Thursday, December 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 107

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1418-వ.
అనిన విని రామకృష్ణులు గుర్వర్థంబుగా దుర్వారరథారూఢులై రయంబునం జని రౌద్రంబున సముద్రంబుఁ జేరి యిట్లనిరి.
10.1-1419-క.
"సాగర! సుబుద్ధితోడను
మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ
వాగడ మగుదువు దుస్సహ
వేగరణాభీల నిశిత విశిఖాగ్నులకున్."
10.1-1420-వ.
అనిన వారలకు జలరాశి యిట్లనియె.
10.1-1421-ఉ.
"వంచన యేమి లేదు యదువల్లభులార! ప్రభాసతీర్థమం
దంచితమూర్తి విప్రసుతుఁ డాఢ్యుఁడు తోయములాడుచుండ ను
త్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతిం గొనిపోయెఁ బోవఁగాఁ
బంచజనుండు మ్రింగె నతిభాసురశీలుని విప్రబాలునిన్."

భావము:
ఇలా పలికిన తమ గురువు పలుకులు విని, రామకృష్ణులు వారి కోరిక తీర్చడం కోసం ఎదురు లేని రథాన్ని అధిరోహించారు. తత్క్షణం సముద్రుడి దగ్గరకి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు. “ఓ సముద్రుడా! మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుడిని తెచ్చి మాకు అప్పగించు. ఎదురు చెప్పావు అంటే, సహింపరాని వేగం కలవీ, రణరంగ భయంకరాలూ అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గుఱి అవుతావు.” ఇలా పలికిన రామకృష్ణులతో సాగరుడు ఇలా అన్నాడు. “యాదవేశ్వరులారా! నా మాటలలో ఏమాత్రం మోసం లేదు. ప్రభాసతీర్ధంలో మంచి అందమైన చక్కటి బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా, పెద్ద అల ఒకటి పైకెగసి భయంకరవేగంతో అతడిని లోపలికి తీసుకుపోయింది. అలా తీసుకునిపోగా బహు చక్కనైన స్వభావం కల ఆ బ్రాహ్మణ పిల్లాడిని పంచజనుడనే దైత్యుడు మ్రింగివేశాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1421

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: