Saturday, April 11, 2020

ధృవోపాఖ్యానము - 31

4-303-క.
చచ్చిన వారలుఁ గ్రమ్మఱ
వచ్చుటయే కాక యిట్టి వార్తలు గలవే?
నిచ్చలు నమంగళుఁడ నగు
నిచ్చట మఱి నాకు శుభము లేల ఘటించున్.
4-304-క.
అని విశ్వసింపకుండియు
మనమున నా నారదుఁడు గుమారుఁడు వేగం
బునఁ రాఁగలఁ డనుచును బలి
కిన పలుకులు దలఁచి నమ్మి కృతకృత్యుండై.
4-305-క.
తన సుతుని రాక చెప్పిన
ఘనునకు ధనములును మౌక్తికపు హారములున్
మన మలర నిచ్చి తనయునిఁ
గనుఁగొను సంతోష మాత్మఁ గడలుకొనంగన్

భావము:
చచ్చినవారు తిరిగి రావడం అనే చోద్యం ఎక్కడైనా ఉందా? అన్నివిధాల నిర్భాగ్యుడనైన నాకు అంతటి అదృష్టం ఎలా లభిస్తుంది?ధ్రువుడు మరలి వస్తున్నాడు అని ముందు నమ్మనివాడై “నీ కొడుకు తొందరలోనే తిరిగివస్తాడు” అని పూర్వం నారదుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని అటువంటి అదృష్టం లభిస్తుందేమో అని కొంత విశ్వసించి తన కొడుకు వస్తున్నాడని చెప్పిన చారునకు ధనం, ముత్యాల దండలు సంతోషంగా ఇచ్చి, కొడుకును చూడాలనే ఉత్సాహం మనస్సులో ఉప్పొంగగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=305

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: