Monday, December 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౪(434)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-928-క.
ఆ నెఱిఁ దనుఁ గని ప్రత్యు
త్థాన నమస్కారవిధులు దగ నడపక పెం
పూనిన పీఠముపై నా
సీనుండగు సూతు శేముషీవిఖ్యాతున్.
10.2-929-వ.
కనుంగొని యతని సమీపంబున నున్న విప్రవరులం జూచి రాముండు రోషించి “వీఁడు నన్నుఁ గని లేవకుండుటకు హేతు వెయ్యదియొకో? ఈ ప్రతిలోమజాతుండు మునిగణ సభాస్థలంబునఁ దానొక్క ముఖ్యుండ పోలె దురభిమానంబున శక్తిమనుమని వలనంగొన్ని కథలు గాథలు గఱచి విద్వద్గణ్యుని విధంబున విఱ్ఱవ్రీఁగెడును; నీచాత్ముం డభ్యసించు విద్య లెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని సత్త్వగుణగరిష్ఠంబులు గావు; ధర్మసంరక్షణంబు సేయ నవతరించిన మాకు నిట్టి దుష్టమర్దనం బవశ్యకర్తవ్యం, బని తలఁచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున నా సూతుని వధించిన నక్కడి మునీంద్రు లెల్ల హాహాకారంబులతోడం దాలాంకునిఁ జూచి యిట్లనిరి. 

భావము:
కాని ప్రజ్ఞాసమేతుడైన సూతుడు తక్కిన మునులలాగ బలరామునికి ఎదురువచ్చి స్వాగతమిచ్చి అతిధి పూజలు చేయకుండా ఉన్నతాసనంమీద కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న సూతుని బలరాముడు కనుగొని. తనను పూజించక ఉన్న సూతునిపై బలరాముడు ఆగ్రహించాడు. అతడు అక్కడ ఉన్న ఋషులతో “వీడు నన్ను చూసి కూడా ఎందుకు లేవలేదో? ఈ సూతుడు మహర్షులున్న సభలో తానే పెద్దను అని అనుకుంటూ దురభిమానంతో ప్రవర్తించాడు. వ్యాసమహర్షి దగ్గర కొన్ని కథలు గాథలు నేర్చుకున్నాడు. దానికే విద్వాంసుడను అని విఱ్ఱవీగుతున్నాడు. నీచులు అభ్యసించే విద్య వారిలో మదాన్నే పెంచుతుంది కానీ సాత్వికగుణాన్ని పెంచదు. మేము ధర్మ సంరక్షణ కోసం పుట్టాము. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం మా కర్తవ్యం.” అని పలుకుతూ, తన చేతిలోని దర్భపుల్లతో ఆ సూతుడిని వధించాడు. అది చూసి అక్కడి మునీశ్వరులు అందరు హాహాకారాలు చేశారు. వారు బలరాముడితో ఇలా అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=929 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: