Monday, June 28, 2021

శ్రీకృష్ణ విజయము - 269

( కృష్ణ కుమారోత్పత్తి )

10.2-279-వ.
అందు గోవిందనందనుండయిన ప్రద్యుమ్నునకు రుక్మి కూఁతు వలన ననిరుద్ధుండు సంభవించె ననిన మునివరునకు భూవరుం డిట్లనియె.
10.2-280-క.
“బవరమునఁ గృష్ణుచే ము
న్నవమానము నొంది రుక్మి యచ్యుతు గెలువం
దివురుచుఁ దన సుత నరిసం
భవునకు నెట్లిచ్చె? నెఱుఁగఁ బలుకు మునీంద్రా!”

భావము:
వారిలో గోవిందుని కుమారుడు ప్రద్యుమ్నుడికి రుక్మి కుమార్తె రుక్మవతి వలన అనిరుద్ధుడు ఉద్భవించాడు.” అని చెప్పగా రాజేంద్రుడు మునీంద్రునితో ఇలా అన్నాడు. “ఓ శుకయోగీంద్రా! యుద్ధంలో శ్రీకృష్ణుడిచేత అవమానం పొందిన రుక్మి, ఎలాగైనా శ్రీకృష్ణుడి మీద పగతీర్చుకోవాలని చూస్తున్నాడు కదా. అటువంటివాడు, తన శత్రువు కుమారుడికి తన కూతురును ఇచ్చి ఎలా వివాహం చేసాడు. ఈ సంగతి నాకు తెలియ చేయండి."

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=28&Padyam=280

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



Sunday, June 27, 2021

శ్రీకృష్ణ విజయము - 268

( కృష్ణ కుమారోత్పత్తి )

10.2-276-చ.
అనఘ! పదాఱువేల సతులందు జనించిరి వేఱువేఱ నం
దన దశకంబు తత్సుత వితానము గాంచి రనేక సూనుల
న్నెనయఁగ నిట్లు పిల్లచెఱ కీనిన కైవడిఁ బుత్త్ర పౌత్త్ర వ
ర్ధనమున నొప్పెఁ గృష్ణుఁడు ముదంబునఁ దామరతంపరై భువిన్.
10.2-277-తే.
అట్లు యదు వృష్ణి భోజాంధకాది వివిధ
నామధేయాంతరముల నెన్నంగ నూట
యొక్కటై చాల వర్ధిల్లె నక్కులంబు
నృపకుమారులఁ జదివించు నేర్పు గలుగు.
10.2-278-తే.
గురుజనంబులు విను మూఁడుకోట్లమీఁద
నెనుబదెనిమిదివేలపై నెసఁగ నూర్వు
రన్నఁ దద్బాలకావలి నెన్నఁదరమె
శూలికైనను దామరచూలికైన?

భావము:
శ్రీకృష్ణుడికి పదహారువేలమంది భార్యలలో ఒక్కొక్కరికి పదిమంది వంతున పుత్రులు ఉద్భవించారు ఆ పుత్రులు అందరికీ మళ్ళీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్లచెఱకుకు పిలకలు పుట్టినట్లు తామరతంపరగా విలసిల్లిన పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు. ఈ విధంగా యాదవ వృష్టి భోజ అంధక మొదలైన నూట ఒక్క పేర్లతో ఆ కులం వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్యనేర్పడం కోసమే గురువర్యులే మూడుకోట్ల ఎనభైవేల ఒకవంద మంది ఉన్నారంటే, ఇక ఆ రాజకుమారుల సంఖ్యలు వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా పరమేశ్వరుడికైనా సాధ్యం కాదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=28&Padyam=278

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



శ్రీకృష్ణ విజయము - 267

( కృష్ణ కుమారోత్పత్తి )

10.2-275-వ.
మఱియు, ననేకవిధ విచిత్రమణివితానాభిశోభిత ప్రాసాదోపరిభాగంబులను, లాలిత నీలకంఠ కలకంఠ కలవింక శుక కలాప కలిత తీరంబులను, మకరందపానమదవదిందిందిర ఝంకార సంకుల కమల కహ్లార సుధాసార నీహార పూరిత కాసారంబులను, ధాతు నిర్ఝర రంజిత సానుదేశగిరి కుంజపుంజంబులను, గృతకశైలంబులను, గ్రీడాగృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనందనం దగిలి కందర్పకేళీలోలాత్ముండయ్యె; ననంతరంబా సుందరీలాలామంబువలనఁ బ్రద్యుమ్నుండు, చారుధేష్ణుండు, చారుదేవుండు, సుధేష్ణుండు, సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు తనయులం బడసె; నట్లు సత్యభామా జాంబవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేఱువేఱ పదుగురేసి భద్రమూర్తు లైన కుమారు లుదయించి; రవ్విధంబున మఱియును.

భావము:
నానావిధములైన విచిత్రమణులతో శోభించే చాందినీలతో విలసిల్లె ప్రాసాదాలలోనూ; పెంపుడు నెమళ్ళతో, కోకిలలతో, పిచ్చుకలతో, చిలుకల పలుకులతో నిండినది; మకరందపానము చేసి మదించిన తుమ్మెదల ఝంకారములు నిండిన తెల్లని పద్మాలు, చల్లని మధుర జలాలతో కూడిన కమనీయ సరోవరతీరాలలో; ఖనిజాలపై ప్రవహించే జలప్రవాహాలతో ఎఱ్ఱనైన కొండచరియల పొదరిండ్లలో; లీలాపర్వతాలలో; క్రీడాగృహాలలో ఆ నందుని కుమారుడు శ్రీకృష్ణుడు, విదర్భరాకుమారి రుక్మిణీదేవితో కలిసి మన్మథవిలాసాలలో మునిగితేలాడు. అంతట, రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మాద్రి, మిత్రవింద, భద్రలకు కూడా ఒక్కొక్కరికి పదిమంది చొప్పున అందమైన కుమారులు ఉదయించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=28&Padyam=275

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, June 26, 2021

శ్రీకృష్ణ విజయము - 266

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-273-చ.
ఎలమి ఘటింపఁగాఁ గలసి యీడెల నీడల మల్లికా లతా
వలిఁ గరవీరజాతి విరవాదుల వీథులఁ గమ్మ దెమ్మెరల్‌
వొలయు నవీనవాసములఁ బొన్నలఁ దిన్నెలఁ బచ్చరచ్చలం
గొలఁకుల లేఁగెలంకులను గోరిక లీరిక లొత్తఁ గ్రొత్తలై.
10.2-274-క.
ఆరామభూములందు వి
హారామల సౌఖ్యలీల నతిమోదముతో
నా రామానుజుఁ డుండెను
నా రామామణియుఁ దాను నభిరామముగన్.

భావము:
ఆ దంపతులు ఇద్దరూ కిత్తలి చెట్ల నీడలలో, మల్లెపొదలలో, విరజాజి నికుంజాలలో, గన్నేరుచెట్ల గుబురులలో, చిరుగాలులకు పులకరించే పొన్నచెట్ల క్రింది వేదికలపైనా, మరకతమణి సౌధాలలో సరోవరతీరాలలో తనివితీరా విహరించారు. బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు రమణీయమైన ఉద్యానవనాలలో రమణీమణి అయిన రుక్మిణితో కూడి విహరించి ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=274

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 265

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-269-క.
"అని యిట్లు కృష్ణుఁ డాడిన
వినయ వివేకానులాప వితతామృత సే
చన ముదిత హృదయయై య
వ్వనితామణి వికచ వదన వనరుహ యగుచున్.
10.2-270-క.
నగ వామతించు చూపులు
నగధరు మోమునను నిలిపి నయమునఁ గరముల్‌
మొగిచి వినుతించెఁ గృష్ణున్
ఖగవాహున్ రుచిరదేహుఁ గలితోత్సాహున్.
10.2-271-చ.
అతుల విరాజమానముఖుఁడై వివిధాంబర చారుభూషణ
ప్రతతులతోడఁ గోరిన వరంబులు దద్దయుఁ నిచ్చెఁ గృష్ణుఁ డు
న్నతశుభమూర్తి దేవగణనందితకీర్తి దయానువర్తియై
యతిమృదువాణికిం గిసలయారుణపాణికి నీలవేణికిన్.

భావము:
“ఈ విధంగా శ్రీకృష్ణుడు ఇంపుగా, ఊరడింపుగా, వినసొంపుగా పలికాడు. ఆ అమృతధారల వంటి ముచ్చట పలుకుల జల్లులకు రుక్మిణీదేవి మనసు సంతోషించింది; ముఖారవిందం సంతోషంతో వికసించింది. అప్పుడు రుక్మిణి చిరునవ్వుతో నిండిన చూపులతో శ్రీకృష్ణుడి వైపు చూసి, చేతులు జోడించి, ఆ గరుత్మంతుడు వాహనంగా గలవాడు, ఆ జగన్మోహనుడు, ఆ దేవదేవుడు, ఆ శ్రీకృష్ణుడిని స్తుతించింది. ఉన్నతమైన మంగళమూర్తీ, దయాపరిపూర్ణ వర్తనుడు, సకల దేవతల స్తోత్రాలకు పాత్రుడైన వాడు అయిన శ్రీకృష్ణుడు మిక్కిలి సంతోషంతో ప్రకాశించే ముఖం కలవాడై చిగురుటాకువలె ఎఱ్ఱని హస్తములూ, నల్లని కురులూ, మృదుమధుర పలుకులు పలుకునది అయిన రుక్మిణీదేవికి అనేక రకాల వస్త్రాలనూ, అందమైన ఆభరణాలనూ బహూకరించాడు కోరిన కోరికలు తీర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=271

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, June 22, 2021

శ్రీకృష్ణ విజయము - 264

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-268-వ.
అని వెండియు నిట్లనియె “నీవాక్యంబులు శ్రవణసుఖంబుగావించె; నీవు వివిధంబులైన కామంబులు గోరితివేని, నవియన్నియు నాయంద యుండుటం జేసి యేకాంతసేవాచతుర వైన నీకు నవి యన్నియు నిత్యంబులై యుండు; నీ పాతివ్రత్యంబును, నా యందలి స్నేహంబు నతివిశదంబు లయ్యె; నావాక్యములచేత భవ దీయచిత్తంబు చంచలంబు గాక నా యందలి బుద్ధి దృఢంబగుం గావున సకలసంపద్విలసితంబైన ద్వారకానగర దివ్యమందిరంబు లందు నీదు భాగ్యంబునం జేసి సంసారికైవడి నీ యందు బద్ధానురాగుండనై వర్తింతుఁ; దక్కిన ప్రాణేంద్రియ పరవశత్వంబున వికృత శరీరధారిణియైన సతి నన్నుం జెందుట దుష్కరం; బదియునుం గాక మోక్షప్రదుండనైన నన్నుఁ గామాతురలైన యల్పమతులు వ్రతతపోమహిమలచేత దాంపత్య యోగంబుకై సేవింతు; రదియంతయు నా మాయా విజృంభితంబు; దానంజేసి వారు మందభాగ్యలై నిరయంబు నొందుదు; రట్లుగావున నీ సమానయైన కాంత యే కాంతలందైనఁ గలదె? నీ వివాహకాలంబు ననేక రాజన్యవర్యులఁ గైకొనక భవదీయ మధురాలాప శ్రవణాత్మకుండనైన నా సన్నిధికి "నా శరీరం బితర యోగ్యంబు గాదు; నీకు శేషంబనయి యున్న దాన" నని యేకాంతంబునం బ్రాహ్మణుం బుత్తెంచిన నేనును జనుదెంచి, నీ పరిణయసమయంబున భవత్సహోదరుంబట్టి విరూపుం గావించిన నది గనుంగొనియును నా యందలి విప్రయోగ భయంబున నూరకుండితి; వదిగావున బహుప్రకారంబులై వర్తించు నీ సద్గుణంబులకు సంతసింతు!”నని యివ్విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగ గృహస్థునిభంగి నిజగృహకృత్యంబు లాచరించుచుండె"నని శుకుండు మఱియు నిట్లనియె.

భావము:
నీ పలుకులు నాకు శ్రవణానందాన్ని కలిగించాయి. నీవు ఏవి కోరినా అవన్నీ, నా వద్దే ఉన్నాయి కనుక, ఏకాంతసేవాచతుర వైన నీకు అవన్నీ లభిస్తాయి. నీ పాతివ్రత్యమూ, నా మీది ప్రేమా స్పష్టమయ్యాయి. నా మాటలచేత నీమనస్సు సంచలించకుండా, నా మీది నీ అనురాగం ఇంకా ధృడమవుతుంది. కాబట్టి సమస్త భోగభాగ్యాలతో నిండిన ఈ ద్వారకానగర దివ్యమందిరాలలో కేవలం ఒక గృహస్థు లాగా నీ మీద బద్ధానురాగంతో ప్రవర్తిస్తాను. ఇదంతా నీ అదృష్టం. ఏ ఇంద్రియలోలురాలైన వికృత స్వరూపిణికి అయినా నన్ను పొందడం దుష్కరం. అంతే కాదు మోక్షదాయకుడ నైన నన్ను కామాతురా లైన అల్పబుద్ధులు వ్రతాలతో, తపస్సుతో, దాంపత్య జీవితం కోసం సేవిస్తుంటారు. ఆ భావం నా మాయవలన విజృంభించిందే. అందువలన వారు భాగ్యవిహీనలై నరకాన్ని పొందుతారు. నీతో సమానమైన స్త్రీ ఈ లోకంలో లేదు. నీవు వివాహకాలంలో ఎందరినో గొప్ప గొప్ప రాజన్యులను తిరస్కరించావు. ”నేను నీదానను. ఈ నా దేహం మీద అన్యులెవ్వరికీ అధికారం లేదు.” అంటూ బ్రాహ్మణుని నా దగ్గరకు పంపించావు. నేను నీ ఆహ్వానం మన్నించి వచ్చి, నిన్ను వివాహమాడే సందర్భంలో నీ సోదరుడిని వికారస్వరూపుడిగా కావించాను. అది చూసి కూడా నా వియోగాన్ని సహింపలేక ఊరుకున్నావు. ఇటువంటి నీ సద్గుణాలకు ఎంతో సంతోషించాను.” అని ఈవిధంగా ఆమెను అనునయించాడు. ఈ మాదిరి, దేవకీతనయుడు శ్రీకృష్ణుడు మానవలోక ధర్మాన్ని అనుసరించి, గృహస్థువలెనే తన గృహకృత్యాలను ఆచరిస్తున్నా” డని శుకుడు తెలిపి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=268

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


Monday, June 21, 2021

శ్రీకృష్ణ విజయము - 263

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-267-ఉ.
"నీవు పతివ్రతామణివి నిర్మల ధర్మవివేక శీల స
ద్భావవు నీ మనోగతులఁ బాయక యెప్పుడు నస్మదీయ సం
సేవయ కాని యన్యము భజింపవు; పుట్టిన నాఁటనుండి నీ
భావ మెఱింగి యుండియును బల్కిన తప్పు సహింపు మానినీ!

భావము:
“దేవీ! రుక్మిణీ! నీవు మహాపతివ్రతవు, సౌశీల్యవతివి నా సేవ తప్ప నీకు బాల్యంనుండి ఇతర ఆలోచనలు లేవు. ఇదంతా తెలిసినప్పటికీ, నిన్ను బాధపెట్టాను. తప్పే. నన్ను మన్నించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=267

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


Sunday, June 20, 2021

శ్రీకృష్ణ విజయము - 262

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-263-చ.
"అలికులవేణి! నవ్వులకు నాడినమాటల కింత నీ మదిం
గలఁగఁగ నేల? వేఁటలను గయ్యములన్ రతులందు నొవ్వఁగాఁ
బలికినమాట లెగ్గు లని పట్టుదురే? భవదీయ చిత్తముం
దెలియఁగఁ గోరి యేఁ బలికితిన్ మదిలో నిటు గుంద నేఁటికిన్?
10.2-264-వ.
అని మఱియు నిట్లనియె.
10.2-265-ఉ.
కింకలు ముద్దుఁబల్కులును గెంపుఁగనుంగవ తియ్యమోవియున్
జంకెలు తేఱిచూపు లెకసక్కెములున్ నెలవంక బొమ్మలుం
గొంకక వీడనాడుటలుఁ గూరిమియుం గల కాంతఁ గూడుటల్‌
అంకిలి లేక జన్మఫల మబ్బుట గాదె కురంగలోచనా! "
10.2-266-వ.
అని మఱియు నిట్లనియె.

భావము:
“తుమ్మెదల బారు వంటి శిరోజాలు గల సుందరీ! రుక్మిణీ! నేను నవ్వులాటకు అన్న మాటలకు నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు. వేట, రణరంగం, రతి సమయాలలో, సూటిపోటి మాటలు మాట్లాడినా తప్పుగా భావించరాదు. నీ మనస్సు తెలుసుకోవడం కోసం ఇలా అన్నాను. ఈ పాటిదానికి నీవు బాధచెంద వద్దు. అదీకాక హరిణలోచనాల సుందరీ! రుక్మిణీ! కినుకలు, మురిపెపు మాటలు, బెదరింపు చూపులు, తియ్యని కెమ్మోవి, ఎకసెక్కాలు, నకక్షతములు, విదిలింపులు, అదలింపులు గల వలపుల చెలువలతో సమాగమం లభిస్తే జన్మ సఫలమైనట్లే కదా!” అని అంటూ ఇంకా ఇలా అనునయించసాగాడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=265

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, June 17, 2021

శ్రీకృష్ణ విజయము - 261

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-261-ఆ.
పృథు రజోగుణప్రవృద్ధమైనట్టి నీ
దృష్టిచేత నన్నుఁ దేఱుకొనఁగఁ
జూచు టెల్ల పద్మలోచన! నా మీఁద
ఘనదయార్ద్రదృష్టిగాఁ దలంతు.
10.2-262-వ.
అదియునుంగాక, మధుసూదనా! నీవాక్యంబులు మిథ్యలుగావు; తల్లి వచనంబు కూఁతున కభిమతంబుగాదె? యౌవనారూఢమదంబున స్వైరిణి యగు కామిని పురుషాంతరాసక్త యగుట విచారించి పరిజ్ఞాని యైనవాఁడు విడుచు; నవివేకి యయిన పురుషుం డింద్రియలోలుండై రతిం దగిలి దాని విడువనేరక పరిగ్రహించి యుభయలోకచ్యుతుండగు; నట్లుగావున నీ యెఱుంగని యర్థంబు గలదే?” యని విన్నవించిన రుక్ష్మిణీదేవి వచనంబులకుఁ గృష్ణుండు సంతసిల్లి యిట్లనియె.

భావము:
రాజీవలోచనా! శ్రీకృష్ణా! రాజసంతో విరాజిల్లే నీ దృష్టితో నన్ను తేరుకొనేటట్లు చూడడం నన్ను దయార్ద్రదృష్టితో చూడడం గానే భావిస్తాను. ఓ కృష్ణా! నీ వాక్యాలు అసత్యాలు కావు కన్నతల్లి మాట గారాబు కుమార్తెకు అభిమతమేకదా యౌవనమదంతో స్వైరిణియైన కామిని అన్యపురుషాసక్త అయితే జ్ఞానవంతుడు ఆమెను పరిత్యజిస్తాడు. అవివేకి ఇంద్రియలోలత్వంతో ఆ స్త్రీని విడువలేక ఇహపర లోకాలు రెండింటికి భ్రష్టు డౌతాడు. అందువలన నీకు తెలియని ధర్మం లేదు.” అని రుక్మిణి విన్నవించింది. కృష్ణుడు ఎంతో సంతోషించి, ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=262

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, June 16, 2021

శ్రీకృష్ణ విజయము - 260

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-259-క.
ధరణీనాథులు దమతమ
వరవనితామందిరముల వసియించుచు గో
ఖర మార్జాలంబుల గతి
స్థిరబద్ధు లగుదురు నిన్నుఁ దెలియని కతనన్.
10.2-260-ఆ.
జలజనాభ! సకల జగ దంతరాత్మవై
నట్టి దేవ! నీ పదారవింద
యుగళి సానురాగయుక్తమై నా మదిఁ
గలుగునట్లు గాఁగఁ దలఁపు మనఘ!

భావము:
సర్వేశ్వరుడిని నిన్ను గుర్తించ లేని రాజులు తమ ప్రేయసీ మందిరాలలో నివసిస్తూ పశువులు లాగా, గాడిదలు లాగ, పిల్లులు లాగ స్థిరంగా బంధింపబడుతూ ఉంటారు. ఓ పద్మనాభా! సకల జగదంతర్యామివి అయిన నీ పాదపద్మాలమీద నా బుద్ధి నిరంతరం అనురాగంతో ప్రసరించేటట్లు అనుగ్రహించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=260

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 259

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-257-సీ.
నీరదాగమమేఘనిర్యత్పయః పాన-
  చాతకం బేగునే చౌటి పడెకుఁ?
బరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు-
  కీరంబు సనునె దుత్తూరములకు?
ఘనర వాకర్ణనోత్కలిక మయూరము-
  గోరునే కఠిన ఝిల్లీరవంబుఁ?
గరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహ-
  మరుగునే శునక మాంసాభిలాషఁ
10.2-257.1-తే.
బ్రవిమలాకార! భవదీయ పాదపద్మ
యుగ సమాశ్రయ నైపుణోద్యోగచిత్త
మన్యుఁ జేరునె తన కుపాస్యంబు గాఁగ?
భక్తమందార! దుర్భర భవవిదూర!
10.2-258-క.
వాసవవందిత! భవ కమ
లాసన దివ్యప్రభా సభావలి కెపుడున్
నీ సమధిక చారిత్ర క
థా సురుచిరగాన మవితథం బయి చెల్లున్.

భావము:
ఓ భవ దురా! శుభాకారా! ఓ భక్తమందారా! వర్షాకాలంలో మేఘంనుండి వెలువడే జల బిందువులను, ఆస్వాదించే చాతకపక్షి చవిటిగుంట లోని నీటి కోసం వెళుతుందా? పండిన మామిడిపండ్ల రసాన్ని గ్రోలే చిలుక, ఉమ్మెత్తలను ఆశ్రయిస్తుందా? నీలమేఘ గర్జనాన్ని విని ఆనందించే నెమలి, ఈల పురుగు ధ్వనిని కోరుకుంటుందా? ఏనుగు కుంభస్థలం లోని మాంసాన్ని భుజించే సింహం, కుక్కమాంసం కోసం కక్కుర్తిపడుతుందా? ఈ నీ పాదపద్మ ద్వయాన్ని కోరి ఆశ్రయించి ఆనందించే హృదయం మరొక దానిని ఎందుకు అభిలషిస్తుంది? దేవేంద్రునిచేత స్తుతింపబడు ఓ దేవాధిదేవా! కైలాసంలోనూ సత్యలోకంలోనూ ఎప్పుడూ నీ దివ్యగాథలే కమ్మగా గానం చేయబడుతూ ఉంటాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=258

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, June 14, 2021

శ్రీకృష్ణ విజయము - 258

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-255-మ.
విమలజ్ఞాననిరూఢులైన జనముల్‌ వీక్షింప మీ పాద కం
జమరందస్ఫుట దివ్యసౌరభము నాస్వాదించి నిర్వాణ రూ
పము సత్పూరుష వాగుదీరితము శోభాశ్రీనివాసంబు నౌ
మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే?
10.2-256-వ.
మఱియును దేవా! భూలోకంబునందును, నిత్యనివాసంబునందును, సకల ప్రదేశంబులందును జగదీశ్వరుండ వయిన నిన్ను నభిమతంబులయిన కామరూపంబులు గైకొని వరియింతు; భవదీయ చరణారవింద మకరందాస్వాదన చాతుర్యధుర్యభృంగియైన కామిని యతి హేయంబైన త్వక్‌ శ్మశ్రు రోమ నఖ కేశంబులచేతఁ గప్పంబడి యంతర్గతంబయిన మాంసాస్థి రక్త క్రిమి విట్కఫ పిత్త వాతంబుగల జీవచ్ఛవంబయిన నరాధముని మూఢాత్మయై కామించునే? యదియునుంగాక.

భావము:
నిర్మల జ్ఞానధనులు వీక్షిస్తుండగా మీ పాదకమల మకరంద మాధుర్య సౌరభాలను ఆస్వాదిస్తూ, మోక్ష దాయకమూ, సత్పురుషుల స్తుతికి పాత్రమూ, శుభావహమూ అయిన మీ మూర్తిని సేవించని చెడు బుద్ధి కలిగిన నీచ మానవుడిని ఎవరు సేవిస్తారు? ఓ దేవా! అంతేకాక, సకల చరాచర ప్రపంచానికి అధీశ్వరుడ వైన నిన్ను భూలోకంలోనూ, వైకుంఠంలోనూ సమస్త ప్రదేశాలలోనూ నేను అభిమతాలైన కామరూపాలు స్వీకరించి నిన్నే సేవిస్తాను. నీ పాదకమల మకరందాన్ని ఆనందంగా ఆస్వాదించే నేర్పుకల తుమ్మెద వంటి ఏ స్త్రీ అయినా, ఎముకలతో మాంసంతో చర్మాదులతో కప్పబడిన జీవచ్ఛవంలా ఉండే నరాధముణ్ణి ఎక్కడైనా కామిస్తుందా? అంతే కాకుండా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=256

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 257

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-252-చ.
నిను వరియించినం బెలుచ నీరజలోచన! శార్‌ఙ్గ సాయకా
సన నినదంబులన్ సకల శత్రుధరాపతులన్ జయించి బో
రన పశుకోటిఁ దోలు మృగరాజు నిజాంశము భూరిశక్తిఁ గై
కొనిన విధంబునన్ నను నకుంఠిత శూరతఁ దెచ్చి తీశ్వరా!
10.2-253-ఉ.
అట్టి నృపాల కీటముల నాజి నెదుర్పఁగ లేనివాని య
ట్లొట్టిన భీతిమై నిటు పయోధిశరణ్యుఁడ వైతి వింతయున్
నెట్టన మాయ గాక యివి నిక్కములే? భవదీయ భక్తు లై
నట్టి నరేంద్రమౌళిమణు లంచిత రాజఋషుల్‌ ముదంబునన్.
10.2-254-ఆ.
వితత రాజ్యగరిమ విడిచి కాననముల
నాత్మలందు మీ పదాబ్జయుగము
వలఁతి గాఁగ నిలిపి వాతాంబు పర్ణాశ
నోగ్రనియతు లగుచు నుందు రభవ!

భావము:
ఓ నీరజలోచనా! మహాప్రభూ! నిన్నే అమితంగా వరించాను. ఆనాడు శార్ఙ్గ మనే నీ ధనుస్సు చేసిన టంకారంతో, సమస్త శత్రురాజులను జయించి మృగరాజు మృగాలను పారద్రోలి తన భాగాన్ని గ్రహించినట్లు, అసమాన శూరత్వంతో నీ దానను అయిన నన్ను పరిగ్రహించావు. అటువంటి రాచపురుగులను రణరంగంలో ఎదిరించలేక భయపడినట్లు, నీవు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పాటు చేసుకున్నావు. ఇది నీ మాయ కాక వాస్తవమా? నీ భక్తులైన రాజాధిరాజులు రాజర్షులు సంతోషంతో ఓ జన్మరహితా! సమస్త రాజ్య సంపదలను వదలి అరణ్యాలకు వెళ్ళి నీ పాదపద్మాలనే ధ్యానిస్తూ; నీరు, గాలి, ఆకులు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉగ్రమైన నియమాలను పాటిస్తూ తపస్సులు చేస్తూ ఉంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=254

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, June 12, 2021

శ్రీకృష్ణ విజయము - 256

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-250-ఆ.
వరమునీంద్ర యోగివర సురకోటిచే
వర్ణితప్రభావవైభవంబు
గలిగి యఖిలచేతనులకు విజ్ఞాన ప్ర
దుండ వగుదు వభవ! దురితదూర!
10.2-251-వ.
దేవా! భవదీయ కుటిల భ్రూవిక్షేపోదీరిత కాలవేగంబుచేత విధ్వస్తమంగళు లగు కమలభవ భవ పాకశాసనాదులం దిరస్కరించినట్టి మదీయ చిత్తంబున.

భావము:
ఓ జన్మరహితా! పాపములను తొలగించు వాడ! మునీంద్రులచే యోగివరులచే దేవతలచే వర్ణితమైన ప్రభావము కలిగిన నీవు, జీవులు సర్వులకు విజ్ఞానమును ఇచ్చువాడవు. ఓ భగవంతుడా! నీ కనుబొమలు ముడిపడినంత మాత్రాన సకల సౌభాగ్యాలు కోల్పోయి చెదరి బెదరిపోయే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, దేవేంద్రుడు మున్నగువారిని అందరినీ తిరస్కరించిన నా హృదయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=251

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 255

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-249-వ.
శబ్ద స్పర్శ రూప రస గంధంబు లనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, యజ్ఞానాంధకార నివారకంబైన రూపంబుఁ గైకొని, భవదీయులైన సేవకులకు ననుభావ్యుండ వైతి; భవత్పాదారవింద మకరందరసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గా; దట్లగుటం జేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమిసెప్ప? నిట్టి యీశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున నదియును నా కభిమతంబు గావున నిన్ను నే ననుసరింతు; దేవా! నీవకించనుఁడవైతేని బలిభోక్తలయిన బ్రహ్మేంద్రాదు లెవ్వనికొఱకు బలిసమర్పణంబు సేసిరి? నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపి వనియును నీ యందలి ప్రేమాతిశయంబులం జేసి విజ్ఞానదీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై యిహసౌఖ్యంబులు విడిచి సుమతులు భవదీయదాస సంగంబు గోరుచుండుదు; రట్లు సేయనేరక నిజాధికారాంధకారమగ్ను లైన వారు భవత్తత్త్వంబు దెలిసి బలిప్రక్షేపణంబులు సేయంజాలక మూఢులై సంసారచక్రంబునం బరిభ్రమింతు; రదియునుంగాక.

భావము:
దేవా! శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే గుణాలచేత పరిగ్రహింబడిన మంగళాకారుడవు నీవు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే రూపాన్ని పొంది నీభక్తులచే సేవింపబడుతున్నావు. నీ పాదపద్మ మకరందరసాన్ని ఆస్వాదించే యోగీంద్రులకు కూడా నీ మార్గం అంతుపట్టదు. ఇంక ఈ మానవ పశువులకు ఊహింపను కూడా రానిది కావడంలో ఆశ్చర్యము ఏముంది? ఇట్టి పరమేశ్వరుడైన నీవు స్వతంత్రుడవు. నిన్ను నేను అనుసరిస్తున్నాను. నీవు దరిద్రుడవైతే పూజాద్రవ్యాలను స్వీకరించే బ్రహ్మేంద్రాది దేవతలు పూజాద్రవ్యాలను ఎవరికి సమర్పిస్తున్నారు. నీవు సమస్త పురుషార్థ మయుడవనీ, ఫలస్వరూపివనీ భావించి నీ మీది ప్రేమచేత సమస్తదోషాలనే అంధకారాన్ని విజ్ఞాన మనే దీప కళికతో అణచివేసి, ఇహలోక సౌఖ్యాలను వదలివేసి, సత్పురుషులు నీ సన్నిధిని కోరుతున్నారు. అలా కాకుండా అధికార మనే అంధకారంలో మునిగి నీ తత్వం తెలుసుకోలేక, నిన్ను పూజించని వారు సంసారచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=249

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, June 11, 2021

శ్రీకృష్ణ విజయము - 254

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-248-సీ.
రూఢిమైఁ బ్రకృతి పూరుష కాలములకు నీ-
  శ్వరుఁడవై భవదీయ చారుదివ్య
లలితకళా కౌశలమున నభిరతుఁడై-
  కడఁగు నీ రూప మెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణసముచ్చయయుక్త మూఢాత్మ-
  నయిన నే నెక్కడ? ననఘచరిత!
కోరి నీ మంగళ గుణభూతి గానంబు-
  సేయంగఁబడు నని చెందు భీతి
10.2-248.1-తే.
నంబునిధి మధ్యభాగమం దమృత ఫేన
పటల పాండుర నిభమూర్తి పన్నగేంద్ర
భోగశయ్యను బవ్వళింపుచును దనరు
నట్టి యున్నతలీల దివ్యంబు దలఁప.

భావము:
ఓ మహాత్మా! పుణ్యమూర్తీ! నీవు ప్రకృతి పురుషులకూ, కాలానికీ ఈశ్వరుడవు. కళాకౌశలంతో శోభించే నీ మనోహరమైన రూపము ఎక్కడ? త్రిగుణాలతో గూడిన మూఢురాలను నేనెక్కడ? నీ సద్గుణ సంపద దానం కీర్తింపబడుతుం దనే సందోహంతో ఎవరికీ అందకుండా పాలసముద్రంలో శేషతల్పంపై పవ్వళిస్తున్నావేమో. ఇటువంటి నీ లీలలు దివ్యములైనవి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=248

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, June 9, 2021

శ్రీకృష్ణ విజయము - 253

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-246-క.
“మురహర! దివసాగమ దళ
దరవిందదళాక్ష! తలఁప నది యట్టి దగున్
నిరవధిక విమలతేజో
వరమూర్తివి; భక్తలోకవత్సల! యెందున్.
10.2-247-తే.
సంచితజ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు
లాదిగాఁ గల సుగుణంబు లమరు నీకు;
నేను దగుదునె? సర్వలోకేశ్వరేశ!
లీలమై సచ్చిదానందశాలి వనఘ!

భావము:
“ఓ మురాంతకా! ఉదయాన వికసిస్తున్న తామర పూరేకులను బోలిన నేత్రములతో శోభించు వాడా! భక్తులను వాత్సల్యముతో రక్షించు దేవా! శ్రీకృష్ణా! నీవు అన్ని రకాలగానూ అనంత తేజోమూర్తివే. ఓ సర్వలోకేశ్వరా! సచ్చిదానందమూర్తీ! పుణ్యపురుషా! జ్ఞానము సుఖము బలము ఐశ్వర్యము మున్నగు సద్గుణాలు సర్వం నీలోనే నెలకొని ఉన్నాయి. నీకు నేను తగినదాననా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=247

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 252

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-243-క.
మురసంహరుఁ డిందిందిర
గరుదనిలచలత్ప్రసూనకలికాంచిత సుం
దరశయ్యఁ జేర్చె భీష్మక
వరపుత్రిన్ నుతచరిత్ర వారిజనేత్రన్.
10.2-244-వ.
ఇట్లు పానుపునం జేర్చి మృదుమధుర భాషణంబుల ననునయించిన.
10.2-245-క.
పురుషోత్తము ముఖకోమల
సరసిజ మయ్యిందువదన సవ్రీడా హా
సరుచిస్నిగ్ధాపాంగ
స్ఫుర దవలోకనము లొలయఁ జూ చిట్లనియెన్.

భావము:
మురాసురుని సంహరించినవాడు, శ్రీకృష్ణుడు శీలవతీ కమలలోచన, భీష్మకుని ఇంట అవతరించిన సాక్షాత్తు లక్ష్మీదేవీ అయిన రుక్మిణిని తుమ్మెదల రెక్కల గాలికి కదులుతున్న పూలతో కూడిన అందమైన పాన్పు పైకి చేర్చాడు. ఈ విధంగా పాన్పుపైచేర్చి మనోహరమైన మధురవాక్కులతో ఊరడించగా చంద్రబింబం వంటి మోము కల ఆ రుక్మిణీదేవి పురుషోత్తముని అందమైన ముఖారవిందాన్ని సిగ్గు తోకూడిన స్నిగ్ధమైన చూపులతో చూస్తూ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=245

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, June 7, 2021

శ్రీకృష్ణ విజయము - 251

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-241-సీ.
కని సంభ్రమంబునఁ దనువునం దనువుగా-
  ననువునఁ జందనం బల్ల నలఁది
కన్నీరు పన్నీటఁ గడిగి కర్పూరంపుఁ-
  బలుకులు సెవులలోఁ బాఱ నూఁది
కరమొప్ప ముత్యాలసరుల చి క్కెడలించి-
  యురమునఁ బొందుగా నిరవుకొలిపి
తిలకంబు నునుఫాలఫలకంబుపైఁ దీర్చి-
  వదలిన భూషణావళులఁ దొడిగి
10.2-241.1-తే.
కమలదళ చారు తాలవృంతమున విసరి
పొలుచు పయ్యెదఁ గుచములఁ బొందుపఱిచి
చిత్త మిగురొత్త నొయ్యన సేదఁదీర్చి
బిగియఁ గౌఁగిటఁ జేర్చి నె మ్మొగము నిమిరి.
10.2-242-తే.
నెరులుగల మరునీలంపు టురుల సిరుల
నరులుగొనఁ జాలి నరులను మరులు కొలుపు
యిరులు గెలిచిన తుమ్మెద గఱులఁ దెగడు
కురుల నులిదీర్చి విరు లిడి కొప్పువెట్టి.

భావము:
శ్రీకృష్ణుడు వేగిరంగా ఆమె దేహానికి బాగా మంచిగంధం పూశాడు. కర్పూరపు పలుకుల్ని చెవులలో ఊదాడు. పన్నీటితో కన్నీటిని కడిగాడు. ముత్యాల మాలల చిక్కు తీసి వక్షస్థలం మీద సరిచేసాడు. ముఖాన తిలకం సరిదిద్దాడు. జారిపోయిన భూషణాలను అన్నిటినీ చక్క చేసాడు. తామరరేకుల విసనకఱ్ఱతో విసిరాడు. పైటను సరిచేసాడు. ముఖం నిమిరాడు. గట్టిగా కౌగలించుకుని సేదదీర్చి హృదయానందం కలిగించాడు. తుమ్మెదరెక్కలను మించిన, మానవుల్ని మరులుగొలిపే వినీల కుంతలాలను చక్కగా దువ్వి కొప్పుతీర్చి పూలతో అలంకరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=241

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 250

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-238-చ.
అలికుల వేణి తన్నుఁ బ్రియుఁ డాడిన యప్రియభాష లిమ్మెయిన్
సొలవక కర్ణరంధ్రముల సూదులు సొన్పిన రీతిఁగాఁగ బె
బ్బులి రొద విన్న లేడి క్రియఁ బొల్పఱి చేష్టలు దక్కి నేలపై
వలనఱి వ్రాలెఁ గీ లెడలి వ్రాలిన పుత్తడిబొమ్మ కైవడిన్.
10.2-239-వ.
ఇట్లు వ్రాలిన.
10.2-240-మ.
ప్రణతామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ గదిసెన్ బాష్పావరుద్ధారుణే
క్షణ విస్రస్త వినూత్నభూషణ దురుక్తక్రూర నారాచ శో
షణ నాలింగితధారుణిన్ నిజకులాచారైక సద్ధర్మ చా
రిణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్ రుక్మిణిన్.

భావము:
ఆ సుకుమారిని తన ప్రియుడు తనతో పలికిన ఆ అప్రియమైన పలుకులు చెవులలో సూదులు పెట్టి పొడిచినట్లు బాధ పెట్టాయి. పెద్దపులి గాండ్రింపు విన్న లేడి లాగ కీలుతప్పి క్రింద పడిపోయిన బంగారు బొమ్మ లాగా, నిశ్చేష్టురాలై నేలపైకి వాలిపోయింది. అలా పట్టపురాణి రుక్మిణీదేవి నేలపైకి వాలిపోగా వేదవేద్యుడైన శ్రీకృష్ణుడు కన్నీటితో నిండి ఎఱ్ఱపడ్డ నేత్రాలతో చెదరిన భూషణాలతో ఆ కఠోరపు పలుకుల ములుకుల వలన కలిగిన అలజడితో నేలపై పడి పోయిన ఆ సద్వంశ సంభూతురాలూ, శోకసంతప్తురాలూ, సహధర్మచారిణి, సాధ్వీశిరోమణీ అయిన రుక్మిణీదేవి దగ్గరకు వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=240

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, June 5, 2021

శ్రీకృష్ణ విజయము - 249

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-236-వ.
అని యిట్లు భగవంతుడైన హరి దన్నుఁ బాయక సేవించుటం బ్రియురాలను, పట్టంపుదేవి ననియెడి రుక్మిణి దర్పంబు నేర్పున నుపసంహరించి యూరకుండిన నమ్మానవతి యప్రియంబులు నపూర్వంబులు నైన మనోవల్లభు మాటలు విని దురంతంబైన చింతాభరంబున సంతాపంబు నొందుచు.
10.2-237-సీ.
కాటుక నెఱయంగఁ గన్నీరు వరదలై-
  కుచకుంభయుగళ కుంకుమము దడియ
విడువక వెడలెడు వేఁడినిట్టూర్పుల-
  లాలితాధర కిసలయము గందఁ
జెలువంబు నెఱిదప్పి చిన్నఁవోవుచు నున్న-
  వదనారవిందంబు వాడు దోఁప
మారుతాహతిఁ దూలు మహిత కల్పకవల్లి-
  వడువున మేన్ వడవడ వడంకఁ
10.2-237.1-తే.
జిత్త మెఱియంగఁ జెక్కిటఁ జేయ్యి సేర్చి
కౌతుకం బేది పదతలాగ్రమున నేల
వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలఁ
బొందె మవ్వంబు గందిన పువ్వుఁబోలె.

భావము:
అని భగవంతుడైన శ్రీకృష్ణుడు పలికాడు. ప్రతినిత్యం తనను సేవిస్తూ, పట్టపురాణిని అనే గర్వంతో ఉన్న రుక్మిణి ఆత్మాభిమానం అంతా అలా నేర్పుగా పలికి తొలగించాడు. తన ప్రాణప్రియుని నోట ఆ మానవతి ఇంతకు ముందు ఎన్నడూ వినని అప్రియమైన మాటలు విని, అంతులేని ఆవేదనతో బాధపడింది.
కాటుకతో నిండిన కన్నీ టిధారలు కుచ కుంభముల మీది కుంకుమను తడిపివేశాయి. ఆగకుండా వస్తున్న వేడినిట్టూర్పుల వలన, చిగురుటాకు వంటి అందమైన పెదవి కందిపోయింది. ముఖపద్మం కళ కోల్పోయి వాడిపోయింది. గాలితాకిడికి తూలిపోతున్న కల్పవల్లి వలె నెమ్మేను వడ వడ కంపించింది, ఈవిధంగా రుక్మిణి మనస్సు బాధపడుతుండగా, చెక్కిలిపై చేయిచేర్చి దీనంగా కాలితో నేలను రాస్తూ, ముఖం వంచుకుని, సౌకుమార్యం కోల్పోయిన పూవులాగా వ్యాకులపాటు చెందింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=237

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 248

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-234-క.
తగదని యెఱుఁగవు మమ్ముం
దగిలితివి మృగాక్షి! దీనఁ దప్పగు; నీకుం
దగిన మనుజేంద్రు నొక్కనిఁ
దగులుము; గుణహీనజనులఁ దగునే తగులన్?
10.2-235-సీ.
సాల్వ జరాసంధ చై ద్యాది రాజులు-
  చెలఁగి నన్ వీక్షించి మలయుచుండ
నది గాక రుక్మి నీ యన్నయు గర్వించి-
  వీర్యమదాంధుఁ డై వెలయుచున్న
వారి గర్వంబులు వారింపఁగాఁ గోరి-
  చెలువ! నిన్నొడిచి తెచ్చితిమి; గాని
కాంతా తనూజార్థ కాముకులము గాము-
  కామమోహాదులఁ గ్రందుకొనము;
10.2-235.1-తే.
విను; ముదాసీనులము; క్రియావిరహితులము
పూర్ణులము మేము; నిత్యాత్మబుద్ధితోడ
వెలుఁగుచుందుము గృహదీపవిధము మెఱసి;
నవలతాతన్వి! మాతోడ నవయ వలదు."

భావము:
ఓ హరిణాక్షీ! గుణహీనులతో సంబంధం తగదు కదా. నా సంబంధం తగినది కాదని గ్రహించలేకపోయావు; తెలియక నన్ను వివాహమాడావు; పొరపాటు చేశావు. పోనీలే ఇప్పుడు, నీకు తగిన రాజేంద్రుడిని మరెవరినైనా వివాహమాడు. ఓ లతాంగీ! సాల్వభూపతి జరాసంధుడు, చేది రాజు శిశుపాలుడు మున్నగు రాజులు చెలరేగి ద్వేషంతో నా వెనుక పడుతున్నారు. నీ సోదరుడైన రుక్మి బలగర్వంతో మిడిసిపడుతున్నాడు. వారి అహంకారాన్ని అణచటానికి మాత్రమే, ఆనాడు నిన్ను బలవంతంగా తీసుకుని వచ్చాను. అంతేకాని, కాంతల పట్ల, సంతానం పట్ల, ఐశ్వర్యంపట్ల ఆసక్తి కలిగి కాదు. కామ మోహములకు మేము లోనుకాము. ఉదాసీనులము. క్రియారహితులము. పరిపూర్ణులము. నాలుగు గోడల మధ్య వున్న దీపం లాగ నిత్యాత్మ బుద్ధితో వెలుగుతుంటాము. అటువంటి మమ్మల్ని కట్టుకొని ఎందుకు బాధపడతావు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=235

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, June 3, 2021

శ్రీకృష్ణ విజయము - 247

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-232-సీ.
లోకుల నడవడిలోని వారము గాము-
  పరులకు మా జాడ బయలు పడదు;
బలమదోపేతులు పగగొండ్రు మా తోడ-
  రాజపీఠములకు రాము తఱచు;
శరణంబు మాకు నీ జలరాశి సతతంబు-
  నిష్కించనుల మేము; నిధులు లేవు;
కలవారు చుట్టాలు గారు; నిష్కించన-
  జనబంధులము; ముక్తసంగ్రహులము;
10.2-232.1-ఆ.
గూఢవర్తనులము; గుణహీనులము; భిక్షు
లైన వారిఁ గాని నాశ్రయింప;
మిందుముఖులు దగుల; రిటువంటి మముబోఁటి
వారి నేల దగుల వారిజాక్షి!
10.2-233-క.
సిరియును వంశము రూపును
సరియైన వివాహసఖ్య సంబంధంబుల్‌
జరుగును; సరి గాకున్నను
జరగవు; లోలాక్షి! యెట్టి సంసారులకున్.

భావము:
అందంగా కదలాడే కన్నులు గల లోలాక్షీ! మా నడవడి లోకులకు భిన్నమైనది. మా జాడ ఇతరులకు అంతుపట్టదు. బలవంతులతో శత్రుత్వం పెట్టుకుంటాము. రాజసింహాసనాల కోసం ఆశపడము. సముద్రమే ఎప్పడూ మాకు ఆశ్రయస్థానం. ఏమీ లేని వాళ్ళము. ధన హీనులము. గుణ హీనులము. పేదలతో తప్ప ధనవంతులతో స్నేహం చేయము. రహస్య వర్తనులము. భిక్షకులను ఆశ్రయిస్తాము. ఇటువంటివారిని స్త్రీలు వరిస్తారా? ఈలాంటి గుణాలున్న నన్ను నీవెందుకు వలచావు. అందమైన కన్నులున్న చిన్నదానా! లోకంలో ఎటువంటి వారికైనా వియ్యమైనా నెయ్యమైనా సంపద, సౌందర్యం, వంశం సమానంగా ఉన్నప్పుడే శోభిస్తుంది. లేకపోతే సంబంధాలు సరిగా జరుగవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=232

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 246

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-230-మ.
పతి యే రూపము దాల్చినం దదనురూపంబైన రూపంబుతో
సతి దా నుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మి నా
సుతనున్ రుక్మిణి నా యనన్యమతి నా శుద్ధాంతరంగం గళా
చతురత్వంబున శౌరి యిట్లనియెఁ జంచన్మందహాసంబుతోన్.
10.2-231-మ.
"బలశౌర్యంబుల భోగమూర్తి కులరూపత్యాగ సంపద్గుణం
బుల దిక్పాలురకంటెఁ జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌; వారికిన్
నెలఁతా! తల్లియుఁదండ్రియుం సహజుఁడున్ నిన్నిచ్చినంబోక యీ
బలవద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్?

భావము:
రూపవతి, తన పతికి అనురూపమైన రూపంతో ప్రవర్తించే లక్ష్మీదేవి అవతారమూ, వివేకవతీ, సౌందర్యవతీ, సౌభాగ్యవతీ, పద్మముఖీ, సద్గుణవతీ, తన ప్రియసతీ అయిన ఆ రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చమత్కారంగా ఇలా అన్నాడు. “బాలా! బలంలో, శౌర్యంలో, రూపంలో, భోగంలో, కులంలో, త్యాగంలో, సంపదలో, సద్గుణాలలో దిక్పాలుర కంటే చైద్యుడు మొదలైనవారు చాలా గొప్పవారు, పరిపూర్ణులు. అటువంటి శిశుపాలుడితో నీ తల్లీ, తండ్రీ, సోదరుడూ నీకు వివాహము చేద్దాము అనుకుంటే ఒప్పుకోక, నీవు సముద్రగర్భంలో తలదాచుకున్నవాడను, పిరికివాడను అయిన నన్ను ఎందుకు వివాహమాడావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=231

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, June 1, 2021

శ్రీకృష్ణ విజయము - 245

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-228-సీ.
కుచకుంభములమీఁది కుంకుమతో రాయు-
  హారంబు లరుణంబు లగుచు మెఱయఁ;
గరపల్లవము సాఁచి కదలింప నంగుళీ-
  యక కంకణప్రభ లావరింపఁ;
గదలిన బహురత్న కలిత నూపురముల-
  గంభీర నినదంబు గడలుకొనఁగఁ;
గాంచన మణికర్ణికా మయూఖంబులు-
  గండపాలికలపై గంతు లిడఁగఁ;
10.2-228.1-తే.
గురులు నర్తింపఁ బయ్యెద కొంగు దూఁగ;
బోటిచే నున్న చామరఁ బుచ్చుకొనుచు
జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి
వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె.

భావము:
ఆ సమయంలో వక్షస్థలంమీది కుంకుమ అంటుకుని హారాలు ఎఱ్ఱని కాంతితో మెరుస్తుండగా; చిగురుటాకువంటి చేతిని కదలించి నప్పుడు కదలిన కంకణాలు, ఉంగరాల కాంతులు ప్రసరిస్తుండగా; చెవులకు ధరించిన బంగారు చెవిదుద్దుల ధగధగలు గండస్థలాలపై వ్యాపిస్తుండగా; కదిలినప్పుడు రత్నాల అందెలు గంభీరమైన ధ్వని చేస్తుండగా; ముఖం మీద ముంగురులు కదలాడుతుండగా; పైటకొంగు తూగాడుతూ ఉండగా; చెలికత్తె చేతిలోని వింజామరను తీసుకుని రుక్మిణీదేవి తన జీవితేశ్వరు డైన శ్రీకృష్ణునకు మెల్లిగా విసరసాగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=228

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 244

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-227-వ.
అంత నొక్కనాఁడు రుక్మిణీదేవి లోఁగిట మహేంద్రనీల మరకతాది మణిస్తంభ వలభి విటంకపటల దేహళీకవాట విరాజమానంబును, శాతకుంభ కుడ్య గవాక్ష వేదికా సోపానంబును, విలంబమాన ముక్తాఫలదామ విచిత్ర కౌశేయవితానంబును, వివిధ మణిదీపికా విసర విభ్రాజమానంబును, మధుకరకులకలిత మల్లికాకుసుమ మాలికాభిరామంబును, జాలకరంధ్ర వినిర్గత కర్పూరాగరుధూప ధూమంబును, వాతాయన విప్రకీర్ణ శిశిరకర కిరణస్తోమంబును, బారిజాతప్రసవామోద పరిమిళితపవనసుందరంబు నయిన లోపలిమందిరంబున శరచ్చంద్రచంద్రికా ధవళపర్యంక మధ్యంబున, జగదీశ్వరుం డయిన హరి సుఖాసీనుండై యుండ, సఖీజనంబులుం దానును డగ్గఱి కొలిచి యుండి.

భావము:
ఒకనాడు రుక్మిణీదేవి అంతఃపురంలో శరత్కాలపు వెన్నెలవంటి తెల్లనైన పానుపుమీద జగదీశ్వరు డైన శ్రీకృష్ణుడు సుఖాసీనుడై ఉన్నాడు. ఆ అంతఃపురం నవరత్నాలు పొదిగిన స్తంభాలతో ఇంద్రనీల మణులు పొదిగిన చంద్రశిలలతో నిండినట్టిది. ఆ చంద్రశాలలలోని ద్వారబంధాలు గడపలు మండపాలు తలుపులు గోడలు కిటికీలు అరుగులు మెట్లు అన్నీ సువర్ణకాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ అంతఃపురం వేల్లాడుతున్న ముత్యాలసరాలతో నిండిన చిత్రవిచిత్రమైన పట్టువస్త్రాల చాందినీలతో వెలుగుతున్నది అనేక మణిదీపాలతో ప్రకాశిస్తున్నది. అక్కడ ఉన్న మల్లెపూలదండలపై తుమ్మెదలు మూగి ఉన్నాయి. కర్పూరం అగరు మొదలైన సుగంధ ద్రవ్యాల పొగలు ఆ అంతఃపురపు కిటికీలగుండా బయటకు వ్యాపిస్తున్నాయి. గవాక్షాల గుండా చల్లని తెల్లని కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఉద్యానవనం నుంచి పారిజాత సుగంధ పవనాలు వీస్తున్నాయి. అటువంటి అంతఃపురంలో సుఖాసీనుడై ఉన్న శ్రీహరిని రుక్మిణీదేవి ఆమె సఖులూ సేవిస్తున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=227

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :