Friday, July 3, 2020

ఉషా పరిణయం - 34

( బాణాసురునితో యుద్ధంబు )

10.2-398-మ.
సరిదారామ సరోవరోపవన యజ్ఞస్థానముల్‌ మాపి వే
పరిఖల్‌ పూడిచి యంత్రముల్‌ దునిమి వప్రవ్రాతముల్‌ ద్రొబ్బి గో
పురముల్‌ గూలఁగఁ ద్రోచి సౌధ భవనంబుల్‌ నూకి ప్రాకారముల్‌
ధరణిం గూల్చి కవాటముల్‌ విఱిచి రుద్దండక్రియాలోలురై.
10.2-399-వ.
ఇట్లనేక ప్రకారంబులు గాసిచేసి, పురంబు నిరోధించి పేర్చి యార్చినంజూచి యాగ్రహసమగ్రోగ్రమూర్తియై బాణుండు సమరసన్నాహసంరంభ విజృంభమాణుండై సంగరభేరి వ్రేయించిన.

భావము:
యాదవవీరులు అత్యుత్సాహంగా శోణపురంలోని నదులను, సరోవరాలను, ఉద్యానవనాలను, యజ్ఞవాటికలను చిందరవందర చేశారు; అగడ్తలను పూడ్చివేశారు; యంత్రాలను చెడగొట్టారు; కోటలను పడగొట్టారు; గోపురాలను కూలద్రోశారు; సౌధాలను, ప్రాకారాలను నేలకూల్చారు; కవచాలు విరగగొట్టారు. ఈ ప్రకారంగా యాదవవీరులు శోణపురాన్ని చుట్టుముట్టి రకరకాలుగా వేధిస్తూ విజృంభించారు. అది చూసిన బాణుడు మిక్కిలి ఆగ్రహంతో సమర సన్నాహంచేసి విజృంభించి యుద్ధభేరి వేయించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=399

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: