Wednesday, December 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౬(436)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-932-వ.
అదియునుం గాక పరమపావనుండవైన నీవు ధర్మంబుదప్పిన నెవ్వరు మాన్పంగలరు? కావునఁ బ్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువ; దట్లుగావున దీనికిఁ బ్రతీకారంబు పుట్టింపు” మనిన నతండు వారలం గనుంగొని “తామసంబున నిట్టి పాపంబు సేయంబడియె; దీనికి ముఖ్యపక్షంబునఁ బ్రతికృతి యెఱింగింపుండు, వీనికి నాయువును బహుసత్త్వంబును నొసంగిన మీకిష్టంబగునే నట్లు నాయోగమాయచేఁ గావింతు” నన నమ్మునులు "నీయస్త్రమాహాత్మ్యంబునకు మృత్యువునకు మాకు నెవ్విధంబున వైకల్యంబు నొందకుండునట్లు గావింపు"మనిన నతం డందఱం జూచి యప్పుడు. 

భావము:
అంతే కాకుండా, పరమ పవిత్రుడవైన నీవే ధర్మం తప్పితే, అధర్మాన్ని ఎవరు అడ్డుకుంటారు? దీనికి ప్రాయశ్చిత్తం చేయకపోతే ధర్మం మనుగడకే ప్రమాదం. కనుక, నీవు ఆ ప్రాయశ్చిత కార్యం తలపెట్టాలి.” ఇలా పలుకుతున్న మహర్షుల మాటలు వినిన బలరాముడు వారితో “తొందరపాటు వలన ఇంతటి పాపం చేశాను. దీనికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి. మీకు ఇష్టం అయితే, నా యోగమాయా ప్రభావంతో సూతుణ్ణి బ్రతికించి, అతడిని మహాశక్తిమంతునిగా చేస్తాను.” అన్నాడు. అంతట “నీ అస్త్రమహాత్మ్యానికి, మృత్యు నియమానికి, మాకు ఎలాటి ధర్మవిఘాతం కలుగకుండా, బలరామ! నీ ఇష్ట ప్రకారం చేయుము” అని ఋషులు బలరాముడితో అన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=932 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: