Saturday, November 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 77

( చాణూరునితో సంభాషణ )

10.1-1345-సీ.
మహిమతో నుండగ మథురాపురము గాని-
  పొలుపార వైకుంఠపురము గాదు
గర్వంబుతో నుండఁ గంసుని సభ గాని-
  సంసార రహితుల సభయుఁ గాదు
ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని-
  నారదు వీణాస్వనంబు గాదు
చదురు లాడఁగ మల్లజన నిగ్రహము గాని-
  రమతోడి ప్రణయ విగ్రహము గాదు
10.1-1345.1-తే.
వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు
మొఱఁగిపో ముని మనముల మూల గాదు
సాఁగి నడువంగ భక్తుల జాడ గాదు
శౌరి! నా మ్రోల నీ వెందు జనియె దింక."
10.1-1346-వ.
అని పలికి.

భావము:
వైభవోపేతంగా ఉందామనుకుంటున్నావేమో ఇది విలసిల్లే వైకుంఠం కాదు మధురానగరం; దర్పంతో తిరగడానికి ఇది సన్నాసుల సభ కాదు కంసమహారాజు కొలువుకూటమి; చక్కగావిందాం అనుకోకు. ఇది నారదుడి వీణా నాదము కాదు నా భుజాస్ఫాలన శబ్దం; పరిహాసాలు ఆడటానికి ఇది లక్ష్మీదేవి తోటి ప్రణయకలహము కాదు మల్ల యోధులతో రణరంగం; యధేచ్ఛగా సంచరించడానికి ఇది వేదాంతుల వీధి కాదు; దాగి ఉండటానికి ఇది మునుల మనఃకుహరం కాదు; అతిశయించి వెళ్ళడానికి ఇది భక్తులసంగతి కాదు; గుర్తుంచుకో కృష్ణా! నా ముందు నుంచీ ఇక నీవెక్కడకీ వెళ్ళలేవు.” చాణూరుడు ఇలా కృష్ణుడితో పలికి. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1345

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: