Thursday, April 29, 2021

శ్రీకృష్ణ విజయము - 212

( నరకాసుర వధకేగుట )

10.2-153-సీ.
"సమద పుష్పంధయ ఝంకారములు గావు-
  భీషణకుంభీంద్ర బృంహితములు
వాయునిర్గత పద్మవనరేణువులు గావు-
  తురగ రింఖాముఖోద్ధూతరజము
లాకీర్ణజలతరం గాసారములు గావు-
  శత్రుధనుర్ముక్త సాయకములు
గలహంస సారస కాసారములు గావు-
  దనుజేంద్రసైన్య కదంబకములు
10.2-153.1-తే.
కమల కహ్లార కుసుమ సంఘములు గావు;
చటుల రిపు శూల ఖడ్గాది సాధనములు
కన్య! నీ వేడ? రణరంగ గమన మేడ?
వత్తు వేగమ; నిలువుము; వలదు వలదు. "
10.2-154-వ.
అనినఁ బ్రియునకుం బ్రియంబు జనియింప డగ్గఱి.

భావము:
“అబలవైన నీ వెక్కడ? రణరంగ మెక్కడ? అక్కడ వినిపించేవి మదించిన తుమ్మెదల ఝంకారాలు కావు, భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు; అక్కడ కనిపించేవి తామరపూల నుండి గాలికి రేగి వచ్చిన పరాగరేణువులు కావు, గుఱ్ఱపుడెక్కల చివరల నుండి లేచిన ధూళిదుమారాలు; అవి నీటికెరటాల తుంపరలు కావు, శత్రువుల ధనుస్సుల నుండి వెడలిన శరపరంపరలు; రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షససైన్య సమూహాలు; కమలాలు కలువలు కనిపించవు, అక్కడ కనపడేవి భయంకరమైన శత్రుల శూలాలు ఖడ్గాలు ఆయుధాలు; ఇటువంటి యుద్ధరంగానికి నీ వెందుకు రావడం. నేను త్వరగా తిరిగి వచ్చేస్తాలే. నీవు రావద్దు వద్దు; వద్దు; రావద్దు.” అని అంటున్న ప్రాణప్రియుడి దగ్గరకి వచ్చి ప్రియురాలు ప్రియం కలిగేలా ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=153

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 211

( నరకాసుర వధకేగుట )

10.2-150-వ.
అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె "నరకాసురునిచేత నదితి కర్ణకుండలంబులును, వరుణచ్ఛత్త్రంబును, మణిపర్వత మనియెడు నమరాద్రి స్థానంబును గోలుపడుటయు; నింద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడవాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ యిట్లనియె.
10.2-151-శా.
"దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ
ప్రావీణ్యంబులు సూడఁ గోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి న
న్నీ వెంటం గొనిపొమ్ము నేఁడు కరుణన్; నేఁ జూచి యేతెంచి నీ
దేవీ సంహతికెల్లఁ జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌, "
10.2-152-వ.
అనినఁ బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “నరకాసురుడు అదితి యొక్క కర్ణకుండలాలనూ, వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు వచ్చి, శ్రీకృష్ణుడికి నరకుని అత్యాచారాలు విన్నవించాడు. శ్రీహరి నరకాసురుని సంహరించడానికి గరుడవాహనం ఎక్కి వెళ్ళబోతున్న సమయంలో సత్యభామ ఇలా అన్నది. “ప్రభూ! ప్రాణనాథ! నీవు విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే, నీ యుద్ధనైణ్యం చూడాలని కోరికగా ఉంది నామాట మన్నించి దయతో నన్ను నీ వెంట తీసుకువెళ్ళు. నేను అక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కనులారా చూసివచ్చి, ఇక్కడ రాణులు అందరికీ వివరంగా చెప్తాను." ఈ విధంగా తన ప్రాణసఖి సత్యభామ అడుగగా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=151

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, April 27, 2021

శ్రీకృష్ణ విజయము - 210

( భద్ర,లక్షణల పరిణయంబు )

10.2-148-వ.
ఇట్లు హరికి రుక్మిణియు, జాంబవతియు, సత్యభామయుఁ, గాళిందియు, మిత్రవిందయు, నాగ్నజితియు, భద్రయు, మద్ర రాజనందనయైన లక్షణయు ననంగ నెనమండ్రు భార్య లైరి; మఱియు నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్ర కన్యల రోహిణి మొదలైనవారిం బరిగ్రహించె” నన విని.
10.2-149-క.
"ధరకుం బ్రియనందనుఁ డగు
నరకుని హరి యేల చంపె? నరకాసురుఁ డా
వరకుంతల లగు చామీ
కర కుంభస్తనుల నేల కారం బెట్టెన్? "

భావము:
ఈవిధంగా శ్రీకృష్ణుడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే వారు అష్టభార్యలు అయ్యారు. అంతేకాక నరకాసురుని సంహరించి అతని చెరలో నున్న రోహిణి మొదలైన పదహారువేలమంది కన్యకామణులను పరిగ్రహించాడు.” అని చెప్పగా పరీక్షుత్తు విని ఇలా అన్నాడు. “భూదేవి ప్రియపుత్రుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాడు? నరకాసురుడు నవయౌవనవతు లైన సుందరీమణులను ఎందుకు చెరసాలలో బంధించాడు?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=18&Padyam=149

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 209

( భద్ర,లక్షణల పరిణయంబు )

10.2-145-మ.
జనవంద్యన్ శ్రుతకీర్తినంద్యఁ దరుణిన్ సందర్శనక్షోణి పా
ద్యనుజన్ మేనమఱందలిన్ విమలలోలాపాంగఁ గైకేయి ని
ద్ధనయోన్నిద్రఁ బ్రపూర్ణసద్గుణసముద్రన్ భద్ర నక్షుద్ర నా
వనజాతాక్షుఁడు పెండ్లియాడె నహితవ్రాతంబు భీతిల్లఁగన్.
10.2-146-వ.
మఱియును.
10.2-147-చ.
అమరులఁ బాఱఁదోలి భుజ గాంతకుఁడైన ఖగేశ్వరుండు ము
న్నమృతముఁ దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా
కమలదళాయతేక్షణుఁడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్
సమదమృగేక్షణన్ నయవిచక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్.

భావము:
కేకయదేశాధిపతి అయిన ధృష్టకేతుడు, తన మేనత్త శ్రుతకీర్తిల కుమార్తె, సందర్శనాదులకు సోదరి సద్గుణవతి అయిన భద్రను శత్రువు లెల్లరూ తల్లడిల్లగా శ్రీకృష్ణుడు వివాహమాడాడు. ఇంకా అంతేకాక పూర్వం గరుత్మంతుడు దేవతలను పారదోలి, అమృతం తెచ్చిన విధంగా మదాంధులైన రాజులను ఓడించి, శ్రీకృష్ణుడు లేడికన్నుల వంటి కన్నులు కల సుందరీ, మద్రరాజుకుమార్తీ, శుభలక్షణవతీ అయిన లక్షణను పరిగ్రహించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=18&Padyam=147

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, April 25, 2021

శ్రీకృష్ణ విజయము - 208

( నాగ్నజితి పరిణయంబు )

10.2-142-ఉ.
భూతి యెలర్పఁ గోసలుని పుత్త్రికకై చనుదెంచి తొల్లి యాఁ
బోతులచేత నోటువడి పోయిన భూపతులెల్ల మాధువుం
డా తరుణిన్ వరించుట చరావలిచే విని త్రోవ సైన్య సం
ఘాతముతోడఁ దాఁకి రరిగర్వవిమోచనుఁ బద్మలోచనున్.
10.2-143-ఉ.
దండి నరాతు లెల్ల హరిఁ దాఁకిన నడ్డము వచ్చి వీఁకతో
భండన భూమియందుఁ దన బాంధవులెల్లను సన్నుతింపఁగా
గాండివచాపముక్త విశిఖంబుల వైరుల నెల్లఁ జంపె నా
ఖండలనందనుండు శశకంబుల సింహము చంపుకైవడిన్.
10.2-144-వ.
ఇట్లు హరి నాగ్నజితిం బెండ్లియై, యరణంబులు పుచ్చుకొని, ద్వారకానగరంబునకు వచ్చి సత్యభామతోడం గ్రీడించుచుండె; మఱియును.

భావము:
ఇంతకుపూర్వం నాగ్నజితిని వివాహం చేసుకుందా మని వచ్చి ఆబోతులను ఓడించలేక పరాజితులైన రాజులు అందరూ, మాధవుడు ఆ కన్యను వివాహ మాడిన విషయం గూఢచారుల వలన తెలుసుకుని శత్రువుల గర్వం భంజించే శ్రీకృష్ణుడిని జయించడానికి సైన్యసమేతంగా వచ్చి మార్గమధ్యంలో అడ్డగించారు. రాజులు అందరూ కలిసి శ్రీకృష్ణుడి పైకి రాగా, అర్జునుడు పరాక్రమంతో ఎదుర్కొన్నాడు గాండీవంనుండి వదలిన బాణాలతో సింహం కుందేళ్ళను సంహరించునట్లు శత్రువులను అందరినీ హతమార్చాడు. బంధువులంతా ఎంతో సంతోషించారు. ఇలా శ్రీకృష్ణుడు నాగ్నజితిని పెండ్లాడి, మామగారు ఇచ్చిన కానుకలతో ద్వారకకు వచ్చి సత్యభామతో ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=143

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 207

( నాగ్నజితి పరిణయంబు )

10.2-140-ఉ.
చేలము చక్కఁ గట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై
బాలుఁడు దారురూపములఁ బట్టెడు కైవడిఁ బట్టి వీర శా
ర్దూలుఁడు గ్రుద్ది నేలఁ బడఁ ద్రోచి మహోద్ధతిఁ గట్టి యీడ్చె భూ
పాలకులెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వత సన్నిభంబులన్.
10.2-141-వ.
ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన విధివత్ప్రకారంబునం బెండ్లి యయ్యె; నా రాజసుందరు లానందంబును బొంది; రా సమయంబున బ్రాహ్మణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును జెలంగె; నంతనా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు సేయించి పదివేల ధేనువులును, విచిత్రాంబరాభరణ భూషితలైన యువతులు మూఁడువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రథంబులును, రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును నిచ్చి పుత్తెంచిన; వచ్చునప్పుడు.

భావము:
శ్రీకృష్ణుడు పైవస్త్రాన్ని నడుముకు బిగించి కట్టుకుని విచిత్రరీతిలో ఏడుమూర్తులు ధరించి బాలుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్లుగా పర్వతాల వంటి ఏడు వృషభాలను పట్టుకుని గ్రుద్ది, క్రుమ్మి, అవలీలగా నేల మీదకు కూలద్రోసి, కట్టి ఈడ్చాడు. అది చూసి అచ్చటి వారంతా మెచ్చుకున్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏడువృషభాలను కట్టి ఈడ్వగా, నగ్నజిత్తు తన కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరూ ఎంతో సంతోషించారు; బ్రాహ్మణులు ఆశీర్వదించారు; మంగళగీతాలు భేరీమృదంగాది వాద్యధ్వనులు మిన్నుముట్టాయి; కోసలరాజు నూతన దంపతులను రథమెక్కించి సాగనంపాడు. పదివేల గోవులను, వస్త్రాభరణాలంకృతలైన మూడువేలమంది కన్యలనూ, తొమ్మిదివేల ఏనుగులనూ, అంతకు వందరెట్లు రథాలనూ, అంతకు వందరెట్లు గుఱ్ఱాలనూ, అంతకు వందరెట్లు సైనికులనూ కానుకగా ఆ రాజు, కృష్ణుడికి ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=141

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, April 23, 2021

శ్రీకృష్ణ విజయము - 206

( నాగ్నజితి పరిణయంబు )

10.2-137-శా.
ఉష్ణాంశుండు తమంబుఁ దోలు క్రియ నీ వుగ్రాహవక్షోణిలోఁ
గృష్ణా! వైరులఁ దోలినాఁడవు, రణక్రీడావిశేషంబులన్
నిష్ణాతుండవు, సప్తగోవృషములన్ నేఁ డాజి భంజించి రో
చిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశుబింబాననన్. "
10.2-138-వ.
అని నగ్నజిత్తు తన కూఁతు వివాహంబునకుం జేసిన సమయంబు సెప్పిన విని.
10.2-139-చ.
కనియె నఘారివత్సబకకంసవిదారి ఖలప్రహారి దా
ఘనతర కిల్పిషంబుల నగణ్య భయంకర పౌరుషంబులన్
సునిశిత శృంగ నిర్దళితశూరసమూహ ముఖామిషంబులన్
హనన గుణోన్మిషంబుల మహా పరుషంబుల గోవృషంబులన్.

భావము:
శ్రీకృష్ణా! సూర్యుడు చీకటిని పారద్రోలినట్లు నీవు రణరంగంలో నీ శత్రువులను పారదోలావు. సంగర క్రీడలో నీవు సర్వసమర్థుడవు. ఏడువృషభాలతో ఈవేళ పోరాడి జయించి మా చంద్రముఖిని నాగ్నజితిని చేపట్టు.” అని నగ్నజిత్తు తన కుమార్తె వివాహ విషయంలో తాము పెట్టుకున్న నియమాన్ని వివరించగా, కృష్ణుడు విని అఘాసుర, వత్సాసుర, బకాసుర, కంసాది ఖలులను చీల్చిచెండాడిన శ్రీకృష్ణుడు, గొప్ప పౌరుషము కలవీ తమ వాడి కొమ్ములతో ఎందరో వీరుల ముఖాలను క్రుమ్మి గాయపరచినవీ, రూపం ధరించిన పాపరాసుల వలె అతి భయంకరమైనవీ అయిన ఆబోతులను అవలోకించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=139

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 205

( నాగ్నజితి పరిణయంబు )

10.2-134-వ.
అనిన రాజిట్లనియె.
10.2-135-శా.
"కన్యం జేకొన నిన్నిలోకముల నీ కన్నన్ ఘనుండైన రా
జన్యుం డెవ్వఁడు? నీ గుణంబులకు నాశ్చర్యంబునుం బొంది తా
నన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిత్యయై
ధన్యత్వంబునుఁ జెంది యున్నది గదా తాత్పర్యసంయుక్తయై.
10.2-136-శా.
చంచద్గోవృషసప్తకంబుఁ గడిమిన్ సైరించి యెవ్వాఁడు భం
జించున్ వానికిఁ గూఁతు నిత్తు నని యేఁ జీరించినన్ వైభవో
దంచద్గర్వులు వచ్చి రాజతనయుల్‌ తత్పాద శృంగాహతిం
గించిత్కాలము నోర్వ కేగుదు రనిం గేడించి భిన్నాంగులై.

భావము:
కృష్ణుడు ఇలా అనగా కోసల రాజు ఇలా చెప్పాడు. “నా కుమార్తెను వివాహమాడడానికి ఈ లోకాలు అన్నిటిలో, నీకంటే తగిన వాడెవడు? నీ సద్గుణాలకు మెచ్చి వరించి లక్ష్మీదేవి, ఇతరులను కాదని, నీ వక్షస్థలంలో శాశ్వత స్థానం సంపాదించుకుని ధన్యురాలైంది. ఆ ఏడువృషభాలను బాహుబలంతో ఎదుర్కుని ఎవడు జయిస్తాడో? అతనికి నా కుమార్తెను ఇచ్చి వివాహం జరుపుతానని చాటించాను. గర్విష్టులైన రాజులెందరో వచ్చి ఆంబోతులగిట్టల దెబ్బలకు కొంచంసేపు కూడా తట్టుకోలేక ఛిన్నాభిన్నా మైన శరీరాలతో పోటీ నుండి తప్పుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=136

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, April 21, 2021

శ్రీకృష్ణ విజయము - 204

( నాగ్నజితి పరిణయంబు )

10.2-131-మ.
సిరియుం బద్మభవేశ దిక్పతులు మున్ సేవించి యెవ్వాని శ్రీ
చరణాంభోజపరాగముల్‌ శిరములన్ సమ్యగ్గతిం దాల్తుఁ; రీ
ధరణీచక్రభరంబు వాపుటకు నుద్యత్కేళిమూర్తుల్‌ దయా
పరుఁడై యెవ్వఁడు దాల్చు నట్టి హరి యెబ్భంగిం బ్రవర్తించునో! "
10.2-132-వ.
అని యిట్లు నాగ్నజితి విచారించు నెడఁ గృష్ణుం డా రాజుం జూచి మేఘగంభీర నినదంబున నిట్లనియె.
10.2-133-క.
"అన్యుల యాచింపరు రా
జన్యులు సౌజన్యకాంక్షఁ జనుదెంచితి నీ
కన్యన్ వేఁడెద నిమ్మా!
కన్యాశుల్కదుల మేము గాము నరేంద్రా!"

భావము:
లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు. శంకరుడు, దిక్పాలకులు సైతం ఎవని పాదధూళిని శిరసున ధరించి సేవిస్తారో? భూభారాన్ని తగ్గించడానికి ఎవడు దయతో లీలావతారాలు ధరిస్తాడో? ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు నా విషయంలో ఎమి చేస్తాడో?” ఇలా నాగ్నజితి చింతిస్తున్న సమయంలో కృష్ణుడు కోసలరాజు నగ్నజిత్తితో మేఘగంభీరస్వరంతో ఇలా అన్నాడు. “రాజులు పరులను యాచించరు. నేను సౌజన్యంతో నీ కుమార్తెను వివాహం చేసుకోడానికి వచ్చాను. నాకు ఇమ్ము. మేము కన్యాశుల్కం ఇచ్చేవారము కాము సుమా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=133

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 203

( నాగ్నజితి పరిణయంబు )

10.2-128-క.
ఆ రాజకన్య ప్రియమున
నా రాజీవాక్షు మోహనాకారుఁ ద్రిలో
కారాధితు మాధవుఁ దన
కారాధ్యుండైన నాథుఁ డని కోరె నృపా!
10.2-129-వ.
మఱియు న క్కన్యకారత్నంబు తన మనంబున.
10.2-130-ఆ.
"విష్ణుఁ డవ్యయుండు విభుఁడు గావలె నని
నోఁచినట్టి తొంటి నోముఫలము
సిద్ధ మయ్యెనేనిఁ జేకొనుఁ బో నన్నుఁ
జక్రధరుఁడు వైరిచక్రహరుఁడు.

భావము:
రాజకుమార్తె నాగ్నజితి ఆరాధనా భావంతో మోహనకారుడూ, పద్మనేత్రుడూ, త్రిలోకపూజితుడూ, ఐన మాధవుడే తనకు భర్త కావాలని భావించింది. ఇంకా నాగ్నజితి తన మనసులో “నేను పూర్వజన్మలో నోచిననోముల ఫలం సిద్ధించి, శ్రీహరి, అచ్యుతుడు, శత్రురాజులను చెండాడే చక్రధరుడు నన్ను వివాహం చేసుకొను గాక.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=130

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, April 18, 2021

శ్రీకృష్ణ విజయము - 202

( నాగ్నజితి పరిణయంబు )

10.2-126-సీ.
జననాథ! వినుము కోసలదేశ మేలెడి;-
  నగ్నజిత్తను నరనాథుఁ డొకడు
సుమతి ధార్మికుఁడు దత్సుత నాగ్నజితి యను;-
  కన్యక గుణవతి గలదు దానిఁ
బెండ్లియాడుటకునై పృథివీశు లేతెంచి;-
  వాఁడికొమ్ములు గల వాని, వీర
గంధంబు సోఁకినఁ గాలు ద్రవ్వెడివాని,-
  నతిమదమత్తంబు లయిన వాని
10.2-126.1-తే.
గోవృషంబుల నేడింటిఁ గూర్చి తిగిచి
బాహుబలమున నెవ్వఁడు పట్టి కట్టు
నతఁడు కన్యకుఁ దగు వరుం డనిన వానిఁ
బట్టఁజాలక పోదురు ప్రజలు బెగడి.
10.2-127-వ.
ఇట్లు గోవృషంబుల జయించినవాఁడ క్కన్యకు వరుండనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండై కోసలపురంబునకుం జనినం గోసలాధీశ్వరుండును హరి నెదుర్కొని యర్ఘ్యపాద్యాది విధులం బూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండై యున్న యెడ.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! కోసలదేశాన్ని సద్గుణుడు ధర్మపరుడు అయిన నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. సద్గుణ సంపన్న. ఆ రాజు దగ్గర వాడి కొమ్ములు కలిగి వీరగంధం సోకితే చాలు కాలుద్రవ్వుతుండే మిక్కిలి మదించిన ఏడు ఆబోతులు ఉన్నాయి. ఆ వృషభాలను తన బాహుబలంతో ఎవడు కట్టివేస్తాడో, అతడే నాగ్నజితికి భర్త అని ఆ రాజు నిర్ణయించాడు. ఎందరో రాజులు వచ్చి ఆ ఎద్దులను చూసి బెదిరి పోయారు, పట్టికట్టలేకపోయారు. ఆ వృషభాలను జయించినవాడే ఆ కన్యకు భర్త అని వినిన శ్రీకృష్ణుడు సేనాసమేతంగా కోసలదేశానికి వెళ్ళాడు. ఆరాజు శ్రీకృష్ణుని గొప్పగా గౌరవించాడు. అర్ఘ్యం, పాద్యం, పీఠం, నమస్కారాదులతో సత్కరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=126

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 201

( కాళింది మిత్రవిందల పెండ్లి )

10.2-124-వ.
అంతం గృష్ణుండు ధర్మరాజప్రముఖుల వీడుకొని, సాత్యకిప్రముఖ సహచరులు గొలువ, మరలి తనపురంబునకుం జని బంధుజనంబులకుఁ బరమానందంబు సేయుచు నొక్క పుణ్య దివసంబున శుభలగ్నంబునం గాళిందిం బెండ్లి యయ్యె; మఱియు నవంతి దేశాధీశ్వరులయిన విందానువిందులు దుర్యోధనునకు వశులై హరికి మేనత్తయైన రాజాధిదేవి కూఁతురైన తమ చెలియలిని వివాహంబు సేయనుద్యోగించి స్వయంవరంబుఁ జాటించిన.
10.2-125-క.
భూ రమణులు సూడఁగ హరి
వీరతఁ జేకొనియె మిత్రవిందను నిత్యా
పూరిత సుజనానందం
జారు చికురకాంతి విజిత షట్పదబృందన్.

భావము:
అటుపిమ్మట, శ్రీకృష్ణుడు ధర్మరాజాదుల వద్ద వీడ్కోలు తీసుకుని, సాత్యకి మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చాడు. బంధువు లందరకూ సంతోషం కలిగిస్తూ, ఒక శుభముహుర్తంలో కాళిందిని పరిణయమాడాడు. అనంతరం అవంతీ పరిపాలకు లైన విందానువిందులు దుర్యోధనునకు వశమయ్యారు. వారి తల్లి అయిన రాజాధిదేవి శ్రీకృష్ణునకు మేనత్త, వారు తమ చెల్లి పెండ్లికి స్వయంవరం చాటించారు. రాజులు అందరూ చూస్తూ ఉండగా, శ్రీ కృష్ణుడు ఎదురులేని తన పరాక్రమం ప్రదర్శించి, అలినీలవేణి కాంతులతో తుమ్మెదల కదుపులను ఓడించేటంత, సుజనుల కన్నులకు నిండు సంతోషం కలిగించేటంత అందాలరాణి ఐన మిత్రవిందను చేపట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=16&Padyam=125

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, April 15, 2021

శ్రీకృష్ణ విజయము - 200

( అర్జునితో మృగయావినోదంబు )

10.2-122-వ.
ఇట్లు నర నారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవవనంబు దహించిన సంతసించి విజయునకు నక్షయ తూణీరంబులు, నభేద్యకవచంబును, గాండీవమనియెడి బాణాసనంబును దివ్యరథంబును ధవళరథ్యంబులను నిచ్చె నందు.
10.2-123-ఉ.
వాసవసూనుచేఁ దనకు వహ్నిశిఖాజనితోగ్రవేదనల్
పాసినఁ జేసి యొక్క సభ పార్థున కిచ్చె మయుండు ప్రీతుఁడై
యా సభలోనఁ గాదె గమనాగమనంబులఁ గౌరవేంద్రుఁ డు
ల్లాసముఁ బాసి యుండుట జలస్థలనిర్ణయ బుద్ధి హీనుఁడై.

భావము:
నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించి, సంతోషించి అర్జునుడికి అక్షయ తూణీరాలు, భేదించడానికి వీలు లేని కవచం, గాండీవ మనే ధనుస్సు, దివ్యమైన రథమూ, తెల్లని గుఱ్ఱాలు అనుగ్రహించాడు. ఖాండవ వన దహన సమయంలో, అగ్నిజ్వాలల బాధనుండి తప్పించి ఇంద్రుడి పుత్రుడు అర్జునుడు తనను రక్షించినందు వలన, మయుడు సంతోషంతో ఒక మహాసభను నిర్మించి ఆ కుంతీపుత్రుడైన అర్జునుడికి బహుకరించాడు. ఆ సభ లోనే దుర్యోధనుడు సంచరిస్తూ గచ్చుకీ, జలాశయానికీ తేడా తెలియక అవమానం పొందాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=15&Padyam=123

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 199

( అర్జునితో మృగయావినోదంబు )

10.2-119-మ.
"నరవీరోత్తమ! యేను సూర్యుని సుతన్; నాపేరు కాళింది; భా
స్కర సంకల్పితగేహమందు నదిలోఁ గంజాక్షు విష్ణుం బ్రభున్
వరుగాఁ గోరి తపంబుసేయుదు; నొరున్ వాంఛింపఁ; గృష్ణుండు వ
న్యరతిన్ వచ్చి వరించునంచుఁ బలికెన్ నా తండ్రి నాతోడుతన్. "
10.2-120-వ.
అనిన విని ధనంజయుఁ డా నీలవేణి పలుకులు హరికిం జెప్పిన విని సర్వజ్ఞుండైన హరియు హరిమధ్యను రథంబుమీఁద నిడుకొని ధర్మరాజు కడకుం జని వారలు గోరిన విశ్వకర్మను రావించి వారి పురం బతివిచిత్రంబు సేయించె.
10.2-121-క.
దేవేంద్రుని ఖాండవ మ
ప్పావకునకు నీఁ దలంచి పార్థుని రథికుం
గావించి సూతుఁ డయ్యెను
గోవిందుఁడు మఱఁదితోడఁ గూరిమి వెలయన్.

భావము:
“ఓ వీరాధివీరా! నేను సూర్యుడి కుమార్తెను. నా పేరు కాళింది. ఈ నదిలో నా తండ్రి నా కోసం ఏర్పాటుచేసిన గృహంలో పద్మాక్షుడైన శ్రీకృష్ణుడిని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. ఇంకెవరినీ నేను కోరను. శ్రీకృష్ణుడు వేటకు వచ్చి నిన్ను వివాహమాడగల డని నా తండ్రి నాకు తెలిపాడు." అలా చెప్పిన కాళింది మాటలను అర్జునుడు శ్రీకృష్ణుడికి విన్నవించాడు. సర్వజ్ఞుడైన హరి ఆ సన్నని నడుము కల కాళింది సుందరిని రథముపై ఎక్కించుకుని, ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. పాండవులు కోరగా విశ్వకర్మ వచ్చి ఇంద్రప్రస్థపురాన్ని చిత్రవిచిత్రంగా అలంకరించి తీర్చిదిద్దాడు. దేవేంద్రుని ఖాండవవనాన్ని అగ్నిదేవుడికి అర్పించడానికి నిశ్చయించుకుని మేనత్త కొడుకు అర్జునుడిని సస్నేహంగా పిలిచి, అతని రథానికి శ్రీకృష్ణుడు తాను సారథి అయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=15&Padyam=121

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, April 13, 2021

శ్రీకృష్ణ విజయము - 198

( అర్జునితో మృగయావినోదంబు )

10.2-115-ఉ.
ఉపగతు లైన యట్టి పురుషోత్తమ పార్థులు గాంచి రాపగా
విపుల విలోల నీలతర వీచికలందు శిరోజభార రు
చ్యపహసితాళిమాలిక నుదంచిత బాల శశిప్రభాలికం
దపనుని బాలికన్ మదనదర్పణతుల్య కపోలపాలికన్.
10.2-116-వ.
కని యచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు సని యా కన్య కిట్లనియె.
10.2-117-మ.
"సుదతీ! యెవ్వరి దాన? వేమికొఱ కిచ్చోటం బ్రవర్తించె? దె
య్యది నీ నామము? కోర్కి యెట్టిది? వివాహాకాంక్షతోఁగూడి యీ
నదికిన్ వచ్చినజాడ గానఁబడె? ధన్యంబయ్యె నీ రాక, నీ
యుదయాదిస్థితి నెల్లఁ జెప్పు మబలా! యుద్యత్కురంగేక్షణా! "
10.2-118-వ.
అనిన నర్జునునకుఁ గాళింది యిట్లనియె.

భావము:
కృష్మార్జునులు అలా యమున ఇసుకతిన్నెలపై కూర్చుని ఉన్నప్పుడు, ఆ నదీతరంగాలలో తుమ్మెదల సమూహాన్ని ధిక్కరించే శిరోజశోభతో, బాలచంద్రుడిని బోలిన నెన్నుదురుతో, అద్దాలవంటి చెక్కిళ్ళతో ప్రకాశించే, సూర్యుని కుమార్తెను చూసారు. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె చెంతకు వెళ్ళి ఇలా అన్నాడు. “ఓ అమ్మాయీ! బహు చక్కటి దంతాల చక్కనమ్మా! సుకుమారీ! లేడికన్నుల వన్నెలాడీ! నీవెవరవు? ఎందు కోసం ఇక్కడ తిరుగున్నావు? నీ పేరేమిటి? నీ కోరికేమిటి? వివాహకాంక్షతో ఈ ప్రాంతానికి వచ్చినట్లున్నావు. నీ రాక ధన్యమైనది. నీ ప్రయత్నం నెరవేరుతుంది. నీ గురించిన విశేషాలు అన్నింటినీ చెప్పు.” అలా అడిగిన అర్జునుడితో ఆ అమ్మాయి, కాళింది ఇలా సమాధానం చెప్పింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=15&Padyam=117

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 197

( అర్జునితో మృగయావినోదంబు )

10.2-112-మ.
తురగశ్రేష్ఠము నెక్కి కంకటధనుస్తూణీశరోపేతుఁడై
హరితోడన్ వనభూమి కేగి విజయుం డాసక్తుఁడై చంపె శం
బర శార్దూల తరక్షు శల్య చమరీ భల్లూక గంధర్వ కా
సర కంఠీరవ ఖడ్గ కోల హరిణీ సారంగ ముఖ్యంబులన్.
10.2-113-క.
అచ్చోటఁ బవిత్రములై
చచ్చిన మృగరాజి నెల్ల జననాథునకుం
దెచ్చి యొసంగిరి మెచ్చుగఁ
జెచ్చెర నరుఁ గొల్చి యున్న సేవకు లధిపా!
10.2-114-వ.
అంత నర్జునుండు నీరుపట్టున డస్సిన, యమునకుం జని, య మ్మహారథులైన నరనరాయణు లందు వార్చి జలంబులు ద్రావి, యొక పులినప్రదేశంబున నుండి.

భావము:
ఒకనాడు అర్జునుడు అశ్వారూఢుడై శ్రీకృష్ణునితో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ జింకలను, పెద్దపులులను, సివంగులను, ఏదుపందులను, చమరీమృగాలను, ఎలుగుబంట్లను, దుప్పులను, ఎనుబోతులను, సింహాలను, ఖడ్గమృగాలను, వనవరాహాలను, లేళ్ళను, ఇఱ్ఱి లేళ్ళను, ఏనుగులను ఆసక్తితో వేటాడాడు. అలా చనిపోయిన అర్హ మృగాలను అన్నింటినీ ధర్మరాజు మెచ్చుకునేలా అర్జునుడి సేవకులు శీఘ్రంగా తెచ్చి ఆయనకు ఇచ్చారు. అప్పుడు అర్జునుడుకి దాహంవేసి బాగా అలసిపోయాడు. ఆ నరనారాయణులు ఇద్దరూ యమునానదికి వెళ్ళి ఆచమనం చేసి, దాహం తీర్చుకుని, ఇసుక ప్రదేశంలో కూర్చున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=15&Padyam=113

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, April 10, 2021

శ్రీకృష్ణ విజయము - 196

( ఇంద్రప్రస్థంబున కరుగుట)

10.2-110-మ.
"పట్టఁగ లేరు నిన్నుఁ దమభావము లందు సనందనాదు లే
పట్టుననైన, నట్టి గుణభద్రచరిత్రుఁడ వీవు, నేఁడు మా
చుట్టమ వంచు వచ్చెదవు; చూచెద వల్పులమైన మమ్ము; నే
మెట్టి తపంబు చేసితి మధీశ్వర! పూర్వశరీర వేళలన్?"
10.2-111-వ.
అని ధర్మజుండు దన్నుఁ బ్రార్థించిన నింద్రప్రస్థపురంబు వారలకు నయనానందంబు సేయుచు హరి గొన్ని నెలలు వసియించి యుండె; నందొక్కనాఁడు.

భావము:
“ప్రభూ! సనందాది మహర్షులే ఎంతో ప్రయత్నించి కూడా, నిన్ను తెలియలేరు. నీవు అంతటి సద్గుణ సచ్చరిత్రలు గల మహానుభవుడవు. ఇవాళ నీవు మా బంధువు అయ్యావు. అల్పుల మైన మమ్మల్ని చూడటానకి వచ్చావు. పూర్వజన్మలో మేము ఎంతటి తపస్సు చేసామో!" అని ఈవిధంగా ధర్మరాజు శ్రీకృష్ణుడుని స్తుతించాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలోని ప్రజలకు నేత్రానందం కలిగిస్తూ అక్కడే కొన్ని నెలలపాటు ఉన్నాడు. అప్పుడు ఒకరోజు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=14&Padyam=110

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 195

( ఇంద్రప్రస్థంబున కరుగుట)

10.2-108-సీ.
"అన్న! నీ చుట్టాల నరయుదు! మఱవవు-
  నీవు పుత్తెంచిన నెమ్మితోడ
మా యన్న యేతెంచి మముఁ జూచి పోయెను-
  నిల్చి యున్నారము నీ బలమున;
నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు-
  నేఁ డాదిగా నింక నీవె కాక?
యఖిల జంతువుల కీ వాత్మవు గావునఁ-
  బరులు నా వారని భ్రాంతి సేయ;
10.2-108.1-తే.
వయ్య! నా భాగ్యమెట్టిదో? యనవరతముఁ
జిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్లఁ
వాపుచుందువు గాదె! యో! పరమపుణ్య!
యదుకుమారవరేణ్య! బుధాగ్రగణ్య! ."
10.2-109-వ.
అనిన యుధిష్ఠిరుం డిట్లనియె.

భావము:
“ఓ పుణ్యాత్మా! యదుకులతిలకా! పురుషోత్తమా! కృష్ణా! నీవు నీ బంధువులను మరచిపోకుండా ఆదరిస్తావు. నీవు పంపించగా అక్రూరుడు వచ్చి ఆదరంగా మమ్మల్ని పలకరించి వెళ్ళాడు. నీ అండ వలననే మేము జీవించి ఉన్నాము. నా పిల్లలకు, నాకు నీవు కాక మరెవరు దిక్కు. సర్వప్రాణులకు నీవే ఆత్మవు కనుక, పరులు నా వారు అని నీకు భేదంలేదు. మమ్మల్ని మరచిపోకుండా నీవు కరుణతో మా చిక్కులు అన్నింటినీ తొలగిస్తున్నావు. ఇదంతా నా భాగ్యం కాక మరేమిటి.” పిమ్మట, ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు,

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=14&Padyam=108

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, April 9, 2021

శ్రీకృష్ణ విజయము - 194

( ఇంద్రప్రస్థంబున కరుగుట)

10.2-105-వ.
అంత సాత్యకి పాండువులచేతం బూజితుండై యొక్క పీఠంబున నాసీనుండై యుండెఁ; దక్కిన యనుచరులును వారిచేతఁ బూజితులై కొలిచి యుండిరి; హరియుం గుంతీదేవి కడకుం జని నమస్కరించి యిట్లనియె.
10.2-106-క.
"అత్తా! కొడుకులుఁ గోడలుఁ
జిత్తానందముగఁ బనులు సేయఁగ నాత్మా
యత్తానుగవై యాజ్ఞా
సత్తాదులు గలిగి మనుదె సమ్మోదమునన్? "
10.2-107-చ.
అనవుడుఁ బ్రేమ విహ్వలత నందుచు గద్గదభాషణంబులం
గనుఁగవ నశ్రుతోయములు గ్రమ్మఁగఁ గుంతి సుయోధనుండు సే
సిన యపచారముం దలఁచి చెందిన దుఃఖములెల్లఁ జెప్పి యా
దనుజవిరోధి కిట్లనియెఁ దద్దయుఁ బెద్దఱికంబు సేయుచున్.

భావము:
అప్పుడు, పాండవులు సాత్యకిని గౌరవించారు. అతను కూడ ఒక ఆసనం పై ఆసీనుడు అయ్యాడు. తక్కిన యాదవులను కూడా పాండవులు చక్కగా సన్మానించారు. వారు కూడ కొలువుదీరారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి చెంతకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు. “అత్త! నీ కొడుకులూ, కోడలు ద్రౌపదీ నీ మనసునకు ఆనందం కల్గిస్తుండగా సమ్మోదంతో జీవితం గడుపుతున్నావా.” ఇలాగ శ్రీకృష్ణుడు అడుగగా, కుంతీదేవి ప్రేమ విహ్వలతతో డగ్గుత్తికతో కనుల నీరు కమ్ముతుండగా, దుర్యోధనుడు చేసిన అపకారాలు, తాము పడ్డ కష్టాలు అన్నీ చెప్పి, శ్రీకృష్ణునకు పెద్దరిక మిచ్చి ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=14&Padyam=107

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 193

( ఇంద్రప్రస్థంబున కరుగుట)

10.2-103-వ.
అంత నొక్కనాఁడు పాండవులం జూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు గొలువఁ బురుషోత్తముం డింద్రప్రస్థపురంబునకుం జనినం బ్రాణంబులంగనిన యింద్రియంబులభంగి వారఖిలేశ్వరుం డైన హరిం గని కౌఁగిలించుకొని; కృష్ణుని దివ్యదేహసంగమంబున నిర్ధూతకల్మషులై యనురాగహాసవిభాసితం బైన ముకుంద ముఖారవిందంబు దర్శించి యానందంబు నొందిరి; గోవిందుండును యుధిష్ఠిర భీమసేనుల చరణంబులకు నభివందనంబులు సేసి యర్జును నాలింగనంబున సత్కరించి, నకుల సహదేవులు మ్రొక్కిన గ్రుచ్చియెత్తి, యుత్తమ పీఠంబున నాసీనుండై యుండె; నప్పుడు.
10.2-104-క.
చంచద్ఘనకుచభారా
కుంచితయై క్రొత్త పెండ్లికూఁతు రగుట నిం
చించుక సిగ్గు జనింపఁగఁ
బాంచాలతనూజ మ్రొక్కెఁ బద్మాక్షునకున్.

భావము:
అటుపిమ్మట, ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూడాలి అనుకున్నాడు. సాత్యకి మొదలైన యాదవులతో కలిసి ఇంద్రప్రస్థనగరానికి వెళ్ళాడు. పాండవులు ప్రాణాన్ని పొందిన ఇంద్రియాల వలె, సర్వేశ్వరు డైన శ్రీకృష్ణుడిని దర్శించి, కౌగలించుకున్నారు. విష్ణుదేవుని దివ్యశరీరము యొక్క స్పర్శ వలన వారి పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయి. అనురాగపూరిత మైన చిరునవ్వుతో కూడిన శ్రీకృష్ణుడి ముఖపద్మాన్ని దర్శించి, వారు ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడు ధర్మరాజు, భీమసేనుల పాదాలకు నమస్కరించాడు. అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన నకుల, సహదేవులను ఆదరించాడు. ఒక ఉన్నతపీఠం పైన ఆసీనుడయ్యాడు. అప్పుడు స్తనభారంతో అవనత అయి, క్రొత్త పెళ్ళికూతురు కావడం చేత సిగ్గుపడుతూ పాంచాలరాజపుత్రి ద్రౌపది పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడికి నమస్కరించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=14&Padyam=104

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, April 6, 2021

శ్రీకృష్ణ విజయము - 192

( దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము )

10.2-100-ఉ.
సంతసమంది బంధుజనసన్నిధికిన్ హరి దెచ్చి చూపె; న
శ్రాంతవిభాసమాన ఘృణిజాలపలాయిత భూనభోంతర
ధ్వాంతము, హేమభారచయవర్షణవిస్మిత దేవ మానవ
స్వాంతముఁ, గీర్తి పూరితదిశావలయాంతము నా శమంతమున్.
10.2-101-క.
చక్రాయుధుఁ డీ క్రియఁ దన
యక్రూరత్వంబు జనుల కందఱకును ని
ర్వక్రముగఁ దెలిపి క్రమ్మఱ
నక్రూరుని కిచ్చె మణిఁ గృపా కలితుండై.
10.2-102-క.
ఘనుఁడు భగవంతుఁ డీశ్వరుఁ
డనఘుఁడు మణి దెచ్చి యిచ్చినట్టి కథనమున్
వినినఁ బఠించినఁ దలఁచిన
జనులకు దుర్యశముఁ బాపసంఘముఁ దలఁగున్.

భావము:
శ్రీకృష్ణుడు సంతోషంతో ఆ మణిని తన బంధువుల కందరకూ చూపించాడు. ఆ శమంతకమణి తన కాంతితో సర్వలోకాల చీకట్లు పోగొట్టగలది, తనిచ్చే బంగారంతో దేవమానవులకు ఆశ్చర్యం కల్గించగలది, సర్వ దిగంతాల వరకూ నిండిన కీర్తిగలది. చక్రాయుధుడు తన నిష్కళంకత్వాన్ని అందరికీ తెలియజేసి, శమంతకమణిని తిరిగి అక్రూరునికే ఇచ్చివేశాడు. మహానుభావుడు పరమేశ్వరుడు, పాపరహితుడు, ఐశ్వర్యవంతుడు ఐన శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి, ఇచ్చిన కథను విన్నా, పఠించినా, తలచినా జనుల పాపాలు పటాపంచలవుతాయి; అపకీర్తి తొలగిపోతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=13&Padyam=902

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 191

( దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము )

10.2-98-సీ.
"తా నేగుతఱి శతధన్వుండు మణిఁ దెచ్చి-
  నీ యింటఁ బెట్టుట నిజము తెలిసి
నాఁడ, సత్రాజిత్తునకుఁ బుత్త్రకులు లేమి-
  నతనికిఁ గార్యంబు లాచరించి
విత్తంబు ఋణమును విభజించుకొనియెద-
  రతని పుత్త్రిక లెల్ల, నతఁడు పరుల
చేత దుర్మరణంబుఁ జెందినాఁ, డతనికై-
  సత్కర్మములు మీఁద జరుపవలయు,
10.2-98.1-ఆ.
మఱి గ్రహింపు మీవ, మా యన్న నను నమ్మఁ
డెలమి బంధుజనుల కెల్లఁ జూపు
మయ్య! నీ గృహమున హాటక వేదికా
సహితమఖము లమరు సంతతమును. "
10.2-99-వ.
అని యిట్లు సామవచనంబులు హరి పలికిన నక్రూరుండు వస్త్రచ్ఛన్నంబైన మణిం దెచ్చి హరి కిచ్చిన.

భావము:
“శతధన్వుడు తాను వెళుతూ మీ ఇంటిలో ఆ శమంతకమణిని దాచిపెట్టిన సంగతి తెలుసుకున్నాను. సత్రాజిత్తుకు కుమారులు లేరు కనుక అతనికి పరలోకక్రియలు ఆచరించి అతని ఆస్తిని అప్పును సత్రాజిత్తు కుమార్తెలు పంచుకుంటారు. అతడు పరుల చేత దుర్మరణం చెందాడు. అతడికి సత్కర్మలు జరగాలి. శమంతకమణిని నీవే తీసుకో. మా అన్న నన్ను నమ్మడు కనుక, బంధువులకు అందరికీ చూపించు. నీ ఇంట్లో నిత్యం బంగారు వేదికల మీద యజ్ఞ కార్యాలు కొనసాగుతాయి.” ఈ విధంగా శ్రీకృష్ణుడు సాంత్వవాక్యాలు పలుకడంతో, తన వస్త్రంలో దాచితెచ్చిన శమంతకమణిని అక్రూరుడు కృష్ణుడికి సమర్పించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=13&Padyam=98

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, April 3, 2021

శ్రీకృష్ణ విజయము - 190

( దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము )

10.2-96-సీ.
"కమలాక్ష! వినవయ్య! కాశీశుఁ డేలెడి-
  కుంభిని వానలు గురియకున్నఁ
గోరి శ్వఫల్కునిఁ గొనిపోయి యతనికిఁ-
  గాందిని యనియెడు కన్య నిచ్చి
కాశీవిభుండు సత్కారంబు సేసిన-
  వానలు గురిసె నా వసుధమీఁద;
నాతని పుత్త్రకుఁ డయిన యక్రూరుండు-
  నంతటివాఁడు, మహాతపస్వి
10.2-96.1-ఆ.
మరలి వచ్చెనేని మాను నుత్పాతంబు
లెల్ల; వాన గురియు నీ స్థలమున;
దేవ! యతనిఁ దోడితెప్పింపు; మన్నింపు;
మానవలయుఁ బీడ మానవులకు."
10.2-97-వ.
అని పలుకు పెద్దల పలుకు లాకర్ణించి దూతలం బంపి కృష్ణుం డక్రూరుని రావించి పూజించి ప్రియకథలు కొన్ని సెప్పి సకలలోకజ్ఞుండు గావున మృదుమధుర భాషణంబుల నతని కిట్లనియె.

భావము:
“ఓ కమలాక్షా! కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు కురవనప్పుడు అక్రూరుడి తండ్రి అయిన శ్వఫల్కుని తీసుకుని వెళ్ళి కాందిని అనే తన కూతురును ఇచ్చి వివాహంచేసి సత్కరించేడు. అప్పుడు కాశీరాజ్యంలో వానలు కురిశాయి. శ్వఫల్కుడు కుమారుడైన అక్రూరుడు కూడా అంతటి వాడే. మహాతపస్వి. అతడు తిరిగి వస్తే ఈ ఉపద్రవాలు తొలగిపోతాయి. వానలు కురుస్తాయి. అతనిని రప్పించండి. మా మాట మన్నించండి. ప్రజల పీడను తొలగించండి.” ఈలా చెప్పిన పెద్దల మాటలను విని, శ్రీకృష్ణుడు దూతలను పంపి అక్రూరుడిని రప్పించాడు. అతనిని సత్కరించి, ప్రియమైన పలుకులు పలికి, మృదుమధుర భాషణలతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=13&Padyam=96

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 189

( దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము )

10.2-94-క.
చలమున గాంధారేయుఁడు
లలిత గదాయుద్ధగౌశలము నేర్చెఁ దగన్
హలిచే నాశ్రితనిర్జర
ఫలిచేఁ ద్రైలోక్యవీరభటగణబలిచేన్.
10.2-95-వ.
అటఁ గృష్ణుండును ద్వారకానగరంబునకుం జని శతధన్వుని మరణంబును మణి లేకుండుటయును, సత్యభామకుం జెప్పి, సత్యభామాప్రియకరుండు గావున సత్రాజిత్తునకుఁ బరలోకక్రియలు సేయించె; నక్రూర కృతవర్మలు శతధన్వు మరణంబు విని వెఱచి ద్వారకానగరంబు వెడలి బహుయోజన దూరభూమికిం జని; రక్రూరుండు లేమిం జేసి వానలు లేక మహోత్పాతంబులును, శరీర మానస తాపంబులును ద్వారకావాసులకు సంభవించిన నందుల వృద్ధజనులు బెగడి హరి కిట్లనిరి.

భావము:
హలాయధధారీ, ఆశ్రితపారిజాతమూ, త్రిలోకవీరుడూ ఐన బలరాముడి వద్ద పట్టుదలగా, గాంధారీదేవి కొడుకు అయిన దుర్యోధనుడు గదా యుద్ధ కౌశలము అంతా నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరి సత్యభామతో శతధన్వుడిని సంహరించిన సంగతి, అతడి దగ్గర మణి కానరాని విషయము తెలిపి, సత్రాజిత్తునకు ఉత్తరక్రియలు జరిపించాడు. శతధన్వుడి మరణ వార్త వినిన అక్రూర, కృతవర్మలు భయపడిపోయి, ద్వారకాపట్టణం వదలి ఎన్నో యోజనాల దూర ప్రాంతానికి పాఱిపోయారు. అక్రూరుడు దేశంలో లేకపోవడంతో, అనేక ఉపద్రవాలు కలిగాయి. వర్షాలు కురియ లేదు. ద్వారకలోని ప్రజలకు శారీరక మానసిక, తాపాలు సంభవించాయి. అప్పుడు ద్వారకానగరం లోని వయోవృద్ధులు భయపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=13&Padyam=95

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, April 2, 2021

శ్రీకృష్ణ విజయము - 188

( శతధన్వుని ద్రుంచుట )

10.2-92-సీ.
"ఆ మణి శతధన్వుఁ డపహరించుట నిక్క-
  మెవ్వరిచే దాఁప నిచ్చినాఁడొ?
వేగమె నీ వేఁగి వెదకుము పురిలోన-
  వైదేహు దర్శింప వాంఛ గలదు,
పోయి వచ్చెద, నీవు పొ"మ్మని వీడ్కొని-
  మెల్లన రాముండు మిథిలఁ జొచ్చి
పోయిన జనకుండు పొడగని హర్షించి-
  యెంతయుఁ బ్రియముతో నెదురు వచ్చి
10.2-92.1-తే.
యర్ఘ్యపాద్యాది కృత్యంబు లాచరించి
యిచ్చగించిన వస్తువు లెల్ల నిచ్చి
యుండు మని భక్తి చేసిన నుండె ముసలి;
కువలయేశ్వర! మిథిలలోఁ గొన్ని యేండ్లు.
10.2-93-వ.
అంత దుర్యోధనుండు మిథిలానగరంబునకుం జనుదెంచి జనకరాజుచేత సమ్మానితుండై.

భావము:
“శమంతకమణిని శతధన్వుడు అపహరించడం నిజం. ఎవరికి దాచిపెట్టమని ఇచ్చాడో? ఏమిటో? నీవు వెంటనే ద్వారకకు వెళ్ళి మణి కోసం అన్వేషించు. నాకు విదేహ దేశ ప్రభువు అయిన జనకుడిని చూడాలనే కోరిక కలిగింది. నేను వెళ్ళివస్తాను. నీవు ద్వారకకు వెళ్ళు.” అని చెప్పి, శ్రీకృష్ణుడిని పంపించి, మిథిలానగరమునకు వెళ్ళాడు. బలరాముడికి జనకమహారాజు ఆర్ఘ్యపాద్యాది విధులతో సత్కారాలు చేసి అభీష్ట వస్తువులను ఇచ్చి అక్కడ ఉండమని ప్రార్థించాడు. బలరాముడు కొన్ని ఏళ్ళు మిథిలానగరంలో ఉన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు మిథిలకు వెళ్ళి జనకుని చేత గౌరవింపబడి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=12&Padyam=92

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :