Sunday, January 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౪(464)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-995-వ.
అమ్మహాత్మునివలన సకల వర్ణాశ్రమంబులవారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు గురుభజనంబు పరమధర్మం బని యాచరించితి; నదిగావున.
10.2-996-క.
భూసురులకెల్ల ముఖ్యుఁడ
నై సకల కులాశ్రమంబు లందును నెపుడున్
ధీసుజ్ఞానప్రదుఁ డన
దేశికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లెడలన్.
10.2-997-తే.
అట్టి వర్ణాశ్రమంబులయందు నర్థ
కుశలు లగువారు నిఖిలైక గురుఁడ నైన
నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ
దాఁటుదురు మత్పదాంబుజ ధ్యానపరులు. 

భావము:
సకల వర్ణాశ్రమాలవారికీ నేను నిజానికి విజ్ఞానప్రదాత అయిన గురువును అయినా గురుసేవ అత్యున్నత ధర్మము అని బోధించడం కోసం నేను కూడ గురుసేవ చేసాను. అందుచేత బ్రాహ్మణులలో కెల్లా ముఖ్యుడను అయి, సకల వర్ణాలకూ ఆశ్రమాలకూ జ్ఞానప్రదాతను అయి నేను ప్రకాశిస్తూ ఉంటాను. ఆ సకల వర్ణాలకు చెందిన జ్ఞానులు, లోకాలు సమస్తానికి గురుడనైన నా పలుకులను ఆలకించి, నా పాదపద్మాలను ధ్యానిస్తూ సంసార సాగరాన్ని దాటుతారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=997 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: