Friday, April 10, 2020

ధృవోపాఖ్యానము - 30

4-300-మ.
"ధనహీనుండు నృపాలుఁ జేరి మిగులన్ ధాటిన్ ఫలీకార మి
మ్మని యర్థించినరీతి ముక్తిఫలదుం డై నట్టి పంకేజలో
చనుఁ డే చాలఁ బ్రసన్నుఁడైన నతనిన్ సాంసారికం బర్థిఁ గో
రిన నావంటి విమూఢమానసులు ధాత్రిం గల్గిరే యెవ్వరున్?"
4-301-సీ.
అని యిట్లు చింతించె" ననుచు నమ్మైత్రేయ;
ముని విదురునకు నిట్లనియెఁ "దండ్రి!
కమనీయ హరిపాద కమల రజోభి సం;
స్కృత శరీరులును యాదృచ్ఛికముగ
సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై;
వఱలుచు నుండు మీవంటి వారు
దగ భగవత్పాద దాస్యంబు దక్కంగ;
నితర పదార్థంబు లెడఁద లందు"
4-301.1-తే.
మఱచియును గోర నొల్లరు మనుచరిత్ర!
తవిలి యిట్లు హరిప్రసాదంబు నొంది
మరలి వచ్చుచునున్న కుమారు వార్తఁ
జారుచే విని యుత్తానచరణుఁ డపుడు.
4-302-వ.
మనమున నిట్లని తలంచె.

భావము:
పేదవాడు రాజును సమీపించి ఊకతో కూడిన నూకలను ఇమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయిన కమలాక్షుడు నాకు ప్రసన్నుడైనా అతన్ని నేను సంసారాన్ని అర్థించాను. నావంటి మందబుద్ధులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు’ అని ఈ విధంగా ధ్రువుడు విచారించాడు ” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు “నాయనా! పావనమైన శ్రీహరి పాదపద్మాల పరాగంతో అలంకరింపబడిన శరీరం కలిగిన మీవంటివాళ్ళు తనంత తాను దొరికే దానితోనే సంతృప్తిపడతారు. భగవంతుని పాదసేవను తప్ప మరొకటి కోరుకొనరు. విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది కన్నకొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తను ఉత్తానపాదుడు చారుల వల్ల విని మనస్సులో ఇలా తలంచాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=301

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: