Tuesday, March 31, 2015

కృష్ణుని అల్లరి

10.1-307-కంద పద్యము
బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ కపక నగి యీ
బాలుం డాలము చేయుచు
నాకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
         కలువలవంటి కన్నులున్న తల్లీ! అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోటం లే దని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగదూడనుల తాళ్ళువిప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మ. జ్ఞానముచే కలిగిన దృష్టి కలామె అంభోజాక్షి. గోపికలు అంటే ముముక్షువులు. బాలు రంటే అజ్ఞానులు. బాలింతలు అంటే వారిని పోషించే జ్ఞానప్రదాతలు. వారు అజ్ఞానులకి సరిపడినంత మోక్షం అనే పాలు అందటం లేదని తపిస్తున్నారట. ఎందుకంటే, బలం అంటే శక్తికి కారణభూతుడైన ఈ బాలుడు వేదాలు అనే ఆవులకి మోక్షాపేక్ష గల వా రందరిని వదిలేస్తున్నా డట.
          బాలురు = పిల్లల; కున్ = కి; పాలు = తాగుటకు పాలు; లేవు = లేవు; అని = అని; బాలింతలు = పసిబిడ్డల తల్లులు; మొఱలుపెట్టన్ = మొత్తుకొనగా; పకపక = పకపక అని; నగి = నవ్వి; = ; బాలుండు = పిల్లవాడు; ఆలమున్ = అల్లరి; చేయుచున్ = చేస్తూ; ఆల = ఆవుల; కున్ = కు; క్రేపులను = దూడలను; విడిచెన్ = వదలిపెట్టెను; అంభోజాక్షీ = సుందరీ {అంబోజాక్షి - పద్మాక్షి, స్త్రీ}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: