Tuesday, April 14, 2020

ధృవోపాఖ్యానము - 36

4-318-వ.
ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణి దీప నీరాజనంబుల నివాళింపం బౌర జానపద మిత్రా మాత్య బంధుజన పరివృతుండై చనుదెంచి.
4-319-సీ.
కాంచన మయ మరకత కుడ్య మణిజాల;
సంచయ రాజిత సౌధములను
వరసుధాఫేన పాండుర రుక్మ పరికరో;
దాత్త పరిచ్ఛదతల్పములను
సురతరు శోభిత శుక పిక మిధునాళి;
గాన విభాసి తోద్యానములను
సుమహిత వైడూర్య సోపాన విమల శో;
భిత జలపూర్ణ వాపీచయముల
4-319.1-తే.
వికచ కహ్లార దర దరవింద కైర
వప్రదీపిత బక చక్రవాక రాజ
హంస సారస కారండవాది జల వి
హంగ నినదాభిరామ పద్మాకరముల.
4-320-వ.
మఱియును.

భావము:
ఈ విధంగా ప్రేమతో చల్లుతూ యథార్థవాక్కులతో దీవిస్తూ, బంగారు పాత్రలలో మణిదీపాలుంచి హారతు లివ్వగా ధ్రువుడు పౌరులతో, జానపదులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ముందుకు సాగి ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. అక్కడి మేడలు పచ్చలు తాపిన బంగారు గోడలతోను, మణిఖచితాలైన గవాక్షాలతోను మెరిసిపోతున్నవి. పట్టెమంచాల పరుపులపై పాలనురుగువలె తెల్లనైన బంగారు జరీ అంచుల దుప్పట్లు పరచబడి ఉన్నాయి. ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండి చిలుకలు, కోయిలలు, తుమ్మెదల జంటలు పాడే పాటలతో మారుమ్రోగుతున్నాయి. దిగుడు బావులు వైడూర్యాలతో కట్టిన మెట్లతో నిర్మలమైన జలంతో నిండి ప్రకాశిస్తున్నాయి. వికసించిన కలువలతో, కమలాలతో విరాజుల్లుతూ కొక్కెరలు, జక్కవలు, రాయంచలు, బెగ్గురు పక్షులు, కన్నెలేళ్ళు మొదలైన నీటి పక్షుల కలకల ధ్వనులతో అక్కడి దొరువులు, చెరువులు అలరారుతున్నాయి. ఇంకా…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=319

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: