Saturday, December 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 110

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1427-వ.
వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లైన విష్ణుమూర్తు లని యెఱింగి; భక్తితోడ శుశ్రూష చేసి సర్వభూతమయుం డగు కృష్ణునకు నమస్కరించి “యేమి చేయుదు నానతి” మ్మనిన నమహాత్ముండు యిట్లనియె.
10.1-1428-క.
"చెప్పెద మా గురునందనుఁ
దప్పుగలుగఁ జూచి నీవు దండనమునకుం
దెప్పించినాఁడ వాతని
నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!"

భావము:
అలా వచ్చిన యముడు బలరామకృష్ణులను చూడగానే. వారు లీలావతారం ధరించిన విష్ణువు అవతార మూర్తులు అని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన కృష్ణుడికి నమస్సులు సమర్పించి. “నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించ” మని అడిగాడు. యముడి మాటలు విని ఆ పరమాత్మ ఇలా అన్నాడు. “ఓ పుణ్యశీలా! యమధర్మరాజా! చెబుతాను విను. మా గురుపుత్రునిలో తప్పు చూసి దండించడం కోసం తెప్పించుకున్నావు. మాకు అతడు కావాలి, అప్పగించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1428

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 109

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1425-వ.
చని సంయమనీనామ నగరంబు చేరి తద్వారంబునఁ బ్రళయకాల మేఘగంభీర నినద భీషణం బగు శంఖంబు పూరించిన విని వెఱఁగుపడి.
10.1-1426-శా.
"అస్మద్బాహుబలంబుఁ గైకొనక శంఖారావమున్ మాన సా
పస్మారంబుగ నెవ్వఁ డొక్కొ నగరప్రాంతంబునం జేసె? మ
ద్విస్మేరాహవ రోషపావకునిచే విధ్వస్తుఁడై వాఁడు దా
భస్మంబై చెడు" నంచు నంతకుఁడు కోపప్రజ్వలన్మూర్తియై.

భావము:
అలా వెళ్ళిన శ్రీకృష్ణుడు సంయమని అనే పేరు కల ఆ యముడి పట్టణం చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీరధ్వనితో భీతిగొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖఘోషము వినిన యమధర్మరాజు అశ్చర్యపోయాడు. “నా యమపురి ముందట ఎవరో నా భుజబలాన్ని లెక్కచేయకుండా నా మనసుకు క్రోధావేశం కలిగేలా శంఖం పూరిస్తున్నాడు. వాడు అద్భుతావహ మైన నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు.” అంటూ దండధరుడు కోపంతో మండిపడుతూ వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1426

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, December 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 108

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1422-వ.
అని వాని వసియించు చో టెఱింగించిన.
10.1-1423-శా.
శంఖారావముతోడఁ బంచజనుఁ డాశంకించి చిత్తంబులో
సం ఖిన్నుండయి వార్థిఁ జొచ్చె దహనజ్వాలాభ హేమోజ్జ్వల
త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ
ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై.
10.1-1424-క.
దానవుని దేహజం బగు
మానిత శంఖంబుఁ గొనుచు మసలక బలుఁడుం
దో నేతేరఁగ రథి యై
దానవరిపుఁ డరిగె దండధరుపురికి నృపా!

భావము:
అంటూ సముద్రుడు ఆ రాక్షసుడుండే చోటు రామకృష్ణులకు తెలియజేసాడు. శ్రీకృష్ణుడు శంఖం పూరించగా, ఆ శంఖారావం వినిన పంచజనుడు భయ సందేహాలతో కంపించిపోయి,. సాగర జలంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు వాడిని అగ్నిజ్వాలలతో సమానములైన బంగారుపింజల రంగారు బాణాలతో పడగొట్టి, వాడి పొట్టను చీల్చాడు. అచంచలమనస్కు డైన శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రకుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రీతిచే కార్య తత్పరుడు అయ్యాడు. ఓ పరీక్షన్మహారాజా! రాక్షసవిరోధి అయిన శ్రీకృష్ణుడు పంచజన రాక్షసుడి శరీరం నుంచి జనించిన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్ర సహితుడై రథము ఎక్కి, యమ పురికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1424

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 107

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1418-వ.
అనిన విని రామకృష్ణులు గుర్వర్థంబుగా దుర్వారరథారూఢులై రయంబునం జని రౌద్రంబున సముద్రంబుఁ జేరి యిట్లనిరి.
10.1-1419-క.
"సాగర! సుబుద్ధితోడను
మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ
వాగడ మగుదువు దుస్సహ
వేగరణాభీల నిశిత విశిఖాగ్నులకున్."
10.1-1420-వ.
అనిన వారలకు జలరాశి యిట్లనియె.
10.1-1421-ఉ.
"వంచన యేమి లేదు యదువల్లభులార! ప్రభాసతీర్థమం
దంచితమూర్తి విప్రసుతుఁ డాఢ్యుఁడు తోయములాడుచుండ ను
త్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతిం గొనిపోయెఁ బోవఁగాఁ
బంచజనుండు మ్రింగె నతిభాసురశీలుని విప్రబాలునిన్."

భావము:
ఇలా పలికిన తమ గురువు పలుకులు విని, రామకృష్ణులు వారి కోరిక తీర్చడం కోసం ఎదురు లేని రథాన్ని అధిరోహించారు. తత్క్షణం సముద్రుడి దగ్గరకి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు. “ఓ సముద్రుడా! మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుడిని తెచ్చి మాకు అప్పగించు. ఎదురు చెప్పావు అంటే, సహింపరాని వేగం కలవీ, రణరంగ భయంకరాలూ అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గుఱి అవుతావు.” ఇలా పలికిన రామకృష్ణులతో సాగరుడు ఇలా అన్నాడు. “యాదవేశ్వరులారా! నా మాటలలో ఏమాత్రం మోసం లేదు. ప్రభాసతీర్ధంలో మంచి అందమైన చక్కటి బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా, పెద్ద అల ఒకటి పైకెగసి భయంకరవేగంతో అతడిని లోపలికి తీసుకుపోయింది. అలా తీసుకునిపోగా బహు చక్కనైన స్వభావం కల ఆ బ్రాహ్మణ పిల్లాడిని పంచజనుడనే దైత్యుడు మ్రింగివేశాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1421

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, December 21, 2020

శ్రీ కృష్ణ విజయము - 106

( సాందీపుని వద్ధ శిష్యులగుట )


10.1-1416-శా.
"అంభోరాశిఁ బ్రభాసతీర్థమున ము న్నస్మత్తనూసంభవుం
డంభోగాహము సేయుచున్ మునిఁగి లేఁ డయ్యెం గృపాంభోనిధుల్
శుంభద్వీర్యులు మీరు మీ గురునకుం జోద్యంబుగా శిష్యతన్
గాంభీర్యంబునఁ బుత్రదక్షిణ యిడం గర్తవ్య మూహింపరే.
10.1-1417-క.
శిష్యులు బలాఢ్యులైన వి
శేష్యస్థితి నొంది గురువు జీవించును ని
ర్దూష్యగుణ బలగరిష్ఠులు
శిష్యులరై గురుని కోర్కి సేయం దగదే?"

భావము:
“నాయనలారా! మా కుమారుడు కొన్నాళ్ళ క్రితం సముద్రంలో ప్రభాసమనే తీర్థ ఘట్టం వద్ద స్నానం చేయడానికి నీటిలో దిగి మునిగిపోయాడు. అంతే మళ్ళీ కనిపించ లేదు. దయసముద్రులూ, ప్రకాశవంతమైన ప్రతాపం కలవారూ అయిన మీరు శిష్యధర్మం వహించి, మాకు గురుదక్షిణ ఇవ్వాలి. అందుచేత, అందరికీ అచ్చెరువు కలిగేలాగ మా కుమారుడిని తీసుకొని వచ్చి గురుదక్షిణగా ఇవ్వండి. శిష్యులు మిక్కిలి బలవంతులైతే గురువు విశేషమైన ఉత్తమస్థితిని పొంది తలెత్తుకొని జీవిస్తాడు. అనింద్య గుణములతో, అఖండ పరాక్రమంతో విరాజిల్లే మీ వంటి శిష్యులు గురుడి కోరిక నెరవేర్చడం న్యాయం కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1417

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, December 19, 2020

శ్రీ కృష్ణ విజయము - 105

( సాందీపుని వద్ధ శిష్యులగుట )

10.1-1413-క.
అఱువదినాలుగు విద్యలు
నఱువదినాలుగు దినంబు లంతన వారల్
నెఱవాదులైన కతమున
నెఱి నొక్కొక నాటి వినికి నేర్చి రిలేశా!
10.1-1414-క.
గురువులకు నెల్ల గురులై
గురులఘుభావములు లేక కొమరారు జగ
ద్గురులు త్రిలోకహితార్థము
గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్.
10.1-1415-వ.
ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి వారల మహాత్మ్యంబునకు వెఱఁగుపడి సభార్యుండైన సాందీపుం డిట్లనియె.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! రామకృష్ణులు ఎంతో నేర్పరులు కనుక, అరవైనాలుగు కళలనూ అరవైనాలుగు రోజులలో చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ చొప్పన వినడంతోనే నేర్చుసుకున్నారు. గురువులకే గురువులు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేద భావములు లేక ప్రకాశించు లోకగురువులు అయిన రామకృష్ణులు, ముల్లోకాలకు మేలు కలిగించడం కోసం, సంతోషంగా గురుశిష్య న్యాయంతో గురువు అయిన సాందీపుడిని సేవించారు. ఇలా, కృతార్థులైన శిష్యులను చూసి వారి ప్రభావానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి, సాందీపని రామకృష్ణులతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1414

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 104

( సాందీపుని వద్ధ శిష్యులగుట )

10.1-1411-వ.
చని మహావైభవరాశియైన కాశిం జేరి తత్తీరంబున నవంతీపుర నివాసియు సకలవిద్యావిలాసియు నైన సాందీపుం డను బుధవర్యునిఁ గని యధోచితంబుగ దర్శించి, శుద్ధభావవర్తనంబుల భక్తి సేయుచునుండ, వారలవలన సంతుష్టుండై.
10.1-1412-శా.
వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ
న్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్కవి
ద్యాదక్షత్వము రాజనీతియును శబ్దప్రక్రియం జెప్పె నా
భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్.

భావము:
రామకృష్ణులు గొప్ప వైభవములకు కాణాచి అయిన కాశీపట్టణం చేరారు. అక్కడ ఉన్న అవంతీపట్టణ నివాసి, సమస్త విద్యలకూ గని వంటి వాడూ అయిన సాందీపనీ అనే పండితోత్తముడిని సముచిత రీతిని సందర్శించారు. స్వచ్ఛమైన మనస్సుతో సత్ప్రవర్తనతో ప్రగాఢమైన భక్తితో ఆయనను సేవించారు. ఆచార్యులు ఆ శిష్యుల వినయ విధేయతలకు ఎంతో సంతోషించారు. బ్రాహ్మణోత్తముడైన సాందీపని సంతోషించిన మనసుతో రామకృష్ణులకు నాలుగు వేదములు మరియు శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను ఆరు వేదాంగములు, ధనుర్వేదము, తంత్రము, మనుశాస్త్రాది సకల ధర్మశాస్త్రాలు, చక్కటి న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము, రాజనీతి మొదలైనవాటిని తేటతెల్లంగా బోధించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1412

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, December 18, 2020

శ్రీ కృష్ణ విజయము - 102

( రామకృష్ణుల ఉపనయనము )

10.1-1407-క.
గర్గాది భూసురోత్తమ
వర్గముచే నుపనయనము వసుదేవుఁడు స
న్మార్గంబునఁ జేయించెను
నిర్గర్వచరిత్రులకును నిజ పుత్రులకున్.
10.1-1408-క.
ద్విజరాజ వంశవర్యులు
ద్విజరాజ ముఖాంబుజోపదిష్టవ్రతులై
ద్విజరాజత్వము నొందిరి
ద్విజరాజాదిక జనంబు దీవింపంగన్.

భావము:
వసుదేవుడు గర్వరహితమైన చరిత్ర కల తన పుత్రులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు. చంద్రవంశజులలో అగ్రగణ్యులై అలరారుతున్న బలరామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖకమలాల నుండి ఉపనయన మంత్రాల ఉపదేశములు పొందారు. విప్రులు, రాజులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైనవారూ దీవెనలీయగా ద్విజత్వం అందుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=169&padyam=1408

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 103

( రామకృష్ణుల ఉపనయనము )

10.1-1409-వ.
ఉపనయ నానంతరంబున వసుదేవుండు బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గో హిరణ్యాది దానంబు లొసంగి తొల్లి రామకృష్ణుల జన్మసమయంబు లందు నిజమనోదత్తలైన గోవుల నుచ్చరించి యిచ్చి కామితార్థంబుల నర్థులకుం బెట్టె; నిట్లు బ్రహ్మచారులై.
10.1-1410-శా.
ఉర్విన్ మానవు లెవ్వరైన గురువా క్యోద్యుక్తులై కాని త
త్పూ ర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్
సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియున్
గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్ రాముఁడున్.

భావము:
ఉపనయనము జరిగిన పిమ్మట, వసుదేవుడు విప్రులకు దక్షిణల సహితంగా ధేనువులు, బంగారము మొదలైన అనేక దానాలు చేసాడు. ఇంతకు మునుపు రామకృష్ణులు జననకాలంలో తాను మనస్సులో దానం చేసినట్లు చేసిన సంకల్పం ప్రకారం, ఇప్పుడు ప్రత్యక్షంగా గోవులను ఇచ్చాడు. కోరిన వారికి కోరినట్లు సమస్త వస్తువులూ సమర్పించాడు. ఈ విధంగా బలరామకృష్ణులు బ్రహ్మచర్యవ్రతం అవలంబించి. భూలోకంలో మానవులు ఎవరైనా సరే గురువు నుండి ఉపదేశం పొందితే తప్ప ఏ విద్య అనుష్ఠానం మొదలుపెట్ట రాదు సుమా, అని లోకానికి బోధించాలని బలరామకృష్ణులు భావించారు. సమస్తము నెరిగిన వారైనప్పటికినీ జగద్గురువులు అయినప్పటికీ; పరిపూర్ణులు అయినప్పటికీ; బలరామకృష్ణులు ఆచార్యుడి కోసం అన్వేషిస్తూ బయలుదేరారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=169&padyam=1410

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, December 16, 2020

శ్రీ కృష్ణ విజయము - 101

( నందుని వ్రేపల్లెకు పంపుట )

10.1-1405-ఉ.
ఇక్కడ నున్న బాంధవుల కెల్లను సౌఖ్యము చేసి వత్తు మే
మక్కడికిన్; మదీయులకు నందఱికిన్ వినుపింపు మయ్య యే
మెక్కడ నున్న మాకు మది నెన్నఁడు పాయవు మీ వ్రజంబులో
మక్కువతోడ మీరు కృప మా కొనరించు క్రియావిశేషముల్."
10.1-1406-వ.
అని పలికి వస్త్రభూషణాదు లొసంగి సాదరంబుగం గౌఁగిలించుకొని గోవిందుం డనిచిన నందుండు ప్రణయవిహ్వలుండై బాష్పజలపూరితలోచనుం డగుచు వల్లవులుం దానును వ్రేపల్లెకుం జనియె; నంత

భావము:
మేము ఇక్కడ మధురలో ఉన్న మన చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడకి వ్రేపల్లెకు వస్తాము. ఈ సంగతి మన వారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతోనూ, దయతోనూ మాకు చేసిన ఉపచారాలు, మేము ఎక్కడున్నా మా మనసుల నుండి ఎన్నటికినీ దూరము కావు.” ఈ విధంగా పలికిన శ్రీకృష్ణుడు వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటిని ఇచ్చి, ఆదరంతో కౌఁగిలించుకుని, సాగనంపాడు. నందుడి మనసు అనురాగాతిశయంతో చలించింది. కన్నీళ్ళతో నిండిన కన్నులు కలవాడై, గొల్లపెద్దలతో కలిసి వ్రేపల్లెకు బయలుదేరి వెళ్ళాడు. అనంతరం. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=168&padyam=1405

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 100

( నందుని వ్రేపల్లెకు పంపుట )

10.1-1403-వ.
అంత నొక్కనాడు సంకర్షణ సహితుండై నందునిం జీరి గోవిందుం డిట్లనియె.
10.1-1404-శా.
"తండ్రిం జూడము తల్లిఁ జూడము యశోదాదేవియున్ నీవు మా
తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం; దొల్లి యే
తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి? భవత్సౌజన్య భావంబులం
దండ్రీ! యింతటివార మైతిమిగదా! తత్తద్వయోలీలలన్.

భావము:
అటు తరువాత, ఒకరోజు కృష్ణుడు బలరాముడితో కలిసి నందుడిని పిలిపించి ఇలా అన్నాడు. “జనకా! మేము తండ్రిని చూడ లేదు. తల్లిని చూడ లేదు. యశోదాదేవీ, నీవూ మా తల్లితండ్రులని భావిస్తూ ఉన్నాము. ఇంతకు ముందు ఏ తల్లి తండ్రులు కూడ మీ అంత గారాబంగా తమ బిడ్డలను పెంచలేదు. మీ మంచితనం వలన ఆయా వయసులకు తగిన ఆటపాటలతో పెరిగి ఇంత వారము అయ్యాము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=168&padyam=1404

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, December 15, 2020

శ్రీ కృష్ణ విజయము - 99

( ఉగ్రసేనుని రాజుగజేయుట )

10.1-1401-వ.
తదనంతరంబ తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించు చున్న యదు, వృష్ణి, భోజ, మరు, దశార్హ, కకురాంధక ప్రముఖు లగు సకల జ్ఞాతి సంబంధులను రావించి చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారి వారి నివాసంబుల నుండ నియమించె; ని వ్విధంబున.
10.1-1402-క.
మధుసూదన సత్కరుణా
మధురాలోకన విముక్త మానస భయులై
మధురవచనములఁ దారును
మథురానగరంబు ప్రజలు మనిరి నరేంద్రా!

భావము:
అటుపిమ్మట, శ్రీకృష్ణుడు ఇంతకు ముందు కంసుడి భయం వలన ఇతర దేశాలలో బాధలు పడుతున్న తన జ్ఞాతులూ చుట్టాలూ అయిన యదువులు, వృష్ణులు, భోజులు, మరువులు, దశార్హులు, కుకురులు, అంధకులు మొదలైన వారిని అందరినీ పిలిపించాడు. వారి మనసులు తృప్తిచెందేలా వారికి ధనాదికాలు బహూకరించి, వారి వారి గృహాలలో నివసించం డని నియోగించాడు. ఈ విధంగా మధుసూదనుడు కృష్ణుడి యొక్క మిక్కిలి కరుణాపూరితమైన మధురాతిమధురమైన కటాక్షవీక్షణాలతో మనసులోని భీతి తొలగినవారై తీయ తీయని సల్లాపాలతో వారూ మథురాపురి పురప్రజలు కలసి మెలసి జీవించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=167&padyam=1402

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 98

( ఉగ్రసేనుని రాజుగజేయుట )

10.1-1398-చ.
"అనఘ! యయాతి శాపమున యాదవ వీరులకున్ నరేశ్వరా
సనమున నుండరాదు; నృపసత్తమ! రాజవు గమ్ము భూమికిన్;
నినుఁ గొలువంగ నిర్జరులు నీ కరిఁబెట్టుదు రన్య రాజులం
బనిగొను టెంత; రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్కతోన్."
10.1-1399-వ.
అని పలికి.
10.1-1400-క.
మన్నించి రాజుఁ జేసెను
వెన్నుఁడు సత్యావధాను విశ్రుతదానున్
సన్నుతమానున్ గదన
చ్ఛిన్నాహితసేను నుగ్రసేనున్ దీనున్.

భావము:
“ఓ పుణ్యాత్ముడా! ఉగ్రసేన రాజేంద్రా! యయాతి శాపం వలన ఎంతటి వీరులైనా యాదవులు రాజ్యపీఠం అధిష్టించడానికి వీలుకాదు. కాబట్టి, ఈ రాజ్యానికి నీవే రాజుగా ఉండు. మేము నిన్ను సేవిస్తూ ఉంటాము. దేవతలు సైతం నీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసావహిస్తా రని వేరుగా చెప్పనక్కర లేదు కదా. సంతోషంగా ప్రజలను పాలించడానికి సిద్ధంకా.” అలా పలికి సత్యనిష్ఠ కలవాడూ, దాతగా పేరుపొందిన వాడూ, అభిమానవంతు డని పొగడ్త కాంచినవాడూ, సమరంలో శత్రుసైన్యాలను సంహరించే వాడూ, గర్వం లేని వాడూ అయిన ఉగ్రసేనుడిని వాసుదేవుడు గౌరవించి మధురానగరానికి రాజుగా చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=167&padyam=1400

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, December 6, 2020

శ్రీ కృష్ణ విజయము - 97

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1394-క.
జననీజనకుల వృద్ధులఁ
దనయుల గురు విప్ర సాధు దారాదులనే
జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక
వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.
10.1-1395-వ.
అదియునుం గాక.
10.1-1396-శా.
కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా
వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపఁగా లేక ని
ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్
సారాతిక్షములార! మమ్ముఁ గొఱతల్ సైరించి రక్షింపరే."
10.1-1397-వ.
అని యిట్లు మాయామనుష్యుండైన హరి పలికిన పలుకులకు మోహితులై వారల నంకపీఠంబుల నిడుకొని కౌఁగిలించుకొని వారి వదనంబులు కన్నీటం దడుపుచుఁ బ్రేమపాశబద్ధులై, దేవకీవసుదేవు లూరకుండి; రంత వాసుదేవుండు మాతామహుండైన యుగ్రసేనుం జూచి.


భావము:
ఏ నరుడైతే తల్లితండ్రులను, వయోవృద్ధులనూ, భార్యాపిల్లలనూ, గురువులనూ, బ్రాహ్మణులనూ, సాధువులలు మొదలైనవారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక ఏడుస్తుంటాడో, అలాంటి వాడు ఈ భూమి మీద బ్రతికున్న శవం వంటి వాడే. అంతేకాక జననీజనకులారా! మీరు మిక్కిలి ఓర్పు కలవారు. మా కారణంగా మిమ్మల్ని కంసుడు చెరసాలలో బంధించి, బాధిస్తూ ఉంటే, వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలినవాళ్ళం; క్రూరులం; మిక్కిలి కుటిలమైన నడత కల వాళ్ళం. మా లోపాలు సహించి మమ్మల్ని మన్నించండి.” అంటూ ఇలా పలికిన మాయామానుషవిగ్రహుడైన శ్రీకృష్ణుడి మాటలకు దేవకీవసుదేవులు మోహము చెందారు. వారు తమ పుత్రులను ఒడిలోకి తీసుకున్నారు; గట్టిగా ఆలింగనం చేసుకున్నారు; కన్నీళ్ళతో వారి తలలు తడిపారు; ప్రేమాతిశయం వలన మాటలు పెగలక మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుడితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1396

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 96

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1392-సీ.
"మమ్ముఁ గంటిరిగాని మా బాల్య పౌగండ-
  కైశోర వయసులఁ గదిసి మీర
లెత్తుచు దించుచు నెలమి మన్నించుచు-
  నుండు సౌభాగ్యంబు నొంద రైతి;
రాకాంక్ష గలిగియున్నది దైవయోగంబు-
  తల్లిదండ్రుల యొద్ద తనయు లుండి
యే యవసరమున నెబ్బంగి లాలితు-
  లగుచు వర్ధిల్లుదు రట్టి మహిమ
10.1-1392.1-తే.
మాకు నిన్నాళ్ళు లే దయ్యె మఱియు వినుఁడు
నిఖిల పురుషార్థహేతువై నెగడుచున్న
మేని కెవ్వార లాఢ్యులు మీరకారె
యా ఋణముఁ దీర్ప నూఱేండ్లకైనఁ జనదు.
10.1-1393-క.
చెల్లుబడి గలిగి యెవ్వఁడు
తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్
చెల్లింపఁ డట్టి కష్టుఁడు
ప్రల్లదుఁ డామీఁద నాత్మపలలాశి యగున్.

భావము:
“అమ్మా! నాన్నా! మమ్మల్ని కన్నారు కానీ, మా బాల్య, పౌగండ, శైశవ ప్రాయాలలో ప్రేమగా ఎత్తుకుంటూ, దింపుతూ, లాలించి పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా దైవయోగము చేత అది తీరలేదు. తలితండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఎప్పుడూ బుజ్జగింప బడుతూ ఎలా ఎదుగుతారో, అలాంటి అదృష్టం మా కిన్నాళ్ళూ లేకపోయింది. ధర్మార్ధకామమోక్షము లనే పురుషార్థములు సాధించడానికి కారణమైన ఈ శరీరాలకు కర్త లెవరు? జననీజనకులైన మీరే కదా! ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి నూరేండ్లయినా సరిపోదు. ఎవడైతే సమర్థత కలిగి ఉన్నా కూడా తన శరీరంతో ధనంతో తన తల్లితండ్రులకు సేవచేయడో, అలాంటి వాడు కష్టుడు దుష్టుడు. వాడు చచ్చాక తన మాంసం తానే తింటాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1392

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, December 5, 2020

శ్రీ కృష్ణ విజయము - 95

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1390-వ.
అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుండైన హరి కంసాదులకుం బరలోకసంస్కారంబులు చేయం బనిచి దేవకీ వసుదేవుల సంకలియలు విడిపించి, బలభద్ర సహితుండై వారలకుం బ్రణామంబులు జేసిన.
10.1-1391-మ.
కని లోకేశులుగాని వీరు కొడుకుల్గారంచుఁ జిత్తంబులన్
జనయిత్రీ జనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా
జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి
ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై. 

భావము:
అలా ఏడుస్తున్న రాజు భార్యలను ఓదార్చి, లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి ఉత్తరక్రియలు చేయమని ఆదేశించాడు. పిమ్మట, దేవకీవసుదేవులను చెర విడిపించి, బలరాముడు తను కలిసి వారికి నమస్కారాలు చేయగా తల్లితండ్రులైన దేవకీవసుదేవులు తమ పుత్రులను చూసి “వీరు సకల లోకాలకు ప్రభువులు తప్ప సాధారణ మానవులు కారు” అని ఆలోచిస్తూ తమ మనసులలో సంశయ పడసాగారు. అప్పుడు, శ్రీకృష్ణుడు జనులను సమ్మోహింప జేసే మాయాశక్తిని ప్రయోగించి, వారి ఎరుకను మరుగు పరచి, అన్న బలభద్రుడుతో కూడి వచ్చి మిక్కిలి వినయంతో ఆనందాలు పంచుతూ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1391

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 94

( కంసుని భార్యలు విలపించుట )

10.1-1388-క.
భూతముల కెగ్గుచేసిన
భూతంబులు నీకు నెగ్గు పుట్టించె వృథా
భూత మగు మనికి యెల్లను
భూతద్రోహికిని శుభము పొంద దధీశా!
10.1-1389-క.
గోపాలకృష్ణుతోడను
భూపాలక! మున్ను తొడరి పొలిసినవారిన్
నీ పాల బుధులు చెప్పరె
కోపాలస్యములు విడిచి కొలువం దగదే."

భావము:
ప్రాణులకు నీవు కీడుచేయగా, ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసినవాడికి మేలు కలుగదు. బ్రతు కంతా వ్యర్థమవుతుంది. కంసమహారాజా! భూమండలాన్ని ఏలే వాడవు కదా. గోవుల పాలించే వాడైన శ్రీకృష్ణుడిని ఇంతకు ముందు ఎదిరించిన వారందరూ మరిణించిన విషయం బుద్ధిమంతులు ఎవరూ నీకు చెప్పలేదా? క్రోధము జడత్వమూ వదలిపెట్టి గోవిందుని సేవించవలసింది కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=165&padyam=1389

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, December 2, 2020

శ్రీ కృష్ణ విజయము - 93

( కంసుని భార్యలు విలపించుట )

10.1-1386-వ.
అంతం గంసాదుల కాంతలు భర్తృమరణదుఃఖాక్రాంతలై కరంబుల శిరంబులు మోదికొనుచు నశ్రుసలిలధారాపరిషిక్త వదనలై సదనంబులు వెలువడి వచ్చి వీరశయ్యా నిద్రితులైన విభులం గౌఁగిలించుకొని సుస్వరంబుల విలపించి; రందుఁ గంసు భార్య లిట్లనిరి.
10.1-1387-సీ.
"గోపాలసింహంబు గోపించి వెల్వడి-
  నిను గజేంద్రుని భంగి నేడు గూల్చె
యాదవేంద్రానిల మాభీలజవమున-
  నిను మహీజము మాడ్కి నేల వ్రాల్చె
వాసుదేవాంభోధి వారి యుద్వేలమై-
  నిను దీవి కైవడి నేడు ముంచె
దేవకీసుతవజ్రి దేవత లలరంగ-
  నినుఁ గొండ క్రియ నేడు నిహతుఁ జేసె
10.1-1387.1-తే.
హా! మనోనాథ! హా! వీర! హా! మహాత్మ!
హా! మహారాజ! నీ విట్లు హతుఁడవైన
మనుచు నున్నార మక్కట! మమ్ముఁ బోలు
కఠినహృదయలు జగతిపైఁ గలరె యెందు?

భావము:
అంతట కంసుడు మొదలగువారి భార్యలు భర్తల మృతికి శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటిధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుండి వచ్చారు. వీరశయ్యలందు దీర్ఘనిద్ర చెంది ఉన్న తమ పతులను పరిష్వంగం చేసుకుని, చక్కటి గద్గద కంఠధ్వనులతో ఏడ్చారు. వారిలో కంసుడి భార్యలు ఇలా అన్నారు. “ఓ ప్రాణనాయకా! కోపంతో వచ్చిన గోపాలుడనే సింహం గజేంద్రుడి వంటి నిన్ను హతమార్చింది కదా. హా శూరుడా! యదునాథుడనే గాలి దారుణమైన వేగంతో వీచి మహా వృక్షము లాంటి నిన్ను నేలపై కూలగొట్టింది కదా. ఓ మహానుభావా! వాసుదేవుడనే సముద్రజలం చెలియలకట్టను దాటి పొంగి వచ్చి దీవి వంటి నిన్ను ఇప్పుడు ముంచేసింది కదా. రాజేంద్రా! దేవకీపుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండవంటి నిన్ను సంహరించాడు కదా. అయ్యో! నీవిలా చనిపోయినప్పటికీ మేము ఇంకా బ్రతుకే ఉన్నాము. అక్కటా! మా అంత కఠిన హృదయం కలవారు భూమిమీద ఎక్కడైనా ఉన్నారా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=165&padyam=1387

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 92

( కంససోదరుల వధ )

10.1-1384-క.
చేతులఁ దాళము లొత్తుచుఁ
జేతోమోదంబుతోడ సిగముడి వీడం
బాతర లాడుచు మింటను
గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్.
10.1-1385-క.
వారిజభవ రుద్రాదులు
భూరికుసుమవృష్టిఁ గురిసి పొగడిరి కృష్ణున్
భేరులు మ్రోసెను నిర్జర
నారులు దివి నాడి రధిక నటనముల నృపా!

భావము:
నారదమహర్షి చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడిపోగా, ఆనందంతో ఆకాశంలో “కృష్ణా!” అంటూ పాడుతూ నర్తించాడు. పరీక్షన్నరేంద్రా! బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురిపిస్తూ శ్రీకృష్ణుడిని స్తుతించారు. దేవదుందుభులు మ్రోగాయి. దేవతాంగనలు ఆకాశంలో అనేక రకాల నాట్యాలు చేశారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1385

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Tuesday, December 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 91

( కంససోదరుల వధ )

10.1-1381-క.
గోపాలుఁ డొక్కఁ డద్దిర
భూపాలకుఁ జంపె వీనిఁ బొడువుం డేత
ద్రూపాలస్యము లేలని
తాపాలఘురోషు లగుచు దర్పోద్ధతులై.
10.1-1382-శా.
న్యగ్రోధుండును గహ్వుఁడున్ మొదలుగా నానాయుధానీక సా
మగ్రిం గంసుని సోదరుల్గవియుఁడున్ మాద్యద్గజేంద్రాభుఁడై
యుగ్రుండై పరిఘాయు ధోల్లసితుఁడై యొండొండఁ జెండాడి కా
లాగ్రక్షోణికిఁ బంచె రాముఁడు గరీయస్థేముఁడై వారలన్.
10.1-1383-వ.
అ య్యవసరంబున.

భావము:
“ఔరా! ఎంత ఆశ్చర్యం? ఒక గోవులు కాచుకునేవాడు ప్రభువుని చంపేసాడు. వీడిని పొడిచెయ్యండి. ఇంకా ఆలస్యం ఎందుకు?” అంటూ పరితాపంతో అగ్గలమైన కోపంతో పొగరు బోతులై న్యగ్రోధుడు, గహ్వుడూ మొదలైన కంసుడి సోదరులు అనేక రకాల ఆయుధ పరికరాలతో కృష్ణుడి మీద కలియబడ్డారు. అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తి అయి పరిఘ అనే ఆయుధం ధరించి మదించిన ఏనుగు లాగా ఒక్కొక్కరిని చెండాడి యముడి సన్నిధికి పంపాడు. అలా కంస సంహారం జరిగిన సమయంలో . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1382

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 90

( కంస వధ )

10.1-1378-శా.
మంచాగ్రంబుననుండి రంగధరణీమధ్యంబునం గూలి యే
సంచారంబును లేక చిక్కి జను లాశ్చర్యంబునుం బొందఁగా
బంచత్వంబును బొంది యున్న విమతుం బద్మాక్షుఁ డీడ్చెన్ వడిం
బంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్ బాహాబలోల్లాసియై.
10.1-1379-క.
రోషప్రమోద నిద్రా
భాషాశన పాన గతులఁ బాయక చక్రిన్
దోషగతిఁ జూచి యైన వి
శేషరుచిం గంసుఁ డతనిఁ జెందె నరేంద్రా!
10.1-1380-వ.
ఆ సమయంబున.

భావము:
మంచెమీది నుంచి మల్లక్రీడారంగ మధ్యలోకి వచ్చి పడిన కంసుడు ఎలాంటి కదలికలు లేక కట్టెలాగ బిగుసుకు పోయి అక్కడికక్కడే మరణించాడు. అక్కడి జనుల ఆ దుర్మతి సంహారాన్ని అబ్బురపడుతూ చూసారు. సింహం ఏనుగును ఎలా ఈడుస్తుందో అలా కలువ కన్నులున్న కృష్ణుడు భుజబలవిజృంభణంతో కంసుడిని ఈడ్చాడు. ఓ మహారాజా పరీక్షిత్తూ! కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, మాటలు మాట్లాడుతున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు, నీరు త్రాగుతున్నప్పుడు, చక్రాయుధు డైన శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనే అయినప్పటికీ వదలకుండా తలచి తలచి అతడు భగవంతుడిని పొంది ఉత్తమగతి అందుకున్నాడు. అలా కంసుని సంహరించిన సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1378

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Monday, November 30, 2020

శ్రీ కృష్ణ విజయము - 89

( కంస వధ )

10.1-1376-క.
తమగమున కెగురు యదు స
త్తమగణ్యునిఁ జూచి ఖడ్గధరుఁడై యెదిరెం
దమ గమివారలు వీరో
త్తమగణవిభుఁ డనఁగఁ గంసధరణీపతియున్.
10.1-1377-శా.
పక్షీంద్రుం డురగంబుఁ బట్టు విధ మొప్పన్ గేశబంధంబు లో
క క్షోభంబుగఁ బట్టి మౌళిమణు లాకల్పాంతవేళాపత
న్నక్షత్రంబుల భంగి రాల రణసంరంభంబు డిందించి రం
గక్షోణిం బడఁద్రొబ్బెఁ గృష్ణుఁడు వెసం గంసున్ నృపోత్తంసునిన్.

భావము:
తానున్న గద్దెమీదకి ఎగిరి దూకుతున్న యాదవ మహావీరుడు శ్రీకృష్ణుడిని చూసి మథురను ఏలే కంసుడు ఖడ్గాన్ని చేపట్టి ఎదిరించాడు అతని పక్షంలోని వారంతా కంసుడు గొప్పవీరుడైన ప్రభువు అని ప్రశంసించారు. పక్షులకు ప్రభువైన గరుత్మంతుడు పామును ఎలా పట్టుకుంటాడో, అలా శ్రీకృష్ణుడు కంసుడి జుట్టుముడి పట్టుకున్నాడు. సభలోని జనులంతా భయభ్రాంతులు అయ్యారు. ప్రళయకాలంలో నక్షత్రాల మాదిరి అతని కిరీటంలోని మణులు జలజల నేలరాలిపోయాయి. కంస మహారాజు యుద్ధ సన్నాహం అణగించి, యదువల్లభుడు మల్లరంగస్థలంమీదకి పడద్రోసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1377

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 88

( చాణూర ముష్టికుల వధ )

10.1-1373-ఉ.
"వల్లవబాలురన్ నగరి వాకిటికిన్ వెడలంగఁ ద్రొబ్బుఁ; డీ
గొల్లల ముట్టికోల్ గొనుఁడు; క్రూరుని నందునిఁ గట్టు; డుర్వికిం
దెల్లముగాఁగ నేడు వసుదేవునిఁ జంపుఁడు; తండ్రి గాఁడు వీఁ
డెల్లవిధంబులం; బరుల కిష్టుఁడు కావకుఁ డుగ్రసేనునిన్."
10.1-1374-వ.
అని పలుకు సమయంబున.
10.1-1375-శా.
జంఘాలత్వముతో నగోపరి చరత్సారంగ హింసేచ్ఛను
ల్లంఘింపన్ గమకించు సింహము క్రియన్ లక్షించి పౌరప్రజా
సంఘాతంబులు తల్లడిల్ల హరి కంసప్రాణహింసార్థి యై
లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్.

భావము:

భావము:
“ఈ గొల్లపిల్లలను నగరద్వారం బైటకి పడిపోయేలా నెట్టేయండి. ఈ యాదవులను ముట్టడించండి. క్రూరుడైన నందుణ్ణి బంధించండి. లోకానికి వెల్లడి అయ్యేలా, ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి. ఈ ఉగ్రసేనుడు నాకు తండ్రి కాడు. అన్నివిధాలా శత్రువుకు ఇష్టమైనవాడు. వాడిని కాపాడకండి.” ఇలా కంసుడు యాదవులను ముట్టడించమని అంటుండగా.కొండశిఖరాన తిరిగే జింకను చంపడానికి, పిక్కబలంతో కుప్పించి దూకే సింహకిశోరం లాగున, శ్రీకృష్ణుడు కంసుని సంహరించాలని తలచినవాడై గురి చూసి మంచె మీదికి యుద్ధోత్సాహంతో దూకాడు. కొలువులో ఉన్న ప్రజలు అందరూ తల్లడిల్లారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1373

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, November 29, 2020

శ్రీ కృష్ణ విజయము - 87

( చాణూర ముష్టికుల వధ )

10.1-1370-క.
"వల్లవబాలకు లని మన
మల్లవరులు పెనఁగి నేడు మడిసిరి వీరల్
బల్లిదులు; తలఁడు తలఁ" డని
చెల్లాచెదరైరి పాఱి చిక్కిన మల్లుల్.
10.1-1371-ఉ.
మల్లురఁ జంపి గోపక సమాజములో మృగరాజు రేఖ శో
భిల్లఁగఁ బాదపద్మములఁ బెల్లుగ నందెలు మ్రోయ వచ్చు నా
వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదు ల
ల్లల్లన సంస్తుతించిరి ప్రియంబుగఁ గంసుఁడు దక్క నందఱున్.
10.1-1372-వ.
అంత సభాజనంబుల కలకలంబు నివారించి మంత్రులం జూచి కంసుం డిట్లనియె.

భావము:
కేవలం గోపాలబాలకులు అనుకుని వారితో యుద్ధం చేసి మన మల్లశ్రేష్ఠులు మరణించారు. ఈ రామకృష్ణులు చాలా బలవంతులు. “దూరంగా పొండి” అంటూ తక్కిన మల్లురు అందరూ చెల్లాచెదరై పారిపోయారు. గొల్లలరాజైన నందుడి నందనులు మల్లులను చంపి గొల్లలమధ్య సింహాలలా ప్రకాశిస్తూ, అందెలు మ్రోగుతున్న అడుగుదామరలతో అడుగులు వేస్తూ వస్తుంటే, ఒక్క కంసుడు తప్పించి బ్రాహ్మణులు మొదలైన వారు అందరూ రెప్పవాల్చక చూసి ప్రీతితో పొగడారు. అప్పుడు సభాసదుల కోలాహలాన్ని నివారించి కంసుడు తన మంత్రులను చూసి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1371

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 86

( చాణూర ముష్టికుల వధ )

10.1-1366-ఆ.
త్రిప్పి నేలవైవ దిగ్గన రక్తంబు
వదనగహ్వరమున వఱదవాఱ
ముష్టికుండు ఘోరముష్టి సత్వము చెడి
గూలె గాలిఁ దరువు గూలునట్లు.
10.1-1367-వ.
మఱియును.
10.1-1368-క.
పాటవమునఁ బలుపిడికిట
సూటిం బడఁబొడిచె బలుఁడు శోభిత ఘన బా
హాటోప నృపకిరీటుం
గూటున్ వాచాటు నధిక ఘోర లలాటున్.
10.1-1369-వ.
అంత న ద్దనుజాంతకుండు చరణప్రహరణంబుల భిన్నమస్తకులం జేసి వాని చెలుల నంతకాంతికంబున కనిచిన.

భావము:
బలరాముడు అలా గిరగిరా త్రిప్పి నేలమీదకి దబ్బున పడవేయడంతో ముష్టికుడి గుహలాంటి నోటినుంచి రక్తం వరదలై పారింది. బలరాముడి ఘోరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువ కోల్పోయి, పెనుగాలికి మహా వృక్షం కూలునట్లు, కూలిపోయాడు. ఇంకా గొప్ప భుజబలాటోపంతో రాజునకు ముఖ్యమైన వాడూ, పరమ వదరుబోతూ, మిక్కిలి భయంకరమైన నుదురు కలవాడూ అయిన కూటుడు అనే మల్లుడిని బలభద్రుడు దిటవైన తన పిడికిలితో సూటిగా పడబొడిచాడు. అటుపిమ్మట, రాక్షసుల పాలిటి యముడైన బలరాముడు, వాడి మిత్రులైన తోసలుడు శలుడు అనే వారిని తన కాలితాపులతో తలలు పగలకొట్టి, యముడి దగ్గరకు పంపేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1368

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, November 28, 2020

శ్రీ కృష్ణ విజయము - 85

( చాణూర ముష్టికుల వధ )

10.1-1363-క.
శౌరి నెఱిఁజొచ్చి కరములఁ
గ్రూరగతిం బట్టి త్రిప్పి కుంభిని వైచెన్
శూరుం గలహ గభీరున్
వీరుం జాణూరు ఘోరు వితతాకారున్.
10.1-1364-క.
శోణితము నోర నొలుకఁగఁ
జాణూరుం డట్లు కృష్ణ సంభ్రామణ సం
క్షీణుండై క్షోణిం బడి
ప్రాణంబులు విడిచెఁ గంసు ప్రాణము గలఁగన్.
10.1-1365-క.
బలభద్రుండును లోకులు
బలభద్రుం డనఁగఁ బెనఁగి పటుబాహుగతిన్
బలభేది మెచ్చఁ ద్రిప్పెను
బలవన్ముష్టికునిఁ గంసు బలములు బెగడన్.

భావము:
పరాక్రమవంతుడూ, యుద్ధమందు గంభీరుడూ, భీతిగొలిపేవాడూ, దొడ్డ దేహం కలవాడూ, వీరుడూ అయిన చాణూరుడిని కృష్ణుడు చొరవగా చొచ్చుకుపోయి కర్కశంగా వాడి చేతులు పట్టుకుని గిరగిర త్రిప్పి నేలపై పడదోసాడు. అలా కృష్ణుడిచేత గిరగిర త్రిప్పబడిన చాణూరుడు బలమంతా క్షీణించినవాడై నోటిలోనుండి రక్తం కారుతుండగా నేలమీద పడి ప్రాణాలు విడిచాడు. అతడి ప్రాణం పోడంతో కంసుడి ప్రాణం కలతబారింది. “బలభద్రుడు నిజంగా బలంలో భద్రుడే” అంటూ లోకులు అంటూండగా; బలాసురుని సంహరించిన ఇంద్రుడు “మేలు మే” లని మెచ్చుకోగా; బలరాముడు అపారమైన బాహుబలంతో బలవంతుడైన ముష్టికుడిని పట్టుకుని గిరగిరా త్రిప్పాడు. అది చూసిన కంసుడి సేన బెదిరిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1365

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 84

( చాణూర ముష్టికుల వధ )

10.1-1361-క.
ధృతిచెడి లోఁబడె మల్లుం
డతులిత భవజలధితరికి హతరిపు పురికిన్
జితకరికిన్ ధృతగిరికిం
దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్.
10.1-1362-క.
హరికిని లోఁబడి బెగడక
హరి యురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్
హరి కుసుమమాలికాహత
కరి భంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై.

భావము:
సాటిలేని సంసారసాగరాన్ని దాటడానికి నావ వంటివాడూ; శత్రుపురాలను ధ్వంస మొనర్చినవాడూ; కువలయాపీడ గజాన్నిఓడించినవాడూ; గోవర్ధనగిరిని ఎత్తినవాడూ; గొప్ప సింహగర్జనతో పర్వత గుహలను పూరించినవాడూ అయిన శ్రీకృష్ణునికి చాణూరుడు ధైర్యంచెడి లోబడిపోయాడు. విరోధి చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ, భయపడక అతడి రొమ్ముపై మహా భయంకరమైన పిడికిలిపోటు పొడిచాడు. పూదండచే కొడితే ఏనుగు లెక్కచెయ్యని విధంగా, వాడి పోటును లెక్కచేయక శ్రీహరి విజృంభించి ఆ పోరులో పరాక్రమం చూపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1362

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, November 25, 2020

శ్రీ కృష్ణ విజయము - 83

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1357-క.
గోపాలకృష్ణుతోడను
గోపాలన వేళలందుఁ గూడి తిరుగు నా
గోపాలు రెంత ధన్యులొ
గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే?
10.1-1358-క.
శ్రమజలకణసిక్తంబై
కమలదళేక్షణుని వదనకమలము మెఱసెన్
హిమజలకణసిక్తంబై
కమనీయం బగుచు నున్న కమలము భంగిన్.
10.1-1359-ఆ.
సభకుఁ బోవఁ జనదు; సభవారి దోషంబు
నెఱిఁగి యూరకున్ననెఱుఁగకున్న
నెఱిఁగి యుండియైన నిట్టట్టు పలికినఁ
బ్రాజ్ఞుఁ డైనఁ బొందుఁ బాపచయము."
10.1-1360-వ.
అని పెక్కండ్రు పెక్కువిధంబులం బలుకుచుండఁ దద్బాహు యుద్ధంబున.

భావము:
గోవులను మేపే సమయంలో గోపాలకృష్ణుడితో కలసిమెలసి తిరిగే ఆ గోపాలకు లెంత పుణ్యాత్ములో ఎంతటి ప్రభువులకైనా ఇంతటి గొప్ప అనుభవం దక్కదు కదా. మంచునీటి చుక్కలతో తడిసి మనోహరంగా ఉండే పద్మం వలె కలువరేకుల వంటి కన్నులు కల కృష్ణుని ముఖకమలం చెమటబిందువులతో తడిసి ప్రకాశిస్తున్నది. సభకు వెళ్ళరాదు. వెళితే సభలోనివారు చేసే దోషాలు తెలిసి ఉపేక్షించరాదు, ఆ దోషాలు తెలుసుకోలేకపోయినా, దోషాలు తెలిసి కూడా న్యాయవిరుద్ధంగా పలుకరాదు. లేకపోతే, ఎంతటి పండితుడి కైనా ఆ పాపం పట్టుకు తీరుతుంది.” ఇలా ఎందరో పురస్త్రీలు రకరకాలుగా పలుకుతుండగా ఆ ముష్టి యుద్ధంలో. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1359

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 82

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1355-సీ.
వేణునాళములమై వెలసిన మాధవుం-
  డధరామృతము లిచ్చి యాదరించుఁ
బింఛదామములమై పెరిగిన వెన్నుండు-
  మస్తకంబునఁ దాల్చి మైత్రి నెఱపుఁ
బీతాంబరములమై బెరిసిన గోవిందుఁ-
  డంసభాగమునఁ బాయక ధరించు
వైజయంతికలమై వ్రాలినఁ గమలాక్షుఁ;-
  డతి కుతూహలమున నఱుతఁ దాల్చుఁ
10.1-1355.1-తే.
దనరు బృందావనంబునఁ దరులమైనఁ
గృష్ణుఁ డానందమునఁ జేరి క్రీడ సల్పు
నెట్టి నోముల నైన ము న్నిట్టి విధము
లేల కామైతిమో యమ్మ! యింక నెట్లు?
10.1-1356-ఉ.
పాపపు బ్రహ్మ; గోపకుల పల్లెలలోన సృజింపరాదె; ము
న్నీ పురిలోపలన్ మనల నేల సృజించె? నటైన నిచ్చలుం
జేపడుఁ గాదె; యీ సుభగుఁ జెందెడి భాగ్యము సంతతంబు నీ
గోపకుమారుఁ బొంద మును గోపకుమారిక లేమి నోఁచిరో?

భావము:
మనము వేణువలమై ఉండి ఉంటే వేణుమాధవుడు కెమ్మోవిసుధలు ఇచ్చి మన్నించేవాడు; నెమలిఈకల దండలమై ఉండి ఉంటే నల్లనయ్య నెత్తిపై పెట్టుకుని నెయ్యం నెరపేవాడు; పచ్చని పట్టుబట్టలమై ఉండి ఉంటే ఈ వల్లవుడు భుజాలపై విడువక ధరించి ఉండే వాడు. వనమాలికలమై ఉండి ఉంటే వనమాలి కృష్ణుడు మిక్కిలి ఆసక్తితో కంఠాన కైసేసి ఉండేవాడు. అందమైన బృందావనంలో వృక్షాలమై ఉండి ఉంటే కృష్ణుడు ఆనందముతో దరిచేరి క్రీడించేవాడు. ఓ యమ్మా! పూర్వజన్మలలో ఎంతటి కష్టమైన వ్రతాలనైనా ఆచరించి ఈలా కాలేకపోయాము కదా. హు!. . ఇపుడు ఇంకేమి చేయగలం. ఈ పాపిష్టి బ్రహ్మదేవుడు మునుపే మనలను ఆ వ్రేపల్లెలో పుట్టించి ఉండకూడదా. ఈ మధురలో ఎందుకు పుట్టించాడో, ఆ గొల్లపల్లెలోనే పుట్టించి ఉంటే ఈ అందగాడిని పొందే సౌభాగ్యం, సంతోషం ఎల్లప్పుడూ మనకు సమకూడేవి కదా. ఈ గోపశేఖరుణ్ణి పొందడానికి ఆ గోపికలు పూర్వజన్మలలో ఎలాంటి నోములు నోచారో!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1355

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 81

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1352-వ.
ఆ సమయంబునం బౌరకాంతలు మూఁకలు గట్టి వెచ్చనూర్చుచు ముచ్చటలకుం జొచ్చి తమలో నిట్లనిరి.
10.1-1353-ఉ.
"మంచి కుమారులం గుసుమ మంజు శరీరులఁ దెచ్చి చెల్లరే
యంచిత వజ్రసారులు మహాద్రి కఠోరులు నైన మల్లురం
గ్రించులఁ బెట్టి రాజు పెనఁగించుచుఁ జూచుచు నున్నవాఁడు; మే
లించుకలేదు; మాను మనఁ డిట్టి దురాత్ముని మున్ను వింటిమే?
10.1-1354-క.
చూచెదరు గాని సభికులు
నీ చిన్నికుమారకులకు నీ మల్లురకు
న్నో చెల్ల! యీడు గాదని
సూచింపరు పతికిఁ దమకు శోకము గాదే?

భావము:
అలా బలరామకృష్ణులు మల్లులతో పోరాడుతున్న సమయంలో మధురలోని మగువలు గుంపులుగా చేరి, వేడి నిట్టూర్పులు విడుస్తూ తమలో తాము ఇలా ముచ్చటించుకున్నారు. “ఔరా! పువ్వులలా సుకుమారమైన శరీరాలు కల ఈ చక్కటి బాలురను రప్పించి, వజ్రాయుధ మంత సత్తా కలవారూ, పర్వతా లంత కఠోరులు అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో ఏమాత్రం మంచితనం లేదు. ఈ రాజు పోరు ఆపమని అనడయ్యె. ఇలాంటి దుర్మార్గులను మునుపు ఎన్నడైనా విన్నామా కన్నామా? సభాసదులైనా చూస్తున్నారే తప్ప; ఈ పసిపిల్లలకూ, ఈ మల్లయోధులకూ జోడు కుదరదని చెప్పరు. ఇది అధర్మం. ఇది వారికీ వారి రాజుకూ శోకం కలిగించదా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1354

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 80

( చాణూర ముష్టికులతో పోరు )

10.1-1349-క.
బలభద్రుఁడు ముష్టికుఁడును
బలములు మెఱయంగఁ జేసి బాహాబాహిం
బ్రళయాగ్నుల క్రియఁ బోరిరి
వెలయఁగ బహువిధములైన విన్నాణములన్.
10.1-1350-వ.
ఇవ్విధంబున.
10.1-1351-క.
వల్లవులు పెనఁగి రున్నత
గల్లులతో భిన్నదిగిభకరవల్లులతో
మల్లురతో రిపుమానస
భల్లులతో భీతగోపపల్లులతోడన్.

భావము:
అనేక రకాల బలవిన్యాసాలతో బలరాముడు, ముష్టికుడు తమ తమ బలాలు చూపుతూ ప్రళయకాలం లోని అగ్నుల చందాన చేతులతో ఒకరినొకరు త్రోసుకుంటూ పోరాటం సాగించారు. ఈ విధంగా నిక్కిన చెక్కిళ్ళు కలవారూ, దిగ్గజాల తొండాలను భేదించే తీవల వంటి చేతులు కలవారూ, శత్రువుల మనస్సులకు బల్లెముల వంటివారూ, గోపకుల సమూహానికి భయము కల్గించేవారూ అయిన మల్ల యోధులతో గోపాలబాలకులైన బలరామకృష్ణులు పోరాడారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=161&padyam=1351

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 17, 2020

శ్రీ కృష్ణ విజయము - 79

( చాణూర ముష్టికులతో పోరు )

10.1-1348-వ.
ఇట్లగ్గలంబగు నగ్గలిక డగ్గఱిన మల్లునింగని మెల్లన మొల్లంబగు బీరంబు వెల్లిగొన, వల్లవీవల్లభుం డుల్లసిల్లి బాహునాదంబున రోదోంతరాళంబు పూరించి మించి కవిసె; నట్లిద్దఱు నుద్దవిడి నున్నత విషమంబులగు ఠాణ లిడి, కరి కరియును, హరి హరియును గిరి గిరియునుం దాఁకు వీఁకం దలపడి యితరేతర హేతిహింసితంబులగు దవానలంబుల తెఱంగునఁ బరస్పర దీర్ఘనిర్ఘాత ఘట్టితంబులగు మహాభ్రంబుల విభ్రమంబున నన్యోన్య తుంగతరంగ తాడితంబు లగు కల్పాంతకాల సముద్రంబుల రౌద్రంబున నొండరుల ముష్టి ఘట్టనంబుల ఘట్టితశరీరులై దద్దరిలక డగ్గఱి గ్రద్దన నయ్యిద్దఱుం దిరుగు నెడ హరి చొచ్చి పేర్చి యార్చి జెట్టింబట్టి పడం దిగిచి పాదంబుల జాడించి సముల్లాసంబున నెసకంబునకు వచ్చిన మెచ్చి నొచ్చి య చ్చపలుండు మీఱి మోర సారించి తెరలక పొరలం ద్రొబ్బిన న బ్బలానుజుం డుబ్బి గొబ్బున మేను వర్ధిల్ల నర్దాంగకంబున నుండి జానువుల నొత్తుచు నురవడింగరవడంబున నున్ననా దుర్నయుండును “బాల! మేలు మే”లని లీలం గాలు చొరనిచ్చి త్రోచినం జూచి యేచి ఖేచరు లగ్గించి యుగ్గడింప న గ్గోపకుమారుండు పాటవంబున రాటవంబునకుంజని వెన్నెక్కి నిక్కిన న క్కంసభటుండు మదజలరేఖా బంధురం బగు గంధసింధురంబు చందంబునఁ పదంబునుఁ బదంబునం జాఁపి కరంబునుఁ గరంబున గ్రహించి సహించి వహించి నైపుణ్యంబున లోపలం దిరిగి యట్టిట్టు దట్టించిన దిట్టతనంబునం దిటవు దప్పక న ప్పద్మలోచనుండు కేడించి యేచి సమతలంబున వైచి ప్రచండం బగు వాని పిచండంబు వాగించి కాలఁధిక్కరించి డొక్కరంబు గొనిన న య్యభ్యాసి సభ్యులు సన్నుతింపం గ్రమ్మఱించి జడ్డనం గా లడ్డగించి రక్షించుకొనిన నా రక్షోవైరి వైరి కటిచేలంబు పట్టి యెత్తి యొత్తి నడుమ రాగెయిడి సందుబెట్టి నవ్విన, న వ్విరోధికాలు కాలిలో నిడి వేధించి నిరోధించిన, నిరోధంబుఁ బాసి తిరిగిన వసుదేవుపట్టి పట్టిసంబుఁ గొని దట్టించిన నుబ్బరిక చేసి చాణూరుండు హరికరంబుపట్టి హుమ్మని నెమ్మొగంబునం గాలిడి మీఁదైనం గేళీ బాలకుండు కాలుగాల నివారించి మీఁదై నెగడియుండనీయక దుర్వారబలంబున విదలించిలేచి గృహీత పరిపంథి చరణుండయి విపక్షుని వక్షంబు వజ్రివజ్ర సన్నిభంబగు పిడికిటం బొడిచిన వాఁడు వాఁడిచెడక విజృంభించి యంభోరాశి మథనంబునం దిరుగు శైలంబు పోలిక నేల జిఱజిఱం దిరిగి తన్నిన వెన్నుండు కుప్పించి యుప్పరం బెగసి మీఁద నుఱికిన నతండు కృష్ణపాద సంధి పరిక్షిప్తపాదుండై యెగసి లేచి సముద్ధతుం డయ్యె, న య్యెడ.

భావము:
ఇలా మితిమీరిన శౌర్యంతో సమీపించిన ఆ మల్లుడిని గోపాలప్రియుడు చూసాడు; క్రమంగా పరాక్రమాటోపం అతిశయిల్లగా అతడు ఉల్లాసంగా భుజాలు అప్పళించాడు; ఆ శబ్దం భూనభోంతరాళాలు నిండిపోయింది; అతడు చాణూరమల్లుని ఎదుర్కొన్నాడు; వారిద్దరూ మహా పరాక్రమంతో పెద్ద చిన్న మల్లయోధుల పట్లు పట్టారు. ఏనుగు ఏనుగుతో, సింహం సింహంతో, కొండ కొండతో ఢీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడ్డారు; రెండు కార్చిచ్చులు తమ తమ అగ్నిజ్వాలలతో ఒకదాని నొకటి పీడించుకున్నట్లుగా; రెండు మహా మేఘములు పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకొన్నట్లుగా; ప్రళయకాలంలో రెండు సముద్రాలు ఒకదానినొకటి సముత్తుంగతరంగాలతో కొట్టుకున్నట్లుగా; వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్ళతో గ్రుద్దుకున్నారు; తబ్బిబ్బు పడక ఇద్దరూ ఎదురు బెదురుగా చేరి వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు హరి విజృంభించాడు బొబ్బరిస్తూ చాణూర జెట్టిని పట్టిపడలాగాడు; కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం చూసి గోవిందుడు మెచ్చుకున్నాడు; చపలుడైన చాణూరుడు నొప్పెడుతున్నప్పటికీ మెడ నిక్కించి తొలగిపోక మురారిని దొర్లిపోయేలా త్రోసాడు; అంతట బలరాముని తమ్ముడైన కృష్ణుడు శరీరము ఉప్పొంగగా తటాలున అర్ధాంగకంలో ఉన్నవాడై మోకాళ్ళతో వానిని ఒత్తాడు; వేగంగా కరవడ మనే ఒక మల్లబంధం భంగిమలో ఉన్నాడు; అప్పుడు దుర్నీతీపరుడైన మల్లుడు “డింభకా! మేలు మే” లని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుడిని పడద్రోసాడు; అంతట వెన్నుడు చెలరేగి వ్రేల్పులు ప్రస్తుతించగా చాతుర్యంతో వెనుకకు వెళ్ళి చాణూరుడి వీపుమీదకి ఎక్కి నిక్కాడు; ఆ కంస భృత్యుడు అయిన చాణూరుడు మదజలధారల చారికలతో నిండుగా ఉన్న మదపుటేనుగులా మాధవుడి పాదాన్ని తన పాదంతో, చేతిని తన చేతితో పెనవేసి పట్టుకుని నేర్పుగా మల్లరంగం అంతా తిరుగుతూ అటూ ఇటూ కుదిలించి వేసాడు; కమలలోచనుడు దిట్టతనముతో దిటవు కోల్పోకుండా తొలగి, చెలరేగి, జెట్టిని మల్లరంగతలం మీద పడద్రోసి పెద్దదైన వాడి కడుపు మీద మోదాడు; తన కాలితో వాడి కాలిని మెలిపెట్టి డొక్కర మనే మల్లబంధ విశేషాన్ని చూపాడు. మంచి మల్లవిద్యాభ్యాసం పొంది ఉన్న చాణూరుడు సభలోనివారు తన్ను పొగుడుతుండగా కృష్ణుడిని వెనుకకు మరలించి, తటాలున తన కాలితో అడ్డగించి తనను తాను రక్షించుకున్నాడు; రాక్షసవిరోధి యగు కృష్ణుడు వాడి దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగెయిడి సందుపెట్టి నవ్వాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుడి కాలితో చేర్చి బాధించి నిరోధించాడు; వాసుదేవుడు విరోధి నిరోధాన్ని తప్పించుకుని, అడ్డకత్తి చేబూని అదలించాడు; చాణూరుడు చెలరేగి గెంతి శ్రీహరి బాహువు పట్టుకుని హుమ్మని హూంకరించి ముఖాన కాలుపెట్టి మీదుమిగిలాడు; లీలామానుషబాలుడైన శ్రీకృష్ణుడు చాణూరుని కాలిని తన కాలితో అడ్డగించి, వాడి విజృంభణము అణచి, అడ్డుకొనరాని బలిమితో విదిలించుకుని లేచాడు; శత్రువు పాదాన్ని త్రొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాడి వక్షంపైన పొడిచాడు; వాడు పోడిమిచెడక చెలరేగాడు; సాగరమథనవేళ సముద్రంలో తిరిగే మందరపర్వతం మాదిరి వాడు నేలమీద గిరగిర తిరుగుతూ, కృష్ణుణ్ణి తన్నాడు; వెన్నుడు కుప్పించి పైకెగిరి వాడిపైకి దూకాడు; కృష్ణుడి పాదాలు వాడి పాదాల సంధిబంధాలను తాకయి; వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. అదే సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=160&padyam=1348

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :




శ్రీ కృష్ణ విజయము - 78

( చాణూరునితో సంభాషణ )

10.1-1347-సీ.
రోషాగ్నిధూమప్రరోహంబు కైవడి-
  శిరమున సన్నపు శిఖ వెలుంగ
నాశామదేభేంద్ర హస్తసన్నిభములై-
  బాహుదండంబులు భయదములుగ
లయసమయాంతకోల్లసిత దంష్ట్రల భంగిఁ-
  జాఁగిన కోఱ మీసములు మెఱయ
నల్లని తెగఁగల నడకొండ చాడ్పున-
  నాభీల నీలదేహంబు వెలయఁ
10.1-1347.1-ఆ.
జరణహతుల ధరణి సంచలింపఁగ నభో
మండలంబు నిండ మల్ల చఱచి
శౌరి దెసకు నడచెఁ జాణూర మల్లుండు
పౌరలోకహృదయభల్లుఁ డగుచు.

భావము:
గగనమండలం నిండేలా భుజాలు చరిచిన చాణూర మల్లుడు, కోపమనే అగ్ని నుంచి ప్రసరించే సన్నని పొగ మాదిరిగా అతని తలపై పిలకజుట్టు ప్రకాశిస్తుండగా; దిగ్గజముల తొండాలకు సమానమైన పొడుగాటి చేతులు భీతిని కలిగిస్తుండగా; ప్రళయకాలం లోని యమధర్మరాజు పదునైన కోరల వలె పొడవైన కోరమీసాలు మెరుస్తుండగా; నల్లని నిడుపైన నడకొండలాగ భయంకరమైన నల్లని దేహం పెల్లుబుకుతుండగా; అడుగుల తాకిడికి నేల అదురి పోతుండగా; చూస్తున్న పట్టణ ప్రజల హృదయాలకు ఆ దృశ్యం బల్లెంలా తగులుతుండగా చాణూరమల్లుడు కృష్ణుడి వేపు నడిచాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1347

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, November 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 77

( చాణూరునితో సంభాషణ )

10.1-1345-సీ.
మహిమతో నుండగ మథురాపురము గాని-
  పొలుపార వైకుంఠపురము గాదు
గర్వంబుతో నుండఁ గంసుని సభ గాని-
  సంసార రహితుల సభయుఁ గాదు
ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని-
  నారదు వీణాస్వనంబు గాదు
చదురు లాడఁగ మల్లజన నిగ్రహము గాని-
  రమతోడి ప్రణయ విగ్రహము గాదు
10.1-1345.1-తే.
వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు
మొఱఁగిపో ముని మనముల మూల గాదు
సాఁగి నడువంగ భక్తుల జాడ గాదు
శౌరి! నా మ్రోల నీ వెందు జనియె దింక."
10.1-1346-వ.
అని పలికి.

భావము:
వైభవోపేతంగా ఉందామనుకుంటున్నావేమో ఇది విలసిల్లే వైకుంఠం కాదు మధురానగరం; దర్పంతో తిరగడానికి ఇది సన్నాసుల సభ కాదు కంసమహారాజు కొలువుకూటమి; చక్కగావిందాం అనుకోకు. ఇది నారదుడి వీణా నాదము కాదు నా భుజాస్ఫాలన శబ్దం; పరిహాసాలు ఆడటానికి ఇది లక్ష్మీదేవి తోటి ప్రణయకలహము కాదు మల్ల యోధులతో రణరంగం; యధేచ్ఛగా సంచరించడానికి ఇది వేదాంతుల వీధి కాదు; దాగి ఉండటానికి ఇది మునుల మనఃకుహరం కాదు; అతిశయించి వెళ్ళడానికి ఇది భక్తులసంగతి కాదు; గుర్తుంచుకో కృష్ణా! నా ముందు నుంచీ ఇక నీవెక్కడకీ వెళ్ళలేవు.” చాణూరుడు ఇలా కృష్ణుడితో పలికి. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1345

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 76

( చాణూరునితో సంభాషణ )

10.1-1343-సీ.
చలమున నను డాసి జలరాశిఁ జొరరాదు-
  నిగిడి గోత్రముదండ నిలువరాదు;
కేడించి కుంభిని క్రిందికిఁ బోరాదు-
  మనుజసింహుఁడ నని మలయరాదు;
చేరినఁ బడవైతుఁ జెయి చాపఁగారాదు-
  బెరసి నా ముందటఁ బెరుఁగరాదు;
భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి-
  శోధింతుఁ గానలఁ జొరఁగరాదు;
10.1-1343.1-ఆ.
ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు;
ధరఁ బ్రబుద్ధుఁడ నని దఱుమరాదు;
కలికితనము చూపి గర్వింపఁగారాదు;
తరముగాదు; కృష్ణ! తలఁగు తలఁగు.
10.1-1344-వ.
అదిగాక నీవు శ్రీహరి నంటేని.

భావము:
ఓ కృష్ణా! పౌరుషానికి పోయి నా దగ్గరకి వచ్చేక ఇక వేషాలేసి నాటకాలాడి తప్పించుకు పోడానికి అవకాశం ఉండదు జాగ్రత్త. తర్వాత (మత్స్యావతారంలో లా చేపలా వేషం కట్టి) సముద్రంలోకి పోడానికీ కుదరదు. (కూర్మావతారంలో మంథర పర్వతానికి కింద నిలబడి ఆధారంగా ఉన్నా నని తాబేలు వేషం కట్టి) కొండల దన్ను తీసుకోడానికీ అవ్వదు. (వరహావతారంలో భూమిని ధరించి దాని కిందున్నా కదా అని పంది వేషం కట్టి) తప్పించుకుపోయి భూమి కిందకి దూరడానికీ వీలవదు. (నరసింహావతారం ఎత్తిన వాడిని కదా అని) సింహంలాంటి మగాణ్ణి అన్ని విఱ్ఱవీగడానికీ కుదరదు. (వామనావతారంలో చెయ్యి చాచడం అలవాటే అనుకోకు) దగ్గరకు వస్తే పడదోసేస్తా. ఇక చెయ్యి చాచడానికి కూడ సందుదొరకదు. (త్రివిక్రమావతారం ఎత్తి పెరిగా కదా అని) నా ఎదురుగా పెచ్చుమీరడమూ అలవికాదు. (పరశురామావాతారంలో రాజులను చంపేసా అనుకోకు) నన్ను దాటి రాజుని హింసించడ మన్నది సాధ్యం కాదు. (రామావతారంలో అడవులకు పోయా కదా అని) అవసరమైతే అరణ్యంల్లో దాక్కుంటా అనుకోకు, గాలించి మరీ పట్టుకుంటా. (బలరామావతారం ఎత్తిన) ప్రబలమైన ఆకారం కలవాడను నేనే అని విఱ్ఱవీగడానికీ వీలుండదు. (బుద్ధావతారం ఎత్తిన వాడిని) పుడమిలో నేనే ప్రబుద్ధుణ్ణి అని బెదిరించి తరిమేద్దాం అనీ (కల్కి అవతారం ఎత్తుతా కదా అని) కపటంతో జయించేస్తా అని గర్వించటమూ వీలుకాదు సుమా. నాతో యుద్ధం చేయడం నీ తరంగాదులే, పో కృష్ణా! పారిపో. అలాకాదని, నీవు ఆదినారాయణుడను అంటావేమో; అలా అయితే విను. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1343

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, November 12, 2020

శ్రీ కృష్ణ విజయము - 75

( చాణూరునితో సంభాషణ )

10.1-1341-శా.
స్థాణున్ మెచ్చఁడు; బ్రహ్మఁ గైకొనఁడు; విష్వక్సేను నవ్వున్; జగ
త్ప్రాణున్ రమ్మనఁ డీడుగాఁ డని; మహా బాహాబలప్రౌఢి న
క్షీణుం; డాజికి నెల్లి నేఁ డనఁడు; వైచిత్రిన్ వినోదించు న
చ్చాణూరుం డొక గోపబాలు పనికిన్ శక్తుండు గాకుండునే?
10.1-1342-క.
ప్రల్లద మేటికి గోపక!
బల్లిదుఁడను; లోకమందుఁ బ్రఖ్యాతుఁడ; నా
చల్లడము క్రింద దూఱని
మల్లురు లే రెందు ధరణిమండలమందున్.

భావము:
ఈ చాణూరుడు ఈశ్వరుడినే మెచ్చుకోడు; బ్రహ్మదేవుడిని కూడ లెక్కచేయడు; విష్వక్సేనుడినైనా గేలిచేస్తాడు; తనకు సాటిరాడని వాయుదేవుడిని సైతం రణరంగానికి రమ్మని పిలవడు; అధికతరమైన భుజబలాతిరేకం తరగనివాడు; యుద్ధానికి రేపుమాపు అనని వాడు; చిత్రవిచిత్రంగా అలవోకగా కుస్తీలు పట్టేవాడు; ఇలాంటి జగజెట్టి అయిన చాణూరుడు ఒక గొల్ల కుఱ్ఱాడి పనిపట్టడానికి చాలడా? గోవులను మేపుకునే కుఱ్ఱాడా! ప్రగల్భాలెందుకు? నేను మహా బలవంతుడిని. లోకంలో బాగా ప్రసిద్ధి గాంచిన వాడిని. ఓడిపోయి నా లంగోటా క్రింద దూరని జట్టీలు ఈ భూమండలంలో ఎక్కడా లేరు సుమా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1342

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 74

( చాణూరునితో సంభాషణ )

10.1-1338-క.
నీ తోడుత నేఁ బెనఁగెదఁ
బ్రీతిన్ ముష్టికునితోడఁ బెనగెడి బలుఁ డు
గ్రాతత మల్లాహవమున
భూతలనాథునికి మెచ్చు పుట్టింతు సభన్."
10.1-1339-వ.
అనిన విని రోషించి చాణూరుం డిట్లనియె.
10.1-1340-శా.
"నాతోఁ బోరఁగ నెంతవాఁడ? విసిరో! నాపాటియే నీవు? వి
ఖ్యాతుండం; గులజుండ; సద్గుణుఁడ; సత్కర్మస్వభావుండ; నీ
కేతాదృగ్విభవంబు లెల్లఁ గలవే; యీ వీటఁ బోరాడుటల్
వ్రేతల్ చూడఁగఁ గుప్పిగంతు లిడుటే? వీక్షింపు గోపార్భకా!

భావము:
నీతో నేనూ, ముష్టికుడితో మా అన్న బలరాముడూ ఉత్సాహంగా కుస్తీపడతాము. భయంకర మల్లయుద్ధంతో భూలోకానికి ప్రభువైన కంసుడికి మెప్పు కలిగిస్తాము.” కృష్ణుడి మాటలు వినిన చాణూరుడు ఇలా అన్నాడు. “ఔరా! గొల్లకుఱ్ఱాడా! నాతో కుస్తీకి నీవెంతవాడివి? నీవు నాకు సమానుడవి అవుతావా? నేను ప్రసిద్ధుడిని; సత్కులంలో పుట్టినవాడిని; సత్కర్మలు ఆచరించే స్వభావం కలవాడిని; నీకు ఇలాంటి గొప్పతనముందా? ఈ రాచనగరిలో పోరాడటం అంటే గొల్లల ముందు కుప్పిగంతులు వేయటం కాదు. బాగా ఆలోచించుకో.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1340

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 10, 2020

శ్రీ కృష్ణ విజయము - 73

( చాణూరునితో సంభాషణ )

10.1-1335-క.
జనములు నేర్చిన విద్యలు
జననాథునికొఱకుఁ గాదె? జననాథుఁడు నీ
జనములు మెచ్చఁగ యుద్ధం
బున మనముం గొంత ప్రొద్దు పుత్తమె? కృష్ణా!"
10.1-1336-వ.
అనిన విని హరి యిట్లనియె.
10.1-1337-ఉ.
"సాములు లేవు; పిన్నలము; సత్వము గల్దనరాదు; మల్ల సం
గ్రామ విశారదుల్ గులిశ కర్కశదేహులు మీరు; మీకడన్
నేము చరించు టెట్లు? ధరణీశుని వేడ్కలు చేయువారముం
గాము; వినోదముల్ సలుపఁ గాదనవచ్చునె యొక్కమాటికిన్.

భావము:
ఓయీ కృష్ణా! జనులు విద్యలు నేర్చుకోవడం మహారాజు మెప్పు కోసమే కదా! ప్రభువూ, ఈ ప్రజలూ మెచ్చుకొనేలా మనం మల్లయుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామేం?” వాడు అలా అనగా వినిన కృష్ణుడు ఇలా అన్నాడు. “మాకు సాములు తెలియవు. మేము చిన్నవాళ్ళం. సత్తా ఉందని చెప్పలేము. మీరేమో కుస్తీపట్లలో నిష్ణాతులు. వజ్రాయుధం లాంటి కరుకైన శరీరాలు కలవారు. ఇలాంటి మీతో మేము ఎలా తలపడాలి. మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళము కాము కానీ, ఆడదామని ఆహ్వానిస్తే ఎప్పుడైనా కాదని అనరాదు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1337

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 72

( చాణూరునితో సంభాషణ )

10.1-1332-వ.
అని పలుకుచు సకలజనులును జూచుచుండ రామకృష్ణులకుఁ జాణూరుండు యిట్లనియె.
10.1-1333-మ.
"వనమార్గంబున గోపబాలకులతో వత్సంబులన్ మేపుచుం
బెనఁగన్ మిక్కిలి నేర్చినా రనుచు నీ పృథ్వీజనుల్ చెప్ప మా
మనుజేంద్రుం డిట మిమ్ముఁ జీరఁ బనిచెన్ మల్లాహవక్రీడకుం;
జనదే కొంత పరాక్రమింప మనకున్ సభ్యుల్ విలోకింపఁగన్.
10.1-1334-మ.
జవసత్వంబులు మేలె? సాము గలదే? సత్రాణమే మేను? భూ
ప్రవరుం బోసన మిమ్మనంగ వలెనే? పాళీ లభీష్టంబులే?
పవివో? కాక కృతాంతదండకమవో? ఫాలాక్షు నేత్రాగ్నివో?
నవనీతంబుల ముద్దగాదు; మెసఁగన్ నా ముష్టి గోపార్భకా!

భావము:
పౌరులు అందరూ రామకృష్ణులను చూస్తూ ఇలా అనుకుంటుండగా, చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు." అడవిదారు లమ్మట గొల్లకుఱ్ఱాళ్ళతో కలసి దూడలు మేపుతూ కుస్తీపోటీలలో చాలా నేర్పుగడించా రని ఈ రాజ్యంలో ప్రజలు చెప్పుకుంటూంటే వినిన మా మహారాజు మల్లయుద్ధ క్రీడకు మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాడు. ఇప్పుడు మనం మన మన పరాక్రమాలను సభాసదులు చూస్తూండగా కొంచెం ప్రదర్శించడం సముచితం. ఓ గొల్లపిల్లాడా! నీకు జవసత్త్వాలు బాగా ఉన్నయా? బాగా సాము నేర్చావా? శరీరం గట్టిదేరిందేనా? మహారాజు మిమ్మల్ని మెచ్చుకోవాలా? మల్ల గదాదండం అంటే ఇష్టమేనా? నా పిడికిటిపోటంటే ఏమిటో తెలుసా? ఇది పిడుగు లాంటిది లేదా యముని కాలదండం వంటిది లేదా ముక్కంటి కంటిమంట అనుకో నా పిడికిలిగ్రుద్దు వెన్నముద్ద కాదు తినటానికి. అర్ధమయిందా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1334

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, November 9, 2020

శ్రీ కృష్ణ విజయము - 71

( మల్లావనీ ప్రవేశము )


10.1-1330-క.
వసుదేవు నివాసంబున
వసుధన్ రక్షింప వీరు వైష్ణవతేజో
ల్లసనమునఁ బుట్టినారఁట
పసిబిడ్డ లనంగఁ జనదు పరదేవతలన్.
10.1-1331-సీ.
చంపె రక్కసిఁ బట్టి; చక్రవాకునిఁగూల్చెఁ-
  బడ ద్రొబ్బె మద్దుల; బకునిఁ జీఱె;
నఘదైత్యుఁ బొరిగొనె; నడరి వత్సకుఁ ద్రుంచె-
  గిరి యెత్తి దేవేంద్రుఁ గ్రిందుపఱిచెఁ;
గాళియు మర్దించె; గహనానలముఁ ద్రావెఁ-
  గేశి నంతకుపురి క్రేవ కనిచె;
మయుపుత్రుఁ బరిమర్చె; మఱియు దానవ భటు-
  ల హరించి గోపకులంబుఁగాచె;
10.1-1331.1-తే.
గోపకాంతల మనముల కోర్కిదీర్చె;
నీ సరోరుహలోచనుండీ శుభాంగుఁ
డీ మహామహుఁడీ దిగ్గజేంద్ర మడఁచె;
మనుజమాత్రుఁడె తలపోయ మాధవుండు."

భావము:
“వీరు విష్ణుదేవుడి తేజోవిలాసంతో భూలోకాన్ని కాపాడుట కోసం, వసుదేవుడి ఇంట్లో పుట్టారట. పరబ్రహ్మ స్వరూపు లయిన వీరిని పసిపాపలు అనడం తగదు” అనుకున్నారు. నళినముల వంటి నయనములు కల వాడూ, మంగళకర మైన అంగసౌష్టవము కలవాడూ, గొప్ప తేజస్సు కలవాడూ. లక్ష్మిదేవికి పతి అయినవాడూ అయిన ఈ శ్రీకష్ణుడు తరచి చూస్తే సామాన్య మానవుడు కాదు. పూతన రక్కసిని పట్టి చంపాడు; సుడిగాలి రూపుడు తృణావర్తుడిని హతమార్చాడు. మద్ది చెట్లను పడగొట్టాడు; బకాసురుడిని సంహరించాడు; అఘుడనే అసురుణ్ణి అంతం చేసాడు; విజృంభించి వత్సాసురుణ్ణి వధించాడు; గోవర్ధనగిరిని ఎత్తి దేవేంద్రుడి గర్వం అణచాడు; నాగరాజు కాళీయుడిని మర్థించాడు; కార్చిచ్చు త్రాగాడు; కేశి అనే దానవుడిని యమపురికి పంపాడు; మయుని కొడుకు వ్యోమాసురుడిని సంహరించాడు; ఇంకా ఎందరో రాక్షస వీరులను నిర్మూలించి, గోపకులను కాపాడాడు; వ్రేతల మనసులలోని కోరికలను తీర్చాడు; దిగ్గజం లాంటి కువలయాపీడ కరీంద్రమును కడతేర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1331

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 70

( మల్లావనీ ప్రవేశము )

10.1-1327-క.
చచ్చిన కుంభీంద్రంబును
వచ్చిన బలమాధవులను వరుసం గని తా
నొచ్చిన చిత్తముతోడుతఁ
జెచ్చెరఁ గడు వెఱచె భోజసింహుం డధిపా.
10.1-1328-ఉ.
ధీరుల వస్త్ర మాల్య మణి దీప్త విభూషణధారులన్ నటా
కారుల సర్వలోక శుభకారుల మానవ మానినీ మనో
హారుల రంగభూతల విహారుల గోపకుమారులన్ మహా
వీరులఁ జూచి చూచి తనివిం దుదిముట్టక లోకు లందఱున్.
10.1-1329-ఉ.
సన్నుత రామకృష్ణముఖ చంద్రమయూఖ సుధారసంబులం
గన్నులఁ ద్రావు చందమునఁ గాంచుచు జిహ్వల నంటి చూచు లీ
ల న్నుతి చేయుచుం గరములం బరిరంభము చేయు భంగి న
త్యున్నతిఁ జూపుచుం దగిలి యొండొరుతోడ రహస్యభాషలన్.


భావము:
ఓ రాజా! చచ్చిన కరి కువలయాపీడమునూ, వచ్చిన రామకృష్ణులనూ చూసిన భోజకులాగ్రజుడైన కంసుడి మనసు బాగా నొచ్చుకుంది. అతను మనసులో ఎంతగానో భయపడ్డాడు. ధీరులూ, వస్త్రములూ పూలదండలూ రత్నాలతో ప్రకాశిస్తున్న నగలు ధరించినవారూ, నాట్యాలు చేసేవారి వలె ఉన్నవారూ, సకల జగాలకు క్షేమం కలిగించే వారూ, మగవారి మనసులు, మగువుల మనసులూ ఆకర్షించేవారూ, మహావీరులూ అయిన ఆ గోపకుమారులు మల్లరంగంలో విహరిస్తుంటే జనాలు అందరూ ఎంత చూసినా తనివితీరక మాటిమాటికీ చూడసాగారు. అందమైన రామకృష్ణుల ముఖచంద్రబింబాల నుండి ప్రసరించే అమృతరసాన్ని కన్నులతో త్రాగుతున్నారా అన్నట్లు చూస్తూ; నాలుకలతో చప్పరించి చవిచూస్తున్నారా అన్నట్లు స్తుతిస్తూ; చేతులతో కౌగిలించుకుంటున్నారా అన్నట్లు మున్ముందుకు వాలుతూ; అక్కడి ప్రజలు అందరూ ఒకరితో ఒకరు గుసగుసలుగా ఇలా మాట్లాడుకోసాగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1328

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, November 4, 2020

శ్రీ కృష్ణ విజయము - 69

( మల్లావనీ ప్రవేశము )

10.1-1325-సీ.
మహితరౌద్రంబున మల్లుర కశనియై-
  నరుల కద్భుతముగ నాథుఁ డగుచు
శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై-
  నిజమృత్యువై కంసునికి భయముగ
మూఢులు భీభత్సమునుఁ బొంద వికటుఁడై-
  తండ్రికి దయరాఁగఁ దనయు డగుచు
ఖలులకు విరసంబుగా దండియై గోప-
  కులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు
10.1-1325.1-ఆ.
బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై
శాంత మొనర యోగి జనుల కెల్లఁ
బరమతత్వ మగుచు భాసిల్లె బలునితో
మాధవుండు రంగమధ్య మందు.
10.1-1326-వ.
అప్పుడు.

భావము:
మల్లరంగం నడుమ బలరామ సహితుడైన కృష్ణుడు, రౌద్రరసంతో మల్లురకు పిడుగులా కనిపించాడు; అద్భుతరసంతో పురస్త్రీలకు పంచశరుడుగా భాసిల్లాడు; భయానకరసంతో కంసునికి వాడి పాలిటి మృత్యువుగా మూర్తీభవించాడు; బీభత్సరసంతో మూర్ఖులకు వికటుడుగా కనిపించాడు; కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డడుగా కరుణ కలిగించాడు; వీరరసంతో దుర్మార్గులకు విద్వేషం కలిగించాడు; హాస్యరసంతో గోపకులను కులదీపకుడుగా గోచరించాడు; ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగానూ, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపుడుగానూ ప్రకాశించాడు. అలా బలరామకృష్ణులు ఏనుగు దంతాలతో మల్లరంగం ప్రవేశించిన సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1325

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 68

( మల్లావనీ ప్రవేశము )

10.1-1322-ఉ.
కాలం ద్రొక్కి సలీలుఁడై నగవుతోఁ గంఠీరవేంద్రాకృతిం
గేలన్ భీషణ దంతముల్ పెఱికి సంక్షీణంబుగా మొత్తి గో
పాలగ్రామణి వీరమౌళిమణియై ప్రాణంబులం బాపె నా
శైలేంద్రాభముఁ బ్రాణలోభము నుఁదంచత్సారగంధేభమున్.
10.1-1323-వ.
మఱియు దంతిదంత తాడనంబుల దంతావళపాలకుల హరించి తత్ప్రదేశంబుఁ బాసి.
10.1-1324-మ.
కరిదంతంబులు మూఁపులందు మెఱయన్ ఘర్మాంబువుల్ మోములన్
నెరయన్ గోపకు లంతనంత మెలయన్ నిత్యాహవస్థేము లా
హరిరాముల్ చనుదెంచి కాంచిరి మహోగ్రాడంబరాపూరితామర మర్త్యాది జనాంతరంగము లసన్మల్లావనీరంగమున్.
                                  
భావము:
గోపాలశేఖరుడూ వీరశిరోరత్నమూ అయిన శ్రీకృష్ణుడు ఒక మహా సింహం మాదిరి, మహా పర్వతంతో సమానమైనదీ ప్రాణాలపై భయంకలదీ అయిన ఆ మత్త గజాన్ని, సవిలాసంగా నవ్వుతూ కాలితో త్రొక్కిపెట్టి, చేతితో భయంకరమైన దాని దంతాలు ఊడబెరికి, కృశించి నశించేలా బాది ప్రాణాలు తీసాడు.తరువాత ఆ ఏనుగు దంతాలతోనే దాని మావటిలను మట్టుపెట్టి, ఆ చోటు వదలి కదనరంగంలో మడమ త్రిప్పక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగుదంతాలు తమ భుజాల మీద మెరుస్తుండగా; స్వేదబిందువులు ముఖము నిండా కమ్ముకోగా; గోపాలకులు చుట్టూ చేరి వస్తుండగా; బయలుదేరి వచ్చి మల్లరంగాన్ని చూసారు. అది మహా భయంకర మైన ఆడంబరంతో దేవతల, మానవుల హృదయాలను కలవరపెడుతూ ఉంది.       

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1324

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, November 2, 2020

శ్రీ కృష్ణ విజయము - 67

( కువలయాపీడముతో బోరుట )

10.1-1321-వ.
మఱియు, న య్యనేకపం బనేకపపాలక ప్రేరితంబై, మహావాత సంఘాత సముద్ధూతంబగు విలయకాల కీలికేళిని బిట్టు మిట్టిపడి, మృత్యుదేవత యెత్తునం, గాలు పోలిక, శమను గమనిక నెదిరి మదసలిల పరిమళ లుబ్ధ పరిభ్రమదదభ్ర భ్రమర గాయక ఝంకృతు లహుంకృతి సొంపు సంపాదింపం, గులకుంభినీధర గుహాకుంభ గుంభనంబుగ ఘీంకరించి, రోషభీషణ శేషభోగిభోగ భయంకరంబగు కరంబున శౌరిం జీరి, చీరికిం గొనక, పట్టఁ నందుపట్టి యట్టిట్టు గెంటి, విధుంతుద వదన గహ్వరంబువలన విడివడి యుఱుకు తరణి కరణి దర్పించి, కుప్పించి, పాదమధ్యంబునకు నసాధ్యుండై దూఁటి, దాఁటి మాటుపడినం సింధురంబు గ్రోధబంధురంబై మహార్ణవమధ్య మంథాయమాన మంథరమహీధరంబు కైవడి జిఱజిఱం దిరిగి కానక భయానకంబై కాలి వెరవునం గని, పొంగి, చెంగటం బ్రళయదండిదండ ప్రశస్తంబగు హస్తంబు వంచి వంచించి చుట్టిపట్టి పడవేయం గమకించినం జలింపక తెంపున హరి కరి పిఱింది కుఱికి మహారాహు వాలవల్లి కాకర్షణోదీర్ణుం డగు సుపర్ణు తెఱంగున నెగిరి శుండాలంబు వాలంబు లీలం గేల నొడిసిపట్టి జళిపించి పంచవింశతి బాణాసన ప్రమాణ దూరంబున జిఱజిఱం ద్రిప్పి వైవ, న వ్వారణంబు దుర్నివారణంబై రణంబున కోహటింపక సవ్యాపసవ్య పరిభ్రమణంబుల నవక్రంబై కవిసిన నపసవ్యసవ్యక్రమణంబులఁ దప్పించి రొప్పి కుప్పించి యెదుర్కొనినఁ గర్కశుండై మేచకాచలతుంగ శృంగ నిభంబగు కుంభికుంభంబు చక్కటి వ్రక్కలై చెక్కులెగయ దురంత కల్పాంత జీమూత ప్రభూత నిర్ఘాత నిష్ఠురంబగు ముష్టి సారించి యూఁచి పొడిచినం దద్వికీర్ణపూర్ణ రక్తసిక్త మౌక్తికంబులు వసుంధరకు సంధ్యారాగ రక్త తారకాచ్ఛన్నం బగు మిన్ను చెన్నల వరింప నిలువరింపక మ్రొగ్గి మోఁకరిలి మ్రొగ్గక దిగ్గన న గ్గజంబు లేచి చూచి త్రోచి నడచి, సంహారసమయ సముద్ర సంఘాత సంభూత సముత్తుంగ భంగ సంఘటితం బగు కులాచలంబుక్రియఁ గ్రమ్మఱ న మ్మహాభుజుని భుజాదండంబువలన ఘట్టితంబై, కట్టలుక ముట్టి నెట్టి డీకొని ముమ్మరమ్ముగం గొమ్ములం జిమ్మిన న మ్మేటి చేసూటి మెఱసి హస్తాహస్తి సంగరంబునఁ గరంబొప్పి దప్పింబడ నొప్పించిన నకుంఠిత కాలకంఠ కఠోర భల్లభగ్నం బగు పురంబు పగిది జలధిం జటుల ఝంఝానిల వికలంబగు కలంబు కైవడి న మ్మదకలభంబు బలంబు దక్కి చిక్కి స్రుక్కిపడి, లోభికరంబునుంబోలె దానసలిలధారావిరహితంబై, విరహి తలంపునుం బోలె నిరంతర చిత్తజాతజనక నిగ్రహంబై, గ్రహణకాలంబును బోలెఁ బరాధీనఖరకరంబై, ఖరకరోదయంబునుం బోలె భిన్నపుష్కరంబై, పుష్కరవైరి విలసనంబునుం బోలె నభాసిత పద్మకంబై యున్న సమయంబున.

భావము:
అంతే కాకుండా ఇంకా చాలా మంది మావటులు చేరి ఆ ఏనుగు కువలయాపీడమును పురికొల్పారు. ఆ మదగజం త్రుళ్లిపడుతూ, పెనుగాలులకు పైకెగసిన ప్రళయకాలం లోని అగ్నిజ్వాలల వలె, మృత్యుదేవత మాదిరి, కాలపురుషుని కైవడి, యముని తీరున కృష్ణుడిని ఎదుర్కొంది; తన మదజల వాసన మీది ఆశతో చుట్టూ తిరుగుతున్న తుమ్మెదలనే గాయకుల ఝుంకారంతో ఆ గజం హూంకరించింది; అది కులపర్వతాల గుహల వంటి కుంభాలను తన ఘీంకారంతో పూరించింది; ఆగ్రహోదగ్రుడైన ఆదిశేషుని పడగ వలె భయంగొలిపే తన తొండంతో నిర్లక్ష్యంగా శౌరిని పట్టుకుంది. అప్పుడు అసాధ్యుడైన హరి అటు ఇటు గింజుకుని రాహువు నోట్లోంచి తప్పించుకుని వెలికురికే భాస్కరుడి వలె; చెంగున ఎగిరి దాని కాళ్ళ నడుమ దూరి దాగుకొన్నాడు. కృష్ణుడు కనిపించక పోయేసరికి కువలయాపీడానికి క్రోధం పెల్లుబికింది. మహాసాగర మధ్యంలో పరిభ్రమించే మందరగిరి లాగ, అది గిరగిర తిరుగాడింది; వాసన పసికట్టి కృష్ణుడున్న చోటు తెలుసుకుని ఉప్పొంగి పోయింది; ప్రళయకాలంలోని యమదండం లాంటి ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మాక్షుని వంచించి చుట్టిపట్టి పడవేద్దామని ప్రయత్నించింది; మాధవుడు చలింపక తెంపుతో దాని వెనుకవైపునకు ఉరికాడు. రాహువు తోకను పట్టిలాగే జగజెట్టి గరుడుని చందంగా శ్రీకృష్ణుడు ఒక్క ఎగురు ఎగిరి ఆ ఏనుగు తోకను చేతితో ఒడిసిపట్టుకొని, మించిన పరాక్రమంతో వందమూరల దూరానికి దానిని గిరగిర త్రిప్పి విసరికొట్టాడు. ఆ మత్తేభం అడ్డుకోలేని అవక్రపరాక్రమంతో, పోరాడటానికి వెనుదీయక కుడిఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదకి ఉరికింది. అప్పుడు కృష్ణుడు కుంజరం కుడిప్రక్కకు తిరిగినప్పుడు తాను ఎడమప్రక్కకు, ఆ ఏనుగు ఎడమ వైపుకు తిరిగినపుడు తాను కుడి వైపుకు తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు. అతడు కాఠిన్యం వహించి దాని పైకి చెంగలించాడు. ప్రళయకాల మేఘాల నుండి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించి ఈడ్చిపెట్టి దాని కుంభస్థలాన్ని గ్రుద్దాడు. ఎత్తయిన అంజనగిరి శిఖరం లాంటి దాని కుంభస్థలం పగిలి ముక్కచెక్కలై ఎగిరిపడింది. ఆ కుంభస్థలం నుంచి నెత్తుటితో తడిసి చెదరి నేలరాలిన ముత్యాలు సంజకెంజాయలో ఎఱ్ఱటి నక్షత్రాలతో కప్పబడిన ఆకాశం అందాన్ని ధరణికి సంతరించాయి. ఆ ఏనుగు అంతటితో ఆగక మ్రొగ్గి మోకరిల్లి సంబాళించుకుని వెంటనే లేచింది. అటు ఇటు చూసి, ముందుకు దూకింది. ప్రళయకాలంలో సముద్రాల సముత్తం తరంగాలచే కొట్టబడిన కులపర్వతం వలె అది మళ్ళీ భుజబలసమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది. మిక్కుటమైన క్రోధంతో కువలయాపీడం గోవిందుడిని ఒక్కుమ్మడిగా తన కొమ్ములతో చిమ్మింది. నందనందనుడు హస్తలాఘవం చూపి బాహబాహి యుద్ధంలో బాగా విజృంభించి దానిని తల్లడిల్ల చేసాడు. అప్పుడు ఆ మదగజం మొక్కవోని ముక్కంటి బల్లెముచే భగ్నమైన పురంలా; సముద్రంలో తీవ్రమైన ఝంఝూమారుతం వల్ల పాడైన ఓడలా శక్తి కోల్పోయింది; బక్కచిక్కి స్రుక్కిపోయింది; ఎన్నడూ దానాలు ధారపోయని పిసినారి చెయ్యి వలె, అది మదజలధారలు లేనిది అయింది; ఎడతెగని మదనుని పోరుగల వియోగి హృదయంలా ఎడతెగక మదిలో జనించిన విరోధం కలది అయింది; పరాధీనుడైన ప్రభాకరుడు కల గ్రహణవేళ వలె ఎండిన తొండము కలది అయింది; పూచిన తామరలు కల సూర్యోదయం లాగా చీలిన తొండపుకొన గలది అయింది; ప్రకాశింపని పద్మాలు కల చంద్రప్రకాశం వలె వెలవెల పోయింది. ఆ సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=156&padyam=1321

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, November 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 66

( కువలయాపీడముతో బోరుట ) 

10.1-1319-మ.
మించిన కొప్పుఁ జక్కనిడి మేలనఁ బచ్చనిచీర కాసె బం
ధించి లలాటకుంతలతతిన్ మరలించుచు సంగరక్రియా
చుంచుతఁ బేర్చి బాలకుఁడు చూచు జనంబులు దన్ను బాపురే!
యంచు నుతింప డగ్గఱియె హస్తజితాగము గంధనాగమున్.
10.1-1320-క.
అంజక బాలకుఁ డనియునుఁ
గొంజక దయమాలి రాజకుంజర! యంతన్
గుంజరమును డీకొలిపెనుఁ
గుంజరపాలకుఁడు గోపకుంజరుమీఁదన్.

భావము:
కన్నయ్య తన చిక్కటి జుట్టుముడిని గట్టిగా బిగించుకున్నాడు. మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకున్నాడు. నుదుట వ్రేలాడుతున్న ముంగురులను పైకి త్రోసుకుని పోరాటానికి అనువైన సిగచుట్టాడు. చూస్తున్న జనాలు బాలుడైన ఆ శ్రీకృష్ణుడిని “అయ్యబాబోయ్!” అంటూ మెచ్చి పొగడుతుండగా, తొండంతో కొండలను పిండిచేసే ఆ మదగజం దగ్గరకు వెళ్ళాడు. ఓ రాజశేఖరా! కృష్ణుడు హెచ్చరించినా వెఱవక, ఆ మావటివాడు బాలుడని సంకోచ, దయాదాక్షిణ్యాలు లేకుండా, ఏనుగును “డీకొట్ట” మని గోపాలశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడి మీదకు పురికొల్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=156&padyam=1320

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 65

( కరిపాలకునితో సంభాషణ )

10.1-1316-వ.
కని తత్కరిపాలకశ్రేష్ఠుండైన యంబష్ఠునికి మేఘనాదగంభీర భాషణంబుల రిపుభీషణుం డగు హరి యిట్లనియె.
10.1-1317-శా.
"ఓరీ! కుంజరపాల! మా దెసకు నీ యుద్యన్మదేభేంద్రముం
బ్రేరేఁపం బనిలేదు; త్రిప్పు మరలం బ్రేరేఁపినన్ నిన్ను గం
భీరోగ్రాశనితుల్య ముష్టిహతులన్ భేదించి నే డంతకుం
జేరంబుత్తు మహత్తరద్విపముతో సిద్ధంబు యుద్ధంబునన్."
10.1-1318-వ.
అని పలికి.

భావము:
అరివీర భయంకరుడైన శ్రీకృష్ణుడు ఆ మదించిన ఏనుగును చూసి, మేఘగర్జన వలె గంభీరమైన కంఠంతో దాని మావటివాళ్ళ నాయకుడితో ఇలా అన్నాడు. “ఓరీ మావటీ! మా వేపుకు ఈ మత్తగజాన్ని ఎందుకు ఉసిగొల్పుతావు. వెనుకకు మరలించు. వినకుండా డీకొట్టమని పోరుకు ఉసికొల్పావంటే, నీ మదపుటేనుగును, నిన్ను కలిపి గంభీరమైన దారుణమైన పిడుగుపాటుల వంటి నా పిడికిలిపోటులతో పొడిచి పొడిచి యముని పాలికి ఇపుడే పంపడం తథ్యం సుమా.” ఇలా ఆ మావటిని హెచ్చరించి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=155&padyam=1317

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, October 30, 2020

శ్రీ కృష్ణ విజయము - 64

(మల్లరంగ వర్ణన )

10.1-1314-వ.
అంత నా రామకృష్ణులు నలంకృతులై మల్లదుందుభి నినదంబు విని సందర్శన కుతూహలంబున.
10.1-1315-క.
ఓడక రంగద్వారము
జాడం జని వారు కనిరి సమద కువలయా
పీడంబున్ భిన్నపరా
క్రీడంబుం బ్రమదకంటకిత చూడంబున్.

భావము:
అప్పుడు బలరామకృష్ణులు జెట్టీల భేరీనినాదాలు విని అలంకరించుకున్నవారై మల్లరంగం చూడడానికి ఉబలాటంతో రామకృష్ణులు జంకూ గొంకూ లేకుండా రంగస్థలం ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్ళి మదించిన కువలయాపీడమనే పెద్ద ఏనుగును చూసారు. అది ఇతర గజాలను ఓడించడంలో మిక్కిలి నేర్పు కలది. ఆ గజరాజు పెచ్చు మీఱిన మదంతో గగుర్పొడుస్తున్న కుంభస్థలము కలది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=154&padyam=1315

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం :

Thursday, October 29, 2020

శ్రీ కృష్ణ విజయము - 63

( మల్లరంగ వర్ణన )

10.1-1312-మ.
సకలాంభోనిధి మేఖలావహనముం జాలించి యేతెంచు నా
గ కులాగంబుల భంగి నొప్పుచుఁ దగం గైసేసి చాణూర ము
ష్టికకూటుల్ చలకోసలుల్ గురువులన్ సేవించుచున్ రంగధా
త్రికి నేతెంచిరి తూర్యఘోషముల నుద్రేకం బనేకంబుగన్.
10-1313-క.
నందాదులైన గోపకు
లందఱు చని కానుకలు సమర్పించి నృపున్
సందర్శించి తదనుమతిఁ
జెంది మహామంచముల వసించిరి వరుసన్.

భావము:
సమస్త సముద్రాలు సరిహద్దులుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకుని నడచి వస్తున్న దిగ్గజాలలా, కులపర్వతాలలా ఒప్పుతూ, తగినట్లు అలంకరించుకుని చాణూరుడూ, ముష్టికుడూ, కూటుడూ, చలుడూ, కోసలుడూ తమ గురువులను కొలుస్తూ వాయిస్తున్న వాద్యాల శబ్దాలకు ఉద్రేకం చెలరేగుతుండగా రంగస్థలానికి వచ్చారు. నందుడు మొదలగు గోపాలురు అందరూ వెళ్ళి కంసరాజును దర్శించి, కానుకలు సమర్పించి, అతని అనుమతితో పెద్దపెద్ద ఆసనాల మీద వరుసలు కట్టి కూర్చున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=154&padyam=1313

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 62

( మల్లరంగ వర్ణన )

10.1-1310-సీ.
పాషాణ వల్మీక పంకాది రహితంబు;
మృదులకాంచననిభ మృణ్మయంబు
గమనీయ కస్తూరికా జలసిక్తంబు;
బద్ధచందనదారు పరివృతంబు
మహనీయ కుసుమదామధ్వజ తోరణ;
మండితోన్నత మంచ మధ్యమంబు
బ్రాహ్మణ క్షత్రాది పౌరకోలాహలం;
బశ్రాంత తూర్యత్రయాంచితంబు
10.1-1310.1-ఆ.
నిర్మలంబు సమము నిష్కంటకంబునై
పుణ్యపురుషు మనముఁ బోలి కంస
సైన్య తుంగ మగుచు సంతుష్ట లోకాంత
రంగమైన మల్లరంగ మొప్పె.
10.1-1311-క.
ఆ మల్లరంగ పరిసర
భూమిస్థిత మంచమందు భోజేంద్రుఁడు మా
న్యామాత్యసంయుతుండై
భూమీశులు గొలువ నుండెఁ బొక్కుచు నధిపా.

భావము:
మహారాజు కంసుడు మల్లయుద్ధానికి సిద్ధం చేయించిన క్రీడాప్రాంగణము రాళ్ళు పుట్టలు బురద మున్నగునవి లేకుండా మెత్తని బంగారువన్నెమట్టితో ఒప్పింది. దానికి కమ్మని కస్తూరి జలంతో కళ్ళాపి జల్లారు. చుట్టూ గంధం కఱ్ఱలతో కంచె అమర్చారు. పెద్ద పెద్ద పూల దండలతో, జండాలతో, తోరణాలతో అలంకరించారు. ఎత్తయిన ఆసనముల మధ్య ఆ రంగం నిర్మించారు. అది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు పురప్రజల కోలాహలంతో నిండి ఉంది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యాల ధ్వనులతో అతిశయించింది. అది పుణ్యపురుషుడి మానసంలా మాలిన్యం లేనిది. సమంగా కంటక రహితమై శోభిల్లేది. అది కంసుడి సైన్యంతో ఉన్నతమై ఒప్పారేది. జనుల మనసులను సంతోషం కలిగించేది. ఆ మల్లరంగానికి దగ్గరలో ఉన్న ఆసనం మీద భోజమహారాజు కంసుడు మాన్యులగు మంత్రులతో కూడి సామంతులు సేవిస్తుండగా భేదపడుతూ కూర్చుని ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=154&padyam=1311

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం :

Tuesday, October 27, 2020

శ్రీ కృష్ణ విజయము - 61

( కంసుడు దుశ్శకునముల్గనుట )

10.1-1304-వ.
మఱియు రక్త కుసుమమాలికాధరుండై యొక్కరుండును నెక్కడేనియుం జనుచున్నవాఁడ నని కలఁ గాంచి మరణహేతుక భీతిం జింతాక్రాంతుండై నిద్రఁజెందక వేగించుచున్న సమయంబున.
10.1-1305-క.
అరుణ హరినఖర విదళిత
గురుతిమిరేభేంద్రకుంభకూట వినిర్ము
క్త రుధిరమౌక్తికముల క్రియ
సురపతిదిశఁ గెంపుతోడఁ జుక్కలు మెఱసెన్.

భావము:
అంతేకాకుండా, ఎఱ్ఱని పూలదండలు ధరించి ఒంటరిగా ఎక్కడికో వెళుతున్నట్లు అతడు కలగన్నాడు, మరణ భయంతో దుఃఖక్రాంతుడై నిదురపోకుండా ఆ రాత్రి ఎలాగో తపిస్తూ జాగరము చేస్తూ ఉండగా అరుణుడు అనే సింహం గోళ్ళతో చీల్చిన చీకటి అనే గజేంద్రుడి కుంభస్థలం నుండి వెలువడిన నెత్తుటితో కలిసిన ముత్యాల వలె తూర్పుదిక్కున ఎఱ్ఱదనంతో నక్షత్రాలు మెరిశాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=152&padyam=1305

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 60

( కంసుడు దుశ్శకునముల్గనుట )

10.1-1302-సీ.
కర్ణరంధ్రములు చేఁ గప్పిన లోపలి-
  ప్రాణ ఘోషము వినఁబడక డిందెఁ
దోయాదికములందుఁ దొంగిచూచుచు నుండ-
  తల గానరాదయ్యెఁ దనువుమీఁదఁ
గరశాఖ నాసికాగ్రంబుపై నిడి చూడ-
  గ్రహతారకలు రెంటఁ గానబడియె
వెలుఁగున నిలుచుండి వీక్షింపఁగా మేని-
  నీడ సరంధ్రమై నేలఁ దోఁచె
10.1-1302.1-ఆ.
నడుగుజాడ దృష్టమౌట లే దయ్యెను
దరువులెల్ల హేమతరువు లగుచు
మెఱయుచుండెఁ గాలమృత్యువు డగ్గఱ
బుద్ధి యెల్లఁ గలఁగె భోజపతికి.
10.1-1303-క.
గరళముఁ దినుటయుఁ బ్రేతము
బరిరంభించుటయు నగ్నభావుఁ డవుటయున్
శిరమునఁ దైలము పడుటయు
ఖరపతి నెక్కుటయు నతఁడు కలలోఁ గనియెన్.

భావము:
భోజరాజు కంసుడికి చేతులతో చెవిరంధ్రాలను మూసుకుంటే తన లోపలి ప్రాణవాయువు శబ్దం వినపడకుండా పోయింది. నీటిలోకానీ అద్దములోకానీ తొంగిచూస్తే శరీరము మీద శిరస్సు కన్పించడం లేదు. వ్రేలు ముక్కుకొనను ఉంచి చూస్తే సూర్యుడు మొదలైన గ్రహాలు అశ్విని మున్నగు నక్షత్రాలు ఒక్కక్కటీ రెండు రెండుగా కనిపించసాగాయి. వెలుతురులో నిలబడి చూస్తే తన దేహం నీడలో ఖాళీలు కనబడసాగాయి. నేల మీద తన అడుగుల గుర్తులు కనబడటం లేదు. చెట్లన్నీ బంగారు వన్నెతో భాసించాయి. కాలమృత్యువు సమీపించి అతని బుద్ధి కలత చెందింది. కంసుడికి కలలో విషం తిన్నట్లు; చనిపోయిన వారిని కౌఁగిలించుకొన్నట్లు; దిగంబరంగా ఉన్నట్లు; తల మీద నూనె పడినట్లు; గాడిద మీద ఎక్కినట్లు అనిపించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=152&padyam=1302

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :