Monday, November 30, 2020

శ్రీ కృష్ణ విజయము - 88

( చాణూర ముష్టికుల వధ )

10.1-1373-ఉ.
"వల్లవబాలురన్ నగరి వాకిటికిన్ వెడలంగఁ ద్రొబ్బుఁ; డీ
గొల్లల ముట్టికోల్ గొనుఁడు; క్రూరుని నందునిఁ గట్టు; డుర్వికిం
దెల్లముగాఁగ నేడు వసుదేవునిఁ జంపుఁడు; తండ్రి గాఁడు వీఁ
డెల్లవిధంబులం; బరుల కిష్టుఁడు కావకుఁ డుగ్రసేనునిన్."
10.1-1374-వ.
అని పలుకు సమయంబున.
10.1-1375-శా.
జంఘాలత్వముతో నగోపరి చరత్సారంగ హింసేచ్ఛను
ల్లంఘింపన్ గమకించు సింహము క్రియన్ లక్షించి పౌరప్రజా
సంఘాతంబులు తల్లడిల్ల హరి కంసప్రాణహింసార్థి యై
లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్.

భావము:

భావము:
“ఈ గొల్లపిల్లలను నగరద్వారం బైటకి పడిపోయేలా నెట్టేయండి. ఈ యాదవులను ముట్టడించండి. క్రూరుడైన నందుణ్ణి బంధించండి. లోకానికి వెల్లడి అయ్యేలా, ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి. ఈ ఉగ్రసేనుడు నాకు తండ్రి కాడు. అన్నివిధాలా శత్రువుకు ఇష్టమైనవాడు. వాడిని కాపాడకండి.” ఇలా కంసుడు యాదవులను ముట్టడించమని అంటుండగా.కొండశిఖరాన తిరిగే జింకను చంపడానికి, పిక్కబలంతో కుప్పించి దూకే సింహకిశోరం లాగున, శ్రీకృష్ణుడు కంసుని సంహరించాలని తలచినవాడై గురి చూసి మంచె మీదికి యుద్ధోత్సాహంతో దూకాడు. కొలువులో ఉన్న ప్రజలు అందరూ తల్లడిల్లారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1373

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: