Tuesday, January 29, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 103

10.1-619-క.
మఱియును దనుజుఁడు రామునిఁ
గఱవఁగ గమకించి తెఱపిఁ గానక యతనిం
జుఱచుఱఁ జూచుచు శౌర్యము
పఱిబోవఁగ నింత నంతఁ బదమలఁ దన్నెన్
10.1-620-వ.
అంత బలభద్రుండు రౌద్రాకారంబున గర్దభాసురుపదంబులు నాలుగు నొక్క కేల నంటంబట్టి బెట్టుదట్టించి త్రిప్పి విగతజీవునిం జేసి.

భావము:
తన్నడంతో ఊరుకోకుండా ఆ రాక్షసుడు బలరాముడిని కరవడానికి ప్రయత్నించాడు. కానీ బలరాముడు అంద లేదు. ఇంక చేసేదిలేక ఆ రాక్షసుడు చుర చుర చూస్తూ ఇటు అటు తన్నులు తన్నసాగాడు. అయితే అందులో అతని బలం క్షీణించినట్లు తెలిసిపోతూ ఉంది. అప్పుడు బలరాముడు రౌద్రాకారం ధరించాడు. ఆ గాడిద రాక్షసుడి నాలుగు కాళ్ళు కలిపి ఒక్క చేత్తో ఒడిసి పట్టుకుని మహావేగంగా గిర గిరా త్రిప్పికొట్టి వాణ్ణి మట్టుపెట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=619

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 102

10.1-617-వ.
అప్పుడు పండ్లు రాల్చిన చప్పుడు చెవులకు దెప్పరంబయిన, నదిరిపడి రిపుమర్దన కుతుకంబున గార్దభాసురుండు
10.1-618-మ.
పదవిక్షేపములన్ సవృక్షధరణీభాగంబు గంపింపఁగా
రదముల్ దీటుచుఁ గత్తిరించిన చెవుల్ రాజిల్ల వాలంబు భీ
తిదమై తూలఁగఁ గావరంబున సముద్దీపించి గోపాలకుల్
బెదరన్ రాముని ఱొమ్ముఁ దన్నె వెనుకై బీరంబు తోరంబుగన్.

భావము:
గార్దభ రూపంలో అక్కడ ఉండే రాక్షసుడు పండ్లు రాల్చిన చప్పుడు విన్నాడు. ఆ ధ్వని చెవిలో పడగానే అదిరిపడి శత్రువులను వెంటనే చంపేయాలనే కోరికతో బయలుదేరాడు. భయంకరంగా విజృంభించి వస్తున్న ఆ రాక్షసుని కాలి తాకిడికి అక్కడ ఉన్న నేలంతా చెట్లతో సహా అదరిపోయింది. అతడు చీలిన చెవులతో, తోక భయంకరంగా ఊగుతుండగా, పళ్ళు పట పట కొరుకుతూ, కొవ్వెక్కి పరిగెత్తుకు వచ్చాడు. ఆ గోపబాలకులు అందరూ బెదరిపోయేటట్లు బలరాముని వక్షస్థలం మీద ఒక తన్ను తన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=618

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, January 28, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 101

10.1-615-వ.
అని పలికిన చెలికాని పలుకు లాదరించి విని నగి వారునుం దారును నుత్తాలంబగు తాలవనంబునకుం జని; యందు.
10.1-616-క.
తత్తఱమున బలభద్రుఁడు
తత్తాలానోకహములఁ దనభుజబలసం
పత్తిఁ గదల్చుచు గ్రక్కున
మత్తేభము భంగిఁ బండ్లు మహిపై రాల్చెన్.

భావము:
ఇలా చెప్పిన మిత్రుని మాటలు విని బలరామ కృష్ణులు చిరునవ్వుతో అంగీకరించారు. వారి తోపాటు ఆ తాటితోపులో ప్రవేశించారు. బలరాముడు తొందర తొందరగా ఆ తాటి చెట్లను పట్టుకుని తన భుజబలంతో మదించిన ఏనుగులా కదలించగానే మగ్గిన తాటిపండ్లు దబ దబ నేల మీద రాలాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=616

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 100

10.1-613-వ.
ఆ ధేనుకాసురుండు మహాశూరుండును, ఖరాకారుండును నై సమాన సత్వసమేతులైన జ్ఞాతులుం దానును మనుష్యులం బట్టి భక్షించుచుండు; నయ్యెడఁ బరిమళోపేతంబులైన నూతన ఫల వ్రాతంబు లసంఖ్యాకంబులు గలవు; వినుఁడు.
10.1-614-క.
ఫలగంధము నాసాపుట
ముల జొచ్చి కలంచి చిత్తములఁ గొనిపోయెన్
ఫలముల నమలింపుఁడు మము; 
బలియురకును మీకు దైత్యభటు లడ్డంబే?

భావము:
ఆ ధేనుకుడు మహాబలవంతుడు వాడు భయంకరమైన గాడిద రూపంలో ఉంటాడు. తనతో సమానమైన బలం కలిగిన తన బంధువుల తోపాటు తాను మనుష్యులను పట్టుకుని తింటూ ఉంటాడు. అక్కడ చక్కని సువాసనలు వెదజల్లుతూ ఎన్నో కొత్త కొత్త పండ్లు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. వింటున్నారా. ఆ పండ్ల సువాసనలు మా ముక్కులలో చొరబడి మమ్మల్ని వ్యాకుల పెడుతూ మనస్సులను అటు లాగివేస్తున్నాయి. ఎలాగైనా ఆ పండ్లను మాకు తినిపించండయ్యా. మీరు మహాబలవంతులు మీకు ఆ సామాన్య రాక్షసులు అడ్డమా ఏమిటి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=614

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, January 26, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 99

10.1-611-వ.
అ య్యవసరంబున శ్రీదామ నామధేయుం డయిన గోపాలకుండు రామకేశవులం జూచి యిట్లనియె.
10.1-612-క.
దూరంబునఁ దాలతరు
స్ఫారం బగు వనము గలదు; పతితానుపత
ద్భూరిఫలసహిత మది యే
ధీరులుఁ జొర వెఱతు రందు ధేనుకుఁ డుంటన్.

భావము:
అలా విహారాలు చేసేటప్పుడు ఒకసారి, శ్రీరాముడు అనే పేరు గల గోపబాలుడు బలరామ కృష్ణులను చూసి ఇలా అన్నాడు. “ఇక్కడ నుంచి చాలా దూరంలో తాడిచెట్లతో నిండిన వనము ఒకటి ఉంది. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద తాటిపండ్లు ఒకదాని వెంట మరొకటి పండి రాలుతూ ఉంటాయి. కానీ అందుడలో ధేనుకుడు అనే రాక్షసుడు ఉండడం వలన, ఎంత ధైర్యం కలవారు అయినా ఆవనంలో ప్రవేశించడానికి జంకుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=612

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 98


10.1-609-వ.
ఆ సమయంబున.
10.1-610-సీ.
అలసినచోఁ గొంద ఱతిమోదమున వీపు; 
లెక్కించుకొని పోదు రేపు మెఱసి; 
సొలసి నిద్రించినచోఁ నూరుతల్పంబు; 
లిడుదురు కొందఱు హితవు గలిగి; 
చెమరించి యున్నచోఁ జిగురుటాకులఁ గొంద; 
ఱొయ్యన విసరుదు రుత్సహించి; 
దవ్వేగి నిలుచుచోఁ దడయకఁ గొందఱు; 
పదము లొత్తుదు రతిబాంధవమున;
10.1-610.1-ఆ.
గోపవరులు మఱియుఁ గొందఱు ప్రియమున
మాధవునకుఁ బెక్కుమార్గములను
బనులు చేసిరెల్ల భవములఁ జేసిన
పాపసంచయములు భస్మములుగ.

భావము:
కృష్ణుడు అలసిపోతే కొందరుఅలా కృష్ణబాలుడు వనంలో విహరించే సమయాలలో... గోపబాలకులు చాల సంతోషంతో తమ వీపు మీద ఎక్కించుకుని తీసుకుని వెడతారు. కృష్ణుడు అలసి సొలసి నిద్రపోతే తమ ఒడిలోనే ఎంతో ఇష్టంగా పడుకోపెట్టుకుంటారు. కృష్ణుడికి చెమటలు పోస్తే చిగురుటాకులతో గాలి తగిలేలా వీస్తారు. కొంత దూరం నడచి అలసిపోతే కాళ్ళు నొప్పిపుట్టాయేమో నని పాదాలు వత్తుతారు ఇంకొందరు ప్రేమతో ఎన్నో విధాల సేవలు చేస్తారు. ఆ సేవలతో పూర్వజన్మలలో చేసిన వారి పాపాలన్నీ పటాపంచలు చేసుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=610

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, January 20, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 97

10.1-608-సీ.
వేదాంత వీధుల విహరించు విన్నాణి; 
విహరించుఁ గాంతారవీధులందు; 
ఫణిరాజశయ్యపైఁ బవళించు సుఖభోగి; 
వల్లవ శయ్యలఁ బవ్వళించు; 
గురుయోగి మానసగుహలఁ గ్రుమ్మరు మేటి; 
గ్రుమ్మరు నద్రీంద్ర గుహలలోనఁ; 
గమలతోడఁ బెనంగి కడు డయ్యు చతురుఁ డా; 
భీరజనులతోడఁ బెనఁగి డయ్యు;
10.1-608.1-ఆ.
నఖిల లోకములకు నాశ్రయుండగు ధీరుఁ
డలసి తరులనీడ నాశ్రయించు
యాగభాగచయము లాహరించు మహాత్ముఁ
డడవిలోని ఫలము లాహరించు

భావము:
వేదాంత వీధులలో విహరించే విన్నాణి, ఈ నాడు విపిన వీధులలో విహరిస్తూ ఉన్నాడు. మృదువైన ఆదిశేషుడు అనే శయ్యపై పవళించే పరమ భోగి, ఇప్పుడు చిగురాకు ప్రక్కల మీద పవళిస్తూ ఉన్నాడు. గొప్ప యోగుల అంతరంగాల లోపల సంచరిస్తూ ఉండే మహానుభావుడు, ఇక్కడ కొండగుహలలో తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయే చతురుడు ఇవాళ గోపబాలురతో ఆడిపాడి అలసిపోతున్నాడు. సర్వ లోకాలకూ ఆశ్రయమిచ్చి కాపాడే ధీరుడు, ఈ రోజు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నాడు. మహామునీంద్రుల యజ్ఞాల లోని హవిర్భాగాలను భుజించే భగవంతుడు, అడవిలో కాయలు పండ్లు తింటున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=608

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 96

10.1-605-క.
కాంతార విహారమ్ముల 
శ్రాంతుండై గోపకాంకశయుఁడగు నన్నన్
సంతుష్టిఁ బొందఁజేయు ని
రంతర కరచరణ మర్శనాదుల నధిపా!
10.1-606-క.
పాడుచు నాడుచు ముచ్చట
లాడుచు నొండొరులఁ దాఁకు నాప్తులఁ గని బి
ట్టాడుచుఁ జేతులు వ్రేయుచుఁ 
గ్రీడింతురు నగుచు బలుఁడుఁ గృష్ణుఁడు నొకచోన్.
10.1-607-వ.
ఇవ్విధంబున.

భావము::
ఓ రాజా! పరీక్షిత్తు! బలరాముడు అడవిలో తిరిగి తిరిగి ఒక్కక్క సారి అలసిపోయి ఆ గొల్లబాలుర తొడల మీద తల పెట్టుకుని విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు కృష్ణుడు అన్నగారి వద్దకు చేరి ఆయన కాళ్ళు, చేతులు ఒత్తి అలసట పోగొట్టి సంతృష్టి పరచేవాడు. అప్పుడప్పుడు గోపబాలకులు ఆట లాడుతూ పాటలు పాడుతూ పరుగు పందాలు వేసుకుంటారు. ఆ అటలలో వారు పరుగెత్తుకుంటూ వచ్చి, బలరామకృష్ణులను తాకుతూ ఉంటారు. అటువంటి ఆప్తులైన గోపబాలురను చూసి వారిద్దరూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ చక్కలిగింతలు పెడుతూ క్రీడిస్తూ ఉంటారు. ఈ విధంగా. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=606

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, January 19, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 95

10.1-603-వ.
మఱియును.
10.1-604-సీ.
రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ!
రమ్ము భగీరథరాజతనయ! 
రా సుధాజలరాశి! రా మేఘబాలిక! ;
రమ్ము చింతామణి! రమ్ము సురభి! 
రా మనోహారిణి! రా సర్వమంగళ! ;
రా భారతీదేవి! రా ధరిత్రి! 
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! ;
రమ్ము మందాకిని! రా శుభాంగి!
10.1-604.1-ఆ.
యనుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
లడవిలోన దూరమందు మేయ
ఘనగభీరభాషఁ గడునొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.

భావము:
ఇంకా... ఇలా రావే ఓ పూర్ణచంద్రికా! రామ్మా గౌతమీగంగ! రావే భాగీరథీతనయా! ఇటు రా సుధాజలరాశి! రావమ్మ ఓ మేఘబాలిక! ఇలా రామ్మా చింతామణి! రామ్మా ఓ సురభి! రావే మనోహారిణీ! రమ్ము సర్వమంగళ! రా భారతీదేవీ! ఇటు రా ధరిత్రీ! రావమ్మా శ్రీమహాలక్ష్మీ! రావే మందమారుతి! రమ్ము మందాకిని! ఇలా రా శుభాంగీ! అంటు తన మేఘగర్జన లాంటి కంఠస్వరంతో అడవిలో దూర ప్రాంతాలకు పోయిన గోవులను వాటి పేరు పెట్టి పేరుపేరునా పిలుస్తున్నాడు. బహుచక్కటి ఆ పలుకుల గాంభీర్యానికి, మాధుర్యానికి ఆనందించి గోకులంలోని ఆభీరజనులు ఎంతో మెచ్చుకుంటున్నారు. 
గోవులు (జ్ఞానులు నామ రూప జ్ఞానాలు) మేస్తూ అడవిలో (సంసారాటవిలో) దూరదూరాల్లోకి దారితప్పి వెళ్ళి పోయాయి. శ్రీకృష్ణుడు గొల్లపిల్లలను (పసిమనసు లంత స్వచ్ఛమైన సిద్ధులను) చల్దులు తింటో (మననం చేస్తూ) ఉండ మని చెప్పి గోపాల బాలుడు బయలుదేరాడు ఇదిగో ఇలా, శ్రీకృష్ణ తత్వ ఆవిష్కరణ వెల్లడిస్తూ బమ్మెర వారు బ్రహ్మాండంగా అలతి పొలతి పదాలతో అలరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=604

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 94

10.1-602-సీ.
ఒకచోట మత్తాళి యూధంబు జుమ్మని; 
మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండు
నొకచోటఁ గలహంసయూధంబు గూడి కేం; 
కృతులు జేయంగఁ గేంకృతులు జేయు
నొకచోట మదకేకియూధంబు లాడంగ; 
హస్తాబ్జములు ద్రిప్పి యాడఁ దొడఁగు
నొకచోట వనగజయూధంబు నడవంగ; 
నయముతో మెల్లన నడవఁజొఁచ్చుఁ
10.1-602.1-ఆ.
గ్రౌంచ చక్ర ముఖర ఖగము లొక్కొకచోటఁ
బలుక వానియట్ల పలుకుఁ గదిసి
పులుల సింహములను బొడగని యొకచోటఁ
బఱచు మృగములందుఁ దఱచు గూడి.

భావము:
శ్రీకృష్ణ భగవానుడు వనవిహారం చేస్తూ ఒకచోట మదించిన తుమ్మెదలు జుంజుమ్మని ఎగురుతూ ఉంటే తాను కూడా వాటి తోపాటు ఝంకారం చేయసాగాడు; మరొకచోట కలహంస పంక్తులు క్రేంకారాలు చేస్తూంటే తాను కూడా క్రేంకారాలు చేసాడు; ఇంకొకచోట మదించిన నెమళ్ళు నాట్యం చేస్తుంటే తాను కూడా తామరపూల వంటి చేతులు త్రిప్పుతూ నాట్యం చేసాడు; వేరొకచోట మదపుటేనుగుల గుంపు మంద మందంగా నడుస్తూ ఉంటే తాను కూడా వాటి వలె మెల్ల మెల్లగా నడవసాగాడు; అలాగే ఒకొక్కచోట క్రౌంచపక్షులు చక్రవాకపక్షులు మొదలైనవి కూతలు పెడుతుంటే వాటి ననుసరించి తాను రెట్టించి కూతలు పెట్టాడు; ఒకచోట పులులు సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఆ మృగాల తోపాటు దూకుతూ పరుగులు తీసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=602

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, January 15, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 93

10.1-600-సీ.
నీ పాదములు సోఁకి నేడు వీరుత్తృణ; 
పుంజంబుతో భూమి పుణ్య యయ్యె
నీ నఖంబులు దాఁకి నేడు నానాలతా; 
తరుసంఘములు గృతార్థంబు లయ్యె
నీ కృపాదృష్టిచే నేడు నదీ శైల; 
ఖగ మృగంబులు దివ్యకాంతిఁ జెందె
నీ పెన్నురము మోవ నేడు గోపాంగనా; 
జనముల పుట్టువు సఫల మయ్యె”;
10.1-600.1-ఆ.
నని యరణ్యభూమి నంకించి పసులను
మిత్రజనులు దాను మేపు చుండి
నళినలోచనుండు నదులందు గిరులందు
సంతసంబు మెఱయ సంచరించె.
10.1-601-వ.
మఱియు నయ్యీశ్వరుండు.

భావము:
నీ యొక్క పాదాలు సోకి నేడు భూదేవి పూపొదలతో పెరిగిన పచ్చికలతో పావనమై పోయింది. రకరకాల తీగలూ చెట్లూ అన్నీ ఈవేళ నీ గోళ్ళు తాకి ధన్యములయ్యాయి. ఇక్కడ ఉన్న నదులూ పర్వతాలు పక్షులూ జంతువులూ నేడు నీ కరుణామయమైన దృష్టి సోకి దివ్యమైన కాంతిని పొందాయి. నీ విశాలమైన వక్షస్థలంపై వాలిన గోపికల జన్మలు ధన్యమయ్యాయి.” ఈవిధంగా పలుకుతూ వనభూములలో ప్రవేశించి తన మిత్రుల తోపాటు తాను పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరాలలోనూ పర్వత సానువుల పైననూ ఆనందంగా విహారం చేసాడు. అంతే కాకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=77&padyam=600

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, January 11, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 92

10.1-599-సీ.
నిఖిల పావనమైన నీ కీర్తిఁ బాడుచు; 
నీ తుమ్మెదలు వెంట నేగుదెంచె
నడవిలో గూఢుండవైన యీశుఁడ వని; 
ముసరి కొల్వఁగ వచ్చె మునిగణంబు
నీలాంబరముతోడి నీవు జీమూత మ; 
వని నీలకంఠంబు లాడఁ దొడఁగెఁ 
బ్రియముతోఁ జూచు గోపికలచందంబున; 
నినుఁ జూచె నదె హరిణీచయంబు
10.1-599.1-ఆ.
నీవు వింద వనుచు నిర్మలసూక్తులు
పలుకుచున్న విచటఁ బరభృతములు
నేఁడు విపినచరులు నీవు విచ్చేసిన
ధన్యులైరి గాదె తలఁచి చూడ.


భావము:
ఈ తుమ్మెదలు, సర్వులను పావనం చేయగల నీ కీర్తిని గానం చేస్తూ నీ వెనుకనే ఎగిరివస్తూ ఉన్నాయి. ఈ ఋషిపక్షులు నీవు ఈ అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడవు అని గుమికూడి నిన్ను సేవించడానికి వస్తూ ఉన్నాయి. నల్లని వస్త్రం ధరించిన నిన్ను చూసి మేఘము అనుకుని నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. గోపికలు నిన్ను ప్రేమతో చూస్తునట్లు ఈ ఆడలేళ్ళు, నిన్ను అనురాగంతో చూస్తున్నాయి. నీవు తమ అతిధివని కోకిలలు నీకు రాగయుక్తంగా స్వాగతం పాడుతున్నాయి. ఇవాళ నీ రాక చేత ఇక్కడ ఉండే వనచరులు అందరూ ధన్యులయ్యారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 91

10.1-598-శా.
శాఖాపుష్పఫలప్రభారనతలై చర్చించి యో! దేవ! మా
శాఖిత్వంబు హరింపు; మంచు శుకభాషన్ నీ కెఱింగించుచున్
శాఖాహస్తములం బ్రసూనఫలముల్ జక్కన్ సమర్పించుచున్
శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మ్రొక్కెడిం జూచితే.

భావము:
“అన్నా! బలదేవా! ఈ చెట్లు చూసావా? కొమ్మల నిండా నిండి ఉన్న పూలగుత్తుల బరువుతో, పళ్ళ భారంతో వంగిపోయి నీ పాదాలు స్పృశిస్తూ, నమస్కరిస్తూ ఉన్నాయి. తమ మీద వాలిన చిలుకల వాక్కులతో “ఓ దేవా! మా యీ వృక్షజన్మను పరిహరించి ఉత్తమ జన్మ ప్రసాదించ” మని తమ కోరికను నీకు వివ్నవిస్తూ ఉన్నాయి. తమ కొమ్మలు అనే చేతులతో పూవులు పండ్లు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్లు వరుసలు కట్టి నీ పాదపద్మాలకు చక్కగా మ్రొక్కుతూ ఉన్నాయి

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=77&padyam=598

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, January 8, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 90

10.1-597-వ.
అయ్యెడఁ గృష్ణుం డొక్కనాడు రేపకడ లేచి, వేణువు పూరించి బలభద్ర సహితుండై గోపకుమారులు దన్ను బహువారంబులు గైవారంబులు జేయ, మ్రోల నాలకదుపుల నిడుకొని నిరంతర ఫల కిసలయ కుసుమంబులును, కుసుమ మకరంద నిష్యంద పానానంద దిందింర కదంబంబును, గదంబాది నానాతరులతా గుల్మ సంకులంబును, గులవిరోధరహిత మృగపక్షిభరితంబును, భరితసరస్సరోరుహపరిమళమిళిత పవనంబును నైన వనంబుఁ గని యందు వేడుకం గ్రీడింప నిశ్చయించి వెన్నుం డన్న కిట్లనియె.


భావము:


ఇలా ఉండగా ఒక రోజు, కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని వేణుగానం చేసాడు. గోపకుమారులు అందరూ వెంటనే మేలుకుని లేగల మందలను తోలుకుని కృష్ణుడి వద్దకు చేరారు. బలరాముడు, కృష్ణులతో కలసి గోపబాలకులు తనను పదేపదే పొగడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అవ్ని ఋతువులలోనూ పళ్ళు పూలు చిగుళ్ళు లభిస్తాయి. పూవులలో తేనెలు పొంగిపొరలుతూ ఉంటే ఆ తీయతేనెలను త్రాగడానికి వచ్చి జుమ్ము జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేక రకాల చెట్లు, తీగలు, పొదరిళ్ళు, ఆ అడవి నిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు పక్షులు తమ తమ జాతి సహజములైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సుల లోని నీళ్ళు చక్కని తామర పూల పుప్పొడి పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారు అయిన బలరాముడితో ఇలా అన్నాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 89


10.1-595-వ.
అని చెప్పి మఱియు వ్యాసనందనుం డిట్లనియె
10.1-596-క.
రాగంబున బలకృష్ణులు
పౌగండవయస్కు లగుచుఁ బశుపాలకతా
యోగంబున బృందావన
భాగంబునఁ గాఁచి రంతఁ బశువుల నధిపా!

భావము:
ఇలా చెప్పి వ్యాసుని కుమారుడైన శుకయోగి ఇంకా ఇలా అన్నాడు. “బలరామకృష్ణులు ఈవిధంగా పౌగండ వయస్సు గల వారై అనురక్తితో పశువులను మేపుతూ గోపబాలురుతో కలసి బృందావనంలో విహరించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=76&padyam=596

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, January 6, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 88

10.1-593-క.
శ్రీపతి పదమను నావను 
బ్రాపించి భవాబ్ధి వత్సపదముగ ధీరుల్
రూపించి దాఁటి చేరుదు
రాపత్పద రహితు లగుచు నమృతపదంబున్.
10.1-594-ఆ.
అఘునిఁ జంపి కృష్ణుఁ డాప్తులు దానును
జల్ది గుడిచి జలజసంభవునకుఁ
జిద్విలాసమైన చెలువుఁ జూపిన కథఁ
జదువ వినినఁ గోర్కి సంభవించు.


భావము:
బుద్ధిమంతు లైనవారు శ్రీహరి పాదము అనే నావను ఆధారంగా చేసుకుని సంసారం అనే సముద్రాన్ని, ఒక లేగదూడ అడుగును అంగవేసి దాటినంత తేలికగా దాటి ఆపద అనే స్థితిని పొందకుండా, అమృత స్థితిని చేరుకుంటారు. శ్రీ కృష్ణుడు అఘాసురుని సంహరించడం ఆప్తులైన గోపబాలుర తోకూడి చల్దిఅన్నం ఆరగించడం బ్రహ్మకు తానే అన్నిటి యందూ అన్ని రూపాలలో ఉండటం అనే తన లీలలు చూపడం మొదలుగా గల ఈ కధను ఎవరు చదివినా ఎవరు విన్నా వారు కోరిన కోరిక తీరుతుంది.”



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 87

10.1-592-సీ.
“అఖిల జంతువులకు నాత్మవల్లభమైన; 
భంగి బిడ్డలు నిండ్లుఁ బసిఁడి మొదలు
వస్తువు లెవ్వియు వల్లభంబులు గావు; 
సకలాత్మకుండైన జలజనేత్రు
డఖిల జంతువులకు నాత్మ గావున ఘోష; 
వాసుల కెల్లను వల్లభత్వ
మున మిక్కిలొప్పెను మూడులోకములకు; 
హితము చేయఁగ జలజేక్షణుండు
10.1-592.1-ఆ.
మాయతోడ మూర్తిమంతుడై యొప్పారు; 
గలఁ డతండు నిఖిల గణము లందు
భవతిధాతు వెట్లు భావార్థమై సర్వ
ధాతు గణమునందుఁ దనరు నట్లు.

భావము:
జీవరాసులు అన్నింటికి “తనకు తాను ఇష్టమైనంత” బిడ్డలు గాని, ఇండ్లు గాని, బంగారం మొదలైన వస్తువులు గాని ప్రియమైనవి కావు. అన్నిటి యందు ఆత్మగా ఉన్న విష్ణువు అన్ని జీవరాసులలో “ఆత్మస్వరూపుడుగా” ఉన్నాడు. కనుకనే గోకుల నివాసులకు అందరికి ప్రియుడై చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పద్మముల వంటి కన్నులు ఉన్న విష్ణుమూర్తి మాయతో కూడిన రూపం ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇదంతా మూడు లోకాలకూ మేలు చేయడానికే. క్రియలను తెలిపే అన్ని ధాతువులకూ “భవతి” అనే ధాతువు భావంగా అంతర్లీనమై ఉంటుంది. అలాగే చరాచర సృష్టి లోని అన్నిటి యందూ విష్ణువు ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=76&padyam=592

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, January 1, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 86

10.1-590-క.
"కని మనిచి యెత్తి పెంచిన
తనుజన్ములకంటె నందతనయుం డా ఘో
షనివాసులకు మనోరం
జనుఁ డెట్లయ్యెను? బుధేంద్ర! చను నెఱిఁగింపన్."
10.1-591-వ.
అనిన శుకుం డిట్లనియె.


భావము:
“ఓ శుక మునీంద్రా! గోకులం లోని వారికి తాము కని పెంచిన తమ బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమపాత్రుడు ఎలా అయ్యాడు? నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు ఇది వివరించడం నీకే సాధ్యపడుతుంది.” అలా అడిగిన పరీక్షన్మహారాజునకు శుకమహర్షి ఇలా చెప్పసాగాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 85

10.1-587-వ.
ఆ సమయంబున.
10.1-588-క.
పెనుఁబాము దమ్ము మ్రింగిన
మన నందసుతుండు పాము మర్దించి మమున్
మనిచె నరణ్యములోపల
నని ఘోషించిరి కుమారు లా ఘోషములోన్.
10.1-589-వ.
అనిన విని నరేంద్రుం డిట్లనియె

భావము:
అప్పుడు ఆ బాలకులు గోకులంలో అడుగు పెడుతూనే అందరికీ వినిపించేటట్లు కేకలు వేస్తూ “మన నందగోపకుమారుడు అడవిలో ఒక పెద్ద పాముని చంపి మమ్మల్ని అందరిని రక్షించాడు” అని చాటి చెప్పారు.” శుకయోగి అలా చెప్పగానే పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=75&padyam=588

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :