Saturday, November 28, 2020

శ్రీ కృష్ణ విజయము - 85

( చాణూర ముష్టికుల వధ )

10.1-1363-క.
శౌరి నెఱిఁజొచ్చి కరములఁ
గ్రూరగతిం బట్టి త్రిప్పి కుంభిని వైచెన్
శూరుం గలహ గభీరున్
వీరుం జాణూరు ఘోరు వితతాకారున్.
10.1-1364-క.
శోణితము నోర నొలుకఁగఁ
జాణూరుం డట్లు కృష్ణ సంభ్రామణ సం
క్షీణుండై క్షోణిం బడి
ప్రాణంబులు విడిచెఁ గంసు ప్రాణము గలఁగన్.
10.1-1365-క.
బలభద్రుండును లోకులు
బలభద్రుం డనఁగఁ బెనఁగి పటుబాహుగతిన్
బలభేది మెచ్చఁ ద్రిప్పెను
బలవన్ముష్టికునిఁ గంసు బలములు బెగడన్.

భావము:
పరాక్రమవంతుడూ, యుద్ధమందు గంభీరుడూ, భీతిగొలిపేవాడూ, దొడ్డ దేహం కలవాడూ, వీరుడూ అయిన చాణూరుడిని కృష్ణుడు చొరవగా చొచ్చుకుపోయి కర్కశంగా వాడి చేతులు పట్టుకుని గిరగిర త్రిప్పి నేలపై పడదోసాడు. అలా కృష్ణుడిచేత గిరగిర త్రిప్పబడిన చాణూరుడు బలమంతా క్షీణించినవాడై నోటిలోనుండి రక్తం కారుతుండగా నేలమీద పడి ప్రాణాలు విడిచాడు. అతడి ప్రాణం పోడంతో కంసుడి ప్రాణం కలతబారింది. “బలభద్రుడు నిజంగా బలంలో భద్రుడే” అంటూ లోకులు అంటూండగా; బలాసురుని సంహరించిన ఇంద్రుడు “మేలు మే” లని మెచ్చుకోగా; బలరాముడు అపారమైన బాహుబలంతో బలవంతుడైన ముష్టికుడిని పట్టుకుని గిరగిరా త్రిప్పాడు. అది చూసిన కంసుడి సేన బెదిరిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1365

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: