నీ మనస్సులోని విచారానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించిన నారదునితో ఉత్తానపాదుడు ఇలా అన్నాడు. “మునీంద్రా! నా ప్రియపుత్రుడు ధ్రువుడు ఐదేండ్లవాడు. మంచి తెలివితేటలు గలవాడు; పాపం ఎరుగనివాడు; అతనిని నేను దయమాలి అవమానించాను. అందుకు వాడు అలిగి తల్లితో పాటు వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=260

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, March 21, 2020

ధ్రువోపాఖ్యానము - 14

4-255-క.
ధృత చిత్తుఁడు శాంతుండు ని
యత పరిభాషణుఁడు సుమహితాచారుఁడు వ
ర్ణిత హరిమంగళ గుణుఁడును
మితవన్యాశనుఁడు నగుచు మెలఁగఁగ వలయున్.
4-256-వ.
ఉత్తమశ్లోకుండగు పుండరీకాక్షుండు నిజమాయా స్వేచ్ఛావతార చరితంబుల చేత నంచింత్యముగా నెద్దిచేయు నద్ది హృదయగతంబుగా ధ్యానంబు చేయం దగు; మఱియుఁ గార్యబుద్ధిం జేసి చేయంబడు పూజావిశేషంబులు వాసుదేవమంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింప వలయు; ఇట్లు మనోవాక్కాయ కర్మంబులచేత మనోగతం బగునట్లుగా భక్తి యుక్తంబు లయిన పూజల చేతఁ బూజింపం బడి, సర్వేశ్వరుండు మాయాభిభూతులు గాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలో ననభిమతార్థంబు నిచ్చు; విరక్తుం డగువాఁడు నిరంతర భావం బయిన భక్తియోగంబునం జేసి మోక్షంబుకొఱకు భజియించు" నని చెప్పిన విని ధ్రువుండు నారదునకుం బ్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షి జనసేవ్యంబై సకలసిద్ధుల నొసంగుచు భగవత్పాద సరోజాలంకృతం బయిన మధువనంబునకుం జనియె; అంత.

భావము:
మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై, సదాచార సంపన్నుడై, శ్రీహరి కళ్యాణగుణాలను వర్ణిస్తూ కందమూలాలను మితంగా స్వీకరిస్తూ ఉండాలి. పురుషోత్తముడైన పుండరీకాక్షుడు తన మాయామహిమతో ఇచ్ఛానుసారంగా పెక్కు అవతారాలను ధరించి చేసిన లీలావిశేషాలను మనస్సులో భావించాలి. ఆత్మార్పణ బుద్ధితో చేసే పూజలను ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవునకు సమర్పించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించేవారు విష్ణుమాయలో చిక్కుకొనరు. వారికి భగవంతుడు ధర్మార్థకామమోక్షాలు అనే పురుషార్థాలలో కోరిన దానిని అనుగ్రహిస్తాడు. విరక్తితో ముక్తిని కోరువాడు, ఎడతెగని భక్తిభావంతో సేవిస్తూ ఉంటాడు” అని నారదుడు ఉపదేశించగా ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి, మహర్షులు నివసించేది, కోరిన కోరికలను ప్రసాదించేది, భగవంతుని పాదపద్మాలచేత అలంకరింపబడింది అయిన మధువనానికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=256

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 



ధ్రువోపాఖ్యానము - 13

4-253-వ.
అయిన పురుషోత్తముఁ బూజించుచు హృదయగతుండును, సాను రాగవిలోకనుండును, వరదశ్రేష్ఠుండును నగు నారాయణు నేకాగ్రచిత్తంబునం ధ్యానంబు చేయుచు బరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్యమంగళస్వరూపంబు చిత్తంబునం దగిలిన మరల మగుడ నేరదు; అదియునుం గాక, యే మంత్రంబేని సప్త వాసరంబులు పఠియించిన ఖేచరులం గనుంగొను సామర్థ్యంబు గలుగు; అట్టి ప్రణవయుక్తం బగు ద్వాదశాక్షర కలితంబును దేశకాల విభాగ వేది బుధానుష్ఠితంబును నయిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ యనెడి వాసుదేవ మంత్రంబునం జేసి.
4-254-సీ.
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము;
జలజంబులను జారుజలజనయనుఁ
దులసీ దళంబులఁ దులసికా దాముని;
మాల్యంబులను సునైర్మల్య చరితుఁ
బత్రంబులను బక్షిపత్రునిఁ గడు వన్య;
మూలంబులను నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి;
దాంబరంబులను పీతాంబరధరుఁ
4-254.1-తే.
దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపముల యందుఁ గాని నిరూఢమైన
సలిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ
గాని పూజింపవలయు నక్కమలనాభు.

భావము:
అటువంటి పురుషోత్తముని పూజించు. హృదయంలో కుదురుకున్నవాడూ, అనురాగమయ వీక్షణాలు వెదజల్లేవాడూ, వరాలను ఇచ్చేవాడూ అయిన నారాయణుని అచంచలమైన మనస్సుతో ధ్యానించు. అప్పుడు ఆ పురుషోత్తముని దివ్యమంగళ విగ్రహం మనస్సులో సాక్షాత్కరించి స్థిరంగా నిలిచిపోతుంది. ఏ మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుందో, ఓంకారంతో కూడి, పన్నెండు అక్షరాలు కలిగి, దేశకాల విభాగాలను తెలుసుకొని జపించవలసిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ఆ వాసుదేవ మంత్రాన్ని జపించాలి. గరికపోచలవలె శ్యామలవర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో, అందమైన పద్మాలవంటి కన్నులు కలిగినవానిని పద్మాలతో, తులసిదండలు ధరించేవానిని తులసీదళాలతో, మాలిన్యం లేని శీలం కలవానిని పూలమాలలతో, పక్షివాహనుని పత్రాలతో, లోకాలకు ఆదిమూలుడైన మహానుభావుని వనమూలికలతో, పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవానిని నారబట్టలతో సేవించాలి. భగవంతుణ్ణి మృణ్మయ, శిలామయ, దారుమయ ప్రతిమలలో కాని, నిర్మల జలాలలో కాని, పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి.
“ఓం నమో భగవతే వాసుదేవాయః” అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధ్రువునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహా మంత్రపూరిత ఘట్టమిది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=254

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, March 19, 2020

ధ్రువోపాఖ్యానము - 12


4-250-వ.
మఱియును.
4-251-సీ.
హార కిరీట కేయూర కంకణ ఘన;
భూషణుం డాశ్రిత పోషణుండు
లాలిత కాంచీకలాప శోభిత కటి;
మండలుం డంచిత కుండలుండు
మహనీయ కౌస్తుభమణి ఘృణి చారు గ్రై;
వేయకుం డానంద దాయకుండు
సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ;
హస్తుండు భువన ప్రశస్తుఁ డజుఁడు
4-251.1-తే.
కమ్ర సౌరభ వనమాలికా ధరుండు
హతవిమోహుండు నవ్యపీతాంబరుండు
లలిత కాంచన నూపురాలంకృతుండు
నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు.
4-252-క.
సరసమనోలోచన ము
త్కరుఁడును హృత్పద్మ కర్ణికా నివసిత వి
స్ఫుర దురునఖ మణిశోభిత
చరణ సరోజాతుఁ డతుల శాంతుఁడు ఘనుఁడున్.

భావము:
ఇంకా ఆ శ్రీహరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉంటాడు. ఆయన ఆశ్రితులను పోషించేవాడు. అతని కటిప్రదేశం అందమైన మొలత్రాడుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలను ధరిస్తాడు. కౌస్తుభం అనే మణికాంతులతో అందమైన కంఠమాలను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖ చక్ర గదా పద్మాలను నాలుగు చేతులలో ధరించి ఉంటాడు. ఆయన లోకప్రసిద్ధుడు. కమ్మని సువాసన గల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆయన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడు. మేలిమి బంగారు అందెలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. దర్శించవలసినవాడు. ఆ శ్రీహరి ఆశ్రితుల మనస్సులకు, కన్నులకు ఆనందాన్ని కలిగించేవాడు. భక్తుల హృదయ పద్మాలలో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు. సాటిలేని శాంత స్వభావుడు. మహానుభావుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=252

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 



ధ్రువోపాఖ్యానము - 11



4-247-క.
ఆ యమునా తటినీ శుభ
తోయములం గ్రుంకి నిష్ఠతో నచ్చట నా
రాయణునకును నమస్కృతు
లాయతమతిఁ జేసి చేయు యమనియమములన్.
4-248-వ.
మఱియు బాలుండ వగుటం జేసి వేదాధ్యయనా ద్యుచిత కర్మానర్హుండ వయ్యు నుచితంబులగు కుశాజినంబులం జేసి స్వస్తిక ప్రముఖాసనంబులం గల్పించుకొని త్రివృత్ప్రాణాయామంబులచేతం బ్రాణేంద్రియ మనోమలంబు లను చాంచల్య దోషంబులఁ బ్రత్యాహరించి స్థిరం బయిన చిత్తంబున.
4-249-సీ.
ఆశ్రిత సత్ప్రసాదాభి ముఖుండును;
స్నిగ్ధప్రసన్నాననేక్షణుండు
సురుచిర నాసుండు సుభ్రూయుగుండును;
సుకపోల తలుఁడును సుందరుండు
హరినీల సంశోభితాంగుండుఁ దరుణుండు;
నరుణావలోక నోష్ఠాధరుండుఁ
గరుణాసముద్రుండుఁ బురుషార్థ నిధియును;
బ్రణతాశ్రయుండు శోభనకరుండు
4-249.1-తే.
లలిత శ్రీవత్సలక్షణ లక్షితుండు
సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి
పురుష లక్షణ యుక్తుండుఁ బుణ్యశాలి
యసిత మేఘనిభశ్యాముఁ డవ్యయుండు.

భావము:
శుభాలను కలిగించే ఆ యమునానది నీటిలో స్నానం చేసి, నిశ్చలమైన బుద్ధితో నారాయణునికి నమస్కరించు. యమ నియమాలను అవలంబించు. ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోను, జింకచర్మంతోను స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని, పూరకము రేచకము కుంభకము అనే ఈ మూడు విధాలైన ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోమలాలను పొగొట్టుకొని, చాంచల్య దోషాలను తొలగించుకొని, స్థిరమైన మనస్సుతో హరిని ధ్యానించు. శ్రీహరి ఆశ్రితుల యెడ అపారమైన కృపారసం చూపేవాడు. సుప్రసన్నమైన ముఖం, చల్లని చూపులు, అందమైన ముక్కు, సొగసైన కనుబొమలు, చిక్కని చెక్కిళ్ళు కలిగిన చక్కనివాడు. ఇంద్రనీల మణులవలె ప్రకాశించే మేను కల పడుచువాడు. ఎఱ్ఱని నేత్రాలు, పెదవులు కలవాడు. దయాసముద్రుడు. పురుషార్థాలను ప్రసాదించేవాడు. నమస్కరించే వారికి ఆశ్రయ మిచ్చేవాడు. శుభాలను కలిగించేవాడు. శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ కలవాడు. సర్వలోక రక్షకుడు. సర్వమూ చూచేవాడు. ఉత్తమ లక్షణాలు కలిగిన పురుషోత్తముడు. పుణ్యస్వరూపుడు. నీలమేఘశ్యాముడు. అవ్యయుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=249

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, March 18, 2020

ధ్రువోపాఖ్యానము - 10

4-242-క.
నారదుఁ డిట్లను "ననఘ! కు
మారక! విను నిన్ను మోక్షమార్గంబునకున్
బ్రేరేచినవాఁ డిప్పుడు
ధీరజనోత్తముఁడు వాసుదేవుం డగుటన్.
4-243-వ.
నీవు నమ్మహాత్ముని నజస్రధ్యాన ప్రవణ చిత్తుండవై భజియింపుము.
4-244-క.
పురుషుఁడు దవిలి చతుర్విధ
పురుషార్థశ్రేయ మాత్మఁ బొందెద ననినన్
ధరఁ దత్ప్రాప్తికి హేతువు
హరిపదయుగళంబు దక్క నన్యము గలదే?
4-245-వ.
కావున.
4-246-క.
వర యమునానదితటమునఁ
హరి సాన్నిధ్యంబు శుచియు నతిపుణ్యమునై
పరఁగిన మధువనమునకును
సరసగుణా! చనుము మేలు సమకుఱు నచటన్.

భావము:
నారదు డిలా అన్నాడు “పుణ్యాత్మా! నాయనా! విను. నిన్ను మోక్షమార్గాన్ని పొందడానికి ప్రేరేపించినవాడు పురుషోత్తముడైన వాసుదేవుడే. కనుక నీవు ఆ మహాత్ముని ఏకాగ్రమైన చిత్తంతో సేవించు. ధర్మార్థకామమోక్షాలు అనబడే నాలుగు పురుషార్థాలను శ్రేయస్సును పొందాలి అని అనుకునే మానవునికి హరి పాదపద్మాలు తప్ప మరొక ఉపకరణము లేదు. అందుచేత సుగుణనిధీ! యమునానది ఒడ్డున హరికి నివాసస్థానమూ, పవిత్రమూ, పుణ్యప్రదమూ అయిన మధువనానికి వెళ్ళు. అక్కడ నీకు మేలు కలుగుతుంది.


http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=246

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధ్రువోపాఖ్యానము - 9



4-240-సీ.
అనఘాత్మ! యోగీంద్రు లనయంబు ధరఁ బెక్కు;
జన్మంబు లందు నిస్సంగమైన
మతినిఁ బ్రయోగ సమాధినిష్ఠలఁ జేసి;
యైనను దెలియ లే రతని మార్గ;
మది గాన నతఁడు దురారాధ్యుఁ డగు నీకు;
నుడుగుము నిష్ఫలోద్యోగ మిపుడు
గాక నిశ్శ్రేయస కాముఁడ వగుదేనిఁ;
దండ్రి! వర్తించు తత్కా లమందుఁ
4-240.1-తే.
బూని సుఖదుఃఖములు రెంటిలోన నెద్ది
దైవవశమునఁ జేకుఱు దానఁ జేసి
డెందమునఁ జాల సంతుష్టి నొందువాఁడు
విమలవిజ్ఞాని యన భువి వెలయుచుండు.
4-241-వ.
మఱియు గుణాఢ్యుం డగువానిం జూచి సంతోషించుచు నాభాసుం డగు వానిం జూచి కరుణించుచు సమానుని యెడ మైత్రి సలుపుచు వర్తించుచున్నవాఁడు తాపత్రయాదికంబులం దొఱంగు" నని నారదుండు పలికిన విని ధ్రువుం డిట్లనియె; “అనఘా! యీ శమంబు సుఖదుఃఖ హతాత్ము లగు పురుషులకు దుర్గమం బని కృపాయత్తుండవైన నీ చేత వినంబడె; అట్లయినం బరభయంకరం బగు క్షాత్త్ర ధర్మంబు నొందిన యవినీతుండనగు నేను సురుచి దురుక్తులను బాణంబుల వలన వినిర్భిన్నహృదయుండ నగుట మదీయచిత్తంబున శాంతి నిలువదు; కావునం ద్రిభువనోత్కృష్టంబు ననన్యాధిష్ఠితంబు నగు పదంబును బొంద నిశ్చయించిన నాకు సాధుమార్గంబు నెఱింగింపుము; నీవు భగవంతుం డగు నజుని యూరువు వలన జనించి వీణావాదన కుశలుండవై జగద్ధితార్థంబు సూర్యుండునుం బోలె వర్తింతువు;" అనిన విని.

భావము:
పుణ్యాత్మా! యోగీంద్రులు పెక్కు జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించి కూడ ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ హరిని ఆరాధించడం నీకు చాల కష్టం. కాబట్టి వ్యర్థమైన ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. మోక్షాన్ని కోరుకున్నట్లయితే ముసలితనంలో దానికోసం ప్రయత్నించు. దైవవశాన సుఖదుఃఖాలలో ఏది కలిగినా మనస్సులో సంతోషించేవాడు విజ్ఞాని అనిపించుకుంటాడు. ఇంకా గుణవంతుని చూసి సంతోషిస్తూ, గుణహీనుని చూసి జాలిపడుతూ, తనతో సమానుడైనవానితో స్నేహం చేస్తూ ప్రవర్తించేవాని దరికి తాపత్రయాలు చేరవు” అన్న నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! సుఖదుఃఖాల వల్ల తెలివి కోల్పోయిన వారికి శాంతి లభించదని అన్నావు. శత్రువులకు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని నేను అవలంబించాను. కనుక నాకు వినయం ఎక్కడిది? సురుచి పలికిన దుర్భాషలు అనే బాణాలచేత బ్రద్దలైన నా హృదయంలో శాంతికి తావు లేదు. కాబట్టి ముల్లోకాలలోను శ్రేష్ఠమైనది, ఇతరు లెవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను. అందుకు నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు. నీవు బ్రహ్మ ఊరువునుండి జన్మించి, నేర్పుతో వీణను మ్రోగిస్తూ, లోకాలకు మేలును కూర్చే నిమిత్తం సూర్యభగవానిని వలె సంచరించే మహానుభావుడివి” అని చెప్పగా (నారదుడు) విని...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=241

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, March 13, 2020

ధ్రువోపాఖ్యానము - 8


4-237-క.
"విను పుత్రక! బాలుఁడవై
యనయంబును గ్రీడలందు నాసక్తమనం
బునఁ దిరిగెడు నిక్కాలం
బున నీ కవమానమానములు లే వెందున్.
4-238-తే.
కాన మనమునఁ దద్వివేకంబు నీకుఁ
గలిగెనేనియు సంతోషకలితు లయిన
పురుషు లాత్మీయకర్మ విస్ఫురణఁ జేసి
వితత సుఖదుఃఖము లనుభవింతు రెపుడు.
4-239-వ.
కావున వివేకంబు గల పురుషుండు దనకుం బ్రాప్తంబు లగు సుఖ దుఃఖంబులు దైవవశంబులుగాఁ దలంచి తావన్మాత్రంబునం బరితుష్టుం డగు; నీవును దల్లి చెప్పిన యోగమార్గ ప్రకారంబున సర్వేశ్వరానుగ్రహంబుఁ బొందెద నంటివేని.

భావము:
“నాయనా! విను. ఎల్లప్పుడు ఆటలందు ఆసక్తిని చూపవలసిన ఈ పసివయస్సులో గౌరవాగౌరవాలను పట్టించుకొనవలసిన పని లేదు. కనుక మంచి చెడులను నిర్ణయించే వివేకం నీకు ఉన్నా విచారించకు. మానవులు తమ పూర్వకర్మలను బట్టి కలిగే సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. కనుక తెలివి గల మానవుడు తనకు కలిగే సుఖదుఃఖాలను దైవసంకల్పం వల్ల కలిగినవని భావించి, వానితోనే తృప్తిపడతాడు. కాదు, నీవు నీ తల్లి చెప్పిన యోగమార్గాన్ని అనుసరించి భగవంతుని దయను పొందుతాను అన్నట్లయితే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=238

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 7


4-236-వ.
నిజధర్మపరిశోభితంబైన యేకాగ్రచిత్తంబున నిలిపి సేవింపుము; అమ్మహాత్ముని కంటె నీ దుఃఖం బపనయించువాఁ డన్యుం డొక్కరుండు గలండే?" యని పలికినఁ బరమార్థ ప్రాప్తి హేతుకంబులైన తల్లివాక్యంబులు విని తన్నుఁ దాన నియమించుకొని పురంబు వెడలి చను నవసరంబున నారదుండు తద్వృత్తాంతం బెఱింగి, యచ్చటికిం జనుదెంచి, యతని చికీర్షితంబు దెలిసి, పాపనాశకరం బైన తన కరతలంబు నా ధ్రువుని శిరంబునం బెట్టి "మానభంగంబునకు సహింపని క్షత్రియుల ప్రభావం బద్భుతంబు గదా? బాలకుం డయ్యుఁ బినతల్లి యాడిన దురు క్తులు చిత్తంబునం బెట్టి చనుచున్నవాఁ" డని మనంబున నాశ్చర్యంబు నొంది “యో బాలక! సకల సంపత్సమృద్ధం బగు మందిరంబు దెగడి యొంటి నెందు నేగెదవు? స్వజన కృతం బగు నవమానంబుచే నిను సంతప్తుంగాఁ దలంచెద” ననిన ధ్రువుం డిట్లనియె;సపత్నీమాతృ వాగిషుక్షతం బగు వ్రణంబు భగవద్ధ్యానయోగ రసాయనంబున మాపి కొందు" ననిన విని ధ్రువునికి నారదుం డిట్లనియె.

భావము:
(హరిని) స్వధర్మాయత్తమైన ఏకాగ్రచిత్తంలో నిలిపి ఆరాధించు. ఆ మహాత్ముని కంటె నీ దుఃఖాన్నితొలగింప గలిగినవాడు మరొకడు లేడు.” అన్నది సునీతి. పరమార్థసిద్ధికి కారణాలైన తల్లి మాటలను ధ్రువుడు విని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చి పట్టణం నుండి బయలుదేరాడు. ఆ సమయంలో నారదమహర్షి ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని ధ్రువుని దగ్గరకు వచ్చి, అతని కోరికను తెలుసుకొని, పాపాలన్నిటినీ పారద్రోలే తన చల్లని చేతితో అతని శిరస్సును స్పృశించాడు. ‘గౌరవహానిని సహింపని క్షత్రియుల తేజస్సు అద్భుతమైనది కదా! పసివాడై కూడ పినతల్లి పలికిన దుర్వాక్కులను మనస్సులో ఉంచుకొని నగరంనుండి వెళ్ళిపోతున్నాడు’ అని మనస్సులో ఆశ్చర్యపడి “నాయనా! సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు? బంధువులు చేసిన అవమానంచేత బాధపడుతున్నట్లున్నావు” అని పలుకగా ధ్రువుడు ఇలా అన్నాడు “సవతితల్లి మాటల వల్ల అయిన గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధంతో నయం చేసుకొంటాను”. ధ్రువుని మాటలు విన్న నారదుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=236

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, March 11, 2020

ధ్రువోపాఖ్యానము - 6

4-233-సీ.
"పరికింప నీ విశ్వపరిపాలనమునకై;
యర్థి గుణవ్యక్తుఁ డైనయట్టి
నారాయణుని పాదనళినముల్ సేవించి;
తగ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె;
ఘనుఁడు మీ తాత యా మనువు సర్వాంతర;
యామిత్వ మగు నేకమైన దృష్టిఁ
జేసి యాగముల యజించి తా భౌమ సు;
ఖములను దివ్యసుఖముల మోక్ష
4-233.1-తే.
సుఖములను బొందె నట్టి యచ్యుతునిఁ బరుని
వితత యోగీంద్ర నికర గవేష్యమాణ
చరణ సరసిజ యుగళు శశ్వత్ప్రకాశు
భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిని.
4-234-వ.
మఱియును.
4-235-క.
కరతల గృహీత లీలాం
బురుహ యగుచుఁ బద్మగర్భముఖ గీర్వాణుల్
పరికింపం గల లక్ష్మీ
తరుణీమణిచేత వెదకఁ దగు పరమేశున్.

భావము:
“లోకాలను రక్షించడానికి సగుణస్వరూపాన్ని గ్రహించిన నారాయణుని పాదపద్మాలను ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందాడు. నీ తాత అయిన స్వాయంభువ మనువు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించి ఇహలోక సుఖాలను, పరలోక సుఖాలను అనుభవించి పరమపదాన్ని పొందాడు. నాశం లేనివాడు, యోగీశ్వరులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు కలవాడు, ఆయన అనంత కాంతిస్వరూపుడు, భక్తవత్సలుడు, విశ్వ సంసేవ్యుడు అయిన హరిని ఆశ్రయించు. ఇంకా బ్రహ్మ మొదలైన దేవతలు వెదకినా కనిపించని లక్ష్మీదేవి లీలాకమలాన్ని చేత ధరించి ఆ హరి కోసం వెదకుతూ ఉంటుంది. అటువంటి పరమేశ్వరుని ఆశ్రయించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=233

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 5

4-228-క.
"అనఘా! యీ దుఃఖమునకుఁ
బనిలే దన్యులకు సొలయ బలవంతంబై
తన పూర్వ జన్మ దుష్కృత
ఘనకర్మము వెంటనంటఁగా నెవ్వలనన్.
4-229-వ.
కావున.
4-230-క.
పెనిమిటి చేతను బెండ్లా
మని కాదు నికృష్టదాసి యనియును బిలువం
గను జాలని దుర్భగురా
లనఁగల నా కుక్షి నుదయ మందిన కతనన్.
4-231-క.
నిను నాడిన యా సురుచి వ
చనములు సత్యంబు లగును; సర్వశరణ్యుం
డనఁగల హరిచరణంబులు
గను జనకుని యంక మెక్కఁగాఁ దలఁతేనిన్.
4-232-వ.
కావునం బినతల్లి యైన యా సురుచి యాదేశంబున నధోక్షజు నాశ్రయింపుము" అని వెండియు నిట్లనియె.

భావము:
“నాయనా! మన దుఃఖానికి ఇతరులను అనవలసిన పని లేదు. పూర్వజన్మంలో చేసిన పాపం మానవులను వెంబడించి వస్తుంది. కనుక భర్తచేత భార్యగానే కాదు, దాసిగా కూడా పిలువబడని దురదృష్టవంతురాలినైన నా కడుపున పుట్టిన కారణంచేత నీకు అవమానం తప్పలేదు. నీ సవతి తల్లి సురుచి నీతో పలికిన మాటలు వాస్తవమే. నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశ ఉన్నట్లయితే అందరికీ దిక్కు అయిన హరిపాదాలను ఆరాధించు. కనుక పినతల్లి ఐన ఆ సురిచి ఆజ్ఞను పాటించి విష్ణువును ఆశ్రయించు” అని తల్లి ఇంకా ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=232

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, March 10, 2020

ధ్రువోపాఖ్యానము - 4

4-224-వ.
తొడలపై నిడుకొని.
4-225-క.
కర మనురక్తిని మోము ని
విరి తద్వృత్తాంత మెల్ల వెలఁదులు నంతః
పురవాసులుఁ జెప్పిన విని
పఱపుగ నిట్టూర్పు లెసఁగ బా ష్పాకుల యై.
4-226-తే.
సవతి యాడిన మాటలు సారెఁ దలఁచి
కొనుచుఁ బేర్చిన దుఃఖాగ్నిఁ గుందుచుండెఁ
దావపావక శిఖలచేఁ దగిలి కాంతి
వితతిఁ గందిన మాధవీలతికబోలె.
4-227-వ.
అంత నా సునీతి బాలునిం జూచి "తండ్రీ! దుఃఖింపకు" మని యిట్లనియె.

భావము:
తన తొడలపై కూర్చుండబెట్టుకొని ఎంతో గారాబంతో కొడుకు ముఖాన్ని నిమిరి, జరిగిన వృత్తాంతం అంతఃపుర కాంతలు చెప్పగా విని, నిట్టూర్పులు విడుస్తూ, కన్నీరు కార్చుతూ సవతి అయిన సురుచి తన కొడుకును అన్న మాటలను మాటిమాటికీ తలచుకొంటూ కార్చిచ్చు మంటల వేడికి కంది కళతప్పిన మాధవీలతలాగా శోకాగ్నితో కుమిలిపోయింది. అప్పుడు ఆ సునీతి తన కొడుకును చూచి “తండ్రీ! దుఃఖించకు” అంటూ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=225

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధ్రువోపాఖ్యానము - 3


4-220-క.
అదిగాన నీ వధోక్షజు
పదపద్మము లాశ్రయింపు; పాయక హరి నా
యుదరమునఁ బుట్టఁ జేయును,
వదలక యట్లయిన ముదము వఱలెడి నీకున్."
4-221-క.
అని యీ రీతి నసహ్యవ
చనములు పినతల్లి యపుడు జనకుఁడు వినగాఁ
దను నాడిన దుర్భాషా
ఘనశరములు మనము నాఁటి కాఱియపెట్టన్.
4-222-క.
తను నట్లుపేక్ష చేసిన
జనకునికడఁ బాసి దుఃఖ జలనిధిలోనన్
మునుఁగుచును దండతాడిత
ఘనభుజగముఁబోలె రోషకలితుం డగుచున్,
4-223-క.
ఘన రోదనంబు చేయుచుఁ
గనుఁగవలను శోకబాష్ప కణములు దొరఁగన్
జనని కడ కేగుటయు నిజ
తనయునిఁ గని యా సునీతి దద్దయుఁ బ్రేమన్.

భావము:
కనుక ధ్రువకుమారా! నీవు విష్ణుదేవుని పాదపద్మాలను ఆశ్రయించు. ఆయన నిన్ను నా కడుపున పుట్టేటట్లు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.” అని ఈ విధంగా తండ్రి వింటూ ఉండగా పినతల్లి సురుచి పలికిన వాక్యాలను ధ్రువుడు సహించలేకపోయాడు. ఆమె నిందావాక్యాలు బాణాలవలె అతని మనస్సులో నాటుకొని పీడించగా ఆ విధంగా తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గరనుండి దెబ్బ తిన్న పాములాగా రోషంతో, పట్టరాని దుఃఖంతో ధ్రువుడు తల్లి వద్దకు వచ్చాడు. బిగ్గరగా ఏడుస్తూ, కన్నులనుండి దుఃఖబాష్పాలు రాలుతూ ఉండగా కన్నతల్లిని సమీపించగా సునీతి కన్నకొడుకును చూచి మిక్కిలి ప్రేమతో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=222

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, March 7, 2020

ధ్రువోపాఖ్యానము - 2

4-219-సీ.
ఒకనాఁడు సుఖలీల నుత్తానపాదుండు;
నెఱిఁ బ్రియురాలైన సురుచి గన్న
కొడుకు నుత్తముఁ దన తొడలపై నిడుకొని;
యుపలాలనము చేయుచున్న వేళ
నర్థిఁ దదారోహణాపేక్షితుం డైన;
ధ్రువునిఁ గనుంగొని తివక నాద
రింపకుండుటకు గర్వించి యా సురుచియు;
సవతి బిడ్డండైన ధ్రువునిఁ జూచి
4-219.1-తే.
"తండ్రి తొడ నెక్కు వేడుక దగిలెనేనిఁ
బూని నా గర్భమున నాఁడె పుట్ట కన్య
గర్భమునఁ బుట్టి కోరినఁ గలదె నేఁడు
జనకు తొడ నెక్కు భాగ్యంబు సవతి కొడుక!

భావము:
ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కొడుకైన ఉత్తముణ్ణి ఆనందంగా తన తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధ్రువుడు తానుకూడ తన తండ్రి తొడలపైకి ఎక్కటానికి ఉబలాటపడ్డాడు.కాని ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు. ఆప్యాయంగా ఆదరించలేదు. అందుకు సురుచి గర్వించి, సవతి కొడుకైన ధ్రువుణ్ణి చూచి ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రితొడ ఎక్కటానికి అర్హుడు. మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=219

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, March 5, 2020

ధ్రువోపాఖ్యానము - 1


4-216-క.
"విను నిఖిలభువన పరిపా
లనమునకై చంద్రధరకళా కలితుండై
వనజజునకు స్వాయంభువ
మను వపు డుదయించెఁ గీర్తిమంతుం డగుచున్.
4-217-తే.
రూఢి నమ్మనునకు శతరూపవలన
భూనుతు లగు ప్రియవ్రతోత్తానపాదు
లనఁగ నిద్దఱు పుత్రులై రందులోనఁ
భవ్య చారిత్రుఁ డుత్తానపాదునకును.
4-218-క.
వినుము సునీతియు సురుచియు
నను భార్యలు గలరు; వారి యందును ధ్రువునిం
గనిన సునీతియు నప్రియ
యును, సురుచియుఁ బ్రియయు నగుచు నున్నట్టి యెడన్.

భావము:
“విదురా! విను. స్వాయంభువ మనువు అనే కీర్తిమంతుడు సకల లోకాలను పాలించడానికి ఈశ్వరుని అంశతో బ్రహ్మదేవునికి జన్మించాడు. ఆ స్వాయంభువ మనువుకు శతరూప అనే భార్యవల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వారిలో ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలున్నారు. వారిలో ధ్రువుడు అనే కొడుకును కన్న సునీతిపై రాజుకు ప్రీతి లేదు. సురుచి అంటే రాజుకు మిక్కిలి మక్కువ. ఇలా ఉండగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=218

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, March 1, 2020

దక్ష యాగము - 49

(శివుడనుగ్రహించుట )

4-162-వ.
అని యిట్లు రుద్రక్షమాపణంబు గావించి పద్మసంభవుచేత ననుజ్ఞాతుండై దక్షుం డుపాధ్యాయ ఋత్విగ్గణ సమేతుం డగుచుఁ గ్రతుకర్మంబు నిర్వర్తించు సమయంబున, బ్రాహ్మణజనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై సాగుటకుఁ బ్రమథాది వీర సంసర్గ కృత దోష నివృత్త్యర్థంబుగా విష్ణుదేవతాకంబును ద్రికపాలపురోడాశ ద్రవ్యకంబును నైన కర్మంబుఁ గావింప నధ్వర్యుకృత్య ప్రవిష్టుం డగు భృగువు తోడం గూడి నిర్మలాంతఃకరణుం డగుచు దక్షుఁడు ద్రవ్యత్యాగంబుఁ గావింపఁ బ్రసన్నుండై సర్వేశ్వరుండు.
4-163-సీ.
మానిత శ్యామాయమాన శరీర దీ;
ధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ
గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ;
శేయ చేలద్యుతుల్ చెలిమి చేయ
లక్ష్మీసమాయుక్త లలిత వక్షంబున;
వైజయంతీ ప్రభల్ వన్నెచూప
హాటకరత్న కిరీట కోటిప్రభల్;
బాలార్క రుచులతో మేలమాడ
4-163.1-తే.
లలితనీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ
బ్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ
భవ భవామర ముఖ్యుల ప్రభలు మాప
నఖిలలోకైక గురుఁడు నారాయణుండు.

భావము:
అని ఈ విధంగా దక్షుడు క్షమింపుమని రుద్రుణ్ణి వేడుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా ఉపాధ్యాయులతోను, ఋత్విక్కులతోను కూడి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. అప్పుడు బ్రాహ్మణులు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి, ప్రమథ వీరుల సంబంధంవల్ల కలిగిన దోషం నివారించడానికి విష్ణుమూర్తి దేవతగా కలిగినదీ, పురోడాశ ద్రవ్యం కలిగినదీ అయిన కర్మను నిర్వర్తించారు. అధ్వర్యుకార్యాన్ని స్వీకరించిన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సు కలవాడై దక్షుడు ద్రవ్యత్యాగం చేసాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. నల్లని మేని కాంతులు నాలుగు దిక్కుల్లో వ్యాపిస్తుండగా, బంగారు మొలత్రాడు కాంతులతో పట్టుబట్టల కాంతులు కలిసిపోగా, లక్ష్మికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీమాల కాంతులను ప్రసరిస్తుండగా, రత్నాలు పొదిగిన బంగారు కిరీటం కాంతులు బాలసూర్యుని వెలుగులతో అతిశయించగా, శిరోజాలు నీలమేఘ కాంతులతో ఒప్పుతుండగా, తన దేహంనుండి వెలువడే దివ్యకాంతులు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతాశ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తూ సమస్త లోకాలకు గురువైన నారాయణుడు సాక్షాత్కరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=163

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :