Sunday, April 12, 2020

ధృవోపాఖ్యానము - 34


4-312-వ.
కావున నుత్తముండును ధ్రువుండును బ్రేమ విహ్వలు లగుచు నన్యో న్యాలింగితులై పులకాంకురాలంకృత శరీరులై యానంద బాష్పముల నొప్పిరి; అంత సునీతియుం దన ప్రాణంబులకంటెఁ బ్రియుండైన సుతు నుపగూహనంబు చేసి తదవయవ స్పర్శనంబు చేత నానందంబు నొంది విగతశోక యయ్యె; నప్పుడు సంతోష బాష్ప ధారాసిక్తంబులై చనుఁబాలునుం గురిసె నంత.
4-313-సీ.
ఉన్నత సంతోష ముప్పతిల్లఁగఁ బౌర;
జనము లా ధ్రువుతల్లి నెనయఁ జూచి
"తొడరిన భవదీయ దుఃఖనాశకుఁ డైన;
యిట్టి తనూజుఁ డెందేని పెద్ద
కాలంబు క్రిందటఁ గడఁగి నష్టుం డైన;
వాఁడిప్డు నీ భాగ్యవశము చేతఁ
బ్రతిలబ్ధుఁ డయ్యెను; నితఁడు భూమండల;
మెల్లను రక్షించు నిద్ధమహిమ;
4-313.1-తే.
కమల లోచనుఁ జింతించు ఘనులు లోక
దుర్జయం బైన యట్టి మృత్యువును గెల్తు;
రట్టి ప్రణతార్తి హరుఁడైన యబ్జనాభుఁ
డర్థి నీచేతఁ బూజితుం డగుట నిజము."
4-314-వ.
అని ప్రశంసించిరి; అట్లు పౌరజనంబులచేత నుపలాల్య మానుండగు ధ్రువుని నుత్తాన పాదుం డుత్తమ సమేతంబుగా గజారూఢునిం జేసి సంస్తూయమానుండును, ప్రహృష్టాంతరంగుండును నగుచుఁ బురాభి ముఖుండై చనుదెంచి.

భావము:
కనుక, ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో ఒడలు మరచి ఒకరినొకరు కౌగలించుకున్నారు. వారి శరీరాలు పులకరించాయి. వారి కనులలో ఆనంద బాష్పాలు నిండాయి. అప్పుడు సునీతి తన ప్రాణాలకంటే ఎక్కువ ప్రీతిపాత్రుడైన కొడుకును గట్టిగా కౌగిలించుకొని అతని తనూస్పర్శ వల్ల కలిగిన సంతోషంతో తన దుఃఖాన్ని మరిచిపోయింది. ఆనందబాష్పాలతో తడిసిన ఆ తల్లి పాలిండ్లు పొంగులెత్తాయి. పురజనులు ధ్రువుని తల్లియైన సునీతిని చూచి అంతులేని సంతోషంతో “చాలాకాలం క్రిందట కనిపించకుండా పోయిన నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్ళీ తిరిగి వచ్చాడు. నీ దుఃఖాన్ని తొలగించాడు. ఇతడు సాటిలేని పరాక్రమంతో భూమండలాన్ని పరిపాలిస్తాడు. విష్ణువును సేవించే మహాత్ములు అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ప్రపన్నులైన భక్తుల దుఃఖాన్ని తొలగించే నారాయణుని నీవు నిజంగా ఆరాధించావు.” అని పౌరజనులు ప్రశంసించారు. ఆ విధంగా పౌరులచేత ఉపలాలింప బడుతున్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా ఏనుగుపైన కూర్చుండ బెట్టి, ప్రజల ప్రస్తుతులను అందుకుంటూ మనస్సులో పొంగిపొరలే సంతోషంతో పురం వైపు బయలుదేరి వచ్చి…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=314

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: