Monday, November 9, 2020

శ్రీ కృష్ణ విజయము - 71

( మల్లావనీ ప్రవేశము )


10.1-1330-క.
వసుదేవు నివాసంబున
వసుధన్ రక్షింప వీరు వైష్ణవతేజో
ల్లసనమునఁ బుట్టినారఁట
పసిబిడ్డ లనంగఁ జనదు పరదేవతలన్.
10.1-1331-సీ.
చంపె రక్కసిఁ బట్టి; చక్రవాకునిఁగూల్చెఁ-
  బడ ద్రొబ్బె మద్దుల; బకునిఁ జీఱె;
నఘదైత్యుఁ బొరిగొనె; నడరి వత్సకుఁ ద్రుంచె-
  గిరి యెత్తి దేవేంద్రుఁ గ్రిందుపఱిచెఁ;
గాళియు మర్దించె; గహనానలముఁ ద్రావెఁ-
  గేశి నంతకుపురి క్రేవ కనిచె;
మయుపుత్రుఁ బరిమర్చె; మఱియు దానవ భటు-
  ల హరించి గోపకులంబుఁగాచె;
10.1-1331.1-తే.
గోపకాంతల మనముల కోర్కిదీర్చె;
నీ సరోరుహలోచనుండీ శుభాంగుఁ
డీ మహామహుఁడీ దిగ్గజేంద్ర మడఁచె;
మనుజమాత్రుఁడె తలపోయ మాధవుండు."

భావము:
“వీరు విష్ణుదేవుడి తేజోవిలాసంతో భూలోకాన్ని కాపాడుట కోసం, వసుదేవుడి ఇంట్లో పుట్టారట. పరబ్రహ్మ స్వరూపు లయిన వీరిని పసిపాపలు అనడం తగదు” అనుకున్నారు. నళినముల వంటి నయనములు కల వాడూ, మంగళకర మైన అంగసౌష్టవము కలవాడూ, గొప్ప తేజస్సు కలవాడూ. లక్ష్మిదేవికి పతి అయినవాడూ అయిన ఈ శ్రీకష్ణుడు తరచి చూస్తే సామాన్య మానవుడు కాదు. పూతన రక్కసిని పట్టి చంపాడు; సుడిగాలి రూపుడు తృణావర్తుడిని హతమార్చాడు. మద్ది చెట్లను పడగొట్టాడు; బకాసురుడిని సంహరించాడు; అఘుడనే అసురుణ్ణి అంతం చేసాడు; విజృంభించి వత్సాసురుణ్ణి వధించాడు; గోవర్ధనగిరిని ఎత్తి దేవేంద్రుడి గర్వం అణచాడు; నాగరాజు కాళీయుడిని మర్థించాడు; కార్చిచ్చు త్రాగాడు; కేశి అనే దానవుడిని యమపురికి పంపాడు; మయుని కొడుకు వ్యోమాసురుడిని సంహరించాడు; ఇంకా ఎందరో రాక్షస వీరులను నిర్మూలించి, గోపకులను కాపాడాడు; వ్రేతల మనసులలోని కోరికలను తీర్చాడు; దిగ్గజం లాంటి కువలయాపీడ కరీంద్రమును కడతేర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1331

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: