Tuesday, April 14, 2020

ధృవోపాఖ్యానము - 35


4-315-సీ.
స్వర్ణ పరిచ్ఛదస్వచ్ఛకుడ్యద్వార;
లాలిత గోపురాట్టాలకంబు;
ఫల పుష్ప మంజరీ కలిత రంభా స్తంభ;
పూగ పోతాది విభూషితంబు;
ఘన సార కస్తూరికా గంధ జలబంధు;
రాసిక్త విపణి మార్గాంచితంబు;
మానిత నవరత్న మయ రంగవల్లీ వి;
రాజిత ప్రతి గృహ ప్రాంగణంబు;
4-315.1-తే.
శుభ నదీజల కుంభ సంశోభితంబు;
తండులస్వర్ణలాజాక్షతప్రసూన
ఫల బలివ్రాత కలిత విభ్రాజితంబు;
నగుచు సర్వతో లంకృత మైన పురము.
4-316-వ.
ప్రవేశించి రాజమార్గంబునఁ జనుదెంచు నప్పుడు.
4-317-మ.
హరిమధ్యల్ పురకామినీ తతులు సౌధాగ్రంబులందుండి భా
స్వర సిద్ధార్థ ఫలాక్షతప్రసవ దూర్వావ్రాత దధ్యంబువుల్
కరవల్లీ మణి హేమ కంకణ ఝణత్కారంబు శోభిల్లఁ జ
ల్లిరి యా భాగవతోత్తమోత్తమునిపై లీలాప్రమేయంబుగన్.

భావము:
గోడలు, తలుపులు, గోపురాలు బంగారు పూతతో తళతళ మెరుస్తున్నాయి. పండ్లతోను పూలగుత్తులతోను నిండిన అరటి స్తంభాలు, చిన్న చిన్న పోకచెట్లు వీధికి ఇరువైపుల కనువిందు చేస్తున్నాయి. అంగళ్ళముందు పచ్చకర్పూరం, కస్తూరి, చందనం కలిపిన నీళ్ళు చల్లారు. ప్రతి ఇంటి ముంగిట్లోను నవరత్నాలతో ముగ్గులు తీర్చి దిద్దారు. పవిత్ర నదీజలాలతో నిండిన మంగళ కలశాలు నిలిపారు. బంగారు లాజలు, అక్షతలు, పూలు, పండ్లు పూజాద్రవ్యాలు సిద్ధపరిచారు. ఈ విధంగా అలంకరింపబడిన పట్టణంలోకి అలా ఉత్తానపాదుడు తన కొడుకు ధ్రువునితో ప్రవేశించి రాజమార్గం గుండా వస్తున్న సమయంలో సన్నని సింగపు నడుములు గల పురస్త్రీలు ఒయ్యారంగా మేడలపై నిలబడి, చేతులకు ధరించిన మణులు తాపిన బంగారు గాజులు ఝణఝణ ధ్వనులు చేస్తుండగా ఆ ఉత్తమోత్తముడైన భగవద్భక్తునిపై తెల్లావాలు, పండ్లూ, పూలు, అక్షతలు, దూర్వాంకురాలు, పెరుగు కలిపిన నీళ్ళను చల్లారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=317

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: