Tuesday, August 31, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౪(324)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-660-వ.
“దేవా! విశ్వనిర్మాణకర్తవై మాయివై సకల కార్యోత్పాదనాదిశక్తి యుక్తుండవై పావకుండు దారువులందు నంతర్హితప్రకాశుండై యున్న చందంబున వర్తించుచున్న నీదు దురత్యయంబయిన మాయాశతంబులఁ బెక్కుమాఱులు పొడగంటి నిదియు నాకు నద్భుతంబుగా; దదియునుంగాక నీ సంకల్పంబున జగంబుద్భవంబై భవత్పరతంత్రంబు నగు; నట్టి నీ కిష్టంబైన వస్తువు సాధుతరంబుగాఁ దెలియ నెవ్వండు సమర్థుం? డే పదార్థంబు ప్రమాణమూలంబునం దోఁచు నదియును లోకవిచక్షణుండ వైన నీదు రూపంబు; మఱియును ముక్తి మార్గంబు నెఱుంగక సంసార పరవశులైన జీవుల మాయాంధకారంబు నివర్తింపఁజేయ సమర్థంబగు; నీ దివ్యలీలావతారంబులం గలుగు కీర్తియను ప్రదీపంబు ప్రజ్వలింపఁజేసి కృపసేయుదట్టి నీకు నమస్కరించెద; నదిగావున నీ ప్రపంచంబున నీ యెఱుంగని యర్థంబు గలదె?” యని కృష్ణునకు నారదుం డిట్లనియె.

భావము:
“శ్రీకృష్ణభగవాన్! నీవు జగత్తు సృష్టించేవాడవు; మాయా మయుడవు; సర్వకార్యాలూ నిర్వర్తించే శక్తి సంపన్నుడవు. అరణికఱ్ఱలో అగ్ని అంతర్లీనంగా ప్రకాశించే రీతిన నీవు ప్రవర్తిస్తుంటావు. గుర్తింపసాధ్యంకాని నీ అశేషమాయా విశేషాలను ఎన్నోమార్లు కన్నాను. నీ సంకల్పంతోటే ఈ ప్రపంచం పుడుతుంది. నీకు లోబడి ఉంటుంది. ఈ లోకంలో నీకిష్టమైన వస్తువేదో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. ప్రమాణమూలంగాతోచే పదార్థాలన్నీ నీ రూపాలే. నీ రూపం ముక్తిసాధనరహస్యం తెలుసుకోలేక సంసారంలోపడి మాయాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని సముద్ధరించడానికి సమర్థమైనది. నీ దివ్యలీలావతారాల కీర్తిని ప్రదీప్తం జేస్తూ ముక్తిమార్గాన్ని అనుగ్రహిస్తూ ఉంటావు. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు కదా.” అని నారదుడు తిరిగి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=660

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


Sunday, August 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౩(323)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-658-తే.
"ఇప్పు డెందుండి వచ్చితి విందులకును?
నఖిలలోకైకసంచారి వగుటఁ జేసి
నీ యెఱుంగని యర్థంబు నిఖిలమందు
నరయ లేదండ్రు; మిమ్మొకఁ టడుగవలయు.
10.2-659-తే.
పాండునందను లిప్పు డే పగిది నెచట
నున్నవారలొ యెఱిఁగింపు" మన్న మౌని
కరసరోజాతములు మోడ్చి కడఁకతోడఁ
బలికెఁ గమలాక్షుఁ జూచి సద్భక్తి మెఱసి.

భావము:
"ఓ మునీంద్రా! నారదా! ఎక్కడనుండి ఇక్కడికి విచ్చేశారు. సకల లోకాలలోనూ సంచరించే మీకు తెలియని విషయము ఏదీ ఉండదు. మిమ్మల్ని ఒక సంగతి అడగాలి. పాండవులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెల్పండి” అని శ్రీకృష్ణుడు అడిగాడు. నారదుడు చేతులు జోడించి భక్తితో ఇలా విన్నవించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=659

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, August 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౨(322)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-655-సీ.
శారదచంద్రికా సారంగరుచితోడ-
  జడముడికెంపు చేఁ జఱచి నవ్వ
శరదంబుదావృత సౌదామనీలతా-
  శోభఁ గాంచనకటిసూత్ర మలర
లలితపూర్ణేందుమండల కలంకముగతి-
  మృదుమృగాజినరుచి మించుఁ జూపఁ
గల్పశాఖాగ్రసంగతపుష్పగుచ్ఛంబు-
  లీలఁ గేలను నక్షమాల యమర
10.2-655.1-తే.
భూరిపుణ్యనదీతోయపూరణమునఁ
దగు కమండలు వొక్క హస్తమునఁ దనర
వెల్ల జన్నిద మఱుత శోభిల్ల వచ్చె
నారదుండు వివేకవిశారదుండు.
10.2-656-క.
చనుదెంచె నట్లు ముని నిజ
తనుకాంతుల నఖిలదిగ్వితానము వెలుఁగన్
వనజాప్తుఁ బోలి యయ్యదు
జనములుఁ గృష్ణుండు లేచి సంప్రీతిమెయిన్.
10.2-657-క.
వినయమున మ్రొక్కి కనకా
సనమునఁ గూర్చుండఁ బెట్టి సముచిత వివిధా
ర్చనములఁ దనిపి మురాంతకుఁ
డనియెన్ వినయంబు దోఁప నమ్మునితోడన్.

భావము:
శరశ్చంద్ర చంద్రికలాంటి శరీరకాంతులతో శిఖముడిలోని కెంపు కాంతుల పంతమాడుతుండగా; శరత్కాలమేఘం మీది మెరపుతీగలాగ తెల్లని దేహం మీద బంగారుమొలత్రాడు ప్రకాశిస్తుండగా; నిండుచంద్రునిలోని మచ్చలాగ నిండు దేహంపై జింకచర్మం విలసిల్లుతుండగా; కల్పవృక్షము కొమ్మకు ఉన్న పుష్పగుచ్ఛాన్ని తలపిస్తూ చేతిలో జపమాల అలరారుతుండగా; పుణ్యనదీజలాలతో నిండిన కమండలం మరొక చేతిలో విరాజిల్లుతుండగా; తెల్లని జందెం మెడలో మెరుస్తుండగా; నారదమహర్షి నందనందనుడి దగ్గరకు విచ్చేసాడు. ఈలాగున తన దేహకాంతులతో దిక్కులను వెలిగిస్తూ దివినుండి దిగివచ్చిన సూర్యునిలా నారదముని వచ్చాడు. కృష్ణుడు తక్కిన యాదవులు అందరూ సాదరంగా లేచి నిలబడ్డారు. ఆ మురాంతకుడైన శ్రీకృష్ణుడు నారదుడికి వినయంగా నమస్కరించాడు. బంగారుసింహాసనం ఆసీనుడిని చేసాడు. తగిన గౌరవమర్యాదలతో పూజించి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=657

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౨౧(321)

( భూసురుని దౌత్యంబు )

10.2-652-క.
అభవుఁ డవయ్యును జగతిం
బ్రభవించుట లీల గాక భవమందుటయే
ప్రభువులకుం బ్రభుఁడవు మము
సభయాత్ముల నరసి కావఁ జను నార్తిహరా!
10.2-653-క.
కదనమున నీ భుజావలి
కెదిరింపఁగ లేక పాఱఁడే విక్రమ సం
పద సెడఁగ జరాసంధుఁడు
పదునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్.
10.2-654-వ.
ఇట్లు తనపడిన బన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందంబున మమ్ముం జెఱపట్టి బాధించుచున్న యప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు మా నిర్బంధంబులు వాపి, సుత దార మిత్ర వర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ము రక్షింపు”మని విన్నవించి" రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున.

భావము:
దుఃఖనాశకుడా! శ్రీకృష్ణా! పుట్టుకే లేని నీవు దేవాధిదేవుడవు ఇలా లోకంలో అవతరించడం మావంటి భయపీడితులను రక్షించుటకే కదా. ఆ జరాసంధుడు నీ భుజపరాక్రమాన్ని ఎదిరించ లేక రాజులంతా నవ్వుతుండగా పదునెనిమిదిసార్లు యుద్ధరంగం నుండి పారిపోయాడు కదా. అయినా, వాడు తాను పడిన కష్టాలను నష్టాలను గుర్తు పెట్టుకోడంలేదు. మదపుటేనుగులను అరికట్టి విఱ్ఱవీగే సింహంలా మమ్మల్ని చెరపట్టి మిడిసిపడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మా నిర్బంధాలను విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి, మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు” అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు” అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో విజ్ఞాన విశారదుడైన నారదుడు అచ్చటికి వేంచేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=52&Padyam=654

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, August 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౦(320)

( భూసురుని దౌత్యంబు )

10.2-649-క.
బలియుర దండింపఁగ దు
ర్బలులను రక్షింప జగతిపై నిజలీలా
కలితుఁడవై యుగయుగమున
నలవడ నుదయింతు కాదె? యభవ! యనంతా!
10.2-650-క.
నీమదిఁ దోఁపని యర్థం
బీ మేదిని యందుఁ గలదె యీశ్వర! భక్త
స్తోమసురభూజ! త్రిజగ
త్క్షేమంకర! దీనరక్ష సేయు మురారీ!
10.2-651-క.
నీ పంపు సేయకుండఁగ
నా పద్మభవాదిసురులకైనను వశమే?
శ్రీపతి! శరణాగతులం
జేపట్టి నిరోధ ముడుగఁ జేయుము కృష్ణా!

భావము:
ఓ అనంతా! అభవా! కృష్ణా! బలవంతులైన దుర్మార్గులను శిక్షించటానికీ; బలహీనులైన సన్మార్గులను రక్షించటానికీ; నీవు ప్రతీ యుగంలోనూ భూమిమీద అవతరిస్తూ ఉంటావు కదా. ఓ కృష్ణా! ఈ లోకంలో నీకు తెలియని విషయం ఏమీ లేదు. పరమేశ్వరా! ముల్లోకాలకు శుభం కలిగించువాడ! భక్తజన కల్పవృక్షమా! దీనులైన మమ్మల్ని కాపాడు. ఓ లక్ష్మీనాథ! శ్రీకృష్ణా! నీ ఆజ్ఞ ఉల్లంఘించటం ఆ బ్రహ్మాది దేవతలకు సైతం సాధ్యం కాదు. శరణు వేడుకుంటున్న మమ్మల్ని కటాక్షించి మా ఈ నిర్బంధాన్ని తొలగించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=52&Padyam=648

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౯(319)

( భూసురుని దౌత్యంబు )

10.2-645-తే.
వారు పుత్తేర వచ్చినవాఁడ నేను
నరవరోత్తమ! నృపుల విన్నపము గాఁగ
విన్నవించెద నామాట వినినమీఁద
ననఘ! నీ దయ! వారి భాగ్యంబు కొలఁది. "
10.2-646-వ.
అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లనియె.
10.2-647-ఉ.
"వారిజనాభ! భక్త జనవత్సల! దుష్టమదాసురేంద్ర సం
హార! సరోరుహాసన పురారి ముఖామరవంద్య పాదపం
కేరుహ! సర్వలోకపరికీర్తిత దివ్యమహాప్రభావ! సం
సారవిదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా!
10.2-648-ఆ.
ఆర్త జనుల మమ్ము నరసి రక్షింపు మ
హాత్మ! భక్తజనభయాపహరణ!
నిన్ను మది నుతించి నీకు మ్రొక్కెదము నీ
చరణయుగము మాకు శరణ మనఘ!

భావము:
ఓ పురుషోత్తమా! నేను ఇప్పుడు వారు పంపించగా వచ్చాను. వారి విన్నపాలు నీ కిప్పుడు మనవి చేస్తున్నాను. ఆపైన మీ దయ వారి అదృష్టం.” ఇలా పలికి, రాజుల విన్నపాలను ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి ఈవిధంగా చెప్పసాగాడు. “శ్రీకృష్ణా! ఓ భక్తవత్సల! దుష్ట రాక్షసేంద్ర సంహార! బ్రహ్మ మహేశ్వర దేవేంద్రాది వందిత పాదసరోజా! సకలలోకులచే కీర్తింపబడే మహాప్రభావశాలి! సంసారవిదూరా! నందకుమారా! లక్ష్మీనాథా! మాధవా! అవధరించు. ఓ పుణ్యాత్మా! ఆర్తులము అయిన మమ్ములను కటాక్షించి రక్షించు. నీవు భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. నిన్ను మనసులో ధ్యానించి, నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=52&Padyam=648

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, August 23, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౮(318)

( భూసురుని దౌత్యంబు )

10.2-642-వ.
ఇవ్విధంబునం బ్రతిదివసంబును నుండు నవసరంబున నొక్కనా డపూర్వదర్శనుం డైన భూసురుం డొక్కరుండు సనుదెంచి సభా మధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి వినయంబునఁ గరములు మొగిచి యిట్లనియె.
10.2-643-క.
"కంజవిలోచన! దానవ
భంజన! యోగీంద్రవిమలభావలసద్బో
ధాంజన! దీప్తినిదర్శన!
రంజితశుభమూర్తి! కృష్ణ! రాజీవాక్షా!
10.2-644-తే.
అవధరింపు; జరాసంధుఁ డతుల బలుఁడు
దనకు మ్రొక్కని ధారుణీధవుల నెల్ల
వెదకి తెప్పించి యిరువదివేల నాఁకఁ
బెట్టినాఁడు గిరివ్రజపట్టణమున.

భావము:
వాసుదేవుడు ఇలా సంతోషంగా రోజులు గడుపుతుండగా, ఒకనాడు కొత్త బ్రాహ్మణుడు ఒకడు వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి, వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. “రాజీవలోచనా! రాక్షససంహారా! యోగీశ్వర హృదయ రంజనా! తేజోనిధీ! దివ్యమంగళ విగ్రహా! శ్రీకృష్ణా! అనుగ్రహించు. దయచేసి నా విన్నపములు వినుము. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదకి వెదకి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికి ఇరవైవేల మంది వరకూ రాజులు బంధీలుగా ఉన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=52&Padyam=644

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, August 22, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౭(317)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-639-సీ.
అభినవ నిజమూర్తి యంతఃపురాంగనా-
  నయనాబ్జములకు నానంద మొసఁగ
సలలిత ముఖచంద్ర చంద్రికాతతి పౌర-
  జనచకోరముల కుత్సవము సేయ
మహనీయకాంచనమణిమయ భూషణ-
  దీప్తులు దిక్కులఁ దేజరిల్ల
నల్ల నల్లన వచ్చి యరదంబు వెస డిగ్గి;-
  హల కులిశాంకుశ జలజ కలశ
10.2-639.1-తే.
లలితరేఖలు ధరణి నలంకరింప
నుద్ధవుని కరతల మూని యొయ్య నడచి
మహితగతి దేవతాసభామధ్యమునను
రుచిర సింహాసనమునఁ గూర్చుండె నెలమి.
10.2-640-చ.
అతి విభవంబునం దనరి యాత్మతనుద్యుతి తేజరిల్లఁగా
హితులుపురోహితుల్వసుమతీశులుమిత్రులుబాంధవుల్‌బుధుల్‌
సుతులునుమాగధుల్కవులుసూతులు మంత్రులుభృత్యులున్శుభ
స్థితిఁ గొలువంగఁ నొప్పె నుడుసేవితుఁ డైన సుధాంశుఁడో యనన్.
10.2-641-క.
కరుణార్ద్రదృష్టిఁ బ్రజలం
బరిరక్షించుచు వివేకభావకళా చా
తురి మెఱసి యిష్టగోష్ఠిం
బరమానందమున రాజ్యభారకుఁ డగుచున్.

భావము:
అలా బయలుదేరిన శ్రీకృష్ణుడు తన నవమోహనాకారంతో అంతఃపురస్త్రీల కన్నులకు ఆనందాన్ని అందిస్తూ. అందాలు చిందే తన ముఖచంద్రుని వెన్నెల వెలుగులతో పురజనుల నేత్రచకోరాలకు పండుగచేస్తూ, తాను ధరించిన మణిమయ ఆభరణాల కాంతులు నలుదిక్కుల ప్రసరింపజేస్తూ, మెల్ల మెల్లగా రథం దిగి వచ్చాడు. హల, కులిశాది రేఖలతో శుభంకరములు అయిన తన పాదముద్రలు భూమి మీద అలంకారాలుగా వేస్తూ, ఉద్ధవుని చేతిని ఊతగా గ్రహించి గంభీరంగా నడుస్తూ దేవతాసభ సుధర్మసభ మధ్యన ఉన్న మణిమయ సింహాసనం మీద ఆసీనుడైయ్యాడు. శ్రీకృష్ణుడు తన శరీరకాంతులు నలుగడలా ప్రసరిస్తుండగా, హితులూ, పురోహితులూ, రాజులూ, మిత్రులూ, చుట్టాలూ, పెద్దలూ, కుమారులూ, స్తుతిపాఠకులూ, కవులూ, మంత్రులూ, సేవకులూ, అందరూ తనను సేవిస్తూ ఉండగా నక్షత్రాల నడుమ విరాజిల్లే చంద్రుడిలా మహవైభవంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడు దయతో కూడిన చూపులతో ప్రజలను పరిపాలిస్తూ, వివేక చాతుర్యంతో ఆత్మీయులతో ప్రీతిగా మాటలాడుతూ, ఆనందంగా రాజ్యభారాన్ని వహించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=641

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౧౬(316)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-637-సీ.
మలయజకర్పూరమహితవాసితహేమ-
  కలశోదకంబుల జలకమాడి
నవ్యలసన్మృదు దివ్యవస్త్రంబులు-
  వలనొప్ప రింగులువాఱఁ గట్టి
మకరకుండల హార మంజీర కేయూర-
  వలయాది భూషణావలులు దాల్చి
ఘనసార కస్తూరికా హరిచందన-
  మిళితపంకము మేన నలర నలఁది
10.2-637.1-తే.
మహితసౌరభ నవకుసుమములు దుఱిమి
పొసఁగ రూపైన శృంగారరస మనంగ
మూర్తిఁ గైకొన్న కరుణాసముద్ర మనఁగ
రమణ నొప్పుచు లలితదర్పణము చూచి.
10.2-638-తే.
కడఁగి సారథి తెచ్చిన కనకరథము
సాత్యకి హిత ప్రియోద్ధవ సహితుఁ డగుచు
నెక్కి నిజకాంతి దిక్కులఁ బిక్కటిల్లఁ
బూర్వగిరిఁ దోఁచు భానునిఁ బోలి వెలిఁగె.

భావము:
అనంతరం, ఆ నందనందనుడు చందన కర్పూరాల పరిమళాలతో గుమగుమలాడే కాంచనకలశ జలాలతో స్నానం చేసాడు. సన్నని మృదువైన క్రొత్త బట్టలు ధరించాడు. కర్ణ కుండలాలు, హార, భుజకీర్తులు మున్నగు భూషణాలను అలంకరించుకున్నాడు. పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం కలిపిన మైపూతను అలదుకున్నాడు సువాసనలు వెదజల్లే పూలమాలలను ధరించాడు. రూపం దాల్చిన శృంగార రసమూ, ఆకారం దాల్చిన అనురాగ సముద్రమూ అన్నట్లుగా అలరారుతున్న శ్రీకృష్ణుడు అద్దంలో చూసుకున్నాడు. సాత్యకితోనూ మిత్రుడైన ఉద్ధవునితోనూ కలసి సారథి తెచ్చిన బంగారురథాన్ని అధిరోహించి, తూర్పుకొండపై ఉదయించే సూర్యుడిలా శోభిస్తూ, శ్రీకృష్ణుడు తన శోభ నలుదిక్కులా విరజిమ్ముతూ ప్రకాశించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=637

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, August 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౫(315)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-636-వ.
అని చెప్పి యప్పారాశర్యనందనుం డభిమన్యునందను కిట్లనియె; “నా నిశావసానంబునఁ బద్మబాంధవాగమనంబును గమలినీ లోకంబునకు మునుకలుగ నెఱింగించు చందంబునం గలహంస సారస రథాంగ ముఖ జలవిహంగంబుల రవంబులు సెలంగ నరుణోదయంబున మంగళపాఠకసంగీత మృదుమధుర గాన నినదంబును లలితమృదంగ వీణా వేణు నినాదంబును, యేతేర మేలుకని తనచిత్తంబునఁ జిదానందమయుం బరమాత్ము నవ్యయు నవికారు నద్వితీయు నజితు ననంతు నచ్యుతు నమేయు నాఢ్యు నాద్యంతవిహీనుఁ బరమబ్రహ్మంబునైన తన్నుందా నొక్కింత చింతించి యనంతరంబ విరోధి రాజన్య నయన కల్హారంబులు ముకుళింప భక్తజననయనకమలంబులు వికసింప నిరస్త నిఖిల దోషాంధకారుం డైన గోవిందుండు మొగిచిన లోచనసరోజంబులు వికసింపఁ జేయుచుఁ దల్పంబు డిగ్గి చనుదెంచి యంత.

భావము:
ఈ విధంగా పదహారువేల స్త్రీల సాంగత్య లీలలు చెప్పి ఆ వ్యాసభగవానుని పుత్రుడు శుకుడు, అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షిత్తుతో మళ్ళా ఇలా అన్నాడు. “పద్మమిత్రుడైన సూర్యుడి రాకను పద్మములకు ముందుగా తెలుపుతున్నాయేమో అన్నట్లు రాజహంసలు, సారసపక్షులు, చక్రవాకాలు మున్నగు నీటిపక్షులు చేస్తున్న కలధ్వనులనూ; మృదుమధురాలైన మంగళపాఠకుల సుస్వర పఠనాలనూ; మనోహరమైన మృదంగ, వేణు, వీణా రవాలనూ ఆలకించుతూ అరుణోదయ సమయాననే శ్రీకృష్ణుడు మేలుకొన్నాడు. చిదానంద స్వరూపుడు, పరమాత్మ, నాశ రహితుడు, వికార శూన్యుడు, తనకు ఇతరమైనది లేని వాడు, జయింపరాని వాడు, దేశ కాలాది పరిచ్ఛేద రహితుడు, అచ్యుతుడు, అమేయుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు, మొదలు తుది లేని వాడు, పరబ్రహ్మస్వరూపము అయిన తనను తానే ధ్యానించుకుంటూ కన్నులు తెరచి శయ్యను దిగాడు. ఆయన కన్నులు తెరవగానే పగవారి కనుగలువలు ముకుళించాయి. భక్తుల కన్నులు అనే పద్మాలు వికసించాయి. పాపాలనే చీకట్లు పటాపంచలు అయ్యాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=636

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, August 19, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౪(314)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-633-క.
అని తద్వచనసుధాసే
చనమున ముది తాత్ముఁ డగుచు సంయమి చిత్తం
బునఁ దన్మూర్తిం దగ నిడు
కొని చనియెను హరినుతైకకోవిదుఁ డగుచున్.
10.2-634-క.
ఈ పగిది లోకహితమతి
నా పరమేశ్వరుఁడు మానవాకృతిఁ ద్రిజగ
ద్దీపితచారిత్రుఁడు బహు
రూపములం బొందె సుందరుల నరనాథా!
10.2-635-చ.
అని హరి యిట్లు షోడశసహస్రవధూమణులం బ్రియంబునన్
మనసిజకేళిఁ దేల్చిన యమానుషలీల సమగ్రభక్తితో
వినినఁ బఠించినం గలుగు విష్ణుపదాంబుజభక్తియున్ మహా
ధన పశు పుత్త్ర మిత్ర వనితాముఖ సౌఖ్యములున్ నరేశ్వరా! "

భావము:
ఇలా పలికి, నారదుడు వాసుదేవ వాగామృతధారలలో మునిగి సంతుష్టాంతరంగుడు, విష్ణు కీర్తనలు వాడుటలో అమిత నేర్పరి అయి, ఆ మంగళమయ స్వరూపాన్ని తన మనసులో నిలుపుకుని వెళ్ళిపోయాడు. ఓ పరీక్షిత్తు మహారాజా! లోకానికి మేలుచేకూర్చాలని మానవాకారాన్ని ధరించిన ఆ శ్రీకృష్ణుడు ఆ సుందరాంగులు అందరికీ ఆ విధంగా అనేక రూపాలతో చెందాడు. శ్రీకృష్ణుడు పదహారువేల మంది స్త్రీలను ఆదరించిన మానవాతీత లీలలను వినినా, చదివినా విష్ణుదేవుడి పాదాలపై భక్తి ప్రాప్తించటమే కాకుండా ధన, పశు, పుత్ర, మిత్ర, కళత్రాది సౌఖ్యాలు సైతం లభిస్తాయి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=635

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 17, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౩(313)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-629-ఆ.
పరమభాగవతుఁడు పరమేష్ఠితనయుండు
మనుజలీలఁ జెంది మహితసౌఖ్య
చిత్తుఁడైన యా హృషీకేశు యోగమా
యాప్రభావమునకు నాత్మ నలరి.
10.2-630-క.
"మాయురె? హరిహరి! వరద! య
మేయగుణా!" యనుచు నాత్మ మెచ్చి మునీంద్రుం
డా యదునాయకు సుజన వి
ధేయుని కిట్లనియె దేవ! త్రిజగములందున్.
10.2-631-క.
"నీ మాయఁ దెలియువారలె
తామరసాసన సురేంద్ర తాపసు లైనన్
ధీమంతులు నీ భక్తిసు
ధామాధుర్యమునఁ బొదలు ధన్యులు దక్కన్. "

భావము:
పరమ భాగవతోత్తముడు, బ్రహ్మ మానసపుత్రుడు అయిన నారదుడు మానవ రూపుడు అయి సామాన్య మానువుని వలె భౌతిక సౌఖ్యాలలో తేలియాడుతున్న ఆ సర్వేంద్రియములకు ఈశ్వరుడు అయిన శ్రీకృష్ణభగవానుడి యోగమాయా ప్రభావాన్ని పరీక్షించి చూసి చాలా సంతోషించి నారదుడు తన మనసులో “ఆహా! హరీహరీ! సుప్రసన్నా! ఉన్నత గుణ సుసంపన్నా!” అంటూ మెచ్చుకుంటూ కృష్ణుడితో ఇలా అన్నాడు. “నీ భక్తి అనే అమృతములోని తీయదనములో తేలియాడుతుండే పుణ్యాత్ములు మాత్రమే నీ తత్వాన్ని తెలుసుకోగలరు. అంతే తప్ప, ముల్లోకాలలో బ్రహ్మేంద్రాది దేవతలూ మహర్షులూ సహితంగా ఇతరులు నీ మాయను తెలుసుకోలేరు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=631

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, August 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౨(312)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-626-క.
జలజభవసుతుఁడు గనె నొక
నలినాక్షినివాసమందు నతభద్రేభున్
జలదాభున్ గతలోభు
న్నలకాళిజితద్విరేఫు నంబుజనాభున్.
10.2-627-మ.
ఒకయింటం గజవాజిరోహకుఁడునై యొక్కింట భుంజానుఁడై
సకలాత్ముండు పరుండు షోడశసహస్రస్త్రీనివాసంబులం
దొక బోటింటను దప్పకుండ నిజమాయోత్సాహుఁడై యుండ న
య్యకలంకున్వరదున్, మహాపురుషు, బ్రహ్మణ్యున్నతాబ్జాసనున్,
10.2-628-క.
అస్తోకచరితు, నమిత స
మస్త సుధాహారు వేద మస్తకతల వి
న్యస్త పదాంబుజయుగళు, న
పాస్తశ్రితనిఖిలపాపుఁ, బరము, ననంతున్.

భావము:
ఆ బ్రహ్మపుత్రుడైన నారదుడు ఒక పద్మాక్షి గృహంలో గజేంద్రపాలకుడిని, నీలమేఘ శ్యాముడిని, లోభ రహితుడిని, పద్మనాభుడిని, శ్రీకృష్ణుడిని తిలకించాడు. మహాపురుషుడైన శ్రీకృష్ణుడు పదహారువేల స్త్రీల నివాసాలలోనూ ఏ స్త్రీ ఇంటిని వదిలిపెట్టకుండా, ప్రతి ఇంట తన మాయా ప్రభావంతో తానే ఉంటూ; ఒక ఇంటిలో ఏనుగులపై గుఱ్ఱాలపై స్వారీచేస్తున్నాడు. ఒక ఇంటిలో భోజనం చేస్తున్నాడు. ఇంకొక ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఇలా ఉన్న నిర్మలుడూ, కోరిన వరాలను అనుగ్రహించే వాడూ, బ్రాహ్మణ్యుడూ అయిన ఆ కృష్ణపరమాత్మను నారదుడు దర్శించాడు. ఉదాత్త చరిత్రుడు; వేదాంతముల యందు ప్రతిపాదింపబడిన ఆది మూలమైన వాడు; దేవతలు అందరకు ఆరాధ్యుడు; ఆశ్రితుల పాపాలను పోగొట్టే వాడు; అనంతుడు అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=628

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, August 15, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౧(311)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-623-క.
చతురానననందనుఁ డం
చితమతిఁ జని కాంచె నొక్క చెలిగేహమునం
గ్రతుకర్మాచరణుని నా
శ్రితభయహరణున్ సురేంద్రసేవితచరణున్.
10.2-624-క.
వృత్రారినుతునిఁ బరమ ప
విత్రుని నారదుఁడు గాంచె వేఱొక యింటం
బుత్రక పౌత్త్రక దుహితృ క
ళత్రసమేతుని ననంతు లక్షణవంతున్.
10.2-625-క.
సుందరమగు నొక సుందరి
మందిరమునఁ బద్మభవకుమారుఁడు గాంచెన్
నందితనందున్ సుజనా
నందున్ గోవిందు నతసనందు ముకుందున్.

భావము:
బ్రహ్మదేవుడి కుమారుడైన నారదుడు యజ్ఞకర్మలు ఆచరిస్తున్న వాడూ, ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడూ, దేవేంద్రుడి చేత పూజింపబడే పాదాలు కలవాడూ అయిన కృష్ణుడిని ఒక ఇష్టసఖి ఇంటిలో చూసాడు. మరో మందిరంలో దేవేంద్రుడి చేత స్తుతింపబడే వాడూ పరమ పవిత్రుడూ నందుడి కుమారుడూ అయిన కృష్ణుడిని కొడుకులూ, మనుమళ్ళూ, కూతుళ్ళూ, భార్యలు మున్నగు వారితో కలసి (సామాన్య గృహస్థు వలె) ఉండగా దర్శించాడు. ఒక అందగత్తె అందమైన ఇంటిలో సజ్జనుల చేత కీర్తించబడేవాడూ, సనకసనందాదుల వందనాలు అందుకునేవాడూ, అయిన గోవిందుడిని బ్రహ్మదేవుడి పుత్రుడైన నారదుడు దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=625

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, August 14, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౦(310)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-618-వ.
మఱియుం జనిచని.
10.2-619-సీ.
ఒకచోట నుచితసంధ్యోపాపనాసక్తు-
  నొకచోటఁ బౌరాణికోక్తికలితు
నొకచోటఁ బంచయజ్ఞోచితకర్ముని-
  నొకచోట నమృతోపయోగలోలు
నొకచోట మజ్జనోద్యోగానుషక్తుని-
  నొకచోట దివ్యభూషోజ్జ్వలాంగు
నొకచోట ధేనుదానోత్కలితాత్ముని-
  నొకచోట నిజసుతప్రకరయుక్తు
10.2-619.1-తే.
నొక్క చోటను సంగీతయుక్త చిత్తు
నొక్కచోటను జలకేళియుతవిహారు
నొక్కచోటను సన్మంచకోపయుక్తు
నొక్కచోటను బలభద్రయుక్తచరితు.
10.2-620-వ.
మఱియును.
10.2-621-సీ.
సకలార్థసంవేది యొ యింటిలోపలఁ-
  జెలితోడ ముచ్చటల్‌ సెప్పుచుండు
విపులయశోనిధి వేఱొక యింటిలో-
  సరసిజాననఁ గూడి సరస మాడుఁ
బుండరీకదళాక్షుఁ డొండొక యింటిలోఁ-
  దరుణికి హారవల్లరులు గ్రుచ్చుఁ
గరుణాపయోనిధి మఱియొక యింటిలోఁ-
  జెలిఁ గూడి విడియము సేయుచుండు
10.2-621.1-ఆ.
వికచకమలనయనుఁ డొకయింటిలో నవ్వు
బ్రవిమలాత్ముఁ డొకటఁ బాడుచుండు
యోగిజనవిధేయుఁ డొకయింట సుఖగోష్ఠి
సలుపు ననఘుఁ డొకటఁ జెలఁగుచుండు.
10.2-622-వ.
ఇట్లు సూచుచుం జనిచని.

భావము:
ఇలా చూస్తూ నారదుడు ఇంకా ముందుకు వెళ్ళాడు.
ఒక ఇంటిలో సంధ్యావందనం చేస్తూ ఉన్న వాడిని; మరొక గృహంలో పురాణశ్రవణం చేస్తూ ఉన్న వాడిని; ఒక చోట పంచయజ్ఞాలు ఆచరిస్తున్నవాడిని; మరొక తావున యోగసమాధి నిమగ్నమై ఉన్న వాడిని; ఒక స్థలంలో స్నానానికి సిద్ధమవుతూ ఉన్న వాడిని; ఇంకొక చోట ప్రశస్త భూషణాలతో ప్రకాశిస్తున్న వాడిని; మరొక ప్రదేశంలో గోదానం చేయాలని కుతూహలపడుతూ ఉన్న వాడిని; ఇంకొక ప్రదేశంలో తన కుమారులతో ఆడుకుంటున్న వాడినీ; ఒకచోట సంగీతం మీద ఆసక్తిని చూపుతున్న వాడిని; మరొక చోట జలకేళి ఆడుతున్నవాడిని; ఇంకొక చోట మంచం మీద కుర్చున్న వాడిని; మరొకచోట బలరాముడి తో కలిసి ఉన్న వాడిని, యిలా పలుస్థలములలో పలుక్రియలలో నిమగ్నుడై యున్న శ్రీకృష్ణుడిని నారదమహర్షి సందర్శించాడు. శ్రీకృష్ణుడు తన ముద్దులసఖితో ఒక ఇంటిలో ముచ్చటలు ఆడుతున్నాడు; మరో ఇంటిలో మరొక ప్రియసఖితో సరసమాడుతున్నాడు; ఇంకో ఇంటిలో ఒక స్త్రీ రత్నం కోసం హారాలు గుచ్చుతున్నాడు; ఒక ఇంటిలో తన యువతితో కలిసి తాంబూలం సేవిస్తున్నాడు; ఒక ఇంటిలో నవ్వుతున్నాడు; ఒక ఇంటిలో పాడుతున్నాడు; ఒక ఇంటిలో సుఖగోష్టి చేస్తున్నాడు; ఒక ఇంటిలో ఆనందిస్తున్నాడు; ఈ మాదిరి అనేక రూపాలతో కనపడుతూ ఉన్న ఆ సకలార్థసంవేదిని, ఆ వికచకమల నయనుని, ఆ విమలాత్ముని, ఆ యోగిజన విధేయుని, ఆ శ్రీకృష్ణభగవానుడిని దర్శిస్తూ నారదుడు ముందుకు సాగిపోయాడు. ఈ విధంగా పరిశీలిస్తూ సాగిపోతూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=621

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, August 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౯(309)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-615-వ.
ఇట్లు కనుంగొనుచుం జనుచుండ నొక్కయెడ నమ్మునీంద్రునకు ముకుందుండు ప్రత్యుత్థానంబు చేసి “మునీంద్రా! సంపూర్ణకాము లయిన మిమ్ము నపూర్ణకాములమైన మేమేమిటఁ బరితృప్తి నొందఁ జేయంగలవారము? భవదీయదర్శనంబున నిఖిలశోభనంబుల నందెద” మని ప్రియపూర్వకంబుగాఁ బలికిన నా నందనందను మాటలకు నానంద కందళిత హృదయారవిందుండును, మందస్మిత సుందర వదనారవిందుండును నగుచు నారదుండు వెండియుఁ జనిచని.
10.2-616-క.
అనఘాత్ముఁడు గనుఁగొనె నొక
వనితామణిమందిరమున వనకేళీ సం
జనితానందుని ననిమిష
వినమితచరణారుణారవిందు ముకుందున్.
10.2-617-క.
పరమేష్ఠిసుతుఁడు గనె నొక
తరుణీభవనంబు నందుఁ దను దాన మనోం
బురుహమునఁ దలఁచుచుండెడి
నరకాసురదమనశూరు నందకుమారున్.

భావము:
ఈవిధంగా వాసుదేవుని కనుగొంటూ వెళుతూ ఉన్న నారదుడిని కృష్ణుడు ఒక ఇంటిలో గౌరవించి “నారద మునీంద్రా! ఏ కోరికలూ లేని మిమ్ములను కోరికలు కల మేము ఏవిధంగా సంతృప్తి పరచగలం మీ దర్శనంతో సమస్త శుభాలనూ పొందుతాము.” అని ప్రీతి పూర్వకంగా పలికాడు. కృష్ణుడి మాటలకు మన స్ఫూర్తిగా సంతోషించి చిరునవ్వు నవ్వుతూ నారదుడు ముందుకు సాగిపోయాడు. పుణ్యాత్ముడైన నారదుడు ఒక స్త్రీరత్నం ఇంటిలో జలకేళి సలుపుతూ ఆనందిస్తున్న దేవతలచే నమస్కరింపబడు పాదాలు గలవానిని, ముకుందుడిని చూసాడు. నారదుడు మరొక తరుణీమణి ఇంటిలో తనలో తనను చూసుకుంటూ యోగనిష్ఠలో ఉన్న నరకాసురుని సంహరించిన శ్రీకృష్ణుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=617

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, August 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౮(308)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-612-వ.
అని యభ్యర్థించి యద్దేవునివలనం బ్రసన్నత వడసి, తన్మందిరంబు వెడలి మునివరుం డమ్మహాత్ముని యోగమాయాప్రభావంబు దెలియంగోరి, వేఱొక చంద్రబింబాననాగేహంబునకుం జని యందు నెత్తమాడుచున్న పురుషోత్తము నుద్ధవ యుతుం గని యద్భుతంబు నొందుచు నతనిచేత సత్కృతుండై యచ్చోట వాసి చని.
10.2-613-క.
మునివరుఁడు కాంచె నొండొక
వనజాయతనేత్ర నిజనివాసంబున నం
దనయుతు జిష్ణు సహిష్ణున్
వినుతగుణాలంకరిష్ణు విష్ణుం గృష్ణున్.
10.2-614-క.
నారదుఁ డట చని కనె నొక
వారిజముఖియింట నున్నవాని మురారిన్
హారిన్ దానవకుల సం
హారిం గమలామనోవిహారిన్ శౌరిన్.

భావము:
ఆ విధంగా ప్రార్థించి నారదుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాడు. ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన ఆ దేవర్షి వాసుదేవుడి యోగమాయా ప్రభావం తెలుసుకోదలచాడు. వేరొక వాల్గంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉద్ధవునితో కలసి జూదమాడుతూ ఉన్న శ్రీకృష్ణుడిని తిలకించి ఆశ్చర్యచకితుడు అయ్యాడు. అక్కడ కృష్ణుడిచేత పూజించబడి ఆ భవనం నుండి బయటకు వెళ్ళాడు. నారదుడు మరింకొక సుందరి మందిరానికి వెళ్ళాడు. అక్కడ నందనులతో కలసి ఆనందిస్తున్న కలువ కన్నుల కన్నయ్యను సందర్శించాడు. నారదముని వేరొక పద్మాక్షి సౌధానికి వెళ్ళి అక్కడ ఉన్న దానవాంతకుడు అయిన కృష్ణుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=614

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, August 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౭(307)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-608-వ.
ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండునైన నారాయణుం డశేష తీర్థోపమానంబయిన మునీంద్రపాద తీర్థంబు ధరించినవాఁడయి, సుధాసారంబులైన మితభాషణంబుల నారదున కిట్లనియె.
10.2-609-క.
"ఏ పని పంచినఁ జేయుదుఁ
దాపసవర!" యనుడు నతఁడు "దామోదర! చి
ద్రూపక! భవదవతార
వ్యాపారము దుష్టనిగ్రహార్థము గాదే!
10.2-610-తే.
అఖిలలోకైకపతివి, దయార్ద్రమతివి,
విశ్వసంరక్షకుండవు, శాశ్వతుఁడవు
వెలయ నే పనియైనఁ గావింతు ననుట
యార్త బంధుండ విది నీకు నద్భుతంబె!
10.2-611-తే.
అబ్జసంభవ హర దేవతార్చనీయ,
భూరిసంసారసాగరోత్తారణంబు,
నవ్యయానందమోక్షదాయకము నైన
నీ పదధ్యాన మాత్మలో నిలువనీవె "

భావము:
అలా దేవదేవుడూ, అర్జునుడి చెలికాడూ, నారాయణుడూ అయిన నల్లనయ్య సమస్త పుణ్యతీర్ధాలకూ సాటివచ్చే నారదమునీంద్రుడి పాదజలాన్ని తన తలపై ధరించి, అమృతం చిలికే పలుకులతో ఇలా అన్నాడు. “ఓ తాపసోత్తమా! మీరు ఏ పని చేయమని ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాను. సెలవీయండి.” ఇలా పలికిన కృష్ణుడితో నారదుడు ఇలా అన్నాడు. “ఓ దామోదరా! నీ అవతార లక్ష్యం దుర్మార్గులను శిక్షించడానికే కదా! నీవు సమస్తలోకాలకూ ప్రభుడవు; దయా పూరిత మానసుడవు; ప్రపంచాన్ని రక్షించేవాడవు; ఆర్తులకు బాంధవుడవు; అయిన నీవు ఏ పని అయినా చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కాదు. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతల చేత పూజింపబడే ఓ కృష్ణా! సంసారసాగరాన్ని దాటడానికి సాధనము; మోక్షాన్ని ప్రసాదించేదీ; ఐన నీ పదధ్యానం నా ఆత్మలో నిలిచి ఉండేలా అనుగ్రహించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=611

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౬(306)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-605-వ.
మఱియు హాటకనిష్కంబు లఱ్ఱులందు వెలుగొందఁ గంచుకంబులు శిరోవేష్టనంబులుఁ గనకకుండలంబులు ధరించి, సంచరించు కంచుకులును, సమాన వయోరూపగుణవిలాసవిభ్రమ కలితలయిన విలాసినీ సహస్రంబులును గొలువం గొలువున్న యప్పద్మలోచనుం గాంచన సింహాసనాసీనుం గాంచె; నప్పుండరీకాక్షుండును నారదుం జూచి ప్రత్యుత్థానంబు సేసి యప్పుడు.
10.2-606-క.
మునివరు పాదాంబుజములు
దన చారుకిరీటమణి వితానము సోఁకన్
వినమితుఁడై నిజసింహా
సనమునఁ గూర్చుండఁ బెట్టి సద్వినయమునన్.
10.2-607-క.
తన పాదకమలతీర్థం
బున లోకములం బవిత్రముగఁ జేయు పురా
తనమౌని లోకగురుఁ డ
మ్ముని పదతీర్థంబు మస్తమున ధరియించెన్.

భావము:
మెడలో ప్రకాశించే బంగారు పతకాలతో; కంచుకాలూ తలపాగాలూ కుండలాలూ ధరించి సంచరించే కంచుకి జనము; సరియైన వయో, రూప, గుణాలతో విలసిలిల్లే వేలాది లీలావతులు సేవిస్తూ ఉండగా, బంగారు సింహాసనంమీద కొలువుతీరి కూర్చున్న పద్మాక్షుడు శ్రీకృష్ణుడిని ఆ మహర్షి తిలకించాడు. తన వద్దకు వస్తున్న నారదమునిని చూసి గోపవల్లభుడు ఎదురు వచ్చాడు. శ్రీకృష్ణుడు తన కిరీటంలోని మణుల సమూహం మునిశ్రేష్ఠుడైన నారదుని పాదపద్మాలకు తాకేలా నమస్కారం చేసి, తన సింహాసనం మీద కూర్చోపెట్టి, చక్కటి వినయంతో తన పాదకమలతీర్థంచేత సర్వలోకాలనూ పవిత్రం చేసే, ప్రాచీనమునీ, లోకగురుడూ అయిన శ్రీకృష్ణుడు నారదుడి పాదతీర్థం తన తల మీద ధరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=607

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౦౫(305)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-602-సీ.
పటికంపుఁ గంబముల్‌ పవడంపుఁ బట్టెలు-
  మరకత రచితముల్‌ మదురు లమర
వైడూర్యమణిగణవలభులఁ బద్మరా-
  గంబుల మొగడుల కాంతు లొలయ
సజ్ఞాతివజ్ర లసజ్జాల రుచులతో-
  భాసిల్లు నీలసోపానములును
గరుడపచ్చల విటంకములును ఘనరుచి-
  వెలసిన శశికాంత వేదికలును
10.2-602.1-తే.
వఱలు మౌక్తికఘటిత కవాటములును
బ్రవిమలస్వర్ణమయ సాలభంజికలును
మించు కలరవ మెసఁగఁ గ్రీడించు మిథున
లీలనొప్పు కపోతపాలికలుఁ గలిగి.
10.2-603-తే.
చేటికానీకపద తులాకోటిమధుర
నినదభరితమై రుచిరమాణిక్య దీప
మాలికయుఁ గల్గి చూపట్టఁ గ్రాలు నొక్క
జలజలోచన నిజసౌధతలము నందు.
10.2-604-తే.
కనక కంకణ ఝణఝణత్కార కలిత
చంద్రబింబాననా హస్తజలజ ఘటిత
చామరోద్ధూత మారుత చలిత చికుర
పల్లవునిఁ గృష్ణు వల్లవీ వల్లవునిని.

భావము:
స్ఫటికపు స్తంభములు, పగడాల పట్టెలు, మరకత మణుల కప్పులు, శోభిల్లగా వైఢూర్యాల ముంజూరులు, వజ్రాల కిటికీలు కాంతులీనగా; పద్మరాగాల నడికొప్పులూ, నీలాల సోపానాలు విలసిల్లగా; చంద్రకాంత వేదికలు గరుడపచ్చల గువ్వగూండ్లు ప్రకాశింపగా; ఆణిముత్యాలు కూర్చిన తలుపులు, సువర్ణమయ సాలభంజికలు, పావురాల జంటల కువకువలతో కూడిన గూళ్ళు కలిగిన ద్వారకానగరాన్ని నారదుడు దర్శించాడు. చెలికత్తెల కాలిఅందెల మధుర ధ్వనులతో నిండి మంజుల మాణిక్యదీప మాలికలతో వెలుగొందే ఒక అందకత్తె సౌధంలో బంగారు కంకణాలు గలగలలాడుతు ఉండగా, సుందరీమణులు వీస్తున్న వింజామరల గాలికి కదులుతున్న ముంగురులు కల గోపికావల్లభుడు, నల్లనయ్యను నారదుడు చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=604

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, August 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౪ (304)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-601-వ.
మఱియును, సముత్తుంగమణిసౌధగవాక్షరంధ్ర నిర్గత నీరంధ్ర ఘనసార చందనాగరు ధూపధూమపటల విలోకన సంజనిత పయోధరాభిశంకాంగీకృత తాండవకేళీవిలోల పురకామినీజనోప లాలిత నీలకంఠ సముదయంబును, జంద్రకాంతమణిస్ఫటికస్తంభ సంభృత మరకత పద్మరాగఘటిత నవరత్న కాంచనప్రాసాదశిఖరాగ్ర విన్యస్త బహుసూర్య విభ్రమకృదంచిత శాతకుంభకుంభ నిచయంబును, సమస్తవస్తువిస్తార సమర్పిత వైశ్యాగారవీథీవేదికా కలితంబును, మహితాతపనివారణ తరళవిచిత్రకేతనాబద్ధ మయూరశింజినీ నినదపూరితాశాంతరిక్షంబును, సరోజనాభ పూతనాచేతనాపహారాది నూతనవిజయసందేశలిఖిత స్వర్ణ వర్ణావళీవిభాసిత గోపురమణివిటంకప్రదేశంబును, యాదవేంద్ర దర్శనోత్సవాహూయమాన సమాగతనానాదేశాధీశభూరివారణ దానజల ప్రభూతపంకనిరసనైక గతాగత జనసమ్మర్ద కరకంకణ కర్షణ వికీర్యమాణ రజఃపుంజంబును; వినూత్న రత్నమయ మంగళరంగవల్లీ విరాజిత ప్రతిగృహప్రాంగణంబును, గుంకుమ సలిలసిక్త విపణిమార్గంబును, వందిమాగధసంగీతమంగళారావ విలసితంబును, భేరీ మృదంగ కాహళ శంఖ తూర్యరవాధరీకృత సాగరఘోషంబునునై, యమరావతీపురంబునుం బోలె వసుదేవ నందననివాసంబై, యనల పుటభేదనంబునుం బోలెఁ గృష్ణమార్గ సంచారభూతంబై, సంయమనీనామ నగరంబునుం బోలె హరి తనూభవాభిరామంబై, నైరృతినిలయంబునుం బోలెఁ బుణ్యజనాకీర్ణంబై, వరుణనివాసంబునుఁ బోలె గోత్రరక్షణభువనప్రశస్తంబై, ప్రభంజనపట్టణంబునుం బోలె మహాబలసమృద్ధంబై, యలకాపురంబునుం బోలె ముకుంద వర శంఖ మకరాంక కలితంబయి, రజతాచలంబునుం బోలె నుగ్రసేనాధిపార్యాలంకృతంబయి, నిగమంబునుం బోలె వివిధవర్ణక్రమవిధ్యుక్త సంచారంబయి, గ్రహమండలంబునుం బోలె గురుబుధకవిరాజమిత్ర విరాజితంబయి, సంతతకల్యాణవేదియుం బోలె వైవాహికోపేతంబయి, బలిదానవ కరతలంబునుం బోలె సంతతదానవారియుక్తంబయి, యొప్పు నప్పురంబు ప్రవేశించి, యందు విశ్వకర్మనిర్మితంబైన యంతఃపురంబున నుండు షోడశసహస్ర హర్మ్యంబులందు.

భావము:
ఆ ద్వారకానగరంలో చాలా ఎత్తైన మేడలు ఉన్నాయి. ఆ సౌధాల కిటికీలలో నుంచి అగరు ధూపధూమాలు వెలువడుతున్నాయి. ఆ నల్లని పొగలను మేఘాలని భ్రమించి, అచ్చటి కాంతామణులు ఎంతో అనురాగంతో లాలిస్తున్న నెమళ్ళు తాండవం చేస్తున్నాయి. ఆ పట్టణంలో చంద్రకాంతమణులు చెక్కిన స్ఫటిక స్తంభాలతో కూడిన నవరత్న ప్రాసాదాలు ఉన్నాయి. ఆ ప్రాసాద శిఖరాల మీద బంగారుకలశాలు అమర్చి ఉన్నాయి ఆ కలశాల మీద ప్రసరించిన సూర్యకిరణాలు వేలకొలది సూర్యబింబాలను సృష్టిస్తున్నాయి. ఆ పట్టణంలో సమస్త వస్తువులతో కలకల లాడుతున్న విపణివీధులు ఉన్నాయి. ఆ పట్టణంలో ఆకాశాన్ని అంటుతూ, ఎగురుతున్న చిత్రవిచిత్రమైన జెండా గుడ్డలు ఎండ తగలకుండా అడ్డుపడుతున్నాయి. గోపాల కృష్ణుడు బాలుడుగా చేసిన పూతన సంహారం మొదలైన వీరగాథలు బంగారు అక్షరాలతో చెక్కిన ఫలకాలు గోపురాలపై విరాజిల్లుతున్నాయి. నందనందనుని సందర్శన కోసం వచ్చిన నానాదేశాల రాజులు కానుకలుగా తెచ్చిన ఏనుగుల మదధారలతో తడిసిన ప్రదేశాలను వచ్చేపోయే వారి కరకంకణాల ఒరిపిడి వలన రాలిపడిన బంగారు రజను పొడిపొడిగా మారుస్తున్నాయి. ప్రతి ఇంటి ముందూ కొంగ్రొత్త రత్నాలతో ముద్దుముద్దుగా తీర్చిదిద్దిన ముత్యాలముగ్గులు అలరారుతున్నాయి. ఆ పట్టణం పన్నీరు చల్లిన వీధులతోనూ వందిమాగధుల సంగీత మంగళారావాలతోనూ సముద్రఘోషాన్ని సైతం క్రిందుపరచే భేరీ, మృదంగ, కాహళాది తూర్య ధ్వనులతోనూ నిండి ఉన్నది. అష్టదిక్పాలుర పట్టణాలను తలపించే ఆ ద్వారకాపట్టణాన్ని నారదుడు ప్రవేశించి అక్కడ విశ్వకర్మ చేత నిర్మించబడ్డ అంతఃపురంలోని పదహారువేల సౌధాలలోనూ శ్రీకృష్ణుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=601

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౦౩ (303)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-598-చ.
"నరవర! యొక్కనాఁడు విను నారదసంయమి మాధవుండు దా
నరకునిఁ ద్రుంచి వాని భవనంబున నున్న పదాఱువేల సుం
దరులను నొక్కమాటు ప్రమదంబున నందఱ కన్నిరూపులై
పరిణయ మయ్యె నా విని శుభస్థితిఁ దద్విభవంబుఁ జూడఁగన్.
10.2-599-వ.
ఇట్లు దలంచి కృష్ణపాలితంబయిన ద్వారకానగరంబు డాయంజని ముందట.
10.2-600-సీ.
శుక శారికా శిఖి పిక కూజిత ప్రస-
  వాంచితోద్యానవనౌఘములనుఁ
గలహంస సారస కైరవ కమల క-
  హ్లార శోభిత కమలాకరములఁ
గలమాది సస్య సంకుల వరేక్షుక్షేత్ర-
  భూరి లసన్నదీ తీరములను
గిరిసాను పతిత నిర్ఝరకణ సందోహ-
  సంతత హేమంతసమయములనుఁ
10.2-600.1-తే.
గమలసంభవ కాంచనకార రచిత
చిరతరైశ్వర్య నగరలక్ష్మీకరాబ్జ
ఘటిత నవరత్నమయ హేమకటక మనఁగ
సొబగుమీఱిన కోటయుఁ జూచె మౌని.

భావము:
“ఓ రాజశేఖరా! విను. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి, అతని మందిరంలో ఉన్న పదహారువేల మంది అందగత్తెలనూ వరించి, ఒకేమారు అందరికీ అన్ని రూపాలతో కనపడుతూ వివాహం చేసుకున్నాడు అనే వార్త నారదుడు విన్నాడు. ఒకనాడు ఆ కృష్ణవైభవం దర్శించాలనే కాంక్షతో ద్వారకకు వచ్చాడు. అప్పుడు అలా కృష్ణవైభవ దర్శనం కోసం నారదుడు ద్వారకలో ప్రవేశించి నప్పుడు. చిలుకలూ, గోరువంకలూ, నెమళ్ళూ, కోయిలలూ ఆనందంతో కలకలారావాలు చేస్తూ ఉన్న ఉద్యానవనాలను కనుగొన్నాడు. హంసలతోనూ, బెగ్గురపక్షులతోనూ, పద్మాలతోనూ, కలువలతోనూ శోభిస్తున్న సరస్సులను సందర్శించాడు. వరిపంటలతో కలకలలాడే క్షేత్రాలతోనూ చెరకుతోటలతోనూ కనువిందుచేసే నదీతీరాలను సందర్శించాడు. కొండచరియల నుంచి ఎడతెగకుండా జల్లులుగా పడుతున్న సెలయేటి నీటితుంపరల వలన సదా హేమంత ఋతువుగా అలరారుతున్న ప్రదేశాలనూ తిలకించాడు. భోగభాగ్యాలతో తులతూగే నగరలక్ష్మి తన చేతికి ధరించినదీ, బ్రహ్మతో సమానులైన స్వర్ణకారులు తయారుచేసినదీ అయిన నవరత్న ఖచిత బంగారు కంకణంలాగా ప్రకాశిస్తున్న కోటను చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=600

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, August 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౨ (302)

( కాశీరాజు వధ )

10.2-535-వ.
అదియును, బ్రళయవేళాసంభూత జీమూతసంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహాదుస్సహ కహకహ నిబిడనిస్వననిర్ఘోషపరిపూరిత బ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహ కీలాసముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగచ్ఛటాభీలంబును, సకలదేవతాగణ జయజయశబ్ద కలితంబును, ననంతతేజో విరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంటనంటిన నది తన తొంటిరౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతంబొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు ఋత్విఙ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె; నత్తఱిఁ జక్రంబును దన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాల కాది వివిధ వస్తు వాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి యమరులు వెఱఁగందఁ గమలలోచన పార్శ్వవర్తి యై నిజ ప్రభాపుంజంబు వెలుఁగొందఁ గొల్చియుండె" నని చెప్పి; మఱియు నిట్లనియె.
10.2-536-క.
"మురరిపు విజయాంకితమగు
చరితము సద్భక్తిఁ దగిలి చదివిన వినినన్
దురితములఁ బాసి జను లిహ
పరసౌఖ్యము లతనిచేతఁ బడయుదు రధిపా!"
10.2-537-వ.
అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె.

భావము:
ఆ చక్రాయుధం ప్రళయకాలంనాటి మేఘాల నుండి పుట్టిన ఘుమ ఘుమ అంటూ భయంకరంగా ధ్వనించే గర్జనల వంటి ధ్వనితో, ఆకాశాన్ని అంటుతున్న అగ్నిజ్వాలలతో, అమిత తేజస్సుతో వెలుగొందుతూ, సకల దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా, కృత్యను సమీపించింది. తనను చూసి తడబడకుండా కంటగిస్తున్న కృత్యను గెంటివేసి, వెంటబడింది. అప్పుడు, కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురం వచ్చింది. మరలి వచ్చిన కృత్యను చూసి పౌరులంతా భయపడి శోకిస్తుండగా, ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుని దహించి వేసింది. అప్పుడు, శ్రీకృష్ణుడి చక్రాయుధం సౌధ, గోపుర, ప్రాకారాలతోపాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేలా శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి చేరి, తన నిజప్రభావంతో ప్రకాశిస్తూ ఉంది.” అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పి కృష్ణగాథను ఇంకా ఇలా కొనసాగించాడు. “ఓ పరీక్షన్మహారాజా! శ్రీకృష్ణుడి ఈ విజయగాథలను భక్తితో చదివినవారు, వినినవారు పాపరహితులై, ఆ దేవుని దయచేత ఇహపర సౌఖ్యాలను పొందుతారు.” శుకయోగి ఇలా చెప్పగా రాజయోగి ఐన పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=536

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, August 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౧ (301)

( కాశీరాజు వధ )

10.2-534-సీ.
భీమమై బహుతీవ్రధామమై హతరిపు-
  స్తోమమై సుమహితోద్దామ మగుచుఁ
జండమై విజితమార్తాండమై పాలితా-
  జాండమై విజయప్రకాండ మగుచు
దివ్యమై నిఖిలగంతవ్యమై సుజన సం-
  భావ్యమై సద్భక్త సేవ్య మగుచు
నిత్యమై నిగమసంస్తుత్యమై వినమితా-
  దిత్యమై నిర్జితదైత్య మగుచు
10.2-534.1-తే.
విలయసమయ సముద్భూత విపులభాస్వ
దళికలోచన లోచనానల సహస్ర
ఘటిత పటుసటాజ్వాలికా చటుల సత్త్వ
భయదచక్రంబు కృత్యపైఁ బంపె శౌరి.

భావము:
బహు భయంకరమైనదీ, శత్రువులను హతం గావించేదీ, సూర్యకాంతిని ధిక్కరించే తీక్షణ మైన కాంతి కలదీ, సుజనులచే స్తుతింపబడేదీ, భక్తులచే సేవించబడేదీ, దేవతలచే నమస్కరింపబడేదీ, దానవులను సంహరించేదీ, ప్రళయకాలంలోన పరమేశ్వరుని ఫాలనేత్రం నుంచి వెలువడే జ్వలనజ్వాలా మాలికవలె భయంకరమైనదీ, అన్ని వైపులా పయనించ గలదీ అయిన ఆ చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు కృత్యపై ప్రయోగించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=534

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


Wednesday, August 4, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౦ (300)

( కాశీరాజు వధ )

10.2-532-తే.
అనిన నా చంద్రమౌళి వాక్యముల భంగి
భూరినియమముతో నభిచారహోమ
మొనరఁ గావింప నగ్ని యథోచితముగఁ
జెలఁగు దక్షిణవలమాన శిఖల వెలిఁగె.
10.2-533-వ.
అందుఁ దామ్రశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబులైన నిడుద కోఱలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడిన బొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతి రౌద్రాకారంబునఁ బ్రజ్వరిల్లుచుఁ గుండంబు వెలువడి యనుదిన నిహన్య మాన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా నార్చుచు, నుత్తాల తాలప్రమాణ పాదద్వయ హతులం దూలు పెంధూళి నింగిమ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయై, నిజవిలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబున దిశాజాలంబు నోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరు నగరంబున కరుగుదేరఁ, బౌరజనంబులు భయాకులమానసులై దావదహనునిం గని పఱచు వన మృగంబులచాడ్పునం బఱచి, సుధర్మాభ్యంతరంబున జూదమాడు దామోదరునిం గని “రక్షరక్షేతి”రవంబుల నార్తులయి “కృష్ణ! కృష్ణ! పెనుమంటలం బురంబు గాల్పం బ్రళయాగ్ని సనుదెంచె” నన వారిం జూచి “యోడకోడకుఁ” డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయుఁ దన దివ్యచిత్తంబున నెఱింగి కాశీరాజపుత్త్ర ప్రేరితయైన యమ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ్వవర్తి యయియున్న యద్దివ్యసాధనంబు గనుంగొని యప్పుడు.

భావము:
అలా చెప్పిన పరమేశ్వరుని వాక్యానుసారం సుదక్షిణుడు గొప్పనియమాలతో అభిచార హోమం చేసాడు. అగ్నిదేవుడు కుడి వైపుగా తిరుగుతూ జ్వలించే జ్వాలలతో వెలిగాడు. ఆ అభిచారహోమ గుండంలోని అగ్నిజ్వాలల నుండి ఎఱ్ఱని జుట్టూ; పిడుగుల వంటి కోరలూ; నిప్పులు గ్రక్కే చూపులూ; ముడిపడిన కనుబొమలూ; జేవురించిన ముఖము; కలిగిన “కృత్య” అతిభయంకర ఆకారంతో వెలువడింది. ఆ కృత్య మృత్యుదేవత కరవాలంలా కనిపిస్తున్న నాలుకతో పెదవి మూలలు తడవుకుంటూ, అగ్నిజ్వాలవంటి శూలాన్ని చేతబట్టి, లోకం దద్దరిల్లేలా బొబ్బలు పెడుతూ, నింగినిండా దుమ్ము వ్యాపించేలా తాటిచెట్ల వంటి పాదాలతో అడుగులు వేస్తూ, భూతాలు సేవిస్తుండగా, కళ్ళ నుంచి రాలే నిప్పులతో దిక్కులను కాల్చివేస్తూ, అతివేగంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి దిగంబరంగా వచ్చింది. ద్వారకానగరవాసులు అంతా కృత్యను చూచి దావానలాన్ని చూసి పారిపోయే అడవిజంతువుల లాగా పారిపోయి “కాపాడు కాపాడు” అని అరుస్తూ, సుధర్మా సభామండపంలో జూదమాడుతున్న దామోదరుడు, శ్రీకృష్ణుడిని చేరారు. “మన పట్టణాన్ని దహించడానికి ప్రళయకాలాగ్ని వచ్చింది. మమ్మల్ని రక్షించు” అని ప్రార్థించారు. వారికి “భయపడకండి” అని చెప్పి, పుండరీకముల వంటి కన్నులున్న వాడు, విశ్వము అంతటిలోనూ ఆత్మరూపంలో వ్యాపించి ఉండేవాడు, సర్వరక్షకుడు, అయిన శ్రీకృష్ణుడు జరిగిన సంగతంతా దివ్యదృష్టితో తెలిసికొని, కాశీ రాకుమారుడు పంపించిన కృత్యను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని పరికించి......

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=533

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 3, 2021

శ్రీకృష్ణ విజయము - 299

( కాశీరాజు వధ )

10.2-529-క.
"మెచ్చితి నే వర మైనను
నిచ్చెద నను వేఁడు" మనిన "నీశ్వర! నన్నున్
మచ్చిక రక్షింతువు పొర
పొచ్చెము సేయక మహేశ! పురహర! యభవా!
10.2-530-క.
దేవా! మజ్జనకుని వసు
దేవాత్మజుఁ డాజిలో వధించెను, నే నా
గోవిందుని ననిలోపల
నే విధమున గెలుతు నానతీవె పురారీ! "
10.2-531-తే.
అనిన శంకరుఁ డతనికి ననియె "ననఘ!
నీవు ఋత్విజులును భూసురావళియునుఁ
బ్రీతి నభిచార మొనరింప భూతయుక్తుఁ
డగుచు ననలుండు దీర్చు నీ యభిమతంబు. "

భావము:
“నీ భక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను” అని అనుగ్రహించాడు. అప్పుడు, సుదక్షిణుడు “పరమేశ్వరా! త్రిపురాసుర సంహారా! అభవా! నన్ను ప్రీతితో ఏ పొరపొచ్చమూ లేకుండా తప్పక రక్షిస్తావు. ఓ దేవా! వాసుదేవుడి కొడుకు శ్రీకృష్ణుడు నా తండ్రిని యుద్ధంలో సంహరించాడు. నేను యుద్ధంలో ఆ శ్రీకృష్ణుడిని ఏ ఉపాయంతో అయితే గెలువగలనో దానిని చెప్పు.” అని ప్రార్థించాడు. అప్పుడు పరమశివుడు అతడితో ఇలా అన్నాడు “అనఘా! నీవూ ఋత్విజులూ బ్రాహ్మణశ్రేష్ఠులూ ప్రీతితో అభిచారహోమం చేస్తే, భూతములతో కూడి, అగ్నిదేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=531

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, August 2, 2021

శ్రీకృష్ణ విజయము - 298

( కాశీరాజు వధ )

10.2-527-సీ.
అక్కడఁ గాశిలో నా రాజు మందిరాం-
  గణమునఁ గుండల కలిత మగుచుఁ
బడి యున్న తలఁ జూచి పౌరజనంబులు-
  దమ రాజు తలయ కాఁ దగ నెఱింగి
చెప్పిన నా నృపు జీవితేశ్వరులును-
  సుతులు బంధువులును హితులు గూడి
మొనసి హాహాకారమున నేడ్చి; రత్తఱిఁ-
  దత్తనూభవుఁడు సుదక్షిణుండు
10.2-527.1-తే.
వెలయఁ దండ్రికిఁ బరలోకవిధు లొనర్చి
జనకు ననిలో వధించిన చక్రపాణి
నడరి మర్దింపఁ దగు నుపాయంబు దలఁచి
చతురుఁ డగు నట్టి తన పురోహితునిఁ బిలిచి.
10.2-528-క.
అతడుం దానునుఁ జని పశు
పతిపద సరసిజములకునుఁ బ్రమదముతో నా
నతుఁడై యద్దేవుని బహు
గతులం బూజింప నతఁడుఁ గరుణాన్వితుఁడై.

భావము:
ఇక అక్కడ కాశీపట్టణంలో ఆ రాజమందిరంలో, కుండల సహితమైన శిరస్సు పడగానే పురజనులు అందరూ అది తమ రాజు శిరస్సుగా గుర్తించారు. ఆ రాజు భార్యలు, పుత్రులు, మిత్రులు, బంధువులు హాహాకారాలు చేస్తూ దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు తండ్రికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. తన తండ్రిని యుద్ధంలో సంహరించిన శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఉపాయం ఆలోచించాడు. చతురుడైన పురోహితుడిని పిలిపించి. పురోహితుడూ తానూ వెళ్ళి పరమేశ్వరుని పాదాలకు మ్రొక్కి, బహువిధాలుగా పూజలు చేసారు. పరమశివుడు కరుణామయుడు అయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=527

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 297

( కాశీరాజు వధ )

10.2-524-చ.
మడవక కాశికావిభుని మస్తక ముద్ధతిఁ ద్రుంచి బంతి కై
వడి నది పింజ పింజ గఱవన్ విశిఖాళి నిగుడ్చి వాని యే
లెడి పురిలోన వైచె నవలీల మురాంతకుఁ డిట్లు వైరులం
గడఁగి జయించి చిత్తమునఁ గౌతుకముం జిగురొత్త నత్తఱిన్.
10.2-525-క.
సుర గంధర్వ నభశ్చర
గరుడోరగ సిద్ధ సాధ్యగణము నుతింపన్
మరలి చనుదెంచి హరి నిజ
పురమున సుఖముండె నతి విభూతి దలిర్పన్.
10.2-526-క.
వనజోదరు చిహ్నంబులు
గొనకొని ధరియించి పౌండ్రకుఁడు మచ్చరియై
యనవరతము హరి దన తలఁ
పునఁ దగులుటఁ జేసి ముక్తిఁ బొందె నరేంద్రా!

భావము:
అటుపిమ్మట, కాశీరాజు శిరస్సును కూడా శ్రీకృష్ణుడు ఖండించి, ఆ శిరస్సును బంతిలాగ వరుస బాణాలతో పైపైకి ఎగురకొట్టి అతని పట్టణంలో పడేలా కొట్టాడు. ఈ విధంగా మురాంతకుడు శత్రువులను జయించి మనస్సులో ఎంతో ఉత్సాహం ఉప్పొంగగా ఆనందించాడు. అప్పుడు దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య, గరుడ, ఉరగ గణాలు వారందరూ స్తుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మిక్కిలి వైభవంతో తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు. రాజా పరీక్షిత్తూ! పద్మనాభుడి చిహ్నాలు అన్నింటినీ పట్టుదలతో ధరించి అసూయాపరుడై నిరంతరం తన మనస్సులో శ్రీకృష్ణుడినే ధ్యానించడం వలన పౌండ్రకుడు మోక్షాన్ని పొందాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=526

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :