Saturday, December 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 109

( గురుపుత్రుని తేబోవుట )

10.1-1425-వ.
చని సంయమనీనామ నగరంబు చేరి తద్వారంబునఁ బ్రళయకాల మేఘగంభీర నినద భీషణం బగు శంఖంబు పూరించిన విని వెఱఁగుపడి.
10.1-1426-శా.
"అస్మద్బాహుబలంబుఁ గైకొనక శంఖారావమున్ మాన సా
పస్మారంబుగ నెవ్వఁ డొక్కొ నగరప్రాంతంబునం జేసె? మ
ద్విస్మేరాహవ రోషపావకునిచే విధ్వస్తుఁడై వాఁడు దా
భస్మంబై చెడు" నంచు నంతకుఁడు కోపప్రజ్వలన్మూర్తియై.

భావము:
అలా వెళ్ళిన శ్రీకృష్ణుడు సంయమని అనే పేరు కల ఆ యముడి పట్టణం చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీరధ్వనితో భీతిగొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖఘోషము వినిన యమధర్మరాజు అశ్చర్యపోయాడు. “నా యమపురి ముందట ఎవరో నా భుజబలాన్ని లెక్కచేయకుండా నా మనసుకు క్రోధావేశం కలిగేలా శంఖం పూరిస్తున్నాడు. వాడు అద్భుతావహ మైన నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు.” అంటూ దండధరుడు కోపంతో మండిపడుతూ వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=171&padyam=1426

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: