Wednesday, March 11, 2020

ధ్రువోపాఖ్యానము - 6

4-233-సీ.
"పరికింప నీ విశ్వపరిపాలనమునకై;
యర్థి గుణవ్యక్తుఁ డైనయట్టి
నారాయణుని పాదనళినముల్ సేవించి;
తగ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె;
ఘనుఁడు మీ తాత యా మనువు సర్వాంతర;
యామిత్వ మగు నేకమైన దృష్టిఁ
జేసి యాగముల యజించి తా భౌమ సు;
ఖములను దివ్యసుఖముల మోక్ష
4-233.1-తే.
సుఖములను బొందె నట్టి యచ్యుతునిఁ బరుని
వితత యోగీంద్ర నికర గవేష్యమాణ
చరణ సరసిజ యుగళు శశ్వత్ప్రకాశు
భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిని.
4-234-వ.
మఱియును.
4-235-క.
కరతల గృహీత లీలాం
బురుహ యగుచుఁ బద్మగర్భముఖ గీర్వాణుల్
పరికింపం గల లక్ష్మీ
తరుణీమణిచేత వెదకఁ దగు పరమేశున్.

భావము:
“లోకాలను రక్షించడానికి సగుణస్వరూపాన్ని గ్రహించిన నారాయణుని పాదపద్మాలను ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందాడు. నీ తాత అయిన స్వాయంభువ మనువు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించి ఇహలోక సుఖాలను, పరలోక సుఖాలను అనుభవించి పరమపదాన్ని పొందాడు. నాశం లేనివాడు, యోగీశ్వరులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు కలవాడు, ఆయన అనంత కాంతిస్వరూపుడు, భక్తవత్సలుడు, విశ్వ సంసేవ్యుడు అయిన హరిని ఆశ్రయించు. ఇంకా బ్రహ్మ మొదలైన దేవతలు వెదకినా కనిపించని లక్ష్మీదేవి లీలాకమలాన్ని చేత ధరించి ఆ హరి కోసం వెదకుతూ ఉంటుంది. అటువంటి పరమేశ్వరుని ఆశ్రయించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=233

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: