Saturday, December 5, 2020

శ్రీ కృష్ణ విజయము - 95

( దేవకీ వసుదేవుల విడుదల )

10.1-1390-వ.
అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుండైన హరి కంసాదులకుం బరలోకసంస్కారంబులు చేయం బనిచి దేవకీ వసుదేవుల సంకలియలు విడిపించి, బలభద్ర సహితుండై వారలకుం బ్రణామంబులు జేసిన.
10.1-1391-మ.
కని లోకేశులుగాని వీరు కొడుకుల్గారంచుఁ జిత్తంబులన్
జనయిత్రీ జనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా
జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి
ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై. 

భావము:
అలా ఏడుస్తున్న రాజు భార్యలను ఓదార్చి, లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి ఉత్తరక్రియలు చేయమని ఆదేశించాడు. పిమ్మట, దేవకీవసుదేవులను చెర విడిపించి, బలరాముడు తను కలిసి వారికి నమస్కారాలు చేయగా తల్లితండ్రులైన దేవకీవసుదేవులు తమ పుత్రులను చూసి “వీరు సకల లోకాలకు ప్రభువులు తప్ప సాధారణ మానవులు కారు” అని ఆలోచిస్తూ తమ మనసులలో సంశయ పడసాగారు. అప్పుడు, శ్రీకృష్ణుడు జనులను సమ్మోహింప జేసే మాయాశక్తిని ప్రయోగించి, వారి ఎరుకను మరుగు పరచి, అన్న బలభద్రుడుతో కూడి వచ్చి మిక్కిలి వినయంతో ఆనందాలు పంచుతూ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=166&padyam=1391

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: