Sunday, February 28, 2021

శ్రీకృష్ణ విజయము - 161

( శంబరోద్యగంబు )

10.2-20-వ.
అంత నా రక్కసుండు వెక్కసంబగు రోషంబునఁ దనకు దొల్లి మయుం డెఱింగించిన దైతేయమాయ నాశ్రయించి మింటికి నెగసి, పంచబాణునిపై బాణవర్షంబు గురిసిన; నమ్మహారథుండు నొచ్చియు సంచలింపక మచ్చరంబున సర్వమాయా వినాశిని యైన సాత్త్విక మాయం బ్రయోగించి దనుజుని బాణవృష్టి నివారించె; మఱియు వాఁడు భుజగ గుహ్యక పిశాచ మాయలు పన్ని నొప్పించిన నన్నియుం దప్పించి.
10.2-21-క.
దండధర మూర్తిఁ గైకొని
యొండాడక చక్రిసూనుఁ డుగ్రతరాసిన్
ఖండించె శంబరుని తలఁ
గుండల కోటీర మణులు గుంభిని రాలన్.

భావము:
అప్పుడు శంబరుడు మితిమీరిన రోషంతో తనకు పూర్వం మయుడు నేర్పిన రాక్షసమాయతో ఆకాశంలోకి ఎగిరి, ప్రద్యుమ్నుడిపై బాణవర్షం కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాణవర్ష బాధకు ఓర్చుకుని సర్వ మాయలను నశింపజేయగల సాత్త్వికమాయ అనే విద్యను ప్రయోగించి, శంబరుడి శరవర్షాన్ని ఆపాడు. మళ్ళీ శంబరుడు ఎన్నో పిశాచమాయలను గుప్పించి నొప్పించాడు. ఆ మాయలను అన్నింటి నుండీ ప్రద్యుమ్నుడు తప్పించుకున్నాడు. శ్రీకృష్ణుడి కుమారుడగు ప్రద్యుమ్నుడు దండం ధరించు యముడి వలె భయంకర రూపము ధరించి, భీకరమైన పదును గల ఖడ్గంతో శంబరుని శిరస్సు ఖండించాడు. కిరీట కుండలాలలోని మణులు అన్నీ నేలరాలాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=3&Padyam=21

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 160

( శంబరోద్యగంబు )

10.2-17-మ.
గురు మాయారణవేదియై, కవచియై, కోదండియై, బాణియై
హరిజుం "డోరి! నిశాట! వైచితివి నాఁ డంభోనిధిన్ నన్ను, ఘో
రరణాంభోనిధి వైతు నిన్ను నిదె వే ర"మ్మంచుఁ జీరెన్ మనో
హర దివ్యాంబరు నుల్లసద్దనుజ సేనాడంబరున్ శంబరున్.
10.2-18-చ.
అదలిచి యిట్టు కృష్ణసుతుఁ డాడిన నిష్ఠుర భాషణంబులం
బదహతమై వడిం గవియు పన్నగరాజముఁ బోలి శంబరుం
డదరుచు లేచి వచ్చి గద నచ్యుతనందను వ్రేసె నుజ్జ్వల
ద్భిదురకఠోరఘోష సమభీషణనాదము చేసి యార్చుచున్.
10.2-19-క.
దనుజేంద్రుఁడు వ్రేసిన గదఁ
దన గదచేఁ బాయ నడిచి దనుజులు బెదరన్
దనుజాంతకుని కుమారుఁడు
దనుజేశుని మీఁద నార్చి తన గద వైచెన్.

భావము:
ప్రద్యుమ్నుడు ఆ విధంగా గొప్ప మాయాయుద్ధ ప్రవీణుడు అయ్యాడు. పిమ్మట కవచమును ధరించాడు ధనుర్భాణములను చేబట్టాడు. మనోహరమైన వస్త్రాలంకారాలు ధరించువాడు, గొప్ప దానవసేనతో విలసిల్లుతున్న వాడు అయిన శంబరుణ్ణి “ఓరీ! రాక్షసా! ఆనాడు నన్ను సముద్రంలో పారేశావు కదా. ఈనాడు నిన్ను యుద్ధసముద్రంలో పడవేస్తాను. వేగంగా రారా” అని పిలిచాడు.ఇలా తనను ప్రద్యుమ్నుడు గద్దించి దూషణ వాక్యాలు పలుకడంతో, శంబరుడు తోకతొక్కిన పామువలె దర్పంతో విజృంభించి, వజ్రాయుధ మంత కఠోరమైన కంఠంతో గర్జిస్తూ, తన గదా దండంతో ప్రద్యుమ్నుణ్ణి కొట్టాడు. ప్రద్యుమ్నుడు రాక్షసరాజు గదను తన గదతో భగ్నం చేసి రాక్షసులు భయంచెందేలా బొబ్బపెట్టి, తన గదతో రాక్షసుడిని మోదాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=3&Padyam=19

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, February 25, 2021

శ్రీకృష్ణ విజయము - 159

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-14-క.
మాయావి వీఁడు; దుర్మతి
మాయఁడు సంగరములం; దమర్త్యుల గెలుచున్;
మాయికరణమున వీనిన్
మాయింపుము, మోహనాది మాయలచేతన్.
10.2-15-మత్త.
పాపకర్ముఁడు వీఁడు; నిన్నిఁటఁ బట్టి తెచ్చిన, లేచి "నా
పాపఁ డెక్కడఁ బోయెనో? సుతుఁ బాపితే విధి!" యంచుఁ దాఁ
గ్రేపుఁ బాసిన గోవు భంగిని ఖిన్నయై, పడి గాఢ సం
తాపయై, నిను నోఁచి కాంచిన తల్లి కుయ్యిడ కుండునే?
10.2-16-వ.
అని పలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వ శత్రు మాయా వినాశిని యైన మహామాయ విద్య నుపదేశించె; నివ్విధంబున.

భావము:
ఈ శంబరుడు దుర్మార్గుడు, మాయలమారి. దుష్టుడు యుద్ధాలలో మాయుల పన్ని దేవతలను ఓడిస్తుంటాడు. ఇతణ్ణి సమ్మోహనాది మాయలతో నీవు సంహరించు. ఎన్నో నోములు నోచి నిను కన్న తల్లి పాపాత్ముడైన శంబరుడు నిన్ను అపహరించి తెచ్చిన తరువాత విలపించదా? లేగను బాసిన గోవు వలె “నా కుమారుడు ఏమయ్యాడో దేవుడా? నన్ను నా కుమారుడికి దూరం చేసావా?” అంటూ ఎంతగానో దుఃఖించి ఉండదా?”ఇలా వివరించి చెప్పి మాయావతి, మహానుభావుడైన ప్రద్యుమ్ముడికి సర్వశత్రుమాయలను మాయింపజేయగల మహామాయ అనే విద్యను ఉపదేశించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=15

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 158

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-11-వ.
అని, తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి, పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, జగన్మోహనాకారుండును నైన పంచబాణునిం గని లజ్జాహాస గర్భితంబు లైన చూపులం జూచుచు, మాయావతి సురత భ్రాంతిఁ జేసినం జూచి, ప్రద్యుమ్నుం డిట్లనియె.
10.2-12-మత్త.
"నా తనూభవుఁ డీతఁ డంచును, నాన యించుక లేక యో!
మాత! నీ విది యేమి? నేఁ డిటు మాతృ భావము మాని సం
ప్రీతిఁ గామినిభంగిఁ జేసెదు పెక్కు విభ్రమముల్‌; మహా
ఖ్యాత వృత్తికి నీకు ధర్మము గాదు మోహము సేయఁగాన్."
10.2-13-వ.
అనిన రతి యిట్లనియె; “నీవు నారాయణనందనుండ వైన కందర్పుండవు; పూర్వకాలంబున నేను నీకు భార్య నైన రతిని; నీవు శిశువై యుండునెడ నిర్దయుండై దొంగిలి, తల్లిం దొఱంగఁజేసి, శంబరుండు కొని వచ్చి, నిన్ను నీరధిలో వైచిన, నొక్క మీనంబు మ్రింగె; మీనోదరంబు వెడలి తీవు; మీఁదటి కార్య మాకర్ణింపుము.

భావము:
అని తనను జనులు స్తుతించే టంతటి ప్రభావం కలిగినవాడు ఆ ప్రద్యుమ్నుడు. తామరరేకుల వంటి నేత్రాలతో. ఆజానుబాహువులతో, ప్రపంచాన్ని సమ్మోహితం చేయగల ఆకార విశేషంతో అలరారే ఆ మన్మథుడిని మాయావతి సిగ్గుతో చిరునవ్వుతో కూడిన చూపులతో ఆకట్టుకోడానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తల్లీ! నేను నీ కుమారుడ ననే భావం లేక, సిగ్గు విడిచి కామినిలా ప్రవర్తిస్తూ విలాసములు చేస్తున్నావు. మాతృభావం వదలివేసావు. నీ విలా నన్ను మోహించుట ధర్మబద్ధమైన పని కాదు.” ఈలాగ పలికిన ప్రద్యుమ్నుడితో రతీదేవి ఇలా చెప్పింది. “నీవు విష్ణుమూర్తి పుత్రుడవైన మన్మథుడవు. పూర్వం నేను నీ భార్యనైన రతీదేవిని. నీవు శిశువుగా ఉండగా దయమాలిన శంబరుడు నిన్ను తల్లి నుండి తప్పించి తెచ్చి, సముద్రంలో పారేసాడు. అప్పుడు నిన్ను ఒక మీనం మ్రింగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయట పడ్డావు. ఇక పైన ఏమి చేయవలెనో విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=12

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, February 24, 2021

శ్రీకృష్ణ విజయము - 157

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-9-క.
సుందర మగు తన రూపము
సుందరు లొకమాఱు దేఱి చూచినఁ జాలున్,
సౌందర్య మేమి చెప్పను?
బొందెద మని డాయు బుద్ధిఁ బుట్టించు; నృపా!
10.2-10-సీ.
"చక్కని వారల చక్కఁ దనంబున-
  కుపమింప నెవ్వండు యోగ్యుఁ డయ్యె?
మిక్కిలి తపమున మెఱయు నంబికకు నై-
  శంకరు నెవ్వండు సగము సేసె?
బ్రహ్మత్వమును బొంది, పరఁగు విధాతను-
  వాణికై యెవ్వఁడు వావి సెఱిచె?
వేయిడాఁగులతోడి విబుధ లోకేశుని-
  మూర్తికి నెవ్వఁడు మూల మయ్యె?
10.2-10.1-తే.
మునుల తాలిమి కెవ్వఁడు ముల్లు సూపు
మగల మగువల నెవ్వండు మరులుకొలుపు?
గుసుమధనువున నెవ్వండు గొను విజయము
చిగురువాలున నెవ్వండు సిక్కువఱుచు?"

భావము:
ఓ పరీక్షన్మహారాజా! ప్రద్యుమ్నుడి చక్కదనం ఒక్కమాటు చూసిన సుందరీమణులకు అతనితో కామసౌఖ్యాలు అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఇక అతని సౌందర్యాన్ని వేరే వర్ణించడం ఎందుకు. “సౌందర్యవంతుల అందచందాలను వర్ణించేందుకు ఉపమానంగా చెప్పడానికి తగినవాడూ; తపోనిష్ఠతో విరాజిల్లే పరమేశ్వరుడిని పార్వతీదేవి కోసం అర్ధనారీశ్వరుణ్ణి చేసినవాడూ; బ్రహ్మతేజస్సుతో విలసిల్లే బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవికోసం వావివరుసలు మరచిపోయేలా గావించినవాడూ; దేవేంద్రుని వేయికళ్ళ వేల్పుగా నిలిపినవాడూ; మునీంద్రుల ధైర్యాన్ని సైతం చెదరగొట్టగల వాడూ; స్త్రీపురుషుల కొకరిపై మరొకరికి ప్రేమభవం కల్గించేవాడూ; చెరకువింటితో ప్రపంచాన్ని జయించగలిగినవాడూ; చిగురుటాకు అనే బాకుతో లోకులను చీకాకుపరచి, చిక్కులపాలు చేసేవాడూ ఎవరంటే, ఈ మన్మథుడే అయిన ప్రద్యుమ్నుడే.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=10

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, February 22, 2021

శ్రీకృష్ణ విజయము - 156

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-6-వ.
సముద్రంబులోన నా మీనంబును, దత్సహచరంబులైన మీనంబులనుం బట్టికొని తెచ్చి, శంబరునకుం గానికఁగా నిచ్చిన, నతండు “వండి తెండ”ని మహానస గృహంబునకుం బంచిన.
10.2-7-క.
రాజునగరి యడబాలలు
రాజీవముకడుపు వ్రచ్చి, రాజనిభాస్యున్
రాజశిశువుఁ గని, చెప్పిరి
రాజీవదళాక్షియైన రతికి; నరేంద్రా!
10.2-8-వ.
అంత నారదుండు వచ్చి, బాలకుని జన్మంబును, శంబరోద్యోగంబును, మీనోదరప్రవేశంబునుం జెప్పిన విని, యా రతి మాయావతి యను పేర శంబరునియింట బాతివ్రత్యంబు సలుపుచు, దహన దగ్ధుండయిన తన పెనిమిటి శరీర ధారణంబు సేయుట కెదురు చూచుచున్నది గావున; నయ్యర్భకుండు దర్పకుండని తెలిసి, మెల్లన పుత్రార్థినియైన తెఱంగున శంబరుని యనుమతి వడసి, సూపకారుల యొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె; నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢ యౌవనుండై.

భావము:
ప్రద్యుమ్నుడిని మ్రింగిన పెనుచేపతోపాటు తిరుగుతున్న మరికొన్ని చేపలను కూడా పట్టుకున్నారు. వాటిని తీసుకువచ్చి శంబరునకు కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండితెమ్మని వంటశాలకు పంపాడు. వంటవారు ఆ చేప కడుపు కోయగా చంద్రబింబంతో సమానమైన ముఖంతో విలసిల్లుతున్న బాలుడు కనిపించాడు. వారు ఈ విషయాన్ని రతీదేవికి విన్నవించారు. అంతకు ముందే నారదమహర్షి రతీదేవికి ఇలా రుక్మిణి కడుపున పుట్టే బాలుడి జన్మరహస్యం, వానిని నాశం చేయాలనే శంబరుడి ప్రయత్నం, ఆ శిశువును చేప మ్రింగడం అంతా చెప్పాడు. శంకరుడి కంటిమంటలకు ఆహుతి అయిపోయిన తన భర్త ఎప్పుడు సశరీరంగా సాక్షాత్కరిస్తాడా అని ఎదురు చూస్తూ శంబరుని గృహంలో మాయావతి అనే పేరుతో నీతిగా జీవిస్తున్న రతీదేవి ఆ బాలుడు మన్మథుడే అని తెలుసుకుంది. పుత్రార్థిని వలె శంబరుడి అనుమతితో, ఆ శిశు రూప మన్మథుడిని వంటవారి నుండి తీసుకుని పోషించసాగింది. ఆ బాలుడు శీఘ్రకాలంలోనే యౌవనవంతుడు అయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=7

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, February 21, 2021

శ్రీకృష్ణ విజయము - 155

( ప్రద్యుమ్న జన్మంబు ) 

10.2-3-ఉ.
“తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరుకంటిమంటలం
దా మును దగ్ధుఁడై; పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికై,
వేమఱు నిష్ఠఁ జేసి, హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్.
10.2-4-వ.
అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుం డయ్యె; నా శిశువు సూతికాగృహంబునం దల్లి పొదిఁగిట నుండం, దనకు శత్రుండని యెఱింగి, శంబరుండను రాక్షసుండు దన మాయాబలంబునం గామరూపి యై వచ్చి, కొనిపోయి సముద్రంబులో వైచి, తన గృహంబునకుం జనియె; నంత నా శాబకుండు జలధిజలంబున దిగఁబడ నొడిసి యొక మహామీనంబు మ్రింగె; నందు.
10.2-5-క.
జాలిఁ బడి పాఱు జలచర
జాలంబులఁ బోవనీక, చని రోషాగ్ని
జ్వాలలు నిగుడఁగ, నూరక
జాలంబులు వైచిపట్టు జాలరు లంతన్.

భావము:
విష్ణుదేవుని కుమారుడైన మన్మథుడు పూర్వం పరమేశ్వరుని కంటిమంటలలో కాలిబూడిద అయిపోయి, తరువాత ఈశ్వరుణ్ణి తన దేహం కోసం ప్రార్థించి, రుక్మిణీ కృష్ణులకు, కృష్ణమూర్తి ప్రతిబింబమా అనిపించేలా ఉద్భవించాడు. ఆ బాలుడు “ప్రద్యుమ్నుడు” అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆ శిశువు తనకు శత్రువని తెలిసి, పురిటిగృహంలో తల్లి పొత్తిళ్ళలో ఉండగా శంబరుడనే రాక్షసుడు కామరూపంలో వచ్చి, ఆ బాలుణ్ణి తన మాయా శక్తితో అపహరించుకుని వెళ్ళి, సముద్రంలొ పడవేశి, తన ఇంటికి పోయాడు. ఆ బాలుడు సముద్రజలాలలో పడి మునగుతూ ఉండగా ఒక పెద్ద చేప అమాంతంగా అతణ్ణి మ్రింగివేసింది. జాలరులు వెళ్ళి తమ కోపాగ్ని జ్వాలలు మించగా, సముద్రంలో వలల వేసి బెదిరి పోతున్న జలచరాలను అటునిటు పారిపోనీకుండా పట్టుకుంటున్నారు. వారు ఇంతలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=5

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, February 19, 2021

శ్రీకృష్ణ విజయము - 154

( ప్రవర్షణ పర్వతారోహణంబు )

10.1-1678-క.
ఇల నేకాదశ యోజన
ముల పొడవగు శైలశిఖరమున నుండి వడిన్
బలకృష్ణులు రిపుబలముల
వెలి కుఱికిరి కానఁబడక విలసితలీలన్.
10.1-1679-వ.
ఇట్లు శత్రువుల వంచించి యాదవేంద్రులు సముద్రపరిఖంబైన ద్వారకానగరంబునకుం జనిరి; జరాసంధుండు వారలు దగ్ధులై రని తలంచుచు బలంబులుం దానును మగధదేశంబునకు మరలి చనియె” నని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె.

భావము:
అప్పుడు భూమ్మీద పదకొండామడల పొడవు ఉన్న ఆ కొండ కొమ్ము నుంచి బలరామకృష్ణులు జరాసంధుడి సైనికుల కంటపడకుండా వారిని దాటి కుప్పించి దూకేరు. ఈలాగున విరోధుల కనుగప్పి యదుకుల విభులైన రామకృష్ణులు సాగరమే అగడ్తగా కలిగిన తమ ద్వారకాపురికి చేరుకున్నారు. జరాసంధుడు వారు కాలిపోయారని భావించి తన సేనలతో మగధదేశానికి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=201&padyam=1679

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, February 15, 2021

శ్రీకృష్ణ విజయము - 153

( ప్రవర్షణ పర్వతారోహణంబు )

10.1-1677-వ.
మఱియు న మ్మహానలంబు బిలసాను శృంగ వృక్ష లతాకుంజపుంజంబుల దరికొని శిఖలు కిసలయంబులుగ విస్ఫులింగంబులు విరులుగ, సముద్ధూత ధూమపటలంబులు బంధురస్కంధశాఖా విసరంబులుగ, ననోహకంబు కైవడి నభ్రంకషం బై ప్రబ్బి కఠోరసమీరణ సమున్నత మహోల్కాజాల తిరోహిత వియచ్చర విమానంబును, వివిధ విధూమవిస్ఫులింగ విలోకనప్రభూత నూతనతారకా భ్రాంతి విభ్రాంతి గగనచరంబును, సంతప్యమాన సరోవర సలిలంబును, విశాలజ్వాలాజాల జాజ్వల్యమాన తక్కోల చందనాగరు కర్పూరధూమ వాసనావాసిత గగనకుహరంబును, గరాళకీలాజాల దందహ్యమాన కీచకనికుంజపుంజ సంజనిత చిటచిటారావ పరిపూరిత దిగంతరాళంబును, భయంకర బహుళతరశాఖాభిద్యమాన పాషాణఘోషణపరిమూర్ఛిత ప్రాణిలోకంబును సంతప్యమాన శాఖిశాఖాంతర నిబిడ నీడనిహిత శాబకవియోగ దుఃఖ డోలాయమాన విహంగకులంబును, మహాహేతిసందీప్యమాన కటిసూత్ర సంఘటిత మయూరపింఛ కుచకలశయుగళ భారాలస శబరకామినీసమాశ్రిత నిర్ఝరంబును, దగ్ధానేక మృగమిథునంబునునై యేర్చు నెడ.

భావము:
ఆ మహాగ్నికి గుహలలోని, చరియలమీద, శిఖరము పైన ఉన్న చెట్లు తీగలు పొదలు అంటుకుని మండిపోసాగాయి. జ్వాలలే చిగుళ్ళుగా మిణుగురులే పూలుగా పైకిలేచిన పొగలప్రోగులే దట్టమైన బోదెలుగా కొమ్మలుగా కనిపించగా. ఆ అగ్ని ఒక మహావృక్షంవలె ఆకాశాన్ని తాకుతూ వ్యాపించింది. దారుణమైన వాయువు చేత లేచిన గొప్ప నిప్పుకణికలు ఆకాశంలో తిరిగే విమానాలను మరుగుపరిచాయి. పొగలేక కణకణలాడే పలురకాల మిణుగురులను చూసి అవి క్రొత్త నక్షత్రాలని ఆకాశంలో సంచరిస్తున్న దేవతలు విభ్రాంతి చెందారు. సరస్సులలోని నీరు సలసల క్రాగిపోయింది. పెనుమంటలు అంటుకుని కాలుతున్న అగరు, తక్కోల, చందన, కర్పూర వృక్షాల పొగల సుగంధంతో ఆకాశమండలం అంతా పరిమళించింది. భయంకరమైన మంటలతో మండిపోతున్న వెదురుపొదల నుండి పుట్టిన చిటపట ధ్వనులు అన్ని దిక్కుల మధ్య ప్రదేశం అంతా నింపివేశాయి. ఘోరములు మిక్కుటములు అయిన మంటలచే పగిలిపోతున్న రాళ్ళమ్రోత వలన భూతజాలం మూర్ఛిల్లింది. దగ్ధమవుతున్న చెట్లకొమ్మల నడుమ దట్టమైన గూళ్ళలో నివసిస్తున్న తమ పిల్లల ఎడబాటువల్ల ఏర్పడిన దుఃఖంతో పక్షిసమూహం కలతచెందింది. తమ మొలనూళ్ళలో కట్టుకున్న నెమలి యీకలకు మంటలు అంటుకోగా కుండల వంటి కుచాల బరువుచే మందగమన లైన చెంచితలు సెలయేళ్ళను ఆశ్రయించారు. ఆ అగ్ని అనేక మృగమిథునాలను దహించివేసింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=201&padyam=1677

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 152

( ప్రవర్షణ పర్వతారోహణంబు )

10.1-1673-వ.
మఱియుం బలాయమానులై బహుయోజనంబుల దూరంబు చని విశ్రాంతులై తమకు డాఁగ నెల వగునని యింద్రుండు మిక్కిలి వర్షింపఁ "బ్రవర్షణా"ఖ్యంబై పదునొకండు యోజనంబుల పొడవును నంతియ వెడలుపునుం గల గిరి యెక్కి రంత.
10.1-1674-శా.
ఆ శైలేంద్రముఁ జుట్టి రా విడిసి రోషావిష్టుఁడై మాగధో
ర్వీశుం డా వసుదేవ నందనులఁ దా వీక్షింపఁగా లేక త
న్నాశేచ్ఛన్ బిల సాను శృంగములఁ బూర్ణక్రోధుఁడై కాష్ఠముల్
రాశుల్గా నిడి చిచ్చుపెట్టఁ బనిచెన్ రౌద్రంబుతో భృత్యులన్.
10.1-1675-వ.
ఇట్లు జరాసంధపరిజన ప్రదీపితంబైన మహానలంబు దరికొనియె; నందు.
10.1-1676-క.
పొగ లెగసెఁ బొగల తుదలను
మిగులుచు మిడుఁగుఱులు నిగిడె మిడుఁగుఱగమి ము
న్నుగ బ్రహ్మాండము నిండను
భగభగ యని మంట లొదివె భయదము లగుచున్.

భావము:
రామకృష్ణులు పరుగెత్తి పరుగెత్తి పెక్కు ఆమడల దూరం వెళ్ళి సేదతీర్చుకోవడానికి దాగుకోడానికి తగిన చోటని తలచి దేవేంద్రుడు అధికంగా వానలు కురిపించడం చేత ప్రవర్షమనే పేరువహించి పదకొండు ఆమడల పొడవు అంతే వెడల్పు కల ఒక పర్వతాన్ని ఎక్కారు. మగధదేశాధీశుడైన జరాసంధుడు కోపవివశుడై ఆ పర్వతరాజం చుట్టూ దండువిడిశాడు. ఎంత వెతికించినా, అక్కడ రామకృష్ణులను కనుగొనలేకపోయాడు. వారిని నాశనం చేయాలని, ఆ కొండగుహల్లో చరియల్లో శిఖరాల్లో కట్టెలు కట్టలు కట్టలు పేర్చి దహించివేయ మని రౌద్రంతో సేవకులను ఆజ్ఞాపించాడు. ఈ విధంగా జరాసంధుని భృత్యులు ముట్టించిన మహాగ్ని రగులుకొని ఆ పర్వతాన్ని కాల్చివేసింది. అలా రగులుకున్న అగ్నితో ప్రవర్షణ పర్వతంపై ముందు పొగలు పైకి లేచాయి. పొగలమీద మిక్కుటంగా నిప్పురవ్వలు కమ్ముకున్నాయి. ఆ మిణుగురు గుంపులతో బ్రహ్మాండం నిండింది. తరువాత భయంకొల్పుతూ భగభగమని మంటలు లేచాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=201&padyam=1674

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, February 13, 2021

శ్రీకృష్ణ విజయము - 151

( జరాసంధుడు గ్రమ్మర వేయుట )
10.1-1670-చ.
ఇటు చనుదెంచి యున్న మగధేశ్వర వాహినిఁ జూచి యుద్ధ సం
ఘటనము మాని మానవుల కైవడి భీరుల భంగి నోడి ముం
దటి ధనమెల్ల డించి మృదుతామరసాభ పదద్వయుల్ క్రియా
పటువులు రామకేశవులు పాఱిరి ఘోరవనాంతరంబులన్.
10.1-1671-వ.
ఇట్లు పఱచుచున్న కృష్ణబలభద్రులం జూచి వారల ప్రభావంబు లెఱుంగక పరిహసించి.
10.1-1672-ఉ.
"ఓ యదువీరులార! రభసోద్ధతిఁ బాఱకుఁ; డిట్లు పాఱినం
బోయెడువాఁడఁ గాను; మిము భూమి నడంగిన మిన్ను బ్రాకినం
దోయధిఁ జొచ్చినం దగిలి త్రుంచెద" నంచు సమస్త సేనతోఁ
బాయక వచ్చె వెంటఁబడి బాహుబలాఢ్యుఁడు మాగధేశుఁడున్.

భావము:
అలా మథుర మీదకి దండెత్తి వచ్చిన మగధరాజు జరాసంధుడి సైన్యాన్ని చూసి, యుద్ధ ప్రయత్నం మానుకుని కేవలం సామాన్యజనుల వలె, రణభీరువుల వలె బెదిరిపోయి; తమ సంపదలు అన్నీ అక్కడే దిగవిడచి మెత్తటి తామరదళాల వంటి అడుగులు కలవారూ, కార్యశూరులూ అయిన రామకృష్ణులు భయంకరారణ్యంలో పడి పరిగెత్తసాగారు. అలా పారిపోతున్న బలరామకృష్ణులను చూసి, వారి మహిమలు గుర్తించలేక జరాసంధుడు ఎగతాళి చేస్తూ “ఓ యాదవవీరులారా! బలరామకృష్ణులారా! అలా వేగంతో పారిపోకండి. ఎంత ఎక్కువ వేగంతో పరిగెత్తి పారిపోతున్నా మిమ్మల్ని విడిచిపెట్టను. భూమిలో దాగినా, ఆకాశానికి ఎగిరినా, సముద్రంలో మునిగినా; వెనుకే వచ్చి మిమ్మల్ని హతమారుస్తాను.” అంటూ భుజబలసంపన్ను డైన ఆ మగధరాజు వదలకుండా సకల సేనలతో వారి వెంటపడ్డాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=200&padyam=1672

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 150

( జరాసంధుడు గ్రమ్మర వేయుట )

10.1-1668-వ.
ఇట్లు మ్లేచ్ఛులం బొరిగొని మఱియు న మ్మథురానగరంబునం గల ధనంబు ద్వారకానగరంబునకుం బంచిన మనుష్యులు గొనిపోవు నెడ.
10.1-1669-సీ.
ఘోటకసంఘాత ఖురసమున్నిర్గత-
  ధూళి జీమూత సందోహముగను
మహనీయ మదకల మాతంగ కటదాన-
  ధారలు కీలాలధారలుగను
నిరుపమ స్యందననేమి నిర్ఘోషంబు-
  దారుణ గర్జిత ధ్వానముగను
నిశిత శస్త్రాస్త్ర మానిత దీర్ఘరోచులు-
  లలిత సౌదామినీ లతికలుగను
10.1-1669.1-తే.
శత్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను
వృష్టికాలము వచ్చు న వ్విధముఁ దోఁప
నేగుదెంచె జరాసంధుఁ డిరువదియును
మూడు నక్షౌహిణులు దన్ను మొనసి కొలువ.

భావము:
అలాగ మ్లేచ్ఛులను సంహరించి మథురానగరంలో ఉండే సిరిసంపదలను ద్వారకానగరానికి తరలించడానికి మనుషులను ఏర్పాటు చేసాడు.అలా వారు ఆ సంపదలను పట్టుకు వెళుతున్న సమయంలో జరాసంధుడు ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో మథుర మీదకి దండెత్తి వచ్చాడు; అతడి గుఱ్ఱాల గుంపుల డెక్కల వలన రేగిన దుమ్ము మబ్బుల గుంపులా ఉంది; బాగా పెద్దవైన మదపుటేనుగుల చెక్కిళ్ళనుండి స్రవించే మదజలధారలు వర్షజలధారలను మించాయి; కదిలే రథచక్రాల రొద ఘోరమైన ఉరుముల మ్రోతలా అనిపించింది; వాడి శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెఱుపుతీగలను పోలాయి; శత్రురాజుల శౌర్యాగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది;

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=200&padyam=1669

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, February 10, 2021

శ్రీ కృష్ణ విజయము - 149


( ముచికుందుడు స్తుతించుట )

10.1-1666-వ.
నరేంద్రా! నీవు తొల్లి క్షత్రధర్మంబున నిలిచి, మృగయావినోదంబుల జంతువుల వధియించినాఁడవు; తపంబునఁ దత్కర్మ విముక్తుండవై తర్వాతి జన్మంబున సర్వభూత సఖిత్వంబు గలిగి, బ్రాహ్మణ శ్రేష్ఠుండవై నన్నుఁ జేరెద” వని వీడ్కొలిపిన హరికిఁ బ్రదక్షింబు వచ్చి నమస్కరించి గుహ వెడలి సూక్ష్మప్రమాణ దేహంబులతో నున్న మనుష్య పశు వృక్షలతాదులం గని కలియుగంబు ప్రాప్తం బగు నని తలంచి యుత్తరాభిముఖుండై తపోనిష్ఠుం డగుచు సంశయంబులు విడిచి, సంగంబులు పరిహరించి విష్ణుని యందుఁ జిత్తంబు చేర్చి గంధమాదనంబు ప్రవేశించి మఱియు నరనారాయణ నివాసంబైన బదరికాశ్రమంబు చేరి, శాంతుండై హరి నారాధించుచుండె, నిట్లు ముచికుందుని వీడ్కొని.
10.1-1667-శా.
అచ్ఛిద్రప్రకట ప్రతాపరవిచే నాశాంతరాళంబులంన్
బ్రచ్ఛాదించుచుఁ గ్రమ్మఱన్ మథురకుం బద్మాక్షుఁ డేతెంచి వీ
డాచ్ఛాదించి మహానిరోధముగఁ జక్రాకారమై యున్న యా
మ్లేచ్ఛవ్రాతము నెల్లఁ ద్రుంచె రణభూమిం బెంపు సొంపారఁగన్.

భావము:
ఓ రాజోత్తమా! పూర్వం నీవు క్షాత్రధర్మం అవలంబించి వేటమొదలైన వేడుకలతో జంతువులను చంపావు. కనుక, తపస్సు చేసి ఆ పాపం బాపుకో. మరుసటి జన్మలో బ్రాహ్మణుడవై ప్రాణులందు మైత్రి కలిగి నన్ను పొందగలవు.” అని శ్రీహరి అతనికి సెలవు ఇచ్చాడు. ముచుకుందుడు మురవైరికి ప్రదక్షిణంచేసి, ప్రణమిల్లి, గుహనుంచి వెలుపలికి వచ్చాడు. అతడు మనుష్యులు పశువులు చెట్లు తీగలు అల్పపరిమాణాలై ఉండడం చూసాడు. కలియుగం రాబోతున్నదని తెలిసికొని, ఉత్తరదిక్కుకు బయలుదేరి వెళ్ళాడు. ఆయన తపోదీక్ష వహించి అనుమానాలు వదలిపెట్టి అన్నిటి యందు ఆసక్తి మాని శ్రీహరి మీద మనసు లగ్నంచేసి గంధమాదన పర్వతాన్ని ప్రవేశించాడు. అక్కడ నుండి నరనారాయణులకు నెలవైన బదరికాశ్రమాన్ని చేరి శాంతుడై విష్ణుమూర్తిని ఆరాధించసాగాడు. అలా ముచుకుందుడిని పంపిన, పద్మముల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు లోపం లేని ప్రతాపమనే భానుతేజంతో దిగంతరాలను కప్పివేస్తూ మరల మథురానగరానికి విచ్చేసాడు. అతడు పట్టణము అంతటినీ చక్రాకారంతో ఆవరించి ముట్టడించి ఉన్న యవనులు అందరినీ యుద్ధభూమిలో గొప్పదనం అతిశయించేలా నిర్మూలించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1667

: : భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, February 9, 2021

శ్రీ కృష్ణ విజయము - 148

( ముచికుందుడు స్తుతించుట )

10.1-1664-వ.
కావున రజస్తమస్సత్వగుణంబుల ననుబంధంబు లగు నైశ్వర్య శత్రు మరణ ధర్మాది విశేషంబులు విడిచి యీశ్వరుండును విజ్ఞాన ఘనుండును, నిరంజనుండును, నిర్గుణుండును, నద్వయుండును నైన పరమపురుషుని ని న్నాశ్రయించెదఁ; జిరకాలంబు కర్మఫలంబులచేత నార్తుండనై క్రమ్మఱం దద్వాసనల సంతుష్టుండనై తృష్ణం బాయక శత్రువులైన యింద్రియంబు లాఱింటిని గెలువలేని నాకు శాంతి యెక్కడిది? విపన్నుండ నైన నన్ను నిర్భయుం జేసి రక్షింపు” మనిన ముచికుందునికి హరి యిట్లనియె.
10.1-1665-ఉ.
"మంచిది నీదు బుద్ధి నృపమండన! నీవు పరార్థ్య మెట్లు వ
ర్తించిన నైనఁ గోరికల దిక్కునఁ జిక్కవు మేలు నిర్మలో
దంచితవృత్తి నన్ గొలుచు ధన్యు లబద్ధులు నెట్లు నీకు ని
శ్చంచలభక్తి గల్గెడిని సర్వము నేలుము మాననేటికిన్.

భావము:
కాబట్టి. సత్త్వము రజస్సు తమస్సు అను త్రిగుణాలను అనువర్తించు నట్టి ఐశ్వర్యము; శత్రు మరణము, ధర్మము ఇత్యాది విశేషములు అన్నింటినీ వదలి; నేను ఈశ్వరుడూ, విజ్ఞానఘనుడూ, మాయాకార్యము లైన రాగాదులు లేనివాడూ; త్రిగుణాలతో సంబంధము లేనివాడూ; తనంత తానే ఐన వాడూ; తన కంటే అధికుడు కలుగనివాడూ; పురుషులలో ఉత్తముడూ అయిన నిన్ను శరణు కోరుతున్నాను. బహుకాలం ప్రారబ్ధకర్మ ఫలము అనుభవిస్తూ దుఃఖితుడనై ఇంకా పూర్వజన్మ వాసనలచే సంతోషాన్ని పొందుతూ ఆశ వదలక శత్రువు లైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, మనస్సు అనే ఆరు జ్ఞానేంద్రియాలను జయించలేని నాకు శాంతి ఎలా లభిస్తుంది? ఆపన్నుడ నైన నన్ను మన్నించి భయరహితుడిని కావించి కాపాడుము” అంటూ వేడుకొన్న ముచుకుందుడితో మాధవుడు ఇలా అన్నాడు. రాజులకు అలంకార మైనవాడా! నీ బుద్ధి మంచిది నీవు ఇతరుల కోసము ఎలా ప్రవర్తించినప్పటికీ, కోరికలకు ప్రలోభం చెందలేదు. నిర్మల మనస్సుతో నన్ను సేవించువారు ధన్యాత్ములు. వారు సంసారబద్ధులు కానేరరు. నీకు నా మీద దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నాను, నీవు ఏదీ మానవలసిన పని లేదు, నా యందు మనసుంచి సమస్తం పరిపాలించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1665

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :


శ్రీ కృష్ణ విజయము - 147

( ముచికుందుడు స్తుతించుట )

10.1-1661-ఆ.
సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగఁ
జారుపీఠ మెక్కి సార్వభౌముఁ
డైన సతులగృహము లందుఁ గ్రీడాసక్తి
వృత్తినుండు; నిన్ను వెదకలేఁడు.
10.1-1662-ఆ.
మానసంబు గట్టి మహితభోగంబులు
మాని యింద్రియముల మదము లడఁచి
తపము చేసి యింద్రతయ గోరుఁ గాని నీ
యమృత పదముఁ గోరఁ డజ్ఞుఁ డీశ!
10.1-1663-సీ.
సంసారి యై యున్న జనునకు నీశ్వర!-
  నీ కృప యెప్పుడు నెఱయఁ గల్గు
నప్పుడ బంధంబు లన్నియుఁ దెగిపోవు-
  బంధమోక్షంబైనఁ బ్రాప్త మగును
సత్సంగమంబు; సత్సంగమంబున నీదు-
  భక్తి సిద్ధించు; నీ భక్తివలన
సన్ముక్తి యగు; నాకు సత్సంగమునకంటె-
  మును రాజ్యబంధ నిర్మూలనంబు
10.1-1663.1-తే.
గలిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?
కృష్ణ! నీ సేవగాని తక్కినవి వలదు;
ముక్తి సంధాయి వగు నిన్ను ముట్టఁ గొలిచి
యాత్మబంధంబు గోరునే యార్యుఁ డెందు?

భావము:
అన్ని దిక్కులనూ జయించి సాటివారు కీర్తిస్తుంటే ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ ఆడవారి మందిరాలలో కామసుఖాలు అనుభవిస్తాడే తప్ప నిన్ను అన్వేషించ లేడు. పరమేశా! జ్ఞానహీనుడు మనస్సును బంధించి, గొప్ప భోగములను విడనాడి, ఇంద్రియాటోపమును అణచివేసి, తపస్సుచేసి; ఇంద్రపదవి అభిలషిస్తాడే కాని నీ అమృత స్థానమును కోరుకోడు. అచ్యుతా! నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి ఆ సంసారబంధాలు సడలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీయందు భక్తి సిద్ధిస్తుంది. నీయందు నెలకొన్న భక్తి వలన ముక్తి చేకూరుతుంది. నాకు భాగవతోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్యపాశ నిర్మూలనం జరిగింది. ఇదంతా నీకృప కృష్ణా! నాకు నీ పాదసేవనం తప్ప తక్కినవేమీ వద్దు. విజ్ఞుడైనవాడు ముక్తిదాయకుడ వైన నిన్నుసేవించి తనకు ప్రతిబంధకా లైన శబ్దాది విషయభోగాలను కోరుకోడు కదా!


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1663

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, February 8, 2021

శ్రీ కృష్ణ విజయము - 146

( ముచికుందుడు స్తుతించుట )

10.1-1658-క.
ఘట కుడ్య సన్నిభం బగు
చటుల కళేబరముఁ జొచ్చి జనపతి నంచుం
బటు చతురంగంబులతో
నిటునటుఁ దిరుగుదును నిన్ను నెఱుఁగమి నీశా!
10.1-1659-ఆ.
వివిధ కామ లోభ విషయ లాలసు మత్తు
నప్రమత్తవృత్తి నంతకుండ
వైన నీవు వేళ యరసి త్రుంతువు సర్ప
మొదిఁగి మూషకంబు నొడియు నట్లు.
10.1-1660-క.
నరవరసంజ్ఞితమై రథ
కరిసేవితమైన యొడలు కాలగతిన్ భీ
కరమృగభక్షితమై దు
స్తరవిట్క్రిమిభస్త్రిసంగతం బగు నీశా!

భావము:
ప్రభూ! నిన్ను తెలుసుకోకపోవడంతో; కుండ గోడ వలె జడమైన చంచలమైన దేహంలో ప్రవేశించి, నేను రాజు నంటూ రథ, గజ, తురగ, పదాతులతో విఱ్ఱవీగుతూ, భూమి మీద అటునిటు తిరుగుతున్నాను. అంతులేని కోరికలతో శబ్దాది విషయము లందు ఆశ వహించి ఏమఱి ఉండగా. నీవు మాత్రం ఏమరుపాటు చెందక అంతక స్వరూపుడవై, పాము కనిపెట్టి ఉండి తటాలున ఎలుకను పట్టినట్లు, సమయం రాగానే పట్టి విషయలాలసులను హరిస్తావు. మాధవా! రాజును అని పేరు వహించి రథాల మీద, ఏనుగుల మీద ఎక్కి తిరిగిన ఈ శరీరం కాలవశమై భయంకరము లైన జంతువులచే భక్షింపబడటం వలన పురీషమనీ, మురిగిపోతే పురుగులనీ, కాలిపోతే బూడిద అనీ వ్యవహరింపబడుతోంది.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1660

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 145

( ముచికుందుడు స్తుతించుట )

10.1-1655-క.
"నీ మాయఁ జిక్కి పురుష
స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు; వి
త్తామయ గృహగతమై సుఖ
తామసమై కామవంచితంబై యీశా!
10.1-1656-ఉ.
పూని యనేకజన్మములఁ బొంది తుదిం దన పుణ్యకర్మ సం
తానము పేర్మిఁ గర్మ వసుధాస్థలిఁ బుట్టి ప్రపూర్ణదేహుఁడై
మానవుఁడై గృహేచ్ఛఁబడు మందుఁ డజంబు తృణాభిలాషి యై
కానక పోయి నూతఁబడు కైవడి నీ పదభక్తిహీనుఁడై.
10.1-1657-క.
తరుణీ పుత్ర ధనాదుల
మరిగి మహారాజ్యవిభవ మదమత్తుఁడనై
నరతను లుబ్ధుఁడ నగు నా
కరయఁగ బహుకాల మీశ! యాఱడుఁబోయెన్.

భావము:
“సర్వేశ్వరా! నీ మాయచేత మోహితులై సుఖలేశం తోపించు విత్తము, గృహాదులు మీద తగులం పొంది వారు వంచితులు అవుతూ, స్త్రీలును పురుషులును నిన్ను భజింపరు. జీవి పలు జన్మములు ఎత్తియెత్తి తుదకు తన పుణ్యకార్యముల ఫలంగా కర్మక్షేత్రమైన దేశంలో పూర్ణ దేహంతో మానవుడుగా పుడతాడు. పుట్టి కూడా మూఢత వలన నీ పదభక్తి లేనివాడై మేక గడ్డి మీది ఆశతో కనులు కానక వెళ్ళివెళ్ళి నూతిలో పడినట్లు గృహాదులు అందలి వాంఛలకు వశుడై చెడుతున్నాడు. పరమేశ్వరా! ఆలుబిడ్డలు, డబ్బు, మొదలైన వాటి మీద తగులము పొంది, మహారాజ్య సంపత్తితో మదించిన మనసు కలవాడనై ఈ మానవ శరీరము మీది పేరాస కల వాడను అయిన నాకు వ్యర్థముగా చాలాకాలం గడచిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1656

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, February 7, 2021

శ్రీ కృష్ణ విజయము - 144

( కాలయవనుడు నీరగుట )

10.1-1652-వ.
అనిన విని మేఘగంభీర భాషణంబుల హరి యిట్లనియె.
10.1-1653-సీ.
"భూరజంబులనైన భూనాథ! యెన్నంగఁ-
  జనుఁ గాని నా గుణ జన్మ కర్మ
నామంబు లెల్ల నెన్నంగ నెవ్వరుఁ జాల-
  రదియేల; నాకును నలవిగాదు
నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను-
  నిర్జించి ధర్మంబు నిలువఁబెట్ట
బ్రహ్మచే మున్నునేఁ బ్రార్థింపఁబడి వసు-
  దేవు నింటను వాసుదేవుఁ డనఁగ
10.1-1653.1-ఆ.
గరుణ నవతరించి కంసాఖ్యతో నున్న
కాలనేమిఁ జంపి ఖలుల మఱియు
ద్రుంచుచున్నవాఁడఁ దొడరి నీ చూడ్కి నీ
ఱైనవాఁడు కాలయవనుఁ డనఘ!
10.1-1654-వ.
వినుము; తొల్లియు నీవు నన్ను సేవించిన కతంబున నిన్ననుగ్రహింప నీ శైలగుహకు నేతెంచితి; నభీష్టంబులైన వరంబు లడుగు మిచ్చెద మద్భక్తులగు జనులు క్రమ్మఱ శోకంబున కర్హులు గా" రనిన హరికి ముచికుందుండు నమస్కరించి, నారాయణదేవుం డగుట యెఱింగి యిరువదియెనిమిదవ మహాయుగంబున నారాయణుం డవతరించు నని మున్ను గర్గుండు చెప్పుటఁ దలచి.

భావము:
ఇలా పలికిన ముచుకుందుని పలుకులు విని, మేఘగంభీర మైన కంఠంతో మాధవుడు ఇలా అన్నాడు. “ఓ రాజేంద్రా! భూమ్మీద ఉన్న దుమ్మురేణువులను అయినా లెక్కించడం సాధ్యమ అవుతుందేమో కాని, నాకు గల గుణములు, జన్మములు, కర్మములు, నామములు అన్నిటిని ఇన్ని అని ఎవరూ గణించ లేరు. ఇంత ఎందుకు నాకు కూడ సాధ్యం కాదు. భూదేవికి భారముగా అయిన రాక్షసులు అందరినీ జయించి, ధర్మాన్ని స్థాపించడం కోసం బ్రహ్మ పూర్వం నన్ను ప్రార్థించాడు. లోకానుగ్రహ కాంక్షతో నేను అంగీకరించి యదు వంశంలో వసుదేవుడి ఇంట అవతరించాను. వసుదేవ నందనుడిని కనుక నన్ను “వాసుదేవుడు” అంటారు. కంసనామంతో ఉన్న కాలనేమిని సంహరించాను. ఇంకా దుర్జనులను తునుమాడుతున్నాను. ఓ దోషరహితుడా! నీ చూపు తగిలి దగ్ధుడైనవాడు కాలయవనుడు. పూర్వం నీవు నన్ను ఆరాధించావు ఆ కారణం చేత నిన్ను అనుగ్రహించడం కోసం ఈ పర్వతగుహకు వచ్చాను. నీ కిష్టమైన వరాలు అడుగు ఇస్తాను. నా భక్తులైనవారు ఇక శోకం పొందుటకు తగరు.” అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ముచుకుందుడు నందనందనుడికి నమస్కరించి, అతడు సాక్షాత్తు నారాయణుడని తెలిసి ఇరువైయెనిమిదవ మహాయుగంలో భూమిపై విష్ణువు అవతరిస్తాడని తొల్లి గర్గాచార్యులు చెప్పిన మాట జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1654

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 143

( కాలయవనుడు నీరగుట )

10.1-1649-క.
ఈ యడవి విషమకంటక
భూయిష్ఠము ఘోరసత్వపుం జాలభ్యం
బో! యయ్య! యెట్లు వచ్చితి?
నీ యడుగులు కమలపత్ర నిభములు సూడన్.
10.1-1650-వ.
మహాత్మ! యేను నీకు శుశ్రూషణంబుజేయం గోరెద నీ జన్మగోత్రంబు లెఱింగింప నే నర్హుండనైన నెఱింగింపు; నే నిక్ష్వాకువంశ సంభవుండను; మాంధాతృ నందనుండను; ముచికుందుం డనువాఁడ; దేవహితార్థంబు చిరకాల జాగరశ్రాంతుండనై నిద్ర నొంది యింద్రియ సంచారంబులు మఱచి.
10.1-1651-శా.
ఏ నిద్రించుచు నుండ నొక్క మనుజుం డేతెంచి దుష్కర్ముఁడై
తా నీఱై చెడె నాత్మకిల్బిషమునన్ దర్పోగ్రుడై; యంతటన్
శ్రీనాథాకృతివైన నిన్నుఁ గని వీక్షింపన్నశక్తుండనై
దీనత్వంబునుఁ జెందితిన్ ననుఁ గృపాదృష్టిన్ విలోకింపవే."

భావము:
ఈ అడవి చూస్తే మిట్టపల్లాలతో, ముళ్ళతో నిండి ఉంది. భయంకర జంతుజాలం వల్ల దుర్గమంగా ఉంది. నీ అరికాళ్ళు చూస్తే పద్మపత్రాల మాదిరి ఉన్నాయి. ఇక్కడకి ఎలా నడచి వచ్చావు? ఓ మహానుభావా! నీ కులం గోత్రం నాకు తెలియదు. కాని నీకు సేవ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నేను వినదగ్గ వాడిని అనిపిస్తే చెప్పు. నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడను. మాంధాత పుత్రుడిని. నా పేరు ముచుకుందుడు అంటారు. దేవతల మేలు చేయడం కోసం ఎంతోకాలం మేలుకుని ఉండటంతో బడలిక చెందాను. నిద్రలో మునిగి ఇంద్రియ వ్యాపారాలు మరచి నేను నిద్రిస్తుండగా. ఎవడో మానవుడు ఒకడు వచ్చాడు. వాడు దుర్మార్గుడు. దారుణమైన గర్వం కల వాడు. వాడు తన పాపం వలన భస్మమై నశించాడు. తరువాత, శ్రీలక్ష్మీనాథ రూపుడవైన నిన్ను దర్శించాను. తేరిపార చూడ్డానికి అశక్తుడనై, దైన్యం పొందాను. నన్ను నీ దయగల చూపులతో చూసి కటాక్షించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1651

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, February 6, 2021

శ్రీ కృష్ణ విజయము - 142

( కాలయవనుడు నీరగుట )

10.1-1647-సీ.
వనరుహలోచను వైజయంతీదామ-
  శోభితు రాకేందు సుందరాస్యు
మకరకుండలకాంతి మహితగండస్థలుఁ-
  గౌస్తుభగ్రైవేయు ఘనశరీరు
శ్రీవత్సలాంఛనాంచితవక్షు మృగరాజ-
  మధ్యుఁ జతుర్భాహు మందహాసుఁ
గాంచన సన్నిభ కౌశేయవాసు గాం-
  భీర్య సౌందర్య శోభితుఁ బ్రసన్ను
10.1-1647.1-ఆ.
న మ్మహాత్ముఁ జూచి యాశ్చర్యమును బొంది
తన్మనోజ్ఞదీప్తిఁ దనకుఁ జూడ
నలవిగాక చకితుఁడై యెట్టకేలకుఁ
బలికెఁ బ్రీతి నవనిపాలకుండు.
10.1-1648-మ.
"శశివో? యింద్రుఁడవో? విభావసుఁడవో? చండప్రభారాశివో?
శశిచూడామణివో? పితామహుఁడవో? చక్రాంకహస్తుండవో?
దిశలున్ భూమియు మిన్ను నిండె నిదె నీ తేజంబుఁ జూడంగ దు
ర్వశ; మెవ్వండ విటేల వచ్చి తిచటన్ వర్తించె దేకాకివై.

భావము:
కలువల వంటి కన్నుల కలవాడు; వైజయంతి అనే వనమాలతో విలసిల్లువాడు; పున్నమి నాటి చంద్రబింబం వంటి అందమైన మోము కలవాడు; మకరకుండలాల కాంతితో నిండిన చెక్కిళ్ళు కలవాడు; కౌస్తుభమణితో అలంకరింపబడిన వక్షస్థలము కలవాడు; మేఘవర్ణపు దేహం కలవాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో ఒప్పుతున్న ఉరం కలవాడు; సింహం నడుము వంటి నడుము కలవాడు; నాలుగు చేతులతో అలరారువాడు; చిరునవ్వులు చిందించువాడు; పసిడివన్నె పట్టుబట్టలు కట్టుకున్నవాడు; నిండు సౌందర్యంతో విలసిల్లువాడు; ప్రసన్నుడు అయిన ఆ మహానుభావుడిని ముచుకుంద మహారాజు చూసి ఆశ్చర్యపోయాడు. నారాయణుడి మనోహరమైన కాంతి చూడడానికి తనకి అలవి కాక పోవడంతో అతడు సంభ్రమం చెంది, చివరికి ప్రీతితో ఇలా అన్నాడు. “అయ్యా! నీవు చంద్రుడివో? మహేంద్రుడివో? అగ్నిదేవుడివో? సూర్యుడివో? చంద్రశేఖరుడివో? బ్రహ్మదేవుడివో? చక్రపాణివో? తెలియడం లేదు. దిక్కులూ భూమ్యాకాశములూ సర్వం నిండిన, నీ ప్రకాశం పరికించడానికి చూడ శక్యము కావటం లేదు. నీవు ఎవడవు? ఇక్కడకి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు?


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1647

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 141

( కాలయవనుడు నీరగుట )

10.1-1644-క.
కాలము ప్రబలురకును బలి
కాలాత్ముం డీశ్వరుం డగణ్యుఁడు జనులం
గాలవశులఁగాఁ జేయును
గాలముఁ గడవంగలేరు ఘను లెవ్వారున్.
10.1-1645-క.
వర మిచ్చెద మర్థింపుము
ధరణీశ్వర! మోక్షపదవి దక్కను మే మె
వ్వరమును విభులము గా మీ
శ్వరుఁ డగు హరి దక్క మోక్షసంగతిఁ జేయన్."
10.1-1646-వ.
అని పలికిన దేవతలకు, నమస్కరించి ముచికుందుఁడు నిద్రఁ గోరి దేవదత్త నిద్రావశుండయ్యి పర్వతగుహాంతరాళంబున శయనించి యుండె; యవనుండు నీఱయిన పిమ్మట హరి ముచికుందుని ముందఱ నిల్చిన.

భావము:
కాలం మహాబలవంతుల కంటే బలమయినది. భగవంతుడే కాలస్వరూపుడు. అతడు ఇలాంటి వాడని నిరూపించటం సాధ్యం కాదు. అతడు జనులను కాలానికి లోబరుస్తాడు. ఎంతటి గొప్పవారయినా కాలాన్ని దాటలేరు. ఓ ముచికుంద మహారాజా! కైవల్యం తప్ప మరి ఏ వరమైనా సరే కోరుకో, ఇస్తాము. భగవంతుడు విష్ణువుకి తప్ప మోక్షము ఇవ్వడానికి మాకు ఎవరికీ అధికారం లేదు.” ఇలా చెప్పిన దేవతలకు అభివాదం చేసి ముచుకుందుడు నిద్రను కోరుకున్నాడు. దేవతలు ఇచ్చిన నిద్రకు లోబడి, అతడు కొండగుహలోపల ఇంత కాలమూ పండుకొని ఉన్నాడు. కాలయవనుడు భస్మమైన పిదప శ్రీకృష్ణుడు ముకుందుని ఎదుట నిలబడి సాక్షాత్కారం ఇవ్వగా.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1645

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, February 2, 2021

శ్రీ కృష్ణ విజయము - 140

( కాలయవనుడు నీరగుట )

10.1-1641-ఆ.
"ఎవ్వఁడాతఁ డతని కెవ్వండు దండ్రి? ఘో
రాద్రిగుహకు నేటి కతఁడు వచ్చి
నిద్రపోయె? యవను నిటు గాల్ప నెట్లోపెఁ?
దెలియఁ బలుకు నాకు ధీవరేణ్య!"
10.1-1642-వ.
అనినం బరీక్షిన్నరేంద్రునకు నతికుతూహలంబుతో శుకయోగివర్యుం డిట్లనియె “నిక్ష్వాకు కులసంభవుండు మాంధాత కొడుకు ముచికుందు డను రాజు, రాక్షసభీతులైన వేల్పులం బెద్దగాలంబు సంరక్షించిన మెచ్చి; వా రమరలోక రక్షకుండైన యా రాజకుమారుని కడకుం జేరి వరంబు వేఁడు మనిన; వారలం గనుంగొని మోక్షపదం బడిగిన; వార లతని కిట్లనిరి.
10.1-1643-మ.
"జగతిన్ నిర్గతకంటకం బయిన రాజ్యంబున్ విసర్జించి శూ
రగణాగ్రేసర! పెద్దకాలము మమున్ రక్షించి; తీలోన నీ
మగువల్ మంత్రులు బంధులున్ సుతులు సంబంధుల్ భువిన్లేరు కా
లగతిం జెందిరి; కాల మెవ్వరికి దుర్లంఘ్యంబు దా నారయన్.

భావము:
“బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా! శుకా! ఆ పురుషుడు ఎవరు? అతని తండ్రి ఎవరు? అలా భయంకరమైన గుహలోకి వచ్చి అత డెందుకు నిద్రపోయాడు? అతడు కాలయవనుడిని ఎలా కాల్చివేయగలిగాడు? ఈ విషయ మంతా నాకు తెలిసేలా విశదీకరించు.” అని ఇలా ప్రశ్నించిన మహారాజు పరీక్షిత్తుకు మిక్కిలి ఆసక్తి పూర్వకంగా యోగిపుంగవుడైన శుకుడు ఇలా చెప్పసాగాడు. “ఆ పురుషుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మాంధాత యొక్క పుత్రుడు. ముచుకుందుడు అనే మహారాజు. అతడు అసురులకు భయపడిన దేవతలను బహుకాలం సంరక్షించాడు. దేవలోకాన్ని కాపాడిన ఆ రాకుమారుడిని మెచ్చుకుని దేవతలు అతనిని ఏదైనా వరము కోరుకోమన్నారు. అతడు మోక్షమును కోరగా దేవతలు అతనితో ఇలా అన్నారు. “ఓ వీరాగ్రేసరా! ముచికుందా! మానవలోకంలో శత్రువులే లేని నీ రాజ్యాన్ని వదలి వచ్చి, చిరకాలం మమ్మల్ని సంరక్షిస్తూ ఇక్కడే ఉండిపోయావు. ఈ లోపల నీ పత్నులు, స్నేహితులు, చుట్టాలు, కుమారులు నీకు సంబంధించిన వారు అందరూ భూమిని విడిచారు. వారంతా మరణించారు. ఎంతటి వారైనా కాలప్రభావాన్ని గడవలేరు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1643

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :