Tuesday, November 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 81

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1352-వ.
ఆ సమయంబునం బౌరకాంతలు మూఁకలు గట్టి వెచ్చనూర్చుచు ముచ్చటలకుం జొచ్చి తమలో నిట్లనిరి.
10.1-1353-ఉ.
"మంచి కుమారులం గుసుమ మంజు శరీరులఁ దెచ్చి చెల్లరే
యంచిత వజ్రసారులు మహాద్రి కఠోరులు నైన మల్లురం
గ్రించులఁ బెట్టి రాజు పెనఁగించుచుఁ జూచుచు నున్నవాఁడు; మే
లించుకలేదు; మాను మనఁ డిట్టి దురాత్ముని మున్ను వింటిమే?
10.1-1354-క.
చూచెదరు గాని సభికులు
నీ చిన్నికుమారకులకు నీ మల్లురకు
న్నో చెల్ల! యీడు గాదని
సూచింపరు పతికిఁ దమకు శోకము గాదే?

భావము:
అలా బలరామకృష్ణులు మల్లులతో పోరాడుతున్న సమయంలో మధురలోని మగువలు గుంపులుగా చేరి, వేడి నిట్టూర్పులు విడుస్తూ తమలో తాము ఇలా ముచ్చటించుకున్నారు. “ఔరా! పువ్వులలా సుకుమారమైన శరీరాలు కల ఈ చక్కటి బాలురను రప్పించి, వజ్రాయుధ మంత సత్తా కలవారూ, పర్వతా లంత కఠోరులు అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో ఏమాత్రం మంచితనం లేదు. ఈ రాజు పోరు ఆపమని అనడయ్యె. ఇలాంటి దుర్మార్గులను మునుపు ఎన్నడైనా విన్నామా కన్నామా? సభాసదులైనా చూస్తున్నారే తప్ప; ఈ పసిపిల్లలకూ, ఈ మల్లయోధులకూ జోడు కుదరదని చెప్పరు. ఇది అధర్మం. ఇది వారికీ వారి రాజుకూ శోకం కలిగించదా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1354

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: