Saturday, December 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 110

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1427-వ.
వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లైన విష్ణుమూర్తు లని యెఱింగి; భక్తితోడ శుశ్రూష చేసి సర్వభూతమయుం డగు కృష్ణునకు నమస్కరించి “యేమి చేయుదు నానతి” మ్మనిన నమహాత్ముండు యిట్లనియె.
10.1-1428-క.
"చెప్పెద మా గురునందనుఁ
దప్పుగలుగఁ జూచి నీవు దండనమునకుం
దెప్పించినాఁడ వాతని
నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!"

భావము:
అలా వచ్చిన యముడు బలరామకృష్ణులను చూడగానే. వారు లీలావతారం ధరించిన విష్ణువు అవతార మూర్తులు అని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన కృష్ణుడికి నమస్సులు సమర్పించి. “నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించ” మని అడిగాడు. యముడి మాటలు విని ఆ పరమాత్మ ఇలా అన్నాడు. “ఓ పుణ్యశీలా! యమధర్మరాజా! చెబుతాను విను. మా గురుపుత్రునిలో తప్పు చూసి దండించడం కోసం తెప్పించుకున్నావు. మాకు అతడు కావాలి, అప్పగించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1428

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 109

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1425-వ.
చని సంయమనీనామ నగరంబు చేరి తద్వారంబునఁ బ్రళయకాల మేఘగంభీర నినద భీషణం బగు శంఖంబు పూరించిన విని వెఱఁగుపడి.
10.1-1426-శా.
"అస్మద్బాహుబలంబుఁ గైకొనక శంఖారావమున్ మాన సా
పస్మారంబుగ నెవ్వఁ డొక్కొ నగరప్రాంతంబునం జేసె? మ
ద్విస్మేరాహవ రోషపావకునిచే విధ్వస్తుఁడై వాఁడు దా
భస్మంబై చెడు" నంచు నంతకుఁడు కోపప్రజ్వలన్మూర్తియై.

భావము:
అలా వెళ్ళిన శ్రీకృష్ణుడు సంయమని అనే పేరు కల ఆ యముడి పట్టణం చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీరధ్వనితో భీతిగొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖఘోషము వినిన యమధర్మరాజు అశ్చర్యపోయాడు. “నా యమపురి ముందట ఎవరో నా భుజబలాన్ని లెక్కచేయకుండా నా మనసుకు క్రోధావేశం కలిగేలా శంఖం పూరిస్తున్నాడు. వాడు అద్భుతావహ మైన నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు.” అంటూ దండధరుడు కోపంతో మండిపడుతూ వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1426

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, December 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 108

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1422-వ.
అని వాని వసియించు చో టెఱింగించిన.
10.1-1423-శా.
శంఖారావముతోడఁ బంచజనుఁ డాశంకించి చిత్తంబులో
సం ఖిన్నుండయి వార్థిఁ జొచ్చె దహనజ్వాలాభ హేమోజ్జ్వల
త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ
ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై.
10.1-1424-క.
దానవుని దేహజం బగు
మానిత శంఖంబుఁ గొనుచు మసలక బలుఁడుం
దో నేతేరఁగ రథి యై
దానవరిపుఁ డరిగె దండధరుపురికి నృపా!

భావము:
అంటూ సముద్రుడు ఆ రాక్షసుడుండే చోటు రామకృష్ణులకు తెలియజేసాడు. శ్రీకృష్ణుడు శంఖం పూరించగా, ఆ శంఖారావం వినిన పంచజనుడు భయ సందేహాలతో కంపించిపోయి,. సాగర జలంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు వాడిని అగ్నిజ్వాలలతో సమానములైన బంగారుపింజల రంగారు బాణాలతో పడగొట్టి, వాడి పొట్టను చీల్చాడు. అచంచలమనస్కు డైన శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రకుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రీతిచే కార్య తత్పరుడు అయ్యాడు. ఓ పరీక్షన్మహారాజా! రాక్షసవిరోధి అయిన శ్రీకృష్ణుడు పంచజన రాక్షసుడి శరీరం నుంచి జనించిన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్ర సహితుడై రథము ఎక్కి, యమ పురికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1424

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 107

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1418-వ.
అనిన విని రామకృష్ణులు గుర్వర్థంబుగా దుర్వారరథారూఢులై రయంబునం జని రౌద్రంబున సముద్రంబుఁ జేరి యిట్లనిరి.
10.1-1419-క.
"సాగర! సుబుద్ధితోడను
మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ
వాగడ మగుదువు దుస్సహ
వేగరణాభీల నిశిత విశిఖాగ్నులకున్."
10.1-1420-వ.
అనిన వారలకు జలరాశి యిట్లనియె.
10.1-1421-ఉ.
"వంచన యేమి లేదు యదువల్లభులార! ప్రభాసతీర్థమం
దంచితమూర్తి విప్రసుతుఁ డాఢ్యుఁడు తోయములాడుచుండ ను
త్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతిం గొనిపోయెఁ బోవఁగాఁ
బంచజనుండు మ్రింగె నతిభాసురశీలుని విప్రబాలునిన్."

భావము:
ఇలా పలికిన తమ గురువు పలుకులు విని, రామకృష్ణులు వారి కోరిక తీర్చడం కోసం ఎదురు లేని రథాన్ని అధిరోహించారు. తత్క్షణం సముద్రుడి దగ్గరకి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు. “ఓ సముద్రుడా! మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుడిని తెచ్చి మాకు అప్పగించు. ఎదురు చెప్పావు అంటే, సహింపరాని వేగం కలవీ, రణరంగ భయంకరాలూ అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గుఱి అవుతావు.” ఇలా పలికిన రామకృష్ణులతో సాగరుడు ఇలా అన్నాడు. “యాదవేశ్వరులారా! నా మాటలలో ఏమాత్రం మోసం లేదు. ప్రభాసతీర్ధంలో మంచి అందమైన చక్కటి బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా, పెద్ద అల ఒకటి పైకెగసి భయంకరవేగంతో అతడిని లోపలికి తీసుకుపోయింది. అలా తీసుకునిపోగా బహు చక్కనైన స్వభావం కల ఆ బ్రాహ్మణ పిల్లాడిని పంచజనుడనే దైత్యుడు మ్రింగివేశాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1421

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, December 21, 2020

శ్రీ కృష్ణ విజయము - 106

( సాందీపుని వద్ధ శిష్యులగుట )


10.1-1416-శా.
"అంభోరాశిఁ బ్రభాసతీర్థమున ము న్నస్మత్తనూసంభవుం
డంభోగాహము సేయుచున్ మునిఁగి లేఁ డయ్యెం గృపాంభోనిధుల్
శుంభద్వీర్యులు మీరు మీ గురునకుం జోద్యంబుగా శిష్యతన్
గాంభీర్యంబునఁ బుత్రదక్షిణ యిడం గర్తవ్య మూహింపరే.
10.1-1417-క.
శిష్యులు బలాఢ్యులైన వి
శేష్యస్థితి నొంది గురువు జీవించును ని
ర్దూష్యగుణ బలగరిష్ఠులు
శిష్యులరై గురుని కోర్కి సేయం దగదే?"

భావము:
“నాయనలారా! మా కుమారుడు కొన్నాళ్ళ క్రితం సముద్రంలో ప్రభాసమనే తీర్థ ఘట్టం వద్ద స్నానం చేయడానికి నీటిలో దిగి మునిగిపోయాడు. అంతే మళ్ళీ కనిపించ లేదు. దయసముద్రులూ, ప్రకాశవంతమైన ప్రతాపం కలవారూ అయిన మీరు శిష్యధర్మం వహించి, మాకు గురుదక్షిణ ఇవ్వాలి. అందుచేత, అందరికీ అచ్చెరువు కలిగేలాగ మా కుమారుడిని తీసుకొని వచ్చి గురుదక్షిణగా ఇవ్వండి. శిష్యులు మిక్కిలి బలవంతులైతే గురువు విశేషమైన ఉత్తమస్థితిని పొంది తలెత్తుకొని జీవిస్తాడు. అనింద్య గుణములతో, అఖండ పరాక్రమంతో విరాజిల్లే మీ వంటి శిష్యులు గురుడి కోరిక నెరవేర్చడం న్యాయం కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1417

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, December 19, 2020

శ్రీ కృష్ణ విజయము - 105

( సాందీపుని వద్ధ శిష్యులగుట )

10.1-1413-క.
అఱువదినాలుగు విద్యలు
నఱువదినాలుగు దినంబు లంతన వారల్
నెఱవాదులైన కతమున
నెఱి నొక్కొక నాటి వినికి నేర్చి రిలేశా!
10.1-1414-క.
గురువులకు నెల్ల గురులై
గురులఘుభావములు లేక కొమరారు జగ
ద్గురులు త్రిలోకహితార్థము
గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్.
10.1-1415-వ.
ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి వారల మహాత్మ్యంబునకు వెఱఁగుపడి సభార్యుండైన సాందీపుం డిట్లనియె.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! రామకృష్ణులు ఎంతో నేర్పరులు కనుక, అరవైనాలుగు కళలనూ అరవైనాలుగు రోజులలో చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ చొప్పన వినడంతోనే నేర్చుసుకున్నారు. గురువులకే గురువులు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేద భావములు లేక ప్రకాశించు లోకగురువులు అయిన రామకృష్ణులు, ముల్లోకాలకు మేలు కలిగించడం కోసం, సంతోషంగా గురుశిష్య న్యాయంతో గురువు అయిన సాందీపుడిని సేవించారు. ఇలా, కృతార్థులైన శిష్యులను చూసి వారి ప్రభావానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి, సాందీపని రామకృష్ణులతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1414

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 104

( సాందీపుని వద్ధ శిష్యులగుట )

10.1-1411-వ.
చని మహావైభవరాశియైన కాశిం జేరి తత్తీరంబున నవంతీపుర నివాసియు సకలవిద్యావిలాసియు నైన సాందీపుం డను బుధవర్యునిఁ గని యధోచితంబుగ దర్శించి, శుద్ధభావవర్తనంబుల భక్తి సేయుచునుండ, వారలవలన సంతుష్టుండై.
10.1-1412-శా.
వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ
న్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్కవి
ద్యాదక్షత్వము రాజనీతియును శబ్దప్రక్రియం జెప్పె నా
భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్.

భావము:
రామకృష్ణులు గొప్ప వైభవములకు కాణాచి అయిన కాశీపట్టణం చేరారు. అక్కడ ఉన్న అవంతీపట్టణ నివాసి, సమస్త విద్యలకూ గని వంటి వాడూ అయిన సాందీపనీ అనే పండితోత్తముడిని సముచిత రీతిని సందర్శించారు. స్వచ్ఛమైన మనస్సుతో సత్ప్రవర్తనతో ప్రగాఢమైన భక్తితో ఆయనను సేవించారు. ఆచార్యులు ఆ శిష్యుల వినయ విధేయతలకు ఎంతో సంతోషించారు. బ్రాహ్మణోత్తముడైన సాందీపని సంతోషించిన మనసుతో రామకృష్ణులకు నాలుగు వేదములు మరియు శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను ఆరు వేదాంగములు, ధనుర్వేదము, తంత్రము, మనుశాస్త్రాది సకల ధర్మశాస్త్రాలు, చక్కటి న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము, రాజనీతి మొదలైనవాటిని తేటతెల్లంగా బోధించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1412

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, December 18, 2020

శ్రీ కృష్ణ విజయము - 102

( రామకృష్ణుల ఉపనయనము )

10.1-1407-క.
గర్గాది భూసురోత్తమ
వర్గముచే నుపనయనము వసుదేవుఁడు స
న్మార్గంబునఁ జేయించెను
నిర్గర్వచరిత్రులకును నిజ పుత్రులకున్.
10.1-1408-క.
ద్విజరాజ వంశవర్యులు
ద్విజరాజ ముఖాంబుజోపదిష్టవ్రతులై
ద్విజరాజత్వము నొందిరి
ద్విజరాజాదిక జనంబు దీవింపంగన్.

భావము:
వసుదేవుడు గర్వరహితమైన చరిత్ర కల తన పుత్రులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు. చంద్రవంశజులలో అగ్రగణ్యులై అలరారుతున్న బలరామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖకమలాల నుండి ఉపనయన మంత్రాల ఉపదేశములు పొందారు. విప్రులు, రాజులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైనవారూ దీవెనలీయగా ద్విజత్వం అందుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=169&padyam=1408

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 103

( రామకృష్ణుల ఉపనయనము )

10.1-1409-వ.
ఉపనయ నానంతరంబున వసుదేవుండు బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గో హిరణ్యాది దానంబు లొసంగి తొల్లి రామకృష్ణుల జన్మసమయంబు లందు నిజమనోదత్తలైన గోవుల నుచ్చరించి యిచ్చి కామితార్థంబుల నర్థులకుం బెట్టె; నిట్లు బ్రహ్మచారులై.
10.1-1410-శా.
ఉర్విన్ మానవు లెవ్వరైన గురువా క్యోద్యుక్తులై కాని త
త్పూ ర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్
సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియున్
గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్ రాముఁడున్.

భావము:
ఉపనయనము జరిగిన పిమ్మట, వసుదేవుడు విప్రులకు దక్షిణల సహితంగా ధేనువులు, బంగారము మొదలైన అనేక దానాలు చేసాడు. ఇంతకు మునుపు రామకృష్ణులు జననకాలంలో తాను మనస్సులో దానం చేసినట్లు చేసిన సంకల్పం ప్రకారం, ఇప్పుడు ప్రత్యక్షంగా గోవులను ఇచ్చాడు. కోరిన వారికి కోరినట్లు సమస్త వస్తువులూ సమర్పించాడు. ఈ విధంగా బలరామకృష్ణులు బ్రహ్మచర్యవ్రతం అవలంబించి. భూలోకంలో మానవులు ఎవరైనా సరే గురువు నుండి ఉపదేశం పొందితే తప్ప ఏ విద్య అనుష్ఠానం మొదలుపెట్ట రాదు సుమా, అని లోకానికి బోధించాలని బలరామకృష్ణులు భావించారు. సమస్తము నెరిగిన వారైనప్పటికినీ జగద్గురువులు అయినప్పటికీ; పరిపూర్ణులు అయినప్పటికీ; బలరామకృష్ణులు ఆచార్యుడి కోసం అన్వేషిస్తూ బయలుదేరారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=169&padyam=1410

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, December 16, 2020

శ్రీ కృష్ణ విజయము - 101

( నందుని వ్రేపల్లెకు పంపుట )

10.1-1405-ఉ.
ఇక్కడ నున్న బాంధవుల కెల్లను సౌఖ్యము చేసి వత్తు మే
మక్కడికిన్; మదీయులకు నందఱికిన్ వినుపింపు మయ్య యే
మెక్కడ నున్న మాకు మది నెన్నఁడు పాయవు మీ వ్రజంబులో
మక్కువతోడ మీరు కృప మా కొనరించు క్రియావిశేషముల్."
10.1-1406-వ.
అని పలికి వస్త్రభూషణాదు లొసంగి సాదరంబుగం గౌఁగిలించుకొని గోవిందుం డనిచిన నందుండు ప్రణయవిహ్వలుండై బాష్పజలపూరితలోచనుం డగుచు వల్లవులుం దానును వ్రేపల్లెకుం జనియె; నంత

భావము:
మేము ఇక్కడ మధురలో ఉన్న మన చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడకి వ్రేపల్లెకు వస్తాము. ఈ సంగతి మన వారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతోనూ, దయతోనూ మాకు చేసిన ఉపచారాలు, మేము ఎక్కడున్నా మా మనసుల నుండి ఎన్నటికినీ దూరము కావు.” ఈ విధంగా పలికిన శ్రీకృష్ణుడు వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటిని ఇచ్చి, ఆదరంతో కౌఁగిలించుకుని, సాగనంపాడు. నందుడి మనసు అనురాగాతిశయంతో చలించింది. కన్నీళ్ళతో నిండిన కన్నులు కలవాడై, గొల్లపెద్దలతో కలిసి వ్రేపల్లెకు బయలుదేరి వెళ్ళాడు. అనంతరం. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=168&padyam=1405

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 100

( నందుని వ్రేపల్లెకు పంపుట )

10.1-1403-వ.
అంత నొక్కనాడు సంకర్షణ సహితుండై నందునిం జీరి గోవిందుం డిట్లనియె.
10.1-1404-శా.
"తండ్రిం జూడము తల్లిఁ జూడము యశోదాదేవియున్ నీవు మా
తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం; దొల్లి యే
తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి? భవత్సౌజన్య భావంబులం
దండ్రీ! యింతటివార మైతిమిగదా! తత్తద్వయోలీలలన్.

భావము:
అటు తరువాత, ఒకరోజు కృష్ణుడు బలరాముడితో కలిసి నందుడిని పిలిపించి ఇలా అన్నాడు. “జనకా! మేము తండ్రిని చూడ లేదు. తల్లిని చూడ లేదు. యశోదాదేవీ, నీవూ మా తల్లితండ్రులని భావిస్తూ ఉన్నాము. ఇంతకు ముందు ఏ తల్లి తండ్రులు కూడ మీ అంత గారాబంగా తమ బిడ్డలను పెంచలేదు. మీ మంచితనం వలన ఆయా వయసులకు తగిన ఆటపాటలతో పెరిగి ఇంత వారము అయ్యాము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=168&padyam=1404

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, December 15, 2020

శ్రీ కృష్ణ విజయము - 99

( ఉగ్రసేనుని రాజుగజేయుట )

10.1-1401-వ.
తదనంతరంబ తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించు చున్న యదు, వృష్ణి, భోజ, మరు, దశార్హ, కకురాంధక ప్రముఖు లగు సకల జ్ఞాతి సంబంధులను రావించి చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారి వారి నివాసంబుల నుండ నియమించె; ని వ్విధంబున.
10.1-1402-క.
మధుసూదన సత్కరుణా
మధురాలోకన విముక్త మానస భయులై
మధురవచనములఁ దారును
మథురానగరంబు ప్రజలు మనిరి నరేంద్రా!

భావము:
అటుపిమ్మట, శ్రీకృష్ణుడు ఇంతకు ముందు కంసుడి భయం వలన ఇతర దేశాలలో బాధలు పడుతున్న తన జ్ఞాతులూ చుట్టాలూ అయిన యదువులు, వృష్ణులు, భోజులు, మరువులు, దశార్హులు, కుకురులు, అంధకులు మొదలైన వారిని అందరినీ పిలిపించాడు. వారి మనసులు తృప్తిచెందేలా వారికి ధనాదికాలు బహూకరించి, వారి వారి గృహాలలో నివసించం డని నియోగించాడు. ఈ విధంగా మధుసూదనుడు కృష్ణుడి యొక్క మిక్కిలి కరుణాపూరితమైన మధురాతిమధురమైన కటాక్షవీక్షణాలతో మనసులోని భీతి తొలగినవారై తీయ తీయని సల్లాపాలతో వారూ మథురాపురి పురప్రజలు కలసి మెలసి జీవించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=167&padyam=1402

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 98

( ఉగ్రసేనుని రాజుగజేయుట )

10.1-1398-చ.
"అనఘ! యయాతి శాపమున యాదవ వీరులకున్ నరేశ్వరా
సనమున నుండరాదు; నృపసత్తమ! రాజవు గమ్ము భూమికిన్;
నినుఁ గొలువంగ నిర్జరులు నీ కరిఁబెట్టుదు రన్య రాజులం
బనిగొను టెంత; రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్కతోన్."
10.1-1399-వ.
అని పలికి.
10.1-1400-క.
మన్నించి రాజుఁ జేసెను
వెన్నుఁడు సత్యావధాను విశ్రుతదానున్
సన్నుతమానున్ గదన
చ్ఛిన్నాహితసేను నుగ్రసేనున్ దీనున్.

భావము:
“ఓ పుణ్యాత్ముడా! ఉగ్రసేన రాజేంద్రా! యయాతి శాపం వలన ఎంతటి వీరులైనా యాదవులు రాజ్యపీఠం అధిష్టించడానికి వీలుకాదు. కాబట్టి, ఈ రాజ్యానికి నీవే రాజుగా ఉండు. మేము నిన్ను సేవిస్తూ ఉంటాము. దేవతలు సైతం నీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసావహిస్తా రని వేరుగా చెప్పనక్కర లేదు కదా. సంతోషంగా ప్రజలను పాలించడానికి సిద్ధంకా.” అలా పలికి సత్యనిష్ఠ కలవాడూ, దాతగా పేరుపొందిన వాడూ, అభిమానవంతు డని పొగడ్త కాంచినవాడూ, సమరంలో శత్రుసైన్యాలను సంహరించే వాడూ, గర్వం లేని వాడూ అయిన ఉగ్రసేనుడిని వాసుదేవుడు గౌరవించి మధురానగరానికి రాజుగా చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=167&padyam=1400

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, December 6, 2020

శ్రీ కృష్ణ విజయము - 97

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1394-క.
జననీజనకుల వృద్ధులఁ
దనయుల గురు విప్ర సాధు దారాదులనే
జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక
వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.
10.1-1395-వ.
అదియునుం గాక.
10.1-1396-శా.
కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా
వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపఁగా లేక ని
ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్
సారాతిక్షములార! మమ్ముఁ గొఱతల్ సైరించి రక్షింపరే."
10.1-1397-వ.
అని యిట్లు మాయామనుష్యుండైన హరి పలికిన పలుకులకు మోహితులై వారల నంకపీఠంబుల నిడుకొని కౌఁగిలించుకొని వారి వదనంబులు కన్నీటం దడుపుచుఁ బ్రేమపాశబద్ధులై, దేవకీవసుదేవు లూరకుండి; రంత వాసుదేవుండు మాతామహుండైన యుగ్రసేనుం జూచి.


భావము:
ఏ నరుడైతే తల్లితండ్రులను, వయోవృద్ధులనూ, భార్యాపిల్లలనూ, గురువులనూ, బ్రాహ్మణులనూ, సాధువులలు మొదలైనవారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక ఏడుస్తుంటాడో, అలాంటి వాడు ఈ భూమి మీద బ్రతికున్న శవం వంటి వాడే. అంతేకాక జననీజనకులారా! మీరు మిక్కిలి ఓర్పు కలవారు. మా కారణంగా మిమ్మల్ని కంసుడు చెరసాలలో బంధించి, బాధిస్తూ ఉంటే, వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలినవాళ్ళం; క్రూరులం; మిక్కిలి కుటిలమైన నడత కల వాళ్ళం. మా లోపాలు సహించి మమ్మల్ని మన్నించండి.” అంటూ ఇలా పలికిన మాయామానుషవిగ్రహుడైన శ్రీకృష్ణుడి మాటలకు దేవకీవసుదేవులు మోహము చెందారు. వారు తమ పుత్రులను ఒడిలోకి తీసుకున్నారు; గట్టిగా ఆలింగనం చేసుకున్నారు; కన్నీళ్ళతో వారి తలలు తడిపారు; ప్రేమాతిశయం వలన మాటలు పెగలక మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుడితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1396

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 96

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1392-సీ.
"మమ్ముఁ గంటిరిగాని మా బాల్య పౌగండ-
  కైశోర వయసులఁ గదిసి మీర
లెత్తుచు దించుచు నెలమి మన్నించుచు-
  నుండు సౌభాగ్యంబు నొంద రైతి;
రాకాంక్ష గలిగియున్నది దైవయోగంబు-
  తల్లిదండ్రుల యొద్ద తనయు లుండి
యే యవసరమున నెబ్బంగి లాలితు-
  లగుచు వర్ధిల్లుదు రట్టి మహిమ
10.1-1392.1-తే.
మాకు నిన్నాళ్ళు లే దయ్యె మఱియు వినుఁడు
నిఖిల పురుషార్థహేతువై నెగడుచున్న
మేని కెవ్వార లాఢ్యులు మీరకారె
యా ఋణముఁ దీర్ప నూఱేండ్లకైనఁ జనదు.
10.1-1393-క.
చెల్లుబడి గలిగి యెవ్వఁడు
తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్
చెల్లింపఁ డట్టి కష్టుఁడు
ప్రల్లదుఁ డామీఁద నాత్మపలలాశి యగున్.

భావము:
“అమ్మా! నాన్నా! మమ్మల్ని కన్నారు కానీ, మా బాల్య, పౌగండ, శైశవ ప్రాయాలలో ప్రేమగా ఎత్తుకుంటూ, దింపుతూ, లాలించి పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా దైవయోగము చేత అది తీరలేదు. తలితండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఎప్పుడూ బుజ్జగింప బడుతూ ఎలా ఎదుగుతారో, అలాంటి అదృష్టం మా కిన్నాళ్ళూ లేకపోయింది. ధర్మార్ధకామమోక్షము లనే పురుషార్థములు సాధించడానికి కారణమైన ఈ శరీరాలకు కర్త లెవరు? జననీజనకులైన మీరే కదా! ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి నూరేండ్లయినా సరిపోదు. ఎవడైతే సమర్థత కలిగి ఉన్నా కూడా తన శరీరంతో ధనంతో తన తల్లితండ్రులకు సేవచేయడో, అలాంటి వాడు కష్టుడు దుష్టుడు. వాడు చచ్చాక తన మాంసం తానే తింటాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1392

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, December 5, 2020

శ్రీ కృష్ణ విజయము - 95

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1390-వ.
అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుండైన హరి కంసాదులకుం బరలోకసంస్కారంబులు చేయం బనిచి దేవకీ వసుదేవుల సంకలియలు విడిపించి, బలభద్ర సహితుండై వారలకుం బ్రణామంబులు జేసిన.
10.1-1391-మ.
కని లోకేశులుగాని వీరు కొడుకుల్గారంచుఁ జిత్తంబులన్
జనయిత్రీ జనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా
జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి
ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై. 

భావము:
అలా ఏడుస్తున్న రాజు భార్యలను ఓదార్చి, లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి ఉత్తరక్రియలు చేయమని ఆదేశించాడు. పిమ్మట, దేవకీవసుదేవులను చెర విడిపించి, బలరాముడు తను కలిసి వారికి నమస్కారాలు చేయగా తల్లితండ్రులైన దేవకీవసుదేవులు తమ పుత్రులను చూసి “వీరు సకల లోకాలకు ప్రభువులు తప్ప సాధారణ మానవులు కారు” అని ఆలోచిస్తూ తమ మనసులలో సంశయ పడసాగారు. అప్పుడు, శ్రీకృష్ణుడు జనులను సమ్మోహింప జేసే మాయాశక్తిని ప్రయోగించి, వారి ఎరుకను మరుగు పరచి, అన్న బలభద్రుడుతో కూడి వచ్చి మిక్కిలి వినయంతో ఆనందాలు పంచుతూ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1391

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 94

( కంసుని భార్యలు విలపించుట )

10.1-1388-క.
భూతముల కెగ్గుచేసిన
భూతంబులు నీకు నెగ్గు పుట్టించె వృథా
భూత మగు మనికి యెల్లను
భూతద్రోహికిని శుభము పొంద దధీశా!
10.1-1389-క.
గోపాలకృష్ణుతోడను
భూపాలక! మున్ను తొడరి పొలిసినవారిన్
నీ పాల బుధులు చెప్పరె
కోపాలస్యములు విడిచి కొలువం దగదే."

భావము:
ప్రాణులకు నీవు కీడుచేయగా, ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసినవాడికి మేలు కలుగదు. బ్రతు కంతా వ్యర్థమవుతుంది. కంసమహారాజా! భూమండలాన్ని ఏలే వాడవు కదా. గోవుల పాలించే వాడైన శ్రీకృష్ణుడిని ఇంతకు ముందు ఎదిరించిన వారందరూ మరిణించిన విషయం బుద్ధిమంతులు ఎవరూ నీకు చెప్పలేదా? క్రోధము జడత్వమూ వదలిపెట్టి గోవిందుని సేవించవలసింది కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=165&padyam=1389

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, December 2, 2020

శ్రీ కృష్ణ విజయము - 93

( కంసుని భార్యలు విలపించుట )

10.1-1386-వ.
అంతం గంసాదుల కాంతలు భర్తృమరణదుఃఖాక్రాంతలై కరంబుల శిరంబులు మోదికొనుచు నశ్రుసలిలధారాపరిషిక్త వదనలై సదనంబులు వెలువడి వచ్చి వీరశయ్యా నిద్రితులైన విభులం గౌఁగిలించుకొని సుస్వరంబుల విలపించి; రందుఁ గంసు భార్య లిట్లనిరి.
10.1-1387-సీ.
"గోపాలసింహంబు గోపించి వెల్వడి-
  నిను గజేంద్రుని భంగి నేడు గూల్చె
యాదవేంద్రానిల మాభీలజవమున-
  నిను మహీజము మాడ్కి నేల వ్రాల్చె
వాసుదేవాంభోధి వారి యుద్వేలమై-
  నిను దీవి కైవడి నేడు ముంచె
దేవకీసుతవజ్రి దేవత లలరంగ-
  నినుఁ గొండ క్రియ నేడు నిహతుఁ జేసె
10.1-1387.1-తే.
హా! మనోనాథ! హా! వీర! హా! మహాత్మ!
హా! మహారాజ! నీ విట్లు హతుఁడవైన
మనుచు నున్నార మక్కట! మమ్ముఁ బోలు
కఠినహృదయలు జగతిపైఁ గలరె యెందు?

భావము:
అంతట కంసుడు మొదలగువారి భార్యలు భర్తల మృతికి శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటిధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుండి వచ్చారు. వీరశయ్యలందు దీర్ఘనిద్ర చెంది ఉన్న తమ పతులను పరిష్వంగం చేసుకుని, చక్కటి గద్గద కంఠధ్వనులతో ఏడ్చారు. వారిలో కంసుడి భార్యలు ఇలా అన్నారు. “ఓ ప్రాణనాయకా! కోపంతో వచ్చిన గోపాలుడనే సింహం గజేంద్రుడి వంటి నిన్ను హతమార్చింది కదా. హా శూరుడా! యదునాథుడనే గాలి దారుణమైన వేగంతో వీచి మహా వృక్షము లాంటి నిన్ను నేలపై కూలగొట్టింది కదా. ఓ మహానుభావా! వాసుదేవుడనే సముద్రజలం చెలియలకట్టను దాటి పొంగి వచ్చి దీవి వంటి నిన్ను ఇప్పుడు ముంచేసింది కదా. రాజేంద్రా! దేవకీపుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండవంటి నిన్ను సంహరించాడు కదా. అయ్యో! నీవిలా చనిపోయినప్పటికీ మేము ఇంకా బ్రతుకే ఉన్నాము. అక్కటా! మా అంత కఠిన హృదయం కలవారు భూమిమీద ఎక్కడైనా ఉన్నారా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=165&padyam=1387

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 92

( కంససోదరుల వధ )

10.1-1384-క.
చేతులఁ దాళము లొత్తుచుఁ
జేతోమోదంబుతోడ సిగముడి వీడం
బాతర లాడుచు మింటను
గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్.
10.1-1385-క.
వారిజభవ రుద్రాదులు
భూరికుసుమవృష్టిఁ గురిసి పొగడిరి కృష్ణున్
భేరులు మ్రోసెను నిర్జర
నారులు దివి నాడి రధిక నటనముల నృపా!

భావము:
నారదమహర్షి చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడిపోగా, ఆనందంతో ఆకాశంలో “కృష్ణా!” అంటూ పాడుతూ నర్తించాడు. పరీక్షన్నరేంద్రా! బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురిపిస్తూ శ్రీకృష్ణుడిని స్తుతించారు. దేవదుందుభులు మ్రోగాయి. దేవతాంగనలు ఆకాశంలో అనేక రకాల నాట్యాలు చేశారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1385

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Tuesday, December 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 91

( కంససోదరుల వధ )

10.1-1381-క.
గోపాలుఁ డొక్కఁ డద్దిర
భూపాలకుఁ జంపె వీనిఁ బొడువుం డేత
ద్రూపాలస్యము లేలని
తాపాలఘురోషు లగుచు దర్పోద్ధతులై.
10.1-1382-శా.
న్యగ్రోధుండును గహ్వుఁడున్ మొదలుగా నానాయుధానీక సా
మగ్రిం గంసుని సోదరుల్గవియుఁడున్ మాద్యద్గజేంద్రాభుఁడై
యుగ్రుండై పరిఘాయు ధోల్లసితుఁడై యొండొండఁ జెండాడి కా
లాగ్రక్షోణికిఁ బంచె రాముఁడు గరీయస్థేముఁడై వారలన్.
10.1-1383-వ.
అ య్యవసరంబున.

భావము:
“ఔరా! ఎంత ఆశ్చర్యం? ఒక గోవులు కాచుకునేవాడు ప్రభువుని చంపేసాడు. వీడిని పొడిచెయ్యండి. ఇంకా ఆలస్యం ఎందుకు?” అంటూ పరితాపంతో అగ్గలమైన కోపంతో పొగరు బోతులై న్యగ్రోధుడు, గహ్వుడూ మొదలైన కంసుడి సోదరులు అనేక రకాల ఆయుధ పరికరాలతో కృష్ణుడి మీద కలియబడ్డారు. అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తి అయి పరిఘ అనే ఆయుధం ధరించి మదించిన ఏనుగు లాగా ఒక్కొక్కరిని చెండాడి యముడి సన్నిధికి పంపాడు. అలా కంస సంహారం జరిగిన సమయంలో . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1382

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 90

( కంస వధ )

10.1-1378-శా.
మంచాగ్రంబుననుండి రంగధరణీమధ్యంబునం గూలి యే
సంచారంబును లేక చిక్కి జను లాశ్చర్యంబునుం బొందఁగా
బంచత్వంబును బొంది యున్న విమతుం బద్మాక్షుఁ డీడ్చెన్ వడిం
బంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్ బాహాబలోల్లాసియై.
10.1-1379-క.
రోషప్రమోద నిద్రా
భాషాశన పాన గతులఁ బాయక చక్రిన్
దోషగతిఁ జూచి యైన వి
శేషరుచిం గంసుఁ డతనిఁ జెందె నరేంద్రా!
10.1-1380-వ.
ఆ సమయంబున.

భావము:
మంచెమీది నుంచి మల్లక్రీడారంగ మధ్యలోకి వచ్చి పడిన కంసుడు ఎలాంటి కదలికలు లేక కట్టెలాగ బిగుసుకు పోయి అక్కడికక్కడే మరణించాడు. అక్కడి జనుల ఆ దుర్మతి సంహారాన్ని అబ్బురపడుతూ చూసారు. సింహం ఏనుగును ఎలా ఈడుస్తుందో అలా కలువ కన్నులున్న కృష్ణుడు భుజబలవిజృంభణంతో కంసుడిని ఈడ్చాడు. ఓ మహారాజా పరీక్షిత్తూ! కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, మాటలు మాట్లాడుతున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు, నీరు త్రాగుతున్నప్పుడు, చక్రాయుధు డైన శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనే అయినప్పటికీ వదలకుండా తలచి తలచి అతడు భగవంతుడిని పొంది ఉత్తమగతి అందుకున్నాడు. అలా కంసుని సంహరించిన సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1378

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :