Wednesday, November 25, 2020

శ్రీ కృష్ణ విజయము - 83

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1357-క.
గోపాలకృష్ణుతోడను
గోపాలన వేళలందుఁ గూడి తిరుగు నా
గోపాలు రెంత ధన్యులొ
గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే?
10.1-1358-క.
శ్రమజలకణసిక్తంబై
కమలదళేక్షణుని వదనకమలము మెఱసెన్
హిమజలకణసిక్తంబై
కమనీయం బగుచు నున్న కమలము భంగిన్.
10.1-1359-ఆ.
సభకుఁ బోవఁ జనదు; సభవారి దోషంబు
నెఱిఁగి యూరకున్ననెఱుఁగకున్న
నెఱిఁగి యుండియైన నిట్టట్టు పలికినఁ
బ్రాజ్ఞుఁ డైనఁ బొందుఁ బాపచయము."
10.1-1360-వ.
అని పెక్కండ్రు పెక్కువిధంబులం బలుకుచుండఁ దద్బాహు యుద్ధంబున.

భావము:
గోవులను మేపే సమయంలో గోపాలకృష్ణుడితో కలసిమెలసి తిరిగే ఆ గోపాలకు లెంత పుణ్యాత్ములో ఎంతటి ప్రభువులకైనా ఇంతటి గొప్ప అనుభవం దక్కదు కదా. మంచునీటి చుక్కలతో తడిసి మనోహరంగా ఉండే పద్మం వలె కలువరేకుల వంటి కన్నులు కల కృష్ణుని ముఖకమలం చెమటబిందువులతో తడిసి ప్రకాశిస్తున్నది. సభకు వెళ్ళరాదు. వెళితే సభలోనివారు చేసే దోషాలు తెలిసి ఉపేక్షించరాదు, ఆ దోషాలు తెలుసుకోలేకపోయినా, దోషాలు తెలిసి కూడా న్యాయవిరుద్ధంగా పలుకరాదు. లేకపోతే, ఎంతటి పండితుడి కైనా ఆ పాపం పట్టుకు తీరుతుంది.” ఇలా ఎందరో పురస్త్రీలు రకరకాలుగా పలుకుతుండగా ఆ ముష్టి యుద్ధంలో. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1359

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: