Monday, October 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౮(668)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-38-తే.
అర్ఘ్యపాద్యాదివిధులను నర్థితోడఁ
బూజ గావించి, వారలఁ బొలుపు మిగుల
నుచితపీఠంబులందును నునిచి, యెలమి
నవమునిశ్రేష్ఠులను భూమినాయకుండు.
11-39-క.
వారల కిట్లను "మీరలు
గారవమున విష్ణుమూర్తిఁ గైకొనిన మహా
భూరితపోధనవర్యులు
సారవిహీనంబు లైన సంసారములన్‌.
11-40-క.
ఏ రీతి గడప నేర్తురు?
క్రూరులు బహుదుఃఖరోగకుత్సిత బుద్ధుల్‌
నీరసులు నరులు గావున
నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే?

భావము:
అర్ఘ్యం పాద్యం మొదలైన శాస్త్రవిధులతో ప్ఱ్ఱార్థనా పూర్వకంగా పూజించి ఆ విదేహ మహారాజు ఆ తొమ్మిది మంది మునివరులను సముచిత పీఠాలపై కూర్చుండ బెట్టాడు. అలా ఆసీనులైనవారితో విదేహరాజు ఇలా అన్నాడు. “మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు. ఈ సంసారాలు పరమ సారం లేనివి. క్రూరులు; అనేక రకాల దుఃఖాలు, రోగాలు, అల్ప బుద్ధులు కలవారు; నీరసులు అయిన మానవులకు ఈ సారహీనమైన సంసారాలను దాటటానికి ఏదైనా మార్గం ఏదో సుఙ్ఞాన పూరకమైన మీ బుద్ధి కుశలతతో చెప్పండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=40

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, October 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౭(667)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-36-క.
జగదేకనాథు గుణములు
మిగులఁగ సంస్మరణతోడ మీఱిన భక్తిం
బగలును రాత్రియు సంధ్యలుఁ
దగిలి జితేంద్రియులు నైన తపసులు ధాత్రిన్‌.
11-37-క.
ఊహింపఁ బుణ్యుఁ డైన వి
దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో
గేహము వెడలి యెదుర్కొని
మోహవివర్జితులఁ బుణ్యమునిసంఘములన్‌.

భావము:
ఆ కవి మున్నగు ఆ తొమ్మండుగురు తపస్వులు సకల లోకాలకు ప్రభువైన శ్రీహరి గుణగణాలను మిక్కిలి తలచుకుంటూ, అతిశయించిన భక్తితో పగలు రాత్రీ ఉభయ సంధ్యలు అని లేకుండా సకల వేళలా సర్వదా ఆ భగవంతుని యందే ఆసక్తి కలవారై జితేంద్రియులైన వారు. భూలోకంలో పుణ్యాత్ముడైన విదేహుడు చేస్తున్న యజ్ఞం ముగింపుకు వచ్చిన సమయానకి అక్కడకి ఆ మహా తాపసులు విచ్చేశారు. విదేహరాజు గృహం లోపలి నుంచి వచ్చి మోహవిసర్జించిన ఆ పుణ్య మునీశ్వరులకు ఎదురువెళ్ళి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=37

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, October 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౬(666)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-35-వ.
ఆ యాగ్నీధ్రునకు నాభి యను ప్రాజ్ఞుం డగు తనూభవుం డుదయించి బలిచక్రవర్తితో మైత్రింజేసి ధారుణీభారంబు పూని యాజ్ఞా పరిపాలనంబున నహితరాజన్య రాజ్యంబులు స్వవశంబులు గావించుకొని యుండె; నంతట నాభికి సత్పుత్రుం డయిన ఋషభుండు పుట్టె; నతండు హరిదాసుండై సుతశతకంబుఁ బడసె; నందగ్రజుండయిన భరతుం డను మహానుభావుఁడు నారాయణపరాయణుండై యిహలోకసుఖంబులం బరిహరించి, ఘోరతపం బాచరించి జన్మ త్రితయంబున నిర్వాణసుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుం డై వాసుదేవపదంబు నొందె; నాతని పేర నతం డేలిన భూఖండంబు భారతవర్షం బను వ్యవహారంబున నెగడి జగంబులఁ బ్రసిద్ధం బయ్యె; మఱియు నందుఁ దొమ్మండ్రు కుమారులు బల పరాక్రమ ప్రభావ రూప సంపన్నులయి నవఖండంబులకు నధిష్ఠాతలైరి; వెండియు వారలలో నెనుబది యొక్కండ్రు కుమారులు నిత్య కర్మానుష్ఠాన పరతంత్రులై విప్రత్వం బంగీకరించి; రందుఁ గొందఱు శేషించిన వారులు కవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమిళ చమస కరభాజను లనం బరఁగు తొమ్మం డ్రూర్ధ్వరేతస్కు లయి బ్రహ్మవిద్యావిశారదు లగుచు, జగత్త్రయంబును బరమాత్మ స్వరూపంబుగాఁ దెలియుచు ముక్తులై యవ్యాహతగమను లగుచు, సుర సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కిన్నర కింపురుష నాగలోకంబు లందు స్వేచ్ఛావిహారంబు సేయుచు నొక్కనాఁడు.

భావము:
ఆ అగ్నీధ్రుడికి నాభి అనే కుమారుడు జన్మించాడు ప్రాజ్ఞుడైన అతడు బలిచక్రవర్తితో స్నేహంచేసి భూభారాన్ని వహించి ప్రజలను పాలించాడు. తన ఆజ్ఞాపాలన చేయ అంగీకరించని సకల శత్రురాజుల రాజ్యాలను తన వశం చేసుకున్నాడు. ఆ నాభికి సత్పుత్రుడైన ఋషభుడు పుట్టాడు హరిభక్తుడైన ఋషభుడు వందమంది కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడు భరతుడు అనే మహానుభావుడు. అతడు నారాయణభక్తుడై ఈ లోకపు సుఖాలను వదలి భయంకరమైన తపస్సుచేసి మూడు జన్మలలో సకలబంధాల నుండి విముక్తిచెంది నిర్వాణ సుఖపారవశ్యంతో పరమపదాన్ని అందుకోగలిగాడు. భరతుడు పాలించిన భూఖండానికి “భరతవర్షము” అనే పేరు జగత్ప్రసిద్ధంగా వచ్చింది. ఋషభుని వందమందిలో తొమ్మిదిమంది కుమారులు బలం పరాక్రమం ప్రభావం రూపసంపద కలిగినవారై తొమ్మిది భూఖండాలకు ఏలికలయ్యారు. ఇంకా వారిలో ఎనభైఒక్కమంది కుమారులు నిత్యకర్మలలోను అనుష్ఠానములలోను ఆసక్తికలవారై బ్రాహ్మణత్వాన్ని గ్రహించారు. మిగిలినవారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రమీళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లు కలగిన తొమ్మిదిమంది ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మవిద్యా విశారదులై మూడులోకాలు పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ముక్తులై అడ్డులేని గమనాలతో సురల, సిద్ధుల, యక్షుల, గంధర్వుల, కిన్నరుల, కింపురుషుల, నాగుల యొక్క లోకములందు తమ ఇచ్చానుసారంగా విహరింప సాగారు. అలా విహరిస్తూ ఒకనాడు...

1. హరి, 2. కవి, 3. అంతరిక్షుడు, 4. ప్రబుద్ధుడు, 5. పిప్పలాహ్వయుడు, 6. అవిర్హోత్రుడు, 7. ద్రమిళుడు, 8. చమనుడు, 9. కరభాజనుడు యను వీరు వృషభరాజు నూఱుగురి కుమారులలో ఆకాశగమనాది సిద్ధులను పొందిన చివరివారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=35

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౬౫(665)

( విదేహ హర్షభ సంభాషణ ) 

11-33-వ.
అట్లు గావున పరమేశ్వరభక్తిజనకంబై కైవల్యపదప్రాప్తికరంబయి యొప్పుచున్న విదేహర్షభసంవాదంబు నాఁ బరగు నొక్క పురాతన పుణ్యకథావిశేషం బెఱింగించెద సావధాన మనస్కుండవై యాకర్ణింపు” మని యిట్లనియె
11-34-తే.
"వినుము; స్వాయంభువుండను మనువునకును
రమణ నుదయించె నఁట ప్రియవ్రతుఁ డనంగఁ
దనయు; డాతని కాగ్నీధ్రుఁ డనఁగ సుతుఁడు
జాతుఁ డయ్యెను భువనవిఖ్యాతుఁ డగుచు.

భావము:
అందుకని పరమేశ్వరుని మీద భక్తిని కలిగించేది మోక్షాన్ని అందించేది అయిన విదేహఋషభ సంవాదము అనే ప్రసిద్ధమైన ఒక పురాతన పుణ్యకథను చెప్తాను ఏకాగ్ర చిత్తంతో విను." అని ఇలా చెప్పసాగాడు. “శ్రద్ధగా విను. స్వాయంభువుడనే మనువుకు ప్రియవ్రతుడనే కుమారుడు ఉదయించాడు. అతనికి అగ్నీధ్రుడనే కొడుకు పుట్టి, లోకప్రసిద్ధుడు అయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=34

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, October 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౪(664)

( వాసుదేవ ప్రశ్నంబు ) 

11-31-క.
"నను నీవు సేయు ప్రశ్నము
జనసన్నుత! వేదశాస్త్రసారాంశంబై
ఘనమగు హరిగుణకథనము
విను" మని, వినిపింపఁ దొడఁగె వేడ్క దలిర్పన్‌.
11-32-క.
"అతిపాపకర్ములైనను
సతతము నారాయణాఖ్యశబ్దము మదిలో
వితతంబుగఁ బఠియించిన
చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?

భావము:
“సచ్చరిత్ర! నీవు వేసిన ప్రశ్న వేదశాస్త్రముల సారాంశమైనది. ఘనమైన ఆ శ్రీహరి గుణకథనాలను వినవలసింది.” అని వేడుక చిగురించగా వినిపించడం మొదలు పెట్టాడు. ఎంతటి పాపంచేసిన వారైనా సరే నారాయణుని నామాన్ని విడువక నిత్యం మనస్సులో స్మరించేవాళ్ళు పరమ ధన్యులు. అట్టి వారిని పొగడుట బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=32

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౬౩(663)

( కృష్ణ సందర్శనంబు ) 

11-30-వ.
అట్లు దేవముని కృష్ణసందర్శనార్థం బరుగుదెంచి తద్గృహాభ్యంతరమున కరిగిన, వసుదేవుం డమ్మునీంద్రుని నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, కనకాసనాసీనుం గావించి, యుచిత కథావినోదంబులం బ్రొద్దుపుచ్చుచు నిట్లనియె; “యే నరుండు నారాయణచరణసరసీరుహ భజనపరాయణత్వంబు నిరంతరంబు నొందం; డట్టివానికి మృత్యువు సన్నిహితంబై యుండు; నీ దర్శనంబునం గృతార్థుండ నైతి; నచ్యుతానంత గోవింద నామస్మరణైకాగ్రచిత్తులైన మీవంటి పుణ్యపురుషుల సమాగమంబున లోకులు సుఖాశ్రయులయి యుండుదురు; దేవతాభజనంబు సేయువారిని గీర్వాణులు ననుగ్రహింతు; రట్లు సజ్జనులును దీనవత్సలులు నగు వారలు పూజనాది క్రియలచే నా దేవతలను భక్తి సేయుదురు; కావున శ్రీ మహా భాగవత కథాసమూహంబులఁ గల ధర్మంబు లడిగెద; నేయే ధర్మంబులు శ్రవణ సుఖంబులుగా వినిన దండధరకింకర తాడనంబులం బడక, ముకుందచరణారవింద వందనాభిలాషులయి పరమపదప్రాప్తు లగుదు; రా ధర్మంబు లానతిమ్ము; తొల్లి గోవిందునిం బుత్రుఁగాఁ గోరి ముక్తిమార్గం బెఱుంగలేక దేవతామాయం జేసి చిక్కి చిత్తవ్యసనాంధకారం బగు సంసారంబునం దగులువడి యున్నవాఁడ; హరికథామృతంబు వెల్లిగొల్పు; మట్లయిన సుఖంబు గలుగు" ననిన వసుదేవ కృతప్రశ్నుండైన నారదుండు వాసుదేవ కథా ప్రసంగ సల్లాపహర్ష సమేతుండై సంతసంబంద నిట్లనియె.

భావము:
అలా శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చిన దేవమునీంద్రుని వసుదేవుడు ఆర్ఘ్యం పాద్యం ఆదులతో యథావిథిగా పూజించి, బంగారపు ఆసనం మీద కూర్చుండపెట్టి సముచిత కథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఇలా అన్నాడు. “మునీంద్రా! నిరంతరం నారాయణ పాదపద్మాలను భజించని వానికి చావు సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనంవలన కృతార్ధుడనైనాను. అచ్యుత, అనంత ఆది గోవిందనామాలను నిత్యం స్మరించే ఏకాగ్ర చిత్తం గల మీవంటి సుకృతాత్ములను కలియుట వలన లోకులు సుఖాశ్రయులై ఉంటారు. దేవతలను భజించే వారిని వేల్పులు అనుగ్రహిస్తారు. అటువంటి సజ్జనులు దీనవత్సలలు పూజలు మున్నగు సత్కార్యాలతో దేవతల యందు భక్తి చూపిస్తూ ఉంటారు. కనుక, శ్రీ మహా భాగవతం అందలి కథలలో ఉన్న ధర్మాలను అడుగుతాను.
వీనులవిందుగా వింటే, యమభటులచేత దెబ్బలు తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలిగి, పరమపదాన్ని పొందగల ధర్మాలను ఆనతీయండి. పూర్వము గోవిందుడిని కుమారునిగా కోరినప్పటికి మోక్షమార్గం తెలియలేక దైవమాయలో చిక్కి వ్యసనాల చీకటితో నిండిన సంసారంలో చిక్కుకుని ఉన్నాను. హరికథాసుధారసాన్ని ప్రవహింప చేయండి. అలా అయితే నాకు సుఖం కలుగుతుంది.” అని వసుదేవుడు ప్రార్థించగా నారదుడు వాసుదేవుని కథల ప్రస్తావన వచ్చినందుకు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=30

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, October 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౨(662)

( కృష్ణ సందర్శనంబు ) 

11-28-వ.
అని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె.
11-29-క.
"వినుము నృపాలక! సెప్పెద
ఘనమై విలసిల్లు పూర్వకథ గల దదియున్‌
మును ద్వారక కేతెంచియు
నొనరఁగ నారదుఁడు గృష్ణు నొయ్యనఁ గాంచెన్‌.

భావము:
ఇలా అడిగిన మహారాజుతో శుకమహర్షి ఈ విధంగా అన్నాడు. “ఓ మహారాజా! శ్రద్ధగా వినవయ్యా! దీనికి ఒక గొప్ప పూర్వగాథ ఉన్నది. ఒకప్పుడు నారదుడు ద్వారకకు వచ్చి ముకుందుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=29

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, October 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౧(661)

( కృష్ణ సందర్శనంబు ) 

11-27-క.
"చిత్తం బే క్రియ నిలుచుం?
జిత్తజగురు పాదపద్మ సేవ సదా య
త్యుత్తమ మని వసుదేవుఁడు
చిత్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా! "

భావము:
“మునీంద్రా! మనసు ఏ విధంగా నిశ్చలంగా నిలబడుతుంది? మన్మథుడి జనకుడైన శ్రీమహావిష్ణువు చరణకమలములను సేవించటం మిక్కిలి ఉత్తమమైనదని నమ్మి వసుదేవుడు ఏవిధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=27

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, October 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౦(660)

( కృష్ణ సందర్శనంబు ) 

11-26-వ.
అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన, నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె.

భావము:
అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు.” ఇలా పలికి వాసుదేవుడు వాళ్ళను ఇలా ఆఙ్ఞాపించాడు. “సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవూ వెడల్పూ గల పెద్దబండ మీద మీ భుజబలాలు వాడి, ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి.” అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడిచేసి సముద్రంలో కలిపి. మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక, అరగదీయుట ఆపి, సముద్రంలో పడవేశారు. దానిని ఒకచేప మ్రింగింది దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం చివర ములికిగా మలచుకున్నాడు.” అని ఆ కథా విషయం అంతా చెప్పిన శుకమహర్షిని పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=26

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, October 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౯(659)

( కృష్ణ సందర్శనంబు ) 

11-24-క.
"మది సెడి కన్నులుగానక
మదయుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
గదిసి కులక్షయకారణ
విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?
11-25-క.
ధరణీసురశాపమునకు
హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే?
నరు లనఁగ నెంత వారలు
గర మరుదుగఁ బూర్వజన్మకర్మముఁ ద్రోవన్‌?

భావము:
“మీ బుద్ధిచెడి పోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెఱ్ఱివాళ్ళు ఎవరైనాఉంటారా. అనుభవించండి. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటి వారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించుటం ఎవరికి సాధ్యం కాదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=25

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, October 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౮(658)

( కృష్ణ సందర్శనంబు ) 

11-23-వ.
మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె.

భావము:
గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవబాలురు మునుల శాపం విని భయపడి వడ వడ వణుకుతూ సాంబుడి పొట్టచుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేల మీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడ, ఏమి తెలియనివాడిలా వాళ్ళతో వాసుదేవుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=23

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, October 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౭(657)

( కృష్ణ సందర్శనంబు ) 

11-21-క.
యదుడింభకులను గనుఁగొని
మదయుతులై వచ్చి రనుచు మదిలో రోషం
బొదవఁ గనుఁగొనల నిప్పులు
సెదరఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్‌.
11-22-క.
"వాలాయము యదుకుల ని
ర్మూలకరం బైన యట్టి ముసలం బొక టీ
బాలిక కుదయించును బొం
డాలస్యము లే ద"టంచు నటఁబల్కుటయున్‌.

భావము:
యాదవబాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా “ఇలా హాస్యాలు చేయొచ్చా?” అని అంటూ “యదువంశాన్ని నాశనం చేసే రోకలి (ముసలం) ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది ఆలస్యం కాదు. ఇక పొండి.” అని పలికారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=22

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, October 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౬(656)

( కృష్ణ సందర్శనంబు ) 

11-19-క.
దర్పించి యాదవులు తమ
నేర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం
బేర్పడ శృంగారించియుఁ
గర్పూర సుగంధి పోల్కిఁ గావించి యొగిన్‌.
11-20-ఉ.
మూఁకలుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం
బోకలఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం
"బ్రాకటమైన యీ సుదతి భారపుగర్భమునందుఁ బుత్త్రుఁడో
యేకత మందు బాలికయొ యేర్పడఁ జెప్పు" డటన్న నుగ్రులై.

భావము:
అక్కడ ఆ మునివేరేణ్యులను చూసిన యాదవ బాలకులలో కొందరు పొగరెక్కి తమ నేర్పుతో సాంబుడికి అందమైన స్త్రీవేషం వేసారు. కడుపుతో ఉండి కర్పూరపు తాంబూలాలు వేసుకోవటంతో ఆ సువాసనలు కలిగిన కలికిలా తీర్చిదిద్దారు. యాదవబాలురు గుంపులు గుంపులుగా చేరి తుళ్ళింతలతో, నవ్వులతో, కేరింతలతో ఆడవేషం వేసిన సాంబుడిని ముందుంచుకుని వెళ్ళారు. మునిసమూహానికి సాగిలపడి మ్రొక్కారు. “ప్రస్ఫుటముగా కనపడుతున్న గర్భం కల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడా ఆడపిల్ల ఉందా చెప్పండి?” అని ఆ మునులను అడిగారు. వారి అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=20

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, October 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౫(655)

( కృష్ణ సందర్శనంబు ) 

11-18-వ.
అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; “మదీయధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదిక శరణంబులును, మంగళకరణంబులును నగు” ననియును, “నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁ జేయుదు” ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికివచ్చిన ప్రయోజనంబేమి?” యనిన వారలు “భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటె మిక్కిలి విశేషం బొండెద్ది?” యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున కనతి దూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత.

భావము:
ఈ విధంగా మునివరులు అనేక విధాల స్తుతించారు. దయగల కడకంటిచూపులతో వారిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నా ధ్యాన నామస్మరణలు పునర్జన్మలు అనే భవరోగాలను హరిస్తాయి. బ్రహ్మ రుద్రుడు మొదలైన వారందరికి శరణమైనవి. సకల మంగళ ప్రదములు. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను.” అని యోగీశ్వరుడైన ఈశ్వరుడు ఆనతిచ్చి “మీరిక్కడికి ఎందుకు వచ్చారు.” అని అడిగాడు. అందుకు వారు “మీ పాదపద్మాలను దర్శించుట కంటే వేరే విశేషము ఏముంటుంది.” అని పలికి, వాసుదేవుని ముఖచంద్రామృతాన్ని తమ కనులనే చకోరాలతో త్రావి తమ ఇష్టానుసారం విహరించేవారు ద్వారకకు దగ్గరలోని పిండారకము అనే పుణ్యతీర్ధానికి వెళ్ళారు. అప్పుడు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=18

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, October 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౪(654)

( కృష్ణ సందర్శనంబు ) 

11-16-మత్త.
ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై,
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై,
పెక్కురూపులు దాల్తు, నీ దగు పెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!
11-17-క.
శ్రీనాయక! నీ నామము
నానాభవరోగకర్మనాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
కానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా! "

భావము:
పద్మలోచన! లక్ష్మీవల్లభ! ఒకమాటు అణువంత చిన్న రూపం పొందుతావు. ఒకమాటు పెద్ద ఆకృతి దర్శిస్తావు. అంతా నీవై అనేక రూపాలు దర్శిస్తావు. నీ మహిమ స్తోత్రం చేయడానికి అలవిగాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పద్మాపతీ! పద్మలోచన! నీ నామం పునర్జన్మలనే రోగము నశింపజేసే విన్నాణమైన మందు దుష్టాత్ములు పాపం! దీనిని గ్రహించలేరు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=17

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, October 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౩(653)

( కృష్ణ సందర్శనంబు ) 

11-14-క.
"జనములు నిను సేవింపని
దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
దనువులు నిలుకడ గావఁట
వనములలో నున్ననైన వనరుహనాభా!
11-15-క.
తరణంబులు భవజలధికి,
హరణంబులు దురితలతల, కాగమముల కా
భరణంబు, లార్తజనులకు
శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్‌.

భావము:
“పద్మనాభా! నిను సేవించని దినములు సర్వం మానవులకు ప్రయోజన శూన్యములు; అడవులలో ఉన్నా దేహాలకు నిలుకడలు లేనివి. నీ దివ్యమైన పాదములు భవసముద్రం దాటించే నావలు; పాపాలతీగలను హరించేవి; ఆగమములకు అలంకారాలు; ఆర్తులకు శరణములు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=15

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, October 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౨(652)

( కృష్ణ సందర్శనంబు ) 

11-12-సీ.
ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ,-
  గర్ణకుండలయుగ్మఘనకపోలుఁ,
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ,-
  గలిత నానారత్న ఘన కిరీటు,
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు,-
  శ్రీకరపీతకౌశేయవాసు,
రుక్మిణీనయన సరోజ దివాకరు,-
  బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము ,
11-12.1-తే.
దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ,
గోటిమన్మథలావణ్యకోమలాంగు,
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ,
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.
11-13-క.
వచ్చిన మునిసంఘములకు
విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌
మెచ్చగు కనకాసనముల
నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌.

భావము:
మహాత్ముడు; కౌస్తుభమణి సంశోభితుడు; ఘనమైన చెంపలపై కర్ణ కుండలాల కాంతులు ప్రకాశించు వాడు; తెల్లతామరల వంటి కన్నుల వాడు; మేఘం వంటి నల్లని దేహఛాయ వాడు; బహురత్నాలు పొదిగిన కిరీటం వాడు; తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టు వాడు; శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు; రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటి వాడు; బ్రహ్మ మున్నగు దేవతలచేత సేవింపదగిన చరణకమలాలు కలవాడు; దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు వాడు; కోటిమంది మన్మథుల లావణ్యం పుణికిపుచ్చుకున్న కోమల శరీరి; ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు; దయకు సముద్రం వంటి వాడు; ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు. అలా వచ్చిన శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేసాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులై పద్మనేత్రుడైన కృష్ణుడితో ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=12

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, October 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౧(651)

( కృష్ణ సందర్శనంబు ) 

11-11-వ.
"నిరుపమసుందరం బయిన శరీరంబు ధరియించి సమస్త కర్మ తత్పరుండై పరమేశ్వరుండు యదువుల నడంగింపఁ దలఁచు సమయంబున జటావల్కల కమండలుధారులును, రుద్రాక్షభూతిభూషణ ముద్రాముద్రితులును, గృష్ణాజినాంబరులును నగు విశ్వామిత్రాసిత దుర్వాసోభృగ్వంగిరః కశ్యప వామదేవ వాలఖిల్యాత్రి వసిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛావిహారంబున ద్వారకానగరంబున కరుదెంచి యందు.

భావము:
“సాటిలేని అందమైన తనువు దాల్చి సకల కర్మల యందు ఆసక్తికలవాడై పరమేశ్వరుడైన కృష్ణుడు యాదవులను అణచవలెనని సంకల్పించిన సమయాన జటావల్కలములు కమండలములు ధరించి, నల్లజింకతోలు కట్టుకున్న వారు, రుద్రాక్షలు వీభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు, వాఖిల్యులు, అత్రి, వశిష్టుడు, నారదుడు మున్నగు మునిశ్రేష్ఠులు స్వేచ్ఛావిహారం చేస్తూ ద్వారకానగరానికి విచ్చేసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=11

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Sunday, October 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౦(650)

( భూభారంబు వాపుట ) 

11-9-క.
"హరిపాదకమల సేవా
పరులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప
స్ఫురణంబు సంభవించెనొ
యరయఁగ సంయమివరేణ్య! యానతి యీవే!" 
11-10-క.
అనిన జనపాలునకు ని
ట్లని సంయమికులవరేణ్యుఁ డతి మోదముతో
విను మని చెప్పఁగఁ దొడఁగెను
ఘనతర గంభీర వాక్ప్రకాశస్ఫురణన్‌.

భావము:
“మహానుభావ! మహాయోగీశ్వర! శ్రీకృష్ణుడి పాదపద్మాలను ఎప్పుడూ సేవిస్తూ ఉండే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో తెలపండి.” ఇలా అడిగిన మహారాజుకు సంయమి శ్రేష్ఠుడైన శుకమహర్షి ఘనతరములు గంభీరములు అయిన వాక్కులతో ఈ విధంగా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=10

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, October 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౯(649)

( భూభారంబు వాపుట ) 

11-8-వ.
అని వితర్కించి జగదీశ్వరుం “డత్యున్నత వేణుకాననంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించు చందంబున యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి హతం బొనర్చెద” నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె" నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె.

భావము:
ఇలా తర్కించుకొని లోకనాయకుడైన వాసుదేవుడు చాలా ఎత్తైన వెదురు పొదల అడవిలో పుట్టిన గాలికి వెదురులు ఒరుసుకుని నిప్పు పుడుతుంది. ఆ అగ్నిలో తనకు తానే కాలిపోతుంది. అదే విధంగా యదుబలాలకు పరస్పర విరోధాలు కల్పించి నాశనం చేయాలని నిశ్చయించాడు. దానికి మూలకారణం బ్రాహ్మణశాపం కావాలని తలచాడు. ఆ ప్రకారమే యాదవనాశనం కలిగించాడు.” అని పలికిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=8

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, October 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౮(648)

( భూభారంబు వాపుట ) 

11-6-మ.
విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు
ర్మద సంయుక్త వసుంధరాధిపతులన్‌ మర్దించి, కంసాదులం
దుదిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో
యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్రమై.
11-7-సీ.
ఈ రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా-
  శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక-
  దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి-
  యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన-
  నతఁడు భూపాలనం బమరఁ జేసె
11-7.1-తే.
భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి
"యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు. "

భావము:
దుర్మదాందులైన రాజులను మర్దించి, కంసుడు మొదలైనవారిని సంహరించి భూమికి బరువును తగ్గించి నందనందనుడు దేవతలందరూ తనను కొలుస్తుండగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా శ్రీకృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదుసైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితి వచ్చింది.
ఇలాగ, మహానుభావుడైన శ్రీకృష్ణుడు అతిశయించి; పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను; చాణూర, ముష్టికులను; కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవసైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులు ఇతరుల వలన ఓటమి లేని వారు. వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు” అని ఆలోచించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=7

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

శ్రీకృష్ణ విజయము - ౬౪౭(647)

( భూభారంబు వాపుట ) 

11-3-మ.
"బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
కలనన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వలమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బలముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.
11-4-వ.
అంత.
11-5-క.
మునివరులు సంతసిల్లిరి
యనయము నందాదులకును హర్షం బయ్యెం;
దన నిజభక్తులు యాదవ
ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్‌.

భావము:
“శ్రీకృష్ణుడు మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూతక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు. అప్పుడు మునీశ్వరులు, ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు, మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధిచెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=5

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, October 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౬(646)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1338-క.
అని యిట్లు బాదరాయణి
మనమున రాగిల్ల నాభిమన్యునకుం జె
ప్పిన విధమున సూతుఁడు ముని
జనుల కెఱింగింప వారు సమ్మతితోడన్.
10.2-1339-క.
సూతుని బహువిధముల సం
ప్రీతునిఁ గావించి మహిమఁ బెంపారుచు వి
ఖ్యాతికి నెక్కిన కృష్ణక
థాతత్పరు లైరి బుద్ధిఁ దఱుఁగని భక్తిన్.

భావము:
ఈరీతిగా శుకమహర్షి పరీక్షన్మహారాజు మనసు రంజిల్లేలా చెప్పిన ప్రకారంగా సూతుడు శౌనకాది మహామునులకు ప్రవచించాడు. వారెంతో సంతోషించారు. ఆ మునులు సూతుడిని అనేక విధముల సత్కరించి, అతనిని పూర్తి సంతుష్టుని చేసారు. వారందరు కూడ శ్రీకృష్ణకథలపై మిక్కిలి ఆసక్తి తఱగని భక్తి లభించాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1339

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, October 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౫(645)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1336-వ.
ఇవ్విధంబున గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామా నుష విగ్రహుండై నిజరాజధాని యైన ద్వారకాపురంబున నమానుష విభవంబు లగు సౌఖ్యంబులం బొదలుచుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.
10.2-1337-మ.
"మనుజేంద్రోత్తమ! యేను నీకుఁ ద్రిజగన్మాంగల్యమై యొప్పఁ జె
ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిఁ గ్రో
లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్ధూతసర్వాఘులై
యనయంబుం దుదిఁ గాంతు రచ్యుతపదం బై నట్టి కైవల్యమున్. "

భావము:
ఈలాగున గోపికామన్మథుడు అయిన శ్రీకృష్ణుడు లీలామానుష రూపం ధరించినవాడు అయి తన రాజధాని ఐన ద్వారకలో లోకాతీత సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. “ఓ మహారాజా! నేను నీకు చెప్పిన ఈ శ్రీకృష్ణకథారసం ముల్లోకాలకూ శుభదాయకమైనది. భక్తితో ఆస్వాదించే పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి పాపాలు సమస్తము తొలగిపోతాయి. తుదకు శాశ్వతమైన కైవల్యాన్ని అందుకుంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1337

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Sunday, October 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౪(644)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1334-మ.
"పరమోత్సాహముతోడ మాధవుఁడు శుంభల్లీలఁ బూరించు న
మ్మురళీగానము వీనులం జిలికినన్ మోదించి గోపాల సుం
దరు లేతెంతు రరణ్యభూములకుఁ; దద్దాస్యంబు గామించి య
క్కరుణావార్థి భజింప కుందురె బుధుల్‌ కౌరవ్యవంశాగ్రణీ!
10.2-1335-మ.
మతినెవ్వాని యమంగళఘ్న మగు నామం బర్థిఁ జింతించినన్
నుతిగావించిన విన్న మానవులు ధన్యుల్‌; భూరిసంసార దు
ష్కృతులం ద్రోతురు; కాలచక్ర మహితాసిం బట్టి యా కృష్ణుఁ డీ
క్షితిభారం బుడుగంగఁ జేయు టిది యే చిత్రంబు? భూవల్లభా!

భావము:
“ఓ కురుకులోత్తమరాజ! మహోత్సాహంతో శ్రీకృష్ణుడు మురళిని మ్రోగిస్తే ఆ గానం చెవులలో సోకగానే కృష్ణుడిని సేవించాలనే కాంక్షతో సుందర గోపికలు పరమానందంతో బృందావన ప్రాంతా అడవులకు పరుగెత్తుకుని వస్తారు. ప్రాజ్ఞులైనవారు ఆ కరుణామూర్తిని ఆయన సేవను కోరి పూజించకుండా ఎవరు ఉండలేరు కదా. రాజేంద్రా! అశుభాన్నితొలగించే శ్రీకృష్ణుడి నామాన్ని చింతించేవారు, వినేవారు గొప్ప ధన్యులు. వారు సంసారపరమైన కష్టాల నుంచి విముక్తులు అవుతారు. కాలచక్రమనే ఆయుధాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఈ లోకభారాన్ని పోగొట్టడంలో విచిత్రము ఏముంది

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1335

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Saturday, October 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౩(643)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1333-వ.
అట్టి యన్వయంబు నందు మాధవునకు రుక్మిణీదేవి యందుఁ బితృసముండును, సమగ్ర భుజావిజృంభణుండును నై ప్రద్యుమ్నుండు జనియించె; నతనికి రుక్మికూఁతురగు శుభాంగివలన ననిరుద్ధం డుదయించె; నతనికి మౌసలావశిష్టుండైన ప్రజుండు సంభవించె; నతనికిఁ బ్రతిబాహుండుపుట్టె; వానికి సుబాహుండు జన్మించె; నతనికి నుగ్రసేనుండుప్రభవించె; నతనికి శ్రుతసేనుండు గలిగె; నిట్లు యదు వృష్టి భోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షుని కటాక్షవీక్షణ శయ్యాసనానుగత సరసాలాప స్నానాశన క్రీడావినోదంబుల ననిశంబునుం జెందుచు, సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువు లొనరింపుచుఁ బరమానంద కందళిత చిత్తులై యుండి" రని చెప్పి వెండియు.

భావము:
అలాంటి వంశంలో శ్రీకృష్ణునికి రుక్మిణివల్ల ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతడు అన్నిటా తండ్రి వంటివాడు మహాభుజబలం కలవాడు అతని భార్య రుక్మి కూతురు శుభాంగి. ఆమెకు అనిరుద్ధుడు జన్మించాడు. అతనికి ప్రజుడు పుట్టాడు. ఇతను మాత్రమే ముసలం బారినుండి తప్పించుకున్నాడు. ఆ ప్రజుడికి ప్రతిబాహుడు, ప్రతిబాహుడికి సుబాహుడు పుట్టారు. అతనికి ఉగ్రసేనుడు జన్మించాడు. ఈ విధంగా యదు, వృష్ణి, భోజ, అంధక, వంశాలు పవిత్రాలు అయ్యాయి. కృష్ణుడితో సహవాసంచేస్తూ ఆయన కటాక్షవీక్షణలు అందుకుంటు, ఆయనతో కంచాలు మంచాలు ఆసనాలు పంచుకుంటు, కలిసి స్నానాలు భోజనాలు చేస్తు, వినోదాలలో పాల్గొంటు, సకల దేవతలను ఉద్దేశించి యాగాలు చేస్తూ యాదవులు పరమానందం పొందుతూ జీవించారు.” అని చెప్పిన శుకమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1333

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :