Sunday, December 6, 2020

శ్రీ కృష్ణ విజయము - 97

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1394-క.
జననీజనకుల వృద్ధులఁ
దనయుల గురు విప్ర సాధు దారాదులనే
జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక
వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.
10.1-1395-వ.
అదియునుం గాక.
10.1-1396-శా.
కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా
వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపఁగా లేక ని
ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్
సారాతిక్షములార! మమ్ముఁ గొఱతల్ సైరించి రక్షింపరే."
10.1-1397-వ.
అని యిట్లు మాయామనుష్యుండైన హరి పలికిన పలుకులకు మోహితులై వారల నంకపీఠంబుల నిడుకొని కౌఁగిలించుకొని వారి వదనంబులు కన్నీటం దడుపుచుఁ బ్రేమపాశబద్ధులై, దేవకీవసుదేవు లూరకుండి; రంత వాసుదేవుండు మాతామహుండైన యుగ్రసేనుం జూచి.


భావము:
ఏ నరుడైతే తల్లితండ్రులను, వయోవృద్ధులనూ, భార్యాపిల్లలనూ, గురువులనూ, బ్రాహ్మణులనూ, సాధువులలు మొదలైనవారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక ఏడుస్తుంటాడో, అలాంటి వాడు ఈ భూమి మీద బ్రతికున్న శవం వంటి వాడే. అంతేకాక జననీజనకులారా! మీరు మిక్కిలి ఓర్పు కలవారు. మా కారణంగా మిమ్మల్ని కంసుడు చెరసాలలో బంధించి, బాధిస్తూ ఉంటే, వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలినవాళ్ళం; క్రూరులం; మిక్కిలి కుటిలమైన నడత కల వాళ్ళం. మా లోపాలు సహించి మమ్మల్ని మన్నించండి.” అంటూ ఇలా పలికిన మాయామానుషవిగ్రహుడైన శ్రీకృష్ణుడి మాటలకు దేవకీవసుదేవులు మోహము చెందారు. వారు తమ పుత్రులను ఒడిలోకి తీసుకున్నారు; గట్టిగా ఆలింగనం చేసుకున్నారు; కన్నీళ్ళతో వారి తలలు తడిపారు; ప్రేమాతిశయం వలన మాటలు పెగలక మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుడితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1396

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: