Sunday, November 29, 2020

శ్రీ కృష్ణ విజయము - 87

( చాణూర ముష్టికుల వధ )

10.1-1370-క.
"వల్లవబాలకు లని మన
మల్లవరులు పెనఁగి నేడు మడిసిరి వీరల్
బల్లిదులు; తలఁడు తలఁ" డని
చెల్లాచెదరైరి పాఱి చిక్కిన మల్లుల్.
10.1-1371-ఉ.
మల్లురఁ జంపి గోపక సమాజములో మృగరాజు రేఖ శో
భిల్లఁగఁ బాదపద్మములఁ బెల్లుగ నందెలు మ్రోయ వచ్చు నా
వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదు ల
ల్లల్లన సంస్తుతించిరి ప్రియంబుగఁ గంసుఁడు దక్క నందఱున్.
10.1-1372-వ.
అంత సభాజనంబుల కలకలంబు నివారించి మంత్రులం జూచి కంసుం డిట్లనియె.

భావము:
కేవలం గోపాలబాలకులు అనుకుని వారితో యుద్ధం చేసి మన మల్లశ్రేష్ఠులు మరణించారు. ఈ రామకృష్ణులు చాలా బలవంతులు. “దూరంగా పొండి” అంటూ తక్కిన మల్లురు అందరూ చెల్లాచెదరై పారిపోయారు. గొల్లలరాజైన నందుడి నందనులు మల్లులను చంపి గొల్లలమధ్య సింహాలలా ప్రకాశిస్తూ, అందెలు మ్రోగుతున్న అడుగుదామరలతో అడుగులు వేస్తూ వస్తుంటే, ఒక్క కంసుడు తప్పించి బ్రాహ్మణులు మొదలైన వారు అందరూ రెప్పవాల్చక చూసి ప్రీతితో పొగడారు. అప్పుడు సభాసదుల కోలాహలాన్ని నివారించి కంసుడు తన మంత్రులను చూసి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1371

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: