Thursday, March 5, 2020

ధ్రువోపాఖ్యానము - 1


4-216-క.
"విను నిఖిలభువన పరిపా
లనమునకై చంద్రధరకళా కలితుండై
వనజజునకు స్వాయంభువ
మను వపు డుదయించెఁ గీర్తిమంతుం డగుచున్.
4-217-తే.
రూఢి నమ్మనునకు శతరూపవలన
భూనుతు లగు ప్రియవ్రతోత్తానపాదు
లనఁగ నిద్దఱు పుత్రులై రందులోనఁ
భవ్య చారిత్రుఁ డుత్తానపాదునకును.
4-218-క.
వినుము సునీతియు సురుచియు
నను భార్యలు గలరు; వారి యందును ధ్రువునిం
గనిన సునీతియు నప్రియ
యును, సురుచియుఁ బ్రియయు నగుచు నున్నట్టి యెడన్.

భావము:
“విదురా! విను. స్వాయంభువ మనువు అనే కీర్తిమంతుడు సకల లోకాలను పాలించడానికి ఈశ్వరుని అంశతో బ్రహ్మదేవునికి జన్మించాడు. ఆ స్వాయంభువ మనువుకు శతరూప అనే భార్యవల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వారిలో ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలున్నారు. వారిలో ధ్రువుడు అనే కొడుకును కన్న సునీతిపై రాజుకు ప్రీతి లేదు. సురుచి అంటే రాజుకు మిక్కిలి మక్కువ. ఇలా ఉండగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=218

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: