Friday, December 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౧(431)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-920-చ.
జలరుహలోచనుండు నిజసాధనమై తనరారు చక్రమున్
వలనుగఁ బూన్చి వైవ నది వారక వాని శిరంబు ద్రుంచె న
బ్బలియుఁడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోదరా
వలుల వధించి తత్కులము వారి ననేకులఁ ద్రుంచె నీ గతిన్.
10.2-921-వ.
అయ్యవసరంబున.
10.2-922-క.
నర ముని యోగి సురాసుర
గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ
శ్చర కిన్నర కింపురుషులు
హరిమహిమ నుతించి రద్భుతానందములన్. 

భావము:
కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. అలా బలవంతుడైన శ్రీకృష్ణుడు సౌభకంతో పాటు, సాల్వుణ్ణీ, శిశుపాలుణ్ణీ, వాని తమ్ముడు విదూరథుణ్ణీ, వారి సోదరులతో సహా సంహరించాడు. ఇంతేకాక, వారి వంశం వారిని చాలా మందిని చంపాడు. అలా సాల్వాదులను అంతమొందించిన సమయంలో మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=922 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: