Thursday, September 30, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౩(353)

( జరాసంధ వధ) 

10.2-733-సీ.
పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు-
  మృగపతిద్వితయంబు వృషభయుగము
పావకద్వయము దంతావళయుగళంబు-
  దలపడు వీఁక నుద్దండలీలఁ
గదిసి యన్యోన్యభీకరగదాహతులను-
  గ్రంబుగ విస్ఫులింగములు సెదరఁ
గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ-
  ణములను సింహచంక్రమణములను
10.2-733.1-తే.
గదిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి
కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి
పగుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర
ఘనగదాఘట్టనధ్వని గగనమగల.
10.2-734-వ.
పోరునంత.
10.2-735-మ.
గద సారించి జరాతనూభవుఁడు హుంకారప్రఘోషంబులం
జద లల్లాడఁగఁ బాదఘట్టనములన్ సర్వంసహాభాగముం
గదలన్ వాయుజు వ్రేసె; వ్రేయ నతఁ డుగ్రక్రోధదీప్తాస్యుఁడై
యది తప్పించి విరోధిమస్తకము వ్రేయన్ వాఁడు వోఁ దట్టుచున్. 

భావము:
రెండు పర్వతాలూ, రెండు సముద్రాలూ, రెండు సింహాలూ, రెండు వృషభాలూ, రెండు అగ్నులూ, రెండు మత్తేభాలూ తలపడి పోరుతున్నాయా అన్నట్లుగా, భీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ, ఒకరి నొకరు తాకుతూ, పైకెగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడి ఎడమలకు తిరుగుతూ, ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ, రెండు గదల పరస్పర తాకిడులకు ఛట ఛట మంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు. అలా భీమ జరాసంధుల భీకర పోరు సాగుతుండగా హుంకార శబ్దంతో ఆకాశం అల్లల్లాడేలా పాదఘట్టనతో భూమండలం దద్దరిల్లేలా విజృంభించి జరాసంధుడు గదతో సాచిపెట్టి భీముడిని కొట్టాడు. దానితో భీముడు ఆగ్రహోదగ్ర మైన ముఖం భీకరమై వెలిగిపోతుండగా ఆ దెబ్బను తప్పించుకుని, తిరిగి జరాసంధుని తలమీద మోదాడు. అతడు దానిని తప్పించుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=733 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, September 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౨(352)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-730-క.
ఇన్నేల సెప్ప? మాయలఁ
బన్నినఁ బో విడువ గోపబాలక! బల సం
పన్నుని మాగధభూవరు
నన్నెఱుఁగవె తొల్లి నందనందన! పోరన్?
10.2-731-ఉ.
కాన రణోర్వి నన్నెదురఁ గష్టము గాన తలంగు; గోత్రభి
త్సూనుఁడుభూరిబాహుబలదుర్దముఁడయ్యునుఁ బిన్న; యీమరు
త్సూనుఁడు మామకప్రకటదోర్బలశక్తికిఁ జూడఁ దుల్యుఁడౌ;
వీనినెదుర్తు" నంచుఁ జెయివీచె జరాసుతుఁ డుగ్రమూర్తియై.
10.2-732-క.
కరువలిసుతునకు నొక భీ
కరగద నిప్పించి యొక్కగదఁ దనకేలన్
ధరియించి నలువురును గ్ర
చ్చఱఁ బురి వెలి కేగి యచట సమతలభూమిన్.
భావము:
ఇన్ని మాటలు దేనికి కానీ? ఓ యాదవ బాలుడా! ఎన్ని మాయలు పన్నినా నిన్ను వదలను. యుద్ధరంగంలో జరాసంధుడంటే ఏమిటో నీకు బాగా తెలుసు కదా. ఓ కృష్ణా! రణంలో నన్ను ఎదిరించటం నీకు చాలా కష్టం కనుక నీవు తప్పుకో. అర్జునుడు బలశాలే కానీ చిన్నవాడు. ఈ భీముడు చూడటానికి నా బాహుబలానికి సమ ఉజ్జీలా ఉన్నాడు. కనుక వీడిని ఎదుర్కొంటాను” అని భయంకరాకారుడైన జరాసంధుడు భీముడితో యుద్ధానికి చేయి ఊపాడు. వాయునందనుడైన భీముడికి జరాసంధుడు ఒక భయంకరమైన గదను ఇప్పించాడు. తాను ఒక గదను చేబట్టాడు. పిమ్మట నలుగురూ పట్టణానికి బయట ఒక సమతల ప్రదేశానికి వెళ్ళి.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=732 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 28, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౧(351)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-727-క.
"భూరిగుణులార! మీ మదిఁ
కోరిక యెఱిఁగింపుఁ డేమి కోరిననైనన్
ధీరత నొసఁగుటయే కా
దారయ నా శిరము ద్రుంచి యైనను నిత్తున్. "
10.2-728-ఉ.
నావుడుఁ గృష్ణుఁ డమ్మగధనాథున కిట్లను "భూవరేణ్య! నీ
భావము సూనృతవ్రతశుభస్థితిఁ జెందు టెఱుంగవచ్చె; మా
కీవలె నాజిభిక్ష; యితఁ డింద్రతనూభవుఁ; డే నుపేంద్రుఁడం;
బావని యీతఁ; డిం దొకనిఁ బైకొని యెక్కటి పోరఁగాఁ దగున్."
10.2-729-చ.
అన విని వాఁడు నవ్వి "యహహా! విన వింతలుపుట్టె మున్ను న
న్ననిమొన నోర్వఁజాలక భయంబునఁ బాఱితి పెక్కుమార్లు; వం
చన మథురాపురిన్ విడిచి సాగరమధ్యమునందు డాఁగవే?
వనరుహనాభ! నీ బిరుదు వాఁడితనంబును నాకు వింతయే? 

భావము:
“ఓ గుణవంతులారా! మీ మనస్సులోని కోరిక ఏమిటో చెప్పండి. మీరేది కోరినా ధైర్యంతో ఇచ్చేస్తాను. అంతేకాదు కోరితే చివరకు నా తల తఱిగి ఇమ్మన్నా ఇచ్చేస్తాను.” అలా అన్న జరాసంధుడి మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “మహారాజా! నీ సత్యవ్రత నిష్ఠ మాకు అవగతమైంది. మేము రణభిక్ష కోరుతున్నాం. ఇతడు వాయు పుత్రుడు భీమసేనుడు; ఇతడు ఇంద్రపుత్రుడు అర్జునుడు; నేను కృష్ణుడిని; మాలో ఎవరో ఒకరితో నీవు ద్వంద్వ యుద్ధం చేయాలి.” శ్రీకృష్ణుడి మాటలు విని, జరాసంధుడు నవ్వి “అహో ఎంత ఆశ్చర్యం. నన్ను యుద్ధరంగంలో తట్టుకోలేక భయంతో చాలా పర్యాయాలు పారిపోయావు. మథురను వదలిపెట్టి సముద్రం మధ్యలో దాక్కున్నావు కదా. నీ పరాక్రమం నీ మగతనం ఏపాటివో నాకు తెలియనిది కాదులే కృష్ణా! 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=729 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౦(350)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-726-వ.
అనిన విని జరాసంధుండు వారల రూపంబులును, మేఘగంభీర భాషణంబులును, గుణకిణాంకంబులును మహాప్రభావంబులునుం జూచి తన మనంబున “వీరలు బ్రాహ్మణవేషధారులైన రాజేంద్రులు గానోపుదు” రని తలంచి “యిమ్మహాత్ములు గోరిన పదార్థంబ కాదు; ప్రాణంబులేనియు నిత్తు; నదియునుం గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు నాత్మపదభ్రష్టత్వం బెఱింగియు విచారింపక జగత్త్రయంబు నిచ్చి కీర్తిపరుండయ్యె; క్షత్రబంధుం డనువాఁడు బ్రాహ్మణార్థంబు నిజప్రాణపరిత్యాగంబు సేసి నిర్మలంబగు యశంబు వడసె; నది గావున ననిత్యంబైన కాయంబు విచారణీయంబు గాదు; కీర్తి వడయుట లెస్స” యని తలంచి యుదారుండై కృష్ణార్జునభీములం గని యిట్లనియె. 

భావము:
ఈ మాదిరి పలుకుతున్న వారి పలుకులు వినిన జరాసంధుడు వారి స్వరూపాలనూ, గంభీరమైన కంఠాలనూ, అల్లెత్రాటి వలన భుజాలమీద ఏర్పడ్డ గుర్తుల్ని గమనించి, “వీరు బ్రాహ్మణ వేషం ధరించిన రాజశేఖరులు కావచ్చు. ఈ మహాత్ములు వస్తువునే కాదు ప్రాణాలుతో సహా ఏది కోరినా ఇచ్చేస్తాను. అంతేకాదు, పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణ వేషంతో యాచించిన విష్ణుదేవుడికి తన పదవి పోతుందని తెలిసినా, ఏమాత్రం లెక్కచెయ్యకుండా ముల్లోకాలను దానం చేసి శాశ్వత యశస్సును పొందాడు. క్షత్రబంధుడు అనే పేరు గలవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్నే త్యాగంచేసి నిర్మలమైన కీర్తిని పొందాడు. అశాశ్వతమైన శరీరాన్ని గురించి ఆలోచించనక్కర లేదు. కీర్తిని పొందటమే ఉచితం” అని ఆలోచించుకొని, కృష్ణార్జునభీములతో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=726 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౪౯(349)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-724-క.
ఆ యింద్రాగ్నులు శ్యేనక
వాయస రూపములఁ దన్ను వలఁతిగ వేఁడన్
ధీయుతుఁడై మును శిబి తన
కాయము గోసిచ్చె నన జగంబుల వినమే!
10.2-725-ఆ.
ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర
బలులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని
మున్ను సెప్ప వినమె? సన్నుతచరితులు
సన్న నైన నేఁడు నున్నవారు. " 

భావము:
ఆ ఇంద్రుడు డేగ రూపంలో, అగ్ని కాకి రూపంలో వచ్చి తనను కోరగా శిబిచక్రవర్తి గొప్ప బుద్ధితో తన దేహాన్నే కోసి ఇచ్చాడని మనం వినలేదా? మహా ధీరులు అయిన రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, బిచ్చమెత్తుకుని జీవించే బ్రాహ్మణుడు సక్తుప్రస్థుడు మున్నగువారి గురించి చెప్పుకోవటం పూర్వం నుంచీ వింటున్నాం కదా. స్తుతిపాత్రమైన చరితార్థులు ఆ మహనీయులు ఎప్పుడో మరణించినా, ఈనాటికీ బ్రతికి ఉన్నవారే.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=725 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౮(348)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-721-క.
పరికింపఁగ దేహం బ
స్థిరమని నిజబుద్ధిఁ దలఁచి చిరతరకీర్తి
స్ఫురణం బ్రస్తుతి కెక్కని
పురుషుఁడు జీవన్మృతుండు భూరివివేకా!
10.2-722-క.
ధారుణిలోన వదాన్యుల
కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే
కోరినఁ దన మే యెముకలు
ధీరుండై యిచ్చె నని దధీచిని వినమే?
10.2-723-క.
అడిగిన వృథసేయక తన
యొడ లాఁకలిగొన్న యెఱుకు కోగిరముగ నే
ర్పడ నిచ్చి కీర్తిఁ గనె నని
పుడమిన్ మును వినమె యల కపోతము ననఘా! 

భావము:
ఓ మిక్కిలి తెలివైన వాడా! జరాసంధా! మానవుడు ఈ దేహం శాశ్వతం కాదని గ్రహించి, శాశ్వతమైన యశస్సును సంపాదించాలనే ఆసక్తి కలిగి మహాదాతగా ప్రసిద్ధి కెక్కవలెను. లేకపోతే, వాడు బ్రతికి ఉన్నా కూడా చచ్చినవాడితో సమానం. చేసే బుద్ధి ఉండాలి కానీ, దాతలకు దానం చేయరాని వస్తువు ఏమి ఉంటుంది? దేవతలు వచ్చి, తన శరీరంలోని ఎముకలను కోరిన వెంటనే ఇచ్చిన దధీచిని గూర్చి మనం వినలేదా? అడిగిన వెంటనే కాదనకుండా ఆకలిగొన్న బోయవాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించి కీర్తిని పొందిన పావురం కథ మనం వినలేదా? 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=723 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౭(347)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-718-వ.
ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణ వేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెఁ దమ శరీరతేజోవిశేషంబులు వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు యతిథిపూజలు శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై కావించుచున్న జరాసంధునిం గనుంగొని యిట్లనిరి.
10.2-719-క.
"ధరణీశ! యతిథిపూజా
పరుఁడవు నీ వనుచు దిశలఁ బలుకఁగ విని మే
మరుదెంచితిమి మదీప్సిత
మఱ సేయక యిమ్ము సువ్రతాచారనిధీ!
10.2-720-క.
అతిథిజనంబుల భక్తిన్
సతతముఁ బూజించి యుచితసత్కారము లు
న్నతి నడపు సజ్జనులు శా
శ్వతకీర్తులు ధరణిఁబడయఁజాలుదు రనఘా! 

భావము:
అలా బ్రాహ్మణ వేషాలు ధరించిన శ్రీకృష్ణ భీమ అర్జునులు ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నుల్లాగా ప్రకాశిస్తూ అతి శీఘ్రంగా గిరివ్రజానికి వెళ్ళారు. మిక్కిలి శ్రద్ధాభక్తులతో తమకు అతిథి సపర్యలు చేస్తున్న జరాసంధుడితో ఇలా అన్నారు. “ఓ మగధరాజా! జరాసంధా! ఓ సదాచార సంపన్నా! అతిథి సేవ చేయటంలో బాగా పేరు పొందినవాడిగా దిగంత విశ్రాంతమైన నీ కీర్తి విని, నీ దగ్గరకు వచ్చాము. మా కోరిక కాదనక తీర్చు. ఓ పుణ్యాత్మా! అతిథి జనాన్ని ఎల్లప్పుడూ భక్తితో సేవించి, వారికి ఉచిత సత్కారాలు చేసే సత్పురుషులు లోకంలో శాశ్వతకీర్తిని పొందుతారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=720 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౪౬(346)

( దిగ్విజయంబు) 

10.2-715-చ.
విను మగధేశ్వరుం డెపుడు విప్రజనావళియందు భక్తియున్
వినయముఁ గల్గి యెద్దియును వేఁడినచో వృథసేయ కిచ్చుఁగా
వున విజయుండునుం బవనపుత్రుఁడు నేనును బ్రాహ్మణాకృతిం
జని రణభిక్ష వేఁడిన వశంవదుఁడై యతఁ డిచ్చుఁ గోరికల్‌.
10.2-716-వ.
అట్టియెడ.
10.2-717-తే.
తవిలి యప్పుడు మల్లయుద్ధమున వానిఁ
బిలుకుమార్పింప వచ్చును భీముచేత!"
ననిన ధర్మజుఁ "డదిలెస్స" యనిన విప్ర
వేషములు దాల్చి యరిగిరి విశదయశులు. 

భావము:
మగధరాజైన జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే భక్తివిశ్వాసాలు అధికం. వారేది అడిగినా లేదనకుండా తప్పక ఇస్తాడు. కనుక, నేను, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలతో వెళ్ళి వాడిని యుద్ధభిక్ష కోరతాము. అతడు తప్పకుండా అంగీకరిస్తాడు. అలా జరాసంధుడు యుద్ధానికి అంగీకరించాక మల్లయుద్ధంలో భీముడిచేత అతడిని చంపించవచ్చు” అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ధర్మరాజు “ఇది బాగుం” దని అంగీకరించాడు. అంతట మహా కీర్తిశాలురు అయిన కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి బయలుదేరారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=717 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, September 22, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౫(345)

( దిగ్విజయంబు) 

10.2-712-చ.
పనిచిన వార లేగి ఘనబాహుపరాక్రమ విక్రమంబుల
న్ననుపమశౌర్యులైన చతురంతమహీశుల నోర్చి కప్పముల్‌
కనక వినూత్న రత్న తురగప్రముఖాఖిల వస్తుజాతముల్‌
గొని చనుదెంచి ధర్మజునకుం బ్రణమిల్లి యుదాత్త చిత్తులై. ,
10.2-713-చ.
తమతమ పోయివచ్చిన విధంబుల భూపతులన్ జయించుటల్‌
క్రమముగఁ జెప్ప నందుల జరాతనయుం డరివెట్టఁ డయ్యె నం
చమరవరేణ్యనందనుఁ డహంకృతి దక్కఁగ విన్నవించినన్
యమసుతుఁడూరకుండెవికలాత్మకుఁడై విని యంతఁ గృష్ణుఁడున్
10.2-714-తే.
ధర్మనందనుఁ జూచి యుత్కలికతోడఁ
బలికె "మాగధుఁ బోరఁ జంపఁగ నుపాయ
మొకటి గల దది సెప్పెద నుద్ధవుండు
నాకుఁ జెప్పిన చందంబు నయచరిత్ర! 

భావము:
ఇలా ధర్మరాజు పంపించగా వెళ్ళిన భీమార్జున నకుల సహదేవులు మహాపరాక్రమవంతు లయిన ఆయా దిక్కులలోని రాజులను ఓడించి; వారిచేత కప్పాలు కట్టించుకుని; బంగారం, మణులు, గుఱ్ఱాలు మొదలైన వస్తు సమూహాన్ని తీసుకుని వచ్చి ధర్మరాజునకు నమస్కారం చేసి అర్పించారు. తాము వెళ్ళివచ్చిన విధానములూ రణరంగంలో రాజులను జయించిన వివరాలూ అన్నగారికి వివరించారు. అందులో జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదని అర్జునుడు చెప్పగా విని ధర్మరాజు వికలమైన మనస్సు కలవాడై మౌనం వహించాడు. అప్పుడు కృష్ణుడు. ధర్మరాజుతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. “ఓ ధర్మరాజా! జరాసంధుడిని చంపడానిక ఒక ఉపాయం ఉంది. నాకు ఉద్ధవుడు చెప్పిన ఆ ఉపాయం వివరిస్తాను విను. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=714 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౪(344)

(దిగ్విజయంబు) 

10.2-709-క.
ప్రకటచతుర్విధ సేనా
ప్రకరంబులు గొలువఁ బంచెఁ బడమటిదిశకున్
నకులున్ విదళిత రిపు భూ
పకులున్ శౌర్యంబు మెఱసి పార్థివముఖ్యా!
10.2-710-క.
దుర్జనభంజను శౌర్యో
పార్జితవిజయప్రకాండు నాహవనిపుణు
న్నర్జునమహితయశోనిధి
నర్జును నుత్తరపు దిశకు ననిచె నరేంద్రా!
10.2-711-ఆ.
మహితశౌర్యనిధులు మత్స్య కేకయ మద్ర
భూతలేంద్రబలసమేతముగను
దర్పమొప్ప బంచెఁదూర్పుదిక్కునకు ను
ద్దామనిహిత వైరిధాము భీము. 

భావము:
ఓ మహారాజా! పరీక్షిత్తూ! ప్రసిద్ధులైన రథ, గజ, తురగ, పదాతులనబడే నాలుగు విధాల సైన్యాలతో పడమటిదిక్కును జయించి రమ్మని నకులుడిని పంపించాడు. దుర్మార్గుల్ని శిక్షించేవాడూ,మహా శౌర్యోపేతుడూ, విజయశీలుడూ, గొప్ప యుద్ధనిపుణుడూ, స్వచ్ఛమైన కీర్తి కలవాడూ అయిన అర్జునుడిని ఉత్తర దిక్కును జయించడానికి నియోగించాడు. తూర్పుదిక్కును జయించడానికి గొప్ప శౌర్యవంతు లైన మత్స్య, కేకయ, మద్ర రాజులతో కలిసి శత్రువుల తేజస్సులు హరించుటలో మేటి ఐన భీముడిని వెళ్ళమని ధర్మరాజు పంపించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=711 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :l

Monday, September 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౩(343)

( దిగ్విజయంబు) 

10.2-706-క.
విమలమతి నిట్టి మఖ రా
జమునకుఁ దెప్పింపవలయు సంభారంబుల్‌
సమకూర్పుము; నీ యనుజుల
సమదగతిం బంపు నిఖిలశత్రుల గెల్వన్."
10.2-707-క.
అను మాటలు విని కుంతీ
తనయుఁడు మోదమునఁ బొంగి తామరసాక్షున్
వినుతించి శౌర్యకలితుల
ననుజుల దెసఁ జూచి పలికె హర్షముతోడన్.
10.2-708-క.
"సృంజయభూపాలకులునుఁ
గుంజర రథ వాజి సుభట కోటులు నినుఁ గొ
ల్వం జను" మని సహదేవుని
నంజక పొమ్మనియె దక్షిణాశ జయింపన్. 

భావము:
బహు గొప్పదైన ఈ రాజసూయ యాగానికి అవసరమైన సామగ్రిని సమకూర్చు. శత్రువులు అందరినీ జయించడానికి నీ సహోదరులను పంపించు.” ఈవిధంగా పలికిన శ్రీకృష్ణుడి మాటలు వినిన ధర్మజుడు ఎంతో సంతోషించి, పద్మాక్షుడిని ప్రస్తుతించాడు. మహాపరాక్రమవంతులైన తన సహోదరులతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. “సహదేవా! నీవు సృంజయ రాజులూ, చతురంగబలాలూ నిన్ను కొలుస్తూ వస్తారు. వారిని తీసుకు వెళ్ళి దక్షిణ దిక్కును జయించి రమ్ము” అని సహదేవుడిని ఆజ్ఞాపించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=708 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 19, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౨(342)

( దిగ్విజయంబు) 

10.2-702-క.
మనుచరిత! నీ సహోదరు
లనుపమ దివ్యాస్త్రవేదు లాహవభూమిం
జెనకిన వైరినృపాలురఁ
దునుమఁగఁ జాలుదురు శౌర్యదుర్దమ భంగిన్.
10.2-703-క.
గెలువుము విమతనృపాలుర
వెలయుము బుధవినుతమైన విశ్రుతకీర్తిన్
నిలుపుము నిఖిలధరా మం
డలిని భవచ్ఛాసనము దృఢంబుగఁ జెల్లన్.
10.2-704-క.
నీ పంచుకార్య మొరులం
జూపక యేఁ జేయ నిన్ను జుట్టన వ్రేలం
జూపఁగ వచ్చునె! సకల ధ
రాపతులకు నీకుఁ జేయరానిది గలదే! .
10.2-705-వ.
కావున. 

భావము:
ఓ యుధిష్టరా! నీ తమ్ముళ్ళు దివ్యమైన ఎదురులేని అస్త్రవిద్యా విశారదులు; యుద్ధభూమిలో ఎదిరించిన శత్రురాజులను సంహరించడంలో చక్కని సామర్థ్యం కలవారు. శత్రురాజులను జయించు; శాశ్వతమైన యశస్సుతో ప్రకాశించు; సమస్త భూమండలంలో నీ శాసనం చెల్లేలాగ స్థిరంగా స్థాపించు. నీవు ఏ కార్యం చెప్తే దానిని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నిన్ను వేలెత్తి చూపడానికి ఈ లోకంలో రాజులు ఎవ్వరికీ సాధ్యం కాదు. నీకు సాధ్యం కాని కార్యం లేదు. అందుచేత..... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=704 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, September 18, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౧(341)

( దిగ్విజయంబు) 

10.2-699-ఉ.
ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ గొల్తురు భక్తి నిష్ఠులై,
యెవ్వరు నిన్నుఁ బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై,
యవ్విమలాత్ము లందుదు రుదంచితశోభన నిత్యసౌఖ్యముల్‌
నివ్వటిలంగఁ గృష్ణ! నిను నేర్చి భజించిన రిత్తవోవునే! "
10.2-700-వ.
అనినఁ గృష్ణుండు ధర్మనందనున కిట్లనియె.
10.2-701-చ.
"నయగుణశాలి! పాండునృపనందన! నీ తలఁ పొప్పు నీక్రతు
క్రియ మునిదేవతాపితృ సుకృత్యమునై నిఖిలోగ్రశాత్రవ
క్షయమును బాంధవప్రియము సంచితపుణ్యము నిత్యకీర్తియున్
జయము నొసంగు దీనిఁ గురుసత్తమ! వేగ యుపక్రమింపవే! 

భావము:
కృష్ణా! భక్తితో నీ పాదపద్మాలను ధ్యానించే వారు, మంచి బుద్ధిమంతులై నిన్ను ప్రేమతో సన్నుతించు వారు సదా సుఖసంతోషాలను పొందుతారు. నిన్ను శ్రద్దగా పూజించటం ఎన్నటికీ వ్యర్థంకాదు కదా.” ఈ విధంగా పలికిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఓ పాండురాజు కుమారా! ధర్మరాజా! కురువంశ శ్రేష్ఠుడా! రాజనీతి విశారదుడవు నీ ఆలోచన సమంజసంగా ఉంది. ఈ రాజసూయ ప్రక్రియ మునులకు, దేవతలకు, పితృదేవతలకు అభీష్టమైనది. అది సమస్త శత్రు క్షయాన్ని, సకల బంధువు ప్రియాన్ని, సమధికమైన పుణ్యాన్ని, శాశ్వతమైన కీర్తిని, విజయాన్ని, సిద్ధింప చేస్తుంది. కాబట్టి శీఘ్రమే ఈ యాగాన్ని ప్రారంభించు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=701 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 17, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౦(340)

( దిగ్విజయంబు ) 

10.2-697-సీ.
ధరణీశ! యొకనాఁడు ధర్మతనూజుండు-
  ప్రవిమల నిజసభాభవన మందు
హితులు, మంత్రులు, పురోహితులును, సుతులును-
  మిత్రులు, బంధువుల్‌, క్షత్రవరులుఁ,
బరిచారకులు, సూత, పాఠక, కవి, బుధ-
  వరులును, మునులును వరుసఁ గొలువఁ
జిరలీల నవరత్న సింహాసనస్థుఁడై-
  గొలువుండి వినతుఁడై నలిననాభు,
10.2-697.1-తే.
భువనరక్షణదక్షు, నద్భుతచరిత్రు,
యదుకులేశ్వరు, మురదైత్యమదవిభేది,
నాప్తు, నయవేదిఁ, జతురుపాయప్రవీణుఁ
జూచి యిట్లని పలికె నస్తోకచరిత!
10.2-698-తే.
"అనఘచారిత్ర! రాజసూయాధ్వరంబుఁ
నెమ్మిఁ గావించు వేడుక నెమ్మనమున
నెనయుచున్నది యది నిర్వహింప నీవ
కాక నా కాత్మబంధువుల్‌ గలరె యొరులు? 

భావము:
పరీక్షిన్మహారాజా! ఒకనాడు తన సభాభవనంలో హితులూ, పురోహితులూ, పుత్రులూ, మిత్రులూ, సామంతులూ, చుట్టాలూ, సోదరులూ, స్తుతిపాఠకులూ, మునీశ్వరులూ పరివేష్టించి ఉండగా నిండుకొలువులో సింహాసనంపై ధర్మరాజు కూర్చుని ఉన్నాడు. పద్మనాభుడు, జగద్రక్షకుడు, మరాసురాది రాక్షసుల గర్వం సర్వం అణచిన వాడు, ఆత్మీయుడు, యదుకులేశ్వరుడు, సామ దాన భేద దండ ఆది చతురోపాయ పారాయణుడు అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. “పుణ్యచరితా! కృష్ణా! రాజసూయయాగం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. దానిని నిర్వహించడానికి నీవు తప్ప నాకు వేరే ఆత్మబంధువులు ఎవరున్నారు? 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=697 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౯(339)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-695-క.
హరియు యుధిష్ఠిరు సముచిత
పరిచర్యల కాత్మ నలరి పార్థుఁడు దానున్
సరస విహారక్రియలను
సురుచిరగతిఁ గొన్ని నెలలు సుఖముండె నృపా!
10.2-696-వ.
అంత. 

భావము:
ఓ రాజా! శ్రీకృష్ణుడు కూడ ధర్మరాజు ఏర్పాటు చేసిన సముచిత మర్యాదలకు సంతోషించి, అర్జునుడితో కలసి సరసవినోదవిహార కార్యక్రమాలతో కొన్నినెలలు సుఖంగా అక్కడ ఉన్నాడు. ఇలా శ్రీకృష్ణుడు హస్తినలో ఉన్న కాలంలో.. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=695 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, September 15, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౮(338)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-694-వ.
తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామర ధరావర వణిక్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి; పుణ్యాంగనా జనంబులు పసిండిపళ్లెరంబులఁ గర్పూరనీరాజనంబులు నివాళింప నంతఃపురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్ణునిం గని పర్యంకంబు డిగ్గి కౌఁగిలింప నా యదువల్లభుఁడు మేనత్తకుం బ్రణామం బాచరించెఁ; బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందు భామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షత కుసుమ తాంబూలంబులిడి లలిత దుకూల మణి భూషణంబులం బూజించె; యుధిష్ఠిరుండును గమలనయనుని వధూజనుల ననుగత బంధుమిత్ర పుత్త్ర సచివ పురోహిత పరిచారక సముదయంబుల నుచితంబు లగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబు లగు వివిధోపచారంబులు గావించుచుండె. 

భావము:
అటు పిమ్మట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నుండి మంగళ పదార్థాలు కానుకలుగా స్వీకరించాడు. ముత్తైదువలు బంగారుపళ్ళెరాలతో కర్పూరహారతులు ఇస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజమహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి పాన్పుదిగి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేసాడు. ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుచీరలూ, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికీ, ఆయన అంతఃపుర కాంతలకూ, పరివారానికీ అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదులు ఏర్పాటు చేయించి, సకల నవ్య సౌకర్యాలూ సమకూర్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=694 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౭(337)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-693-మ.
అని యిబ్భంగి సరోజలోచనలు సౌధాగ్రంబు లందుండి య
వ్వనజాతాక్షుని దివ్యమూర్తిఁ దమభావం బందుఁ గీలించి సం
జనితానంద రసాబ్ధిమగ్న లగుచున్ సంప్రీతిఁ దద్భవ్య కీ
ర్తనలై చల్లిరి నవ్యలాజములు మందారప్రసూనావలుల్‌. 

భావము:
అలా పొగడుతూ ఆ కలువ కన్నుల కోమలులు మేడలమీద నిలుచుండి, తామరరేకులవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో నిలుపుకొన్నారు. దానితో కలిగిన ఆనంద సాగరంలో మునకలు వేస్తూ, సంతోషంతో అతనిపై కీర్తనులు పాడుతూ, మందారపుష్పాలూ, లాజలూ చల్లారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=692 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౬(336)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-690-సీ.
"విశ్వగర్భుండు నా వెలయు వే ల్పిల యశో-
  దానందులకుఁ బ్రియసూనుఁ డయ్యె;
బ్రహ్మాది సురులకు భావింపఁగా రాని-
  బ్రహ్మంబు గోపాలబాలుఁ డయ్యె;
వేదశాస్త్రంబులు వెదకి కానఁగలేని-
  గట్టి వ్రేతల ఱోలఁ గట్టుపడియె;
దివిజుల కమృతంబు దవిలి యిచ్చిన భక్త-
  సులభుండు నవనీత చోరుఁ డయ్యె
10.2-690.1-తే.
నెనయఁ గమలాసతికిఁ జిత్త మీని వేల్పు
గొల్లయిల్లాండ్ర యుల్లముల్‌ పల్లవింపఁ
జేసె" నని కామినులు సౌధశిఖరములను
గూడి తమలోన ముచ్చట లాడి రధిప!
10.2-691-వ.
మఱియును.
10.2-692-సీ.
"గోపాలబాలురఁ గూడి యాడెడి నాఁడు-
  వ్రేపల్లె లోపల నేపు రేఁగి
చల్ల లమ్మగఁ బోవు సతుల కొంగులు పట్టి-
  మెఱుఁగుఁ జెక్కిళ్ళను మీటిమీటి
కలికియై ముద్దాడఁ గౌఁగిటఁ జేర్చిన-
  పూఁబోఁడి కుచములు పుణికిపుణికి
పాయని యనురక్తి డాయఁ జీరిన యింతి-
  యధరసుధారసం బానియాని
10.2-692.1-తే.
యురుసమాధిపరాష్టాంగయోగ యుక్తు
లైన యోగీశ్వరులు గాననట్టి జెట్టి
వల్లవీజన వన కల్పవల్లి యయ్యె"
ననుచుఁ బొగడిరి కృష్ణు నయ్యబ్జముఖులు. 

భావము:
పరీక్షిన్మహారాజా! “జగత్తునే కడుపులో ఉంచుకొనే ఈ దేవుడు, అవనిపై యశోదానందులకు ముద్దుల తనయుడు అయ్యాడు; బ్రహ్మాది దేవతలకుకూడా భావింప సాధ్యంకాని పరబ్రహ్మస్వరూపం, గోవులను పారించే గొల్లపిల్లవాడు అయ్యాడు; వేదశాస్త్రాలు వెదకినా కనుగొనలేని ఘనుడు, వ్రేపల్లెలో రోటికి కట్టుబడ్డాడు; వేల్పులకు అమృతం పంచిన పరాత్పరుడు, వెన్నదొంగ అయ్యాడు; శ్రీమహాలక్ష్మికిసైతం మనసు ఇవ్వని భగవానుడు, గొల్లపడచుల హృదయాలను కొల్లగొట్టాడు” అంటూ పురస్త్రీలు మేడలపై గుంపులు గూడి కృష్ణుడిని గురించి పరస్పరం ముచ్చటించుకున్నారు. అంతేకాకుండా “గొల్లపిల్లలతో కలసి గొల్లపల్లెలో ఆడుకున్నాడు; చల్లలు అమ్ముకోటానికి వెళ్ళే గోపికాకాంతల కొంగులుపట్టి సరసాలాడాడు; ముద్దుపెట్టుకోవాలని కౌగిట్లో చేర్చిన ముద్దుగుమ్మల రొమ్ములు స్పృశించాడు; ప్రేమతో దగ్గరకు రమ్మని పిలిచిన గొల్లపడతుల అధరామృతం పానం చేసాడు; సమాధినిష్ఠలో మునిగి అష్టాంగయోగంలో ఉన్నయోగీశ్వరులకు కూడా కనబడని వేలుపు యాదవ కన్నెల పాలిటి కల్పవల్లి అయ్యాడు” అంటూ పద్మం వంటి మోములు గల ప్రమదలు కృష్ణుడిని రకరకాలుగా స్తోత్రాలు చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=692 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, September 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౫(335)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-688-సీ.
కొఱనెలపైఁ దోచు నిరులు నాఁ జెలువొంది-
  నొసలిపైఁ గురులు తుంపెసలు గునియ
హాటకమణిమయ తాటంకరోచులు-
  గండభాగంబుల గంతులిడఁగ
స్ఫురిత విద్రుమనిభాధరబింబరుచితోడ-
  దరహాసచంద్రిక సరసమాడ
నొండొంటితో రాయు నుత్తంగ కుచకుంభ-
  ములు మొగంబులకును బుటము లెగయ
10.2-688.1-తే.
బడుగునడుములు వడఁకంగ నడుగు లిడఁగ
రవళిమట్టెలు మణినూపురములు మొరయఁ
బొలుచు కచబంధములు భుజంబుల నటింపఁ
బయ్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ.
10.2-689-వ.
ఇట్లు కృష్ణసందర్శన కుతూహల పరస్పరాహూయమానలై గురు పతి సుత బంధు జనంబులు వారింప నతిక్రమించి సమున్నత భర్మహర్మ్య శిఖాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి. 

భావము:
అలా పురుషోత్తముడిని దర్శించడానికి పురస్త్రీలు మేడలపై గుమికూడారు. అర్థచంద్రునిమీద మబ్బులు క్రమ్ముకొన్నాయా అన్నట్లు నెన్నుదుటిమీద ముంగురులు మూగుతున్నాయి; బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళ మీద గంతులు వేస్తున్నాయి; పగడపుకాంతిని తిరస్కరించే దొండపండు అధరాల కాంతులు, చిరునవ్వులు వెన్నెలలతో సరసమాడుతున్నాయి; ఒకదానికొకటి ఒరుసుకుంటున్న ఉన్నతమైన స్తనాలు ఉత్సాహంతో ఉబుకుతున్నాయి; సన్నని నడుములు వణుకుతున్నాయి నడచేటప్పుడు మెట్టెలూ అందెలూ గల్లుగల్లున మ్రోగుతున్నాయి; జుట్టుముడులు వీడి భుజాలపై నాట్యంచేస్తున్నాయి; పైటలు జారిపోతున్నాయి. ఇలా మనోహరంగా బయలుదేరి, పౌరకాంతలు కృష్ణుడిని దర్శించాలనే కుతూహలంతో, ఒకరి నొకరు పిలుచుకుంటూ, పెద్దలూ ఇంటివారూ వద్దంటున్నా వినకుండా, ఎత్తైన మేడలు ఎక్కి, ముకుందుని దర్శించి తమలో తాము ఇలా అనుకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=688 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౪(334)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-687-వ.
ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభునిం బెద్దతడవు గాఢాలింగనంబుచేసి రోమాంచకంచుకిత శరీరుండై యానందబాష్పధారాసిక్తకపోలుండై నిర్భరానంద కందళిత హృదయుండై బాహ్యంబు మఱచియుండె; నప్పుడు హరిని వాయునందన వాసవతనూభవులు గౌఁగిటం జేర్చి సమ్మదంబు నొందిరి; మాద్రేయులు దండప్రణామంబు లాచరించి; రంతఁ బుండరీకాక్షుఁడు విప్ర వృద్ధజనంబులకు నమస్కారంబులుచేసి, వారలు గావించు వివిధార్చనలం బరితుష్టుం డై కేకయ సృంజ యాది భూవిభుల మన్నించి సూత మాగధాదుల కనేక పదార్థంబు లొసంగి, చతురంగబలసమేతుండై వివిధ మణితోరణాది విచిత్రాలంకృతంబు నతివైభవోపేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండఁ బౌరకామిను లట్టియెడ.
భావము:
ఇలా ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించాడు. గట్టిగా కౌగలించుకుని పులకితశరీరుడై, ఆనందబాష్పాలు చెక్కిళ్ళను తడుపుతుండగా, ఆనందపారవశ్యంతో ధర్మజుడు ప్రపంచాన్ని మరచిపోయీడు. వాయుసుత, ఇంద్రసుతులైన భీమార్జునులు వనమాలిని ఆలింగనం చేసుకుని ఆనందించారు. మాద్రి పుత్రులు ఐన నకులసహదేవులు నళిననాభునికి నమస్కారం చేసారు. అటుపిమ్మట, శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు పెద్దలకూ వందనం చేసి, వారు చేసిన పూజలకు సంతోషించాడు. కేకయ సృంజయాది రాజులను మన్నించాడు. వందిమాగధులకు అనేక బహుమతులు ఇచ్చాడు. అనంతరం చతురంగబలసమేతుడై మణితోరణాలతో అలంకృతమై అత్యంత వైభవోపేతమైన ఇంద్రప్రస్థ పట్టణంలోనికి ప్రవేశించాడు. అలా పరమ వైభవంగా రాజమార్గము వెంట వెళుతున్న శ్రీకృష్ణుడిని నగరకాంతలు.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=687 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :శ్రీకృష్ణ విజయము - ౩౩౩(333)
( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-685-క.
హరిరాక యెఱిఁగి ధర్మజు
డఱలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌
గురుజన సచివ పురోహిత
పరిచారక కరి రథాశ్వ భటయుతుఁ డగుచున్.
10.2-686-క.
చిందములు మొరయ గాయక
బృందంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్
డెందము దగులఁగఁ బరమా
నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్. 

భావము:
శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. అలా బయలుదేరి నప్పుడు శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వీనుల విందు చేస్తుండగా, ధర్మరాజు మిక్కిలి భక్తి, అనురక్తి నిండిన మనసుతో కృష్ణుడికి స్వాగతం చెప్పటానికి పరమ సంతోషంగా వచ్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=686 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౩(333)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-685-క.
హరిరాక యెఱిఁగి ధర్మజు
డఱలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌
గురుజన సచివ పురోహిత
పరిచారక కరి రథాశ్వ భటయుతుఁ డగుచున్.
10.2-686-క.
చిందములు మొరయ గాయక
బృందంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్
డెందము దగులఁగఁ బరమా
నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్. 

భావము:
శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. అలా బయలుదేరి నప్పుడు శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వీనుల విందు చేస్తుండగా, ధర్మరాజు మిక్కిలి భక్తి, అనురక్తి నిండిన మనసుతో కృష్ణుడికి స్వాగతం చెప్పటానికి పరమ సంతోషంగా వచ్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=686 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, September 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౨(332)

( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-683-క.
కరి హరి రథ సుభట సము
త్కరములు సేవింప మురవిదారుఁడు గడచెన్
సరి దుపవన దుర్గ సరో
వర జనపద పుర పుళింద వన గోష్ఠములన్.
10.2-684-వ.
ఇట్లు గడచి చనుచు నానర్తక సౌవీర మరుదేశంబులు దాటి యిందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీనది దాఁటి పాంచాల మత్స్యవిషయంబులు లోనుగాఁ గడచి యింద్ర ప్రస్థనగరంబు డాయం జని, తత్పురోపకంఠవనంబున విడిసిన. 

భావము:
ఈ విధంగా మురాసురసంహారుడు శ్రీకృష్ణుడు రథ, గజ, తురగ, పదాతిసేనా సమూహాలు గల చతురంగ బలాలు సేవిస్తూ ఉండగా నదులనూ, వనాలనూ, కోటలనూ, జలాశయాలనూ, గ్రామాలనూ, పట్టణాలనూ, భిల్లపల్లెలను, తపోవనాలను, గోష్ఠాలను దాటాడు. ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి; ఇందుమతీనదిని దర్శించి; దృషద్వతీ, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి; ఇంద్రప్రస్థ నగరం చేరి, ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=684 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౧(331)

( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-680-క.
నరవరుల దూతయును ముర
హరుచే నభయప్రదాన మంది ధరిత్రీ
వరులకడ కేగి పద్మో
దరు వచనము సెప్పి సమ్మదంబునఁ దేల్చెన్.
10.2-681-వ.
అంతఁ గృష్ణుండు నిజకాంతాతనయ బంధు సుహృజ్జన సమేతుండై కదలి చనునెడ.
10.2-682-చ.
కటపటరత్నకంబళనికాయకుటీరము లుల్లసిల్ల ను
త్కటపటుచామరధ్వజ పతాక కిరీట సితాతపత్త్ర వి
స్ఫుట ఘనహేతిదీధితి నభోమణిఁ గప్పఁగఁ దూర్యఘోషముల్‌
చటులతిమింగిలోర్మిరవసాగరఘోషము నాక్రమింపఁగన్. 

భావము:
బంధీలుగా ఉన్న రాజుల దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడ శ్రీకృష్ణునిచే అభయప్రధానం అందుకుని, తిరిగి ఆ రాజుల వద్దకు వెళ్ళి వాసుదేవుడి వచనాలు వారికి వినిపించి వారిని సంతోష పెట్టాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలసి ఇంద్రప్రస్థనగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో మార్గమంతటా రత్నకంబళ్ళతో నిండిన పటకుటీరాలు విడిశాయి. వింజామరలూ విజయధ్వజాలూ విలసిల్లాయి. కిరీటాల నిగనిగలూ, వెల్లగొడుగుల ధగధగలూ. ఆయుధాల తళతళలూ సూర్యూడిని కప్పివేశాయి. మంగళవాద్యాల ధ్వనులు సముద్ర ఘోషాన్ని, తిమింగలాల ఘోషాన్ని అధిగమించాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=682 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౦(330)


( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-676-క.
అసమాస్త్రుఁడు పులు గడిగిన
కుసుమాస్త్రములను హసించు కోమలతనువుల్‌
మిసమిస మెఱవఁగ వేశ్యా
విసరము దాసీజనంబు విభవ మెలర్పన్.
10.2-677-ఆ.
హరుల వేసడములఁ గరులను నెక్కి తో
నరుగుదేర బహువిధాయుధములు
దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు
రాంగనలు సితాంబుజాక్షు కడకు.
10.2-678-వ.
వచ్చి రంత.
10.2-679-క.
నారదుని మాధవుఁడు స
త్కారంబున వీడుకొలుప నతఁడును హృదయాం
భోరుహమునఁ గృష్ణునకును
వారక మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్. 

భావము:
పూవిల్తుని స్వచ్ఛమైన పూలబాణాలవంటి మిసమిసలాడే మెత్తని మేనులతో మెఱసిపోయే ఆటవెలదులూ, దాసీ సమూహాలూ వైభవంగా తోడు వస్తుండగా ఆవిధంగా దాసదాసీ జనాలు అందరూ గుఱ్ఱాలు, కంచర గాడిదలు, ఏనుగులు ఎక్కి కూడా వస్తున్నారు. రకరకాల ఆయుధాలు ధరించిన భటులు వెంట వస్తున్నారు. ఆ విధంగా సకల వైభవాలతో అంతఃపుర సుందరాంగులు తెల్ల తామరల వంటి కన్నులు ఉన్న గోవిందుడి దగ్గరకు వచ్చారు. అలా తన అంతఃపుర కాంతులు వస్తున్న సమయంలో నారదమహర్షిని శ్రీకృష్ణుడు గౌరవించి సాగనంపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవునకు మాటిమటికీ నమస్కారాలు చేస్తూ స్వర్గలోకంవైపు వెళ్ళాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=679 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౯(329)


( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-673-వ.
వికచమరంద నవీన సౌరభ లస-
  న్మందార కుసుమదామములు దుఱిమి
చారు సుగంధ కస్తూరికా ఘనసార-
  మిళిత చందనపంక మెలిమి నలఁది
కనక కుండల రణత్కంకణ నూపుర-
  ముద్రికాభూషణములు ధరించి
యంచిత ముక్తాఫలాంచల మృదుల ది-
  వ్యాంబరములు సెలువారఁ గట్టి
10.2-674.1-తే.
యర్ధచంద్రుని నెకసక్కె మాడునట్టి
యలికఫలకలఁ దిలకము లలరఁ దీర్చి
పెంపు దీపింప నుడురాజబింబముఖులు
నవచతుర్విధ శృంగార మవధరించి.
10.2-675-తే.
జలజలోచను కడకు నుత్కలికతోడఁ
దనరు శిబికల నెక్కి నందనులుఁ దాముఁ
గనఁగ నేతేరఁ బ్రతిహారజనులు వేత్ర
కలితులై పౌరులను నెడగలుగ జడియ. 

భావము:
శ్రీకృష్ణుడి అంతఃపురకాంతలు మకరందాలుచిందుతూ సుగంధాలు వెదజల్లుతున్న వికసించిన మందారపూల హారాలు ధరించి; పరిమళభరితమైన కస్తూరి పచ్చకర్పూరంతో మేళవించిన మంచిగంధం మైపూతలు పూసుకుని; కంకణాలూ, కడియాలూ, ఉంగరాలూ, కుండలాలూ మున్నగు బంగారు ఆభరణాలు ధరించి; అంచులలో ముత్యాలు అలంకరించిన మెత్తని పట్టుచీరలు కట్టుకుని; అర్ధచంద్రబింబం వంటి నుదుట తిలకం పెట్టుకుని; ఎన్నో రకాల అలంకారాలతో నళినలోచనుని దగ్గరకు వచ్చారు. ఇలాగ, అంతఃపురకాంతలు పల్లకీలు ఎక్కి తమ సంతానంతో రాగా కావలివారు పౌరులను బెత్తాలతో ప్రక్కలకు ఒత్తిగించారు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=675 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, September 4, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౮(328)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-669-సీ.
తరల విచిత్రక స్థగిత ప్రభావలిఁ-
  దనరారు గరుడకేతనము వెలుఁగఁ
గాంచన చక్ర సంఘటిత ఘంటా ఘణ-
  ఘణ నినాదముల దిక్కరులు బెదర
సలలిత మేఘ పుష్పక వలాహక శైబ్య-
  సుగ్రీవ తురగవిస్ఫురణ దనర
బాలసూర్యప్రభా భాసమానద్యుతి-
  దిగ్వితానం బెల్ల దీటుకొనఁగఁ
10.2-669.1-తే.
బ్రకటరుచి నొప్పు తేరు దారుకుఁడు దేర
నెక్కి వెడలెడు నపుడు పెంపెనయఁ జెలఁగె
శంఖ కాహళ పటహ నిస్సాణ డిండి
మాది రవములు భరితదిగంతములుగ.
10.2-670-క.
మనుజేశ్వరునకుఁ దాలాం
కునకును గురువృద్ధజనులకునుఁ జెప్పి ప్రియం
బున ననుపఁ గాంచనస్యం
దన సామజ వాజి భటకదంబము గొలువన్.
10.2-671-తే.
వంది మాగధ సూత కైవారరవము
వసుమతీసురకోటి దీవనల మ్రోఁత
లనుగమింపంగ సతులు సౌధాగ్రశిఖర
జాలములనుండి ముత్యాలశాస లొలుక.

భావము:
స్వచ్చంగా రచింపబడిన తళతళ ప్రకాశించే గరుడధ్వజంతోనూ దిగ్గజాలను సైతం బెగ్గడిల్ల చేసే బంగారు చక్రాలకు కట్టిన గంటల గణగణ శబ్దాలతోనూ మంచి వేగం కలిగిన మేఘపుష్పం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అనే నాలుగు గుఱ్ఱాలతోనూ ఉదయసూర్యుని కాంతిని ధిక్కరించే దిగంత విశ్రాంత కాంతులతోనూ విలసిల్లే రథాన్ని దారకుడు సిద్దంచేసి తీసుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. ఆ సమయంలో శంఖ బాక తప్పెట నిస్సాణ మున్నగు వాద్యాల శబ్దాలు నలుదెసలా నిండాయి. ఉగ్రసేన మహారాజుకీ, అన్న బలరాముడికీ, గురువులకూ, పెద్దలు అందరికీ చెప్పి, ఆదరంతో వారు తనను సాగనంపగా చతురంగబల సమేతుడై శ్రీకృష్ణుడు బయలుదేరాడు. వందిమాగధుల, సూతజనుల పొగడ్తలూ; బ్రాహ్మణుల ఆశీర్వాదాలూ అతిశయిస్తుండగా; పుర స్త్రీలు మేడలమీద నుంచి ముత్యాల అక్షతలు చల్లుతుండగా; శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=668

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౭(327)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-668-వ.
అని సర్వజ్ఞుండైన హరి యజ్ఞుండ పోలెఁ దన్ను నడిగినఁ బురుషోత్తముని భాషణంబులకు మనంబున సంతసిల్లి, యతని పాదంబులు దన మనంబున నిడికొని, “వృద్ధానుమతంబుగా నా యెఱింగిన తెఱంగు విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్లు భవదీయ భక్తుండైన యుధిష్ఠిరు యాగపాలనంబు సేయం గైకొనుట కార్యం; బదియునుంగాక నిఖిల దిగ్విజయ మూలంబగు రాజసూయ కృత్యంబునందు జరాసంధ మర్దనంబును, నతనిచే బద్ధులైన రాజులం గారాగృహ విముక్తులం గావించుటయుం జేకూరు; నదియునుం గాక నాగాయుతసత్త్వుండును, శతాక్షౌహిణీ బలాన్వితుండును నగు మాగధుని వధియింప మన ప్రభంజననందనుండు గాని యొండొరులు సమర్థలుగా; రట్లగుట నతండు భూసురు లేమి గోరిన, నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గావున గపటవిప్రవేషంబునం జని యా జరాసంధుని నాహవ భిక్షవేఁడి, భవత్సన్నిధానంబున నప్పవమానతనయుం డతని వధియించునట్టి కార్యంబుసేఁత బహుళార్థసాధనంబగు” నని పలికిన నారదుండును యాదవ జనంబులును సభ్యులునుం బొగడి; రంత.

భావము:
ఇలా సర్వజ్ఞుడైన కృష్ణుడు అమాయకుడిలా ఉద్ధవుడిని ప్రశ్నించాడు. అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడి పాదాలను మనసులో ధ్యానించుకుని ఇలా అన్నాడు. “దేవా! పెద్దలు సమ్మతించేలా నాకు తెలిసిన విధానం వివరిస్తాను. చిత్తగించండి నారదుడు చెప్పినట్లుగా మీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం ఆవశ్యం కర్తవ్యం. సమస్త దిక్కులనూ జయించడానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం. వాడిచేత బంధించబడ్డ రాజులను చెరనుండి విముక్తులను చేయడం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా, పదివేల ఏనుగుల బలం కలవాడూ నూరు అక్షౌహిణుల సైన్యంకలిగిన జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్థులు కారు. బ్రాహ్మణులు ఏమికోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి, కపట బ్రాహ్మణవేషాలతో వెళ్ళి ఆజరాసంధుణ్ణి యుద్ధభిక్ష యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని సంహరించడం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లు అవుతుంది.” ఇలా పలికిన ఉద్ధవుడి మాటలు విని నారదుడూ యాదవులూ అందరూ పొగిడారు. ఆ సమయంలో.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=668

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 2, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౬(326)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-664-క.
ఆ మఖవేళ సమస్త ధ
రామండలిఁ గల్గు మేటిరాజులు మౌని
స్తోమంబును భవదీయ మ
హామహిమముఁ జూచి సత్కృతార్థతఁ బొందన్."
10.2-665-క.
కల" రని చెప్పిన నమ్ముని
పలుకులకు ముదంబు నొంది పంకజనాభుం
డెలనవ్వు మొగమునకుఁ జెలు
వొలయఁగఁ బాటించి యుద్ధవున కిట్లనియెన్.
10.2-666-క.
"ఉద్ధవ! మహిత వివేక స
మిద్ధవచోవిభవ! కార్య మేగతి నడచున్
వృద్ధవరానుమతంబుగ
బోద్ధవ్యము గాఁగఁ జెప్పు పురుషనిధానా!
10.2-667-తే.
అనఘచారిత్ర! నీవు మా యక్షియుగము
వంటివాఁడవు మనకు నవశ్య మగుచుఁ
జేయఁ దగినట్టి కార్యంబుఁ జెప్పు నీవు
ఏమి పంచినఁ గావింతు నిద్ధచరిత! "

భావము:
ధర్మరాజు చేసే యజ్ఞ సందర్భంగా భూమండలంమీద ఉన్న మహారాజులు మునీశ్వరులూ అందరూ నీ మహామహిమను దర్శించి ధన్యులు అవుతారు.” ఇలా పలికిన నారదుడి మాటలు వినిన శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్ధవుడితో ఇలా అన్నాడు. “వివేక, వాక్చాతుర్యాలు కల ఉద్ధవా! పెద్దల సమ్మతించే సరళిలో ఆలోచించి ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాగా అర్థం అయ్యేలా వివరించు. ఓ పుణ్యాత్ముడా! నీవు మాకు మంత్రాంగము చెప్పువాడవు. ఇప్పుడు మనం చేయవలసిన, చేయతగిన కార్యాన్ని వెల్లడించు. నీవు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=667

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౨౫(325)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-661-సీ.
"అయినను వినిపింతు నవధరింపుము దేవ!-
  పాండుతనూజుండు పారమేష్ఠ్య
కామానుమోదియై కావింప నున్నాఁడు-
  రాజసూయమహాధ్వరంబు నిష్ఠ
ఠవణింప లోకవిడంబనార్థము గాక-
  పరికింపఁ దన కాత్మబంధువుఁడవు,
భక్తవత్సలుఁడవు, పరమపూరుషుఁడవు-
  యజ్ఞరక్షకుఁడవు, యజ్ఞభోక్త
10.2-661.1-తే.
వగు భవత్సేవ చాలదే సుగతి వడయ?
నైన నీ మేనబావ ధర్మాత్మజుండు
అతని యజ్ఞంబు రక్షింప నంబుజాక్ష!
వలయు విచ్చేయు మచటికి వలను మెఱసి.
10.2-662-క.
నీ పేరు వినిన నొడివినఁ
బాపంబులు దూలిపోవు పద్మాక్ష! జగ
ద్దీపక! నీ దర్శనమున
నేపారవె భక్తజనుల కిహపరసుఖముల్‌.
10.2-663-మ.
భవదీయోజ్జ్వలకీర్తి దిగ్వితతులన్ భాసిల్లు యుష్మత్పదో
ద్భవనైర్మల్యజలంబు లుత్కలికఁ బాతాళంబునం బాఱు భో
గవతీ నామమునం దనర్చి ధరణిం గంగానదీరూపమై
దివి మందాకినియై జగత్త్రయమునం దీపించుఁ గాదే? హరీ!

భావము:
“ఓ కృష్ణమహాప్రభు! కమలాక్షా! నీకు తెలియనిది ఏమీ లేకపోయినా, ఒక విషయం విన్నవిస్తాను, విను. ధర్మరాజు బ్రహ్మలోకమును ఆశించి రాజసూయయాగం చేయబోతున్నాడు. పరికించి చూస్తే, భక్తవత్సలుడవూ; పరమపురుషుడవూ; రక్షకుడవూ; యజ్ఞభోక్తవూ; ఫలప్రదాతవూ; ఆత్మబంధుడవూ అయిన నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందటానికి. అయినా అతడు యజ్ఞంచేయాలని అనుకోవడం లోకాచారాన్ని అనుకరించం కోసమే తప్ప మరొకటి కాదు. నీ మేనబావ ధర్మజుడు. ఆయన చేయబోయే యజ్ఞాన్ని రక్షించడానికి నీవు రావలసి ఉంది. ఓ కలువల వంటి కన్నులున్న కన్నయ్యా! విశ్వజ్యోతీ! నీ నామస్మరణం చేసినా, విన్నా పాపాలు అన్నీ తొలగిపోతాయి. నీ దర్శనమాత్రం చేతనే భక్తలకు ఇహపరసౌఖ్యాలు సంసిద్ధిస్తాయి. శ్రీకృష్ణా! నీ కీర్తిదిగంతాలను ప్రకాశింపచేస్తుంది. నీ పాదాలనుండి ప్రభవించిన పవిత్రజలం పాతాళంలో భోగవతి అనే పేరుతోనూ, భూలోకంలో గంగానదీ రూపంతోనూ, స్వర్గంలో మందాకినీ నామంతోనూ ప్రవహిస్తూ ముల్లోకాలలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=663

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :