Thursday, December 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 108

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1422-వ.
అని వాని వసియించు చో టెఱింగించిన.
10.1-1423-శా.
శంఖారావముతోడఁ బంచజనుఁ డాశంకించి చిత్తంబులో
సం ఖిన్నుండయి వార్థిఁ జొచ్చె దహనజ్వాలాభ హేమోజ్జ్వల
త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ
ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై.
10.1-1424-క.
దానవుని దేహజం బగు
మానిత శంఖంబుఁ గొనుచు మసలక బలుఁడుం
దో నేతేరఁగ రథి యై
దానవరిపుఁ డరిగె దండధరుపురికి నృపా!

భావము:
అంటూ సముద్రుడు ఆ రాక్షసుడుండే చోటు రామకృష్ణులకు తెలియజేసాడు. శ్రీకృష్ణుడు శంఖం పూరించగా, ఆ శంఖారావం వినిన పంచజనుడు భయ సందేహాలతో కంపించిపోయి,. సాగర జలంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు వాడిని అగ్నిజ్వాలలతో సమానములైన బంగారుపింజల రంగారు బాణాలతో పడగొట్టి, వాడి పొట్టను చీల్చాడు. అచంచలమనస్కు డైన శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రకుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రీతిచే కార్య తత్పరుడు అయ్యాడు. ఓ పరీక్షన్మహారాజా! రాక్షసవిరోధి అయిన శ్రీకృష్ణుడు పంచజన రాక్షసుడి శరీరం నుంచి జనించిన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్ర సహితుడై రథము ఎక్కి, యమ పురికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1424

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: