Saturday, March 28, 2020

ధ్రువోపాఖ్యానము - 19

4-272-తే.
వసుమతీతల మర్ధము వంగఁ జొచ్చె
భూరిమద దుర్నివారణ వారణేంద్ర
మెడమఁ గుడి నొరగఁగ నడు గడుగునకును
జలన మొందు నుదస్థిత కలము వోలె.
4-273-చ.
అతఁడు ననన్యదృష్టిని జరాచర దేహిశరీర ధారణా
స్థితి గల యీశునందుఁ దన జీవితమున్ ఘటియింపఁ జేసి యే
కతఁ గనఁ దన్నిరోధమునఁ గైకొని కంపము నొందె నీశ్వరుం;
డతఁడు చలింప నిజ్జగము లన్నియుఁ జంచల మయ్యె భూవరా!
4-274-క.
ఆలోకభయంకర మగు
నా లోకమహావిపద్దశాలోకనులై
యా లోకపాలు రందఱు
నా లోకశరణ్యుఁ గాన నరిగిరి భీతిన్.
4-275-వ.
అట్లరిగి నారాయణు నుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి యిట్లనిరి.

భావము:
మదపుటేనుగు కుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగడుగునా కంపించే పడవలాగా సగం భూమి వంగి క్రుంగింది. ధ్రువుడు ఏకాగ్రదృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు. తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిలలోకాలూ ప్రకంపించాయి. లోకాలకు సంభవించిన ఆ చూడటానికి భయంకరమైన మహా విపత్తును చూచి అష్ట దిక్పాలకులు మొదలైన లోకపాలు రందరూ భయంతో లోకరక్షకుడైన హరిని దర్శించడానికి వెళ్ళారు. అలా వెళ్ళి దేవతలంతా నారాయణునికి నమస్కరించి చేతులు మోడ్చి ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=274

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: